-
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం-గుర్రాలు మాట వినవు!
ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి. మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు. ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు. మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు. -
ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.' ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది. తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు. ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్ అవసరం కూడా ఉండదు. తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది. ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్ అన్నాడు ఆమెతో. ‘ఇన్షా– అల్లాహ్!’ మజీద్ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు. తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు. ‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్. ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్. ‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’ ఆ ఊళ్ళో అజీజ్ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్ కబాబ్ కానీ మరోటి కానీ మజీద్కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని. ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్. ‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్ తీసుకునేవాడు. అజీజ్ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు. ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్ లెనిన్ బోల్ట్’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు. ‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు. ఈ యుధ్ధంలోనే అజీజ్ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి. ‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది. అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు. ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్ అన్నాడు. ‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్ని ఓదార్చాడు మజీద్. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్!’ ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్. ‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’ ‘అబ్బా, మజీద్! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’ ‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’ అజీజ్ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్ వెనక్కెళ్ళి కూచున్నాడు. ‘అస్సలామలేకుమ్!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్ కేబుల్స్ కోసం అడిగారు. అజీజ్ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్. ‘పర్లేదులే’ మజీద్ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్ వైపు చూశాడు. ‘ఎంతివ్వాలి?’ ‘ఎంత బాబూ, యాభై షిల్స్ అంతే!’ ‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్ జేబులని వెతుకుతూ అన్నాడతను. మజీద్ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు. ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు. ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్’ అన్నాడు అజీజ్. తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్. అంగీకారంగా తలూపి అజీజ్ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్ లైన్స్ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది. ‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.’ ‘మజీద్! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ ‘హు! ఈ సర్కస్ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’ ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్ రాజు కూడా చూపలేడేమో!’ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’ ‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’ ‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్. అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో! చాప మడుస్తూ ఎందుకనో మజీద్ ఆలోచనలో పడ్డాడు. ‘ఏమిటంత ఆలోచన మజీద్?’ ‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’ ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్. ‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’ ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్. ‘అంటే, ఇదే న్యాయమంటావా?’ ‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’ అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్. మజీద్ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్!’ ఆశావహంగా అన్నాడు అజీజ్. ‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్. ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్ దృష్టి మరల్చడానికి అజీజ్ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్ తన భోజనాన్ని తీసుకొచ్చాడు. రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు. అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్ గబగబ అజీజ్ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి! ప్రతిరోజూ తెల్లవారే అజీజ్ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్ కోసం తెస్తుంటాడు. అజీజ్ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్. ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు. పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం. ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్. ‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్. వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు. ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి. కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి. తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి! ‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది! శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ డాక్టర్ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి. ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది. శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్ మనసు మొద్దుబారిపొయింది. ‘అల్లా హు అక్బర్! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు. ‘మజీద్.’ ‘ఏం చేస్తుంటావు?’ ‘చెప్పులు కుడతాను.’ ‘ఎక్కడుంటావు?’ ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’ క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు. ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’ ‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’ ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’ మజీద్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు. ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్ని ఓదార్చాడు మజీద్. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్! చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి! ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. — మూల కథ : ది సైన్ (ఇంగ్లిష్) రచయిత్రి : స్నేహ సుసాన్ షిబు తెలుగు అనువాదం: డాక్టర్ యు విష్ణుప్రియ. ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం! -
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
మహాశివరాత్రి: ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. ఏడాదిలో వివాహం!
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు . తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి బ్లాక్లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట. మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం. -
మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!
మహాకవి ధూర్జటి 'శ్రీ కాళహస్తీశ్వర శతకం'లో శివనామ ప్రాభవం, ప్రభావం గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. "పవి పుష్పంబగు,అగ్ని మంచగు.. శత్రుం డతిమిత్రుడౌ..విషము దివ్యాహారమౌ..." అని అంటాడు. "శివ శివ" అంటూ శివుడిని తలుచుకుంటే చాలు! అన్నీ నీకు వశమవుతాయని అంటాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం లలిత లావణ్యమైన పుష్పంగా రూపు మార్చుకుంటుంది. అగ్ని పర్వతం కూడా మంచు పర్వతంగా మారిపోతుంది, సముద్రమంతా ఇంకిపోయి, మామూలు నేలగా మారిపోతుంది. పరమశత్రువు కూడా అత్యంత స్నేహితుడవుతాడు, విషము దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. ఇలా...ఎన్నో జరుగతాయని, అనూహ్యమైన ఫలితాలు, పరిణామాలు ఎన్నెన్నో సంభవిస్తాయని ఈ పద్యం అందించే తాత్పర్యం. అంతటి వశీకరణ శక్తి శివనామానికి వుంది. అతి శీఘ్రంగా భక్తులను కరుణించి, వరాల వర్షాలు కురిపించే సులక్షణభూషితుడు హరుడు. భోళాశంకరుడు, భక్తవశంకరుడు శివదేవుడు. పాల్కురికి సోమనాథుడు నుంచి శ్రీనాథుడు వరకూ,పోతన నుంచి విశ్వనాథ వరకూ,ధూర్జటి నుంచి కొప్పరపు కవుల వరకూ మహాకవులెందరో శివుడిని ఆరాధించినవారే. పంచాక్షరీ మంత్రోపాసనలో పరవశించినవారే. కవులందరూ శివులే. భవ్యకవితావేశంతో శివమెత్తినవారే. శివరాత్రి వేళ స్త్రీ,బాల, వృద్ధులందరూ ఉరిమే ఉత్సాహంతో శివమెత్తి నర్తిస్తారు. ఆ ఉత్సాహం ఉత్సవమవుతుంది. హిందువులకు,ముఖ్యంగా శివారాధకులకు 'మహాశివరాత్రి' గొప్ప పండుగరోజు. శివపార్వతుల కల్యాణ శుభదినంగా, శివతాండవం జరిగే విశేషరాత్రిగా పరమపవిత్రంగా పాటించి వేడుకలు జరుపుకోవడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివపురాణం ప్రకారం శివుడు లింగాకారుడుగా మారే రోజుగా శివపురాణం చెబుతోంది. ఏ రీతిన చూసినా, ఏ తీరున చెప్పినా, ఏ లీలగా భావించినా ఇది పుణ్యదినం, భక్తులకు ధన్యదినం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం, శివ తపో ధ్యానాలతో తన్మయులవడం సర్వత్రా దర్శనమవుతూ ఉంటాయి. శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా విశేషాల కథా పారాయణలు కోట్లాదిమంది ప్రపంచమంతా జరుపుతారు. బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంతంగా ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు. "మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " అన్నాడు వేటూరి. ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, శివభక్తులు తెల్లవారుజామునే లేవడం క్రమశిక్షణగా పాటిస్తారు. విభూతి ధారణ చేసి "ఓం నమఃశివాయ" అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే ఎంతో శక్తి చేకూరుతుందని, ఎన్నో విశేషఫలితాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. తపస్సు, యోగాభ్యాసం, ధ్యానం గొప్ప ఫలితాలను అందిస్తాయన్నది అనాదిగా పెద్దలు చెబుతున్నది. మంత్రోపాసనలు గొప్ప వైభవాన్ని, రక్షణను కలిగిస్తాయని ఆర్యవాక్కు. పంచాక్షరీ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా భావిస్తారు. శివుడిని ప్రధానంగా యోగకారకుడుగా అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక శోభ, గొప్ప ఆరోగ్యం లభిస్తాయనే విశ్వాసంతో కోట్లాదిమంది తరతరాల నుంచి మహాశివరాత్రిని పరమనిష్ఠగా జరుపుకుంటున్నారు. రాత్రంతా సంగీత,సాహిత్య, నాటక,కళా ప్రదర్శనలతో మార్మోగి పోతుంది. ఎంతోమంది ద్వాదశ లింగాల దర్శనానికి సమాయిత్తమవుతారు. రుద్రాభిషేకం విశేషంగా జరుపుకోవడం పరిపాటి. తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలోని కోటప్పకొండ ప్రభ తీరే వేరు. కోటప్పకొండ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి. శ్రీశైలం,శ్రీకాళహస్తి, భీమేశ్వరం వంటి క్షేత్రాలలో జరిగే విశేషపూజలు, భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు. తెలంగాణలో రుద్రేశ్వరస్వామి వెయ్యి స్థంభాల ఆలయం, కీసరగుట్ట, వేములవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఐశ్వర్యప్రదాతలై విలసిల్లుతున్నాయి. శివుని ఆరాధన సర్వశక్తికరం, సర్వముక్తిప్రదం. శివరాత్రి నాడు జరిగే పూజలను దర్శించుకున్నా పుణ్యప్రదం. నాలుగు యామాలుగా పూజలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రం ప్రకృతిలో భాగమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ముడిపెట్టుకొని ఉంటుంది. శివుడిని పంచముఖునిగా, పంచబ్రహ్మలుగా భావిస్తారు. చైతన్యం దీని మూలసూత్రం. శివతత్త్వమే పరమోన్నతం. నిస్వార్థం, నిరాడంబరత ఆయన సుగుణధనాలు. మహాశివస్మరణ సంబంధియైన మహాశివరాత్రి అర్చనలు మానసిక ప్రశాంతతకు మూలం, శారీరక శక్తికి కేంద్రం, ముక్తికి సోపానం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశీ నుంచి కాళహస్తి దాకా, నేపాల్ నుంచి పాకిస్తాన్ దాకా కోటి ప్రభలతో,కొంగ్రొత్త శోభలతో కోలాహలంగా సాగే 'మహాశివరాత్రి' ధరిత్రిని పవిత్రంగా నిలిపే పుణ్యరాత్రి, శివగాత్రి. పాకిస్తాన్ లోని కరాచీలో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో ప్రసిద్ధం. కొన్ని వేలమంది ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మన వలె ఉపవాస దీక్ష ఆచరిస్తారు, సముద్రస్నానం చేస్తారు. శివరాత్రిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా పిలుచుకుంటారు. కశ్మీర్ లో 'హరరాత్రి' అంటారు. ఒరిస్సావారు 'జాగరా' అంటారు. జాగరా అంటే జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం. పంజాబ్లో శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇలా ఏ పేరుతో కొలిచినా, తలచేది శివుడినే. దివ్యశివరాత్రి మనలో భవ్య భావనలు నింపుగాక! - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఆర్బీఐ హెచ్చరిక..బద్దలవుతున్న రామోజీ బాగోతం
-
Magazine Story: ఆ విషయంపై బహిరంగ చర్చకు దమ్ముందా చంద్రబాబు?
-
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
గన్ షాట్..యాత్ర 2 మూవీ ఒక సంచలనం..నడుస్తున్న చరిత్ర
-
జన..దేశం..శానా కష్టం
-
అసలైన రత్నానికి సిసలైన గుర్తింపు
-
అందుకే ఆయన మహాత్ముడు
అవి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పటి రోజులు. ఓరోజు గాంధీజీ తన మిత్రుడితో కలిసి అతని కారులో ప్రయాణం చేస్తున్నారు. గాంధీజీ అలా ప్రయాణం చేయడం నచ్చని కొందరు వ్యతిరేకులు ఆయనకు అడ్డంకులు కల్పించడానికి గాను ఓ చెట్టు చాటు నుంచి కారుపై రాళ్లు రువ్వారు. రాళ్ళు కారుమీద పడగానే గాంధీజీ మిత్రుడితో కారును ఓ పక్కగా ఆపమన్నారు. అనంతరం ఆయన నెమ్మదిగా కారు లోంచి కిందకు దిగారు. చుట్టూ చూశారు. కనుచూపుమేరలో ఓ చెట్టు దగ్గర నిల్చున్న కొందరిని గాంధీజీ చూశారు. వారు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. దాంతో తిన్నగా వారి దగ్గరకు వెళ్లారు. కారు మీద రాళ్ళు విసిరిన వారు వారే అయి ఉండొచ్చని అనుకున్నారు. వారిని సమీపించి ‘‘మీకు నా మీద కోపం ఉండొచ్చు. కాదనను. ఆ కోపం మీ వరకూ సబబే కూడా అయి ఉండొచ్చు. అది కూడా నేను కాదనను. అయితే, మీ కోపాన్ని చూడానుకుంటే రాళ్ళు నామీద విసరాలే తప్ప పాపం ఈ కారు ఏం చేసింది? అంతేకాదు, ఆ కారు కూడా నాది కాదు. నా మిత్రుడిది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మీ కోపాన్నినా మీద చూపండి. ఇదిగో మీముందే నిల్చున్నాను. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నేను మీ ముందు ఒంటరిగా నిల్చున్నాను. నన్ను మీరేమైనా చేసుకోవచ్చు. అందుకు నేనేమీ అనుకోను. కారు మీద రాళ్ళు విసరడం మాత్రం తప్పు. ఎందుకంటే అది మిమ్మల్నేమీ చెయ్యలేదు. చెయ్యదు కూడా. అయినా మీరు రాళ్లు విసరడం వల్ల అది నాశనమవుతుంది. అప్పుడు నా మిత్రుడు బాధపడతాడు. నష్టం అతనికి తప్ప నాకు కాదుగా...’’ అని గాంధీజీ చెప్పడంతో ఆయనను ఆట పట్టించాలనుకున్న వాళ్ళు గాంధీజీ మాటలకు సిగ్గుపడి తల దించుకున్నారు. కాస్సేపు అక్కడ మౌనం తాండవించింది. అనంతరం ఆ అల్లరిమూక గాంధీజీ కాళ్ళపై పడి తమను క్షమించాలని అడిగారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా వారితో కరచాలనం చేశారు. క్షమ లేకనే మనం మామూలు వాళ్లలా ఉన్నాము. క్షమాగుణం వల్లనే గాంధీజీ మహాత్ముడయ్యాడు. అందుకే క్షమ కలవాడు అందరికన్నా బలమైన వాడని సామెత. – డి.వి.ఆర్. -
కుట్ర..మోసం..దగా..జీవితాన్ని ఇచ్చిన జీజే రెడ్డికి వెన్నుపోటు
-
National Tourism Day: అందమైన, అద్భుతమైన ద్వీపాలు!
# National Tourism Day 2024 పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకుభారీ ఊతమిచ్చే పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన, చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈరోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు, అనేక రాష్ట్రాలు తమ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. థీమ్: ప్రతి సంవత్సరం, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని విభిన్న థీమ్తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా జరుపుకుంటారు. 'సుస్థిర ప్రయాణాలు, కలకాలంనిలిచిపోయే జ్ఞాపకాలు అనేది ఈ ఏడాది థీమ్గా నిర్ణయించారు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం ఇండియాలో అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపధ్యంలో లక్షద్వీప్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ దీవులు: దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. బంగాళాఖాతంలోని 572 దీవుల సమూహం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలలో పోర్ట్ బ్లెయిర్, హేవ్లాక్ ద్వీపం, నీల్ ద్వీపం ,బరాటాంగ్ ద్వీపం పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తాయి. లక్షద్వీప్ దీవులు: అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ భారతదేశంలోని మరొక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలు కవరత్తి, అగట్టి, మినీకాయ్ . మజులి ద్వీపం: అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులి ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. రామేశ్వరం ద్వీపం రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులో ఉన్న . దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్: కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని అబ్బురపరుస్తాయి. ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్లో ఉంది, ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం, రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్గా పిలుస్తారు. సుందర్ బన్స్: సాంప్రదాయ ద్వీపాలు కానప్పటికీ, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్లోని విస్తారమైన డెల్టా ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, జలమార్గాలు, ద్వీపాలు మడ అడవులు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. -
పాస్ట్ కు పోదాం చలో చలో!
వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్బలమైన పునాది΄ాత ఫ్యాషన్లు కొత్త ట్రెండ్ కావడం మనకు కొత్తకాదు. డిజిటల్ ఫొటోగ్రఫీ ఒక రేంజ్లో ఉన్న ఈ కాలంలోనూ యువత కాలం వెనక్కి వెళ్లి పాత కెమెరాలను పలకరిస్తోంది. ఫిల్మ్ ఫోటోగ్రఫీపై మనసు పారేసుకుంటుంది. పాత కెమెరాలు కొత్తతరం చేతుల్లోకి వస్తున్నాయి. యూట్యూబ్లో అనలాగ్ ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్కు ఆదరణ పెరుగుతోంది. పాత ఇల్ఫర్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్లు కొత్తగా దిగుమతి అవుతున్నాయి. ఈ రీసర్జెన్స్ ధోరణి గురించి..పాస్ట్ కు పోదాం చలో చలో! హైయర్ రిజల్యూషన్స్, తక్కువ వెలుతురులో కూడా బెటర్ పర్ఫార్మెన్స్, స్మార్ట్ ఫోకసింగ్,షేక్ రిడక్షన్... లేటెస్ట్ డిజిటల్ కెమెరాల గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ యువతలోని ఫొటోగ్రఫీ ప్రేమికులు కొందరు కాలం వెనక్కి వెళుతున్నారు. తాము పుట్టని కాలంలో ఉపయోగించిన కెమెరాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ కెమెరా ఇండస్ట్రీ శిఖరస్థాయిలో ఉన్న ఈ కాలంలో ΄ాత కెమెరాలకు ఆదరణ, అది కూడా యూత్ నుంచి ఆనేది ఆశ్చర్యకరమైన విషయమే. దిల్లీలోని చాందిని చౌక్లో రెండు దశాబ్దాలుగా కెమెరాలను రీపేర్ చేస్తున్నాడు కపిల్ ఇంద్రజిత్ వోహ్ర. ఇతడి పేరు ఫిల్మ్–ఫొటోగ్రఫీ ప్రేమికులలో ΄ాపులర్ అయింది. కొంతకాలం వరకు వయసు మళ్లిన వారే తమ దగ్గరకు ΄ాత కెమెరాలను పట్టుకువచ్చేవారు. ఇప్పుడు యూత్ ఎక్కువగా వస్తున్నారు. కెమెరాల గురించి తమ సందేహాలను అడుగుతుంటారు.యూత్ పాత కెమెరాలను పట్టుకొని తన దగ్గరకు రావడం, వింటేజ్ కెమెరాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం వోహ్రాకు చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది. ‘ఇదొక వేవ్’ అంటాడు వోహ్ర. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ΄ాత కెమెరా పట్టుకొని వోహ్ర దగ్గరికి వచ్చాడు. 22 వేలకు కెమెరాను అమ్మాలని చె΄్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట వింటే ‘ఆశ–దోశ–అప్పడం వడ’ అనే మాట కచ్చితంగా వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు పాత కెమెరా కొనుగోలు విషయంలో డబ్బు గురించి చాలామంది ఆలోచించడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అనలాగ్ ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలు హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్లో అనలాగ్ ఫొటోగ్రఫీ ట్యుటోరియల్ చానల్స్కు ఆదరణ లభిస్తోంది. గత రెండు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలు, వాట్సప్ గ్రూప్లలో ΄ాత కెమెరాలకు సంబంధించిన విషయాలు, విశేషాలు, టిప్స్ అండ్ ట్రిక్స్ను షేర్ చేసుకుంటున్నారు. డిజిటల్ కెమెరాలో ఆటోమేటిక్ మోడ్లో యాంత్రికంగా షూట్ చేయడం చాలా సులభం. అయితే సృజనాత్మక ఫొటోగ్రఫీ లోతు΄ాతులు తెలుసుకోడానికి ΄ాత కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. పాతతరం ఫోటోగ్రఫీపై యూఎస్, యూరప్లలో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసక్తి ఇప్పుడు ఇండియా వరకు వచ్చింది. ‘ఆసియా–పసిఫిక్లలో ఫిల్మ్ ఫొటోగ్రఫీలో గణనీయమైన పెరుగుదల కనిపించింది’ అంటున్నాడు కొడాక్ అలారిస్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ క్లారా లో. వినియోగదారులలో 18–26 సంవత్సరాల వయసు మధ్య వారు కూడా ఉన్నారు. ‘ఫిల్మ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి, ఆదరణ భారీగా పెరిగాయి. అసలు సవాలు ఏమిటంటే ఫిల్మ్, కెమికల్స్ చాలామందికి అందుబాటులో లేవు. డిస్ట్రిబ్యూటర్లు లేరు’ అంటున్నాడు చెన్నైకి చెందిన ఫొటోగ్రాఫర్ వరుణ్ గు΄్తా. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పు వస్తోంది. కోల్కతాకు చెందిన ఫొటోల్యాబ్ ‘ఈస్టర్న్ ఫొటోగ్రాఫిక్స్’ ఇల్ఫర్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ స్టాకును మన దేశానికి తీసుకురావడం మొదలుపెట్టింది. చెన్నైలోని ‘సృష్టి డిజిటల్ లైఫ్’ ఇండియాలో ‘ఇల్ఫర్డ్’ అధికారిక పంపిణీదారుగా మారింది. ‘లాభాలను ఆశించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. భావోద్వేగాలతో కూడిన నిర్ణయం’ అంటున్నాడు ‘సృష్టి డిజిటల్ లైఫ్’ డైరెక్టర్, సీయీవో ఆర్.విజయ్ కుమార్. చివరాఖరికి చెప్పొచ్చేదేమింటంటే... ఫోటో తీయడానికి ఇప్పటి డిజిటల్ కెమెరాలలోని మీట నొక్కితే సరి΄ోతుంది. మనం ఫొటోగ్రాఫర్ అయి΄ోయినట్లే. అయితే ఎనలాగ్ షూటింగ్కు ఏ మీట ఎక్కడ ఉందో మాత్రమే తెలిసుంటే చాలదు. గ్లామర్ తెలియాలి. గ్రామర్ తెలియాలి. అందుకు పాత కెమెరాలే కొత్త ΄ాఠశాలలు. ఫొటోగ్రఫీకి సంబంధించిన ్ర΄ాథమిక శిక్షణ ఏ యూనివర్శిటీలోనూ తీసుకోలేదు. అయితే యూట్యూబ్ వీడియోల నుంచి ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వరకు నేర్చుకునే అవకాశం ఎక్కడ ఉన్నా నేర్చుకున్నాను. ఫొటోగ్రఫీలోని అత్యాధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాదు గత కాలపు టెక్నాలజీ గురించి తెలుసుకున్నాను. గతకాలపు ఫొటోగ్రఫీ సాంకేతికత గురించి అవగాహన చేసుకోవడం అంటే బలమైన పునాది ఏర్పాటు చేసుకోవడం లాంటిది. ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్న వారు చదువు, ఉద్యోగం వదులుకోకుండానే ఎంజాయ్ చేయవచ్చు. ΄్యాషన్ను కెరీర్గా మలుచుకోవాలనుకుంటే మాత్రం రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. – అపురూప వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ -
రుచితో అదరగొట్టే మధురాలు, ఈ పూతరేకులు
-
రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో?
పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి.. పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది.. అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .... అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి.. మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక. -గాంధీ, విజయనగరం -
చక్రవాకాలు: ఆ స్త్రీల కోసం మొసళ్లు కూడా తోడుగా
'పాస్పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్రూమ్లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.' అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు. ఆ పన్నెండు మంది ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు. పక్షుల కోసమని.. ‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు. మొసళ్లు తోడయ్యాయి.. అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి. ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు -
శ్రీరాముని దివ్య రూపం చూతము రారండి..
-
మాలోకం గారి విహార యాత్ర
-
ఆడుదాం ఆంధ్రతో ప్రతిభకు ఉజ్వల భవిష్యతు
-
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
కామన్ అకౌంట్ నంబర్ అంటే ?
-
విశాఖకు కొత్త విశేషాలు..సీఎం జగన్ ఆలోచనల మేరకు కొత్త హంగులు