-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) పులివెందుల వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.కాగా, ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మనకోసం నిలబడ్డ వలంటీర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతోనే నిలబడ్డారు. జెండాలు మోసి కష్టపడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు కూడా తిన్నారు. ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి భరోసా ఇద్దాం’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్తో సరిపెట్టవచ్చని సమాచారం. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంగీత జగాన ఘనకీర్తి
తెనాలి: తెలుగునాట స్వర సంస్కృతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన సంగీతజ్ఞులు ఎందరో! తమ గానామృతంతో రస జగత్తును ఊయలలూపిన సంగీతకారులకు, సంగీత సంస్థలకు ఆంధ్రాప్యారిస్ తెనాలిలో కొదవలేదు. వారసత్వంగా వస్తున్న సంగీత విద్యను అభ్యసించి ఆ కళతో అభిమానులను రంజింపజేస్తున్నారు ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల మహిళలు. కళను పదిమందికీ నేర్పుతూ రాగ సేవలో తరిస్తున్నారు. జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆ కుటుంబానికి అక్షర నీరాజనం.. ఆకాశవాణిలో స్వరార్చన తెనాలి నాజరుపేటకు చెందిన గాత్ర విద్వాంసురాలు యల్లాప్రగడ జానకీ తల్లి స్ఫూర్తితో ఎనిమిదో ఏటనే విజయవాడలోని ఘంటసాల నృత్య, సంగీత కళాశాలలో చేరి, కర్ణాటక సంగీతంలో ఏడేళ్ల డిప్లొమా కోర్సును పూర్తిచేశారు. సంగీత విద్వాంసులైన గద్దె రామకుమారి, పెమ్మరాజు సూర్యారావు, ముసునూరి రమణమూర్తి, అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సాధన చేశారు. 1974 నుంచి సంగీత కచేరీలు ఇస్తున్నారు. 1975 నుంచి ఆకాశవాణిలో ఏళ్లతరబడి కొనసాగిన ఆమె స్వరార్చన ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఆలపించిన షిరిడి సాయి సుధామృతం, సుందర స్వామీజీ భక్తిగీతాలు, సత్యసాయి భక్తిగీతాలు, అంబా వందనం సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించాయి. ఆమె జానపద గీతాలూ పాడారు. తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ పూర్తిచేశారు. జిల్లా, రాష్ట్రస్థాయి సంగీత పోటీల్లో ఎన్నో బహుమతులందుకున్నారు. సంగీత విశారద, సుగాన సుధానిధి, సంగీత సరస్వతి వంటి బిరుదులెన్నో అందుకున్నారు. భర్త ఆదాయ పన్ను అధికారిగా పనిచేసిన కాలంలో బదిలీల కారణంగా నివసించిన విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ నగరాల్లోనూ తన శ్రావ్యమైన గాత్రంతో ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. తెనాలి వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగానూ చేశారు. జానకీ తల్లి ఆనాటి మేటి గాయని జానకీ తల్లి గుడిపాటి సుకన్య. ఒకనాటి మేటి గాయని. ఆమె భర్త గుడిపాటి శ్రీరామమూర్తి హరికథా భాగవతార్. పట్టణానికి చెందిన సంగీత గురువు విష్ణుబ్రహ్మ వద్ద సంగీతాన్ని అభ్యసించిన సుకన్య పాటలు పాడుతూ హార్మోనియం వాయించేవారు. చలనచిత్ర సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆమె సహధ్యాయి. సుకన్య సంగీత వారసత్వాన్ని ఆమె కుమార్తె జానకి అందుకున్నారు. సంగీత శిక్షకురాలిగా జానకి కుమార్తె యల్లాప్రగడ జానకీ కుమార్తె నేరెళ్ల వరలక్ష్మీకళ్యాణి ఆ కుటుంబంలో మూడోతరం గాయని, అమ్మమ్మ, తల్లి నుంచి సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో విశారద చేశారు. బీకాం చదివి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. కుటుంబ వారసత్వమైన సంగీత కళను అమితంగా ఆరాధించారు. హిందూస్థానీ సంగీతంలో ప్రతిభావంతురాలైన గాయనిగా అనేక కచేరీలను చేశారు. అన్నమాచార్య సహస్ర గళార్చనలో తెనాలి సత్తాను చాటిన యువబృందాన్ని తీర్చిదిద్దిన ఘనతను దక్కించుకున్నారు. పదిహేనేళ్లుగా పలు విద్యాసంస్థల్లో సంగీత ఉపాధ్యాయినిగా శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం విజ్ఞాన్ యూనివర్శిటీ, వీవీఐటీల్లో శిక్షణనిస్తున్నారు. 2003లో తల్లీకూతుళ్లు జానకీ, కళ్యాణి కలిసి ‘చిన్మయి సంగీత కళాశాల’ను స్థాపించి సంగీత శిక్షణను ఇస్తున్నారు. మనవరాలు చిన్మయి సైతం సంగీత సేవకు.. ఇదే కుటుంబంలోని జానకీ మనవరాలు, నాలుగో తరం వారసురాలు చిన్నయి కూడా సంగీత విద్యలో కొనసాగుతున్నారు. చదువుకుంటూనే తల్లి కళ్యాణి, అమ్మమ్మ జానకీతో కలిసి పలు సంగీత కచేరీలను చేశారు. తొలితరం గాయని సుకన్య కన్నుమూయటంతో తర్వాతి ముగ్గురు సంగీత వేదికపై గళం కలుపుతున్నారు. సొంతూరు తెనాలితో సహా పలు వేదికలపైనా, శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో మూడుతరాల గాయనీమణులు తమ గానామృతాన్ని పంచారు. రేడియో, టీవీల్లోనూ సంగీత విద్యను ప్రదర్శించారు. ప్రస్తుతం చిన్మయి బీటెక్ పూర్తిచేసి ఇటీవలే యూకేలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. నాలుగు తరాల స్వరార్చన గాత్ర సేవలో యల్లాప్రగడ జానకీ కుటుంబం నేడు ప్రపంచ సంగీత దినోత్సవం పూర్వజన్మ సుకృతం సంగీత కళ అనేది దైవదత్తం. ఆ కళను సాధన చేయటం, ప్రచారం చేయటంలో మా కుటుంబం నాలుగు తరాలుగా కృషిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎంతోమందికి ఈ కళను నేర్పుతున్నాం. ఇదంతా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాం. – నేరెళ్ల వరలక్ష్మీకళ్యాణి, గాత్ర విద్వాంసురాలు -
యోగభాగ్యాలు
ఆనందమయ జీవితానికి శుభమంత్రం ● ఎంత సాధన చేస్తే అంత ఫలితం ● వైద్యులూ ఆచరిస్తున్న అద్భుత సాధనం ● రోజురోజుకూ పెరుగుతున్న యోగసాధకులు ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం గుంటూరు వెస్ట్: భారతీయ సనాతన సంప్రదాయంలో భాగమైన దివ్యసాధనం యోగా.. నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిళ్లమయ జీవన యానంలో యోగా అంతర్జాతీయంగానూ తారకమంత్రంగా మారిపోయింది. మన వారసత్వ సంపదైన యోగా 2014లో అంతర్జాతీయంగా పేటెంట్ పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు జూన్ 21, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే యోగాసనాలు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వైద్యులూ చెబుతున్నారు. వారూ ఆచరిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో సుమారు 30 వరకు యోగా కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. చాలా కేంద్రాలు స్వల్ప ఫీజులు వసూలు చేసి యోగాసనాలు నేర్పిస్తున్నాయి. కొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులూ నిర్వహిస్తున్నాయి. యోగాసనాల ద్వారా అద్భుతాలు చూసిన కొందరి మనోగతం ఇదీ.. యోగాతో మధుమేహానికి చెక్ చాలామందిలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ లోపాలను నేను తరచుగా చూస్తున్నా. యోగా సాధనతో మధుమేహ రోగులకు ఇన్సులిన్ సామర్థ్యం పెరుగుతుంది. కండరాలకు గ్లూకోజ్ను ఉపయోగించుకునే శక్తి సిద్ధిస్తుంది. యోగా సాధనలో భాగమే ధ్యానం. దీనివల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి మన దేశానికి అందించిన గొప్ప వరం యోగా. మా వైద్యులూ దీనిని ఆచరిస్తున్నారు. – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్, గుంటూరు ఊబకాయానికి చక్కని పరిష్కారం నేను పదేళ్లకుపై నుంచి యోగా శిక్షణనిస్తున్నాను. ముఖ్యంగా యువతులను పరిశీలిస్తున్నాను. వీరిలో పీసీఓడీ, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్, ఊబకాయం తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. వీటికి యోగాలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి. మహిళల గర్భస్థ సమస్యలకూ మంచి ఆసనాలు ఉన్నాయి. మహిళలు, యువతలతో ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వృక్షాసనం, తాడాసనం, బటర్ఫ్లైలాంటి ఆసనాలు చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆన్లైన్లో విదేశీయులకూ శిక్షణనిస్తున్నాను. – కె.లక్ష్మి, యోగా టీచర్, గుంటూరు -
కిడ్నీల సమస్య ఉన్నా.. ఆరోగ్యంగా..
నాకు 18 ఏళ్ల క్రితం కిడ్నీలు రెండూ పాడైపోయాయి. కిడ్నీల మార్పిడి జరిగింది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డా. కొందరి సలహాతో ఆర్ట్ ఆఫ్ లివింగ్లో యోగా శిక్షణలో చేరాను. అలా కొన్ని నెలలు చేయడంతో ఆరోగ్యం బాగా కుదుటపడింది. గురువుగారి సలహా మేరకు యోగాలో శిక్షణ తీసుకుని మాస్టర్గా మారాను. ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రాలేదు. పది మందికి యోగా శిక్షణనిచ్చే భాగ్యం నాకు కలిగింది. యోగాలో సుదర్శన క్రియ నా జీవితంలో ఒక అద్భుతమనే చెప్పాలి. ఇదంతా మన రుషులు, గురువుల గొప్పదనం – రమాదేవి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్, గుంటూరు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2024బీసీజీ వ్యాక్సినేషన్ పరిశీలన ఫిరంగిపురం: వేములూరిపాడులో బీసీజీ వ్యాక్సినేషన్ను యూఐపీ ఫార్మసీ జిల్లా అధికారి సీహెచ్ రాధాకృష్ణ గురువారం పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. ‘నేను బడికి పోతా’ ర్యాలీ కాకుమాను: స్థానిక ఎస్టీ కాలనీలో గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ పి.రామకృష్ణ పాల్గొన్నారు.వైభవం.. కల్యాణ మహోత్సవం రేపల్లె రూరల్: ఇసుకపల్లిలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. 7 -
రాష్ట్ర పోలీస్ బాస్ గుంటూరు వాసే
గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం: ఏపీ డీజీపీగా నియమితులైన సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వస్థలం గుంటూరే. గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని దేవాపురంలో ఓ సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్అండ్ ఎకై ్సజ్ విభాగంలో అధికారి. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. గుంటూరు కృష్ణా నగర్లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్లో గోల్డ్మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలంగుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్గా పని చేశారు. 1989లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. గర్వకారణం ద్వారకా తిరుమలరావు గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థి కావడం తమకు ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ మాట్లాడుతూ హైస్కూల్ విద్యను ఇక్కడే అభ్యసించిన ద్వారకా తిరుమలరావు నాయకత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తమ సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలరావు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల పాలకవర్గం ఆకాంక్షించింది.ద్వారకా తిరుమలరావు పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ పూర్వ విద్యార్థి -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాకుమాను: టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడుల్లో మరణించిన, గాయపడిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు స్పష్టం చేశారు. పెదనందిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మూరుమళ్లి హరి ప్రసాద్(23)(నాని)ని ఈనెల 6న టీడీపీ కార్యకర్తలు కత్తులు, రాడ్డులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మృతుని కుటుంబ సభ్యులకు శేషగిరిరావుతోపాటు పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని రణరంగంగా మార్చిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ పచ్చమూకలు దాడులు చేస్తున్నాయని, ప్రతిపక్ష కార్యకర్తల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా దాడులను ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒకవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడతామని చెబుతూనే మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు, హత్యలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడుల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ సీపీ ఆదుకుంటుందని, త్వరలో తమ పార్టీ అధినేత ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తారని వివరించారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యానాదయ్య మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ షేక్ ఖాసీంపీరా, ఎంపీటీసీ సభ్యులు కల్లూరి నాగేశ్వరరావు(నాగు), పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధైర్యపడొద్దు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని హామీ టీడీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం -
ఏఎన్యూకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి నాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించింది. నాక్ కౌన్సిల్ నుంచి 3.46 సీజీపీఏతో ఇది దక్కడం విశేషం. ఈ మేరకు గురువారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్ మాట్లాడుతూ నాక్ ప్రారంభించిన డ్యూయల్ మోడ్లో గ్రేడ్ పొందిన మొదటి యూనివర్సిటీగా ఏఎన్యూ నిలిచిందని పేర్కొన్నారు. రెక్టార్ ఆచార్య పి. వరప్రసాద మూర్తి, రిజిస్టార్ ఆచార్య బి.కరుణ, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
29న జాతీయ లోక్అదాలత్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఈనెల 29న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం జిల్లా అంతటా లోక్అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీపడే క్రిమినల్ కేసులు, వివాహ కేసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉత్తర్వుల ప్రకారం రాజీపడే ఎక్సైజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, వినియోగదారుల కోర్టు కేసులు, లేబర్ కోర్టు కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. కక్షిదారులు, పోలీస్, స్టేక్ హోల్డర్స్ ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలని కోరారు. జాతీయ లోక్అదాలత్లో సివిల్ కేసుల్లో అప్పీల్ కేసులు, చెక్బౌన్స్ కేసుల్లో చెక్కు (రూ.2 లక్షలు లోపు)లు ఉన్న కేసులు ఎక్కువ రాజీ చేసే దిశగా కక్షిదారులకు, న్యాయవాదులకు సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. సివిల్ కేసులు లోక్అదాలత్లో పరిష్కరించుకుని అవార్డు తీసుకున్నట్లైతే, కోర్టు ఫీజు వాపసు పొందవచ్చునని వివరించారు. లోక్అదాలత్ అవార్డు మీద అప్పీల్కి వెళ్లే అవకాశం లేదన్నారు. కక్షిదారులు అందరూ వారి సమయం, ధనాన్ని వృఽథా కాకుండా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముగిసిన ఐటీఐ కౌన్సెలింగ్24న రెండోవిడత కౌన్సెలింగ్ తెనాలిఅర్బన్: తెనాలి చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ గురువారంతో ముగిసింది. గురువారం మెరిట్ నంబర్ 305 నుంచి 537 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 172 మంది హాజరు కాగా 136 మందికి సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లకూ ఈ నెల 24న మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్, తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్ సభ్యులు టి.ఇమ్మానుయేలు, ఎస్.వి.వి.ప్రసాద్బాబు, పలు ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. నేడు చాగంటి ‘ప్రవచనామృతం’ తెనాలి: ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తెనాలి పట్టణం మరొక విశిష్ట కార్యక్రమానికి వేదిక కానుంది. రామనామము–హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరావు శుక్రవారం ‘ప్రవచనామృతం’ నిర్వహించనున్నారు. పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తనా బృందం, సంకీర్తనా సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో తొలుత పంచముఖ ఆంజనేయస్వామికి విశేష అర్చనలు చేస్తారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ప్రవచనామృతం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డులోని సభాస్థలిలో గురువారం వారు ఏర్పాట్లను పర్యవేక్షించారు. యార్డుకు 51,771 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 51,771 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 50,599 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 20,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,000 నుంచి రూ. 17,200 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,500 నుంచి రూ. 19,700 వరకు, తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.12,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి 18,079 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
జీవితంపై విరక్తితో దివ్యాంగుడు బలవన్మరణం
అద్దంకి: జీవితంపై విరక్తితో ఓ దివ్యాంగుడు బ్రిడ్జి గ్రిల్స్కు తాడు కట్టి ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని అద్దంకి – దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వంతెనపై గురువారం వెలుగు చూసింది. అందిన సమాచారం మేరకు.. పట్టణంలోని పెరికపాలెంకు చెందిన నాగేశ్వరరావు ఉరఫ్ శేషు లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి వినుకొండకు చెందిన మహిళతో వివాహం అయింది. భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఐదు సంవత్సరాల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం నాగేశ్వరరావు (50) లారీ యాక్సిడెంట్లో కాళ్లకు దెబ్బ తగిలి పనిచేయకుండా పోయాయి. దీంతో వంతెన సమీపంలోని ఓ డైరీలో రాత్రి సమయంలో పడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వంతెన గ్రిల్స్కు లారీకి కట్టే తాడును బిగించి, ఆ తాడుతో మెడకు ఉరివేసుకుని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గమనించారు. గుండ్లకమ్మ వంతెనపై స్టాండు, చెప్పులు, కూల్డ్రింక్ సీసా పడి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తాడు విప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని చెల్లెలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే వికలత్వాన్ని భరించలేక.. తనను ఆదరించే వారు లేకపోవడంతో బతుకుపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఉరివేసుకుని మృతి -
డీ.ఫార్మసీలో ప్రవేశం కోసం దరఖాస్తుకు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో రెండేళ్ల కాల పరిమితి గల డీ ఫార్మసీ కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈనెల 27 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్తోపాటు దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆదాయ ధ్రువీకరణపత్రం/తెల్లరేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజు మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం కలదని తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి కలదని, ఆసక్తి గల విద్యార్థినులు అన్ని సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుం రూ.400తో కళాశాలలోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 98480 38769, 99593 24563, 93986 20953 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కొత్తపేట జగన్నాథస్వామి దేవస్థానంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం 10 గంటలకు లక్ష తులసి పూజ, రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జగన్నాథ, ఆంజనేయ, వెంకటేశ్వరస్వామి దేవస్థానాల చైర్మన్ సూరినేడి దుర్గావరప్రసాద్, సహాయ కమిషనర్ (ఈఓ) డి.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు శ్రీఅయోధ్య అయ్యప్ప, భక్తులు పాల్గొన్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.23 కోట్లుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులు సమర్పించారు. వేసవి సెలవుల నేపథ్యంలో 16 రోజులకు రూ.3.23 కోట్ల మేర కానుకలు, మొక్కుబడుల ద్వారా ఆదాయం సమకూరింది. ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు పర్యవేక్షణలో మహా మండపం ఆరో అంతస్తులో గురువారం కానుకల లెక్కింపు జరిగింది. రూ.3,23,75,523 నగదు లభమైంది. రోజుకు సరా సరిన రూ.20.23 లక్షల మేర ఆదాయం లభించిందని ఆలయ ఈఓ పేర్కొన్నారు. 694 గ్రాముల బంగారం, 6.264 కిలోల వెండితో పాటు విదేశీ భక్తులు డాలర్ల రూపంలో అమ్మవారికి కానుకలను సమర్పించారు. 516 యూఎస్ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, వెయ్యి కొరియా ఒన్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 ఓమన్ బైంసాలు లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు ఎస్ఫీఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ బిల్లుల అవకతవకలపై ఆడిట్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లుల్లో అవకతవకలు జరిగిన విషయంలో స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బిల్లులు తనిఖీ చేశారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటు మరో ముగ్గురు అధికారులు వచ్చి బిల్లుల అకౌంటెంట్, ఎగ్జామినర్ను కలిశారు. గతంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు/ఫైల్స్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. విచారణకు ఎంత మంది సిబ్బంది అవసరమో వంటి, ఇతర వివరాలతో ప్రాథమిక దర్యాప్తు చేసి వెళ్లారు. అసలేం జరిగిందంటే.. నగరపాలక సంస్థలో 2022లో అకౌంటెంట్గా పనిచేసిన సిరిల్పాల్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను రూ.అరకోటి దాకా తన బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టిన నగర కమిషనర్ కీర్తి చేకూరి అతడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి విచారణ కోసం 3 నవంబర్ 2022న స్టేట్ ఆడిట్ డైరెక్టర్కు కమిషనర్ లేఖ రాశారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో తేల్చి రిపోర్టు అందించాలని కోరారు. సస్పెండ్ అయిన సిరిల్పాల్పై ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వానికి తగు ఆధారాలతో గత నెల 14న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సిరిల్పాల్ చేసిన అవినీతిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అదనపు కార్యదర్శి ఎం.ప్రతాప్రెడ్డి సీడీఎంఏను (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అదేశించింది. ఆనాడు కమిషనర్ కీర్తి చేకూరి రాసిన లేఖ, గత నెల ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం స్టేట్ ఆడిట్ అధికారులు వచ్చినట్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. -
నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
నాదెండ్ల: సాతులూరు రైల్వేస్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే గూడ్స్ షెడ్ నిర్మాణ పనులను పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఐ మురళి గురువారం పరిశీలించారు. నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారినందున ప్రస్తుతం ఈ రైల్వే గూడ్స్ షెడ్డును సాతులూరుకు తరలించి అక్కడ నిర్మాణ పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. షెడ్డు నిర్మాణం పూర్తయితే వివిధ కంపెనీల నుంచి రైతులకు అవసరమైన ఎరువులు స్టాక్ పాయింట్కు చేరి సకాలంలో ఆర్బీకేలకు సరఫరా అయ్యేలా వీలుంటుందన్నారు. ఆయనతోపాటూ ఏడీఏ రవికుమార్, ఏఓ హరిప్రసాద్, వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్నారు. ఆర్బీకే సందర్శన సాతులూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని గురువారం జిల్లా వ్యవసాయాధికారి ఐ మురళి సందర్శించారు. కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ చేసే విధానంపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులకు సంబంధించి లబ్ధిదారుల్లో ఐదు శాతం మంది భౌతికంగా ధృవీకరించి వారి ఈకేవైసీని ఈనెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కౌలు రైతుల గుర్తింపు కార్డుల వలన సాధారణ రైతులకు ప్రభుత్వం నుండి అందే సబ్సిడీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ అందుతాయన్నారు. అర్హులైన ప్రతి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి రైల్వే గూడ్స్ షెడ్ నిర్మాణ పనుల పరిశీలన -
అనాథ పిల్లల దత్తత కోసం సంప్రదించాలి
నరసరావుపేట: జిల్లాలో నిర్వహిస్తున్న శిశు గృహలో ఉన్న అనాథ పిల్లల దత్తత కోసం పిల్లలు లేని తల్లిదండ్రులు సంప్రదించాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ సాధికారిత అధికారి కె.ఉమారాణి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహలో అప్పుడే పుట్టిన పసికందుల నుంచి ఐదేళ్లలోపు బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారన్నారు. వీరిని బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి పిల్లలు లేని తల్లిదండ్రులకు న్యాయపరంగా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దత్తత కావాలనుకున్న వారు https://cara.wcd.gov.in, htt ps://cara.wcd.nic.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దత్తత తీసుకోదల్చిన భార్యాభర్తలకు చెందిన ఆధార్కార్డులు, పాన్కార్డు, వారి వివాహ, జనన, ఆదాయ ధృవపత్రాలు, ఆరోగ్య ధృవీకరణపత్రం సమర్పించాలన్నారు. సింగిల్ పేరెంట్ అయితే విడాకుల డిక్రీ, మరణ ధృవపత్రం, బంధువుల ష్యూరిటీ, రూ.6వేలు డీడబ్ల్యూ, సీడబ్ల్యూ, ఈవోల పేరుపై డీడీ చెల్లించాలని కోరారు. ధృవపత్రాలను నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో గల 133 ఇంటి నెంబరులోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి, 63053 13833, జిల్లా బాలల పరిరక్షణ అధికారి డి.శౌరిరాజు, సెల్ 94918 93573, శిశుగృహ మేనేజర్ ఎం.కుమారి, సెల్.83090 48218, ప్రొటెక్షన్ అధికారి వై.ప్రశాంతకుమార్, సెల్.70953 02602లను సంప్రదించాలని కోరారు. పసికందు కోసం నెల రోజుల్లో సంప్రదించండి మాచర్ల మండలం నాగార్జునసాగర్ మేరీమాత చర్చి వద్ద ఈనెల 14న స్వాధీనం చేసుకున్న రోజుల పసికందు కోసం నెలరోజుల వ్యవధిలో తమను సంప్రదించాలని ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేయటంతో పోలీసుల ద్వారా ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ వైద్యశాలకు చేర్చామన్నారు. ఒక కన్ను మూసుకుపోవటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం నరసరావుపేట బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే శిశుగృహలో ఉంచామని చెప్పారు. ఆ పాపకు చెందిన తల్లిదండ్రులు, బంధువులు నెలరోజుల వ్యవధిలో సంప్రదించాలని కోరారు. శిశుగృహలో ఉండే పిల్లలను న్యాయపరంగా దత్తత ఇస్తాం ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి -
23న విద్యార్థులకు నగదు పురస్కారాలు
తెనాలిఅర్బన్: వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 23న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు ఈఎల్వీ అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,16,000 పురస్కరాలతో పాటు 125 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, దుస్తులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని ముత్తెంశెట్టిపాలెంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి మాచర్ల :మండలంలోని గుండ్లపాడు గ్రామంలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త తోట వెంకయ్య అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇనుపరాడ్లతో రెండు కాళ్లపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పాతకక్షల నేపథ్యంలో వెంకయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని వెంకయ్యను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు పేర్కొన్నారు. జీఓ నంబర్ 117ను రద్దు చేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తొలగించేందుకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. చిరంజీవి డిమాండ్ చేశారు. నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం సంఘ జిల్లా అధ్యక్షుడు గోవిందు వెళాంగిణిరాజు అధ్యక్షతన సంఘ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ పాఠశాలల విలీనం పేరుతో ప్రాతమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల ప్రాథమిక విద్యా వ్వవస్థ నిర్వీర్యమవుతుందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు మాట్లాడుతూ తల్లి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోవిందు వెళాంగణిరాజు, జిల్లా ప్రదాన కార్యదర్శి కట్టెబోయిన నరసింహారావు, రాష్ట్ర నాయకులు జి.విజయానంద్ పాల్గొన్నారు. జీవో రద్దుపై లోకేష్ హామీ నిలుపుకోవాలి ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంపై జారీ చేసిన జీవో 117ను రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. పెదబాబు, డీకే సుబ్బారెడ్డి గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలన్నదే లక్ష్యం
నరసరావుపేట: ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలి, ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ అతిథి గృహంలో ఎన్ఎస్పీ, వ్యవసాయాధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రియల్టర్లు వందలాది ఎకరాల్లో పొలాలు, పంట కాలువలు, డొంక రోడ్లు, చెక్ డ్యాములు కబ్జా చేసి లే అవుట్లు వేస్తున్నారన్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజినీర్ కొడుకు ఇంజనీర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్న విధంగానే రైతు బిడ్డ రైతు అవుతానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. రైతుల పొలాలు ఆక్రమణకు గురవ్వడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన సదుపాయాలు అందకుండా పోతున్నాయని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అనుసరిస్తున్న విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు ప్రభుత్వాలపై ఆధారపడే పరిస్థితి పోవాలని, ప్రభుత్వమే రైతులపై ఆధారపడే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారి మస్తానమ్మ, ఎన్ఎస్పీ డీఇ రామారావు, నాయకులు వేల్పుల సింహాద్రియాదవ్, పులిమి రామిరెడ్డి, దేశిరెడ్డి చిన్నపరెడ్డి, రామారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
గుంటూరు రైల్వే డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజనల్ కార్యాలయంలో మూడో డివిజనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశం (డీఆర్యూసీసీ) నిర్వహించడం సంతోషంగా ఉందని డీఆర్ యూసీసీ చైర్మన్, డీఆర్ఎం ఎం.రామకృష్ణ చెప్పారు. స్థానిక పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో గురువారం డీఆర్యూసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో కోచ్ ఇండికేషన్ బోర్డుల మెరుగుదల, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, కొన్ని రైళ్ల నిలిపిత, రైళ్ల సమయాల మార్పులు, ఆర్ఓబీ, ఆర్యూబీలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. డివిజన్ పరిధిలోని కొన్ని సమస్యల పరిష్కారంపై హెడ్ క్వార్టర్స్ పరిశీలనకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. కొత్త గతి శక్తి టెర్మినల్స్ వచ్చాయని, డివిజన్లో మరి కొన్ని జీసీటీలు రానున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. సమావేశంలో ఏడీఆర్ఎం కె.సైమన్, డీసీఎం కో–ఆర్డినేషన్ సి.హెచ్.ప్రదీప్, సీనియర్ డీఓఎం దినేష్కుమార్, సీనియర్ డీఈఎన్ జె.వి.అనూష, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, మెయింటెనెన్స్ డీసీఎం భారత్, సుదర్శన్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్యూసీసీ సమావేశం హజరైన డీఆర్యూసీసీ చైర్మన్ రామకృష్ణ పలు కీలక అంశాలపై చర్చ -
గంజాయి కేసులో ఏడుగురు అరెస్ట్
తెనాలిరూరల్: గంజాయి కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ ఎ.సుధాకర్ కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చవటపల్లెకు చెందిన అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్ అలియాస్ మణి, మచిలీపట్నానికి చెందిన దాసరి శ్రీసాయిశంకర్ భవాని, పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన రామిశెట్టి శ్యాంవెంకట్ అలియాస్ బబ్లు ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. ఒడిశా నుండి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టారు. వీరి వద్ద విజయవాడ తాడిగడపకు చెందిన ఉయ్యూరు కౌశిక్రెడ్డి, తెనాలి నందులపేటకు చెందిన కోటి సాయిమంజునాథ్, పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అమ్మిశెట్టి మణికంఠ, తెనాలి నందులపేటకు చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి వీఎస్సార్ కళాశాల సమీపంలో బుధవారం సాయంత్రం ఏడుగురూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రావడంతో సీఐ సుధాకర్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. ఏడుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం నరసరావుపేట ఈస్ట్: పల్నాడురోడ్డులోని ఎన్బీటీ అండ్ ఎన్వీసీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కాకాని సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ– పొలిటికల్ సైన్స్, బీకామ్–కంప్యూటర్ అప్లికేషన్, బీఎస్సీ–జువాలజీ, బీఎస్సీ– కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ– మ్యాథమెటిక్స్ కోర్సులు ఉన్నాయని వివరించారు. ఇంటర్మీడియేట్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీలో చేరేందుకు వచ్చే విద్యార్థులు తమ వెంట ఇంటర్మీడియేట్ సంబంధిత సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల ఆధార్కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. విద్యార్థులకు సహాయపడేందుకు కళాశాలలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. -
ఎయిర్పోర్ట్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
విమానాశ్రయం(గన్నవరం): విమానాశ్రయ విస్తరణకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. స్థానిక ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ టెర్మినల్లో గురువారం విమానాశ్రయ విస్తరణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు చిన్నఅవుటపల్లి పరిధిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ప్లాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు కౌలు పరిహారం బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు గృహ నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్ఆర్ స్థలంలో విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయలు కల్పించాలని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ వల్ల రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యాజమానులకు అజ్జంపూడి పరిధిలో కేటాయించిన లేఅవుట్ అభివృద్ధికి ఏపీసీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఏలూరు కాలువపై చేపట్టిన కొత్త వంతెన నిర్మాణానికి అవరోధాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, గుడివాడ ఆర్డీఓ పద్మావతి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎల్.లక్ష్మీకాంత్రెడ్డి, జనరల్ మేనేజర్ (సివిల్) కె.రామాచారి, తహసీల్దారు పవన్కుమార్, సీఆర్డీఏ తహసీల్దారు పాపాయమ్మ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): సర్ధార్ గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ అధ్యక్షులు రావుల మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్ను గౌడ సంఘ ప్రతినిధులు కలిసి అభినందించడంతోపాటు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గీత కార్మికులకు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గాలి సుబ్బారావు, మొరాకుల రాము, నరేంద్ర, వెంకటరమణ, ప్రసాద్, రమణ, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. -
ఏపీలో పలువురు ఐపీఎస్ల బదిలీ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా రాజేంద్రనాథ్రెడ్డి బదిలీ అయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సునీల్కుమార్కు ఆదేశాలిచ్చింది. రిషాంత్రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.ఏసీబీ డీజీగా అతుల్సింగ్కు, ఫైర్ సేప్టీ డీజీగా శంకబ్రత బాగ్బీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. My warm wishes and greetings to the honourable President of India Smt Droupadi Murmu garu @rashtrapatibhvn on her birthday.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2024