-
మధ్యేమార్గ సంస్కరణలతోనే.. సుపరిపాలన!
వరి పంటలో పొడుగు రకం అక్కుళ్ళు స్థానంలోకి పొట్టి రకం–స్వర్ణ ‘హైబ్రీడ్’ వచ్చినప్పుడు పాత–కొత్తల మధ్య అప్పట్లో జరిగిన ఆ మార్పు ఏమంత సాఫీగా అవలేదు. ఆ బియ్యంతో వాతం కలిగి కీళ్ళ నొప్పులు వస్తాయనీ, ఆ గడ్డి తిన్న పశువులు పాలు ఇవ్వవు అనీ అపోహలు ఊళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు అదంతా చరిత్ర. అదే ‘పొట్టి’ వరి రకాలపై వందలకొద్దీ పరిశోధనలు జరిగిన తర్వాత, వస్తున్న పలు రకాల‘రిఫైండ్’ బియ్యం అన్నం ఇప్పుడు మనం తింటున్నాం.ఒక అన్నం అనే కాదు, అది ఏ రంగమైనా కొత్తదనాన్ని అంత తేలిగ్గా అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం. పైకి అది నిజమని ఒప్పుకోవడానికి మనం పెద్దగా ఇష్టపడం. కానీ, జీవితం ఏవో కొన్ని చట్రాల మధ్య స్తబ్ధుగా అలా సాగిపోవడంలో కూడా వొక నులివెచ్చని సౌఖ్యం ఉంటుంది. దాన్ని తప్పు పడుతూనే ప్రతి కాలంలోనూ కవులు, రచయితలు సమాజాన్ని జాగృతం చేసేది.అది ఏ చట్రం అయినా కానీ, ఈ నులివెచ్చని సౌఖ్యం మనకు ఎలా ఉండాలి అంటే– కష్టం వస్తే చెప్పుకోవడానికి సమీపాన ఒక పెద్దమనిషి ఉండాలి. అతడు మనకంటే కొంచెం ఎత్తులో కూర్చుని అవసరమైతే మనల్ని గదమాయిస్తూ సలహా వంటిది చెప్పే వాడై ఉండాలి. అతడు చెప్పాలి మనం వినాలి. వెళ్ళిన పని అయ్యీ కానట్టుగా పాక్షికంగా జరగాలి. ఎందుకంటే, మన కష్టానికి కారణమైన వారికీ ఇదే పెద్దమనిషి పూచీ.ఇదీ ఇన్నాళ్ళూ మనకు తెలిసిన లెక్క. మరి ఇప్పుడు అదేమీ కాదని ఆ స్థానంలోకి ఒక ‘వలంటీర్’ వచ్చాక, ఆ వెనుక ఒక సచివాలయం అనే ఆఫీసు... అక్కడిచ్చిన ఫిర్యాదు పైకి వెళ్లి కిందికి పరిష్కారం రావడం అంటే, మరీ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఏమిటి ఇదంతా?! అదే పని అయినా... మరీ ఇంత వేగిరం (‘ఎస్ ఆర్ నో’) తెమిలిపోతే ఎలా? ఆ తర్వాత ఏమిటి చేయడం? 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే పెద్ద సమస్య అయింది. ఒకే ఒక్క ‘బటన్ నొక్కడం’ అనేది పైన చెప్పిన వైనం మొత్తానికి చోటు లేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే, సామాన్యుల జీవనంలో ఎంతో విస్తరించుకుని ఉండే ఇంత పెద్ద ‘మెలోడ్రామా’ బొత్తిగా మాయమయింది.సంప్రదాయ రాజకీయ సమాజంలో ఆధిపత్య కులాల పెద్దలకు ‘రికార్డు’లో వారికి ఎటువంటి హోదా లేకున్నా కేవలం ‘బై నేమ్’ వారు ఫోన్ చేసి రెవెన్యూ, పోలీస్ ఆఫీసుల్లో ‘పవర్’ చెలాయిస్తూ పనులు చేయించడం చాలా పాత విషయం. చట్టసభల్లో ఉండే నాయకులు ఇటువంటి ‘సెమీ వర్టికల్స్’ వలయాలు తమచుట్టూ ఏర్పడాలని, అటువంటివి వీలైనంత ఎక్కువగా ఉండేట్టుగానే వారు కూడా కోరుకుంటారు. ఎందుకంటే, ఎన్నికలప్పుడు ఓటర్లతో ‘లైవ్ నెట్ వర్క్’ ఉండే ‘ఛానెల్’ వాళ్లకు ఇదే! కుదిరితే ఏవో నామినేటెడ్ చైర్మన్ పదవులు లేదా ‘కాంట్రాక్టులు’ వీళ్ళకు ఎటూ ఉంటాయి. కౌన్సిలింగ్ పద్ధతి లేని రోజుల్లో చిన్న ఉద్యోగుల బదిలీలు వీళ్ళు అవలీలగా చేయించేవారు. వీరు కేంద్రంగా జరిగే లావాదేవీలు పార్టీల్లో చిన్నకులాల కార్యకర్తలకు అదొక మధ్యస్థాయి అదనపు వ్యాపారంగా సాగేది.అయితే, దశాబ్దాలుగా ఇంత చిక్కటి వలయాలుగా అల్లబడిన అధికార చట్రం కూసాలను, ఐదేళ్ళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం–గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థతో ఎక్కడికక్కడ వదులు చేసేసింది. దాంతో ‘డెలివరీ సిస్టం’లో ఉండే ‘లీకేజీ’ల వద్ద ప్రయోజనం పొందే ‘కేడర్’ నష్టపోయి అసంతృప్తులు అయ్యారు.‘పవర్ పాలిటిక్స్’లో జరిగే ఇటువంటి మార్పును నిజానికి ‘న్యూట్రల్ ఓటర్’ హర్షించాలి. అది జరగలేదు సరికదా– ‘మాది తీసి వాళ్లకు పెడుతున్నారు...’ అనే ఫిర్యాదు వద్దే వాళ్ళు ఆగిపోయారు. అలా ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అవసరాన్ని గడచిన పదేళ్ళలో అందరూ మర్చిపోయారు. ఇంతకీ జరిగింది ఏమిటి, మునుపున్న ‘సెమీ–వర్టికల్స్’ జాగాను గ్రామ సచివాలయాలలోని బహుజన యువతతో ‘హారిజాంటల్’గా జగన్ మార్చారు.అయితే, సంప్రదాయ అధికార నిర్మాణ చట్రం ఎప్పుడూ భద్రత కోరుకుంటుంది. ఏ కారణం చేత అది బీటలకు గురైనా పార్టీలతో పనిలేకుండా మొత్తం రాజకీయ చిత్రంపై దాని పర్యవసానాలు ఉంటాయి. జగన్ పాలనలో ఏపీలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలైనట్టు తెలుస్తూనే ఉంది. కానీ జరిగింది ఏమిటి? సంప్రదాయ ‘పవర్ పాలిటిక్స్’ బహుళ అంచెలు (హైరార్కీ) కొంతమేర నిర్వీర్యం కావడం నిజమే. కానీ, ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి వచ్చిన ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ఆ పార్టీకి పాక్షికంగానే ఉపకరించాయి. ఆ కారణంగా, ఒక హక్కుగా ‘రాజ్యం’ ఇచ్చే సంక్షేమ ప్రయోజనాలు తీసుకుంటూనే, ఏ ఒక్క రాజకీయ పార్టీకి విశ్వాసంగా ఉండనక్కర లేదనే స్వేచ్ఛాశ్రేణులు ఏర్పడే కొత్త పరిస్థితికి అది దారితీసింది.ఈ పార్టీ తీసుకున్న ఈ కొత్త వైఖరి వల్ల, అది తన ఓటర్లకు– ‘మీ మెడమీద ఇకముందు ఏ కాడి ఉండదు’ అని భరోసా ఇచ్చింది. గెలిచారా, ఓడారా అనేది అటుంచితే... రూపాంతర ప్రజాస్వామ్యం (‘ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ’) దృష్టి నుంచి చూసినప్పుడు ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నాళ్ళూ కనిపించని చట్రాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్ఛగా బతకమని పంజరంలో నుంచి వాటిని బయటకు వదలడం వంటిది.ఇంత చేసి– ‘మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని జగన్ ‘ఆప్షన్’ ఇవ్వడం– ‘లిబరల్ డెమోక్రసీ’ వైఖరికి పరాకాష్ట. జనానికి అది అర్థం కాకపోతే, రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావొచ్చు. కానీ, దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఒక ‘కేస్ స్టడీ’ కానుంది. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా రీసెర్చ్ ఫెలో విగ్నేష్ కార్తీక్, జేఎన్యూ పరిశోధకుడు వి. చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో రెండు పక్షాల వైఖరిలోని వైవిధ్యాన్ని ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక వ్యాసంలో వెలికి తీశారు.– జాన్ సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
మనం మరచిన గాంధీజీ రక్షకుడు..
జాతిపిత మహాత్ము ప్రాణాలు కాపాడిన ఓ త్యాగశీలి జన్మదినం నేడు. ఆయన పేరు బతఖ్ మియా అన్సారీ. 1869 జూన్ 25న బిహార్లోని మోతీహార్ గ్రామంలో జన్మించారు. బిహార్ లోని చంపారణ్ జిల్లాలో ఆహార పంటలు వదలి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలు పండించమని బ్రిటిష్ వలస పాలకులు రైతులను నిర్బంధించేవారు, హింసించేవారు. ఈ అకృత్యాలను వివరించి అక్కడి రైతులను పరామర్శించమని ఆ ప్రాంతంవారు కొందరు గాంధీజీని అభ్యర్థించారు.దీంతో 1917 ఏప్రిల్లో ఆయన అక్కడికి వెళ్లారు. దీంతో ఇర్విన్ అనే బ్రిటిష్ ఇండిగో ఎస్టేట్ మేనేజర్ గాంధీజీని భోజనానికి ఆహ్వానించి అంతం చేయాలని పథకం పన్నాడు. తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీని పిలిచి, గాంధీజీకి పాలలో విషం కలిపి ఇచ్చి చంపాలని ఆదేశించాడు.ఈ పని చేస్తే జీతం పదింతలు పెంచుతాననీ, విలువైన భూములు ఇస్తాననీ చెప్పాడు. బాబూ రాజేంద్ర ప్రసాద్తో కలిసి గాంధీజీ భోజనానికి వచ్చారు. ఇర్విన్ ఆజ్ఞను ధిక్కరిస్తే గతి ఏమవుతుందో తెలిసినప్పటికీ, పాలు అందిస్తూనే అందులో విషం కలిపిన విషయాన్ని ఆయన గాంధీజీకి చెప్పి ఆయన ప్రాణాలు రక్షించారు. అగ్గిమీద గుగ్గిలమైన ఇర్విన్ ఆ తరువాత అన్సారీ ఇంటినీ, ఆయనకున్న కొద్దిపాటి భూమినీ జప్తుచేయించి ఊరి నుండి వెళ్ళగొట్టాడు.1950లో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మోతీహార్ వెళ్ళి ఒక సభలో ప్రసంగిస్తుండగా తనను కలవడానికి ప్రయత్నిస్తున్న అన్సారీని వేదికపైకి పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఇర్విన్ అకృత్యాలు విని విచలితుడై అప్పటికప్పుడు 50 ఎకరాల భూమిని అన్సారీ, ఆయన ముగ్గురు కుమారుల కుటుంబాలకూ కేటాయించాల్సిందిగా ఆదేశించారు. అన్సారీ ఏడేళ్ళపాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా రాష్ట్రపతి ప్రకటించిన భూమి ఆయనకు దక్కలేదు.చివరికి 1957 డిసెంబర్ 4న కన్నుమూశారు. మొత్తంమీద ఒక ఆరు ఎకరాల భూమిని ఓ నది ఒడ్డున జిల్లా కలెక్టర్ కేటాయించారు. ప్రస్తుతం నది కోతకు గురై ఐదెకరాల భూమి మాయమై ఎకరం మిగిలింది. ఇప్పటికీ తమకు రావలసిన భూమికోసం అన్సారీ కుటుంబీకులు అర్జీలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
నాన్న వంటబట్టించిన కళ
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..నాన్న ‘వంటబట్టించిన’కళ... మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్కు గుడ్బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది. టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.ఫాదర్స్ డే స్పెషల్ కథనం -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
Father's Day 2024: హాయ్..! నాన్న..!!
"ఏ కష్టం ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం"...నేడు ‘ఫాదర్స్ డే’ ఈ పాట వినగానే గూస్బమ్స్ వస్తాయి.. ఇప్పుడెందుకు ఈ పాట గురించి చెప్పాల్సి వచ్చిందంటే..అదే నండి జూన్ 16న ‘ఫాదర్స్ డే’. నేటి హాయ్ నాన్న.. మొదలుకుని.. నాటి ‘డాడీ’ వరకూ అనేక సినిమాలు నాన్న కూతురు, నాన్న కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా చిత్రించారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నిజజీవితంలోనూ మనలో చాలామందికి రోల్ మోడల్ నాన్నే.. పైకి కోపంగా, కటువుగా, గంభీరంగా కనిపించే నాన్న మనసు పొరల్లో దాగున్న ప్రేమ బయటకు చెప్పలేనిది.లోపల ఎంత ప్రేమున్నా.. పైకి చూపిస్తే..పిల్లలపై ప్రభావం పడుతుందనుకునే నాన్నను అర్థం చేసుకునేవాళ్లు తక్కువ మందే.. అందుకే చాలా మందికి చివరి వరకూ నాన్న విలన్ లానే కనిపిస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఆయనే నిజమైన హీరో. అయితే నాన్న ప్రేమను అర్థం చేసుకోవడమూ అంత తేలికేం కాదు...మన కోసం తన కోర్కెలను, ఆశయాలను, ఆలోచనలను, ప్యాషన్ను, ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తాడు. అలాంటి నాన్నల గురించి ఫాదర్స్ డే సందర్భంగా పలువురిని సాక్షి పలుకరించగా.. వారు పంచుకున్న విశేషాలు...వారిమాటల్లోనే...ఆయన అలవాట్లే నాకొచ్చాయి..మాది ఉమ్మడి కుటుంబం. తాత కొండా వెంకటరంగారెడ్డి. నాన్న పేరు జస్టిస్ కొండా మాధవరెడ్డి. మాది పెద్ద కుటుంబం కావడంతో అంతా కలిసి భోజనం చేసే వాళ్లం. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాను. ఆయనంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ విధిగా పాటించేవాడిని. నాపై ఆయన కోపం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఎంత బిజీగా ఉన్నా...కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేవారు. ప్రతి రోజు కలిసే డిన్నర్ చేసేవాళ్లం. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే కాకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలపై పెద్ద చర్చే జరిగేది.ఆయన అలవాట్లే నాకూ వచ్చాయని అంతా అంటుంటారు. భోజనం తర్వాత స్వీటు తినే అలవాటు ఆయన నుంచి వచ్చినదే. కోపం కూడా ఆయన మాదిరే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జడ్జిగా పని చేస్తూ వ్యవసాయ పనులు చూసుకునే వారు. సాంస్కృతిక కేంద్రాలు. విద్యా సంస్థలు నిర్వహించారు. చాలా అంశాల్లో నాన్నే ఆదర్శం. ప్రతి అంశాన్నీ విశ్లేషించడమేకాదు..వాటి పరిణామాలనూ చెప్పేవారు. – చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డినాన్నే స్ఫూర్తి..స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. కుటుంబంతో కలిసి సోమాజీగూడలోనే స్థిరపడ్డాం. ఖైరతాబాద్ నాసర్ స్కూల్లోనే 12వ తరగతి వరకూ చదువుకున్నా. అమ్మ సుజాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉద్యోగిని. నాన్న చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఆఫీస్ మా ఇంటి పక్కనే ఉండేది. మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్ అయిపోయేది. దీంతో నాన్నే వచ్చి చూసుకునే వారు. ఆయన ప్రోత్సాహంతోనే స్కూల్ టాపర్గా మారా.నాన్న వారసురాలిగా 2011లో సీఏ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యా. నాన్నకు చిన్న తనం నుంచి సివిల్స్పై ఆసక్తి ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో సాధ్యంకాలేదు. నాకూ చిన్నప్పటికీ నుంచి సివిల్స్పై ఆసక్తి ఉండేది. మొదటి రెండు ప్రయత్నాల్లో సరైన గైడెన్స్ లేక అర్హత సాధించలేకపోయా. మూడో ప్రయత్నంలో నేను చేసిన తప్పు వల్ల అవకాశం కోల్పోయా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.‘నా కోసం వద్దు. నీకు పూర్తి ఆసక్తి ఉంటే విఫల్యాలను మర్చిపోయి మరింత దీక్ష, ప్రణాళికతో ముందుకెళ్లు’ అంటూ స్ఫూర్తి నింపారు. 2016లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో ఇండియాన్ ఫారెన్ సరీ్వస్కు ఎంపికయ్యా. ఆ తర్వాత అనేక విభాగాల్లో పనిచేశా. గడిచిన ఆరు నెలలుగా సికింద్రాబాద్ ఆరీ్పఓగా సేవ లు అందిస్తున్నా. నా భర్త రోహిత్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సరీ్వస్ (ఐఐఎస్) అధికారి. మా పాప సహస్రను ఆయనే చూసుకుంటారు. నాన్నకు సహస్ర మరో స్నేహజ. ‘నేను స్నేహజ ఫాదర్’ అంటూ నాన్న గర్వంగా చెప్పుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. –స్నేహజ, ఆర్పీఓ, సికింద్రాబాద్నాన్న వల్లనే ఈ స్థాయికి..చిన్న తనం నుంచి చదువు ఎంత ముఖ్యమో చెప్పేవారు. తాను హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉద్యోగవిరమణ చేసినా పిల్లలందరినీ ఉన్నత చదువులకు పట్టుబట్టారు. నాన్న పేరు అంబడపూడి మనోహరం. నాన్నతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ఎంతో ప్రేమానురాగాలను పంచేవారు. ఎంత కష్టమైనా ఉద్యోగాలు పొందాలనే అందరికీ చెప్పేవారు. ఆయన ఒత్తిడితోనే గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఆడపిల్లలకు నాన్న అంటే భరోసా, కొండంత అండ, అన్నింటికీ నాన్న ఉన్నాడులే అనే భావన ఎప్పటికీ ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే నాన్నే నాకు స్పూర్తి. – అంబడపూడి శారద, ప్రిన్సిపల్ – సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డి ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం..నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆ పాత్ర ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. మాది కోనసీమజిల్లా చెయ్యేరు అగ్రహారం. దార్ల లంకయ్య(అబ్బాయిగారు), తల్లి దార్ల పెదనాగమ్మకు మేము ఐదుగురు సంతానం. అయినా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో చూసేవారు. తాను చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు.నాన్న ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా మా కడుపులు నిండాలని తపించేవారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఆ ఫలితాలను అనుభవించడానికి ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. మా చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకుని నాటకాలకీ, సినిమాలకీ తీసుకెళ్లేవారు. ఆహార పదార్థాలను తన చేతి రుమాలలో మూటగట్టుకొని తెచ్చిన రోజుల్ని మర్చిపోలేము.మా నాన్నని అందరూ ముచ్చటగా ‘అబ్బాయి’ అని పిలిచేవారు. అసలు పేరుకంటే అదే íస్థిరపడిపోయింది. అదే మానాన్న ఆత్మీయానురాగాలకు గొప్ప నిదర్శనం. నాన్న జ్ఞాపకార్థం హెచ్సీయూలో ప్రతి ఏటా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు–హెచ్సీయూమంచి ఇంజినీర్ కావాలి..ఆస్తులు అమ్మి అయినా ఖర్చు పెడతా అనేది మా తండ్రి. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో పేద కుటుంబం మాది. నాన్న జి బాలకిష్టయ్య గౌడ్, అమ్మ లక్ష్మీదేవమ్మ. ఇంట్లో ఆరుగురు అక్కలు పుట్టిన తర్వాత నేను పుట్టడం, అదే రోజు మా వనపర్తి రాజుగా ఉండే రామేశ్వరరావు ఊరికి రావడంతో అయన పేరునే నాకు పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో తెలుగు మీడియం చదివా. తర్వాత పాలిటెక్నిక్ చేసి ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చదివా.అవసరమైతే ఆస్తులు అమ్మేస్తా... నువ్వు ఇంజినీర్ అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలనేవారు. నాన్న కల నెరవేర్చేందుకు మా తమ్ముడిని కూడా ఇంజినీరింగ్ చదవించా. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ కావడం నాన్న ప్రోద్బలమే.. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నలుగురూ చదువుకునేలా ప్రోత్సహించాలనేవారు నాన్న. ఇప్పటికీ నాన్న మాటలు నా చెవులకు వినిపిస్తుంటాయి. – డాక్టర్ జి రామేశ్వరరావు, డైరెక్టర్ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాఅందరూ చదవాలి..ఎంతకష్టమైనా పడతా...చదవండి అనేవారు నాన్న... అనంతపురం రాయదుర్గంలో టైలర్ మహ్మద్ అనీఫ్ నాన్న. కుటుంబంలో చదువుకున్నవారుంటే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడతా చదవండి అంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.ఒకరిని నేవీలో ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అక్క మంచి గైనకాలజిస్ట్గా గుర్తింపు పొందారు. నన్ను కూడా చదివించగా అనంతపురం జేఎన్టీయూలోఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించాను. అనంతరం ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి 1999లో రాయదుర్గం జీఐఎల్టీలో లెక్చరర్గా చేరా. ప్రస్తుతం ప్రిన్సిపల్గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ రాయదుర్గంలో ఉంటూ ఫోన్ చేస్తే మొదట పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతారు. –షేక్ ఎక్బాల్ హుస్సేన్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ–రాయదుర్గంనా ఇష్టాలను గౌరవిస్తారు...నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చేవారు. మొదట సినిమాల గురించి అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. దీంతో టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. ఆ సమయంలోనే ఓ షార్ట్ఫిల్మ్ కాంటెస్ట్లో చేయడం, అది పెద్దగా హిట్ అవ్వడంతో సుకుమార్ నన్ను రంగస్థలానికి ఎంపికచేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ప్రీమియర్కి పిలిచినప్పుడే చెప్పా.యాక్టింగ్ చూశాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకూ ఒప్పుకోరనుకున్నా.. మా నాన్నే నా లైఫ్లో రియల్ హీరో.. ఇండస్ట్రీకి ఓ అమ్మాయి వెళ్తుందంటే చాలా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. రూమర్స్ని అస్సలు పట్టించుకోరు.. నా ఎదుగుదల చూసి గర్వపడతారు.. – పూజిత పొన్నాడ, హీరోయిన్ఇవి చదవండి: -
Gunshot: ఇదికదా YS జగన్ స్టామినా.. పర్ఫెక్ట్ విశ్లేషణ
-
పంఘాల్ పంచ్..
అమిత్ పంఘాల్ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్ చెప్పుకున్నాడు కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్ను పెద్ద బాక్సర్ను చేసింది.అన్న అండగా నిలవడంతో...హరియాణాలోని రోహ్టక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్ పంఘాల్ ముందుగా బాక్సింగ్లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్పై దృష్టి పెట్టాడు. అనిల్ ధన్కర్ అనే రాష్ట్ర స్థాయి కోచ్ రోహ్టక్లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్ తీసుకున్నారు.అయితే అజయ్ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్ పంచ్లు, అతని శైలి మాత్రం కోచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.2018 ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్ 24 గంటలూ బాక్సింగ్నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్.. అతడిని బెస్ట్ కోచ్ అంటూ పిలుస్తాడు.జాతీయ స్థాయిలో మెరిసి...అమిత్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్ జూనియర్ చాంపియన్గా అమిత్ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్ గుర్గావ్లోని కాంబాట్ బాక్సింగ్ క్లబ్లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్ మరింత పదునెక్కింది.కాంబాట్ క్లబ్లో శిక్షణ తర్వాత జూనియర్ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్లు సీనియర్ స్థాయికి ప్రమోట్ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.2019 ఆసియన్ చాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో, 2024 పారిస్ ఒలింపిక్స్కు ఎంపికైన అమిత్..ప్రపంచ వేదికలపై...జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్షిప్ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 22 ఏళ్ల వయసులో అమిత్ తొలిసారి వరల్డ్ చాంపియన్షిప్లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.క్వార్టర్ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్కు చెందిన హసన్బయ్ దుస్మతోవ్ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్ ఫ్లయ్వెయిట్ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్ బాక్సర్ గలాల్ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో తన స్థాయిని అమిత్ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.వరల్డ్ నంబర్వన్గా...2019లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ అమిత్ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్షిప్లో పసిడి గెలిచిన ఊపులో అమిత్ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్లో ఉన్న అమిత్ ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో 52 కేజీల విభాగంలో నంబర్వన్గా నిలవడంతో అతని కెరీర్ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా అతను పని చేస్తున్నాడు.2019 ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)ప్రతికూల పరిస్థితి దాటి...అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్ సమాఖ్య అమిత్ పంఘాల్ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని, చికెన్ పాక్స్ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.‘ఒలింపిక్ పతకం సాధించిన రోజే బాక్సింగ్లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్ మెడల్ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్కు అమిత్ సిద్ధమయ్యాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
దేవుడు విడిచిపెట్టిన ప్రదేశాలలో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనేది నానుడి. అలాగే, ‘నిర్మానుషమైన ప్రదేశాల్లో చీకటి వేళల్లో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనుకుంటే పొరబాటే’ అంటారు చాలామంది. అందుకే కాబోలు.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిసర ప్రాంతాలు ఎంత రద్దీగా ఉన్నా.. ఎంత జన సందోహంతో నిండి ఉన్నా.. అక్కడ వెంటాడే భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కథల్లో బృందావన్ సొసైటీ హారర్ స్టోరీ ఒకటి.ముంబై, థానే ప్రాంతంలో ‘బృందావన్ సొసైటీ’ హడలెత్తించే కథలకు బాగా ఫేమస్. అందులో పదుల సంఖ్యలో బిల్డింగ్స్, వందల సంఖ్యలో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే అక్కడ నివసించే వారితో పాటు.. కాపలాకి వచ్చే వాచ్మన్, ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చే పనివాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ‘అపార్ట్మెంట్ 66బి’ గురించి కనీసం మాట్లాడాలన్నా భయపడతారు. అటు వైపు తేరిపార చూడాలన్నా వణికిపోతారు. అందులో దయ్యం ఉందని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ దరిదాపుల్లోకి కూడా చాలామంది అడుగుపెట్టరు.ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం తనకు ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, వారిని లాగిపెట్టి కొడుతుందట! ఆ దయ్యం కొట్టిన చెంపదెబ్బకు గూబ గుయ్యిమంటుందట! అంతేకాదు, ఆ భవనం కారిడార్లలో ఏవేవో వింతస్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయట! బెడ్ రూముల్లో ఏవో గుసగుసలు చెవిన పడతుంటాయట!ఆ చుట్టుపక్కల నివసించేవారిలో కొందరు మాత్రం ఆ 66బిలో కచ్చితంగా ఏదో ప్రేతాత్మ ఉందని, అటుగా వెళ్లినా, ఆ వైపు పరిశీలనగా చూసినా ఎవరో వేగంగా తమవైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుందని చెబుతారు.అయితే అపార్టమెంట్ 66బి చరిత్రను తవ్వితే ఒక విషాదగాథ వినిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ పెద్దాయన జీవితం మీద విరక్తితో, మానసిక ఒత్తిడితో బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణం పోలీసు రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని, తనకు చిరాకు తెప్పించేవారిని కొట్టి భయభ్రాంతులను చేస్తుందని స్థానికుల్లో చాలామంది నమ్ముతారు.స్థానికుల నమ్మకానికి తగినట్లుగానే ఆ 66బి ఫ్లా్లట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది. కొంతమంది నివాసితులు భవనంలో దయ్యం ఉండే అవకాశమే లేదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం స్వయంగా తాము దయ్యం నీడను చూశామని, దాని గొంతును విన్నామని, దయ్యం చేతిలో దెబ్బలు కూడా తిన్నామని చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ అపార్ట్మెంట్లో ఆ చుట్టు ప్రక్కల కేవలం ఒక్క దయ్యమే లేదని, చాలా దయ్యాలు ఉన్నాయని హడలెత్తిస్తారు. ఆ మాట విన్న కొందరు మాత్రం.. ‘ఇక్కడ చాలా దయ్యాలేమీ లేవు.. కొట్టే దయ్యం ఒక్కటే ఉంది. దానితో జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని చెబుతారు.ఏది ఏమైనా, ఆ సొసైటీకి వెళ్లిన కొత్తవారు ఈ వింత అనుభవాన్ని చవిచూడక మానరట! ఎందుకంటే కొత్తవారిని అక్కడి దెయ్యం ఈజీగా గుర్తుపడతుందట! తన దెబ్బను రుచి చూపిస్తుందట! పాతవారైనా సరే ఆ దయ్యానికి ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి పోతుందట. మరి నిజంగానే అక్కడ ఆ పెద్దాయన ఆత్మ ఉందా? అసలు అది ఆ అపార్ట్మెంట్ యజమాని ఆత్మేనా? అసలు అక్కడుండేవారిని, అక్కడికి కొత్తగా వచ్చేవారిని కొడుతున్న అదృశ్య శక్తి ఏమిటి? ఆ ఆత్మతో పాటు మరికొన్ని అతీంద్రియశక్తులు అక్కడ గుమిగూడాయా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ? -
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
-
నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..
జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ. ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్ తెచ్చి ఫామ్హౌస్లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.‘టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’ కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం. ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం. ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల. నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం. ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పీ చంద్రశేఖరం.నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత. వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది. నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని. వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు. పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్. ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్. ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం. చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు. ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! ఫోన్ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్మార్నింగ్ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్ వచ్చింది. వీసా కన్ ఫర్మ్ అయ్యింది తాతయ్యా!ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది. కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి. ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు -
నవరత్నాల నవశకానికి ఐదేళ్లు
-
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
రేవ్ పార్టీ అంటే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్క్లబ్లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్,ఎలక్ట్రానిక్ సంగీత కారుల హోరు, అర్థనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ రావడం గమనార్హం.సాధారణంగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), టెక్నో మ్యూజిక్ ,ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇలా అనేక రకాల మ్యూజిక్స్తో హోరెత్తించే భారీ ఆల్-నైట్ డ్యాన్స్ పార్టీలు. మిరుమిట్లు గొలిపే లైట్ షోలు, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మిళితంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగానో, లైసెన్స్ ఉన్న క్లబ్స్లో జరుగుతాయి. రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. వాటి వివరాలు చూద్దాం.రేవ్ పార్టీలు, రకాలుఫెస్టివల్ రేవ్స్: ఫెస్టివల్ రేవ్లు చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు. ఇందులో టెక్నో, హౌస్ ,డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టయిల్స్ ఉంటాయి.అండర్గ్రౌండ్ రేవ్లు: అండర్గ్రౌండ్ రేవ్లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాలుచ అండర్ గ్రౌండ్ క్లబ్లలో నిర్వహిస్తారు. క్లబ్ రేవ్స్: క్లబ్ రేవ్లు సాంప్రదాయ నైట్క్లబ్ వేదికలలుగా ఏర్పాటు చేస్తారు. టెక్నో, హౌస్ , ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ సంగీత కళా ప్రక్రియల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్గానే జరుగుతాయిథీమ్ బేస్డ్ రేవ్లు: హాలిడే లేదా నిర్దిష్ట సంగీత శైలి వంటి నిర్దిష్ట థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉండే పార్టీలను థీమ్డ్ రేవ్లు అంటారు. ఈ పార్టీల్లో ధరించే దుస్తులు, డెకరేషన్, యాక్టవిటీస్ అన్నీ థీమ్కు అనుగుణంగా ఉంటాయి.డే రేవ్స్: డే రేవ్లు అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతంతో ఆరు బయట జరుగుతాయి.సైలెంట్ డిస్కో: పేరుకు తగ్గట్టుగానే ఇవి చుట్టుపక్కలవారికి ఎలాంటి అంతరాయంగా లేకుండా సెలెంట్గా ఉంటాయి. ఈ పార్టీలో సంగీతాన్ని వినడానికి హాజరైనవారు సైలెంట్ డిస్కోల సంప్రదాయ స్పీకర్లకు బదులుగా వైర్లెస్ హెడ్ఫోన్లను ధరిస్తారు.సైట్రాన్స్ రేవ్స్: సైట్రాన్స్ రేవ్లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డ్యాన్స్, కాస్ట్యూమ్స్ విజువల్స్ తోపాటు తమదైన సొంత సబ్కల్చర్ మ్యూజిక్ ఉంటుంది. హార్డ్స్టైల్ రేవ్లు: హార్డ్స్టైల్ రేవ్లు హార్డ్స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్తో హై ఎనర్జీతో ఉంటాయి. ఇలా ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. -
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
అభివృద్ధిపథంలో అల్లూరి జిల్లా సీఎం జగన్ మార్క్..!
-
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
దారి తప్పిన బాటసారి.. ప్రతి అడుగు అపాయం వైపే...!
-
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
RashmikaMandanna : అద్దె కట్టడానికి డబ్బుల్లేవు..మరెలా వచ్చిందీ స్టార్డమ్
సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. స్టార్ హీరో, మెగాహీరో, సూపర్ స్టార్, క్రేజీ స్టార్, గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ఈ ట్యాగ్లు, బిరుదులు అన్నీ హీరోలకే. వీటిన్నింటిని తోసి రాజని తామేంటో నిరూపించుని నిలబడిన వారు చాలాకొద్దిమంది. అలాంటి వారిలో టాప్లో ఉంటుంది నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న నటి రష్మికమందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ‘తగ్గేదేలే’ అంటూ దూసుకు పోతోంది. ఒక కుగ్రామంనుంచి వచ్చి ఇంత స్టార్డమ్ ఎలా తెచ్చుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 1996 ఏప్రిల్ 5న పుట్టింది రష్మిక. ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు చేసింది. రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది.అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసింది. కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్కి పరిశ్రమను ఆకర్షించింది. 2018 లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా మారింది. సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయే అన్నట్టుగా మారిపోయింది. అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' సినిమా ఆమెకు ఎక్కడలేని స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బుర పరిచింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' గా అవతరించింది. ఇక ‘సామి.. సామి’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పుష్ప రికార్డు వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వనించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి "మిషన్ మజ్ను"లో రష్మిక మందన్న బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటు తమిళంలో కార్తీతో కలిసి "సుల్తాన్" లో కోస్టార్గా నటించింది. తరువాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'యానిమల్' మూవీ రష్మిక మందన్న కెరీర్ని కొత్త మలుపు తిప్పింది. తమిళంలో విజయ్తో చేసిన 'వారిసు' మూవీ కూడా సూపర్హిట్ అయింది. దీంతో ఇంటర్ నేషనల్ క్రష్గా మారిపోయింది. అంతేనా ఇటీవల వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా త '30 అండర్ 30' అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది. సినిమా పరిశ్రమనుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది. అవార్డులు "కిరిక్ పార్టీ"లో తన నటనకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (SIIMA) గెలుచుకుంది. “గీత గోవిందం” మూవీకి ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్స్ తెలుగు , తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వీటన్నింటికన్న మిన్నగా తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్తో పాన్-ఇండియా స్టార్గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్మెంట్ను దెబ్బతీయలేవు.. ఒక్క చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్. -
ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!
తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్లో న్యూస్ రీడర్గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం. ఎంతోమంది న్యూస్ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ చంద్ర తారార్కం...! 2014లో శాంతి స్వరూప్ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి సంభాషణ పాఠకుల కోసం.. టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా! తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే... అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్. పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..! వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’... ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు.. తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి. మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష. సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని. మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు. మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది. ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్లో జోకర్లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు. తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్ని, న్యూస్ రీడర్ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను. నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది)