-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్ (అంబర్పేట), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), లక్ష్మారెడ్డి (ఉప్పల్)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఎర్రవల్లికి తరలివస్తున్న నేతలు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతున్న నాయకులకు ఎర్రవల్లి నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వస్తున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా కేసీఆర్ను కలుస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారితో ఫోటోలు దిగుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్వస్థీకరణ, క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. -
‘తొందర పడకండి’..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : ‘తొందరపడకండి.. పార్టీ మారుతున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.ఈ తరుణంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వరసు భేటీ అవుతున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యలతో కేసీఆర్ మంతనాలు జరపగా.. ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి,బండారి లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.కాగా మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే. -
పోచారం, సంజయ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
ప్రవళిక కుటుంబానికి భరోసా ఏదీ?
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్లోని అశోక్నగర్లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.ప్రియాంక గాంధీ దూత వచ్చినా..అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.కూలీ పనులకు వెళ్తున్నా..నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రినిందమోపిండ్లు.. రుజువు చేయలే.. నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.– మర్రి విజయ, ప్రవళిక తల్లి -
‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కారు హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీíÙయల్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ కమిషన్ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. రాజకీయ కక్షతోనే ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేశారని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చినట్టు సమాచారం. అయితే ఈ పిటిషన్ ఇంకా పరిశీలన దశలోనే ఉందని.. నంబరింగ్ కావాల్సి ఉందని తెలిసింది. జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసిందని.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి పరిశీలన తర్వాత ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాల కేసీఆర్ పిటిషన్లోని అంశాలివీ.. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం.. ‘‘తెలంగాణలోని గత ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని తక్షణమే తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టింది. చట్టప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఒక్కో యూనిట్కు తమిళనాడు రూ.4.94, కర్నాటక రూ.4.33 వెచ్చించగా.. తెలంగాణ మాత్రం రూ.3.90 మాత్రమే వెచ్చించింది. ఈ విషయాలను పరిశీలించకుండా.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్తో ఎంఓయూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై కమిషన్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చట్ట వ్యతిరేకం. విద్యుత్ చట్టం–2003 ప్రకారం.. విద్యుత్ వ్యవహారాలపై సమీక్షించి నిర్ణయాలు వెలువరించేందుకు న్యాయపరమైన రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్ఈఆర్సీ) ఏర్పాటైంది. ఇది బహిరంగ విచారణలను నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకుంటుంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించేవారు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకునే న్యాయపరమైన వెసులుబాటు ఉంది. ఆ అప్పీలేట్ అథారిటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చట్ట నిబంధనలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని చట్టవ్యతిరేకంగా ప్రకటించాలి. విచారణ పూర్తి చేయకుండా మీడియాకు వివరాలు! కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే.. నిజానిజాలను పరిశీలించకుండా, అనేక విషయాలను సమగ్రంగా తెలుసుకోకుండానే విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆక్షేపణీయం, అభ్యంతరకరం. నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. 1952 కమిషన్ల విచారణ చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగించకుండా, కారణాలను నమోదు చేయకుండా నోటీసు జారీ చేశారు. అందుకే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అధిపతిగా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఏకపక్షంగా విచారణ సాగిస్తున్న కమిషన్ను కొనసాగించవద్దు. విద్యుత్ వ్యవహారాలపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరైనవో, కాదో తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చెల్లదు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, ఒప్పందాలపై వివాదాలను విచారించే పరిధి ఎస్ఈఆర్సీకి మాత్రమే ఉంటుంది. న్యాయపరమైన ఇతర మార్గాలు ఉన్నప్పుడు కమిషన్ ఏర్పాటు చేసే పరిధి, అధికారం ప్రభుత్వానికి లేదు. విద్యుత్ చట్టంలో కూడా ఆ విధమైన వెసులుబాటు లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్–1952లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కమిషన్ నియామకమే చెల్లదు. అది ప్రభుత్వాల మధ్య ఒప్పందం మార్వా ప్లాంట్ పనులు పూర్తవుతున్న దశను పరిగణనలోకి తీసుకుని 2015 సెపె్టంబర్లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ప్రస్తావించకుండా మార్వా ప్లాంట్ 2016 మార్చిలో వచ్చిందని, పవర్ ప్లాంట్ లేకుండానే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం సరికాదని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అది రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అప్రతిష్ట పాలు చేసేందుకే కమిషన్! రాష్ట్రం ఏర్పాటైనపుడు జాతీయ గ్రిడ్తో అనుసంధానమై లేదు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు మాత్రమే అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రభుత్వం విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్) అనుమతి తీసుకుంది. రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థ నియంత్రణ కోసమే ఆ సంస్థ ఏర్పాటైంది. టీఎస్ఎస్పీడీసీఎల్ ఆ సంస్థతో చర్చించి ప్రత్యేక కారిడార్ను బుక్ చేసుకుంది. ఇక భద్రాద్రి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకున్నాకే పనులు చేపట్టాం. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశాలుంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలి. కానీ గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. కమిషన్ను ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదు. అందువల్ల కమిషన్ను ఏర్పాటు చేసిన జీవోను కొట్టివేయాలి. కమిషన్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలి..’’ అని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. -
నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్రెడ్డి పాలన సాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైనందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసులో పవర్ కమిషన్ పేర్కొంది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్తో పాటు జగదీష్ రెడ్డి, మరికొంత మందికి నోటీసులు పంపింది పవర్ కమిషన్. ఇప్పటికే యాదాద్రి,భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్ననిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్ధేశించింది. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుధీర్ఘ లేఖ రాశారు.ఎలక్ట్రి సిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు సాగామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.అంతేకాదు గత ప్రభుత్వం సాధించిన విజయాల్ని తక్కువ చేసేందుకు ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివాదం కొనసాగుతుండగానే.. మంగళవారం ఉదయం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘాటించారు.సాయంత్రానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఈ నోటీసులపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. అధికార మత్తుతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి అధికారంలో ఉన్న వారి బలం కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో సోమవారం ఆయన ఈ మేరకు పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ అనేకసార్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. కాంగ్రెస్ నీతిలేనితనంపై గతంలోనూ తెలంగాణ ప్రజలు ఆందోళన చేశారని, చరిత్ర పునరావృతమవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్కు ఇలాంటి కష్ట సమయాలు కొత్త కాదని అన్నారు. బీజేపీ తలాతోకా లేని నిర్ణయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న తలాతోకా లేని నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న నీట్ యూజీ పేపర్ లీక్, 19న యూజీసీ నెట్ పరీక్ష రద్దు, 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా, 22న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వంటివి బీజేపీ అసంబద్ధ నిర్ణయాలకు తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఓ వైపు నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ జూలై 6 నుంచి కౌన్సెలింగ్కు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. మరోవైపు ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కొద్ది గంటల ముందు రద్దు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ్ధత విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని, ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ అలయెన్స్ (జాతీయ విధ్వంస కూటమి)గా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. -
ఫిరాయింపులపై సుప్రీంకు!
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న భారత్ రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. ఒకవేళ దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.కేవలం దానం నాగేందర్పైనే కాకుండా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే లు అందరిపైనా వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులోని పేరా నంబరు 30, 33 ప్రకారం హైకోర్టు తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ వాదిస్తోంది. దానంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల)కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అధినేత అప్రమత్తం: పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అప్రమత్తమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు కొందరు సీనియర్ నేతలు రెండు రోజులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాటం చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతోనూ కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇంకోవైపు కేటీఆర్, హరీశ్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిరంతరం మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా వారితో టచ్లోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు: పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన తీరు, తర్వాతి కాలంలో వారు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయిన వైనాన్ని కేసీఆర్ వారికి వివరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్సీలను కూడా పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో వారితోనూ బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో భరోసా నింపేందుకు మూడు నాలుగు రోజుల్లో ప్రత్యేక భేటీ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన మరో ఎమ్మెల్యే
రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోగల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండురోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్కుమార్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2018లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అదే జీవన్రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్.. ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కొంత దూరందూరంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరారు. అయితే సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది. -
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. -
జంపింగ్ టైమ్..!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో పలువురు కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి అధికసంఖ్యలో అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరుతారని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలవగా.. కాంగ్రెస్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. ఇద్దరి సంఖ్య ప్రస్తుతం ఇరవైకి చేరువలో ఉంది. త్వరలోనే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.వేచి చూసే ధోరణితో..బీఆర్ఎస్ నుంచే కార్పొరేటర్లుగా గెలిచిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలత, ఆమె భర్త బీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకుడు శోభన్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, కార్పొరేటర్ శ్రీదేవి, మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్లు గతంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరు పార్టీ మారినప్పుడే వారి అభిమానులు, అనుయాయులైన కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరిగినా.. కొంతకాలం వేచి చూద్దామనే ధోరణిలో వారు పార్టీ మారలేదని సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా, గ్రేటర్ పరిధిలో మాత్రం 16 మంది ఎమ్మెల్యేలుండటాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ఫలితాలను చూశాక చేరవచ్చనే యోచనలోనూ కొందరు విరామమిచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు పార్టీ మారుతారనే అంచనాతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారితో రెండుమూడు దఫాలు సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు మీరేనని, మీకే టికెట్లిస్తామని ఆశ చూపారు. అయినా ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితిని చూసి ఇక ఆపార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్లోకి వెళ్లడమే మేలనేది మెజార్టీ కార్పొరేటర్ల ఆలోచనగా ఉంది.డివిజన్లో పనులు.. భవిష్యత్ కోసం..👉 ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం.. ప్రభుత్వం నుంచి అందే నిధుల ద్వారా తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు చేయించుకోవాలంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్లో ఉండటమే మేలనే తలంపులో పలువురు కార్పొరేటర్లున్నారు. అంతేకాదు.. గ్రేటర్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం శ్రీఆపరేషన్ ఆకర్ష్శ్రీలో భాగంగా కాంగ్రెస్లో చేరే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లు సైతం హస్తం గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.👉 బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో ఆయనకు దగ్గరి కార్పొరేటర్లు పార్టీ మారే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనం రేపాయి. అదే జరిగితే బీఆర్ఎస్లోని మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తొలుత ఎమ్మెల్యేలను, తర్వాత కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.👉ఎటొచ్చీ 2026 ఫిబ్రవరిలో ఏర్పాటయ్యే కొత్త పాలకమండలి నాటికి పార్టీ బలిష్టంగా, తిరుగులేని విధంగా ఉండాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్లోనే ఉండటంతో ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయాల్లో ఆ పార్టీ కార్పొరేటర్లున్నారు. వీరు కోరుకుంటున్నదీ, కాంగ్రెస్ ఆశిస్తున్నదీ ఒకటే కావడంతో ఎక్కువమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోని వారు పార్టీ మారే పరిస్థితి లేదంటున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొందరు బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. ఎటొచ్చీ బీఆర్ఎస్లోనే ఉండేందుకు గట్టిగా నిలబడేదెవరో కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది.నాలుగు స్థానాలు ఖాళీ..జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, శాస్త్రిపురం కార్పొరేటర్ మహ్మద్ ముబిన్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్బేగం మృతి చెందడంతో వారి రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. వెరసీ.. నాలుగు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. వీటి ఉప ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. -
ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన
నాగర్కర్నూల్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదని.. రాక్షస పాలనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను శనివారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాల్రాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున ఆమెకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అక్కడి నుండే కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి బాధితురాలికి వెంటనే మహిళా వైద్యురాలి పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆడబిడ్డపై ఇలాంటి దారుణ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. తనపై దాడికి పాల్పడిన వారి పేర్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు బాధపడుతోందని చెప్పారు. బాధితురాలికి మహిళా వైద్యురాలి పర్యవేక్షణ కూడా లేదని, తూతూమంత్రంగా డ్రెస్సింగ్ చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. బాధితురాలి కుటుంబానికి వెంటనే రూ.50 లక్షల పరిహారం ప్రకటించి, ఆమె ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు పోలీస్ స్టేషన్లో కొత్త అల్లుడిలా మర్యాదలు చేస్తుండడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మంత్రి బాధితురాలిని పరామర్శించి.. ఆమె వద్ద మహిళా వైద్యులు లేరని గుర్తించకపోవడం దారుణమన్నారు. దాడిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ తరపున పోరాడతామన్నారు. జిల్లా ఆస్పత్రిలో కేవలం నలుగురు మహిళా వైద్యులుండటం ఘోరమని విమర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల మాట్లాడుతూ ఆడబిడ్డపై ఘోరమైన పాశవిక దాడి జరిగి వారం రోజులు దాటినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. -
బీఆర్ఎస్ టైటానిక్లా మునిగిపోతుంది
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) ఖాయమన్నారు. టైటానిక్షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు. -
సింగరేణిలో ఆర్థిక విధ్వంసంపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్రెడ్డి తెలిపారు.పారదర్శకంగా బొగ్గు గనుల వేలం‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు. సింగరేణికి కేసీఆర్ మరణశాసనం‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్జెన్కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.నీట్తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. కొత్త చట్టమే ఉత్తమం! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కీలకాంశాల్లో మార్పులతో.. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బావ, బావమరుదులు!
గులాబీ పార్టీలో వాళ్లిద్దరూ నోరు తిరిగిన నాయకులు. సబ్జెక్ట్ ఏదైనా, సమస్య ఏదైనా అనర్గళంగా స్పీచ్లు ఇవ్వగల సత్తా వారికుంది. అందుకే ఇప్పుడు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమట్లు పట్టిస్తున్నారు. ఒకదాని తర్వాత మరొక అంశం తీసుకుంటూ ఎక్కడి కక్కడ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరు బావా, బావమరుదులు తమకున్న నాలెడ్జ్తో కాంగ్రెస్ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ వారిద్దరూ బావ మరుదులు ఎవరో చూద్దాం.భారత రాష్ట్ర సమతి పార్టీలో మాటకారులు ఎక్కువే. సబ్జెక్ట్ ఏదైనా అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఇద్దరు నేతలకు ఉంది. సమస్య ఏదయినా, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే అంశం ఏదైనా తూటాల్లాంటి మాటలతో అదరగొట్టేస్తారు గులాబీ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్న బావ హరీష్ రావు, బావమరిది కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ విరుచుకుపడుతున్నారు ఈ ఇద్దరు నేతలు. రోజుకో సమస్యతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. దీనికి వీరిద్దరూ ఎంచుకున్న ప్లాట్ ఫాం ఎక్స్ లేదా ట్విట్టర్. ట్విట్టర్ లో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కరువవుతుంది. ఈ ఇద్దరు నేతలు ప్రజాసమస్యలపై చేస్తున్న కామెంట్స్తో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలవారి సమస్యలపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తున్నారు.కేటీఆర్, హరీష్ రావును తట్టుకోవడం అంటే చాలా కష్టం అంటున్నారు. నిత్యం ప్రెస్స్ మీట్స్, గంటకో ట్వీట్ చేస్తున్నారు. కేవలం రెండు నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చి, ఆతర్వాత ముప్పేట దాడి మొదలు పెట్టారు ఈ ఇద్దరు నేతలు. అయితే ప్రభుత్వం వైపు నుంచి అంతే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎవరూ సాహసం చేయటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరి ధాన్యం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. శాంతి భద్రతలు విషయంలో ఒక్క పోస్ట్ తో పోలీస్ యంత్రాంగం కదిలింది. కరెంట్ సమస్యపై ప్రభుత్వం చేసిన ఆరోపణలకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన అంశంపై బీ ఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ సర్కార్కు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏ చిన్న లూప్ హోల్ కనపడకుండా ఓ రేంజ్ లో వీరిద్దరూ సమాధానాలు ఇస్తున్నారు.ఏ సమస్య మీద అయినా కొంత ఆలస్యంగా స్పందించినప్పటికీ సబ్జెక్ట్, ఆధారాలతో సహా బయటికి వదులుతున్నారు. దీంతో ప్రభుత్వం సమాధానం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పటికంటే బావ మరుదులు హరీష్రావు, కేటీఆర్లు ప్రతిపక్షంలోనే సమన్వయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్కు సరైన ప్రత్యర్థులు వీరిద్దరే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమైంది..?
ఏ పార్టీకైనా సొంతగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందా? లేదా? ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్ బ్యాంక్గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గులాబి బాస్ కేసీఆర్కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యారు.మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు. అండగా నిలవాలని కోరా తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి రైతు పక్షపాతి: పోచారం సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో మరిన్ని చేరికలు?పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు, కేటీఆర్లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నంబంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.ఈ క్రమంలో బాల్క సుమన్ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్ను బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది. -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో విమర్శించారు. -
బొగ్గు గనుల వేలంను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
-
సింగరేణిని ముంచే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసేందుకే... ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాడు అంధకారంలోకి దక్షిణాదిసింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం.