-
ధాన్యం డబ్బు చెల్లించండి
అమలాపురం రూరల్: ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యం డబ్బు వెంటనే చెల్లించాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. ధాన్యం డబ్బు రాకపోవడంతో ఖరీఫ్ పంటకు పెట్టుబడులు పెట్టలేక, పాత అప్పులు తీర్చలేక, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు వినతిపత్రం ఇస్తే సొమ్ము వస్తుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ జమ కాలేదని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లోగా తమ ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేయకపోతే ఖరీఫ్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని తెలిపారు. తొలకరి పంటకు పెట్టుబడి పెట్టే స్తోమత తమకు లేదని, ఎక్కడా అప్పు పుట్టడం లేదని, ఉన్న బంగారం వస్తువులు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయని వివరించారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు వాసంశెట్టి రామచంద్రరావు, బొక్కా ఏడుకొండలు, బైరిశెట్టి సుబ్రహ్మణ్యం, కుడుపూడి సూర్యప్రకాశ్, బి.నరసింహరావు, అప్పారి గోపాలరావు, నాయుడు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖ తల్లి లాంటిది
– కలెక్టర్ హిమాన్షు శుక్లా అమలాపురం రూరల్: ప్రభుత్వ శాఖలకు రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, పేదవాడికి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాల పంపిణీ, సామాన్యుడి జననం నుంచి మరణం వరకు కావలసిన ధ్రువవపత్రాలు మంజూరు చేస్తుందని అన్నారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ దినోత్సవం సిబ్బంది, రైతులతో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 16వ శతాబ్దంలో బ్రిటిష్ హయాంలో భూమిశిస్తును రెవెన్యూ ఉద్యోగులు సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండి ఇతర శాఖల సమన్వయంతో ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి ప్రాణ ఆస్తి నష్టాలను నివారిస్తుందన్నారు. స్వాతంత్య్రం రాక ముందు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు అయిందని 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. రెవిన్యూ శాఖ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ బ్రిటిష్ కాలంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రమే ఉండేవని జమాబందీ నీటి తీరువా వసూళ్ల సమయంలో తహసీల్దారులకు పోలీస్ అధికారులు రక్షణగా వ్యవహరించే వారని తెలిపారు. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన 32 మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు కలెక్టర్ శుక్లా చేతుల మీదుగా బహూకరించి సత్కరించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగం ద్వారా సుమారుగా 88 రకాల సేవలను అందిస్తున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఈ రెండు సంవత్సరాల కాలంలో రెవెన్యూ పరంగా చేసిన సేవలను వివరించారు. అమలాపురం ఆర్డీవో జి.కేశవవర్ధన రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.మదనమోహన్రావు, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వాసా శామ్యూల్ దివాకర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రోజూ గంట కేటాయించండి
రోజూ గంట సమయం యోగాకు కేటాయించండి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు. నిత్య యోగాతో కరోనాను సైతం ఎదుర్కొనే శక్తి వస్తుందని నిరూపించాను. రోజూ గంట సమయం ధ్యానం, ప్రాణయామం, సూర్య నమస్కారం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ప్రతి రోజు ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాను. – వెలగల ఫణికృష్ణారెడ్డి, యోగా గురువు, రాయవరం ఆత్మస్థైర్యం పెరుగుతుంది యోగా సాధనతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అలవడుతుంది. అదే ధైర్యంతో జీవితంలో ఎటువంటి కష్టాలనైనా సులభంగా ఎదుర్కొనే సత్తా పెరుగుతుంది. యోగాను ఇష్టపడి సాధన చేస్తే అటు చదువుతో పాటు అన్ని రంగాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థి దశ నుంచి యోగా సాధనతో విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. యోగా సాధనతో వ్యాధులను సైతం నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. – అల్లూరి శ్రీనివాసచౌదరి, యోగా శిక్షకులు, లొల్ల, రాయవరం మండలం సేవా దృక్పథంతో.. అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలనే స్వామి వివేకానంద యోగా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాను. ఇంతవరకు సుమారు 15 వేల మంది శిక్షణ పొందారు. వారిలో పలువురు పీఈటీ, యోగా టీచర్స్గా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం సుమారు 580 మంది శిక్షణ పొందుతున్నారు. – ఆకుల శ్రీనివాస్, యోగా మాస్టర్, స్వామి వివేకానంద యోగా శిక్షణ కేంద్రం, కొత్తపేట దీన్ని మించిన వైద్యం లేదు శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాను మించిన వైద్యం లేదు. ఆనందకర జీవితానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా యోగా అభ్యసిస్తే జీవితం ఆనందంగా సాగుతుంది. – నల్లా సత్యనారాయణమూర్తి (నల్లా మాస్టార్), రిటైర్డ్ పీఈటీ అండ్ ఎన్సీసీ ఆఫీసర్, కొత్తపేట -
పవన్ నిర్ణయం అన్యాయం
అమలాపురం రూరల్: రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉపాధి హామీ పథకం నిధులు హార్టికల్చర్కి అనుసంధానం చేస్తూ సంతకం చేయడం అన్యాయమని, దీనిపై పునరాలోచన చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం అమలాపురం మండలం ఎ.వేమవరం గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కూలీలు పని చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు మెటీరియల్కు, ఇటు హార్టికల్చర్ వంటి పనులకు 80 శాతం నిధులు మళ్లిస్తున్నాయని అన్నారు. ఇక ఉపాధి కూలీలకు పనులు ఏ నిధులతో కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులందరికీ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలన్న లక్ష్యం పక్కదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకానికి దేశవ్యాప్తంగా రూ.రెండున్నర లక్షల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పథకంలో అనేక పనులను కుదించారని కోనసీమ లాంటి ప్రాంతాల్లో చేపట్టేందుకు కేవలం పంటకాలువలు, మురుగు డ్రైన్ల పనులు మాత్రమే ఉన్నాయని, జంగిల్ క్లియరెన్స్, గురపుడెక్క పనులను తొలగించారని చెప్పారు. 200 రోజులు ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించే ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పొలమూరి శ్రీనివాసరావు, పెట్టా ఆనందరావు పాల్గొన్నారు. ● ఉపాధి హామీ నిధులు దారి మళ్లించడం తగదు ● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు -
అమెరికా వెళ్లేందుకు ఉత్తమ మార్గదర్శకత్వం
జేఎన్టీయూకే ఉపకులపతి ప్రసాదరాజు కాకినాడ సిటీ: విదేశాలల్లో స్థిరపడిన జేఎన్టీయూకే పూర్వ విద్యార్థులను యూనివర్శిటీ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు వారి ఆహ్వానం మేరకు చేపట్టిన అమెరికా ప్రయాణం విజయవంతమైందని ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వారా పూర్వ విద్యార్థుల లతో యూనివర్సిటీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. తద్వారా ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉత్తమ మార్గదర్శకత్వం లభిస్తుందన్నారు. ప్రాయోజిత పరిశోధనా ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమల సహకారాన్ని పొందడంతో పాటు విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్షిప్స్ లభిస్తాయన్నారు. యూఎస్ విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా జాయింట్ ఎంఎస్ ప్రోగ్రామ్లు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపడతామని వివరించారు. జేఎన్టీయుకే క్యాంపస్లో విద్యా వాతావరణాన్ని మరింత మెరుగు పర్చేందుకు కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ సహకారం అందించనుండడం అభినందనీయమన్నారు. యూనివర్శిటీకి న్యాక్ ఏ+, కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు లభించడం, విద్యార్థులకు మెరుగైన ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా యూనివర్శిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా, యూనివర్శిటీ ఆఫ్ మిస్సారీ, టెక్సాస్ ఏ అండ్ ఎం, చికాగో స్టేట్ యూనివర్శిటీ సందర్శించడంతో పాటు చికాగోలోని కాన్సులేట్ జనరల్ను కలిశానన్నారు. పూర్వ విద్యార్థులైన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడంతో పాటు వోజిక్ ఏఐలో ఇంటర్న్షిప్ అందించేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థి డాక్టర్ వాసు తదితరులకు అభినందనలు తెలిపారు. యూఎస్ పర్యటనకు తనతో పాటు యూసీఈకే ప్రిన్సిపాల్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, కెనడా నుంచి ప్రొఫెసర్ జేవీఆర్ మూర్తిలతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లినట్టు తెలిపారు. జేఎన్టీయూకే ప్లాటినం జూబ్లీ అండ్ అలూమ్ని సెంటర్ నిర్మాణానికి పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించడంలో కీలకపాత్ర పోషిస్తున్న సీతా ముత్యాలభాస్కరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు వీసి ప్రసాదరాజు వివరించారు. -
కొత్త రకాల సాగులో జాగ్రత్తలు
అమలాపురం రూరల్: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మార్టేరు రూపొందించిన ఎంటీయూ 1310, ఎంటీయూ 1275 రకాలను ఈ ఖరీఫ్ కోసం సిఫారసు చేస్తున్నట్టు అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంకేతిక సలహా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నంద కిషోర్ తెలిపారు. ఇందులో ఎంటీయూ 1310 రకం, 140 రోజులు కాల పరిమితి కలిగి ఎకరానికి 35–40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. గింజ రాలిక తక్కువ వుండి, అగ్గి తెగులును, మెడ విరుపు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఎంటీయూ 1275 రకం, 140 రోజులు కాల పరిమితి కలిగి ఎకరానికి 35–40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. కాండం ధృడంగా వుండి, చేను పడిపోదు, గింజ రాలిక తక్కువ. గింజ మధ్యలో సన్నగా వుండి, బియ్యం పారదర్శకంగా ఉండి, ఎక్కువ నిండు గింజలు కలిగి ఉంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడి నిచ్చే ఈ రకం అగ్గి తెగులు, మెడ విరుపు, ఎండాకు, గోధుమ మచ్చ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. నారుమడి పెంపకంలో సూచనలు ● నారుమడిని 10–12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి, చదును చేసి, నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని అంటే సుమారు 5 కిలోల యూరియా (విత్తనం చల్లే ముందు 2.5 కిలోలు, విత్తిన 10–15 రోజులకు మరొక 2.5 కిలోలు వేయాలి.) కిలో భాస్వరం అంటే 6 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, 1 కిలో పొటాస్ అంటే 2 కిలోల మ్యూరేట్ ఆప్ పొటాష్ ఎరువులు వేయాలి. ● ప్రతి 5 సెంట్ల నారుమడికి 25 కిలోల విత్తనం, విత్తన శుద్ధి చేసి మొలక కట్టి చల్లాలి. నారుకు ఒక ఆకు పూర్తిగా విచ్చే వరకు ఆరుతడిగా నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి. పొడి విత్తన శుద్ధి ● ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ పొడి మందును విత్తనానికి పట్టించి 24 గంటలు నాన బెట్టి, 24 గంటలు మండి కట్టి, నారుమడిలో చల్లు కోవాలి. తడి విత్తన శుద్ధి ● లీటరు నీటికి గ్రాము కార్బెండజిమ్ పొడి మందును కలిపి, అందులో కిలో విత్తనాలను 24 గంటలు నాన బెట్టి, 24 గంటలు మండి కట్టి, నారుమడిలో చల్లు కోవాలి. ఈ విధంగా చేయటం వల్ల నారుమడి దశలో ఆశించే తెగుళ్లను చాలావరకు నివారించవచ్చు. సస్య రక్షణ ● ఇక నారుమడిలో ఆశించే కాండం తొలిచే పురుగు, ఉల్లి కోడు, హిస్పా పురుగు నివారణకు విత్తిన 10 రోజులకు కార్బొప్యురాన్ 3 జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున నారుమడిలో పలుచగా నీరు వుంచి చల్లాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బొప్యురాన్ 3 జి గుళికలు ఇసుకలో కలిపి నారుమడిలో పలుచగా నీరు వుంచి చల్లాలి. కలుపు నివారణ ● నారుమడిలో గడ్డి జాతి కలుపు నివారణకు పైరజో సల్ఫ్యూరాన్ ఇదైల్ 10శాతం డబ్ల్యూపీ 80 గ్రాములు, లేదా ప్రిటిలాక్లోర్ ఫ్లస్ సెప్నర్ 400 మి.లీ. ఒక ఎకరానికి చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలిపి విత్తిన 3–5 రోజుల లోపు చల్లుకోవాలి. ● నారుమడిలో గడ్డి జాతి వెడల్పాకు కలుపు నివారణకు బిస్ పైరీబాక్ సోడియం 108 ఎస్.ఎల్. 100 మి.లీ. ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15–20 రోజులకు చల్లాలి. రైతులు పైన తెలిపిన సూచనలు పాటిస్తూ ఆరోగ్య వంతమైన నారును పెంచుకోవాలని ఆయన సూచించారు. ఖరీఫ్లో ఎంటీయూ 1310, ఎంటీయూ 1275 సిఫారసు వీటికి చీడ పీడలను తట్టుకునే సామర్థ్యం ప్రయోగాత్మకంగా పరిశీలన అనంతరం నిర్ధారణ జిల్లా సాంకేతిక సలహా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నంద కిషోర్ -
వైభవంగా శ్రీపుష్పయాగం
● ముగిసిన శ్రీవారి కల్యాణోత్సవాలు ● ఘనంగా ద్వాదశ ప్రదక్షిణలు మామిడికుదురు: శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ అయిదు రోజుల పాటు కనుల పండువలా సాగిన అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్పాల సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీబాల బాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉఽభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. పసుపు, కుంకుమ, రవికల గుడ్డ అందజేశారు. ముందుగా సుప్రభాత సేవతో అయిదో రోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్ర నామార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. బాల భోగం, నివేదన, వేద పారాయణం హృద్యంగా ఆలపించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యహోమం, నిత్యారాధన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి, తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ఽకార్య నిర్వహణాధికారిణి గ్రంధి మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఆద్యంతం కనుల పండువలా జరిగాయి. 20ఆర్జడ్ఎల్85 : స్వామి వారి శ్రీపుష్పయాగంలో పాల్గొన్న భక్తులు -
జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
– మాజీ ఎంపీ అనురాధ అల్లవరం: గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యమని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. మొగళ్ళమూరులోని ఆమె నివాసంలో గురువారం సర్పంచ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఏ ఒక్కరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తుతూ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు, పార్టీ నాయకులకు భరోసాగా ఉంటానని చెప్పారు. మనమందరమూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు, సర్పంచ్లు రాయుడు విష్ణు, డి.చిరంజీవిరావు, సుందరనీడి సాయి, కడలి గంగాచలం, బర్రే సీతారత్నం, కొల్లు వెంకటరమణ, రాకాపు విజయలక్ష్మి, పార్టీ నాయకులు మల్లాడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా రాజకీయాలపై పుస్తకావిష్కరణ రాజానగరం: ‘తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు 1952 – 2022’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు గురువారం ఆవిష్కరించారు. వర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసి ఆచార్య బీవీవీ బాలకృష్ణ ఈ పుస్తకం రచన, సంకలనం చేశారు. క్యాంపస్ సెంట్రల్ లైబ్రరీలోని వివిధ గ్రంథాలను ఉపయోగించుకుంటూ రచయిత ఈ పుస్తక రూపకల్పన చేశారని వీసీ అన్నారు. దాతల పుస్తక భాండాగారంగా ఉన్న ‘నన్నయ భారతి’ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించారని, ప్రతులు కావలసిన వారు నన్నయ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. చరిత్రను భావితరాలకు భద్రంగా అందించడంలో పుస్తక రచనలు ఎంతో తోడ్పడతాయని, చరిత్ర, పూర్వీకుల ఘనత, త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రచయిత కృషిని వీసీ, రిజిస్ట్రార్ తదితరులు అభినందించారు. -
ఇసుక దోపిడీని అరికట్టాలి
డీసీసీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు డిమాండ్ మండపేట: మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలో యథేచ్ఛగా జరుగుచున్న ఇసుక దోపిడీని తక్షణం అరికట్టాలని ఏఐసీసీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆయన మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంఽధించిన ఇసుక ర్యాంపుల గట్లపై లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇసుక నిల్వ చేసిందన్నారు. ఆ గుట్టలపై కూటమి నాయకుల కన్ను పడి దోపిడీకి తెర తీశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఫ్రీ ఇసుక విధానం తీసుకొస్తానని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలోని మీ నాయకులు అయినకాడికి దోచుకుతిన్నాక గాని ప్రభుత్వ పాలసీని అమలు చేయరా అని దుయ్యబట్టారు. ఐదు రోజులుగా రాత్రిపగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక దోపిడీని కలెక్టర్ అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మిన్నకుండి పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు తాను జిల్లా కలెక్టర్కు లేఖ రాశానని వెల్లడించారు. ఇసుక నిల్వలను ఇష్టానుసారం దోచుకుపోతే ఈ వర్షాకాలంలో ఏర్పడే ఇసుక కొరతను ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడూ.. ప్రభుత్వం మీ ఒక్కరి సొత్తేం కాదు.. ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను కామన తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే అధికారులు మర్యాదలు చేసి మరీ చెప్పిన పని చేస్తారని అనడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క పార్టీకో లేక ఏ ఒక్కో నాయకుడికో సంబంధించింది కాదన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన హెచ్చరించారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన శివారు రేవువారిపేటలో చిల్లా లక్ష్మి (55) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాట్రేనికోన ఎస్సై బి.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కాట్రేనికోన శివారు కంచువారిపేటకు చెందిన నల్లా పెదసత్యనారాయణ కుమార్తె లక్ష్మిని, రేవువారిపేటకు చెందిన చిల్లా కృష్ణకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. మృతురాలి లక్ష్మి కొంతకాలం పాటు గల్ఫ్లో ఉంది. రెండేళ్ల క్రితం రేవువారిపేట సొంత ఊరు వచ్చేసింది. అయితే ఈమెకు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఉదయం ఇంటి వద్ద హఠాత్తుగా ముందుకు పడిపోయింది. ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని మృతురాలి భర్త కృష్ణ తెలిపారన్నారు. అయితే తన కుమార్తె లక్ష్మిని భర్త కృష్ణ చంపేశాడని ఆరోపిస్తూ నల్లా పెదసత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు పంపామని ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. బస్సును ఢీకొట్టిన కారు యువతికి తీవ్ర గాయాలు కొవ్వూరు: పట్టణ శివారున ఏబీఎన్ అండ్ పీఆర్ కళాశాల సమీపంలో కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా డివైడర్కి అవతలి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు డివైడర్ ఎక్కి మరోవైపు వెళుతున్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో ఆకస్మికంగా బస్సు బ్రేక్వేయడంతో బస్సు ముందు భాగంలో కూర్చున్న సీహెచ్ శీరిష అనే యువతి తీవ్ర గాయాలపాలైంది. బస్సుకి ఉన్న అద్దాలు పగిలిపోయి యువతి బస్సు ముందు పడిపోవడంతో శీరిష తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు రెండు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని పట్టణ పోలీసులు చెప్పారు. -
లే అయ్యా.. పనికి వెళదాం
● కారు ఢీ కొని వ్యవసాయ కూలీ మృతి ● మృతదేహం వద్ద హృదయ విదారకంగా విలపించిన భార్య అంబాజీపేట: పనికి వెళ్లే వేళయ్యింది.. లే అయ్యా త్వరగా కూలి పనికి పోదామంటూ మృతుని వద్ద భార్య రోదిస్తున్న తీరు చూపరులకు కంట తడిపెట్టించింది. అప్పటి వరకు కలిసి భార్యాభర్తలిద్దరూ ఇంటి వద్ద ఆనందంగా గడిపి పనికి వెళుతుండగా మార్గమధ్యలో ఆమె భర్తను కారు రూపంలో మృత్యువు కాటేసింది. కముజువారిలంకలో గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పని చేసుకునేందుకు భార్యతో కలిసి నడచి వెళుతున్న ఓ కూలీని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కముజువారిలంకకు చెందిన విత్తనాల నాగేశ్వరరావు (58) తన భార్య వెంకటలక్ష్మితో కలిసి వ్యవసాయ కూలి పనికి వెళుతున్నాడు. ఈ సమయంలో ముక్కామల నుంచి కొత్తపేట వైపు వెళుతున్న కారు నాగేశ్వరరావును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది నాగేశ్వరరావును పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారని, అతని మృతితో వెంకటలక్ష్మి పరిస్థితి ఏమిటోనని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా తన ఎదుటే భర్త మృతి చెందడంతో వెంకటలక్ష్మి బోరున విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
తెరచుకున్న దుఃఖాణాలు
● ప్రైవేటు స్కూళ్లలో సైడ్ బిజినెస్ ● పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు ధరల బాదుడు ● తాము చెప్పిందే ధర, ఇచ్చినవే బుక్స్ ● అడ్డూ, అదుపూ లేని దోపిడీ ● బెంబేలెత్తుతున్న సామాన్యులు ● ఎన్ని ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేయని విద్యాశాఖ కాకినాడ సిటీ: జిల్లాలో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండగా బుక్స్, బ్యాగు, చివరికి షూ సైతం తమ పాఠశాలలోనే తీసుకోవాలనేది ఆ యాజమాన్యాల ఆదేశం. బుక్స్ ఇతర మెటీరియల్ కలిపి రూ.10 వేల నుంచి రూ.14 వేలు దాటుతున్నాయి. వాటి ధర మార్కెట్లో రూ.5 వేలే. ఇదేమని అడిగితే ఇవి తీసుకుంటేనే ఇక్కడ చదవాలనే కండిషన్, లేకుంటే నో అడ్మిషన్, బయటి బుక్స్ తెస్తే, నో పర్మిషన్, జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పరిస్థితి ఇదే... జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు. నియంత్రణ లేని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే అభిప్రాయంతో నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తమ పిల్లలను నగంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్, మెయింటినెన్స్, స్పెషల్ ఫీజులు అంటూ రక్తం పీలుస్తున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలల్లో యథేచ్ఛగా పుస్తకాలు, నోట్బుక్లు కొనాలని అదేశిస్తూ తమ పాఠశాల పేర్లతో ఉన్న బ్యాగులను సైతం విక్రయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు మొదలు, బ్యాగులు, టై, బూట్లు, షూ వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లా అధికారులు కొలువుండే కాకినాడ నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా ఉందో చెప్పనవసరం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా విద్యాశాఖ మాత్రం ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. ఆకాశంలో బ్యాగుల ధరలు నర్సరీ నుంచి పదో తరగతి వరకే కాకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకూ బ్యాగు తప్పనిసరైంది. చాలా కంపెనీలు విద్యార్థులను ఆకర్షించేలా వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడల్స్లో బ్యాగులను విడుదల చేస్తున్నాయి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు కొన్ని పుస్తకాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వారికి మాత్రం కచ్ఛితంగా నాణ్యమైన బ్యాగు లేనిదే ముందుకు కదలలేని పరిస్థితి. చిన్న పిల్లల బ్యాగులు దాదాపు రూ.250 నుంచి రూ.600 వరకు, ఆరో తరగతి చదివే పిల్లలకు దాదాపు రూ.1,000 వరకు బ్యాగుల ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం బ్యాగుల ధరలు గతంలో పోల్చితే దాదాపు రూ.310 వరకు పెరిగాయి. యూనిఫాంలు అటువైపుగానే.. విద్యార్థులు తప్పనిసరిగా యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే ధరించాల్సిందే. వీటి ధరలు కూడా గత సంవత్సరంతో పోల్చితే చాలా పెరిగాయి. క్రితం ఏడాది నర్సరీ పిల్లలకు కావల్సిన స్కూల్ యూనిఫాం దాదాపు రూ.600 నుంచి రూ.850 వరకు ఉండగా ఇప్పుడు రూ.1,000 నుంచి రూ.1,200 చేరుకుంది. ఒక విద్యార్థికి కనీసంగా రెండు యూనిఫాంలు ఉండాలి. లేదంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జతను కొనుక్కోవడం, కుట్టించుకోవడం తప్పనిసరి. జిల్లా కేంద్రంలో చాలా దుకాణాల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది రెడీమేడ్ దుస్తులను వాడితే మరి కొంతమంది కొనుక్కొని కుట్టించుకుంటున్నారు. భగ్గుమంటున్న బూట్ల ధరలు ప్రతీ పాఠశాలలో యూనిఫాం దానికి తగ్గట్టుగా బూట్లు బ్లాక్ కలర్, వైట్ కలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్ కొనుగోలు చేయాలని చె బుతున్నాయి. గతేడాది పలు కంపెనీలకు చెంద ని బూట్లు దాదాపు రూ. 300 నుంచి రూ.450 వరకు ఉండగా ఇప్పుడు 10 నుంచి 20 శాతం వరకు పెరిగి కనీసం రూ.750 లేనిదే మంచి బూట్లు రాని పరిస్థితి నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించొద్దు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పాఠ్య పుస్తకాలు, తదితర వస్తువులు అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఫీజుల విషయంలో జీవోలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. పాఠశాలల్లో పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడానికి వీలులేదు. అలాంటివి జరిగితే మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ పుస్తకాల ధరలు ౖపైపెకి.. బయట షాపుల్లో ఓ పుస్తకం ధర రూ.20 ఉంటే పాఠశాలలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఇంకొన్ని పాఠశాలల్లో అయితే రూ.40 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒకటో తరగతికి సంబంధించి 11 టెక్ట్స్బుక్స్కు రూ.1,220, 13 నోట్బుక్స్కు రూ.530 మొత్తం రూ.1,750 వసూలు చేస్తుండగా, కొన్నిచోట్ల రూ.5 వేలకు పైగానే తీసుకుంటున్నారు. రెండో తరగతి 11 టెక్ట్స్బుక్స్కు రూ.1,850, 21 నోట్ బుక్స్కు రూ. 760 మొత్తం రూ.2,610 కాగా, మరికొందరు రూ.6 వేలు తీసుకుంటున్నారు. మూడో తరగతి 10 టెక్ట్స్బుక్స్కు రూ.1,990, 22 నోట్బుక్స్కు రూ.660, మొత్తం రూ. 2,560 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. -
మద్దతుపై పెదవి వరిపు
● పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా పెరగలేదంటున్న రైతులు ● క్వింటాల్కు రూ.117 పెరుగుదల ● జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ● మరో 1.60 లక్షల ఎకరాల్లో రబీ ● రెండు పంటలు కలిపి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 80 శాతం ధాన్యానికి కనీస మద్దతు ధర సాక్షి అమలాపురం: కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను ప్రకటించింది. క్వింటాల్కు రూ.117 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులకు కొంతవరకు ఊరట కలిగింది. ఏటా ఖరీఫ్ సాగు ఆరంభంలో వరితో పాటు పలు రకాల పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు రూ.117 పెంచింది. సాధారణ రకంతో పాటు గ్రేడ్–ఏ రకానికి సైతం ఇదే ధరను పెంచారు. దీంతో ఇప్పటి వరకు సాధారణ రకం క్వింటాల్ రూ.2,183 ఉండగా ఇప్పుడు రూ.2,300 కు పెరిగింది. గ్రేడ్ –ఏ రకం రూ.2,203 ఉండగా ఇప్పుడు అది రూ.2,320 కి పెరిగింది. దీంతోపాటు జిల్లాలో అధికంగా సాగు చేసే మొక్కజొన్న, వేసవిలో అపరాలుగా సాగు చేసే పెసలు, మినుముతో పాటు నువ్వులు ధరలను సైతం కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెసలు క్వింటాల్కు రూ.124 చొప్పున పెంచగా రూ.8,558 ఉన్న పెసలు క్వింటాల్ ధర రూ.8,682 కు పెరిగింది. ఇక మినుములు క్వింటాల్కు రూ.450 చొప్పున పెంచారు. దీంతో రూ.6,950 వరకు ఉన్న ధర రూ.7,400 కు పెరిగింది. నువ్వులు క్వింటాల్కు రూ.632 వరకు పెరిగింది. దీంతో రూ.8,635 ఉన్న ధర రూ.9,267 కు చేరింది. ఈ పెంపు లాభసాటి కాదు జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలలో అత్యధికంగా వరి సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోంది. రబీలో 1.60 లక్షల ఎకరాలలో వరి సాగవుతోంది. ఖరీఫ్లో సగటున 29 బస్తాల చొప్పున 21.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. జిల్లాలో ఖరీఫ్లో 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగబడిగా వస్తుంది. ఇక రబీలో సగటు దిగుబడి 33.75 మెట్రిక్ టన్నుల చొప్పున 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుంది. జిల్లాలో ఖరీఫ్, రబీ కలిపి 8.94 మెట్రిక్ టన్నులకు పైబడి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. వరికి కనీస మద్దతు ధర పెంచడం వల్ల తమకు కొంతవరకు మేలు జరుగుతుంది కాని ఈ పెంపు లాభసాటి కాదని రైతులు అంటున్నారు. పెరిగిన పెట్టుబడులకు తగిన విధంగా మద్దతు ధర పెంచలేదని రైతులు చెబుతున్నారు. నాడు ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర అందేలా పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా మార్పు చేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం సేకరించింది. 2014–19లో టీడీపీ ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ (పీపీసీ)లు ఏర్పాటు చేసినా ధాన్యం కొనుగోలు పెద్దగా జరగలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సైతం ఎప్పుడూ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసిన సందర్భం లేదు. కాని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కోనసీమ జిల్లాలోనే పలు సందర్భాలలో రెండు నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇలా ఆర్బీకేల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడంతో పోటీగా ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. -
5న నాఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం
అంబాజీపేట: సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు వచ్చే నెల జూలై ఐదో తేదీన నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని అంబాజీపేట మార్కెట్ యార్డు ఆవరణలో ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో కొబ్బరి రైతులు, వ్యాపారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ ఎండీ సీహెచ్ బాబురావు ఆదేశాల మేరకు కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామన్నారు. జిల్లాలో ముందుగా అంబాజీపేటలో ప్రారంభిస్తామన్నారు. నగరం, ముమ్మిడివరం, కొత్తపేట, తాటిపాకలలో అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఈ కేంద్రాల నుంచి మూడు నెలల్లో 8 వేల టన్నుల కొబ్బరిని కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. కొబ్బరి రైతులు ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఈ నెల 19 నుంచే రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పామన్నారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో బాల్కోప్రా క్వింటాలుకు రూ.12 వేలు, మిల్లింగ్ కోప్రాను రూ.11,160 గా ధరలు నిర్ణయించారన్నారు. నెలలో ఎకరానికి 2 బస్తాల కొబ్బరిని అనుమతిస్తామన్నారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రం జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగిస్తామన్నారు. అనంతరం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కొబ్బరిలో తేమ శాతం, దుమ్ము, ధూళి తదితర అంశాలను రైతులు తప్పకుండా పాటించాలన్నారు. నాఫెడ్ కేంద్రం ప్రారంభానికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులు పాల్గొననున్నారన్నారు. సమావేశంలో గణపతి వీరరాఘవులు, మైపాల తాతాజీ, అప్పన సతీష్, అడ్డాల గోపాలకృష్ణ, ముత్యాల జమ్మీలు, అరిగెల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేకువలో వాన.. ఆనక ఉక్కపోత
సాక్షి అమలాపురం: జిల్లాలో పలు చోట్ల ఉదయం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముమ్మిడివరం తడిసి ముద్దయ్యింది. ఏకంగా 9.64 సెంటీ మీటర్ల వర్షం పడింది. దీనితో పాటు ఐ.పోలవరం, కాట్రేనికోన, అయినవిల్లిలో 5 సెం.మీటర్లు దాటి వర్షం పడింది. పది గంటల తరువాత జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన ఎండ కాసింది. అమలాపురంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో బుధవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 8 గంటల వరకు సగటున 25.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా మమ్మిడివరంలో 96.4 మిల్లీ మీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా మలికిపురంలో 0.6 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఐ.పోలవరంలో 83.6, కాట్రేనికోనలో 81.4, అయినవిల్లిలో 56.8, ఉప్పలగుప్తంలో 52.4, మామిడికుదురులో 32.8, అమలాపురంలో 19.4, పి.గన్నవరంలో 18.8, అంబాజీపేటలో 14.2, అల్లవరంలో 13.6, రావులపాలెంలో 12.8, రాజోలులో 12.2, రాయవరంలో 11.8, కె.గంగవరంలో 11.4, కొత్తపేటలో 10.2, మండపేటలో 9.2, కపిలేశ్వరపురంలో 7.8, సఖినేటిపల్లిలో 6.6, ఆలమూరులో 6.4, రామచంద్రపురంలో 5.6, ఆత్రేయపురంలో 2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
No Headline
సాక్షి అమలాపురం: సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యేల పదవీ ప్రమాణ స్వీకారం సైతం పూర్తికానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల బదిలీల ప్రక్రియ మొదలుకానుందనే సూచనలు అందుతున్నాయి. ఆయా శాఖల్లోని సాధారణ ఉద్యోగుల నుంచి జిల్లాలో కీలక అధికారుల వరకు మార్పులు జరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పలు శాఖలకు అధికారులను బదిలీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే కీలక శాఖల ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసు, వారికి అనుబంధంగా ఉండే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మండల పరిషత్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర కీలక శాఖలకు చెందిన మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఆయా స్థానాలలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేశారు. డీఆర్వో సీహెచ్ సత్తిబాబుతో పాటు రామచంద్రపురం ప్రసాద్, అమలాపురం అంబికా ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పెద్ద ఎత్తున బదిలీ అయిన విషయం తెలిసిందే. పోలీసు శాఖలో సర్కిల్ ఇనస్పెక్టర్లకు సంబంధించి అమలాపురం టౌన్ సీఐ టి.క్రాంతి కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో విజయవాడ ట్రాఫిక్ నుంచి క్రిస్టోఫర్ వచ్చారు. రావులపాలెం సీఐ రజనీకుమార్ పెనుకొండకు వెళ్లగా, ఎన్టీఆర్ జిల్లా నుంచి రామకుమార్ వచ్చి చేరనున్నారు. అమలాపురం ఎస్ఈబీ సీఐ వి.శివరాజు కృష్ణ జిల్లా మువ్వకు బదిలీ కాగా, ఏలూరు జిల్లా చింతలపూడి నుంచి సాయి స్వరూప్ వచ్చారు. రామచంద్రపురం సీఐగా డి.దుర్గారావు వీఆర్కు వెళ్లగా, ఆయన స్థానంలో కాకినాడ జిల్లా సీసీఎస్ సీఐ పి.దొరరాజు వచ్చారు. అలాగే వారితో పాటు జిల్లాలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు కూడా జరిగాయి. జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్పనాయుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు జోనల్ కమిషనర్గా వెళ్లారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి మనోహర్ వచ్చి చేరారు. రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కె.శ్రీకాంత్ రెడ్డి గుడివాడ మున్సిపాలిటీకి వెళ్లగా, ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి వి.శ్రీనివాసులు రానున్నారు. మండపేట కమిషనర్ త్రిపర్ణ రామకుమార్ ధర్మవరానికి బదిలీ కాగా, విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ నుంచి బి.రాములు బదిలీపై వచ్చారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ జి.లోవరాజు కృష్ణా జిల్లా ఉంగుటూరు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుడివాడ నుంచి ఆర్వీ రంగారావు వచ్చారు. జిల్లాలోని మండలాలకు చెందిన ఎంపీడీవోలను ఈ నెల 26న బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా నుంచి తొమ్మిది మంది ఎంపీడీవోలను కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లా ఏర్పడిన నాటి నుంచి కలెక్టర్గా హిమాన్షు శుక్లా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, గోదావరి వరదల సమయంలో సమర్ధవంతంగా పనిచేశారు. కొత్త ప్రభుత్వంలో కలెక్టర్ల బదిలీలలో ఆయనను కూడా బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, ఎస్పీ ఎస్.శ్రీధర్, డీఆర్వో వెంకటేశ్వర్లు జిల్లాకు వచ్చి తక్కువ కాలమే అవుతోంది. డీఆర్డీఏ పీడీ వి.శివశంకర్, డ్వామా పీడీ వి.మధుసూదనరావు, పంచాయతీరాజ్ ఈఈ చిట్టిబాబుతోపాటు పలు కీలక శాఖల ఉన్నతాధికారులు జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తిరిగి వచ్చేందుకు.. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కీలక స్థానాలలో ఉద్యోగులు మార్పు సైతం జరుగుతోందని ప్రచారం మొదలైంది. కొత్త ప్రభుత్వం మారిన వెంటనే తమకు అనుకూలమైన ఉద్యోగులను నియమించుకోవడం సర్వసాధారణం. ఈ పంథాలో కొత్త ప్రభుత్వం కూడా తమ అనుకూలమైన ఉద్యోగులను నియమించుకోనుంది. బదిలీలలో ఎమ్మెల్యేల ప్రభావం అధికం. పైగా ఇప్పుడు గెలిచిన వారిలో మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం నుంచి పాత వారే కావడం విశేషం. దీనితో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు మరోసారి ఆయా నియోజకవర్గాలలో కీలక ఉద్యోగులు పొందేందుకు పైరవీలు మొదలు పెట్టారు. తమదైన ముద్ర కోసం కీలక శాఖలతో పాటు సాధారణ శాఖలలో పనిచేసే మండల స్థాయి అధికారుల వరకు బదిలీ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరో వారంలో బదిలీల ప్రక్రియ మొదలయ్యే అవకావముందని సమాచారం. జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎస్పీ కార్యాలయం కోనసీమ జిల్లాలో రంగం సిద్ధం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రక్రియ జిల్లాకు తిరిగి వచ్చేందుకు పైరవీలు గత టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారుల ముమ్మర యత్నాలు -
రేపటి మహా జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి మూలవిరాట్టుకు నిర్వహించే సప్తనదీ జలాలతో మహా జ్యేష్ఠాభిషేకానికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆలయానికి చేర్చిన సప్తనదీ జలాల కలశాలను మీడియాకు ప్రదర్శించారు. కావేరి, సింధు, నర్మదా, సరస్వతి, గోదావరి, యమున, గంగా నదుల జలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరించామని చెప్పారు. జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ నక్షత్ర మహా పర్వదినం సందర్భంగా విశేషమైన అభిషేకం నిర్వహిస్తున్నట్టు, భక్తులు ఈ అభిషేకంలోను, మహాశాంతి హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
600 పాఠశాలల్లో ఆడిట్
అమలాపురం టౌన్: జిల్లాలోని 600 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మంగళ, బుధవారాల్లో ఆడిట్ పూర్తయిందని సమగ్ర శిక్షా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అధికారి (ఎఫ్ఏవో) జి.ప్రవీణ్కుమార్ వెల్లడించారు. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కోనసీమకు చెందిన 385 పాఠశాలల్లో బుధవారం ఆడిట్ నిర్వహించారు. జిల్లాలో మంగళవారం 215 పాఠశాలల్లో ఆడిట్ జరిగితే బుధవారం మరో 385 పాఠశాలల్లో ఆడిట్ చేసినట్టు ఎఫ్ఏఓ తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాఠశాలల ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేపట్టినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ జీసీ రెడ్డి అండ్ అసోసియేట్స్ నుంచి వచ్చిన ఆడిటర్లు బి.పవన్ కళ్యాణ్, ఎన్.టైటస్, బి.శివ రమేష్ పాఠశాలల ఆడిట్ నిర్వహిస్తున్నారు. అమలాపురంలో జరిగిన ఆడిట్ను డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశరావు, ఎఫ్ఏవో ప్రవీణ్కుమార్, ఏఎంవో పిల్లి రాంబాబు పర్యవేక్షించారు. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కోనసీమలోని అమలాపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన పాఠశాలల్లో ఆడిట్లు చేశామని తెలిపారు. మంగళవారం ఆలమూరు, రామచంద్రపురం, మండపేట, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం మండలాల్లోని పాఠశాలల్లో ఆడిట్ పూర్తి చేశామన్నారు. ఆడిట్ నివేదికలను ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఎఫ్ఏవో ప్రవీణ్కుమార్ అందజేశారు. అమలాపురంలో జరిగిన ఆడిట్లో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం వి.విజయకుమారి, అకౌంటెంట్ పి.వరలక్ష్మితో పాటు కోనసీమలోని వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, అకౌంటెంట్లు పాల్గొన్నారు. పాత అలైన్మెంట్తోనే బైపాస్ నిర్మించాలిమామిడికుదురు: పాశర్లపూడి 216వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు. 2014లో చేసిన అలైన్మెంట్ను కాదని 2016లో చేసిన అలైన్మెంట్ ప్రకారం రోడ్డు పనులు చేస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు. కొంత మందికి అనుకూలంగా ఈ మార్పులు చేశారని, దీని వల్ల తమ భూములు కోల్పోతున్నామంటూ ఆవేదన చెందారు. ఈ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆర్జీ పంపించామని బాధితులు పేర్కొన్నారు. బాధితులు విప్పర్తి గణపతిరావు, గెడ్డం గంగాధర్, కుసుమ సుగుణ, చెల్లింగి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సుభాష్ను కలిసిన కలెక్టర్, ఎస్పీ
సాక్షి అమలాపురం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ ఎస్.శ్రీధర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమలాపురం వచ్చిన సుభాష్ను ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా పరిపాలన, శాంతిభద్రతల పరిస్థితిని కలెక్టర్, ఎస్పీలు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పరిశ్రమలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తగు పరిష్కారం చూపి వారికి అండగా నిలుస్తానన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. -
చెక్కనైన పనితేరు
సత్యదేవుని చిన్నరథం నిర్మాణ వ్యయం రూ.34 లక్షలు. రథం ఎత్తు 14 అడుగులు. వెడల్పు 6.3 అడుగులు. పొడవు 7.5 అడుగులు. ఈ రథం గత మార్చి రెండో తేదీ, రథసప్తమి నాడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు. సత్యదేవుని పెద్ద రథం నిర్మాణ వ్యయం రూ.1.08 కోట్లు. ఎత్తు 34 అడుగులు. వెడల్పు 14 అడుగులు. పొడవు 23.5 అడుగులు. గత మే నెలలో జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల ఐదో రోజు అనగా మే 22 వ తేదీన అన్నవర పుర వీధుల్లో ఈ రథంపై స్వామిని ఘనంగా ఊరేగించారు. చిన్న రథానికి రత్నగిరిపై ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మిస్తుండగా, పెద్ద రథానికి కొండ దిగువన షెడ్డు నిర్మిస్తున్నారు. అన్నవరం: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు...’ అంటూ హంపి విజయనగరంలో గల శిల్పకళ అందాల గురించి వర్ణించే సినిమా పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ శిల్పుల పనితనం చూస్తే చెక్కతో రథాలు చేసినారు...వారు దేవతామూర్తులకే కొత్త సొబగులు అద్దినారు’ అని పాడాల్సి వస్తుంది. శిల్పకళను తలదన్నేలా చెక్కపై కూడా అందమైన శిల్పాలు, దేవతామూర్తులు, దేవుళ్లను చెక్కే శిల్పులతో బాటు, దేవతామూర్తులను ఊరేగించే ఎత్తయిన రథాలను రూపొందించే శిల్పులు కూడా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమండకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళా వుడ్ వర్క్స్ అఽధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఆ కోవకు చెందినవారే. పది అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథంతో బాటు 36 అడుగుల ఎత్తయిన రథాలు కూడా నిర్మించిన చరిత్ర వారిది. వీటితోబాటు ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు, వస్తువులు, కళాఖండాలు కూడా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకున్న పనితనం వీరిది. MýS$Ìê-°MìS AW²MýS$ÌS „ýS{†Ä¶æ¬Ë$...-˘ వృత్తికి శిల్పకారులు అలాగని వారేమి అనాదిగా చెక్కతో వస్తువులు, బొమ్మలు, గృహోపకరణాలు తయారు చేసే కులవృత్తి కలిగిన వడ్రంగులో, విశ్వబ్రాహ్మణులో కాదు. కులానికి సముద్రంలో చేపలు పట్టే అగ్నికుల క్షత్రియులు. అయితే గత నాలుగు తరాలుగా దేవతా విగ్రహాలు, రథాలు , ఇతర కళాఖండాలు తయారు చేయడాన్ని వృత్తిగా స్వీకరించినట్టు కొల్లాటి కామేశ్వరరావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. సుమారు ఎనిమిది నెలల నుంచి వారు అన్నవరంలోనే ఉండి సత్యదేవుని ఊరేగించేందుకు 14 అడుగుల ఎత్తయిన చిన్న రథం, 34 అడుగుల పెద్ద రథం తయారు చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి తమ అనుభవాలను వివరించారు. రథాల తయారీ చాలా కష్టం దేవుళ్లను ఊరేగించే రథాలు తయారు చేయడం చాలా కష్టమైన పని. అందులో 20 అడుగుల కన్నా ఎత్తు రథం తయారు చేయాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. రథాలు, దేవతామూర్తుల విగ్రహాలు, మందిరాలు, దేవుళ్లని ఊరేగించేందుకు వివిధ వాహనాల నిర్మాణంలో నాణ్యమైన బస్తరు టేకునే వాడతాం. కర్ర నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడం. చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ రథం నిర్మించాలి. నిర్మాణ సమయంలో చాలా నిష్టగా కూడా ఉండాలి. – కొల్లాటి కామేశ్వరరావు, ప్రధాన శిల్పి రథాలు, దేవతామూర్తుల తయారీలో సిద్ధహస్తులు కొల్లాటి వంశస్తులు ఇప్పటి వరకు 82 రథాలను రూపొందించి మన్ననలు పొందిన వైనం సత్యదేవునికి రెండు రథాలు అందించిన కామేశ్వరరావు, శ్రీనివాస్ బృందం పడవల తయారీ నుంచి దేవుళ్ల రథాల వరకు... మా తాత కొల్లాటి వీర్రాజు తొలుత చేపలు పట్టే బోట్లు, పడవలు తయారు చేసేవారు. అలా చిన్న చిన్న గృహోపకరణాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రథాల తయారీ ప్రారంభించారు. మా నాన్న కొల్లాటి కామేశ్వరరావు పెద్ద పెద్ద రథాలు తయారు చేయడంలో నిపుణులు. ఆయన వద్ద నుంచి నేను ఈ వృత్తి నేర్చుకున్నాను. నాతో పాటు మరో 20 మంది శిల్పులు దేవతా రథాలు తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు 82 రథాలు తయారు చేశాం. వాటిలో 43 అడుగుల ఎత్తు కలిగిన అంతర్వేది దేవస్థానం రథం పెద్దది. ఆ తరువాత యానాంలోని మీసాల వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథం ఎత్తు 38 అడుగులు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో 14 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, 34 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రథం తయారు చేశాం. ఇవి కాకుండా పలు ప్రముఖ దేవస్థానాలకు రథాలు తయారు చేశాం. రథాలే కాకుండా చెక్కతో వివిధ దేవతామూర్తులు, ఇతర గృహోపకరణాలు కూడా తయారు చేశాం. నూతనంగా లోవకొత్తూరులో నిర్మించిన తలుపులమ్మ తల్లి ఆలయం తలుపులు కూడా మేమే తయారు చేశాం. – కొల్లాటి శ్రీనివాస్ -
శాటిలైట్సిటీలో వ్యక్తి హత్య
పాత కక్షలే కారణం రాజమహేంద్రవరం రూరల్: అష్టాచమ్మ ఆటలో వివాదంతో పాటు, పాతకక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన శాటిలైట్సిటీ గ్రామం రాజీవ్గృహకల్ప సముదాయంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శాటిలైట్సిటీ రాజీవ్గృహకల్ప సముదాయానికి చెందిన మార్గాని నాగేశ్వరరావు (45) కూలి పని చేసుకుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కై రం వెంకన్న, కై రం వీరన్నలకు నాగేశ్వరరావుతో పాతకక్షలు ఉన్నాయి. మంగళవారం వారు గృహకల్ప వద్ద అష్టాచమ్మ ఆడుతున్నారు. ఈ సందర్భంగా పాత అప్పు కోసం వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వెంకన్న, వీరన్నలను చంపేస్తానని నాగేశ్వరరావు కత్తి పట్టుకుని తిరిగాడు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో వారి మధ్య గొడవ జరిగి వెంకన్న భార్య విషయమై నాగేశ్వరరావు అమర్యాదగా మాట్లాడాడు. దీంతో నాగేశ్వరరావు వద్ద ఉన్న కత్తిని వెంకన్న లాక్కుని అతనిని పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు సోదరుడు వీర్రాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై బి.శ్రీను కేసు నమోదు చేయగా, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శివగణేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
సిరులు వెదజల్లు
ఎన్నో ఉపయోగాలు ● తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి కూలీల కొరతను అధిగమించవచ్చు. ● సాగునీటి ఎద్దడిని అఽధిగమించవచ్చు. ● పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతంగా మారుతుంది. ● మొక్కలో సాంధ్రత పెరిగి పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఏర్పడుతుంది. ● సాధారణ సాగులో ఎకరం వరి నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. ● వెదజల్లు పద్ధతిలో కేవలం 12 నుంచి 18 కేజీలు మాత్రమే అవసరమవుతాయి. ● సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా కలుపు మొక్కలను సైతం ఎరువుగా మలుచుకోవచ్చు. ● నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. దీని వల్ల సుమారు రూ.3 వేలు ఆదా అవుతుంది. ● ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలమూరు: గత రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై అనుసరించిన పారదర్శక విధానాలతో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. అధునాతన, పురాతన పద్ధతులను మేళవింపు ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పాటు సరైన గిట్టుబాటు ధర లభించడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్కు సమాయత్తమవుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడి తగ్గించేందుకు వారంతా వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో 1,68,780 ఎకరాల్లో 96572 మంది రైతులు వరిసాగు చేపట్టారు. ఈ సాగులో 73 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా 21 శాతం మంది ఎంటీయూ 1318, ఆరు శాతం మంది 1064 రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో 33 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. అలాగే ప్రస్తుతం వివిధ గ్రామాల్లో 900 క్వింటాళ్ల విత్తనాలు ఆర్బీకేల్లో నిల్వచేయగా మిగిలిన విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేసింది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగునే ఎంచుకోగా మిగిలిన రైతులు నాటే పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దష్ట్యా వ్యవసాయ శాఖ సూచనలతో ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని రైతులు సమాయత్తమవుతున్నారు. అధికారులు సైతం వెదజల్లు సాగే మేలని సూచిస్తుండడం గమనార్హం. కలుపు యాజమాన్యం ఇలా.. రబీ తొలిదశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చు. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మిల్లీ లీటర్లు లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇఽథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలుచగా నీరు పెట్టి కలుపు మందు పిచికారీ చేయాలి. ఆ తరువాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మద్ధ తొక్కడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నీటి యాజమాన్యం.. విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి ఎక్కువ పిలకలు పెట్టే అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలుచటి నీటి పొర ఉండేలా చూసుకుని మడి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీ మీటర్ల దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెంటీ మీటర్ల దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెంటీ మీటర్ల దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి విత్తు సక్రమంగా జరుగుతుంది. ఈ పద్ధతిపై అన్నదాతల ఆసక్తి పెట్టుబడి ఆదాతో పాటు అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు పాటించాలి వెదజల్లు విధానంలో సాగు చేసే రైతులు విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసుకుని బయటకు పంపాలి. వారం రోజుల తరువాత ఒకసారి పంటకు సాగునీటిని అందజేసి మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడు దిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల మందు ఒకసారి చేనుకు దమ్ము చేయాలి. నాలుగు రోజులు ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. – బోసుబాబు, వ్యవసాయాధికారి, కోనసీమ అంబేడ్కర్ జిల్లా -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామ స్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు భక్తులు గోవింద నామ స్మరణతో గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం ఆద్యంతం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ముఖ్య అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవురులతో కొలువు తీరిన శ్రీవారికి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణం, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి గ్రంధి మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలబాలాజీకి వసంతోత్సవం నదీ స్నానంతో పులకించిన భక్తులు -
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
రాజమహేంద్రవరం సిటీ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని 65 నుంచి 70 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు బుధవారం తెలిపారు. మృతుడు తెలుపు రంగు హాఫ్ హండ్స్ షర్ట్, నీలం, గోధుమ, నలుపు రంగు లుంగీ, సోనాటా వాచ్, రాజమహేంద్రవరం నుంచి ఐఎల్టీడీ వరకూ ఆర్టీసీ బస్సు టికెట్ లభ్యమయ్యాయన్నారు. రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే కళ్యాణమండపం ఎదురుగా రైల్వే ట్రాక్ మీద జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
కువైట్ బాధితులకు క్షమాభిక్ష
అమలాపురం టౌన్: సరైన ఆధారాలు, అనుమతులు లేకుండా కువైట్ దేశంలో చిక్కుకుపోయిన తెలుగువారు అక్కడి పోలీసు స్టేషన్లు, లేదా భారత దౌత్య కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా సంప్రదిస్తే స్వదేశానికి చేరుకోవచ్చని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ హౌస్ మెయిడ్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ద వరల్డ్ ఫ్రమ్ గోదావరి డెల్టా రీజియన్ చైర్మన్ హోదాలో ఆయన బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వదేశానికి వచ్చే దారిలేని వారికోసం కువైట్ దేశపు రాజు క్షమాభిక్ష ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులు, బంధువులు ఫోన్లు చేసినప్పుడు ఈ విషయం చెప్పాలని కుడుపూడి పేర్కొన్నారు. వాస్తవానికి మార్చి 17వ తేదీ నుంచి జూన్ 17 లోపున అక్రమ వలసదారులు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని క్షమాభిక్షలో పేర్కొన్నప్పటికీ, గడువు పెంచాలని ఆ రాజ కుటుంబంలోని అడ్వకేట్, కువైట్ రాజకుమారి (షెయికా బీబీ అల్సబా)కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించారు. అక్కడి వారు ఇరు తెలుగు రాష్ట్రాలలోని బంధువులకు ఫోన్ చేసినపుడు ఈ క్షమాభిక్ష గురించి చెప్పాలని కుడుపూడి తన ప్రకటనలో పేర్కొన్నారు. లేని పక్షంలో అమలాపురానికి చెందిన సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియల్ను 7013210153 ఫోన్ నెంబరులో సంప్రదించాలని పేర్కొంది. ఈ నెల 30వ తేదీ తుది గడువు అక్కడి పోలీసు స్టేషన్లు, దౌత్య కార్యాలయాల్లో సంప్రదించాలి ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి