-
No Headline
అనంతపురం: ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో నాణ్యత ప్రమాణాల మదింపు కోసం నియమించిన నిజనిర్ధారణ కమిటీ(ఫ్యాక్ట్స్ అండ్ ఫైండ్ కమిటీ)ల పరిశీలన పూర్తయింది. ఇంజినీరింగ్ కళాశాలలు ప్రతి ఏటా ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అనుమతి పొందాల్సి ఉంటుంది. అనంతరం యూనివర్సిటీ అనుబంధ హోదా గుర్తింపు తీసుకోవాలి. ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మొత్తం 75 ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి మంజూరు చేసింది. అనంతరం యూనివర్సిటీ అనుబంధ హోదాకు ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకోవడంతో నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు, విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి, అధ్యాపకుల అర్హతలు, గ్రంథాలయం, ఆటస్థలం, ప్రయోగశాలలు, కళాశాల క్యాంటీన్, విద్యార్థుల హాస్టల్ సదుపాయాలు, కళాశాలలకు న్యాక్ గ్రేడింగ్ ఉందా.. లేదా.. వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన బాధ్యత నిజ నిర్ధారణ కమిటీ సభ్యులదే. గత మూడు రోజుల నుంచి నిజ నిర్ధారణ కమిటీలు ఆయా కళాశాలలను సందర్శించి నివేదికను అందజేశాయి. శుక్రవారం కమిటీల పరిశీలన ముగిసింది. పాలక మండలి అనుమతి అనంతరం ఇంజినీరింగ్ కళాశాలలకు సీట్లు కేటాయించనున్నారు. ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో జేఎన్టీయూ అనంతపురం ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 75 ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ గుర్తింపు కళాశాలల్లో ముగిసిన నిజనిర్ధారణ కమిటీల పరిశీలన -
ప్రజాప్రయోజన కేసులపై అవగాహన
అనంతపురం: న్యాయ సేవా సదన్లో వివిధ ప్రజా ప్రయోజన సేవ శాఖల ప్రభుత్వ అధికారులకు శాశ్వత లోక్ అదాలత్లో ప్రజా ప్రయోజన కేసుల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా ప్రయోజనాల శాశ్వత లోక్ అదాలత్ ధర్మాసనం చైర్మన్/ న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి జి.శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ అటు రాజీ మార్గంలో పరిష్కారానికి కృషి చేస్తూ, రాజీ కుదరని పక్షంలో తీర్పు వెలువరించగల అధికారం కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు ఎం.రాజశేఖర్రెడ్డి, ప్రధాన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది ఇటికె నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బీసీ వెల్ఫేర్ అధికారి కుష్బూ కొఠారి, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ సంగీతకుమారి పర్యవేక్షణలో నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో గురువారం 6, 8 తరగతులకు, శుక్రవారం 7, 9 తరగతులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 63 సీట్లకు 1,301 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 957 మంది హాజరయ్యారు. మహిళపై ఎలుగుబంటి దాడి అమడగూరు: ఎలుగుబంటి దాడిలో ఓ మహిళా కూలి తీవ్రంగా గాయపడింది. వివరాలు... అమడగూరు మండలం మలకవారపల్లికి చెందిన అంగజాల గంగులమ్మ శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లింది. పనులు ముగించుకున్న తర్వాత ఇంటి దారి పట్టిన ఆమైపె పొదల్లో నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. ఆ సమయంలో ఆమె గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో ఎలుగుబంటి కొండల్లోకి పరుగు తీసింది. గాయపడిన గంగులమ్మను కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి హరిప్రసాద్... ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం కదిరి అర్బన్: చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తరఫున తగిన ప్రోత్సాహం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో పుట్టపర్తి ఏరువాక కో ఆర్డినేటర్ డా. ఎం జాన్సన్, శాస్త్రవేత్త రామసుబ్బయ్య ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావుతో పాటు, కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్నా రాజేష్, ఏడీఏ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చిరుధాన్యాల వల్ల రైతులకు ఆదాయం, వాటిని ఆహారంగా తీసుకునే ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం జిల్లాలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మడకశిర ప్రాంతంలో రాగి, కదిరి ప్రాంతంలో సజ్జ ఎక్కువగా సాగు చేస్తారన్నారు. ఆయా పంటల్లో లభించే పోషక విలువలు వివరించారు. చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి తెలిపారు. అనంతరం సజ్జ సాగులో మెలకువలు అనే పుస్తకాన్ని రైతులకు అందజేశారు. రాగి, కొర్ర, సామ, సజ్జ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. సమావేశంలో శాస్త్రవేత్త మాధవీలత, మండల వ్యవసాయాధికారులు, ఆర్బీకే సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పరిహారం పంపిణీకి ‘టాస్క్ఫోర్స్’
పుట్టపర్తి అర్బన్: జాతీయ రహదారుల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులందరికీ వీలైనంత త్వరగా పరిహారం అందజేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తెలిపారు. ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు జేసీ ఆదేశించారు. శుక్రవారం ఆయన, కలెక్టరేట్లోని కోర్టు హాలులో భూసేకరణ, రైతులకు పరిహారం పంపిణీపై అధికారులతో సమీక్షించారు. పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, నేషనల్ హైవే అధికారి గిడ్డయ్య, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు వెంకటశివరామిరెడ్డి, సన్నీ వంశీకృష్ణ, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఎన్హెచ్–716జీ ఏర్పాటులో భాగంగా కొత్తపల్లి–గోరంట్ల మధ్య రైతుల భూములు సేకరించామన్నారు. వారికి పరిహారం చెల్లించడానికి టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూములకు సంబంధించిన ఆధారాలతో పాటు రైతు బ్యాంకు వివరాలతో నోటీసులు అందజేయాలన్నారు. అవార్డు ద్వారా లబ్ధి పొంది రైతు పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం, మొత్తం రిమార్కుల జాబితాను ఈనెల 24వ తేదీ నాటికి సిద్ధం చేయాలన్నారు. సుమారు రూ.11.04 కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఎన్హెచ్–342 ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పుట్టపర్తి మండలం ఎనుములపల్లి, బ్రాహ్మణపల్లి, కప్పలబండ, జగరాజుపల్లి, పెడపల్లి, గోరంట్ల మండలం మల్లాపల్లి, పెనుకొండ డివిజన్లో శెట్టిపల్లి, కోడూరు గ్రామాల రైతులకు వీలైనంత త్వరగా పరిహారం అందజేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కదిరి బైపాస్ ముదిగుబ్బ రోడ్డు పరిహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల్లో ఓడీ చెరువు మండలం ఇనగలూరు గ్రామ రైతులకు పరిహారం అందిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మేలు చేస్తాం వీలైనంత త్వరగా పరిహారం అందించేందుకు చర్యలు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ -
●కమనీయం..చింతపూల ఉత్సవం
కదిరి అర్బన్: అభయమిచ్చే ఖాద్రీశునిగా... కోర్కెలు తీర్చే వసంతవల్లభునిగా భక్తజనులతో పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి శుక్రవారం చింతపూల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కదిరి తుమ్మలరోడ్లో ఉన్న కుంతీ తీర్థం వద్ద జరిగిన ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవారు దేవేరులతో కలిసి ఆలయం నుంచి బయలుదేరి చింతపూల మంటపం చేరుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరువీధుల ఉత్సవం నిర్వహించారు. -
కోటంక సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో చోరీ
గార్లదిన్నె: ప్రసిద్ధ కోటంక కొండలోని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ దుండగులు చొరబడి హుండీలు పగులగొట్టి, బీరువాలు తెరిచి అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు గురువారం రాత్రి 7.30 గంటలకు పూజలు నిర్వహించిన అనంతరం తలుపులకు తాళం వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఓ భక్తుడు ఆలయం వద్దకు వెళ్లగా తలుపులు తెరచి ఉండటం, పూజారులెవరూ లేకపోవడం గమనించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులు, ఈఓ బాబుకు తెలియజేశారు. వారి ద్వారా సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ మహమ్మద్ గౌస్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈఓ బాబు, సీఐ శ్రీధర్ మాట్లాడుతూ అర్ధరాత్రి దుండగులు ఆలయం వద్దకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోందన్నారు. నాలుగు హుండీల్లో రెండు పగులగొట్టి భక్తులు సమర్పించిన నగదు తదితర కానుకలు ఎత్తుకుపోవడంతో పాటు గర్భగుడికి కన్నం వేసి లోనికి ప్రవేశించి బీరువాలోని 8 తులాల బంగారం ఆభరణాలు, 7.5 కిలోల వెండి అన్నీ కలిపి 19 రకాల ఆభరణాలు దొంగిలించినట్లు వెల్లడించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి.. వేలి ముద్రలు సేకరించారు. అనంతరం పోలీసులు ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో మిగిలిన బంగారు ఆభరణాలు లెక్కించి బ్యాంక్ లాకర్లో భద్రంగా ఉంచాలని సూచించారు. ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టామని సీఐ శ్రీధర్ తెలిపారు. బంగారు, వెండి ఆభరణాల అపహరణ -
4 రోజుల్లో హాస్టల్ రూపురేఖలు మారాలి
శెట్టూరు: అసంబద్ధంగా ఉన్న హాస్టల్లో నాలుగు రోజుల్లోపు మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలకు సిద్ధం కావాలని శెట్టూరు ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ షరీఫ్బాషాను జేసీ కేతన్గార్గ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ ఎీస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, స్టాక్ రూమ్లో బియ్యం, కందిపప్పు, చిక్కీ తదితర సరుకుల నాణ్యత, విద్యార్థుల గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. గదులన్నీ అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. 70 మందికి 3 లీటర్ల పాలా! హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను ఆరా తీయడంతో మొత్తం 70 మంది ఉన్నారని వార్డెన్ షరీఫ్బాషా సమాధానమిచ్చారు. రోజుకు ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటున్నారని ప్రశ్నించడంతో మూడు లీటర్లు అని వంట మనిషి మహబూబీ తెలిపారు. దీంతో జేసీ ఆశ్చర్యపోయారు. 70 మందికి 3 లీటర్ల పాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రోజు వారీ మెనుపై జేసీ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ల్లో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడం, సరైన వైరింగ్, బల్బలు, ఫ్యాన్లు లేకపోవడాన్ని గమనించి మండల ఎలక్ట్రికల్ ఏఈ జయకృష్ణపై మండిపడ్డారు. తక్షణమే సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. తీసుకుంటున్న జీతానికి సరైన న్యాయం చేయాలన్నారు. అన్నీ సమస్యలే... హాస్టల్ విద్యార్థులతో జేసీ సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను విద్యార్థులే ఏకరవు పెట్టారు. హాస్టల్లో ఉన్న హెల్పర్ మద్యం మత్తులో విధులకు హాజరవుతుంటారన్నారు. వంటి మనిషి మహబూబీ విధులకు హాజరు కాకుండా ఇతర వ్యక్తులతో వంట చేయిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుచి లేకపోవడంతో భోజనాన్ని తినలేకపోతున్నామన్నారు. దోమల విపరీతంగా ఉన్నాయని, దీంతో రాత్రంతా జాగారణ చేయాల్సి వస్తోందని వాపోయారు. ఆరు బయటే స్నానాలు చేస్తున్నామన్నారు. మరుగుదొడ్లు ఉన్న నీటి వసతి లేక పోవడంతో ముళ్ల కంపల్లోకి వెళ్లాల్సి వస్తోందన్నారు. రాత్రి సమయాల్లో టాయిలెట్కు వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పరిసరాలు శుభ్రతలేక కంపుకొడుతున్నాయని, ఇప్పటికై నా తమ ఇబ్బందులు గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన జేసీ హాస్టలో నెలకొన్న సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకున్న జేసీ కేతన్గార్గ్ వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న సోషల్ వెల్ఫేర్ జేడీ మధుసూదన్, తహీసీల్దార్ శ్రీదేవి, ఎంీపీడీఓ నరసింహమూర్తి, ఎంఈఓ శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. నాలుగు రోజుల్లోపు వసతి గృహంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు మెరుగు పడాలని ఆదేశించారు. హాస్టల్లో ఇప్పటి వరకూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ నెల 25న మరోసారి తాను హాస్టల్ పరిశీలనకు వస్తానని అప్పటికి ఈ పనులన్నీ పూర్తి చేసి ఉండాలన్నారు. లేకపోతే శాఖపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. విద్యతోనే వ్యక్తికి గౌరవం హాస్టల్ పరిశీలన అనంతరం పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను జేసీ సందర్శించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వేస్తున్న ఆసనాలు గమనించారు. అనంతరం పాఠశాలలో చదువుతూ జాతీయ పుట్బాల్ పోటీలో పాల్గొన్న విద్యార్థి నవ్యను అభినందించారు. తాను కూడా ఇలాంటి పాఠశాల స్థాయి నుంచే వచ్చానని, ఇష్టంతో చదువుకుని తల్లిదండ్రులకు, జిల్లాకు మంచిపేరు తీసుకోరావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు ఫిరోజ్ ఖాన్, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధిత అధికారులకు జేసీ కేతన్గార్గ్ ఆదేశం ఆరు బయటే స్నానాలు చేస్తున్న విద్యార్థులు నీటి సౌకర్యం లేక ముళ్లకంపల్లో మలవిసర్జన హాస్టల్ తనిఖీలో వెలుగు చూసిన వైనం -
మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
హిందూపురం అర్బన్: న్యాయవాదులు, కక్షదారులు, పోలీసులు సమన్వయంతో ఈ నెల 29న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. శుక్రవారం అదనపు జిల్లా కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే అవకాశం ఉందా? లేదా అన్న విషయంపై చర్చించారు. అనంతరం ఏడీజే మాట్లాడుతూ చిన్నపాటి తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, భార్య భర్తల మద్య చోటు చేసుకున్న మనస్పర్థలు, భూతగాదాలు తదితర వాటిల్లో కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు మానసికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందుకే లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సుకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, వివిధ స్టేషన్ల ఎస్ఐలు, లోక్ అదాలత్ సిబ్బంది శారద, హేమావతి పాల్గొన్నారు. చిన్నారి ఆచూకీని పసిగడతాం : ఎస్పీ నార్పల: మండల కేంద్రంలో గురువారం అదృశ్యమైన చిన్నారి పావని ఆచూకీని పసిగట్టి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి అన్నారు. శుక్రవారం నార్పల పర్యటనకు వచ్చిన ఆమె బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని తొందర్లోనే చిన్నారి ఆచూకీ తెలుసుకుంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆమె వెంట సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష పరిధిలోని భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలందించే ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో ఏపీసీ వైఖోమ్ నిదియాదేవి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. రెండు పోస్టులకు గాను ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీసీతో పాటు కమిటీ సభ్యులుగా ఉన్న ఇద్దరు వైద్యులు, ఐఈ కో–ఆర్డినేటర్ షమా పాల్గొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిజియోధెరపి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ సందర్భంగా షమా తెలిపారు. విత్తన దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ గార్లదిన్నె: మండలంలోని కల్లూరులో ఉన్న విత్తన విక్రయ దుకాణాలను శుక్రవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. న్యూనందిని సీడ్స్, న్యూ అమృత సీడ్స్ దుకాణాల్లో రికార్డులు పరిశీలించారు. తనిఖీల్లో ప్రొడ్యూస్ సర్టిఫికేట్ చూపించుకోవడం, భౌతిక నిల్వల్లో వ్యత్యాసాలు, స్టాక్ బోర్డు రిజిస్టర్ నిర్వహణలో లోపాలను గుర్తించారు. రూ.1.08 లక్షలు విలువ చేసే 24.80 క్వింటాళ్ల వరి విత్తనాల విక్రయాలు నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు మాసూమ్బాషా, ఫణిప్రకాష్, ఎస్ఐ ఫణీంద్రనాథరెడ్డి, గార్లదిన్నె ఏఓ సోమశేఖర్ పాల్గొన్నారు. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి గుత్తి: స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన అశోక్, సురేఖ దంపతుల కుమారుడు నాలుగేళ్ల నానిపై శుక్రవారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అటుగా వచ్చిన రెండు కుక్కలు ఉన్నఫళంగా బాలుడిపై విరుచుకుపడ్డాయి. స్థానికులు గమనించి కుక్కలను అదిలించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, చికిత్స చేయించారు. -
టీడీపీ దాడులు అమానుషం
● వైఎస్సార్సీపీ హయాంలో రూ.3,500 కోట్లతో ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి ● నియోజకవర్గాన్ని మంత్రి కేశవ్ మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా ● ఐదేళ్లూ ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తాం ● విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: గత ఐదేళ్లూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ఒక్క రోజూ టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన దాఖలాలు లేవని, అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల వ్యవధిలోనే ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస దాడులు చోటు చేసుకోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ దాడులు అమానుషమన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, యువనేత వై.ప్రణయ్రెడ్డి ధైర్యం చెబుతూ అండగా ఉంటామంటూ భరోసానిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ మాట్లాడారు. ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు, ఉపసర్పంచ్లపై దాడులను ఖండించారు. ఇది మంచి పద్దతి కాదని, ఈ విషసంస్కృతిని వీడాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. లేకుంటే ప్రతిఘటించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. దశాబ్దాలుగా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా దశాబ్దాలుగా పేరుకుపోయిన ఎన్నో సమస్యలకు గత ఐదేళ్ల జగన్ సర్కార్లో పరిష్కారం చూపామన్నారు. 3వేల మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయడంతో పాటు, పక్కా గృహాలు నిర్మించి ఇచ్చామన్నారు. రూ.3,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేశామన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద రూ.2,500 కోట్ల లబ్ధిని రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేశామన్నారు. రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. కేశవ్కు క్యాబినెట్ హోదా దక్కడాన్ని స్వాగతిస్తున్నా దశాబ్దాల తర్వాత ఉరవకొండకు క్యాబినెట్ హోదా దక్కిందని, దీనిని స్వాగతిస్తూ మంత్రి కేశవ్ను అభినందిస్తున్నానన్నారు. మంత్రిగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఉరవకొండలో నిర్వహించిన ఆసరా సభలో మాట్లాడుతూ... నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.2,062 కోట్లు మంజూరు చేస్తామని భరోసానిచ్చారని గుర్తు చేశారు. అయితే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చినందున ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం నుంచి రాబట్టి నియోజకవర్గ సాగునీటి కష్టాలు దూరం చేయడంపై మంత్రి కేశవ్ దృష్టి సారించాలన్నారు. హంద్రీనీవా ద్వారా 76 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ చానల్ నిర్మాణం, వజ్రకరూరు మండలంలోని చెరువులకు నీటిని అందించేలా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల నిర్మాణం, జీడిపల్లి గ్రామానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేశవ్పై ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ నరసింహులు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ సుశీలమ్మ, వైస్ ఎంపీపీ వై.శ్రీనాథరెడ్డి, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరన్న, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు బసవరాజు, కురుబ, ఎంబీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు గోవిందు, వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ బాలుర హాస్టల్ పరిశీలన
బ్రహ్మసముద్రం : మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్రావు, ఏడబ్ల్యూఓ దామోదరరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక వసతులు, పరిసరాలు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. నాణ్యమైన భోజనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచిత డిగ్రీ అనంతపురం: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగంతో పాటు ఉచితంగా డిగ్రీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 20 సంవత్సరాల్లోపు వయస్సు, 2023, 2024లో ఇంటర్మీడియట్ (బైపీసీ, ఎంపీసీ, ఎంఎల్టీ విత్ బ్రిడ్జి కోర్సు) ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికై న వారు టెక్నికల్ ట్రైనీగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. పదో తరగతిలో 60 శాతంతో ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 24న అనంతపురం శివారులోని ఉప్పరపల్లి రోడ్డులో ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు 63032 04295, 91820 63878లో సంప్రదించవచ్చు. బొలెరో ఢీకొని వ్యక్తి మృతి కళ్యాణదుర్గం రూరల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నరసింహులు(45) వ్యక్తిగత పనిపై శుక్రవారం బొట్టువానిపల్లికి వెళ్లాడు. పని ముగించుకున్న ఆయన ద్విచక్ర వాహనం స్వగ్రామానికి వెళుతుండగా దేవేంద్రపురం గ్రామం గేట్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో నరసింహులు కాలు, చెయ్యి విరిగాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై బొలెరో వాహనాన్ని వెంబడిస్తూ పీటీఆర్ పల్లి వద్ద డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కోనుప్పలపాడు ఘటనలో 27 మందిపై కేసు నమోదు
యాడికి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా యాడికి మండలం కోనుప్పలపాడులో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న గొడవకు సంబంధించి మొత్తం 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరచకు ఇన్చార్జ్ సీఐ జనార్దననాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు తనపై దాడి చేశారంటూ టీడీపీకి చెందిన ఓబన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం 27 వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా, ఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీ నేతలు గంగిరెడ్డి, మంగల చంద్ర, బాలకృష్ణపై టీడీపీకి చెందిన 70 మంది రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అలాగే అధికారాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికలు ముగిసిన దాదాపు 30 రోజులకు పైబడిన తర్వాత ఈ నెల 19న టీడీపీ నాయకుడు ఓబన్న ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు తక్షణమే కేసులు బనాయించడం దుర్మార్గమని ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తుండడం బాధాకరమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదుపై స్పందించని పోలీసులు ఘటన జరిగిన రోజే బాధితుల ఫిర్యాదు 30 రోజుల తర్వాత టీడీపీ నేత చేసిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు పోలీసుల తీరుపై వెల్లువెత్తిన విమర్శలు -
వైభవంగా శ్రీగిరి రఽథోత్సవం
పుట్టపర్తి రూరల్: పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి నాడు శ్రీగిరి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద అందంగా అలంకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ రథాన్ని లాగారు. ప్రశాంతి నిలయం, విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, చింతతోపు, శివాలయం వీధి, హనుమాన్ కూడలి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశవిదేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. -
● తెర చాటున దానిమ్మ
ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకున్న రైతులు పంటల సాగులో వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. ఉద్యాన తోటల సాగులో మరింత మెలకువలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో తెగుళ్ల బారి నుంచి దానిమ్మ పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించి, ఆచరణలో పెట్టాడు. కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద రైతు అంజి తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన దానిమ్మ పంట విరగ్గాసింది. ఈ క్రమంలో కాయల నాణ్యత దెబ్బతినకుండా మొత్తం చెట్టుకే తెరను చుట్టి పెట్టాడు. ఫలితంగా తాను ఆశించినట్లుగానే నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:దానిమ్మ చెట్లకు కట్టిన తెరలు -
జీవన యోగం
పుట్టపర్తి టౌన్: మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని వక్తలు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. విద్యాలయాలు, వసతి గృహాల్లో విద్యార్థులతో ఆసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అలాగే వివిధ సంస్థలు కూడా యోగా విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి పాల్గొని స్వయంగా వివిధ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారంతో పాటు యోగా కూడా అవసరమన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో యోగా గురువు తిరుమలేషు, డీఎస్పీలు వాసుదేవన్, విజయకుమార్, ఆర్ఐలు రవికుమార్, చంద్రశేఖర్, సీఐలు కొండారెడ్డి, హేమంత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం స్వయంగా ఆసనాలు వేసిన ఎస్పీ మాధవరెడ్డి -
ఏపీఆర్ఎస్లో పిల్లలు చదవడం అదృష్టం
పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చదవడం వారి అదృష్టంగా తల్లిదండ్రులు భావిస్తున్నారని ఏపీఆర్ఈఐ రాష్ట్ర సంయక్త కార్యదర్శి ఉబేదుల్లా తెలిపారు. గురువారం ఆయన పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ మురళీధర్బాబు ఆయనకు స్వాగతం పలకగా ప్రతి తరగతి గదితో పాటూ డార్మెటరీలు, కుకింగ్ గది, క్రీడామైదానం, డిజిటల్ ల్యాబ్, ఆవరణంలో కలియ తిరిగారు. ఐదు దశాబ్ధాలుగా పాఠశాలలో జరిగిన అభివృద్ధితో పాటూ విద్యాభ్యాసాలు, ఉత్తీర్ణత అంశాలపై ప్రిన్సిపాల్తో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదివిన వేలాది మంది విద్యార్థులు దేశ, విదేశాలలో ఉన్నత శిఖరాలలో ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రత్యేకంగా కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన పాఠశాలగా నిలబడటం మన రాష్ట్రానికే గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. ఇక్కడ చదివిన వారంతా అత్యున్నత స్థాయిలలో ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అలాగే పీఎం శ్రీ ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు. వసతులు భేష్.. పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరుగుతుండటం శుభపరిణామని ఉబేదుల్లా కొనియాడారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఏపీఆర్స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించడం హర్షణీయమన్నారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా స్థానిక ఏపీఆర్ జూనియర్ కాలేజ్లో అధ్యాపక బృందంలో నెలకొన్న వివాదంపై ఏపీఆర్ఈఐ సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్యటించినట్లు సమాచారం. సమగ్ర దర్యాప్తు చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. ఏపీఆర్ఈఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉబేదుల్లా -
కొమ్మలు కొట్టమంటే.. చెట్లు నరికారు!
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయ ఆవరణం ఎప్పుడూ పచ్చని చెట్లతో కళకళలాడుతుండేది. ఏళ్లనాటి చెట్లు కావడంతో పెద్దపెద్ద కొమ్మలతో బాగా విరుచుకున్నాయి. ఇటీవల ఏపీసీగా బాధ్యతలు తీసుకున్న వైఖోమ్ నిదియాదేవి కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం, అక్కడకక్కడా కొన్నిచెట్ల కొమ్మలు కార్యాలయం గోడలపైకి రావడాన్ని గమనించారు. దీంతో ఆవరణం మొత్తం శుభ్రం చేయించాలని, కార్యాలయం భవనాలపైకి వచ్చిన చెట్ల కొమ్మలను కూడా తొలిగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జేసీబీలు పెట్టి మైదానాన్ని శుభ్రం చేయించిన అధికారులు.. చెట్ల కొమ్మలను తొలగించమని ఏపీసీ చెప్పిన మాటలను అదునుగా తీసుకుని ఏకంగా చెట్లను తొలగించుకోవాలంటూ ఓ కాంట్రాక్టర్కు ఒప్పందం ఇచ్చారు.చెట్లను తొలిగించి వాటిని ఆయనే అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వడంతో పెద్దపెద్ద చెట్లను సైతం నేలమట్టం చేసి లారీలు, ట్రాక్టర్లతో బయటకు తరలించారు. కార్యాలయం భవనం మీదకు వాలిన కొమ్మలనే కాదు ఎవరికీ ఆటంకం లేని మైదానం, ఆఫీసు వెనుక వైపు ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగించేశారు. కొమ్మలను కాకుండా మొదళ్ల వరకు చెట్లను తొలిగించడం చూసి కార్యాలయ సిబ్బందే ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మేడం ఒకటి చెబితే.. ఇంజినీరింగ్ అధికారులు ఒకటి చేస్తున్నారంటూ’ చర్చించుకుంటున్నారు. పచ్చదనం పరుచుకుని ఉన్న కార్యాలయ ఆవరణం ఇప్పడు బోసిపోయిందంటూ వాపోతున్నారు. ఇదిలాఉండగా చెట్లను తొలిగించిన కాంట్రాక్టర్తో కొంత మొత్తం చెల్లించేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. కలప తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. కాగా, సమగ్ర శిక్ష కార్యాలయానికి కేటాయించిన స్థలం కూడా ఎస్సీ కార్పొరేషన్కు చెందింది. అప్పట్లో వారే చెట్ల పెంపకం చేపట్టారు. ఈరోజు ఇంత పెద్ద చెట్లను తొలగించేటప్పుడు సంబంధిత శాఖకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. దీనిపై ఏపీసీ ఎలా స్పందిస్తారో చూడాలి. -
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
పెనుకొండ: పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో బీబీఏ, బీకాం, బీఎస్సీ హానర్స్ గ్రూపులకు అడ్మిషన్లు ప్రారంభమయినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిశేషారెడ్డి, ఏఓ కేశవయ్య తెలిపారు. బీబీఏ కోర్సుకు ఏఐసీటీఈ అనుమతి వచ్చిందన్నారు. ఆ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు సకాలంలో ప్రవేశం పొందాలని ఆయన సూచించారు. 27 నుంచి అంతర్ జిల్లాల హాకీ పోటీలుధర్మవరం అర్బన్: పట్టణంలోని క్రీడామైదానంలో ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ 14వ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 20 జిల్లా జట్లు పాల్గొంటాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే సుమారు 40 మందిని ఎంపిక చేసి వారికి కోచింగ్ క్యాంపు నిర్వహించి హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక చేస్తామన్నారు. నవంబర్లో పూణేలో జరిగే జాతీయ హాకీ పోటీల్లో ఏపీకి వారు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. 10 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో జిల్లాలోని 10 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ సోమందేపల్లి మండలంలో 20.2 మి.మీటర్లు, కొత్తచెరువులో 14.4 , అగళిలో 10.4, ఓడీ చెరువులో 8.6, తనకల్లులో 8.4, కదిరి 7.6, లేపాక్షిలో 4.6, బుక్కపట్నంలో 4.4, అమరాపురంలో 3.8, నల్లచెరువు మండలంలో 2.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు తెలియజేశారు. ఒకేషనల్ ట్రైనర్స్కు రెన్యూవల్ అనంతపురం ఎడ్యుకేషన్: ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లల్లో పని చేస్తున్న ఒకేషనల్ ట్రైనర్లకు 2024–25 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 50 స్కూళ్లలో ఒకేషనల్ ట్రైనర్లు పని చేస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ అండ్ వెల్నెస్, ఐటీ తదితర కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. గత ఏడాది పని చేసిన స్కూళ్లల్లో వెంటనే రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పని చేస్తున్న వీరికి సమగ్రశిక్ష కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనంతపురం రూరల్: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. అలాగే, 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నాయని, అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే పాఠశాల, కళాశాలలు పునఃప్రారభమైన తరుణంలో హాస్టల్ వసతి కోసం రెన్యూవల్ చేసుకున్న విద్యార్థులు రెండు రోజుల్లో హాజరుకావాలని సూచించారు. రెన్యూవల్, కొత్త అడ్మిషన్ల కోసం అనంతపురం డివిజన్ విద్యార్థులు 96189 98334, తాడిపత్రి డివిజన్ విద్యార్థులు 94405 57253, కళ్యాణదుర్గం డివిజన్ విద్యార్థులు 9346558001 నంబర్లను సంప్రదించాలన్నారు. -
వక్క మొక్కల పీకివేత
రొళ్ల: మండలంలోని బంద్రేపల్లిలో రైతు క్రిష్ణప్ప తన పొలంలో నాటిన 100 వక్క మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. బుధవారం సాయంత్రం పొలం వద్ద నుంచి ఇంటికి చేరుకున్న తాను గురువారం ఉదయం పొలం వద్దకెళ్లేసరికి మొక్కలు పీకేసి ఉన్నాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సుమారు రూ.15 వేల మేర నష్టపోయినట్లు వాపోయాడు. ఘటనపై పోలీసుకలు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. గడ్డి వామికి నిప్పు రొళ్ల: గుర్తు తెలియన వ్యక్తులు నిప్పు పెట్టడంతో నాలుగు ట్రాక్టర్ల లోడు ఉన్న గడ్డి వామి పూర్తిగా కాలి బూడిదైంది. రొళ్ల మండలం రత్నగిరి గొల్లహట్టి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సన్న నాగప్ప వ్యవసాయంతో పాటు కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను పెంచుకున్న జీవాల మేత కోసం కల్లంలో వేరుశనగ కట్టెతో పాటు ఇతరా గ్రాసాన్ని వామిగా వేశాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో గడ్డి వామి పూర్తిగా దగ్ధమైంది. గురువారం ఉదయాన్నే విషయాన్ని తెలుసుకున్న బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50వేల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. -
No Headline
గుంతకల్లు: సామాన్యులకు రైలు ప్రయాణం భారంగా మారింది. ఓ వైపు పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడం.. మరోవైపు కరోనా సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పట్టాలెక్కించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు స్లీపర్ కోచ్ల సంఖ్యను కుదించడంతో రైలెక్కాలంటే జేబుకు చిల్లులు పడుతున్నాయి. వందేభారత్ లాంటి రైళ్లను అందుబాటులోకి తెచ్చారే తప్ప సాధారణ ప్రయాణికుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దుతో ఇబ్బందులు ● బెలగావి నుంచి భద్రాచలం రోడ్డుకు బెలగావి ఎక్స్ప్రెస్ రైళ్లు (07336/35) భద్రాచలానికి వెళ్లే భక్తులతో పాటు సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ● హుబ్లీ– విజయవాడ – హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడకు వెళ్లడానికి ఎంతో అనువుగా ఉండేది. ఈ రైలు రోజూ హుబ్లీ జంక్షన్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి గుంతకల్లు జంక్షన్కు అర్ధరాత్రి 12.30 గంటలకు వచ్చేది. ఇక్కడ నుంచి బయలుదేరి ఉదయం 11.00 గంటలకు విజయవాడకు చేరుకునేవారు. ఈ రైళ్లను రద్దు చేయడంతో గుంతకల్లు మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నం రైలును మళ్లించరా? మచిలీపట్నం–ధర్మవరం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా మళ్లించాలని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మచిలీపట్నం, ధర్మవరం రైల్వేస్టేషన్లో తిరుగు ప్రయాణంలో ఎక్కువ సమయం ఉండటంతో ఈ ఖాళీ టైమ్ను గుంతకల్లు మీదుగా మళ్లిస్తే ప్రయాణికులకు ఉపయోగకరంతో పాటు రైల్వేకు ఆదాయం లభిస్తుందంటున్నారు. పట్టాలెక్కని పేదోడి రైళ్లు.. కరోనా సమయంలో రద్దు అయిన బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు నేటికీ పట్టాలెక్కలేదు. ఈ రైళ్లు అటు విజయవాడ, ఇటు బెంగుళూరు రాకపోకలు సాగించే ప్రయాణికులకు తక్కువ చార్జీతో అందరికీ సౌకర్యంగా ఉండేది. ఈ ప్యాసింజర్ రైలుకు 13 బోగీలు ఉన్నప్పుటికీ ఇందులో రెండు రిజర్వేషన్ స్వీపర్ కోచ్లు కూడా అందుబాటులో ఉండేవి. అలాగే గుంతకల్లు–ధర్మవరం మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. అయితే సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఈ రైళ్లను మాత్రం పట్టాలెక్కించకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్ల వద్దే నిలబడి ప్రయాణం గుంతకల్లు జంక్షన్ మీదుగా నడుస్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్లీపర్ బోగీలను కుదించి ఏసీ బోగీలను పెంచారు. దీంతో ఏసీ టికెట్ కొనుగోలు చేయలేని సామాన్య ప్రయాణికుడు స్లీపర్ టికెట్ కొన్నప్పటికీ అవి కూడా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్లో ఉండడం, తీరా రైలు వచ్చే సమయానికి కూడా కన్ఫమ్ కాకపోవడంతో ఎలాగో అలా గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో టీటీని బతిమాలి బాత్రూమ్ల వద్ద నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక జనరల్ బోగీల్లో ప్రయాణం మరీ దారుణంగా మారింది. ప్రయాణికులు కూర్చున్న సీటు నుంచి కదిలే పరిస్థితి ఉండదు. స్లీపర్ బోగీలు కుదించిన రైళ్ల వివరాలు ● బెంగుళూరు నుంచి భువన్వేశర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు (18464) 12 స్లీపర్ క్లాస్ బోగీలు ఉండేవి. ప్రసుత్తం వాటిని ఆరుకు కుదించి, ఏసీ బోగీలను పెంచారు. ● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్నినల్ (ముంబై) (22160)కు రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ ప్రసుత్తం కేవలం రెండు స్లీపర్, రెండు జనరల్ బోగీలు మినహా అన్ని ఏసీ కోచ్లే.. ● వాస్కోడిగామా నుంచి జాసీదీ జంక్షన్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ (17321) రైళ్లలో ఎక్కువగా కార్మికులు, కూలీలు ప్రయాణిస్తుంటారు. ఈ రైలు గతంలో 12 స్లీపర్ బోగీలతో రాకపోకలు సాగించేది. ప్రసుత్తం కేవలం రెండు స్లీపర్, రెండు జనరల్ బోగీలతో ప్రయాణిస్తోంది. ● బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే కర్ణాటక ఎక్స్ప్రెస్ (12627) రైళ్లకు దాదాపు 12 పైగా స్లీపర్ బోగీలు ఉండేవి. వాటిని ప్రస్తుతం 7 బోగీలకు కుదించారు. ● యశ్వంతపుర నుంచి గోరఖ్పూర్ వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12592) రైలు కార్మి కులు, కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ రైలులో కేవలం 4 స్లీపర్ బోగీలు, 2 జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు. ఇక అన్నీ ఫస్ట్ కాస్ల్, సెకండ్ క్లాస్, థర్డ్ కాస్ల్ ఏసీ బోగీలే. ఆదాయంపైనే దృష్టి ప్రతిరోజూ పైన తెలిపిన ఎక్స్ప్రెస్ రైళ్లలో గమ్యస్థానం నుంచి చివరి గమ్యస్థానాలకు చేరేలోపు దాదాపు 2,000 మంది సాధారణ ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. దీంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోయి ఉంటాయి. కేవలం రెండు జనరల్ బోగీలు ఉండడంతో బాత్రూమ్ కారిడార్ వద్దే పదుల సంఖ్యలో నిలబడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ బోగీల్లో ప్రయాణిస్తున్న వృద్ధులు, రోగులు, మహిళలు టాయిలెట్కి వెళ్లాలన్నా సాధ్యమయ్యే పని కాదు. ఇక ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పుటికీ రైల్వే శాఖ కేవలం ఆదాయం ఎలా పెంచుకోవాలనే తాపత్రయం తప్ప సామాన్యులకు సౌకర్యాలు మెరుగుపరచడంపై దృష్టిసారించడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చి స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దు కరోనా సమయంలో రద్దైన ప్యాసింజర్ రైళ్లు నేటికీ పట్టాలెక్కని వైనం స్లీపర్ కోచ్లకూ కత్తెరేయడంతో సామాన్యుల ఇక్కట్లు సౌకర్యాలను మరచి.. ఆదాయంపైనే దృష్టి పెట్టిన రైల్వే ! -
No Headline
పుట్టపర్తి టౌన్: సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వర్తించిందని, అందరి సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించగలిగామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. గురువారం పుట్టపర్తిలోని సాయిఆరామంలో సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసులకు డిపార్టమెంట్ల వారీగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ జిల్లాలో పోలీస్ సిబ్బంది పనితీరును కొనియాడారు. మందొస్తు ప్రణాళికలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలిగామన్నారు. జిల్లా వ్యాప్తంగా 13,535 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 16వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని 1,002 కేసులు నమోదు చేశామన్నారు. ప్రత్యేక టీముల ద్వారా రూ.2.10 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 46 కేసులు నమోదు చేశామని, 34 మందిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి కృషి చేయండి
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి. శ్రీనివాస్ అన్నారు. అనంతపురం జిల్లా కోర్టులోని తన చాంబర్లో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. పోక్సో కేసుల కింద నష్ట పరిహారానికి సంబంధించి ముగ్గురు బాధితులకు ఒక లక్ష, రూ.2.50 లక్షలు, రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశామన్నారు. బాధితులకు పరిహారం అందించేందుకు హైకోర్టుకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ను సత్కరించారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం, ఇతర సమస్యల పట్ల ఆయన స్పందనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఎన్సీసీ’తో ఉన్నత భవిష్యత్తు ● క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ కులకర్ణ కూడేరు: ఎన్సీసీ శిక్షణతో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని క్యాడెట్లకు సీఏటీసీ–1 ఎన్సీసీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ కులకర్ణ సూచించారు. గురువారం కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–1 ఎన్సీసీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంప్ కమాండర్ ఎన్సీసీ క్యాడెట్లనుద్దేశించి మాట్లాడారు. 10 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఇక్కడ నేర్పించే ప్రతి అంశం జీవితంలో ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాబట్టి క్యాడెట్లు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుబేదార్ సుల్దార్సింగ్, ఎన్సీసీ అధికారులు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 560 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులకు బాలుడి అప్పగింత
ఉవవకొండ: ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు... ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రయాణికులకు బుధవారం సాయంత్రం ఓ పదేళ్ల వయసున్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడిని తీసుకుని స్టేషన్కు చేరుకున్నారు. సీఐ సురేష్బాబు, ఎస్ఐ రాఘవేంద్రప్ప, హెడ్ కానిస్టేబుల్ కులశేఖర్రెడ్డి తదితరులు బాలుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చీకటి పడడంతో రాత్రికి అక్కడే బాలుడిని ఉంచుకుని భోజన సదుపాయాలు కల్పించారు. అనంతరం గురువారం ఉదయం స్థానిక ఆపద్బంధావ ట్రస్ట్ సభ్యుల సహకారంతో బాలుడి ఆచూకీ తెలుసుకున్నారు. ఉరవకొండలోని ఇందిరానగర్కు చెందిన ఆనంద్ కుమారుడు కార్తీక్గా నిర్ధారించుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి స్టేషన్కు వచ్చి కుమారుడిని అక్కున చేర్చుకున్నాడు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు బాలుడిని అప్పగించారు. -
పోలీసులపై నమ్మకం కల్పించాలి
పుట్టపర్తి టౌన్: న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వచ్చే ప్రజల్లో నమ్మకం కల్పించే విధంగా అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న సాయి ఆరామంలో జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం జూలై 1 నుంచి అమలు చేసే నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ విచారణలో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. నేర చేధన కన్నా నేర నియంత్రణ ముఖ్యమని ముందస్తు ప్రణాళికలతో నేరాలకు చెక్ పెట్టాలన్నారు. పిటీషన్లపై వెంటనే స్పందించి సామాన్యులకు చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే వెళ్లి పరిస్థితి అదుపులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్లలతో సమావేశం ఏర్పాటు చేసి కోర్టు ట్రయల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా సాక్షులను చైతన్యపరచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. సివిల్ కేసులను పారదర్శకంగా విచారణ చేయాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి -
వృద్ధురాలి దారుణ హత్య
పావగడ: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం ఎల్లోటి గ్రామానికి చెందిన వడ్డె చంద్రక్క (60) గురువారం ఉదయం 7.30 గంటలకు అదే గ్రామంలో వేరు కాపురం ఉంటున్న కుమారుడు ఆంజనేయులు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో కుమారుడు, కోడలు రాధ ఇంట్లో లేకపోవడంతో మనువరాలిని పలకరించి, తాను వేప విత్తనాలు ఏరుకుని వస్తానని తెలిపి, గ్రామ శివారులో కర్ణాటకలోని పావగడ తాలూకా మాచురాజనహళ్లి గ్రామంలోని నీలగిరి వనానికి చేరుకుంది. కాసేపటి తర్వాత ఆంజనేయులుకు ఎల్లోటి గ్రామానికి చెందిన హరిజన గోవిందప్ప ఫోన్ చేసి నీలగిరి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రక్క గొంతు కోసి హతమార్చారంటూ తెలిపాడు. దీంతో ఆంజనేయులు అక్కడకు చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అదే సమయంలో మడకశిర (ఆంధ్ర), పావగడ (కర్ణాటక) పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎవరో పదునైన కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చినట్లుగా నిర్ధారించారు. ఘటనకు సంబంధించి కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నగలు, నగదు కోసమేనా? వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.17వేలు చంద్రక్క బ్యాంక్ ఖాతాలోకి గత ఏపీ ప్రభుత్వం జమా చేసింది. ఈ మొత్తానికి తోడు ఆమె కానుగ, వేప విత్తనాలు సేకరించి అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం కలిపి దాదాపు రూ.30 వేలు తన వద్దనే ఉంచుకుంది. ఈ డబ్బు తీసుకుని పంట రుణం రెన్యూవల్ చేయించేందుకు గురువారం ఉదయం కుమారుడి ఇంటికి ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కుమారుడు, కోడలు ఇంటి వద్ద లేకపోవడంతో తన మనవరాలితో మాట్లాడి, పంట రుణం రెన్యువల్ చేయించాల్సిన పని ఉందని, కుమారుడు వచ్చిన వెంటనే తెలిపి తన వద్దకు పంపాలంటూ మనవరాలితో చెప్పి వేప విత్తనాలు ఏరుకునేందుకు మాచిరాజనహళ్లి గ్రామ శివారులోని నీలగిరి వనానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే చంద్రక్క వద్ద నగదు, శరీరంపై బంగారు నగలు గుర్తించిన దుండుగులు ఆమెను హతమార్చి వాటిని అపహరించుకెళ్లినట్లుగా తెలుస్తోంది. -
భల్లూకం.. భయం భయం
రాయదుర్గం టౌన్/కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం పట్టణంలోని మొలకాల్మూరు రోడ్డు చెక్పోస్టు అభయాంజనేయస్వామి గుడి సమీపంలో గురువారం మధ్యాహ్నం ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ప్రధాన రహదారికి పక్కనే భల్లూకం కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కొండ ప్రాంతం నుంచి తరుచూ ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు పైతోట వాసులు తెలిపారు. ఈ సారి ఏకంగా నివాసాలకు సమీపంలోకి రావడంతో బెంబేలెత్తారు. కుక్కలు వెంటపడడంతో కొండపైకి పారిపోయిందన్నారు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ● కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో కన్నేపల్లి రోడ్డు వద్ద కూడా ఓ ఎలుగు బంటి సంచారం భయభ్రాంతులకు గురి చేసింది. గురువారం ఉదయం అటుగా వాకింగ్కు వెళ్లిన పలువురికి భల్లూకం తారసపడింది. గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న కొండపొదల్లోకి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. -
పిల్లలకు ఆనందం... పెద్దలకు ఆహ్లాదం
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెనుకొండకు 4 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కుంభకర్ణ ప్రాజెక్ట్ పిల్లలకు ఆనందాన్ని, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. 2002లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ సోమేష్కుమార్ చొరవతో 44వ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. చుట్టూ ఎతైన కొండలు, మహావృక్షాలు, పచ్చటి వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటోంది. రాత్రి సమయంలో ప్రత్యేక విద్యుత్ దీపకాంతులతో మైమరిపిస్తుంటుంది. కొండలపై ఏర్పాటు చేసిన గాలి మరలు సినిమా సెట్టింగ్లను తలపిస్తాయి. నిద్రిస్తున్న కుంభకర్ణుడిని లేపేందుకు భటుల సాగించే విన్యాసాల నమూనాలు చూడచక్కగా ఉన్నాయి. పార్క్లో పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల పరికరాలను ఏర్పాటు చేశారు. కుంభకర్ణుడి లోపల సకల సౌకర్యాలతో కూడుకున్న హోటల్ను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. – పెనుకొండ రూరల్: