-
బొగ్గు గనుల వేలంను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
-
సింగరేణిని ముంచే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసేందుకే... ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాడు అంధకారంలోకి దక్షిణాదిసింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిలో అతిపెద్ద కుట్ర
-
పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం
-
ఇరకాటంలో కేసీఆర్.. భ్రమలో తెలంగాణ సర్కార్?!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది. వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ ఉద్యోగ నియామకాలపై మాటల యుద్ధం
-
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. -
కాళ్ల మీద పడినా కనికరించడం లేదు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రజా దర్బార్లో కాంగ్రెస్ నేతల కాళ్ల మీద పడుతున్నా కనికరించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు కొత్త హామీలు కోరుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ముందు తాము పెడుతున్న ఐదు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి మరో ఐదు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. టీజీపీఎస్సీతో పాటు డీఎస్సీ పరీక్షలకు నడుమ కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామనే హామీ నిలబెట్టుకోవాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘నీట్’పై కేంద్ర మంత్రులు స్పందించాలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, నీట్ పరీక్ష విధానం, గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని హరీశ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను.. పార్టీ మారను తాను పార్టీ మారుతున్నట్లు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. వ్యూస్ పెంచుకునేందుకు ఒక నాయకుడి నిబద్ధత, నిజాయతీ దెబ్బతీయొద్దు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను, పార్టీలోనే కొనసాగుతాను. ఇలాంటి వార్తలు మానుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హరీశ్రావు హెచ్చరించారు. -
బేషరతుగా.. వస్తారా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగాల్సిన నేపథ్యంలో.. శాసన మండలి వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. మండలిలో బీఆర్ఎస్కే మెజారిటీ ఉంది. అసెంబ్లీ ఆమోదించి, పంపిన బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశమూ ఆ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతు న్నారని.. 11 మంది ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి బేషరతుగా వస్తేనే చేర్చుకుంటామని ‘ముఖ్య’ నేత షరతు పెడుతున్నారని అంటున్నారు. దీనితో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, కాంగ్రెస్లోకి వెళ్దామా, బీఆర్ఎస్లోనే కొనసాగుదామా అన్న విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు. మండలి బలం బీఆర్ఎస్దే తెలంగాణ ఏర్పాటైన మొదట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, శాసన మండలిలో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు ఉండేవారు. మండలిలో రెండేళ్లకోసారి కొన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతూ.. ఎమ్మెల్సీల పదవీకాలం కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మండలిలో బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్కు 26 మంది ఎమ్మెల్సీలు ఉండగా, కాంగ్రెస్కు ఆరుగురు, ఎంఐఎంకు ఇద్దరు, బీజేపీకి ఒకరు, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభా సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లు శాసనమండలికి వస్తుంది. దానిపై మండలి చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ఒకసారి తిప్పిపంపేందుకూ అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇకముందు కీలక బిల్లులు మండలికి వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్కు చాన్స్ ఉంటుంది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే తీర్మానం విషయంలోనూ మండలిలో అధికార పార్టీకి ఇబ్బందులు ఏర్పడటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరమేననే చర్చ జరుగుతోంది. ఇందుకుతగ్గట్టుగానే. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టు బిల్లులు, జిల్లా రాజకీయాల్లో తమకు కావాల్సిన పదవులు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు, ఇతర అవసరాల ప్రాతిపదికన 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లోకి వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ పార్టీ అవసరం ఎలా ఉన్నా ముందే షరతులు పెడుతూ వచ్చే వారిని తీసుకునేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ‘ముఖ్య’ నేత చెప్తున్నారని అంటున్నాయి. దీంతో బీఆర్ఎస్లోనే ఉండి ఎలాగొలా నెట్టుకురావాలా? అధికార పార్టీలోకి వెళ్లి ‘పనులు’ చక్కబెట్టుకోవాలా అన్నదానిపై కొందరు ఎమ్మెల్సీలు తర్జనభర్జన పడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలి చైర్మన్పై ఆసక్తికర చర్చ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుమారుడు అమిత్రెడ్డికి బీఆర్ఎస్ లోక్సభ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు ముందే అమిత్రెడ్డి కాంగ్రెస్లో చేరారని అంటున్నారు. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందనే చర్చ కూడా మొదలైంది. కానీ బీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో గుంభనంగా ఉన్నాయి. సుఖేందర్రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్లోనే ఉన్న నేపథ్యంలో ఏం చేసినా రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండాలన్న ధోరణిలో గులాబీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఉన్నట్టుండి మండలి చైర్మన్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవిశ్వాసం నోటీసు ఇస్తే ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో ఏం జరుగుతోందో అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
26 మంది ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్సభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాలనా వ్యవస్థ ప్రక్షాళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి దృష్టిసారించారు. ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అధికారులతో సొంత జట్టు కూర్పుపై వారం పది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతోపాటు ఆయా జిల్లాల మంత్రులతో చర్చించిన అనంతరం శనివారం భారీ సంఖ్యలో జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయంలో సంయుక్త కార్యదర్శులుగా కీలక స్థానాల్లో పనిచేస్తున్న 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశా రు. ఒకేసారి 18 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించారు. బదిలీ అయిన 8 మంది జిల్లా కలెక్టర్లకు కొత్త పోస్టింగ్పై ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడంతో వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచినట్టు అయిందని చర్చ జరుగుతోంది. పమేలా సత్పతి, సిక్తా పటా్నయక్, యాస్మిన్ బాషా, హరిచందన దాసరి, అశీష్ సంగ్వాన్, భవేష్ మిశ్రా, రవి, ప్రియాంక అలా వీరిలో ఉన్నారు. వీరందరికి పోస్టింగ్ ఇవ్వాలంటే మరోసారి భారీస్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ట్రాన్స్కో జేఎండీగా కీలకమైన పోస్టులో సందీప్కుమార్ ఝాను నియమించగా, ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజీ్వకి ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఖాళీగా కూర్చొబెట్టారు. తాజాగా సందీప్కుమార్ ఝా సైతం బదిలీకావడం గమనార్హం. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పోస్టింగ్లు పొందిన అధికారులందిరికీ స్థానచలనం కల్పించాలనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఎస్పీల బదిలీలపై సైతం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి. -
కమిషన్ నుంచి తప్పుకోండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు.. విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణిజస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.చత్తీస్గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో మంత్రి కొమటిరెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేందుకు కేటీఆర్, సంతోష్ రావులు ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రి, చత్తీస్గఢ్ కరెంట్ విషయంలో అవకతవకలు జరిగాయి. విద్యుత్ అంశంలో 15 వేల కోట్ల అవినీతి జరిగింది. నిజాయితీ గల వ్యక్తితో కమిషన్ వేస్తే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కమిషన్పై నమ్మకం లేదని కేసీఆర్ అనడం దుర్మార్గమని అన్నారు. మీరు ఎన్ని అవకతవకలు చేసినా వదిలేయాలా? అని ప్రశ్నించిన కోమటి రెడ్డి.. గొర్రెల పంపిణీలో జరిగిన ఏడు వందల కోట్లు అవినీతిపై ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును అమెరికాలో హరీష్ రావు కలిశారు. ఇండియాకు రావద్దని ఆయనకు హరీష్ రావు చెప్పారని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో దోచుకున్న ఆస్తిని పంచాడు. కేసీఆర్ గురించి మాట్లాడితే నోరు పాడవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధ్వజమెత్తారు. -
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
‘టైమ్బౌండ్’ ఒత్తిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్కు బరాజ్ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. బరాజ్ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్కుమార్ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్పైల్స్కు బదులు సెకెంట్ పైల్స్ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు.ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు. నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణజస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్కు సమర్పించింది. -
నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు
-
బోనస్ అంతా బోగస్ పంట పెట్టుబడి ఇవ్వకుంటే
నంగునూరు (సిద్దిపేట): ‘వానాకాలం ప్రారంభమై నా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోంది. పంటకు బోనస్ అన్న మాటను బోగస్గా మార్చారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి లో రైతు నాగేంద్ర పొలంలో ఆయిల్పామ్ మొదటి పంటను కోసి క్రాప్ కటింగ్ను ప్రారంభించారు.అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవడంలేదని, ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వరి పంట బోనస్ విషయంలో మంత్రులు తలో మాట మాట్లాడుతు న్నారని విమర్శించారు. పంట పెట్టుబడితోపాటు రైతు సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఆయిల్పామ్ దిగుబడిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తొలగించడంతో దిగుమతులు పెరిగి విదేశీ మారకం నష్టపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్పామ్ పంట సాగును ప్రోత్సహించడంతో ఖమ్మం తరువాత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలిచిందన్నారు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
ఫలితాలపై BRSలో అంతర్మధనం
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ తొండిఆట ఆడింది బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తొండిఆట ఆడిందని కిషన్రెడ్డి అన్నారు. అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు. బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్ఎస్కు కంచుకోటలాంటి మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్రెడ్డి ఆరోపించారు. రామమందిరం రాజకీయఅంశం కాదు దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.