-
శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలం దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ కలిగిన తిను బండారాలు తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పడేస్తున్నారు. వాటిని తిని జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా దోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంట వద్ద గల అటవీ చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సరఫరా చేసే వాహనాలు వెనక్కి పంపుతున్నారు. యాత్రికుల వాహనాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పడవేస్తున్నారు. దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ప్రసాదానికి జ్యూట్, కాగితంతో తయారు చేసిన బ్యాగ్లను వాడాలని, శ్రీశైలంలో గాజు బాటిళ్ల ప్యాకింగ్తో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదనంగా 20 మంది సిబ్బందిని నియమించి అటవీ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్ ఏరియాలో ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి మూడోసారి బుధవారం అటవీ, దేవస్థానం అధికారులు సున్నిపెంట బయోలేబరేటరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్జర్వేటర్ బి.ఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓలు విఘ్నేష్ అపావ్, సాయిబాబా, రేంజ్ అధికారి నరసింహులు, దేవస్థానం అధికారులు రామకృష్ణ అయ్యన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్పుట్సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
జీడీపీ గేట్ల పనులు 20 రోజుల్లో పూర్తి
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) గేట్ల పనులు 20 రోజుల్లో పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. జీడీపీ ఆధునీకరణ పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.57.3 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో గత ఏడాది నుంచి ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచే పనులు, గేట్ల మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. వర్షాకాలంలో వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరితే గేట్లు ఎత్తేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీడీపీ నాలుగో క్రస్ట్ గేట్ మరమ్మతులను బుధవారం ప్రారంభించారు. మిగతా ఐదు గేట్ల పనులను మరో 20 రోజుల్లో పూర్తి చేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి జీడీపీకి వరద నీరు వచ్చి చేరినా ఒక గేటు ఎత్తి హంద్రీనదికి నీటిని విడుదల చేయవచ్చునని తెలిపారు. -
కాల్వల మరమ్మతులకు అంచనాలు వేయండి
కర్నూలు సిటీ: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాగునీటి కాల్వల్లో అత్యవసరమైన పనులు చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖ ముఖ్య ఇంజినీరు(సీఈ) కబీర్బాషా ఇంజినీర్లను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో ఖరీఫ్లో సాగు నీటి కాల్వల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, ఎల్లెల్సీ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజులస్వామి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరి కొద్ది రోజుల్లోనే సాగునీటి కాల్వల పరిధిలో ఆయకట్టు సాగు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. సీఈ సూచనల మేరకు సాయంత్రానికి ఉమ్మడి జిల్లాలోని ఆయా కాలువల పరిధిలో ఆపరేషన్ ఆన్ మెయింటెనెన్స్ కోసం రూ.70 కోట్లతో ఇంజినీర్లు అంచనా వేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం సాగునీటి ప్రాజెక్టుల పనులు, కాల్వల స్థితిగతులపై సమీక్ష నిర్వహించనుండటంతో అంచనాల నివేదికతో సీఈ విజయవాడకు వెళ్లారు. ఇంజినీర్ల సమావేశంలో సీఈ కబీర్బాషా -
బీజేపీ నాయకుల బాహాబాహీ!
కర్నూలు కల్చరల్: జిల్లా భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒకరికొకరు దాడి చేసుకునే స్థాయికి చేరాయి. కర్నూలులోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని దేవీ ఫంక్షన్ హాల్లో బుధవారం కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివ నారాయణ సమావేశానికి హాజరై సమీక్ష నిర్వహించారు. అయితే ఆరోపణలు ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠకు సపోర్ట్గా జిల్లాకు ఎందుకు వచ్చావని పార్టీ సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, రంగస్వామి తదితరులు బిట్ర శివనారాయణతో వాగ్వివాదానికి దిగారు. జిల్లా అధ్యక్షునిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాదన చేస్తూ అతనిపై దాడికి యత్నించారు. అతని అన్న ఏదో చేస్తే నీలకంఠపై ఎందుకు చర్యలు తీసుకుంటారు. అయినా అదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పినా పట్టించుకోకుండా తిట్టుకుంటూ శివరానాయణ చొక్కొ పట్టుకొని దాడి చేయబోయారు. ‘‘నువ్వు కర్నూలు ఎందుకు వచ్చావు? జిల్లా పార్టీ అంతా మాదే మేము చెప్పిందే జరగాలి. మేమే ఇక్కడ అధిష్టానం’’ అంటూ శివనారాయణను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇతర నాయకులు అతనికి రక్షణగా ఉండి వాహనం ఎక్కించి పంపడంతో గొడవ సద్దుమణిగింది. -
బడి బస్సులపై ప్రత్యేక నిఘా
కర్నూలు: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. మోటర్ వాహన తనిఖీ అధికారులు మనోహర్ రెడ్డి, బాబు కిషోర్, మల్లికార్జున తదితరులు వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలులోని సుంకేసుల రోడ్డు, కోడుమూరు రోడ్డు, గుత్తి పెట్రోల్ బంకు ప్రాంతాల్లో తిష్ట వేసి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో రవాణా శాఖ అధికారులు బడి బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. మరమ్మతుల్లో ఉన్నవాటిని రోడ్డుపైకి తీసుకువస్తే వారిని కార్యాలయానికి తరలించే పనిలో ఉన్నారు. ఇంకా సుమారు 46 పైగా వాహనాలు సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. వాటికి ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. మరమ్మతుల కోసం మెకానిక్ గ్యారేజ్ వద్ద నిలుపుదల చేశామని, కొన్ని స్పేర్ పార్ట్స్ లభించకపోవడంతో ఆలస్యం జరుగుతుందని, వాటి యజమానులు, అధికారులకు వివరణ ఇచ్చారు. డ్రైవర్ లైసెన్స్ లేకుండా బడి బస్సును నడుపుతూ తనిఖీల్లో పట్టుబడగా అధికారులు కేసు నమోదు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు రెండో రోజు కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. బుధవారం దాదాపు 65 బస్సులకు పైగా తనిఖీలు చేపట్టి అవసరమైన సూచనలు చేశారు. రెండో రోజూ కొనసాగిన స్పెషల్ డ్రైవ్ డ్రైవర్కు లైసెన్స్ లేనందుకు ఓ బస్సుపై కేసు నమోదు -
మహానంది ఈఓ బదిలీకి రంగం సిద్ధం?
మహానంది: మహానంది ఆలయ కార్యనిర్వహణాధికా రి కాపు చంద్రశేఖర్రెడ్డిపై బదిలీ వేటు పడనుందని విశ్వసనీయ సమాచారం. వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ డిప్యూటీ డైరెక్టర్గా పదోన్న తి పొందిన కాపు చంద్రశేఖర్రెడ్డి 2022 ఫిబ్రవరి 12న మహానంది ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. 2021–22లో రూ.10.57 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2022–23లో రూ.16.89 కోట్లు, 2023–24 ఏడాదిలో రూ.17.50కోట్లకు చేర్చారు. ఆర్థిక సంవత్సరం నికర ఆదాయంతో పాటు హుండీ కానుకల ఆదాయాన్ని ఏడాదికి రూ.కోట్లకు పెంచడం, దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతూ ఆలయాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతున్న ఆయనను దేవదాయశాఖ ఉన్నతాధికారులు 2026 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో టీడీపీ నాయకులు ఈఓ బదిలీకి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆలయంలో విధుల పరంగా కఠినంగా వ్యవహరించడం నచ్చని కొందరు ఉద్యోగులు, అనధికారిక వసూళ్లను పూర్తిగా రూపుమాపడం మింగుడు పడని టీడీపీ మండల స్థాయి నాయకులు కలిసి ఈఓ బదిలీకి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ద్వారా దేవదాయశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. కాగా ఈఓ పనితీరుపై ఎమ్మెల్యే సైతం సదభిప్రాయంతోనే ఉన్నా టీడీపీకే చెందిన ఓ కీలక నేత, మరికొందరు గ్రామస్థాయి నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కోటప్పకొండ ఈఓ శ్రీనివాసరెడ్డి, అదే పేరుతో ఉన్న మరో కార్యనిర్వహణాధికారిని మహానంది ఈఓగా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
పెద్దాసుపత్రిలో సీసీ కెమెరాలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 64 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మొత్తం ఆసుపత్రిలో 140 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది రాకపోకలు, వారి విధులతో పాటు సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలను సైతం ఈ కెమెరాల ద్వారా పరిష్కరించనున్నారు. ఈ కెమెరాలకు సంబంధించిన మానిటర్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చాంబర్తో పాటు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ, డీఎంఈ చాంబర్లలో చూసుకునే అవకాశం కల్పించారు.ఆసుపత్రిని మరింత గాడిలో పెట్టేందుకు, సమస్యలు తెలుసుకునేందుకు, నేరాలు, చోరీలు నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. పార్ట్ టైం టీచర్ల భర్తీకి నేడు డెమో కర్నూలు(అర్బన్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి సంబంధించి ఈ నెల 20వ తేదిన డెమో నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన (టెట్, బీఎడ్, పీజీ/ సంబంధిత మెథడాలజీ ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. డీసీఓ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఉదయం 8 గంటల నుంచి డెమో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 8 మండలాల్లో వర్షం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఎనిమిది మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఓర్వకల్లులో 38.2, కర్నూలు రూరల్లో 20.2, కర్నూలు అర్బన్లో 14.6, కౌతాళంలో 14.4, కల్లూరులో 10.8 ఎమ్మిగనూరులో 7.8, కోసిగిలో 5.2, ఆదోనిలో 1.2 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా...ఇప్పటి వరకు 135.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాధారణ సాగు 4,19 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 30,197 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పత్తి 24,816, వేరుశనగ 2,798, ఆముదం 448, ఉల్లి 342, మిరప 192, కొర్ర 118, మొక్కజొన్న 140 హెక్టార్లలో సాగు చేశారు. రేపు యోగా దినోత్సవం కర్నూలు(హాస్పిటల్): నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా ఆయుష్శాఖ అధికారి డాక్టర్ టి. చంద్రశేఖర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యువజన, క్రీడాప్రాధికారిక సంస్థ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, యోగాగురువులు, సాధకులు పాల్గొంటారని పేర్కొన్నారు. శ్రీశైలానికి 1,348 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి సుంకేసుల ప్రాజెక్ట్ నుంచి 1,348 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జలాశయం నుంచి తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 36.6090 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 813.80 అడుగులకు చేరుకుంది. 24 నుంచి డీఎడ్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కర్నూలు సిటీ: ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాల మేరకు డీఎడ్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.శామ్యూల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు జిల్లాలో గుర్తింపు పొందిన కేంద్రాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. -
కార్యాలయాల తరలింపు శోచనీయం
నంద్యాల(సెంట్రల్): రాయలసీమ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా గత ప్రభుత్వం పలు రాష్ట్రస్థాయి కార్యాలయాలను కర్నూలులో నెలకొల్పిందని, నూతన ప్రభుత్వం వాటిని మరోచోటుకు తరలిస్తుందన్న వార్తలు బయటకు రావటం శోచనీయమని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీమ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, లోకేష్ పలు సభల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటం పక్కన పెట్టి ఉన్న అరకొర కార్యాలయాలను సైతం తరలించాలనుకోవటం భావ్యం కాదన్నారు. ఏడుగురు సీఐలకు స్థానచలనం కర్నూలు: పోలీసు శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఏడుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్లో పనిచేస్తున్న ఇ.కంబగిరి రాముడిని కర్నూలు సీసీఎస్కు, ఆదోని వన్టౌన్లో పనిచేస్తున్న ఎస్.తేజామూర్తిని చిన్న చౌక్కు, అక్కడున్న పి.నరసింహారెడ్డిని వీఆర్ కర్నూలు రేంజ్కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంబగిరి రాముడు గతంలో కర్నూలు అర్బన్ తాలూ కా పోలీస్స్టేషన్ పనిచేశారు. అలాగే వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో పనిచేస్తున్న పి.రామాంజులు, కడప వన్టౌన్లో పనిచేస్తున్న భాస్కర్రెడ్డిని వీఆర్కు పంపారు. కర్నూలు ఎస్హెచ్ఆర్సీలో పనిచేస్తున్న బి.రామకృష్ణను కడప వన్టౌన్కు, ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్లో పనిచేస్తున్న కె.రమణారెడ్డిని ఖాజీపేటకు బదిలీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు రేంజ్ పరిధిలో విడతల వారీగా 11 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. -
‘సికిల్సెల్’ నిర్మూలనే లక్ష్యం
● డీఎంహెచ్ఓ డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ కర్నూలు(హాస్పిటల్): సికిల్సెల్ అనీమియాను 2047 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అలాగే వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ తెలిపారు. జాతీయ సికిల్సెల్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆయన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికిల్సెల్ అనీమియా అనేది అంటువ్యాధి కాదని, వంశపారంపర్యంగా మాత్రమే వస్తుందన్నారు. కొన్ని ఎర్రరక్తకణాలు సికిల్స్, చంద్రవంక ఆకారంలో ఉంటాయని, దీనివల్ల రక్తం గట్టిగా, జిగటగా మారి రక్తప్రవాహం నెమ్మదిస్తుందని చెప్పారు. బాధితుల్లో రక్తహీనత, కళ్లు పసుపు రంగులో మారడం, తీవ్రమైన కీళ్లనొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, గర్భదారణ సమయంలో సమస్యల వంటి లక్షణాలు ఉంటాయన్నారు. వ్యాధి ఉన్న వారు తరచూ వైద్యులను సంప్రదించాలని, నీటిని బాగా తాగాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. ఈ విషయాలపై సీహెచ్వోలు, ఏఎన్ఎంలు సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే పీఓ హేమలత, డీపీఎంవో డాక్టర్ సంధ్య, ఎస్ఓ హేమసుందరం, డీపీహెచ్ఎన్ఓ ఇందిర, హెచ్ఈఈఓ శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్రెడ్డి, డిస్ట్రిక్ట్ ఎపడమాలజిస్టు వేణుగోపాల్, హెచ్ఈ పద్మావతి, ఎంపీహెచ్ఈఓ చలపతి పాల్గొన్నారు. -
నాణ్యతలేని టమాట పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో టమాట ధర పెరిగిపోతుండటంతో ప్రభుత్వం నో లాస్.. నో ప్రాఫిట్ కింద పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే నాణ్యత లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. బుధవారం కర్నూలు నగరంలోని మూడు రైతుబజార్లలో టమాట పంపిణీ ప్రారంబించారు. మదనపల్లిలో రైతుల నుంచి రెండు టన్నులు కొనుగోలు చేసి కర్నూలుకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు ధర, రవాణా చార్జీలు, హమాల, ఇతర ఖర్చులు కలిపి నో లాస్–నో ప్రాఫిట్ కింద పంపిణీకి శ్రీకారం చుట్టారు. రైతుబజారులో కిలో ధర రూ.74 ఉండగా...బయట రూ.100 వరకు అమ్ముతున్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రూ.62 ప్రకారం విక్రయించారు. మదనపల్లిలో టమాట కొనుగోలు ధరను బట్టి రైతుబజార్లలో ధరలో మార్పులు ఉంటాయని మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు. నో లాస్– నో ప్రాఫిట్ కింద పంపిణీ చేస్తున్న టమటాల్లో నాణ్యత లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తి చూపలేదు. గత ఏడాది ఇదే సమయంలో టమాట కిలో ధర రూ.150 వరకు వెళ్లింది. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మదనపల్లిలో రైతుల నుంచి టమాట కొనుగోలు చేసి కర్నూలులోని మూడు రైతుబజార్లు, ఆదోని రైతుబజారులో నాణ్యమైన టమాటను కిలో రూ.50కే పంపిణీ చేసింది. కిలోపై రూ.50 నుంచి రూ.100 వరకు నాటి ప్రభుత్వం సబ్సిడీ భరించింది. నాడు టమాట ధర మండతున్న వేళ ప్రభుత్వం రూ.50 ప్రకారం పంపిణీ చేయడం ఎంతో ఊరట నిచ్చింది. ఇటీవలే ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం నో లాస్, నో ఫ్రాఫిట్ కింద మార్కెట్ ధరకు సమానంగా పంపిణీ చేస్తుండటం వినియోగదారులకు అసంతృప్తి కలిగిస్తోంది. నో లాస్.. నో ప్రాఫిట్ కింద అమ్ముతున్న ప్రభుత్వం ఆసక్తి చూపని వినియోగదారులు గతంలో కిలోకు రూ.50 నుంచి 100 వరకు సబ్సిడీ భరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం -
తెరచుకున్న హాస్టల్ తలుపులు
జూపాడుబంగ్లా: ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 18న ‘తెరచుకోని మోడల్ హాస్టల్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ స్పందించారు. మోడల్ పాఠశాల హాస్టల్ తలుపులు తెరిపించి బుధవారం హాస్టల్ గదులను శుభ్రం చేయించారు. హాస్టల్ను ప్రారంభించటంతో 15మంది విద్యార్థినులు చేరినట్లు వార్డెన్ తెలిపారు. హాస్టల్లో చేరిన విద్యార్థినులకు వంటలు వండిపెట్టేందుకు అవసరమైన కూరగాయలు, వంట సరుకులు రాలేదని ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. హాస్టల్కు వచ్చిన విద్యార్థినులు ఉపవాసం ఉండకుండా అవసరమైన సరుకులను అంగట్లో కొనుగోలు చేసి వంటలు వండిపెట్టాలని వార్డెన్, కుక్కర్లకు సూచించినట్లు తెలిపారు. మొత్తం 80మంది విద్యార్థినులు హాస్టల్లో ఉండే అవకాశం ఉన్నందున జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని వంట సరుకులు మంజూరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
No Headline
● రబీలో పంటలన్నీ ఎండిపోయాయి ● పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం ● పాడి పశువులకు కూడా మేత దొరకలేదు ● గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎక్కువ పరిహారమందించి ఆదుకోవాలి ● కేంద్ర కరువు బృంద సభ్యులకు విన్నవించిన రైతులు ● కలెక్టరేట్, ఆలూరు, కోడుమూరులో ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించిన సెంట్రల్ టీమ్ ● నివేదిక ఇచ్చిన జేసీ నారపురెడ్డి మౌర్య కర్నూలు(అగ్రికల్చర్): ‘‘రబీ సీజన్లో వానల్లేవ్.. శనగ, జొన్న, మొక్కజొన్న పంటలు వేస్తే.. ఒక్కటీ బతకలేదు.. ఎకరాకు 50 కిలోల విత్తనం వేస్తే 50 కిలోల దిగుబడి కూడా రాలేదు.. పెట్టుబడి మట్టిపాలైంది.. పాడి పశువులకు కూడా మేత దొరకని దుస్థితి నెలకొంది’’ అంటూ కేంద్ర కరువు బృంద సభ్యులకు రైతులు వివరించారు. గత ప్రభుత్వం ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు ఎక్కువ పరిహారమందించి ఆదుకుందని, రబీలో నష్టపోయిన పంటలకు కూడా అదే మాదిరిగానే ఎక్కువ పరిహారమందించి ఆదుకోవాలని విన్నవించారు. రబీలో కరువు పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చిన కేంద్రబృంద సభ్యులు అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకొని బుధవారం సాయంత్రం 4.40 గంటలకు ఆలూరుకు చేరుకున్నారు. స్థానిక రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను డిపార్టుమెంటు ఆఫ్ ఎక్స్పెండేచర్ డైరెక్టర్ చిన్మయ పుండ్లిక్ రావు గాట్మేర్, తాగునీరు, పారిశుధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ అసిస్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్కుమార్ సోని పరిశీలించారు. ఎండిపోయిన పంటల చిత్రాలను చూసి చలించిపోయారు. శనగ, జొన్న తదితర పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. నీటిపారుదల సదుపాయం లేకపోవడంతోనే కరువు ఏర్పడుతోందని, నగరడోణ రిజర్వాయర్, వేదావతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరారు. వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు వివరించారు. ఖరీఫ్, రబీ పంటలకు సత్వరం పంటల బీమా పరిహారం విడుదల చేయాలని కోరారు. శనగ పంటకు హెక్టారుకు ఇన్పుట్ సబ్సిడీ రూ.10 వేలు మాత్రమే ఉందని, దానిని రూ.25వేలకు పెంచాలని విన్నవించారు. రైతు సంఘం నేతలు రామకృష్ణ, నారాయణరెడ్డి, బి.కిశోర్ తదితరులు ఆలూరు ప్రాంతంలో ఏర్పడిన కరువు, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కేంద్ర బృంద సభ్యుల వెంట జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి రామాంజనేయులు, పట్టుపరిశ్రమ శాఖ ఏడీ విజయకుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ షర్మిల, వెల్దుర్తి ఏవో అక్బర్బాషా, ఉద్యాన అధికారి మధన్మోహన్గౌడు ఉన్నారు. కోడుమూరులో.. కోడుమూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కేంద్ర కరువు బృంద సభ్యులు పరిశీలించారు. కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కర్నూలు రూరల్, కల్లూరు మండలాల్లో పంటల పరిస్థితులపై ఆరా తీశారు. కరువు రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. పెట్టిన పెట్టుబడులు మట్టి పాలు కావడంతో అప్పుల ఊబీలో కూరుకపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మద్దతు ధరలు కూడా తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల సాగుకు పెట్టుబడుల సమస్య ఉందని సత్వరం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలని కోరారు. 90 శాతం సబ్సిడీపై ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ పంపిణీ చేయాలని కోరారు. శనగ పంటకు కనీసం రెండు నీటి తడులు ఇచ్చే విధంగా కోడుమూరు ప్రాంతంలో మినీ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించాలని విన్నవించారు. వంద శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష కోడుమూరు పర్యటన ముగిసిన తర్వాత కేంద్ర బృంద సభ్యులు నేరుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్లో రబీ కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. జిల్లాలో నెలకొన్న కరువు తీవ్రతను జిల్లా కలెక్టర్ సృజన తరఫున జేసీ నారపురెడ్డి మౌర్య వివరించారు. అనంతరం కరువు పరిస్థితిపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో చర్చించారు. శాఖల వారీగా వాటిల్లిన నష్టాన్ని తెలుసుకున్నారు. కరువు జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతూ జేసీ మెమోరాండం సమర్పించారు. కేంద్ర కరువు బృంద సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని 26 మండలాల్లో 18 మండలాలను కరువుగా ప్రకటించారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చన్నారు. శనగ, జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా కేంద్రానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, సీపీఓ హిమప్రభాకర్రాజు, ఏడీఏలు సాలురెడ్డి, సునీత, పశుసంవర్ధకశాఖ జేడీ జి.శ్రీనివాస్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రూ.58.28 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి జిల్లాలో 3.95 లక్షల మంది సన్న, చిన్న, మధ్య కారు రైతులు ఉన్నారని, వారంతా వర్షాధారంపై ఆధారపడే పంటలు వేస్తారని కేంద్ర కరువు బృంద సభ్యులకు జేసీ నారపురెడ్డి మౌర్య వివరించారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో తక్కువ శాతం వర్షపాతం నమోదైందన్నారు. దీంతో రబీలో 18 మండలాలను కరువుగా ప్రకటించినట్లు చెప్పారు. ఆలూరు ప్రాంతంలో ఎక్కువ శాతం శనగ పంటను ప్రధాన పంటగా వేస్తారని, వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. కరువు నెలకొనడంతో ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.58.28 కోట్లు విడుదల చేయాలని కోరారు. -
ప్రహరీలేని సైకియాట్రీ విభాగం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం(సైకియాట్రీ)కు ప్రహరీగోడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విభాగంలో నిత్యం 15 నుంచి 20 మంది దాకా మానసిక చికిత్సను అందుకునే రోగులు ఉంటారు. వీరిలో చాలా మందికి ఆలోచనలు, మనసు ఆధీనంలో ఉండదు. కొన్నిసార్లు ఉన్నఫలంగా బయటకు వెళ్లిపోతుంటారు. ఇలా వీరు బయటకు వెళ్లకుండా తలుపు వద్ద నిత్యం ఒక సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటారు. కానీ ఎప్పుడైనా సెక్యూరిటీ లేని సమయంలో రోగులు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు మానసిక రోగులు నిత్యం వార్డులోనే ఉండటంతో మరింత మానసికంగా కుంగిపోతున్నారు. ప్రహరీగోడ ఏర్పాటు చేస్తే బయట కాసేపు సేదతీరే అవకాశం ఉంది. దీనికితోడు ప్రహరీగోడ లేకపోవడంతో చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీనివల్ల నిత్యం ఈ ప్రాంతంలో పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయి. -
మందుబాబుకు జైలు శిక్ష
నంద్యాల(వ్యవసాయం): మద్యం తాగి వాహ నం నడిపిన వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి గారి రాంభూపాల్రెడ్డి జైలు శిక్ష ఖరా రు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు బుధవారం తెలిపారు. గోస్పాడుకు చెందిన ఆలకొండ రాజేష్ మద్యం తాగి జిల్లా కేంద్రంలోని కోవెలకుంట్ల జంక్షన్ వద్ద మోటార్సైకిల్ను నడుపు తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు లో హాజరుపరచగా జడ్జి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. పిడుగుపాటుతో ఇద్దరికి తీవ్రగాయాలు ఆత్మకూరురూరల్: పిడుగుపాటుతో ఇద్దరు గొర్రెల కాపర్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు.. ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామానికి చెందిన సాలన్న, రమణయ్యలు మంగళవారం గ్రామ సమీపంలో తమ గొర్రెలను మేపుతుండగా సన్నగా వర్షం పడుతుండడంతో ఇంటికి బయలు దేరారు. అంతలోనే పెద్దగా ఉరిమి వారికి సమీపంలోనే పిడుగు పడింది. ఆ ప్రభావంతో వారు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయారు. కొద్ది సేపటికి మెలకువలోకి వచ్చిన వారు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యం చికిత్సలనంతరం వారు కోలుకుంటున్నారు. నంద్యాలలో చోరీ బొమ్మలసత్రం: నంద్యాల విశ్వనగర్కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపిన వివరాలు.. విశ్వనగర్ కాలనీకి చెందిన నాగేంద్ర టెక్కె సమీపంలో చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. బుధవారం ఉదయం కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి రాగా తలుపులు తెరచి ఉండడాన్ని గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. బీరువాలో దాచి ఉంచిన రూ.2.5 లక్షల నగదు, 8.5 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించాడు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా మాట్లాడటం తగదు కోవెలకుంట్ల: ఉన్నతమైన హోదాలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చులకనగా, అసభ్యకరంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలే తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చబిళ్లలు పట్టుకుని వచ్చిన వారికి మాత్రమే రాచమర్యాదలు చేసి పనులు చేసిపెట్టాలని చెప్పడం బాధకరమైన విషయమన్నారు. తమ సమస్యలు పరిష్కరానికి సాధారణ ప్రజలు వెళితే సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం లేదనే సంకేతాలు పంపేలా మాట్లాడటం విచారకరమన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బొమ్మలసత్రం: పట్టణానికి చెందిన బోయపాటి రామకృష్ణ(35) స్థానిక కో ఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపిన వివరాలు.. నూనెపల్లెకు చెందిన రామకృష్ణ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 15న రామకృష్ణ తనతోపాటు పని చేస్తున్న నారాయణతో గ్యాస్ సిలిండర్ విషయంలో గొడవ పడ్డాడు. ఈక్రమంలో రామకృష్ణ దాడి చేయడంతో నారాయణకు గాయమైంది. మరుసటి రోజు ఆదివారం నుంచి రామకృష్ణ కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం కమ్యూనిటీ హాల్లోని మ్యాన్ హోల్ నుంచి దుర్వాసన వస్తుండంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్ మూతను తెరిచి చూడగా మృతదేహం లభ్యమైంది. బయటికి తీసి రామకృష్ణ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అనుమానితుడు నారాయను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యాత్రికుల వసతి కేంద్రం ప్రారంభం
మంత్రాలయం: కర్ణాటకలోని నంజనగూడులో నూతనంగా నిర్మించిన రాఘవేంద్ర స్వామి మఠాన్ని, యాంత్రికుల వసతి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుబుదేంధ్ర తీర్థులు, సోదే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్భ తీర్థులు చేతుల మీదుగా వసతి కేంద్రాన్ని ప్రారంభించారు. మధ్వ మతం మూలసంస్థానం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నేతృత్వంలో మృతిక బృందావన మఠాలు, వసతి నిలయాలు నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి పేర్కొన్నారు. భక్తుల సహాకారంతో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాన్ని అద్భుతంగా తీర్చిద్దుతున్నామన్నారు. భక్తులకు వసతులతో పాటు ఆలయాన్ని సుందరీకణ చేస్తున్నామన్నారు. -
రెండో రోజు 472 ట్యాంకుల శుభ్రం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మజరా గ్రామాల్లోని ప్రజలకు సురక్షిత మైన నీటిని అందించేందుకు ట్యాంకులను శుభ్రం చేసేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి టీ నాగరాజునాయుడు చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్లను శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఎంపీడీఓ, డీఎల్పీఓ, ఈఓఆర్డీలు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని, రెండో రోజైన బుధవారం 79 ఓహెచ్ఎస్ఆర్, 53 జీఎల్ఎస్ఆర్, 240 సిస్టర్న్లను ( మొత్తం 472 ) శుభ్రం చేసినట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. -
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
కర్నూలు: కర్నూలు నరసింహారెడ్డి నగర్లో నివాసముంటున్న సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు ఆకాశ్ రెడ్డి (21) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సూర్యప్రకాష్ రెడ్డి ట్రావెల్స్ నిర్వహణతో పాటు న్యాయవాద వృత్తి చేస్తున్నాడు. కుమారుడు ఆకాష్రెడ్డి పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పక్క ఇంటి మిద్దైపెన గాయాలతో పడి ఉండగా కుటుంబ సభ్యు లు కనుగొని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కుమారునికి మతిస్థిమితం సరిగా లేదని, ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి పక్కింటి మిద్దైపె పడి ఉండవచ్చునని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. -
అభ్యర్థులు తుది ఖర్చుల వివరాలు తెలపాలి
కర్నూలు(సెంట్రల్): ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ తుది ఖర్చుల వివరాలను తెలపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పార్టీల ప్రతినిధులు, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులతో డీఆర్వో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు తుది లెక్కలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలన్నారు. ఈ నెల 28వ తేదీన వ్యయ పరిశీలకులు వస్తున్నారని, 25వతేదీలోపు అన్ని రకాల ఖర్చుల తుది లెక్కలను తెలపాలని సూచించారు. జిల్లా వ్యయం నోడల్ ఆఫీసర్లు రమేష్బాబు, రామాంజనేయులు మాట్లాడుతూ.. పోటీ చేసిన అభ్యర్థులందరూ నోటిఫికేషన్ విడుదలైనప్పుటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చుల వివరాలను ఇవ్వాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, జెండాలు, ఇతరాత్ర అవసరాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను వివరంగా అసిస్టెంట్ వ్యయ పరిశీలకులకు సమర్పించాలన్నారు. ప్రతీ రసీదులో అభ్యర్థులు సంతకం కచ్చితంగా ఉండాలన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన పెయిడ్ న్యూస్ను రేట్ కార్డు ప్రకారం చేసిన ఖర్చును వ్యయం పద్దు కింద చూపించనున్నట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్రావు -
తెగుళ్ల నివారిణులు..జీవ మందులు
● జిల్లా వ్యాప్తంగా 50 టన్నుల ట్రైకోడెర్మావిరిడి, 5 టన్నుల సూడోమోనాస్ పంపిణీ లక్ష్యం ● కిలో విరిడి రూ.100, సూడోమోనాస్ రూ.150గా ధర నిర్ణయం ● తక్కువ ఖర్చుతో పంటలకు మేలు చేసే సంజీవనులు ● నంద్యాల జీవ నియంత్రణ ప్రయోగశాలలో విక్రయానికి సిద్ధం తక్కువ ధరకు అందుబాటులో.. నంద్యాల జీవ నియంత్రణ ప్రయోగశాలలో జీవ మందుల్ని తక్కువ ధరకు అందుబాటులో ఉంచారు. ట్రైకోడెర్మావిరిడి కిలో రూ.100, సూడోమోనస్ ఫోరోసెన్స్ కిలో రూ.150, ట్రైకోగమ్మా కార్డు రూ.40 నామమాత్రపు ధరలతో పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 50 టన్నుల విరిడి, 5 టన్నుల సూడోమోనస్ను పొలంబడి, ఎన్ఎఫ్ఎస్ఎం, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోనే మొదటగా 1993లో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. గత ఐదేళ్లలో ఈ విభాగానికి ప్రభుత్వ సహకారం బాగుండటంతో రైతన్నలకు చక్కని సేవలందాయి. నంద్యాల(సెంట్రల్): పంటలను ఆశించే తెగుళ్లను తక్కువ ఖర్చుతో నియంత్రించేందుకు నంద్యాల జీవ నియంత్రణ ప్రయోగశాల కృషి చేస్తోంది. ఇక్కడ తయారు చేసిన ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ను రైతులకు తక్కువ ధరకే విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా వరి, మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాతో పాటు ఉద్యాన పంటలైన మిరప, పసుపు, కూరగాయలు సాగు చేస్తారు. వీటికి వేరుకుళ్లు, కాండం కుళ్లు, ఆకుముడత, ఎండుతెగులు, మాగుడు తెగులు, ఆకుమచ్చ, పొడతెగుళ్లు అధికంగా కనిపిస్తాయి. తెగుళ్ల నివారణలో జీవ మందులైన ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ ఫోరోసెన్స్, లింగాకర్షక బుట్టలు, ట్రైకోగామా బదనికలు తదితర పద్ధతులు ప్రభావవంతమైన ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా తెగులు వ్యాపించిన తర్వాత నివారణకు ఉపక్రమించే కన్నా విత్తు దశలోనే వీటిని కట్టడి చేయవచ్చు. దీని కోసం జీవ మందులతో విత్తన శుద్ధి చేయాలి. ట్రైకోడెర్మావిరిడి ట్రైకోడెర్మావిరిడి రైతులకు మేలు చేసే ఓ రకం శిలీంధ్రం. పలు పైర్ల పెరుగుదలకు సహకరించటంతో పాటు హానికారక శిలీంధ్రాల్ని అదుపు చేయటంలో సహాయపడుతుంది. వేర్లకు కవచంలా ఉండి రోగనిరోధక శక్తినివ్వటంతో పాటు నులిపురుగుల బెడదను నివారించి నాణ్యమైన దిగుబడుల్ని అందించటంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. వాడే విధానం కిలో విత్తనానికి 8–10 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడిని కలిపి వెంటనే విత్తుకోవచ్చు. భూమిలో చల్లాలంటే ఎకరాకు 90 కిలోల మాగిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 4 కిలోల విరిడిని మిశ్రమం చేయాలి. దీన్ని చెట్ల నీడలో కాని, పశువుల పాకలో కుప్పగా వేసి పైన కిలో బెల్లం కలిపిన నీటిని చిలకరించి గోనెసంచితో కప్పి ఉంచాలి. వారం రోజుల తర్వాత తీస్తే పసుపు, తెలుపు రంగులో ట్రైకోడెర్మావిరిడి బూజు రూపంలో కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని పొలంలో చల్లి కలియదున్నాలి. దీనివల్ల శిలీంధ్ర కారక తెగుళ్లయిన వేరుకుళ్లు, దుంప తెగులు, మొదలుకుళ్లు తదితర రుగ్మతల్ని ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చు. సూడోమోనాస్ఫ్లోరోసెన్స్ ఇది బ్యాక్టీరియా తరగతికి చెందినది. ఇది వరి పంటను ఆశించే ఆకుమచ్చ తెగులు, పొడ తెగులు, మిరపలో మాగుడు తెగులు, అరటిలో పనామా తెగులు, నువ్వు పంటలో వేరుకుళ్లు, వేరుశనగలో ఆకుమచ్చ తెగులు, చెరకులో ఎర్రకుళ్లును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీనిలోని శక్తివంతమైన బ్యాక్టీరియా వేరు, ఆకుల నుంచి మొక్క కణ వ్యవస్థ ద్వారా ప్రవేశించి పైరులో వ్యాధినిరోధక శక్తిని పెంచి పంట పెరుగుదలకు సహాయపడుతుంది. వాడే విధానం విత్తనశుద్ధి కోసమైతే కిలో విత్తనానికి 8–10 గ్రాముల పొడిని కలిపి విత్తుకోవాలి. భూమిలో వేయటానికి ఎకరాకు 3 కేజీల పొడి, 90 కిలోల మాగిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి కలిపి నీడలో ఉంచి తరచుగా నీటిని చిలకరిస్తూ ఉండాలి. వారం తర్వాత తీసి తేమ ఉన్న పొలంలో వెదజల్లాలి. పిచికారీ కోసం ఎకరాకు 1–2 కేజీలు పొడి 150–200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. జాగ్రత్తలు ● రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వీటిని వాడకూడదు. ● ఎండ, వేడి తగలని ప్రదేశాల్లో నిల్వ చేయాలి ● సూడోమోనాస్ వాడినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం జీవ మందుల వాడకంపై అన్నదాతలకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బందితో కలిసి విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ఈ పద్ధతుల వల్ల పలు తెగుళ్ల నివారణకు అయ్యే అధిక వ్యయాన్ని నివారించటంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది. జీవమందుల్ని ప్రయోగశాలలో నిరంతరం ఉత్పత్తి చేస్తున్నాం. గతేడాది 60 టన్నుల విరిడి, 12 టన్నుల సూడోమోనస్ను పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా పంపిణీ చేశాం. ఈ ఏడాది 50 టన్నుల విరిడి, 5 టన్నుల సూడోమోనస్ పంపిణీ లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రయోగశాలలో ఇప్పుడు పంపిణీకి సిద్ధంగా ఉంచాం. ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి సైతం వచ్చి ఇక్కడి ఉత్పత్తులను తీసుకెళ్తున్నారు. మిరప, శనగ, పసుపు, అరటి, పండ్లతోటలు సాగు చేసే రైతులు ప్రయోగశాలకు ఎక్కువగా కొనుగోలు కోసం వస్తుంటారు. వీటిని ఉత్పత్తి చేసిన 6 మాసాల్లోపు వాడుకోవటం ఉత్తమం. – ఎన్.సుధాకర్, సహాయ సంచాలకులు, జీవ నియంత్రణ ప్రయోగశాల, నంద్యాల -
మళ్లీ సెంచరీ కొట్టిన టమాటా
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు. వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది. గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది. -
ఆటో బోల్తా..బాలిక దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం చెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆవులను తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. గోనెగండ్లకు చెందిన రహంతుల్లా, నీసీమా దంపతులకు ముగ్గురు సంతానం. రహంతుల్లా కర్నూలులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బక్రీద్ పండుగ కావటంతో కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం గోనెగండ్లకు వచ్చారు. పండుగను సంతోషంగా నిర్వహించుకున్నారు. తన సోదరి భానును చూసేందుకని ఉదయం భార్య, పిల్లలతో కలిసి ఎమ్మిగనూరుకు వచ్చారు. భానుతో రహంతుల్లా పిల్లలు కాసేపు సంతోషంగా గడిపారు. ఈక్రమంలో రహంతుల్లా పెద్ద కూతురు ఆల్ఫీషా(12)ను తీసుకుని భాను మోర్ సూపర్ మార్కెట్కు వెళ్లింది. అక్కడ పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఎద్దుల మార్కెట్ వద్ద రోడ్డుకు ఆవులు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆల్ఫీషా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మరొకరికి గాయాలు -
తెలుగు మీడియం కొనసాగించాలి
గడివేముల: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కొనసాగించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, కార్యదర్శులు మానపాటి రవి, ఆవుల మునిస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం గడివేములలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవలేక, తెలుగు మీడియం లేక చదువు మానుకునే పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలుగు మీడియాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనాన్ని రద్దు చేసి, ప్రాథమిక విద్యను కాపాడాలని కోరారు. తల్లికి వందనం పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మాత్రమే అమలు చేయాలని, పాఠశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని, 28 వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిరుద్యోగ ఉపాధ్యాయులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తొలగించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులను, బదిలీలను చేపట్టాలన్నారు. సమావేశంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతాపరెడ్డి, బాలస్వామి, రాష్ట్ర కౌన్సిలర్లు నాగన్న, మహబూబ్ బాషా, బాల వెంకటేశ్వర్లు, రాంపుల్లారెడ్డి, చంద్రశేఖర ఆచారి, నాగయ్య, మల్లికార్జునయ్య, శ్రీరాములు, జిల్లా మహిళాప్రతినిధి కవిత తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు -
ప్రారంభ దశలో నోటి క్యాన్సర్ను గుర్తించాలి
కర్నూలు(హాస్పిటల్): ప్రారంభ దశలో నోటి క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారిణి హేమలత చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నోటి క్యాన్సర్ను ముందుగానే గుర్తించకపోతే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాంతకం అవుతుందన్నారు. శిక్షకురాలు డాక్టర్ మంజూషా మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా (హెచ్పీవీ) వైరస్ కారణంగా వస్తుందన్నారు. వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారుతుందని చెప్పారు. 9 నుంచి 14 ఏళ్ల వయస్సులో హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తే ఈ క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలు లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వివాహమైన మహిళలు ఏటా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలని, క్యాన్సర్ను ప్రాథమికంగా గుర్తించగలిగితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కౌమారదశ బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల 70 నుంచి 80 శాతం వరకు గర్భాశయ ముఖద్వారం ద్వారా క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చన్నారు. డాక్టర్లు సాహిత్య జయరామ్, రజిత, తులసిబాయి, నాగరాజు, ప్రొజెక్షనిస్టు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.