అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి. శ్రీనివాస్ అన్నారు. అనంతపురం జిల్లా కోర్టులోని తన చాంబర్లో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. పోక్సో కేసుల కింద నష్ట పరిహారానికి సంబంధించి ముగ్గురు బాధితులకు ఒక లక్ష, రూ.2.50 లక్షలు, రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశామన్నారు. బాధితులకు పరిహారం అందించేందుకు హైకోర్టుకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ను సత్కరించారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం, ఇతర సమస్యల పట్ల ఆయన స్పందనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
‘ఎన్సీసీ’తో ఉన్నత భవిష్యత్తు
● క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ కులకర్ణ
కూడేరు: ఎన్సీసీ శిక్షణతో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని క్యాడెట్లకు సీఏటీసీ–1 ఎన్సీసీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ కులకర్ణ సూచించారు. గురువారం కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–1 ఎన్సీసీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంప్ కమాండర్ ఎన్సీసీ క్యాడెట్లనుద్దేశించి మాట్లాడారు. 10 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఇక్కడ నేర్పించే ప్రతి అంశం జీవితంలో ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాబట్టి క్యాడెట్లు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుబేదార్ సుల్దార్సింగ్, ఎన్సీసీ అధికారులు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 560 మంది క్యాడెట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment