-
No Headline
విజయనగరం: ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యోగాసనాలు సాధన చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను గురువులు వివరించారు. యోగాసనాల్లో తర్ఫీదునిచ్చారు. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానిసిక వికాసం సొంతమవుతుందని తెలిపారు. ● ‘స్వయం మరియు సమాజం కోసం యోగా’ నినాదంలో విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన యోగా డేలో జేసీ కె.కార్తీక్ పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ యోగా విద్యను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా గురువులు ఉషారాణి, శ్రీనివాస్, సదాశివ సుందరరావులను సత్కరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో ఆయుష్, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, సెట్విజ్, ఎన్కేవైకే శాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, డిప్యుటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ వరప్రసాద్, నేచురోపతి వైద్యులు డాక్టర్ చైతన్యస్వప్న, ఎన్కేవైకే ఏఓ ఫృద్వి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా స్నపన తిరుమంజనం
వేపాడ: మండల కేంద్రమైన వేపాడలో శ్రీదేవీ భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి శుక్రవారం స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రాపర్తి చిరంజీవిప్రసాద్ మంత్రోచ్ఛరణాలతో స్వామివారికి అభ్యంగస్నానం, క్షీరాభిషేకం, దదాభిషేం, ఆజ్యం, తేనె, పంచదార, హారిద్రోదాభిషేకం, సుగంద ద్రవ్య అభిషేకం, పట్టువస్త్రాలంకరణ, నక్షత్రహారతి, కర్పూరహారతి, కుంభహారతితో అష్టోత్తర శతమానాలతో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కొనసాగుతున్న కౌన్సెలింగ్ విజయనగరం రూరల్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లలో ప్రవేశాలకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్కు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, రాజాం ప్రభుత్వ ఐటీఐలు, 25 ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు సుమారు 5 వేల సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి తెలిపారు. మూడోరోజు ప్రభుత్వ ఐటీఐలలో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్కు 111 మంది హాజరు కాగా 48 మందికి సీట్లు కేటాయించామన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి వెల్ఫేర్ డే విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కరానికే పోలీస్ వెల్ఫేర్డే నిర్వహిస్తున్నట్టు ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆమె పలువురు అధికారులు, సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యుల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పి.రామచంద్రరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. సంఘ జిల్లా అధ్యక్షునిగా రామచంద్ర పండా (మెడికల్), అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.రామారావు (రిటైర్డ్ సీఐ), ప్రధాన కార్యదర్శిగా ఎం.పి.తిరుపతిరావు (పంచాయతీరాజ్), కోశాధికారిగా సొంటి కామేశ్వరరావు (సోషల్ వెల్ఫేర్), ఉపాధ్యక్షుడిగా తాడి ప్రసాద్ (న్యాయశాఖ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ఏపీజీఈ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కరరావు, పి.వి.రమణ వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు అభినందించారు. -
రహదారి ప్రమాదాల నియంత్రణే ధ్యేయం
పార్వతీపురంటౌన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి శశికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల అవగాహన లోపం కారణంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లకు పాలకొండ, సాలూరు, పార్వతీపురం ఎంవీఐ కార్యాలయాల్లో క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనాల్లో ఓవర్లోడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజల పాటు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ధ్రువీకరణ పత్రాలు లేని, ఓవర్లోడ్ ఉన్న వాహనాలను గుర్తించి 45కేసులు నమోదు చేసి రూ.90వేలు అపరాధ రుసుం విధించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమావళిని పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రవాణాశాఖాధికారి శశికుమార్ -
స్పెషలిస్టు వైద్యులకు ఝలక్!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం.. అధికారం చేపట్టి నెలరోజుల కాకముందే ఏళ్ల తరబడి పనిచేస్తున్న వైద్యులను తొలగించేందుకు సిద్ధమైంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరుపెడుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులను ఈ నెల 30వ తేదీ తర్వాత టెర్మినేట్ చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషలిస్టు వైద్యులకు నోటీసులు జారీచేశారు. పట్టణ ప్రజలకు స్పెషాలటీ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021 డిసెంబర్లో 152 మంది స్పెషలిస్టు వైద్యులను ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ప్రొగ్రాం కింద నియమించింది. వీరిలో ఈఎన్టీ, ఆర్థో, పలమనాలజీ, గైనికాలజీ, అప్తమాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 8 మంది వైద్యులు నియామకమయ్యారు. వీరంతా పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వీరిని విధుల నుంచి తొలగించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్న ఫలంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 152 మందిని టెర్మినేట్ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు ఆందోళన చెందుతున్న వైద్య నిపుణులు జిల్లాలో 8 మందికి నోటీసులు జారీ -
బాబూ భృతి ఏదీ?
విజయనగరం ఫోర్ట్: వేట నిషేధ సమయం ముగిసింది. మత్స్యకారులు సంద్రంలోకి వేటకు వెళ్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన భృతి ఇప్పటికీ లబ్ధిదారుల ఖాతాలకు జమకాకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. చేపలవేటే జీవనాధారంగా బతుకుతున్న మత్య్సకారులకు వేట నిషేధ సమయం (ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు) 61 రోజులు ఎలాంటి పని ఉండదు. వారి జీవనోపాధికోసం ప్రభుత్వం భృతిని చెల్లిస్తుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేటనిషేధ సమయంలోనే మత్య్సకారులకు వైఎస్సార్ మత్య్సకార భరోసా పేరిట ఒక్కో కుటుంబానికి రూ.10వేలు చొప్పున చెల్లించేది. దీనివల్ల వారి జీవనోపాధికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటివరకు భృతి చెల్లింపుపై సందిగ్ధత నెలకొంది. ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో ఇచ్చినట్టుగా రూ.20వేలు చొప్పున భృతి చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు. భృతికోసం 3,798 మంది ఎదురుచూపు! జిల్లాలో వేట నిషేధ సమయంలో మత్య్సశాఖ అధికారులు వేటనిషేధ భృతి కోసం మత్య్యకారులను గుర్తించేందుకు సర్వే చేశారు. సర్వేలో 3,798 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.20 వేలు చొప్పన రూ.7.59 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఐదేళ్లలో ఠంచన్గా చెల్లింపు వైఎస్సార్ మత్య్సకార భరోసా కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సముద్ర తీరంలో చేపలు వేట సాగించే మత్య్సకారులకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. 2019 నుంచి 2023 వరకు 14,218 మందికి రూ.14.218 కోట్లు అందించింది. వేట నిషేధ సమయం ముగిసినా భృతి చెల్లించని వైనం చొరవ చూపని చంద్రబాబు ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తున్న 3,798 మంది వైఎస్సార్ సీపీ హయాంలో వేట నిషేధ సమయంలోనే భృతి చెల్లింపు ఐదేళ్లలో రూ.14.21 కోట్ల ఆర్థిక ప్రయోజనం -
● సైనిక్ స్కూల్లో..
విజయనగరం రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి ఆధ్వర్యంలో యోగాసన కార్యక్రమాలు నిర్వహించారు. యోగాతో ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం మెరుగవుతుందని శాస్త్రి తెలిపారు. యోగాపై క్యాడెట్లుకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో యోగా శిక్షకుడు రవికుమార్ వర్మ ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించారు. టీటీడీ దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, విజయనగరం వేదపాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● జనన, మరణ రిజిస్ట్రార్గా డీఎంహెచ్ఓకు బాధ్యతలు
ఆస్పత్రుల్లోనే జననమరణ ధ్రువపత్రాలు వీరఘట్టం: జనన, మరణ ధ్రువపత్రాలు ఇకపై ప్రభుత్వాస్పత్రుల్లోనే జారీ చేయనున్నారు. దీనికి జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామ స్థాయిలో జరిగే జనన, మరణాలను ప్రభుత్వాస్పత్రుల రికార్డుల్లో నమోదు చేయనున్నారు. 30 రోజులలోపు నమోదు చేసుకుంటే పీహెచ్సీలలో ఉండే మండల మెడికల్ ఆఫీసర్ ఆయా ధ్రువపత్రాలను మంజూరు చేస్తారు. 30 రోజులు దాటి దరఖాస్తు చేస్తే తహసీల్దార్ మంజూరు చేస్తారని పార్వతీపురం మన్యం డీఎంహెచ్ఓ కె.విజయ పార్వతి స్పష్టంచేశారు. -
పని చేయించుకున్నారు.. పైసా ఇవ్వలేదు...
చీపురుపల్లి: ఒకటి కాదు రెండు కాదు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రెండు నెలల పాటు 24 గంటలూ పని చేయించుకున్నారు. ఏ పని చెప్పినా సమాధానం చెప్పకుండా చేశాం. ఎన్నికలు అయిపోయాయి.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసి రెండు వారాలు కావస్తున్నా కనీసం ఒక్కరూపాయి చెల్లించకుండా తమ శ్రమతో ఆటలాడుకుంటున్నారు. బిల్లులు పెట్టాం.. అదృష్టం ఉంటే కొత్తగా వచ్చే అధికారులు ఇస్తారంటూ అపహేళన చేస్తుండడం తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందంటూ ఎన్నికల సిబ్బంది వాపోతున్నారు. ఉన్నతాధికారుల తీరుపై చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్వోలు, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. బీఎల్ఓలుగా విధులు నిర్వహించిన వీఆర్వోలు జేబులో డబ్బులు తీసి ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పోలింగ్ స్టేషన్కు రూ.8 వేలు చెల్లించగా, చీపురుపల్లిలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆవేదనలో ఎన్నికల సిబ్బంది తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన -
ఆలయ భూముల ఆక్రమణ చట్టరీత్యా నేరం
గరుగుబిల్లి: దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయ భూముల ఆక్రమణకు పాల్పడడం చట్టరీత్యానేరమని తహసీల్దార్ కె.జయ అన్నారు. ఈ నేపథ్యంలో తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తలనీలాలు సమర్పించే భవనానికి ఎదురుగా ఉన్న స్థలా న్ని కొంతమంది ఆక్రమణకు పాల్పడుతున్నట్లు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు డి.పారినాయుడు, ఎం.పకీరునాయుడు, ఎం.వాసునాయుడు, తదితరుల ఫిర్యాదు మేరకు శుక్రవారం తమ సిబ్బందితో వెళ్లి సర్వే చేశామన్నారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహించి ఆక్రమణలకు గురైన స్థలం దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నట్లు నిర్ధారించామన్నారు. గతంలో ఆక్రమణదారులు వేసిన సిమెంట్ స్తంభాలను తొలగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎం.కృష్ణ, సర్వేయర్, బి.శ్రీనివాసరావు, వీఆర్ఓ రవికుమార్, స్థానిక ఎస్సై అమ్మాన్రావుతో పాటు దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ భూములే కాకుండా ఆలయ భూముల ఆక్రమణకు పాల్పడడం పట్ల స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఆరోగ్య యోగం
● యోగాతో శారీరక దారుఢ్యం విజయనగరం క్రైమ్: యోగాతో శారీరక దారుఢ్యం సిద్ధిస్తుందని, శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చని ఎస్పీ ఎం.దీపిక అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా గురువు ఎం.దుర్గాప్రసాద్ యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ యోగాసనాలు వేశారు. మానసిక, ఉద్యోగ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నిమిషాల పాటు యోగ సాధన చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది యోగ సాధన చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాథ్, డీసీఆర్బీ సీఐ జె.మురళీ, రూరల్ సీఐ ఎం.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఎన్.గోపాలనాయుడు, రమేష్ కుమార్, ఎస్టిఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కారు ఢీకొని బాలుడి మృతి
గంట్యాడ: మండలకేంద్రంలోని పశువుల అస్పత్రి వద్ద బైక్, కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డొంకాడ గ్రామానికి చెందిన శీర శ్రీను తన భార్య మౌనిక, మూడేళ్ల బాలుడు గణేష్తో కలిసి విజయనగరం నుంచి బైక్పై స్వగ్రామం డొంకాడ శుక్రవారం వస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరుకులోయ నుంచి గరివిడి వస్తున్న కారు గంట్యాడ పశువుల ఆస్పత్రి వద్ద ఢీకొనడంతో బైక్పై ఉన్న బాలుడు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. శ్రీనివాస్ భార్య మౌనికకు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం మేరకు సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై సురేంద్రనాయుడులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర నాయుడు తెలిపారు. ముక్కు పచ్చలారని బాలుడు మృతి చెందడంతో అప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెరువులో పడి వ్యక్తి..వంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన దమరసింగి మహేష్ (33) ప్రమాదవశాత్తు చెరువులో పడి శుక్రవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మహేష్ తన కుమార్తెతో పాటు మరో చిన్నారిని తీసుకుని గ్రామ సమీపంలో ఉన్న నారప్ప కోనేరుకు స్నానానికి వెళ్లాడు. మరో చిన్నారిని ఒడ్డున ఉంచి కుమార్తెతో పాటు చెరువులో స్నానానికి దిగాడు. ఇంతలో చెరువులోని గోతిలో దిగబడి పూర్తిగా మునిగిపోయాడు. అంతలో కుమార్తె గిలగిలా కొట్టుకోవడాన్ని గమనించిన ఒడ్డున ఉన్న మరోచిన్నారి రక్షించే ప్రయత్నం చేసింది. ఇద్దరు చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని గమనించిన అటుగా వెళ్లిన స్థానికులు చూసి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మహేష్ కూడా చెరువులో మునిగిపోయాడని చిన్నారులు తెలపడంతో స్థానికులు ఆయనను బయటకు తీశారు. అప్పటికే కొన ఊపిరితో ఉండడంతో రాజాం సీహెచ్సీకి తరలించి చికిత్సనందించే ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతిచెందుతూ మృతిచెందాడని హెచ్సీ ఎస్.సుగుణాకరరావు తెలిపారు. మృతుని భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
ప్రభుత్వ ఐటీఐలో డ్రోన్ టెక్నాలజీ ట్రేడ్
బొబ్బిలి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో త్వరలో కొత్తగా డ్రోన్ టెక్నాలజీ ట్రేడ్ను ప్రారంభించనున్నట్లు విశాఖ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీ రమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇక్కడి ప్రభుత్వ ఐటీఐ(స్ట్రైవ్)లో రూ.1.2 కోట్లతో అధునాతనంగా తీర్చిదిద్దిన వీఆర్, ఏఆర్ ల్యాబ్లతో పాటు కొత్త కోర్సుల పుస్తకాలున్న లైబ్రరీ, డ్రైవింగ్, కంప్యూటర్ ల్యాబ్ను కళాశాల సిబ్బందితో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే రోటరీ క్లబ్ ప్రతినిధుల సౌజన్యంతో అధునాతన ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు బ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీఐ ట్రేడుల్లో కొత్తదనం, అధునాతన సాంకేతికత, మల్టీ స్కిల్స్ను పెంపొందించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో స్ట్రైవ్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు పూర్తిస్థాయి సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఆన్లైన్ వీడియో క్లాసులను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.దీనికోసం ఇన్స్ట్రక్టర్లకు స్కిల్ డెవలప్మెంట్ను మరింత అప్డేట్ చేసేందుకు భువనేశ్వర్లోని టూల్ రూమ్లో సెంట్రల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. డీఎస్టీతో ఎంఓయూలు ప్రభుత్వ ఐటీఐల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు పారిశ్రామికంగా శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమలతో ఎంఓయూలను కుదుర్చుకుంటామని డీడీ చెప్పారు. డీఎస్టీ (డ్యూయల్ సిస్టం ఆఫ్ ట్రైనింగ్)పేరుతో ఇచ్చే ఈ శిక్షణ వల్ల కంపెనీల్లో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ పొందే ఉపాధి మార్గాలు లభిస్తాయన్నారు. దీనికి తోడు ఐటీఐల్లో బ్రిడ్జి కోర్సు తీసుకుంటునే నేరుగా డిప్లమో కోర్సు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. డ్రైవింగ్ శిక్షణ కోసం కొత్తగా వర్చువల్ విధానం తీసుకువచ్చామని, దీనిని 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా పరిమిత ఫీజు చెల్లించి నేర్చుకోవచ్చని స్పష్టం చేశారు. ఐటీఐ ప్రిన్సిపాల్ జీవీ రమణ, రాజాం ప్రిన్సిపాల్ భాస్కరరావు, బొబ్బిలి ఐటీఐ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.శేఖర్, టీఓలు, రోటరీ క్లబ్ ప్రతినిధులు టీఎన్ఎస్ కార్తీక్, గెంబలి శ్రీనివాసరావు, శ్రీహరి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మంటపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నిరంతర కృషితో కలల సాకారం
రాజాం సిటీ: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కోరినట్లుగా విద్యార్థులు గొప్పగా ఆలోచనలు చేసి మంచి కలలు కనాలని, ఆ కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషిచేయాలని డీఆర్డీఓ మాజీ చైర్మన్, రక్షణ మంత్రి శాసీ్త్రయ సలహాదారు డాక్టర్ జి.సతీష్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జీఎంఆర్ ఐటీలో 9వ గ్రాడ్యుయేషన్ డే వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలంటే కృషి పట్టుదలతో పాటు నిరంతర అన్వేషణ అవసరమన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని చెప్పారు. సవాళ్లను స్వీకరిస్తూ మిగతా వారితో కలిసి పనిచేసి, నైపుణ్యాలను ఉన్నతంగా ఉపయోగిస్తూ సమాజంలో మార్పు తీరుకురావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ముఖ్యంగా విద్యారంగంలో ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్లు ఉన్నాయన్నారు. ఏటా ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థుల్లో అధికశాతం మనదేశంలోనే ఉండి దేశాభివృద్ధికి కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. రీసెర్చ్ పత్రాల సమర్పణలో, పీహెచ్డీ డిగ్రీలు సాధించడంలో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. అలాగే అంతరిక్ష రంగంలో పూర్తిస్వదేశీ పరిజ్ఞానంతో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, క్రయోజనిక్ ఇంజిన్లు తక్కువ ఖర్చుతో తయారుచేసి వందలాది ఉపగ్రహాలను మనదేశంలోనే విజయవంతంగా ప్రయోగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రక్షణ రంగంలో స్వావలంబన సాధించామని అమెరికా, రష్యా, చైనా తర్వాత గొప్పశక్తిగా ఎదిగామని, తేలికపాటి యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత నౌక తయారీ, పూర్తిస్థాయి స్వదేశీ తుపాకులు తయారుచేయగలిగామని చెప్పారు. ఐడెక్స్ ద్వారా రూ. 10 కోట్లు వరకు, డీఆర్డీఓ ద్వారా రూ. 50 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో తొలి ఐదు స్థానాల్లో జీఎంఆర్ ఐటీ జీఎంఆర్ ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఎస్ఆర్వీ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మొదటి 50, రాష్ట్రస్థాయిలో మొదటి ఐదు స్థానాల్లో జీఎంఆర్ ఐటీ ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ది ఇంపాక్ట్ ర్యాంకింగ్లో స్థానం సంపాదించామని పేర్కొన్నారు. అనంతరం గ్రాడ్యుయేట్ విద్యార్థుల అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ అవార్డులు, బంగారు, వెండి పతకాలతో పాటు డిగ్రీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, ఎల్ఎం లక్ష్మణమూర్తి, జీఎంఆర్వీఎఫ్ సీఈఓ అశ్వినిలోహని, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటె డ్ డిప్యూటీ సీఈఓ అలెక్సిస్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఓ మాజీ చైర్మన్, రక్షణ మంత్రి శాసీ్త్రయ సలహాదారు జీఎంఆర్ ఐటీలో గ్రాడ్యుయేషన్ డే -
దిగుబడిలో దిట్ట..పచ్చిరొట్ట
● 50 శాతం రాయితీతో విత్తనాల పంపిణీ ● రసాయన ఎరువుల కొరత నివారణకు మార్గం ● దుక్కిలో కలియదున్నడం ద్వారా భూమి సారవంతంరాజాం: భూమి కోల్పోయిన పోషకాలను సహజ పద్ధతిలో పునరు ద్ధరించేందుకు ఉత్తమమైన మార్గం పచ్చిరొట్ట సాగు. నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట పంటలైన కట్టెజనుమ, జీలుగు, పిల్లి పెసర సాగుచేసి భూములను సారవంతంగా మార్చుకోవచ్చు. పూత దశలో ఉన్న పచ్చిరొట్ట పైర్లను పొలంలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి నత్రజని తదితర పోషకాలు అత్యధిక పరిమాణంలో నేలకు అందిస్తాయి. పశువుల పేడకంటే పచ్చిరొట్ట పైర్లు పదిరెట్లు అధికంగా నేలను సారవం తం చేస్తాయి. తద్వారా కృతిమంగా నత్రజని, భాస్వరం వాడకం కూడా తగ్గించుకుని, నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. ఈ ఎరువుల ద్వారా పంటలో ఆశించిన మేర ఫలితాలు ఇస్తుండడంతో గ్రామాల్లో రైతులు ప్రధాన పంటలకంటే ముందు పచ్చిరొట్ట పంటల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా లాభం.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేయడం ద్వారా నీటిని, పోషకాలను నిలుపుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. నేలలో కలియదున్నిన పంట కుళ్లిన తరువాత విడుదలచేసే భాస్వరం, పొటాష్తో పాటు గాలిలోని నత్రజని నేలలో స్థిరీకరిస్తాయి. తద్వారా నేలసారం పెరుగుతుంది. సూక్ష్మపోషకాలు మొక్కలకు అందుతాయి. సూక్ష్మజీవుల సాంద్రత పెరిగి మొక్కల వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఇలా చేయాలి.. పచ్చిరొట్ట ఎరువులను పూతదశలో నేలలో కలియదున్నాలి. ఆ సమయంలో ఎకరాకు 50 కిలోల సూపర్ఫాస్పేట్ వేస్తే పచ్చిరొట్ట త్వరగా కుళ్లుతుంది. మగ్గిన తర్వాత పంటలో వేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుచేసే పొలాల్లో నత్రజని ఎక్కువగా ఉంటే ఎకరాకు 8 కిలోల నత్రజని ఎరువులు వాడడం వల్ల మొక్కలు పెరిగి రొట్ట అధికంగా వస్తుంది. 50 శాతం రాయితీతో ఈ విత్తనాలు రైతులకు అందించారు. కట్టెజనుమ విత్తనాలు పది కిలోలు రూ.480 చొప్పులు రైతులకు ఆర్బీకేల ద్వారా అందించగా, ఇవి చాలా ప్రాంతాల్లో రైతులు వేసవిపంటగా వేసి, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఖరీఫ్కు వాటిని మళ్లీ సిద్ధం చేస్తున్నారు. 25 నుంచి 30 రోజుల వ్యవధిలో ఇవి పూతదశకు వస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పచ్చిరొట్టతో భూసారం పచ్చిరొట్ట పంటల సాగుతో వ్యవసాయ భూమి సారవంతంగా తయారవుతుంది. భూసారం పెరగడానికి ప్రధాన పంటకు ముందుగా రైతులు విధిగా పచ్చిరొట్ట సాగుచేయాలి. పచ్చిరొట్ట ఎరువుతో దిగుబడి పెరగడంతో పాటు గింజగట్టిగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను పైరు తట్టుకుని నిలబడుతుంది. ఆరోగ్యకర ఉత్పత్తులను సాధించవచ్చు. రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు అందించాం. కె.చంద్రరావు, వ్యవసాయశాఖ ఏడీఏ, రాజాం -
చికెన్
బ్రాయిలర్లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ148 శ్రీ266 శ్రీ276బైక్ను ఢీ కొట్టిన ట్రాక్టర్ : వ్యక్తికి తీవ్రగాయాలురామభద్రపురం: మండల పరిధిలోని కొండకెంగువ గ్రామ సమీపంలో దిచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన బండారు సత్యనారాయణ పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంపై మండలకేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. గ్రామం సమీపంలోకి వచ్చేసరికి రహదారి పక్కన భూముల్లో దక్కిదున్నిన ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను రోడ్డు ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ను ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. ప్రథమచికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు రామభద్రపురం పీహెచ్సీకి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. జాబ్ మేళాకు స్పందనవిజయనగరం రూరల్: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక మహారాజా కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్మేళాకు 200 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. మూడు కార్పొరేట్ కంపెనీలు ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. జాబ్ మేళాకు హాజరైన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారిణి డి.అరుణ వారికి పలు సూచనలు చేసి ఇంటర్వ్యూను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. గానకోకిల పంపిన చీరతో పైడితల్లికి అలంకరణవిజయనగరం టౌన్: గానకోకిల, పద్మవిభూషణ్ డాక్టర్ పి.సుశీలమ్మ పంపించిన చీరను పైడితల్లి అమ్మవారికి శుక్రవారం అలంకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ.ప్రసాదరావు తెలిపారు. రెండువారాల క్రితం కొరియర్ ద్వారా పి.సుశీలమ్మ చీరలు పంపించారని, వాటిని ఆమె కోరిక మేరకు ఆయా తేదీల్లో అమ్మవారికి కడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 28న మెగా జాబ్ మేళాపార్వతీపురంటౌన్: ఈ నెల 28న పార్వతీపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు.సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి చదువుకుని వయస్సు 18 నిండి 35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ డ్రైవ్కి కంపెనీ ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు వారి వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఎస్డీసీ.ఇన్ వెబ్ సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్తో పాటు రెస్యూమె, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో ఉదయం 9 గంటలకు జరిగే డ్రైవ్కు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 8978878557, 7997299739 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఏపీ హంస జిల్లా కార్యవర్గం
● అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నిక విజయనగరం ఫోర్ట్: ఏపీ హంస (హెల్త్ అడ్మినిస్ట్రేష న్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడిగా జి. శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయత్రం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నూత న కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు జోన్ –1 కో ఆర్డినేటర్ డి.సూరిబాబు ఎన్నికల అధికారిగా, డి. చిన్నబాబు సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎస్. సూరిబాబు, జిల్లా కోశాధికారిగా ఎస్వీఏ సత్యనారాయణ, విజయనగరం పట్టణ అధ్యక్షుడిగా ఎస్.భీమేశ్వరావు, సిటీ కార్యదర్శిగా టి.వేణుగోపాల్, కోశాధికారిగా భావన, భోగాపురం తాలుకా అధ్యక్షురాలిగా కె.పద్మలత, కార్యదర్శిగా పి.సన్యాసమ్మ, కోశాధికారిగా ఎం.శ్రీనివాసరావు ఎన్నుకున్నారు. -
అందుబాటు ధరల్లో కూరగాయలు
విజయనగరం అర్బన్: మార్కెట్లో రోజురోజుకూ ధరలు పెరుగుతున్న కారణంగా రైతుబజార్లలో కూరగాయల ధరలను అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. ఈ మేరకు హోల్సేల్ వర్తకులు, జిల్లా పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో తన చాంబర్లో శుక్రవారం ఆయన సమీక్ష చేశారు. ప్రధానంగా టమాటో, బంగాళా దుంపలు, ఉల్లిపాయలను నిర్దేశించిన ధరల్లో రైతు బజార్లకు ఇవ్వడానికి హోల్సేల్ వర్తకులు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మూడు రైతు బజార్లలో శుక్రవారం నుంచి అమ్మకాల ధరలను ప్రకటించారు. కిలో టమాటో రూ.60, కిలో బంగాళాదుంపలు రూ.30, కిలో ఉల్లిపాయలు రూ.35 ధరగా రైతుబజార్లలో అమ్మకాలు జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జేసీ కె.కార్తీక్ -
పారిశుద్ధ్య సమస్య తలెత్తనీయొద్దు
విజయనగరం రూరల్: వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీధర్ రాజా ఆదేశించారు. మండలంలోని బియ్యాలపేట సచివాలయం పరిధిలోని ముడిదాం గ్రామ పంచాయతీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు. తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలన్నారు. మురుగునీటి కాలువలు, రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ డి.తిరుపతినాయుడు, పంచాయతీ కార్యదర్శి పి.రామకృష్ణ, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. మురుగునీటి కాలువలను పరిశీలిస్తున్న డీపీఓ శ్రీధర్రాజా జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రాజా -
హైస్కూల్ ప్లస్ చదువుకుప్రవేశాల జాఢ్యం
విజయనగరం అర్బన్: గత ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆంగ్ల మీడియంను అందుబాటులోకి తెచ్చింది. నాడు–నేడు నిధులతో పాఠశాలలను సుందరంగా, చదువులకు ఆలవాలంగా తీర్చిదిద్దింది. ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కారాదన్న ఉద్దేశంతో అమ్మఒడి, విద్యాకానుకుల పేరుతో సాయం అందించింది. కళాశాలలు దూరంగా ఉండడంతో గ్రామీణ విద్యార్థినీ విద్యార్థులు పదోతరగతి తర్వాత డ్రాపౌట్లుగా మిగులుతున్నారన్న నివేదిక మేరకు... హైస్కూళ్లలోనే కళాశాల విద్యను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా రెండేళ్ల కిందట ఎస్.కోట మండలం ధర్మవరం ఉన్నత పాఠశాలలో ప్రయోగాత్మకంగా ‘హైస్కూల్ ప్లస్’ పేరుతో ఇంటర్మీడియట్ విద్యను బోధించింది. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి జిల్లాలో ఏడు హైస్కూళ్లను ‘హైస్కూల్ ప్లస్’గా అప్గ్రేడ్ చేస్తూ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కూళ్లలో నిర్వహించే కళాశాల విద్యలో ప్రవేశాల కోసం పాఠశాలల ప్రారంభం రోజు నుంచి ఉపాధ్యాయులు ఇంటింట ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువుకునే పాఠశాలలో నిర్వహించే కళాశాలలో చేరాలని పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కోరుతున్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ స్కూళ్ల నిర్వహణ, బోధకుల నియామకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థి లోకాన్ని కలవరపెడుతోంది. ఫ్యాకల్టీ నియామకాల్లో నిర్లక్ష్యం ఏ విద్యాసంస్థలోనైనా విద్యార్థుల చేరికలు జరగాలంటే ముందుగా తల్లిదండ్రులు చూసేది అక్కడ బోధకులు ఉన్నారా లేరా అన్నది. పూర్తిస్థాయిలో బోధకలు ఉంటే ఆయా పాఠశాలల్లో ప్రవేశాలకు ఉత్సాహం చూపుతారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏడాది మాదిరిగానే ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లలో అర్హులైన వారికి తాత్కాలిక పదోన్నతులు కల్పించి కళాశాల విద్యాబోధనకు ఉపయోగించవచ్చని, దీని కోసం కొత్తగా జీఓలు అవసరం లేదని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. 124 మంది చేరిక.. జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన దాదాపు 300 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే కేజీబీవీలలో, మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ చదువులు బోధిస్తున్నారు. అయితే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ఏడు మండలాలను తీసుకొని వాటిలో కో–ఎడ్యుకేషన్గా ఇంటర్మీడియట్ చదువులను ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చారు. విజయనగరం డివిజన్ పరిధిలోని జామి, బొండపల్లి, బొబ్బిలి డివిజన్ పరిధిలోని రామభద్రపురం, పిరిడి, చీపురుపల్లి డివిజన్ పరిధిలో తెట్టండి, కోనూరు, ఎ.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ‘హైస్కూల్ ప్లస్’లుగా ఈ ఏడాది నుంచి మార్చి ఇంటర్మీడియట్ కోర్సుల్లో విద్యాబోధన అందించనున్నారు. ఈ ఏడు హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కోర్సులకు ఇంతవరకు 124 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. అయితే, బోధకుల నియామకంపై ప్రభుత్వం నుంచి స్పష్టతరాకపోవడంతో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు అయిష్టత చూపుతున్నట్టు సమాచారం. ఆదేశాలు రావాల్సి ఉంది ఈ విద్యాసంవత్సరం నుంచి ‘హైస్కూల్ ప్లస్’ స్కూళ్లుగా ఏడు సూళ్లను ప్రభుత్వం మార్చింది. వీటిలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నాం. ఆయా స్కూళ్లలో ఫ్యాకల్టీని ఇంకా నియమించలేదు. రెండేళ్ల కిందట జిల్లాలో ప్రారంభమైన ధర్మవరం హైస్కూల్లో నియమించిన విధానంలోనే ఫ్యాకల్టీ నియామకం జరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే సిబ్బంది నియామకం చేపడతాం. – ఎన్.ప్రేమకుమార్, డీఈఓ హైస్కూల్ ప్లెస్ స్కూళ్లలో బోధకుల నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వృథా అవుతున్న టీచర్ల ఇంటింటి ప్రచార శ్రమ జిల్లాలో ఏడు హైస్కూళ్లలో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ చదువులు ఇంతవరకు ఏడు స్కూళ్లలో 124 మంది మాత్రమే ప్రవేశం బోధకుల నియామకాలకు అందని ప్రభుత్వ ఆదేశాలు ఒక్కో స్కూల్లో రెండేసి గ్రూపులు ఇంటర్మీడియట్ గ్రూపుల్లో ప్రధానంగా డిమాండ్ ఉన్న నాలుగు గ్రూపులను ఈ స్కూళ్లలో అందుబాటులో తెచ్చారు. ప్రతి స్కూల్లో ప్రవేశాల సరిపడా ఉన్న రెండు గ్రూప్లనే నిర్వహిస్తారు. నాలుగు గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఉన్నాయి. ప్రతి గ్రూప్లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. -
అటల్ టింకరింగ్ ల్యాబ్తో విజ్ఞానం
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’లు దోహదపడతాయని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ అన్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 42 ఉన్నత పాఠశాలల్లో ఈ ల్యాబ్లు ఉన్నాయని, వీటి పనితనాన్ని నిర్ధారించేందుకు ఇచ్చిన 13 సూచికలను ప్రతి హెచ్ఎం పాటించాలన్నారు. సూచికల ఆధారంగా ల్యాబ్ పనితనానికి రేటింగ్ ఇస్తూ పాయింట్లు ఇస్తామని చెప్పారు. 13 సూచికలు విజయవంతంగా అమలు చేసిన పాఠశాల ల్యాబ్కు ఐదు పాయింట్లు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రతినెలా కలెక్టర్ సమక్షంలో సమీక్ష సమా వేశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ మిరియాల కృష్ణారావు, ల్యాబ్ ప్రధాన ఉపాధ్యాయులు, ల్యాబ్ నోడల్ టీచర్లు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్గా వి.రమేష్ వ్యవహరించారు. డీఈఓ ఎన్.ప్రేమకుమార్ -
కనిపించకుండా పోయిన వ్యక్తి మృతి
బొండపల్లి: మూడు రోజులుగా అదృశ్యమైన వ్యక్తి మామిడితోటలోని తుప్పల్లో మృతదేహమై కనిపించాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజనతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ(32) ఈనెల 17న ఉదయం భార్య ఈశ్వరమ్మ దగ్గర 400 రుపాయలు తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వంటవాడిగా పని చేస్తూ మద్యానికి బానిసైన కృష్ణ కొద్ది రోజులుగా పనికి వెళ్లకుండా కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. 17న ఉదయం డబ్బులు తీసుకోని ఇంటి నుంచి వచ్చేసి అక్కడ నుంచి కనపడకపోవడంతో కుటుంబసభ్యులు వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రయింద్రం గ్రామానికి సమీపంలోని తుప్పల్లో తీవ్ర దుర్గంధంతో కృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. మృతుని భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
మంత్రులకు అభినందనలు
విజయనగరం రూరల్: ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీ తరఫున మంత్రులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. జెడ్పీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
24 నుంచి ఫిర్యాదుల స్వీకరణ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని కోరారు. జంఝావతి పూర్తికి ఇదే మంచి సమయం ● జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కొమరాడ: ఒడిశా చిక్కుముడితో ఉన్న జంఝా వతి రిజ్వర్వాయర్ను పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ఇదే మంచి సమయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అన్నారు. కూటమి నాయకులతో కలిసి జంఝావతి రిజర్వాయర్ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సమస్య కొలిక్కివచ్చే అవకాశం ఉందన్నారు. ఒడిశాకు చెందిన 117 ఎకరాల భూమి ముంపుతో పాటు నిర్వాసితులుగా మారే 300 కుటుంబాల సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేలతో కూడిన జంఝావతి సాధన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయితే మరో 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ గులిపిల్లి సుదర్శనరావు, జనసేన నాయకులు తెంటు శ్రీఖర్, గార గౌరీశంకరరావు, తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ● జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు కొమరాడ: గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు వైద్యసిబ్బందిని ఆదేశించారు. చినఖేర్జిలలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల లార్వా స్థావరాలైన మురుగు కాల్వలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో మలేరియాను తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ విజయకూమారి, సూపర్ వైజర్ జయగౌడ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రూ.128కోట్లతో పార్వతీపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి ●పార్వతీపురం టౌన్: పార్వతీపురం రైల్వే స్టేషన్ను అమృత్భారత్లో భాగంగా రూ.128 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్టు ఈస్టుకోస్టు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పన్వాల్ అన్నారు. విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరబ్ ప్రసాద్తో కలిసి పార్వతీపురం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో విజయనగరం రైల్వే స్టేషన్ తరువాత పార్వతీపురం రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. రైల్వేస్టేషన్లో అన్ని ప్లాట్ఫాంలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణాలు చేపట్టామన్నారు. 6 నెలల్లోగా ఆయా ప్లాట్ఫాంలకు వెళ్లే ప్రయాణికులకు లిఫ్ట్లు, ఎక్స్లైటర్ల సదుపాయం కల్పిస్తామన్నారు. త్వరితగతి న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్య క్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
–8లో
యోగా శరణం గచ్ఛామియోగాతో సమస్త రోగాల నుంచి విముక్తి కలగడంతో పాటు ఆరోగ్య వంతులుగా, చలాకీగా ఉండే అవకాశం లభిస్తుందని యోగా గురువులు బోధిస్తున్నారు.కదంతొక్కిన విద్యార్థిలోకం విజయనగరం పూల్బాగ్: భారత విద్యార్థి ఫెడ రేషన్ (ఎస్ఎఫ్ఐ), విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గర్జించింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ కూడలి వరకు గురువారం విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ నీట్ యూజీ–2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్ష కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, వారందరికీ 720/720 మార్కులు రావడంపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. అదే సెంటర్లో పరీక్ష రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయని, ఆమెకు 636 మార్కులు రావాలే తప్ప 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం నీట్ పరీక్షపేరుతో విద్యను ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నీటిపై విచారణ జరిపించాలని, ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, విద్యార్థుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు డి.రాము, జిల్లా ఉపాధ్యక్షుడు జె.రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు సమీరా, రమేష్, సోమేష్, స్టూడెంట్ నాయకులు భారతి, రాజు, గుణ, వెంకటరమణ, దుర్గాప్రసాద్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర విచారణకు డిమాండ్ లేదంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిక