-
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
గద్వాల: నిత్యం యోగా సాధనతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సంస్థలు, అధికారులు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన యోగా శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా యోగా శిక్షణ శిబిరంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలోని పదో పోలీసు బెటాలియన్లో పోలీసులు ఘనంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెటాలియన్లో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు యోగా శిక్షణ ఇచ్చారు. బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా యోగాసనాలు వేసి యోగా డేను జరుపుకొన్నారు. స్థానిక వాల్మీకి భవన్లో బీజేపీ ఓబీసీ మోర్చా, ఆయుష్ సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా శిక్షణ ఇచ్చారు. యోగా శిక్షకులు యోగాపై మెలకువలు వివరించారు. రుగ్మతలను దూరం చేసే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే ప్రాణయామం.. మనస్సును నియంత్రించే ధ్యాస.. ధ్యానం సాధనలతో జిల్లా వాసులు ఉషోదయాన సేదతీరారు. శిక్షకులు వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించి ఆరోగ్యానికి అవి ఎలా.. ఉపయోగపడతాయో సవివరంగా తెలియజేశారు. ఔత్సాహికులచే ఆసనాలు వేయించారు. పురుషులతో సమానంగా మహిళలు, విద్యార్థినీలు కూడా శిబిరానికి తరలివచ్చారు. యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు.. ఈ క్రమంలోనే ప్రాథమికంగా యోగా శిక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు. సుమారు రెండు గంటల పాటు యోగా సాధన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని ఔత్సాహికులు కోరారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు. యోగా దినచర్యగా ఉండాలి ఎర్రవల్లిచౌరస్తా: ప్రతి ఒక్కరికి యోగా దినచర్యగా ఉండాలని బీచుపల్లి పదో బాటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పదో బెటాలియన్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కమాండెంట్ హాజరై సిబ్బందితో కలిసి యోగా ఆసనాలను వేశారు. అనంతరం మాట్లాడుతూ మానవ జీవితంలో ఆసనం వ్యసనం అయితే జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారని అలాంటి యోగాను భారతదేశం ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం గర్వకారణం అన్నారు. యోగా వల్ల మనస్సుకు శాంతి కలగడమే గాక శరీర దృడత్వం పెరుగుతుందన్నారు. అదేవిదంగా మానవునికి చీటికి మాటికి ఆవేశం కలగకుండా ఓర్పును ఇచ్చే గొప్ప విద్య యోగానేనని అన్నారు. కనుక ఖచ్చితంగా సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా యోగాకు ప్రతినిత్యం కొంచెం సమయం కేటాయించి ఆసనాలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ చౌహాన్, ఆర్ఐలు రాజారావు, వెంకటేశ్వర్లు, శ్రీదర్, గోపాల్, ఆర్.పి సింగ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం
గద్వాల: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్కు వివిధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదున్నర దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసిన జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కమిషనర్ శంకర్సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. -
విద్యకే తొలి ప్రాధాన్యం
గద్వాల: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి ఆయన గద్వాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. అంతేకాక గద్వాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహ విద్యార్థుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, భోజనశాల తదితర వాటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అల్ఫాహారం చేశారు. వసతి గృహాలలో సమస్యలు లేకుండా చూసుకోవాలని, ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కార్యకర్తలతో కలిసి టీ తాగారు. ఐటీఐ కళాశాల పూర్తికి కృషి డ్యామ్ రోడ్డు మార్గంలో చేపట్టిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల పనులను ఎంపీ మల్లురవి పరిశీలించారు. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన కళాశాల పనులు ఎందుకు నిలిచిపోయాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలో పనులు నిలిపివేశారని అధికారులు ఎంపీ దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే పనుల పునఃప్రారంభానికి టెండర్ పిలిచి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీఐ కళాశాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా కన్వీనర్ మోహన్రావు ఎంపీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. అనంతరం వేదనగర్ కాలనీలో ఓ ఇంట్లో బంగారు, నగదు చోరీకి గురైన బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మా, సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్రెడ్డి, గట్టు తిమ్మప్ప, బండారి బాస్కర్, శంకర్, ఇసాక్, కోటేష్, ఎల్లప్ప, నర్సింహులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి ఎంపీ మల్లు రవి -
జోగుళాంబ సన్నిధిలో నూతన ఎస్పీ
జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాలలో అయిదో శక్తిపీఠమైనన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శుక్రవారం నూతన ఎస్పీ శ్రీనివాస్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ వారికి ఆలయ మర్యాదలతో ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా వారు సంకల్పసిద్ది గణపతిని దర్శించి బాలబ్రహ్మేశ్వరడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం జోగుళాంబ అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వారితో పాటు స్థానిక సీఐ రవి బాబు, అలంపూర్ ఎస్ఐలు నాగరాజు, ఉండవెల్లి ఎస్ఐ శ్రీనివాసులు, ఇటిక్యాల ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా, నిత్యం ఆలయానికి ప్రముఖులు వస్తుంటారని ఆలయ రక్షణకు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించాలని ఆలయ ఈపు పురేందర్కుమార్ విజ్ఞప్తి చేయగా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ గద్వాల క్రైం: జిల్లా నూతన ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్రావు, సీఐలు పూలబొకే అందజేశారు. వేరుశనగ క్వింటా రూ.6,459 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 174 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6459, కనిష్టం రూ.2456, సరాసరి రూ.4951 ధరలు పలికాయి. అలాగే, 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ.5360 ధర వచ్చింది. 18 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం రూ. 1806, కనిష్టం రూ. 1779, సరాసరి రూ. 1806 ధరలు వచ్చాయి. హాకీ క్రీడాకారుల ఎంపిక తేదీ మార్పు వనపర్తిటౌన్: వనపర్తి హాకీ అకాడమీలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికను 24, 25 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. జూన్ 3, 4వ తేదీకి మార్చినట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్స్కు వచ్చే అభ్యర్థులు తేదీల మార్పు విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. -
ఫీజల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
గద్వాల: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ ఏడాది కూడా రకరకాల ఫీజుల పేరుతో యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. తక్షణమే ప్రైవేటు విద్యా సంస్థలలో జరిగే అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతనం డీఈఓ ఇందిరను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ మాట్లాడారు. ఈ ఏడాది విద్యా సంస్థలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాధికారులు ప్రైవేటు విద్యా సంస్థలపై దృష్టి సారించాలన్నారు. అధిక ఫీజుల నియంత్రణతో పాటు అకాడమిక్ పుస్తకాలు, యూనిఫారం, తదితర వాటి పేరిట చేసే దోపిడీని అరికట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్, నరేష్, వీరమోహన్, మురళి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ద్యేవుడా..
ధూపం, దీపం, నైవేద్యం.. సమర్పయామి! సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ధూప, దీప, నైవేద్య పథకంలో అక్రమాలకు అంతే లేకుండాపోయింది. కొరవడిన దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పలువురు జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది ధనదాహం వెరసి అవినీతి పర్వం మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నట్లుగా కొనసాగుతోంది. ముడుపులు, నజరానాలతో అక్రమార్కులు మాయాజాలం ప్రదర్శిస్తుండడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడుతోంది. విధులకు హాజరుకాకుండానే చక్రం తిప్పుతూ వేతనం కాజేస్తున్న అర్చకులు కోకొల్లలు కాగా.. లేని గుడి పేరిట ధూప, దీప, నైవేద్య పథకం కింద కొందరు నెలనెలా అప్పనంగా జీతాలు అందుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా నిరాటంకంగా కొనసాగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ.. రాష్ట్రంలో మూడు విడతల కింద 6,400 పైచిలుకు ఆలయాలను ధూప, దీప, నైవేద్య పథకానికి ఎంపిక చేశారు. ఈ మేరకు ఒక్కో ఆలయానికి అక్కడి అర్చకుడి పేరిట దేవాదాయ శాఖ నెలకు రూ.10 వేల చొప్పున అందజేస్తోంది. ఈ లెక్కన అన్ని ఆలయాలకు కలిపి ప్రభుత్వం నెలకు సుమారు రూ.6.40 కోట్లు చెల్లిస్తోంది. అయితే లేని గుడి పేరిట గద్వాల జిల్లా పులికల్లో ధూప, దీప, నైవేద్య పథకం పక్కదారి పట్టినట్లు వెలుగులోకి రాగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైతం ఈ అక్రమ బాగోతం నిరాటంకంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో సుమారు 190 ఆలయాలు ఉండగా.. 40 శాతం వరకు లేని గుళ్లను ధూప, దీప, నైవేద్య పథకానికి ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో సగం వరకు ఆలయాలు నిర్మాణంలో ఉన్నట్లు అర్చక సంఘాలు చెబుతున్నా.. వీటిని ముందస్తుగానే పథకం అమలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, జనగామతో పాటు దాదాపుగా అన్ని జిల్లాల్లో సైతం ఈ పథకం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మంజూరులోనే మాయ.. ధూప, దీప, నైవేద్య పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు నిర్దేశించింది. ఆలయ అర్చకులకు పూజా విధానంపై పరిజ్ఞానం ఉందా? లేదా? అని నిర్ధారించాలి. ఈ మేరకు అనుభవజ్ఞులైన అర్చకులతో ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీతో కలిసి అధికారులు స్వయంగా ఆయా ఆలయాలను సందర్శించడంతో పాటు అర్చకులను పరీక్షించాలి. త్రీమెన్ కమిటీ పేరుకు మాత్రమే కాగా.. అంతా అధికారులే అన్నీ తామై నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా పులికల్లో ఇదే జరిగినట్లు సమాచారం. ఈ పథకం కింద ఎంపిక చేయాలంటే పలు చోట్ల అధికారులు రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జిల్లా, ఆలయాన్ని బట్టి రేటు మారడంతో పాటు కొన్ని చోట్ల ముడుపులతో పాటు నజరానాల పర్వం సైతం నడుస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పులికల్ బాగోతంపై దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరిని ఫోన్లో సంప్రదించగా.. ‘విచారణ సమయంలో సెలవులో ఉన్నా. మరొకరు విచారణకు వెళ్లారు. ప్రస్తుతం విషయం తెలిసి ఈ ఆలయాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాం’ అని సమాధానం చెప్పారు. వైఎస్ హయాంలో పథకం అమల్లోకి.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకులు ఉపాధి లేకపోవడంతో పట్టణాలకు వలస వెళ్లేవారు. దీంతో అక్కడి ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు లేక గుడిగంటలు మూగబోయి అంధకారంలో ఉండిపోయాయి. హైందవ ధ ర్మానికి పునాది అయిన ఆలయాల్లో వెలుగులు నిండాలని అర్చక సమాఖ్య విజ్ఞప్తి మేరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ధూప, దీప, నైవేద్య పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఒక్కో అర్చకుడికి నెలకు రూ.2,500 వేతనంతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందులో అర్చకుడి భృతికి రూ. 1,500, ధూప, దీప, నైవేద్య ఖర్చులకు రూ. వెయ్యి కేటాయించారు. అనంతర కాలంలో అర్చకుల వేతనం రూ.6 వేలు.. ఆ తర్వాత రూ.10 వేలకు చేరుకుంది. అయితే దేవాదాయశాఖలో ఒకేచోట తిష్ట వేసి.. అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, సిబ్బంది నిర్వాకానికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో ఈపథకం లక్ష్యం నీరుగారుతోంది. గద్వాల జిల్లా పులికల్లో వెలుగులోకి.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం పులికల్ గ్రామంలోని మూడు ఆలయాలు (ఽగుంటి రంగనాథ ఆంజనేయస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరంగనాథ స్వామి) ధూప, దీప, నైవేద్య పథకానికి ఎంపికయ్యాయి. అయితే ఈ గ్రామంలో అసలు రంగనాథ స్వామి ఆలయమే లేదు. రాజపురంలో ఊరి చివర గుంటి రంగనాథస్వామి ఆలయం ఉంది. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఉత్సవాల సమయంలో పులికల్ నుంచి ఉత్సవ విగ్రహాలను రాజపురంలోని గుంటి రంగనాథస్వామి ఆలయానికి చేర్చి పూజలు చేయడం ఆనవాయితీ. దీన్ని సాకుగా చూపించి రాజపురంలో ఉండే గుంటి రంగనాథస్వామి ఆలయంతో పాటు పులికల్లోని తన ఇంటిని కూడా గుడిగా చూపించి ఈ పథకం మంజూరు చేయించుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖలోయథేచ్ఛగా అవినీతి పర్వం ముడుపులు, నజరానాలతో అక్రమార్కుల మాయాజాలం లేని గుడి పేరిట నెలనెలా రూ.10 వేలు కాజేస్తున్న అక్రమార్కులు -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు
గద్వాల: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్అపూర్వ్చౌహాన్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం క్రీడా పాఠశాలలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అపూర్వ్చౌహాన్ మాట్లాడుతూ 8–9 ఏళ్లలోపు బాలబాలికలు క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28న ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు మండల స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన 15–25 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారన్నారు. 3వ తరగతి పూర్తి చేసి, 01–09 2015 నుంచి 31–08–2016 మధ్యన జన్మించిన వారు అర్హులన్నారు. వివిధ క్రీడాంశాలలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఎంపిక పోటీలక హాజరయ్యే విద్యార్థులు తమ వెంట పాఠశాల బోనఫైడ్ సర్టిఫికేట్, 3వ తరగతి ఉత్తీర్ణత పత్రం, అధికారులు జారీ చేసిన కుల, పుట్టిన తేదీ ధ్రువ పత్రాలు, పది పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్, ఒరిజినల్ రెండు తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు జూలై నెలలో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్కడ ఎంపికై న విద్యార్థులకు క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఇందిర, డీవైఎస్ఓ బీఎస్ ఆనంద్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, ఎంఈఓ సురేష్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య
గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. గురువారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ఇంటర్మీడియట్ విద్య జిల్లా అధికారి హృదయరాజ్ పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీతో పాటు కళాశాలలో మౌళిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏఓ హరిలాల్, అధ్యాపకులు కలీముల్లా, పవన్కుమార్, నర్సింహులు, శిరీష, బాలకృష్ణ, శేఖర్, గోపి, వీరేశం, శేఖర్నాయక్, అనూష, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
గద్వాల క్రైం: గడువులోగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిందిగా పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ ఐడిఓసి కాన్ఫ్రెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. పంటల సాగు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పెండింగ్ పనులు, భూ సేకరణలో ఇబ్బందులను అదిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమయ్యే పనుల కోసం రూ.230 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చర్యల తీసుకుంటామన్నారు. విద్య, వైద్య విషయంలో నిర్లక్ష్యం తగదు విద్యా రంగంలో జిల్లా ఆగ్రగామిగా నిలవాలని, బడి బయటి పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేలా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, సిబ్బంది కొరత లేకుండా త్వరలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. త్వరలో సీఎం పలు అభివృదికధ పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు రానునట్లు తెలియజేశారు. అంతకు ముందు జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో జెడ్పీచైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ అపూర్వచౌహన్ తదితరులు పాల్గొన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులకు రూ.230 కోట్ల మంజూరుకు కృషి ఎంపీ మల్లు రవి -
రక్తహీనత నివారణకు కృషి
గద్వాల: ఏడాది వయసు నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని.. పిల్లల్లో రక్తహీనత నివారణకు కృషిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నులి పురుగుల నివారణ మాత్రలను వేయించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన రక్తహీనత నియంత్రిస్తుందని, పోషకాహారం మెరుగు పడుతుందని చెప్పారు. పిల్లల చేతులు ఎల్లప్పుడు శుభ్రంగా.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శశికళ, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, కౌన్సిలర్లు శ్రీనివాసులు, కృష్ణ, నరహరిగౌడ్, నాయకులు కృష్ణరెడ్డి, సత్యనారాయణ, యల్లప్ప, కోటేష్, పులిపాటి వెంకటేష్, లక్ష్మణ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దోషులను శిక్షించాలి..
మొలచింతపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై అమానుషంగా దాడి చేసి గాయపరిచిన బండి వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు శివను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం శిక్షించాలి. లేకపోతే చెంచు మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతాం. – చెన్నమ్మ, మహిళా సంఘం సభ్యురాలు హేయమైన చర్య.. చెంచు మహిళ ఈశ్వరమ్మపై గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు శివ, వెంకటేశ్వర్లు భార్య శివమ్మ విచక్షణ రహితంగా దాడి చేసి.. వికృత చర్యలకు పాల్పడటం హేయమైన చర్య. ప్రభుత్వం వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి. అలాగే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మి, మొలచింతపల్లి చెంచుగూడెం న్యాయం చేయాలి.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి సొంత వ్యవసాయ పొలంలో వారినే కూలీలుగా మార్చుకొని వారి మీదనే దాష్టీకం చేయడం దురదృష్టకరం. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. బాధిత చెంచులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. – నిమ్మల శ్రీనివాసులు, ఆదివాసి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాజకీయ ఒత్తిళ్లతోనే.. చెంచు మహిళపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. రాజకీయ ఒత్తిళ్లతో బాధిత కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం. ఈ ఘటనపై ఆదివాసీలు సంఘటితమై పోరాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. – మల్లికార్జున్, మాజీ సర్పంచ్, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం ● -
ప్రజల సహకారం మరువలేనిది
గద్వాల క్రైం: జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ అడుగులు వేసిందని ఎస్పీ రితిరాజ్ అన్నారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి శాసనసభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించామని, సిబ్బంది కృషి ఎంతో అభినందనీయమన్నారు. సాధరణ బదీలిలో బాగంగా హైద్రాబాద్ ఎసీబీ విభాగానికి బదీలి అయినట్లు ఎస్పీ తెలిపారు. అంతకు ముందు సిబ్బంది శాలువా, పూలబోకేలు, మెమోంటోలు అందజేశారు. ‘నీట్’ పేపర్ లీకేజీపై విచారణ జరపాలి గద్వాల అర్బన్: నీట్ పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో పీడీఎస్యూ, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మే నెలలో జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఓ విద్యార్థిని సుప్రిం కోర్టును ఆశ్రయించిందని, దీంతో నీట్ పరీక్షలపై అనుమానాలు బలపడ్డాయన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికి కేంద్రం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. నీట్ విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడిన వారిపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలు నిర్వహించే బాధ్యత నుంచి నాటను తప్పించాలని, ప్రతి రాష్ట్రంలో తమకు తామే పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. విద్యార్థులకు, దేశ ప్రజలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటియూ నాయకులు బాలకృష్ణ, ఆంజనేయులు, నర్సింహులు, తిరుపతన్న, రాముడు, పీడీఎస్యూ నాయకులు శ్రీనివాసులు, రాముడు, రవి, తేజ తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,439 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 205 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,439, కనిష్టం రూ.2451, సరాసరి రూ. 5589 ధరలు పలికాయి. అలాగే 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 5369 ధర వచ్చింది. 18 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 1874 ధర పలికింది. ఉపాధి కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 14వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన వారు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్ రిపేర్, మొబైల్ సర్వీసింగ్ రిపేరుపై శిక్షణ ఇస్తారన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్పై శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటో, కులం సర్టిఫికెట్లు జతచేయాలని కోరారు. -
581 పోస్టుల భర్తీకిటీజీపీఎస్సీ నోటిఫికేషన్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ సంక్షేమ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ విజయేందిర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారి గ్రేడ్– 1, గిరిజన సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారి గ్రేడ్– 2, దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు కార్యాలయంలో వార్డెన్ గ్రేడ్– 1, 2, మ్యాట్రన్ గ్రేడ్– 1, 2, మహిళా, శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోంలో మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 581 ఖాళీల భర్తీ చేస్తారన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 29 వరకు ఉదయం 10– 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30– 5 గంటల వరకు సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువీకరణ కోసం ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారని, ఉదయం 9.30 గంటలకు గేటు మూసివేస్తారన్నారు. -
అబలపై పైశాచికత్వం
పొలం పనికి రావడం లేదనే నెపంతో చెంచు మహిళపై అమానుష దాడి ● రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన ● నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ● కొల్లాపూర్లో ఖాకీల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఆడబిడ్డ అని జాలి చూపలేదు.. ఆమె ఇచ్చిన పొలమే సాగు చేసుకుని బతుకుతున్నాం అనే ధ్యాస మరిచారు.. తమ వద్దే పనిచేసుకునే నిరుపేద అనే సోయి లేకుండా.. అధికారులు మా మాట వింటారు.. ప్రజాప్రతినిధులు అండగా ఉంటారనే ధీమాతో సాటి మనుషులం అనే విచక్షణ కోల్పోయి వికృతంగా ప్రవర్తించారు.. తమను నమ్మి వచ్చి నిస్సహాయురాలైన ఆమైపె.. ఒళ్లు జలదరించే రీతిలో.. రెండురోజుల పాటు అమానుషంగా దాడి చేసి పైశాచికానందం పొందారు.. తాము ‘నాయకులం’ అని చెప్పుకొని ఊర్లో తిరుగుతూ.. మనిషి అనే వాడు సిగ్గుపడేలా.. అమాయకురాలైన ఆదివాసీ మహిళపై అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారు.. సాక్షి, నాగర్కర్నూల్/కొల్లాపూర్ రూరల్: తమ వారే అని నమ్మి రావడమే ఆమె పాలిట శాపమైంది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు వ్యక్తులు పాశవికంగా, వికృతంగా దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మపై అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్, శివ అమానుష దాడికి పాల్పడిన ఘటనపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలి సొంత పొలాన్ని కౌలుకు తీసుకుని, ఆమెను కూలీగా మార్చి.. భూ యజమానిపైనే పైశాచిన దాడికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా..ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను గురువారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల తీరుపై విమర్శలు.. చెంచు మహిళపై అమానుష దాడి పట్ల పోలీసుల ప్రవర్తన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకపోవడంపై రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన కొల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధి పోలీసుల తీరు తరుచుగా వివాదాస్పదం అవుతోంది. ఈ స్టేషన్కు వస్తున్న ఫిర్యాదులు, కేసుల విషయంలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిళ్ల మేరకు సింగోటం గ్రామానికి చెందిన వ్యక్తులను సివిల్ తగాదా.. భూ పంచాయతీలో నాలుగు రోజుల పాటు స్టేషన్కు పిలిపించుకుని లాఠీలతో విచక్షణ రహితంగా బాదినట్టు తెలిసింది. గతంలోనూ పొలిటికల్ ఒత్తిళ్ల మేరకు ఓ జర్నలిస్టును పోలీస్స్టేషన్లోనే దుస్తులు విప్పించి లాఠీలతో బా దారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నలుగురి అరెస్టు..
చెంచు మహిళపై అకారణంగా దాడి చేసి ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, నిందితులను రిమాండ్కు తరలిస్తామని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పోలీస్ష్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆయన భార్య శివమ్మ, వారి బంధువులు లింగస్వామి, లక్ష్మి అమానుషంగా దాడి చేసి.. చిత్రహింసలకు గురిచేసి.. ప్రత్యేక భాగాలపై డీజిల్ పోసి కాల్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఈ మేరకు బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. -
కంప్యూటర్ విద్య..అంతా మిథ్య
సర్కార్ బడుల్లోఅటకెక్కిన డిజిటల్ విద్య ● ఐటీసీ ప్రాజెక్టులో బడులకు ట్యాబ్లు ఇచ్చిన ప్రభుత్వం ● ఊసేలేని ‘మీనా ప్రపంచం’ రేడియో ప్రసారాలు ● వృథాగా మారిన రూ.లక్షల విలువైన ప్రింటర్లు, జనరేటర్లు ● పేద విద్యార్థులకు దూరం అవుతున్న సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు కార్పొరేట్స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యనందించాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రూ.లక్షలు వెచ్చించి కంప్యూటర్లు కొన్నప్పటికి వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవాళ్లు లేక మూలకు పడ్డాయి. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ ప్రస్తుత ఆధునిక ప్రపంచమంతా డిజిటలైజేషన్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో చాలామంది తల్లిదండ్రులు డిజిటల్ విద్య కోసం ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం సైతం డిజిటల్ విద్య కోసం చర్యలు చేపట్టింది. అందుకోసం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఐటీసీ కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ తరగతులు బోధించేందుకు ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, కేయాన్లను అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం కథలు, నాటికలు, ప్రముఖుల రేడియో ప్రసంగాలను వినిపించేందుకు ప్రత్యేకంగా ‘మీనా ప్రపంచం’ పేరుతో రేడియోలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 860 పాఠశాలలు ఉండగా.. ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ఒక్కో కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రభుత్వం రూ.లక్షల్లో ఖర్చు చేసి ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్కో ల్యాబ్కు సుమారు 8 నుంచి 11 మానిటర్లు, సీపీయూలు, ప్రింటర్లు, విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక జనరేటర్లను సైతం ప్రభుత్వం సమకూర్చింది. వీటికోసం ప్రత్యేకంగా ఒక గదిలో ఫర్నిచర్, కుర్చీలతో ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కంప్యూటర్ విద్యను నేర్పే బాధ్యతను ఐదేళ్ల పాటు ఎన్ఐఐటీ సంస్థకు అప్పగించగా.. ఆ కాంట్రాక్టు 2013తో ముగిసింది. ఆ తర్వాత పాఠశాలలోనే కొందరు టీచర్లుకు బాధ్యతలు అప్పగించారు. అయితే చాలా కంప్యూటర్లు మరమ్మతుకు గురవడం, సర్వీసింగ్ లేకపోవడంతో మూలకు పడ్డాయి. గతంలో వీటిపై విద్యార్థులకు ఎంఎస్ ఆఫీస్, ఫొటోషాప్, టైపింగ్ వంటివి నేర్పించేవారు. ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో అవన్నీ వృథాగా మారాయి. -
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
నులిపురుగుల నివారణలో భాగంగా ప్రతి విద్యార్థికి అల్బెండజోల్ మాత్ర వేయించి, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మిద్దామని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ఈ నెల 20న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం – అల్బెండజోల్ మాత్రల పంపిణీ ఏర్పాట్లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు, వసతిగృహాలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికి మాత్రలు వేయించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వర్షపునీరు గుంతల్లో నిలవకుండా చూడలన్నారు. మురుగునీటి కాల్వలు ప్రతిరోజు శభ్రం చేస్తూ, దోమలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా, లీకేజీలను గుర్తించి, అరికట్టాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ, క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అనంతంరం కలెక్టర్ అధికారులతో కలిసి జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ శశికళ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్దప్ప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆక్టర్ నవీన్క్రాంతి, డీఆర్డీఓ నర్సింగరావ్, డీపీఓ వెంకట్రెడ్డి, ఇంటర్మీడియేట్ జిల్లా నోడల్ అధికారి హృదయరాజ్, బీసీ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అఽధికారి శ్వేత ప్రియదర్శినితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పునరావాస కేంద్రాల్లో పనులు వేగవంతం చేయండి
గద్వాల న్యూటౌన్: నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగంగా రిజర్వాయర్ల పరిధుల్లోని నిర్వాసిత గ్రామాలకు నిర్మించిన పునరావాస కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్ల పరిస్థితులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో నిర్వాసితుల సౌకర్యార్థం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర భవనాలను నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని సూచించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కింద ఉన్న రిజర్వాయర్ల నీటి సామర్థ్యం, ఆయకట్టు, వివిధ ప్యాకేజీ పనుల పరిస్థితి, ఇంకా చేయాల్సిన భూసేకరణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తిపొతల పథకం కోసం ఇప్పటి దాకా సేకరించిన భూముల వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీఎస్ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు అనుకున్నంత స్థాయిలో నీటిని వినియోగించకపోవడానికి కారణాలు, తుమిళ్ళ రిజర్వాయర్ల ద్వార ఎంత నీటిని ఆయకట్టుకు అందించే అవకాశం ఉందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుర్రంగడ్డ గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న వంతెన పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జిల్లాలోని ఆయా ప్రాజెక్ట్ల భౌగోళిక మ్యాప్లను పరిశీలించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎసీ శ్రీనివాసరావు, ఈఈలు రహీముద్దీన్, వెంకటేశ్వర్రావ్, జుబేర్ అహ్మద్, విజయ్కుమార్రెడ్డి, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి కృషి
వనపర్తి: కార్మికుల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బుద్దారం మురహరి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన ఐఎన్టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి కార్మికుడికి లేబర్కార్డు అందించి ప్రభుత్వం కల్పించే అన్ని వసతులు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని వివరించారు. అనంతరం మురహరిని సంఘం జిల్లా కార్యవర్గం సన్మానించింది. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు గిరిజ, నర్మద, అమరచింత మండల అధ్యక్షుడు దాస్, నరేష్, కవిత పాల్గొన్నారు. మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలోని మైనార్టీ నిరుద్యోగ యువతకు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రవీంద్రనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 45 రోజులపాటు (ఉమ్మడిగా, నాన్ రెసిడెన్షియల్) శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఐడీఓసీ భవనంలోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించరాదని పేర్కొన్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు www.tsbcstudycircle. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న అభ్యర్థులకు 9నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్స్తోపాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,289 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు బుధవారం 148 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6289, కనిష్టం రూ. 3249, సరాసరి రూ. 5589 ధరలు పలికాయి. అలాగే, 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5460, కనిష్టం రూ.3010, సరాసరి రూ.3010 ధరలు వచ్చాయి. 21 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం రూ. 2326, కనిష్టం రూ.2169, సరాసరి రూ.2326 ధరలు పలికాయి. క్వింటాల్ కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.7116 వచ్చింది. స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర దేవరకద్ర/ జడ్చర్ల: ఉల్లి ధర స్వల్పంగా తగ్గింది. గత నెలలో రూ. 2వేలు దాటని ఉల్లి ధర.. సీజన్ తగ్గిన తర్వాత అమాంతం పెరిగింది. గత వారం ఏకంగా రూ. 3 వేలు దాటిపోయింది. ఈ వారం కొంతమేర ధర తగ్గడంతో కొనుగోలు దారులు ఊరట చెందారు. బుధవారం దేవరకద్ర మార్కెట్కు దాదాపు 300 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 2,900, కనిష్టంగా రూ. 2,200 ధరలు పలికాయి. 45 కేజీల ఉల్లి బస్తాను రూ. 1,100 నుంచి రూ. 1,500 వరకు విక్రయించారు. ఆర్ఎన్ఆర్ రూ. 2,650 దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ. 2,650, కనిష్టంగా రూ.2,629 ధరలు వచ్చా యి. ఆముదాలు రూ.5,650 ధర పలికింది. మొక్కజొన్న రూ. 2,517 బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్క జొన్న గరిష్టంగా రూ. 2,517, కనిష్టంగా రూ. 2,086 ధరలు పలికాయి. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ. 2,329, కనిష్టంగా రూ. 1,919, హంస గరిష్టంగా రూ. 1,858, కనిష్టంగా రూ. 1,819, జొన్నలు గరిష్టంగా రూ. 5,321, కనిష్టంగా రూ. 4,100, వేరుశనగ రూ. 4,309 ధరలు వచ్చాయి. 22న స్పీడ్ సైక్లింగ్ పోటీలు మక్తల్: పట్టణంలో రాష్ట్ర సైక్లింగ్ పోటిలను ఈనేల 22 తేదీన మీనీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి విశ్రాంత పీటీ గోపాలం తెలిపారు. బుధవారం మక్తల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24, 25వ తేదీల్లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ అకాడమీలో ప్రవేశం కోసం పోటీలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ప్రతిభ కనబర్చిన వారిని ఈ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. 12 నుంచి 15 సంవత్సరాలలోపు బాలురు పోటీల్లో పాల్గొనాలని, 5కిలోమీటర్లు ఉంటుందని, పాల్గొనే వారు బోనోపైడ్, ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, డీవైఎస్ఓ వెంకటేష్ పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. -
నులిపురుగులు నివారిద్దాం
గద్వాల క్రైం: నులిపురుగుల కారణంగా చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని, వాటి నివారణకు పిల్లలకు తప్పనిసరిగా ఆల్డెండజోల్ మాత్రలు అందించాలని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారిణి శశికళ అన్నారు. గురువారం ఈమాత్రల పంపిణీ చేపట్టనుండగా.. బుధవారం ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వైద్యాశాఖ ఆధ్వర్యంలో జెండా ఊపి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ముందుగా ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నులి పురుగులు వల్ల చిన్నారులు రక్తహీనతకు గురికావడంతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయని, ఆహారం సహించకపోవడం, ఆకలి ఉండక వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందన్నారు. జెండా ఊపి ర్యాలీ చేపట్టిన జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శశికళ -
ఉన్నతాధికారుల దృష్టికి..
మా పాఠశాలకు గతంలో 11 కంప్యూటర్లు అందించి ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. కానీ, వీటిని కొన్నేళ్లుగా వినియోగించకపోవడంతో చాలా వరకు మరమ్మతుకు గురయ్యారు. వీటిని బాగు చేసేందుకు ఒక్కో కంప్యూటర్కు రూ.500 చొప్పున ఖర్చు అవుతుందని తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు స్పందించి మరమ్మతు చేసి అందుబాటులోకి తెస్తే సాంకేతిక విద్య విద్యార్థుల దరిచేరుతుంది. – దెబోరా, కొనపాలమూరు పాఠశాల హెచ్ఎం, మహబూబ్నగర్ వాడుకలోకి తెస్తాం.. జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లను మళ్లీ వాడుకలో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని కంప్యూటర్లు పని చేస్తున్నాయో వివరాలు సేకరించి.. రీపేర్లు అవసరమయ్యే వాటికి మరమ్మతులు చేయిస్తాం. – రవీందర్, డీఈఓ -
డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూప్లకు సంబంధించి సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం పాలమూరు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి విడుదల చేశారు. 2వ సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 919 మందికి గాను 355 మంది, 4వ సెమిస్టర్లో 935 మందికి గాను 489 మంది, 6వ సెమిస్టర్లో 919 మందికి గాను 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్, అడిషనల్ కంట్రోలర్ నాగభూషణం, శాంతిప్రియ, విజయలక్ష్మి, సత్యనారాయణగౌడ్, ఈశ్వరయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి కోటిలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శ్రీదత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 19న ఉదయం 9గంటల నుంచి సంకల్పసిద్ధి కాలభైరవ పాశుపత హోమాలు, 20న జ్యేష్టశుద్ధ చతుర్దశి సందర్భంగా కోటిలింగేశ్వర స్వామికి పుష్పాభిషేకం, బిల్వాభిషేకాలు, 21న జ్ఞానాంభికాదేవికి పుష్పాభిషేకం, 22న అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
బీమా క్లెయిమ్స్ను వెంటనే విడుదల చేయాలి
గద్వాల అర్బన్: పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బీమా క్లెయిమ్స్ను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టీయూ అనుబంధ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సి.కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2022సంవత్సరం నుండి ఇప్పటి వరకుబీమా క్లైయిమ్స్ పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వందలాది ఫైల్స్ ఏఎల్ఓ పరిధిలో పెండింగ్లో ఉన్నాయన్నారు. అయినప్పటికి పట్టించుకోకుండా విధులకు సక్రమంగా రాకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కొంత మంది కార్మికశాఖ అధికారులు ఫైల్స్ను వారి ఇళ్లకు తీసుకెళ్తున్నారని, వాటిలో కొన్ని పత్రాలు ఎక్కడో పడిపోతే మళ్లీ తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే విడుదల చేయాలని, కార్మికశాఖ కార్యాలయాన్ని ఐడీఓసీ కార్యాలయంలోకి మార్చాలని, ఏఎల్ఓను బదిలీ చేయాలని, కంప్యూటర్ ఆపరేటర్ను మార్చాలనిడిమాండ్ చేశారు. అనంతరం కార్మికశాఖ ఏసీఎల్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో భవన, ఇతర నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్, నాయకులు అంజి, ప్రేమ్రాజు, దుబ్బన్న, తిమ్మన్న, రమేష్ కుమార్, గోవిందు తదితరులు ఉన్నారు.