-
అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్ఎంఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
డల్లాస్లో తానా, ఫేట్ ఫార్మసి ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ కోసం టీకా సేవలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఫేట్ ఫార్మసి ఆద్వర్యంలో కోవిడ్ నివారణ కోసం తెలుగు వారికి కోవిడ్ టీకాలను అందించారు. ప్రపంచం అంతా కోవిడ్ మహమ్మారితో తల్లడిల్లుతున్న తరుణంలో “మాస్క్ ధరించండి, శానిటైజర్ తప్పనిసరిగా వాడండి, ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు తీసుకోండి” అనే నినాదంతో తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన & తానా బృందం సారధ్యంలో టీకా సేవలు కార్యక్రమాన్ని నవంబరు 3, నవంబరు 14, నవంబరు 27 మరియు డిసెంబరు 4వ తేదీలలో తెలుగు వారి కోసం పిల్లలు (5 సం. నుంచి 11 సం. వరకు), పెద్దలు, భారత దేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ఫైజర్, మోడార్నా, జాన్సన్ & జాన్సన్ కోవిడ్ టీకాలను ఆరోగ్య భీమా వున్నా, లేకపోయినా 1200 పైచిలుకు టీకాలను అందించారు. కోవిడ్ టీకా కోసం వచ్చిన అందరు సభ్యులు, తానా & ఫేట్ ఫార్మసి వారికి ధన్యవాదలు తేలియజేశారు.ప్రవాసంలో వున్న తెలుగు వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న తానా(TANA) ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరు కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించే జాగ్రత్తలు - మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు తీసుకొని ఈ మహమ్మరిని నిర్మూలించాలని తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కాలంలో తానా(TANA) లాంటి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడుతున్నటు వంటి దాతలు & కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మంచి కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో జనప్రయోజనకరమైన కార్యక్రమాలు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి సహకారంతో మీ ముందుకు తీసుకువస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. కోవిడ్ టీకా కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, సాంబ దొడ్డ, పరమేష్ దేవినేని, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, కళ్యాణి తాడిమేటి, మధుమతి వైశ్యరాజు, దీప్తి సూర్యదేవర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు, శ్రీదేవి ఘట్టమనేని, లెనిన్ వీరా, గణెష్ నలజుల, వెంకట్ బొమ్మ తదితరులు మరియు ఫేట్ ఫార్మసీ అధినేత హరి చింతపల్లి, వారి బృందం ఎంతో శ్రమించి టీకా కోసం వచ్చిన ప్రతివక్కరికి టీకాలు అందించారు. టీకా కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన ఫేట్ ఫార్మసి & వండర్ ల్యాండ్ మోంటిస్సొరీ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డల్లాస్ - తానా ఆద్వర్యంలో ఘనంగా పుస్తక మహోద్యమం!
డాలస్ టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా ప్రపంచ సాహిత్య సదస్సు ఆధ్వర్యంలో "పుస్తక మహోద్యమం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. పుస్తకాలను కొని బహుమతులు గా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటినుండే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేలా వారికి పుస్తకాలను పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో ‘పాతికవేల పుస్తకాలు పాటకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది పిల్లలకు తానా బృంద సభ్యులు బాల సాహిత్యం పుస్తకాలను, పెద్దలకు ఉపయోగ పడే అనేక పుస్తకాలను పెద్దలకు బహుమతులుగా అందించారు. ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. సుధా కలవగుంట, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, డా. గన్నవరపు నరసింహమూర్తి, డా. పూదూర్ జగదీశ్వరన్, టాంటెక్స్ అధ్యక్షులు లక్ష్మి పాలేటి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, డా. సత్యం ఉపద్రష్ట, లోకేష్ నాయుడు, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, వెంకట ప్రమోద్, రాజేష్ అడుసుమిల్లి, మురళి వెన్నం, మధుమతి వైశ్యరాజు, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, సురేష్ కాజ, లెనిన్ వేముల, సురేష్ మండువ, బసవి ఆయులూరి, వెంకట్ తాడిబోయిన మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. -
తానా ప్రపంచ సాహిత్య వేదిక.. మహాకవి శ్రీనాధ సాహిత్య వైభవంపై చర్చ
అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య కార్యక్రమం వర్చువల్గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనాథుడి సాహిత్యంలోని గొప్పతనం, ఆయన జీవితంలోని విశేషాలపై వక్తలు ప్రసంగించారు. ఎంతో విలువైన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమీషనర్ ఉపేంద్ర చివుకుల, కెనడా దేశంలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ పండాలు పాల్గొన్నారు. శ్రీనాథుడి రచనల విశిష్టతలను పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ వివరించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున నిర్వాహకులు తోటకూర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. -
పుస్తక మహోద్యమాన్ని చేపట్టిన తానా
అట్లాంటా: పుస్తక మహోద్యమాన్ని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు గురువారం అట్లాంటా నగరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఈ కార్యక్రమం మొదలైందన్నారు. ఈ పుస్తక మహోద్యమానికి సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా మారుతుందన్నారు. పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగే పుస్తక మహోద్యమమం అని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. -
విజయవంతమైన తానా సాహిత్య సదస్సు
అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా సాహితీ విభాగం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తోన్న నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26న విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా పాలకమండలి అధిపతి డాక్టర్ బండ్ల హనుమయ్య మాట్లాడుతూ ఎంతో మంది సాహితీ మూర్తులు తరతరాలుగా మనకు అందించిన తెలుగు భాష, ఆ భాషలోని సాహిత్య సిరిసంపదలు ఎన్నటికి తరగన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న అనేక మంది ఆలిండియా ప్రస్తుత, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటి ప్రపంచంలో ఆంగ్లభాషకున్న ప్రాధాన్యతను ఎవ్వరూ విస్మరించలేమని, విద్యార్ధులు ఎన్ని భాషలు నేర్చినా ఆంగ్లభాషలో మంచి పట్టు సంపాదించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే అదే సమయంలో తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదని వారు సూచించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పిల్లలకు బాల్య దశ నుంచే తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన కార్యకర్తలకు తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి : కెనడాలో తొలి తెలుగు సాహితి సదస్సు -
తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తిగారి జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వర్చువల్గా నిర్వహిస్తున్నారు. 2021 ఆగస్టు 28, 29లలో రెండు రోజులపాటు ఘనంగా ఈ వేడుకలు జరుగనున్నాయని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్లో కేబినేట్ మంత్రిగా పని చేస్తున్న తెలుగు సంతతికి చెందిన డాక్టర్ శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిధి హాజరుకానున్నట్టు ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణ తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు పశ్చిమ బెంగాల్లో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న మరో తెలుగు తేజం బొప్పూడి నాగ రమేశ్ ప్రత్యేక అతిధిగా ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి విశిష్ఠ అతిధిగా పాల్గొనబోతున్నట్టు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి రచించిన ఎందరో మహానుభావులు గ్రంథం ఆంగ్ల అనువాదాన్ని డాక్టర్ పంజా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి, ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి కరణం మల్లేశ్వరిలు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 లకు ప్రారంభం అవుతుందని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు. చదవండి: ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్ -
తానా ప్రపంచ సాహిత్య వేదిక 15వ “తెలుగుతనం-తెలుగుధనం” సదస్సు ఘన విజయం
అట్లాంటా, జూలై 26: తానా ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాలంలో ఆదివారం నిర్వహించిన “తెలుగుతనం–తెలుగుధనం” అనే సాహిత్య కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ.. గత సంవత్సరం మే నెలలో సాహిత్యవేదిక ఆవిర్భావం నుంచి 15 నెలలుగా వివిధ సాహిత్యాంశాలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలతో ప్రపంచ వేదిక మీద సాహితీ సౌరభాలను గుభాళింప చేయగల్గడం చాలా ముదావహం అన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన ప్రారంభ ఉపన్యాసంలో తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ కోసం, భావితరాలకు భద్రంగా అందించే కృషిలో తానా కట్టుబడి ఉందని, తన పదవీకాలం లో తానా ప్రపంచ సాహిత్య వేదికను మరింత ఎత్తుకు తీసుకు వెళ్ళడానికి తాను, తన కార్యవర్గం సిద్ధంగా ఉందని అన్నారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి సాహిత్య కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైనదని, పాల్గొంటున్న అతిధులందరూ వారి వారి రంగాలలో ఆరి తేరినవారని అందరికీ స్వాగతం పలికారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. విశిష్ట అతిధిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు గారు తన వ్యక్తిగతజీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని ఈనాడు ఉన్నత స్థితిలో భాద్యతాయుత పదవిలో ఉండడం తెలుగు వారికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు 1954లో సాహిత్య అకాడమీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు సాహిత్య అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తూ 24 భాషల్లో విశేష కృషి చేస్తున్న వారికి వివిధ పురస్కారాలు, సాహిత్య ప్రచురణలు, సమావేశాలతో నిరంతరం కృషి చేస్తోందని, తెలుగు భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించే అనువాదకులు తక్కువగా ఉన్నారని, ఎక్కువ మంది ముందుకు వస్తే తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి చేరడం సులభం అవుతుందని అన్నారు. లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత విశేషాలను వివరిస్తూ వీడియో ఫిలిమ్స్ తెలుగు కవుల మీద తక్కువగా ఉన్నాయని ఆ దిశలో ఇంకా ఎక్కువ కృషి జరగాలనీ, సాహిత్య అకాడమీ వెబ్సైటులో మన తెలుగు భాషలో కొన్ని పేజీలు ఉండాలని, అవి రూపొందించే దిశలో దానికి కావలసిన సాంకేతిక సహకారం అందించడానికి తానా సంసిద్ధంగా ఉన్నదని డా. తోటకూర తెల్పినప్పుడు డా. కృతివెంటి సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీతో కలసి తానా ప్రపంచ సాహిత్యవేదిక ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చని ఆహ్వానించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ తెలుగు వేదకవి, సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి “పాట-పద్యం–పేరడీ–ప్రశ్న” అనే అంశంపై రెండు గంటలపాటు సాగిన సాహిత్య ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో, ఆలోచనలు రేకెత్తిస్తూ అందరినీ ఆకట్టుకుంది. కవి జొన్నవిత్తుల కలం నుండి వెలువడిన ఎన్నో సినీ గీతాలలో కొన్నింటిని.. ఉదాహరణకు: పూర్తి సంస్కృతంలో రాసిన డిస్కో గీతం, స్వప్త స్వరాలపై రాసిన గీతం, భద్రాద్రి రాముడి తో సహా అందరి దేవుళ్ళమీద రాసిన గీతాలు, తెలుగు భాష వైభవంపై రాసిన గీతాలు, టోక్యో ఒలింపిక్ పోటీల సందర్భంగా జపాన్ దేశంలో సూర్య నమస్కారాలు చేస్తుండడంపై స్పందించి రాసిన పాట, తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం నిర్వహించే భారతదేశ స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల కోసమై రాసిన పాటను, మరి కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాసిన పాటలను ప్రేక్షకులతో పంచుకోగా అందరూ హర్షద్వానాలు పల్కారు. అక్షర నాదం, స్వరనాదం రెండూ ఏకీకృతమై వ్యక్తమయ్యే పద్య రసభావన శ్రోతలను ఆకట్టుకొని వారి మనసులను రంజిల్లింప చేసే శక్తి పద్యాలకుందని అందుకే అవి అందర్నీ ఆకర్షిస్తాయన్నారు. వివిధ సినిమాల కోసమై రాసిన ఘటోత్కచుడు మీద, పాండవుల మీద, రావణాసురుడు మీద, యముడు మీద పద్యాలు, దుబాయ్ దేశం పర్యటించినపుడు వారి సంస్కృతిలో భాగమైన బెల్లి డాన్స్ చూసినప్పుడు మరియు సింగపూర్ దేశంలో రోప్ వే పై ప్రయాణించినప్పుడు కల్గిన స్పందనతో రాసిన పద్యాలు, దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, ఎన్.టి. రామారావు, అక్కినేనిలపై రాసిన పద్యాలను రాగయుక్తంగా పాడగా అవి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సమకాలీన సామాజిక రాజకీయాలలో పార్టీ మార్పిడ్లు, రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య ధోరణితో పాడిన పేరడీ పాటలు కవి జొన్నవిత్తుల సామాజిక స్పృహను, యదార్థ స్థితిని గొప్పగా ఆవిష్కరించాయి. ప్రశ్నా విభాగంలో గత 75 సంవత్సారాల కాలంగా భారతదేశం సాధించిన ప్రగతి, కోల్పోయిన మానవీయ సంబంధాలపై స్పందించమన్నపుడు ప్రస్తుతం కావల్సింది సత్యం, ధర్మం, త్యాగం అనే లక్షణాలు కల్గిన సుపరిపాలన ప్రజలకందించేది నాయకులని అలాంటి వారిని ప్రజలు ఎన్నుకోనంత వరకు దేశం పురోగతి సాధించజాలదని హితవు పల్కారు. ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డా. ఎర్రాప్రగడ రామకృష్ణ - మాట్లాడడం ఒక కళ అని, మనం మాట్లాడే మాటలు పలువుర్ని ఆకట్టుకునే విధంగా ఎలా ఉండాలి, ఒకే మాట పలు ప్రాంతాలలో ఎలాంటి విపరీతమైన అర్ధాలకు దారి తీస్తుంది, కొంచెం శ్రద్ధ వహిస్తే అందరూ బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని “మాట తీరు” అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు. తానా ఉత్తరాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ ఘన చరిత్ర కల్గిన తెలుగు భాష, సాహిత్య వైభవాలను పరిరక్షించి పర్వ్యాప్తి చేయడం, తెలుగు కవులు, కళాకారులను ఆదరించడం లో తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, తానా ప్రపంచ సాహిత్య వేదికను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న వారందరికీ, హాజరైన అతిధులకు, ప్రసారం చేసిన వివిధ ప్రసార మాధ్యమాల వారికి, వీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. -
తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో శృంగవరపు నిరంజన్ తానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన విజయం సాధించారు. నిరంజన్ ప్యానెల్కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలి ప్యానెల్కు 9,108 ఓట్లు దక్కాయి. కర్నూలు వాసి నిరంజన్ ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్లో నివసిస్తున్నారు. తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి తెలపారు. టీం నిరంజన్ ప్యానల్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు జై తాళ్లూరి ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని విడుదల చేశారు. తానాలో గెలుపోటములు ఉండవని.. బరిలో దిగిన ప్రతి వాళ్లూ గెలిచినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు నరేన్ కొడాలి టీంకు ఆయన అభినందనలు చెప్పారు. తానా అభ్యున్నతకి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చదవండి: భారత సంతతి కుటుంబం నిజాయతీ.. రూ.7 కోట్లు తిరిగిచ్చేసింది -
భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం
సాక్షి, హైదరాబాద్: భాషాభివృద్ధికి పత్రికలు చేసే కృషి అనేక రూపాల్లో ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి చెప్పారు. గడిచిన 200 ఏళ్ల చరిత్రలో పత్రికలు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాయన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆన్లైన్ వేదికగా ‘తెలుగు పత్రికలు–తెలుగు భాషా ప్రామాణికత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పత్రికలు చేసే భాషాప్రయోగం వల్ల భాషకు నష్టం జరుగుతుందనే వాదన సరైంది కాదన్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాష ల్లోనూ పత్రికల వల్ల ఆయా భాషలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. డిజిటల్ మీడియా విస్తరిస్తున్న క్రమంలో భాషకు ఏకరూపత ఉండాలని, ప్రభుత్వం, అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ ఆ పని చేయాలన్నారు. తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎం.నాగేశ్వర్రావు, సతీష్చందర్, శ్రీరామ్మూర్తి, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు -
అంగరంగ వైభవంగా.. విశ్వవ్యాప్తంగా ప్లవ నామ ఉగాది
న్యూ యార్క్ : ప్రపంచ సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, (తానా)సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదికనిర్వహణలో - "ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం - 21" భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11ఉదయం 9 గంటల వరకు 25 గంటల పాటు అంతర్జాల దృశ్య సమావేశం నిర్విరామంగా,అపూర్వంగా జరిగింది. ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా భారత దేశం, అమెరికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని, 21తెలుగు సంఘాలనుండి 246 మంది కవులు, పండితులు, సాహితీప్రియులు,యువతీ యువకులు అత్యంత ఉత్సాహంగా ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కళ్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మి భావజలు శ్రావ్యంగాగానం చేసిన “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన సందేశంలో – తానా సంస్థ తెలుగు భాషా సంస్క్రుతలకు ప్రాధాన్యమిస్తూ 21 దేశాల్లోని, 21 సంస్థలతో ప్రపంచ మహాకవి సమ్మేళనం నిర్వహించడం ఆనంద దాయకమని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తానా అధ్యక్షులుతాళ్ళూరి జయ శేఖర్ మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇంతటి బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగింది. మాతృభాషలోనే మన నాగరికత, ఉనికి ఇమిడి ఉన్నాయి. భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని" పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో సాహిత్య సమావేశాలను, మరి కొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకుంటున్నామని, కాని ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని, విశ్వ వ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులకు, భాషాభిమానులకు, వీక్షకులకు ఘన స్వాగతం పలికారు. 25 గంటల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనం వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్నిర్వహణలో ఆద్యంతం అతి వైభవంగా జరిగింది.తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల కావలసిన సాంకేతిక సహకారాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లబ్ద ప్రతిష్టులైన కవులు, పండితులు తమ కవితలతో ఆద్యంతం అలరించారు. ఒక్కో దేశానికి ఒక్కో గంట సమయం కేటాయించబడి ఆగంటలో ఆ దేశానికి సంబంధించిన కవులతో కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ శ్రీ జి. చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసంగించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా. కె. ఐ. వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్దే భాషా పరిరక్షణకుమూలమని, ఆదిశగా అందరూఆలోచించాలని" అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి, ప్రత్యేక అతిధులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు జాస్తి విష్ణు(ఈనాడు), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), దిలీప్ రెడ్డి (సాక్షి) హాజరై భాషాభివృద్దికి విలువైన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు: శ్రీ సాంస్కృతిక కళా సమితి- సింగపూర్; మలేషియా తెలుగు సంఘం- మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి – బెహ్రైన్; తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా - సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్ల్యాండ్ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లండ్ తెలుగు సంఘం- నార్తర్న్ ఐర్లండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్- స్కాట్ లాండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజీల్యాండ్ – న్యూజీల్యాండ్; తెలుగు మల్లి – ఆస్ట్రేలియా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా; అమెరికా, మరియు భారతదేశం. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసిన యాజమాన్యాలకు, కార్యవర్గసభ్యులకు, తెలుగు సంఘాల అధ్యక్షులకు, పాల్గొన్న సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏప్రిల్ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం
ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్ చైర్మన్), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సబ్ఎడిటర్ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. -
మరుగున పడుతున్న లలిత గీతాలను 'తానా' పరిరక్షిస్తుంది
డల్లాస్, టెక్సాస్ - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో 'లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు' అనే అంశంపై ప్రముఖ గీత రచయితలు, గాయనీ గాయకులు వేదవతి ప్రభాకర్, డా. ఎంకే రాము, డా. ఓలేటి పార్వతీశం, డా. వడ్డేపల్లి కృష్ణ, కలగా క్రిష్ణమోహన్, వారణాసి నాగలక్ష్మి మొదలగువారు పాల్గొని వివిధ అంశాలను స్పృశించి అనేక మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయకులు, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరి రామాచారి లలిత గీతాలకు తాను ఇస్తున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తన శిక్షణలో తయారవుతున్న గాయనీ, గాయకులచే వేలకొద్దీ లలిత గీతాలను పాడిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయని వేదవతీ ప్రభాకర్ ‘లలిత గీతాల స్వర్ణయుగం’ అనే అంశంపై స్పందిస్తూ తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో కలసి పనిచేసిన సుప్రసిద్ధ రచయితలు, గాయనీ గాయకుల విశేష కృషిని వివరించారు. ప్రముఖ సంగీత దర్శకులు పాలగుమ్మి విశ్వనాథం రచించి, స్వరపరచిన 'అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ' అనే గీతాన్ని పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎంకే రాము మాట్లాడుతూ.. తాను రచించిన అనేక వందల లలిత గీతాలను, ఎంతోమంది సినీ, సాహిత్య ప్రముఖులతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. వివిధ ప్రసార మాధ్యమాలలో ముప్పైతొమ్మిది సంవత్సరాలకు పైగా విశేషానుభవం గడించిన సాహితీవేత్త, ప్రముఖ కవి డా. ఓలేటి పార్వతీశం దూరదర్శన్లో తొలినాళ్లలో లలిత గీతాలు ప్రసారం కావడం నుంచి, నేటివరకు సాగుతున్న పరిణామక్రమాన్ని ఆసక్తికరంగా వివరించారు. 'తెలుగులో లలిత గీతాలు' అనే అంశంపై ప్రామాణిక పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సాహితీవేత్త లలితగీత, సినీగీత రచయిత, సినీదర్శకులు డా. వడ్డేపల్లి కృష్ణ దశాబ్దాల సినిమా చరిత్రలో లలిత గీతాలు సినీ గీతాలుగా రూపుదిద్దుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు. ఆకాశవాణితో ఐదు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం ఉన్న ఆకాశవాణి ఉత్తమ శ్రేణి కళాకారులు, ప్రముఖ గీతరచయిత, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్ సంగీత ప్రపంచంలో దిగ్గజాల లాంటి మహానుభావులు ఎందరితోనో పని చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖ చిత్రకారిణి, కథా, లలితగీత రచయిత్రి వారణాసి నాగలక్ష్మి లలితగీత సాహిత్య ప్రపంచంలో అలనాటి సుప్రసిద్ధ రచయితలతో పాటు వర్తమానంలో రాస్తున్న రచయితలు, వారి సాహిత్య కృషిని వివరించారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు కొమండూరి రామాచారి తన గాన ప్రస్థానం లలిత గీతాలతోనే ప్రారంభం అయిందని, అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మంది సాహితీవేత్తల సృజనను స్వరపరచి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతోమంది గాయనీ, గాయకుల గాత్రాల ద్వారా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీద పాడించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామాచారి శిక్షణలో తమ గాత్రసౌరభానికి మెరుగులు దిద్దుకుంటున్న సరస్వతీ చైతన్య (వర్జీనియా), బేబీ శరణ్య వక్కలంక (వర్జీనియా), నాగ సాహితి (కాలిఫోర్నియా), శివాని సరస్వతుల (జర్మనీ), సౌజన్య గరిమెళ్ళ (నెదర్లాండ్స్), శరత్ చంద్ర ఏడిద (బహరేన్), స్వాతి ఎల్లూరి(బహరేన్), భారతదేశం నుంచి శ్రీ సౌమ్య వారణాసి, శరత్ సంతోష్, భరత్ రాజ్, జయరాం పైల, జీవీ ఆదిత్య, సాకేత్ కొమ్మాజోశ్యుల, శ్రియా మాధురి పోపూరి, మేఘనా నాయుడు,శ్రీపాద ఉప్పులూరి మొదలైనవారు తమ గాత్ర మాధుర్యంతో అందరినీ అలరించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 'సంగీత, సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలైన బాలాంత్రపు రజనీకాంత రావు, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు,చిత్తరంజన్, మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వింజమూరి అనసూయ, వింజమూరి సీత, జగన్నాధాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా. సీ నారాయణ రెడ్డి, దాశరధి, బోయి భీమన్న, పాలగుమ్మి విశ్వనాధం, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, డా. గుంటూరు శేషంద్ర శర్మ, నేదునూరి కృష్ణమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆచార్య తిరుమల, కోపెల్ల శివరాం, అఖ్మల్ హైదరాబాది లాంటి ప్రముఖల విశేష కృషిని, ఈ సభ ద్వారా స్మరించుకుని వారికి నివాళులర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లలిత గీతాల పునర్ వైభవానికి తానా సంస్థ కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, గాయనీ గాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లలిత గీతాలు మరుగున పడుతున్న ఈ కాలంలో వాటి పరిరక్షణకు తానా చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. -
నాడు-నేడుకి తానా ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు (స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల నిమిత్తం తానా ఫౌండేషన్(ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. శుక్రవారం.. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో తానా ఫౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు అందజేశారు. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ -
ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21
వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త, శతశతక కవి, చిగురుమళ్లు శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో కొనసాగుతందుని తెలిపారు. ఈ అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. -
తానా ఆధ్వర్యంలో 'తల్లి భాష-తెలుగు మన శ్వాస'
వాషింగ్టన్ : ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో నేర్చుకునే మొదటి భాష..మాతృభాష. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే అప్రయత్నంగా, సహజంగానే మాతృభాష అబ్బుతుంది. మనుగడ కోసం వేరే భాషలను నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవద్దు. మాతృభాష పరిరక్షణ సంకల్పంతో, యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఫిబ్రవరి 21, 2021 నాడు తల్లి భాష-తెలుగు మన శ్వాస అనే సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్లైన్ ద్వారా పాల్గొననున్నట్లు తానా అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి, తాసా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్మనీ లోని ఎస్. ఆర్. హెచ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. తొట్టెంపూడి శ్రీ గణేష్“జర్మనీ దేశం మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత - అన్య సాహిత్యానువాద కృషి” అనే అంశంపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు నేల, తెలుగు భాష ప్రాముఖ్యతలపై గాయనీ గాయకులు పాల్గొని పాటలు, పద్యాలు ఆలపిస్తారని నిర్వాహకులు తెలిపారు. -
తానా ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్లైన్ సాహిత్య సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో విశిష్ట అతిధులు విచ్చేసి ‘‘తారలు-రాతలు’’ అనే అంశంపై సినీ తారలుగా వెలుగొందుతూ మంచి సాహిత్యాన్నిసృష్టించిన సినిమా తారలు తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వర రావు, డా.పీ భానుమతి, డా. కొంగర జగయ్య, డా. గొల్లపూడి మారుతిరావుల రచనలను గుర్తు చేసుకున్నారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన ప్రారంభోపన్యాసంలో ఇది ఒక వినూత్న, విశిష్ట కార్యక్రమమని, సినిమా నటులుగా అందరికి పరిచయమైన వారి రచనలను సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.. అగ్రశ్రేణి తారలైన వారిలో కొంతమంది నటులుగా రాణిస్తూనే తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగించడం, ఇప్పుడు దాన్ని చర్చించడం హర్షనీయమన్నారు. ప్రముఖ నాటక రచయిత, కథారచయిత, సంభాషణల రచయిత, సినీ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి.. తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం, “కోక్కరోకో, “గార్ధ భాండం, “చలచల్ గుర్రం, “జంబు ద్వీపం, “గొయ్య్ఙి మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని, ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’, ‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అందరినీ పరవశింప చేశారు. పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి. సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అయన సాహితీ ప్రస్థానాన్ని, అక్కినేని ఆత్మీయ సోదరిగా అభిమానం సంపాదించుకున్న డా. కేవీ కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు. డా. పీ భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణి గారితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను డా. భానుమతితో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ ఎన్నో విశేషాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా అచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్ని ప్రఖ్యాత కవి, రచయిత రసరాజు ఎంతో ఆత్మీయంగా, రసరమ్యంగా పంచుకున్నారు. డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాల పై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు కిరణ్ ప్రభ డా. గొల్లపూడి రచనలపై ఎంతో లోతైన సమగ్ర సాహిత్య విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డా. గొల్లపూడి రాసిన “సాయంకాలం అయింద్ఙి నవల, ఆత్మకధ “అమ్మ కడుపు చల్లగ్ఙా, “జీవన కాలమ్స్, ఆయన విశిష్ట రచనా శైలి, కౌముది మాస పత్రికతో డా. గొల్లపూడి కున్న సుదీర్ఘ సాహిత్యనుబంధాన్ని చక్కగా వివరించారు. డా. అక్కినేని నాగేశ్వర రావు, తనికెళ్ళ భరణి, డా. గొల్లపూడితో తనకున్న ప్రత్యేక ఆత్మీయ అనుభందం, ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకుని అది ఒక అరుదైన సువర్ణ అవకాశం అని అభిప్రాయ పడ్డారు. -
సాగువీరుడా ! సాహిత్యాభివందనం
వాష్టింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా!-సాహిత్యాభివందనం’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన స్వాగతోపన్యాసంలో రైతుగా తన అనుభవాలను, తానా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను పంచుకుంటూ రైతు పాత్ర, ప్రాముఖ్యం అతివిలువైనది ప్రశంసించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ రైతుల కష్టాలను, సమాజంలో రైతు యొక్క అద్వీతీయమైన పాత్రను కవిత్వ రూపంలో పంచుకున్నారు. రైతు ప్రత్యక్ష దైవం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవాళి మొత్తం జీవించడానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న రైతును అనునిత్యం స్మరించుకోవలసిన భాద్యత అందరిదీ అన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సేద్యం చేస్తున్న రైతు ప్రత్యక్ష దైవం అన్నారు. గ్రామీణ జీవితాలను, రైతుల కృషిని పాఠ్యాంశాలలో చేర్చి యువతను మేలుకోల్పవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మరచిపోతున్న కొన్ని పదాలు ఎలాపట, దాపట; చ్చో చ్చో, హహయి; తాబేటికాయ, ఏతాము, బల్లకట్టు, బుంగపోత లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలను ఆసక్తికరంగా వివరించారు. ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం రైతు కోసం తానా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అవసరమైన పరికరాలను అందించడంలో తానా చేస్తన్న కృషిని, తానా రైతు విభాగపు సమన్వయకర్త డా. కోట జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వ్యవసాయ చైతన్య రథం అనే మొబైల్ వ్యాన్ ద్వారా లక్షలాది మంది రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నది, సిరి ధాన్యాలను, మిద్దె తోటల సాగులో ఉన్న మెలకువలతో తగిన శిక్షణ ఇస్తున్నది సోదాహరణంగా వివరించారు. బి.టెక్ రవిగా, హైబ్రిడ్ సీడ్స్ రవిగా అందరికి సుపరిచుతులైన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు తన రెండు వందెల ఎకరాల సేద్యంలో రెండు వందల కోట్ల రూపాయిల వ్యాపారాన్ని, పది మంది పి.హెచ్.డి విద్యావేత్తలకు, ఐదు వందల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని కొన్ని వేల రకాల కూరగాయల విత్తన్నాలను సృష్టిస్తున్న తీరును, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు తన వ్యవసాయ క్షేత్రాన్ని తాను చేస్తున్న పరిశోధనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్య మహిళల కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పిన కళ్ళెం ఉపేందర్ రెడ్డి అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ రైతు రాజ్యం అనే లాభాపేక్షరహిత సంస్థ ద్వారా ఖమ్మం లో రైతు కుటుంబాల, రైతు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కెనడా దేశంలో సన్డైన్ ప్రొడ్యూస్ సంస్థను స్థాపించి కర్రేబియా, మెక్సికో, హోన్దోరాస్, నికరాగ్వా, ఫ్లోరిడా ల నుండి వివిధ రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని కెనడా దేశంలో వివిధ వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్న విషయాలను, దాంట్లో ఉన్న సాధకభాధాలను సంక్షిప్తంగా శ్రీధర్ మున్డ్లురు వివరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు తాను చేస్తున్న నూట డెబ్బైఐదు ఎకరాల వ్యవసాయాన్ని అవలంబిస్తున్న పద్ధతులను, రెండు వందెల గేదలను, ఆవులను ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న విషయాలను వివరంగా తెలియజేశారు. తెలంగాణా రాష్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రసాదరావు చేస్తున్న ఎద వ్యవసాయం, వాడుతున్న యంత్రపరికరాల గురించి పదిహేను నిమిషాల పాటు మాట్లాడి ప్రసాదరావును స్వయంగా ముఖ్యమంత్రి హైదరాబాద్కు ఆహ్వానించి, మరిన్ని మెలకువలను తెలియజేయవలసిందిగా కోరడం విశేషం. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గీతరచయితలు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మారెన్న (అనంతపురం), మానుకోట ప్రసాద్(హైదరాబాద్), నూజిళ్ళ శ్రీనివాస్(రాజమండ్రి), కృష్ణవేణి(తిరుపతి), లెనిన్ బాబు (అనంతపురం), రత్నం(చిత్తూరు), డా.అరుణ సుబ్బారావు(హైదరాబాద్), నగమల్లేశ్వరరావు (అమరావతి), లక్ష్మణ మూర్తి (తూముకుంట), గిద్దె రామనరసయ్య (వరంగల్)లు పాల్గొని రైతు నేపథ్య సాహిత్యంతో కూడిన అనేక అద్భుత గీతాలను మధురంగా పాడి ఈ కార్యక్రమానికి నూతన శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక సహకారం అందించిన వారికి, విశిష్ట అతిథులకు, గాయనీ గాయకులకు డా.ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి
పాటల రచయిత వెన్నలకంటి మృతి పట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా ప్రగాడ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూరాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు. డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8వ సమావేశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్తో పాటు అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు. -
ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది
ఎక్కడో మారుమూల... శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి అందరి మన్ననలు అందుకుంది. ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది. అంతేకాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు. ‘అమ్మ ఒడి’తో వివేకానందుని ప్రసంగం.. జనవరి 9, 2019న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస పాఠశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన వివేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్ధుల ప్రసంగాలకు మించి విద్యార్థిని ఢిల్లీశ్వరి విశేష ప్రతిభను కనబరిచింది. ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగాన్ని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపేణా పెట్టారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్లు... వేలల్లో షేరింగ్లు, కామెంట్స్ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా పెద్దల కంట పడింది. ఇంకేముంది... తానా ప్రతినిధులు రామచౌదరి, ఉప్పలూరు రేఖ పాఠశాల హెచ్.ఎం లఖినేని హేమనాచార్యులు, ఉపాధ్యాయుడు పూజారి హరి ప్రసన్నలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీశ్వరి కుటుంబ విషయాలను తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్కు చేయూతనిచ్చేందుకు. ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురసారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల రూపాయల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్, సైకిల్ ఇవ్వనున్నారు. అదే పాఠశాలలో తల్లితండ్రుల్లో్ల ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్నటువంటి 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధులు మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా పెద్దలు హామీ ఇచ్చారు. తానా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమంది సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. కాగా గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్ 9, 2020న మృతి చెందాడు. ఏడేళ్లుగా బ్లడ్ కేన్సర్ వ్యా«ధితో బాధపడ్డ వెంకటరమణ కూలిపని, మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కరోనా సమయంలో మృతి చెందారు. దాంతో కుటుంబ భారమంతా ఢిల్లీశ్వరి తల్లి మీద పడింది. ఈ నేపథ్యంలో తానా అందించనున్న సాయం వారికి కొండంత అండ అయింది. నాన్నే సాయం చేయిస్తున్నట్లుంది..! గత ఏడాది అమ్మ ఒడి ప్రారంభం రోజున హరిప్రసన్న మాస్టారు రాసి ఇచ్చిన రాతప్రతి ఆధారంగా అందరి ముందు ప్రసంగించాను. వివేకానందుని స్ఫూర్తి ప్రసంగం కావడంతో అందరి మన్ననలను పొందాను. నన్ను గుర్తించిన తానా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చదువుకోవడానికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మానాన్నే నాకు సాయం చేయిస్తున్నట్లు అనిపిస్తోంది. – గురుగుబెల్లి ఢిల్లీశ్వరి, ఏడో తరగతి, తాడివలస జెడ్పీ హైస్కూల్. అంతా కలలాగా ఉంది! నా కూతురు ప్రతిభ ప్రపంచ దేశాల్లోని తెలుగు వారు గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. భర్త దూరమైన బాధను మరిపిస్తుంది. అమెరికా నుంచి ఫోన్ రావడం, వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అంతా కలగా ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. – గురుగుబెల్లి భాగ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి ఎంతో ఆనందంగా ఉంది... మా పాఠశాలకు విదేశాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. తానా సభ్యులు ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు మిగిలిన నిరుపేద పిల్లలకు కూడా సైకిళ్లు ఇవ్వాలనుకోవడం సంతోషం. – పూజారి హరిప్రసన్న, గణిత ఉపాధ్యాయుడు, తాడివలస. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: పాయక మధుసూదనరావు, పొందూరు -
అమెరికాలో తెలుగు పద్య వైభవ సదస్సు
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలోనవంబర్ 29న అంతర్జాతీయ దృశ్య సమావేశంలో జరిగిన ‘తెలుగు పద్య వైభవ’ సదస్సు అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషకు నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన, వేమన, బద్దెన, రామదాసు వంటి అనేక మంది కవులు వన్నె తెచ్చారని, వారంత అద్భుతమైన పద్యాలు రచించి యతి, ప్రాసలతో సశాస్త్రీయమైన ప్రణాళికతో, ఛందస్సుతో, రచింపబడే పద్య ప్రక్రియ ఎంతో గొప్ప రచించారన్నారు. అయితే కేవలం తెలుగు భాషలోనే ఈ అద్భుత పద్య ప్రక్రియ ఉందన్న విషయాన్ని పరిరక్షించాల్సిన అవసరం అందరిమీద ఉందన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావును తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. అనంతరం డా. గరికిపాటి ప్రసంగాలన్నీ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలే అనుకుంటే పొరపాటేనన్నారు. అయన ప్రసంగాలలో మానవ విలువల పరిరక్షణ, సామాజిక బాధ్యత గుర్తు చేసే అంశాలతో పాటు మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు, పక్క దారి పడుతున్న యువత, అజ్ఞానం, అంధ విశ్వాసాలు, మూఢా నమ్మకాలలో కొట్టు మిట్టాడుతున్న అమాయక ప్రజలకు వేద విజ్ఞాన మదింపు, శాస్త్ర విజ్ఞాన జోడింపుతో కూడిన ఆయన ప్రసంగాలు మానవాళికి మేలుకొలుపులన్నారు. ఇక గరికిపాటి నరసింహారావు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ అనేది ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలని, తల్లిదండ్రులు తెలుగులో తమ బిడ్డలతో సంభాషించాలని పిలుపు నిచ్చారు. అప్పుడే తెలుగు భాష పరిరక్షించబడుతుందని, ఆంగ్ల వాతావరణం ఉండే అమెరికాలోని పిల్లలు శ్ర్రావ్యంగా పద్యాలు పాడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. "మహా భారతంలో నన్నయ్య రచించిన శకుంతల దుష్యంతుడు వృత్తాంతం నుంచి నేటి స్త్రీలు ధైర్యాన్ని నేర్చుకోవాలని, నూతులు తవ్వడం కన్నా, బావులు తవ్వించడం కన్నా, యజ్ఞాలు చేయడం కన్నా, పుత్రులను కనడం కన్నా, సత్యం మీద నిలబడటం గొప్ప విషయం అనే సందేశం అద్భుతంగా ఆవృత్తాంతంలో ఆవిష్కరించబడింది అన్నారు. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, బమ్మెర పోతన, శ్రీనాధుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఎన్నో పద్యాలను ఉటంకిస్తూ సామాజిక చైతన్యం కలిగించే విధంగా విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని తెలుగు రామాచారి శిష్యులైన.. రాహుల్ శిస్టా, సియాటెల్, వాషింగ్టన్; అనన్య రాయపరాజు, బ్రిడ్జి వాటర్, న్యూ జెర్సీ; భావన నాగోటి, డౌనింగ్ టౌన్, పెన్సిల్వేనియా; శ్రీజ బొడ్డు, న్యూ జెర్సీ; సృష్టి చిల్ల, న్యూ జెర్సీ; శర్వాణి సాయి గండ్లూరి, డల్లాస్, టెక్సాస్; మల్లిక సూర్యదేవర, డల్లాస్, టెక్సాస్; శ్రీతన్ పిట్టల, నువర్క్, డెల్ వేర్; శ్రియ పిట్టల, నువర్క్, డెల్ వేర్; అభిజ్న యనగంటి, యాష్ బర్న్, వర్జీనియా; శ్రియ నందగిరి, బ్లైనా, మిన్నెసోట; ప్రణవ్ అర్కటాల, అట్లాంటా, జార్జియా; శృతి నాగులపల్లి, శాన్ హోజే, కాలిఫోర్నియా; వర్ష జనుంపల్లి, ఫ్రిస్కో, టెక్సాస్; లయ నీలిసెట్టి, న్యూ జెర్సీ; ఆరుషి రామక, న్యూ జెర్సీ; సాయి తన్మయి ఇయ్యున్ని, డల్లాస్, టెక్సాస్, శరణ్య వక్కలంక, వర్జీనియాలు దాశరధి, వేమన, సుమతీ శతక పద్యాలను పాడారు. అంతేగాక పార్థు శిష్యులు.. మేధా అనంతుని, ఆస్టిన్, టెక్సాస్; వేదాంత్ అత్తిలి, బెంటన్ విల్, ఆర్కేన్సా; మేధా నేమాని, శాన్ హోజే, కాలిఫోర్నియా; శ్రియా చెముడుపాటి, రిచ్ మాండ్, వర్జీనియా; సంహిత పొన్నపల్లి, హూస్టన్, టెక్సాస్; భార్గవ్ నేమాని, శాన్ హోజే, కాలిఫోర్నియా; శ్రీవల్లభ కొమండూరు, న్యూ జెర్సీ మరియు శ్రీవల్లి కొమండూరు, న్యూ జెర్సీ. గుమ్మడి గోపాలకృష్ణ గారి శిష్యులు పౌరాణిక పద్యాలను రాగయుక్తం గా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఆముక్త శ్రీనాగ దాసరి, కేరి, నార్త్ కరోలినా; కార్తిక్ దూసి, పొకేప్సి, న్యూయార్క్; శౌర్య మంత్రాల, కేరి, నార్త్ కరోలినా; శశాంక్ మంత్రాల, కేరి, నార్త్ కరోలినా; స్రవంతి మానికొండ, ప్లేన్స్ బొరో, న్యూ జెర్సీ మరియు శ్రీహిత ఎలమంచిలి, ఆపెక్స్, నార్త్ కరోలినా ఇటీవల జరిగిన తానా బాలోత్సవం లో పాల్గొని విజేతలైన రిషికా గోటేటి, న్యూ జెర్సీ; హన్సిత చెంచల, ఫ్లోరిడా; రిషికేశ్ ముద్దన, మారల్టన్, న్యూ జెర్సీలు కూడా పాల్గొని భాగవత పద్యాలను వినిపించారు. చివరగా తానా ఫౌండేషన్ కోశాధికారి జగదీశ్ ప్రభల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన సుమంత్ రామిశెట్టి, శ్రీధర్ చిల్లర, ప్రశాంత్ కొల్లిపర, పురుషోత్తం నార్గౌని గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని విద్యార్ధులకు అద్భుత శిక్షణ ఇచ్చి మంచి గాయనీ గాయకులుగా తీర్చి దిద్దుతున్న రామాచారి, పార్థు, గుమ్మడి గార్లకు, పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు పత్యేక కృతజ్ఞతలను తెలిపారు. -
సాహితీసేవల తోవ ఆకాశవాణి
సాక్షి, హైదరాబాద్: శ్రీశ్రీ అనగానే.. తెలుగు సాహిత్యంలో ఉడుకునెత్తురు కనిపిస్తుంది... దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు తలచుకోగానే సుమధుర సంగీతంలో ఓలలాడిన అమ్మభాష సాక్షాత్కరిస్తుంది... రావూరి భరద్వాజ పేరు చెబితే ‘అఆ’లలో కష్టజీవుల చెమట చుక్కలు స్ఫురిస్తాయి. వీరంతా ఓ వీధివారు కాదు, ఓ ఊరి వారూ కాదు.. కానీ వీరిని ‘రేడియో’అక్కున చేర్చుకుంది. వారి సాహిత్య పరిమళాలను తెలుగు భాషాభిమానులకు చేర్చింది. చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఆ సాహితీమూర్తుల మాటల్లో పల్లవించిన భాషావైభవ ప్రత్యేకతలను నలుచెరగులా రేడియో చేర్చిన తీరును సాహితీ అభిమానులు కళ్లకు కట్టారు. ‘తానా’ఆధ్వర్యంలో ‘ప్రసార సాహితి’పేరుతో ఆదివారం ఆన్లైన్ ద్వారా రెండున్నర గంటల పాటు చర్చాకార్యక్రమం కొనసాగింది. ఆకాశవాణిలో పనిచేస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేందుకు కృషి చేసిన ప్రముఖుల సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. తానా కన్వీనర్ తోటకూర ప్రసాద్, అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా, శ్రీశ్రీ , దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్, గొల్లపూడి మారుతీరావు, జగ్గయ్య, ఆచంట జానకీరామ్, తురగా జానకి సహా 160 మంది మహనీయుల సేవలు ప్రస్తావించారు. ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి అనుసంధానకర్తగా వ్యవహరించారు. అనంత పద్మనాభరావు, గోపాలకృష్ణ, సుభాన్, అనిల్ప్రసాద్ సహా పలువురు ఆకాశవాణి ప్రస్తుత, విశ్రాంత సిబ్బంది వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు. లాక్డౌన్ పరిస్థితులు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న సమయంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఆన్లైన్ వేదికగా తానా నిర్వహిస్తోంది. ప్రతినెలా చివరి ఆదివారం ఆన్లైన్ వేదికగా సాహితీ ప్రియులను అనుసంధానిస్తూ వీటిని జరుపుతోంది. -
తానా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారతీ- సాహిత్య హారతి
వాషింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 74వ పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటామని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అన్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి, జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయమని ఆయన పేర్కొన్నారు. పౌరుల్లో దేశభక్తి లేనిదే ఏ జాతి రాణించలేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశ భక్తి, సామాజిక స్పృహ కల్పించడంలో సాహిత్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇది ఆది కవులు, రచయితల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం జరుగుతుందని తాళ్లూరి తెలియజేశారు. (తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం) 39వ తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా - ఆగస్టు 15వ తేదిన, అంతర్జాలం ద్వారా, వివిధ దేశాల నుంచి 74 మంది సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం, గజల్స్, పాటలలాంటి వివిధ ప్రక్రియలతో భరతమాతకు సాహిత్య హారతి సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన తెలుగు సంతతికి చెందిన గవర్నర్లు - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తమిళనాడు పూర్వ గవర్నర్ పి.ఎస్. రామ్మోహన్ రావు, ఐపీఎస్ తమ సందేశాలు అందజేస్తారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరవుతున్న 74 మంది సాహితీ వేత్తలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు.. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్, జె.కె.భారవి, శ్యామ్ కాసర్ల, సిరాశ్రీ, డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, డా. ముయిద ఆనందరావు (మిథునం చిత్ర నిర్మాత) విశిష్ట అతిథులుగా ఉన్నారు. డా. కడిమెళ్ళ వరప్రసాద్, డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్, డా. మీగడ రామలింగస్వామి, డా. రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, డా. పూదూర్ జగదీశ్వరన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అవధానులుగా వ్యవహరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, ఒమన్, కెనడా వంటి దేశాల నుంచి కూడా ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని డా. ప్రసాద్ తోటకూర ప్రకటించారు. (వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి) సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానం పలుకుతూ, ఈ అద్భుత కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం అవుతుందని, ఆయా దేశాల కాలమానాల ప్రకారం అంతర్జాలంలో యూట్యూబ్, ఫేస్బుక్(https://www.facebook.com/TANA.ORG/) ద్వారా అందరూ వీక్షించవచ్చని తెలియజేశారు. -
వంగపండు మృతికి ‘తానా’ సంతాపం
ఉత్తరాంధ్ర జానపద కాణాచి, ప్రజా వాగ్గేయా కళాకారుడు వంగపండు ప్రసాదరావు(77) మృతికి తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంతాపం ప్రకటించింది. ప్రసాదరావు ఆకస్మిక మరణం కళా రంగానికి తీరని లోటని పేర్కొంది. మే 31న ప్రారంభమైన తానా ప్రపంచ సాహిత్య వేదికకు వంగపండు ముఖ్య అతిధిగా హాజరై తమ బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని తానా ప్రతినిధులు తెలిపారు. అదే ఆయన చివరి కార్యక్రమం కావడం దురదృష్టకరమని అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సంతాపం తెలియజేశారు. అదే విధంగా ప్రసాదరావు మృతికి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పంతాపం ప్రకటించింది. ఆయనకు 2017లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జానపద కళారత్న అవార్డును అందజేశామని అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు. -
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు.