-
నిజ్జర్కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హజ్ యాత్రలో 98 భారతీయుల మృతి: కేంద్రం
న్యూఢిల్లీ: తీవ్ర ఎండ, వేడిగాలులతో ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 98 0 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మరణాలన్నీ సహజ కారణాల వల్లే నమోదైనట్లు తెలిపింది.కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీని సందర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్కడ భారతీయుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్నట్లు పేర్కొంది.ప్రతి సంవత్సరం కనీసం సగం మిలియన్ల మంది (5లక్షలు) హజ్లో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే వాస్తవ సంఖ్య 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.కాగా ఏడాది సౌదీలో హాజ్ యాత్రకు హాజరైన వారిలో 10 దేశాలకు చెందిన దాదాపు 1,081 మంది మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వారం సౌదీలో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్ చేరుకుంది. ఇక ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్ అధికార యంత్రాంగం తెలిపింది. -
రిషి సునాక్కు షాక్ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది?
లండన్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రిషి సునాక్కు ఓటమి తప్పేలా లేదు. బ్రిటన్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రిషి సునాక్కు ఓడిపోవడం ఖాయమని చెప్పగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రిషి సునాక్కు షాక్ తప్పదా.? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. బ్రిటన్కు తొలి భారత సంతతి ప్రధాని అయిన రిషి సునాక్కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఒపీనియన్ పోల్స్ ఇదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే మూడు సర్వేలు వెల్లడించగా.. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సర్వేను నిర్వహించింది. జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్లు తగ్గి 21 శాతానికి చేరుకుంది. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఇక.. ప్రజలు పోస్టల్ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం.కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. -
అమెరికాలో కాల్పుల మోత.. 15 మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జరిగిన జునెటీన్ వేడుకల సందర్భంగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. ఓక్లాండ్లోని లేక్ మెరిట్ వద్ద జరిగిన బుధవారం జునెటీన్ వేడుకకు 5,000 మందికి పైగా హాజరయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న కార్యక్రమలో ఒకస్కారిగా హింస చెలరేగింది. దాదాపు రాత్రి 8.15 గంటలకు రోడ్డుపక్కన ఉన్న కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఆ తర్వాత జనం గుమిగూడారని, ఈ సందర్భంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు, -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
వీడియో: ఇజ్రాయెల్ టార్గెట్ సక్సెస్.. హమాస్ కమాండర్ మృతి
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్, స్నిపర్ అహ్మద్ అల్ సౌర్కాను అంతమొందించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ నుఖ్బా ఫోర్సెస్లో సీనియర్ నాయకుడు, కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అల్ సౌర్కా మరిణించాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇక, ఐడీఎఫ్కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఐఎస్ఏ) నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ ఆపరేషన్ జరిపినట్టు వెల్లడించింది.ఇక, ఈ ఆపరేషన్ సమయంలో పౌరులకు హాని కలుగకుండా ఇజ్రాయెల్ సైన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఆపరేషన్లో పాలస్తీనా పౌరులు ఎవరూ మృతిచెందకుండా దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేయడంలో అహ్మద్ అల్ సౌర్కాదే కీలక పాత్ర అని తెలుస్తోంది. దాడులకు అహ్మదే ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. Eliminated: Ahmed Hassan Salame Al-Sauarka, a #Hamas terrorist, in the area of Beit Hanoun in northern #Gaza. Alsauarka, a squad commander in the Nukhba Forces, infiltrated Israeli communities and participated in attacks during the #October7Massacre. He led sniper activity in… https://t.co/CUIkhTJQg0 pic.twitter.com/kojwx9uZGW— (((🇺🇸Zemmel🇮🇱))) (@jshayevitz) June 20, 2024 -
రష్యా యాంటీవైరస్పై అమెరికా సంచలన నిర్ణయం
రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్వేర్పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తులను తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది."కాస్పర్ స్కై సాధారణంగా ఇతర కార్యకలాపాలతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోపల తన సాఫ్ట్ వేర్ ను విక్రయించడానికి లేదా ఇప్పటికే ఉపయోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ కు నవీకరణలను అందించడానికి వీలుండదు" అని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సున్నితమైన అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్ స్కై ల్యాబ్ వంటి రష్యన్ కంపెనీలను ఉపయోగించుకునే సామర్థ్యం, ఉద్దేశం తమకు ఉన్నాయని రష్యా పదేపదే నిరూపించిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ఒక ప్రకటనలో తెలిపారు. వారి సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు, తమ పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వాణిజ్య శాఖ చర్యలు అమెరికా ప్రత్యర్థులకు తెలియజేస్తున్నాయన్నారు.కాస్పర్స్కై యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ అమ్మకాలను నిషేధించడంతో పాటు, ఈ సంస్థతో సంబంధం ఉన్న మూడు సంస్థలను జాతీయ భద్రతా ఆందోళనగా భావించే కంపెనీల జాబితాలో అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు అమెరికాలో యాంటీవైరస్ అప్డేట్లను అందించడం సహా కొన్ని కార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రం కాస్పర్స్కైని అనుమతించారు.మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న కాస్పర్స్కై సంస్థ ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో కార్యాలయాలను కలిగి ఉంది. 200కి పైగా దేశాలలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు, 270,000 కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
హజ్ యాత్రలో వెయ్యి మంది మృతి
రియాద్: ఈ ఏడాది హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు తాళలేక 10 దేశాలకు చెందిన 1,081 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు 68 మంది కాగా, ఈజిప్టు దేశస్తులు అత్యధికంగా 658 ఉన్నారు. ఒక్క గురువారమే ఈజిప్టుకు చెందిన 58 మంది చనిపోయినట్లు ఆ దేశ దౌత్యాధికారి ఒకరు తెలిపారు. మొత్తం మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వారు ఉన్నారు. అధికారికంగా పేర్లు నమోదైన వారికి, ప్రభుత్వం ఏసీ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. అనధికారికంగా వచ్చిన వారు ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారని అ«ధికారులు చెప్పారు. -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్మేకర్గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, ఫొటోగ్రాఫర్గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్లో ఆమె షేర్ చేసిన స్క్రీన్షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’
దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం ఒకటి మరింత ఆందోళన రేపుతోంది. వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక తేల్చింది.అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్ తెలిపారు.వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.తరువాతి తరంపై తీవ్ర ప్రభావంయూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో 5 లక్షల మంది ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200 పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి. పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే.. అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా ఈ డిగ్రీని అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.1940లలో స్టాన్ఫోర్డ్లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది. ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ని దక్కించుకుంది. మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే సంతోషంగా ఉప్పొంగిపోయింది. -
పొలంలో తెగిపడిన చేయి, ఇటలీలో భారతీయ కార్మికుడి దుర్మరణం
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఒకటి కలకలం రేపింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని ఆసపత్రికి తరలించాల్సిన యాజమానులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపై అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సత్నామ్ సింగ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటలీ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది నిజంగా అనాగరిక చర్య," అని పేర్కొన్న ఆమె, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధ్యులను శిక్షిస్తామని ప్రకటించారు. అటు ఈ ఘటనను అక్కడి సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గ్యాంగ్మాస్టర్లకు వ్యతిరేకంగా, గౌరవప్రదమైన పని, జీవన పరిస్థితుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎక్స్ ద్వారా ప్రకటించింది.పదివేల మంది భారతీయ వలస కార్మికులు నివసించే రోమ్కు దక్షిణంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లాటినాలోని పొలంలో సత్నామ్ సింగ్ పనిచేస్తున్నాడు. సోమవారం ప్రమాద వశాత్తూ ఓ యంత్రంలో పడి అతడి చేయి తెగిపోయింది. అయితే రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నామ్ సింగ్ను పట్టించుకోలేదు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు. Flai CGIL ట్రేడ్ యూనియన్ ప్రకారం, సుమారు 31 ఏళ్ల వయస్సున్న సింగ్, చట్టపరమైన పత్రాలేవీ లేకుండా పని చేస్తున్నాడు. బాధితుడినిఆసుపత్రికి తరలించాల్సిన యజమానులు, చెత్త మూటలా వదిలేసి వెళ్లిపోయారని, ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని ట్రేడ్ యూనియన్ మండిపడింది. -
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.కొత్త మిలియనీర్లుభారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. -
తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)ని వేడుకుంటోంది.పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. -
నిజ్జర్కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్పోర్ట్పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్పోర్ట్లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్ను పుతిన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్కు కిమ్ బహూకరించారు. కిమ్కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
మనుషుల కంటే ‘పెట్స్’పై పెట్టే ఖర్చే ఎక్కువ.. సంపన్న కుటుంబంపై విమర్శలు
బెర్న్: బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. అయితే హిందూజా కుటుంబం వివాదంలో చిక్కుకుంది. హిందూజా కుటుంబానికి చెందిన స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో వారి విల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని శ్రమదోపిడికి గురిచేసినట్లు తెలుస్తోంది. వారి పాస్పోర్ట్లను తీసుకుని 15-18 గంటల పనికి కేవలం 8 డాలర్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులపై స్విట్జర్లాండ్లో మానవ అక్రమ రవాణా కేసునమోదైంది. సోమవారం కోర్టులో విచారణ జరిగింది.బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం.. బిలియనీర్ కుటుంబం ఇంట్లో పనిచేసే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు సమాచారం.పేరుకే ధనవంతులు.. కానీవారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించరు. పైగా వారి చేస్తున్న పనికి భారత్లో ఎంతైతే ఇస్తున్నారో.. అక్కడ కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. పేరుకే ధనవంతులైనప్పటికి హిందూజాలు తమ పెంపుడు కుక్క కోసం చేస్తున్న ఖర్చుకంటే ఇంట్లో పనిచేస్తే సిబ్బంది చెల్లించే వేతనం చాలా తక్కువ అని కోర్టులో ప్రాసిక్యూటర్ ఆరోపించారు.సిబ్బంది కంటే.. కుక్కలకు పెట్టే ఖర్చే ఎక్కువ‘పెంపుడు జంతువులు’అనే బడ్జెట్ పత్రాన్ని ప్రస్తావిస్తూ..ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోస్సా ఓ మహిళా సిబ్బందికి వారంలో ఏడు రోజులు 15 నుండి 18 గంటల పని దినానికి 7 (7స్విస్ ఫ్రాంక్) డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ మొత్తం ఒక సంవత్సరంలో హిందూజా కుటుంబ సభ్యులు పనిచేసే సిబ్బంది కంటే వారి పెంపుడు జంతువులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మొత్తం 8584 స్విస్ ఫ్రాంక్లుగా ఉంది. ఈ కేసులో హిందూజా కుటుంబానికి చెందిన ప్రకాష్ హిందూజా, అతని భార్య కమల్, కుమారుడు అజయ్, భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు వైవ్స్ బెర్టోస్సాకు కోర్టు ఖర్చులు నిమిత్తం 1 మిలియన్ స్విస్ ఫ్రాంక్లు, సిబ్బందికి నష్టపరిహారం కోసం 3.5 మిలియన్ ఫ్రాంక్లు చెల్లించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.శ్రమదోపిడి వస్తున్న ఆరోపణల్ని హిందూజా కుటుంబ తరుపు న్యాయవాది తోసిపుచ్చారు. సిబ్బందిని నియమించడంలో లేదా రోజువారీ నిర్వహణలో కుటుంబం ప్రమేయం లేదని చెప్పారు.20 బిలియన్ల నికర విలువతోహిందూజా కుటుంబం 20 బిలియన్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉంది. లండన్లోని రియల్ ఎస్టేట్తో పాటు షిప్పింగ్, బ్యాంకింగ్, మీడియా, ఇతర రంగాల్లో కార్యకాలాపాలు నిర్వహిస్తూ వ్యాపార రంగంలో అగ్రగ్రామిగా కొనసాగుతోంది హిందూజా గ్రూప్. -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
నిజ్జర్కు నివాళా?.. కెనడాకు భారత్ ‘కనిష్క’ కౌంటర్
ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాంకోవర్లోని భారత్ కాన్సలేట్ జనరల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవటంలో భారత్ ముందజంలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ 23తో 39 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ దాడిలో 86 మంది చిన్నారులతో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. .. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబ్ దాడిలో మృతి చెందినవారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం. జూన్ 23న స్టాన్లీ పార్క్లోని సెపర్లీ ప్లేగ్రౌండ్లో జరిగే ఈ స్మారక కార్యకమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని భారత్ కాన్సలేట్ జనరల్ పేర్కొంది.India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)— India in Vancouver (@cgivancouver) June 18, 2024 ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం కెనడా పార్లమెంట్( హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించింది.ఖలిస్తానీ టైగర్ ఫోర్స్( కేటీఎఫ్) చీఫ్ హర్దిప్ సింగ్ నిజ్జర్ గతేడి జూన్ 18 కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్ను హత్య చేసిన వారిలో నలుగురు భరతీయులు.. కరణ్ బ్రార్, అమన్దీప్ సింగ్, కమల్ప్రీత్ సింగ్, కరణ్ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు.తీవ్రవాది హర్దిప్ హత్యతో భారత్ హస్తం ఉందిన కెనడా ఆరోపలు చేసింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక.. అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.ఇక.. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే హత్య చేయబడ్డారు. -
చైనా యువత వినూత్న నిరసన .. ఎందుకో తెలుసా?
బీజింగ్ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్ కల్చర్ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్రేస్లాంటి వర్క్ కల్చర్ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. ఎన్బీయే బాస్కెట్ బాల్ వీడియో గేమ్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్ బాల్ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు. -
రష్యా ఆయిల్ టెర్మినల్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. మరోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ టెర్మినల్పై డ్రోన్ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంక్లే లక్ష్యంగా రష్యాలోని దక్షిణ పోర్టు అజోవ్లో ఉన్న ఆయిల్ టెర్మినల్పై దాడి చేయటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. Russia's remaining air defense units are either busy being destroyed in Ukraine or guarding Putin's palaces, leaving airfields, military bases and oil infrastructure easy targets for hungrry Ukrainian drones.Rostov pic.twitter.com/XiHWfAW4MK— Jay in Kyiv (@JayinKyiv) June 18, 2024భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు రష్యా మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ తెలిపింది. మంగళవారం జరిగిన ఆయిల్ రిఫైనరీ దాడిలో.. పలు ట్యాంకుల్లో మెథనాల్ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారలు తెలిపారు. ఇక.. తామె ఈ డ్రోన్ దాడులు చేసినట్లు సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ పేర్కొంది. అజోవ్ పోర్టు సమీపంలో రెండు ఆయిల్ టెర్మినల్స్ ఉన్నాయి. ఈ రెండు ఆయిల్ టెర్మినల్స్ సుమారు 220,000 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేసి 2024 జనవరి నుంచి మే వరకు ఎగుమతి చేసింది.మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర పర్యటనలో సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటం గమనార్హం.