-
రైలు కిందపడి తండ్రి, కుమార్తెల విషాదం!
మహబూబ్నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తుండేవారు.వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
కొత్త చట్టాలు ఇలా..
కోర్టు ఎవిడెన్స్ ఇచ్చే వారిలో పోలీస్, వైద్యులు, తహసీల్దార్ వంటి అధికారులు విధులు నిర్వర్తిస్తూనే, వీడియోకాల్ ద్వారా న్యాయమూర్తికి సాక్ష్యం చెప్పవచ్చు.● ఐదుగురు, అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక వ్యక్తిని హత్యచేస్తే, సెక్షన్ 103 (2) ద్వారా మాబ్లించింగ్ (కులం, మతం, స్థానం)గా గుర్తించారు.● చైన్ స్నాచింగ్ కోసం ప్రత్యేకంగా సెక్షన్ 304 బీఎస్ఎస్ తీసుకొచ్చారు. – యాసిడ్ దాడికి కొత్తగా సెక్షన్ 124 (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చింది.● పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, లైంగికంగా వేధించే వారి కోసం కొత్తగా సెక్షన్ 69ని అమల్లోకి తీసుకొచ్చారు. – మైనర్ (18 ఏళ్లలోపు) పేరును మారుస్తూ, చైల్డ్గా గుర్తింపు తెచ్చారు.● కొన్ని చీటింగ్ కేసుల్లో పట్టుబడిన నగదు కోర్టుకు మాత్రమే అనుసంధానం చేసేవారు. కొత్తగా వచ్చిన చట్టంలో పట్టుబడిన నగదు కోర్టుకు అనుసంధానం చేయడంతో పాటు బాధితులకు పంచే వెసులుబాటును జిల్లా కలెక్టర్కు ఇచ్చారు.● తాజా చట్టంలో కొన్నింటికి శిక్షలు పెంచడంతో పాటు జరిమానాలు భారీగా పెంచారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చెయ్యి విరగొడితే గతంలో మూడేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా ఉండేది. ప్రస్తుతం రూ. 20 వేలకు జరిమానా పెరిగింది. – కొత్తగా టెర్రరిస్ట్ చట్టం 113 అమల్లోకి తీసుకువచ్చారు.● ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక విభాగానికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లలేని పక్షంలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్, మెయిల్, ఎక్స్, ఫేస్బుక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. కానీ మూడు రోజుల్లో సంబంధిత పోలీస్స్టేషన్లో సంతకాలు చేయాలి. కేసుల విషయంలో కోర్టుకు హాజరు కాలేని సాక్షులను వీడియో కాల్ ద్వారా కూడా విచారించవచ్చు. -
ఇద్దరు బాలికలకు పాముకాటు..
మహబూబ్నగర్: వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలను పాముకాటు వేయగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం ఖిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్య సిబ్బంది పాముకాటు మందులు, అంబులెన్స్ లేవు అని చెప్పడంతో చావుబతుకుల మధ్య బాలికను ఆర్టీసీ బస్సులో మహబూబ్నగర్కు తరలించారు.ఈ ఘటనలు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఆయా కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన ముడావత్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి రోజులానే ఇంట్లో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కూతురు ఇందు (10)ను ఓ పాము కాటు వేసింది.వెంటనే నిద్రలేచిన ఇందు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇళ్లంతా వెతకగా కట్లపాము కనిపించింది. దానిని చంపి పాపను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.షాపురం ఊరంచు తండాలో..ఇదిలాఉండగా, మండలంలోని షాపురం ఊరంచు తండాకు చెందిన రెడ్యానాయక్ కూతురు లలిత తిమ్మాజిపేట గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తండాకు వచ్చిన లలిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. పొలంలో నడుస్తున్న క్రమంలో ఓ పాము బాలిక లలితను కాటువేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. కాట్లు గుర్తించి చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
అలా చూసి.. భయంతో పరుగెత్తాను..
కొండాపూర్ అటవీ ప్రాంతంలో బొందె గుట్ట, గొర్లెల్ల గుట్ట మధ్య మా పొలం ఉంది. అక్కడే పశువులు కూడ కట్టేస్తాం. ఎప్పటిలాగే పొలం వద్దకు పడుకోడానికి వెళ్లాను.కొద్దిసేపు మంట పెట్టుకుని పశువులకు మేత వేయడానికి వెళ్లాను. కుక్క అరుస్తూ వచ్చి కంటపడింది. వెంటనే లైట్ వేసి చూడగా చిరుత కొద్ది దూరంలో నిలబడి ఉంది. భయంతో హడలిపోయాను. వెంటనే పరుగెత్తి పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లాను. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాం. పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. – రెడ్డిపల్లి అంజిలయ్య, కొండాపూర్ఆనవాళ్లు చిక్కడం లేదు..కొండాపూర్, ఆశిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని సమాచారం వచ్చింది. తమ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. చిరుత అనడానికి సరైన ఆధారాలు దొరకడం లేదు. హైనా కూడ చిరుతలాగే కనిపిస్తుంది. అదే ఉండవచ్చని మా అనుమానం. రైతులు చూసినట్లు చెపుతున్నా తమకు స్పష్టత రావాలి. ఒకవేళ చిరుత ఉంటే బోను ఏర్పాటు చేస్తాం. రైతులు పశువులను బయట కట్టేయకూడదు. ఒంటరిగా వెళ్లకపోవడం మచింది. చేతిలో ఎపుడు కర్ర పట్టుకుని పొలానికి వెళ్లాలి. – మక్బూల్ హుస్సేని, రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ -
కందూరు కోసం వచ్చి.. కాటికి!
మహబూబ్నగర్, జడ్చర్ల: కందూరు చేసి మొక్కు తీర్చుకోవాలని కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు బాలురు సమీపంలో ఉన్న బావిలో కాళ్లు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు బాలురు మృతిచెందగా.. కొద్దిమేర ఈత వచ్చిన మరో బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లికి చెందిన మతీన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జడ్చర్లకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కందూరు చేయాలని భావించిన మతీన్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం బిజినేపల్లిలోని దర్గా వద్దకు వచ్చారు. అయితే దర్గాకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో కాళ్లు కడుక్కోవడానికి మతీన్ కుమారుడు పూర్కన్(10), బంధువు అజ్మత్ కుమారుడు మహమ్మద్(12), మరో బాలుడు అక్మల్ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదశావత్తు బావిలో జారిపడ్డారు.దర్గాకు పాతాళ్లు ఇస్తున్న కుటుంబ సభ్యులు విషయం గమనించి వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే పూర్కన్, మహమ్మద్ నీటిలో మునిగిపోయారు. అక్మల్కు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో నుంచి ఇద్దరు బాలుర మృతదేహాలను బయటికి తీశారు. విగతజీవులుగా మారిన చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.జడ్చర్లలో విషాదఛాయలు..జడ్చర్లలోని విద్యానగర్కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ నాయకులు మతీన్, అజ్మత్ల కుమారులు మహమ్మద్, పూర్కాన్ బావిలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మతీన్కు పూర్కాన్తోపాటు మరో ఇద్దరు పిల్లలు ఉండగా.. అజ్మత్కు మహమ్మద్తోపాటు ఒక కూతురు ఉంది. -
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
No Headline
ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, స్వామివారి కల్యాణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాలు, అశేష భక్తజనం నడుమ అమ్మవారికి మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో సంప్రదాయబద్ధంగా.. -
రూ. 3,15 లక్షల నగదు పట్టివేత
రాజాపూర్: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసు లు వాహనాల తనిఖీలు చేపట్టి రూ.3,15 లక్షల నగదు పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజాపూర్ శివారులో రంగారెడ్డిగూడ వద్ద బుధవారం జాతీ య రహదారిపై ఎస్ఐ రవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అందులో రూ.2,15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్కు వెళ్తున్న అహ్మద్పాష, సహదేవ్ నాయుడు, బీచుపల్లి వద్ద నగదుకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదును ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీ మహబూబ్నగర్కు పంపించినట్లు తెలియజేశారు. పాన్గల్లో రూ.లక్ష.. పాన్గల్: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి స్టేజీ సమీపంలో చెక్పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.లక్ష నగదు పట్టుబడినట్లు ఎస్ఐ వేణు తెలిపారు. ఎలాంటి రశీదు లేకుండా కొల్లాపూర్ మండలం సింగోటం నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన కుర్వ ఉస్సెన్ బొలెరొ వాహనంలో నగదు తీసుకవెళ్తుండగా గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనాల ప్రకారం ఒక వ్యక్తి రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లాలంటే రశీదులు గాని, బ్యాంకు కౌంటర్ ఫైల్స్ గాని తప్పనిసరిగా ఉండాలని సూచించారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
మన్ననూర్: సలేశ్వరం ఉత్సవాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డి సూచించారు. బుధవారం మన్ననూర్లోని వనమాళికా ప్రాంగణంలో ఆయన అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా చర్చించారు. అటవీ పరిసరాలు, వన్య ప్రాణులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రతి విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాల కోసం నియమిస్తున్న వలంటీర్లను సంయమనం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానికులు, పత్రికా విలేకర్లు అందరూ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యేలా అటవీ శాఖకు సహకరించాలన్నారు. అదేవిధంగా అటవీలో నిప్పు రాకుండా, ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలు పడేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ఆర్ఓ ఈశ్వర్, డీఆర్ఓ రవికుమార్, శ్వేత, ఎఫ్ఎస్ఓలు, బీట్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. వన్యప్రాణులకు నష్టం కలగకుండా చర్యలు డీఎఫ్ఓ రోహిత్రెడ్డి -
ఉద్దేశపూర్వకంగానే దాడి:బండ్ల రాజశేఖర్రెడ్డి
‘తాము అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బంధువర్గాన్ని కాదని బీసీ అభ్యర్థి అయిన సరితకు అండగా నిలబడి పార్టీ కోసం పనిచేశాం. అయితే వారు తమను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే పార్టీలో అణచివేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాలకు వచ్చిన మంత్రి జూపల్లి, ఎంపీ అభ్యర్థి మల్లురవిని మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించాం. అనంతరం ప్రచారం నిమిత్తం నేను మా సోదరుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి కలిసి మల్దకల్కు వెళ్లాం. తాను ప్రచార వాహనంలో ఎక్కేందుకు వెళ్లగా అక్కడే సరిత వర్గానికి చెందిన పెద్దొడ్డి రామకృష్ణ అకారణంగా మాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ముందుగా వేసుకున్న ప్లాన్లో భాగంగానే జరిగింది. మళ్లీ బీసీలపై దాడి చేశారని అబద్దపు ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం’ అని బండ్ల రాజశేఖర్రెడ్డి తెలిపారు. నాపై దాడికి పాల్పడ్డారు:పెద్దొడ్డి రామకృష్ణ ‘తాను ప్రచార వాహనంపై ఉంటే బండ్ల చంద్రశేఖర్రెడ్డి అకారణంగా నాపైకి వచ్చి నన్ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకుని కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. నాపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిగా అభిప్రాయపడుతూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలాంటి దాడులు చేశారు’ అని పెద్దొడ్డి రామకృష్ణ అన్నారు. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీటీఈ నుంచి సవరణ ఉత్తర్వులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మెడికల్, జీపీఎఫ్, సరెండర్ బిల్లులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, రాకేష్రెడ్డి, సతీష్కుమార్, శ్రీధర్, భూపతిసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
విషాదంలోనూ ఔదార్యం
ఊట్కూర్: పుట్టెడు దుఃఖంలోనూ తన భర్త కళ్లను దానంచేసి ఔదార్యం చాటుకుందో భార్య. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం లయన్స్ క్లబ్ వారికి కళ్లను దానంచేసి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన దాసరి విష్ణు (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, తాను చనిపోతే తన కళ్లను ఆస్పత్రి వారికి దానం చేయాలని భార్య శశికళకు చెప్పాడు. అతడి కోరిక మేరకు రెండు కళ్లను లయన్స్ క్లబ్ వారికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామిని బుధవారం జిల్లా జడ్జి పాపిరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి చేరుకోగా.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు న్యాయమూర్తికి వివరించారు. అక్కడి నుంచి కోడ్గల్ సమీపంలోని నచికేత తపోవన ఆశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో సేవా కార్యక్రమాల వివరాలను ఆలయ నిర్వాహకుడు నచికేత గురూజీ న్యాయమూర్తికి వివరించారు. ఈసందర్భంగా జడ్చర్ల కోర్టు జడ్జి లక్ష్మి, ముదాత్అలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగయ్య ఉన్నారు. అలరించిన వసంతకవితోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్ స్కౌట్స్, గైడ్స్ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్గౌడ్, గుముడాల చక్రవర్తి గౌడ్, జగపతిరావు, వెంకటేశ్వర్రావు, కమలేకర్ శ్యాంప్రసాద్రావు, అనురాధ, పులి జమున, సుజాత, రజని, మధుసూదన్ జోషి, మహేష్, రమేశ్, బసవ రాజప్ప, ప్రాణేష్, కృష్ణకుమార్ తదితరులు కవితలు వినిపించి ఆకట్టుకున్నారు. నేటినుంచి యథావిధిగా మార్కెట్ లావాదేవీలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం సెలవు దినం కావడంతో వారానికి ఒక సారి జరిగే ఉల్లి వేలం జరగకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం నుంచి మార్కెట్లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో టెండర్ల ద్వారా అమ్ముకోవచ్చని చెప్పారు. సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డికి సన్మానం అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన పొన్నకల్ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహిమూద్, విజయకుమార్రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జాజాల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కల్లోలం
గద్వాల రూరల్: నడిగడ్డ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరింత ముదిరాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో ఎడముఖం పెడముఖంగా ఉంటూ వర్గాలుగా విడిపోయిన జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి మధ్య మంగళవారం రాత్రి శాంతినగర్లో మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బుధవారం మల్దకల్లో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సంచలనం రేపుతుంది. ● శాసనసభ ఎన్నికల ముందు జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల చంద్రశేఖర్రెడ్డి ఇద్దరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇరువురు నేతలు ఐక్యంగానే ఉంటూ బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే ఫలితాలు వారి అంచనాలకు భిన్నంగా రావడంతో నాలుగు నెలలుగా ఇరువురి నేతల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అంతర్గత చర్చలలో విమర్శలు ప్రతి విమర్శలతో ఆధిపత్య ప్రదర్శనకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని బండ్ల చంద్రశేఖర్రెడ్డి సరితను గట్టిగా ప్రశ్నించడంతో పాటు ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బుల వ్యవహారం వంటి అంశాలు కూడా చర్చకు రావడం, ఇది కాస్తా ముదిరి ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జెడ్పీచైర్పర్సన్ సరితను దురుసు మాటలతో బాధపెట్టారని అక్కడే సరిత వర్గం నాయకులు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి యత్నించగా పక్కనే ఉన్న పార్టీ నాయకులు సర్ది చెప్పారు. ముష్టియుద్ధం కాగా.. బుధవారం ఎన్నికల ప్రచారాన్ని గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం నుంచి మొదలుపెట్టారు. ఈ క్రమంలో మల్దకల్లో ప్రచారరథం వాహనాన్ని ఎక్కేందుకు బండ్ల చంద్రశేఖర్రెడ్డి సోదరుడు బండ్ల రాజశేశేఖర్రెడ్డి యత్నించగా వాహనంపై నున్న సరిత వర్గం నాయకుడు పెద్దొడ్డి రామకృష్ణ వాహనాన్ని ఎక్కవద్దని అడ్డుపడ్డాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అక్కడికి వచ్చిన బండ్ల చంద్రశేఖర్రెడ్డి వాహనం ఎక్కవద్దు అనడానికి నీవెవరూ? అంటూ వాహనంపైనున్న పెద్డొడ్డి రామకృష్ణను చొక్కాపట్టుకొని కిందికి లాగాడు. దీంతో కోపోద్రిక్తుడైన పెద్దొడ్డి రామకృష్ణ వెంటనే బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడడంతో అతడు కిందపడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడే ఉన్న మరికొందరు పార్టీ కార్యకర్తలు బండ్ల చంద్రశేఖర్రెడ్డిపై ముష్టిఘాతాలు కురిపించడంతో అతను గాయపడ్డారు. అక్కడే ఉన్న బండ్ల చంద్రశేఖర్రెడ్డి వర్గీయులు ఆయనను చికిత్స నిమిత్తం మల్దకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గద్వాల కాంగ్రెస్లోముదిరిన విభేదాలు జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్సెస్ బండ్ల చంద్రశేఖర్రెడ్డి మల్దకల్లో ఇరు వర్గాల నేతలపరస్పర భౌతిక దాడులు అంతకు ముందురోజు శాంతినగర్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం -
పాలమూరులో ఆధ్యాత్మిక శోభ
శ్రీరామ నవమిని పురస్కరించుకొని పాలమూరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసి, సీతారాముల కల్యాణోత్సవాన్ని నయనానందంగా నిర్వహించారు. టీచర్స్కాలనీ సీతారామచంద్రాస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి, శ్రీనివాసకాలనీ అభయాంజనేయస్వామి, అప్పన్నపల్లి, ఏనుగొండ, రాజేంద్రనగర్, శివశక్తినగర్ కాలనీ, భూలక్ష్మికాలనీ, అయోధ్యనగర్, హనుమాన్పూరల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాస కాలనీ ఆంజనేయస్వామి, టీచర్స్కాలనీ రామాలయం, సంజయ్నగర్కాలనీ, టీడీగుట్ట, కుమ్మరివాడ వీరాంజనేయస్వామి తదితర ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని తిలకించారు. అప్పన్నపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో దేహదారుఢ్యం
మహబూబ్నగర్ క్రీడలు: క్రీడలతో మానసిక వికాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో బుధవారం గోర్ బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్–7 క్రికెట్ టోర్నీ కొనసాగింది. ఈసందర్భంగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ పూలమాలవేసి పూజలు చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని.. ఇలాంటి క్రీడా పోటీలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. కాగా, రెండో రోజు జరిగిన మ్యాచుల్లో లోకా మసంద్ జట్టు 20 పరుగుల తేడాతో లక్కీషా బంజారా జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్లో ఏకలవ్య జట్టు 13 పరుగుల తేడాతో కొమురం భీం జట్టుపై విజయం సాధించింది. టోర్నీలో విన్నర్ జట్టుకు రూ.1,00,155, రన్నరప్ జట్టుకు రూ.50.155 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేస్తామని జీబీపీఎల్ కమిటీ చైర్మన్ రమావత్ రవిరాథోడ్ తెలిపారు. కార్యక్రమంలో ఢాక్యానాయక్, పున్యానాయక్, మోహన్నాయక్, చందర్ రాథోడ్, ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శేఖర్ నాయక్, పాపారాయుడు, కౌన్సిలర్లు మోతీలాల్నాయక్, నర్సింహులు పాల్గొన్నారు. -
ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టడమే బీజేపీ కర్తవ్యం
అమరచింత: పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పజెప్పి, దేశ సంపదను కొల్లగొట్టడమే బీజేపీ ప్రభుత్వం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుందని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. మండలంలోని నాగల్కడ్మూర్లో సీతారామస్వామి కల్యాణంలో ఆయన సతీమణితో హాజరయ్యారు. కల్యాణం అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, శ్రీరాంభూపాల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని మతోన్మాద ముసుగులో దోచుకుంటున్న పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వరంగ సంస్థలను విస్తరించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేదలన ఆదుకున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దేశం వదిలి వెళ్లిన వ్యక్తులకు రక్షణ కల్పిస్తూ.. వారి అప్పులను మాఫీ చేస్తుంది ప్రధాని మోదీ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోలేరన్నారు. మహబూబ్నగర్ను దత్తత తీసుకుంటానని పదేళ్ల పాటు మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇదే తరహాలో కేంద్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాంభూపాల్, టీపీసీసీ కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్, జలంధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డా.వంశీచంద్రెడ్డి -
భక్తకోటి పరవశం
శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చల్లువ పందిళ్ల కింద కల్యాణ వేదికలను సుందరంగా ముస్తాబు చేయగా.. కల్యాణ వేడుకను భక్తకోటి తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారామచంద్రాస్వామి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. అభిజిత్ లగ్నంలో రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి పులకించిపోయారు. ఈసందర్భంగా రామనామస్మరణ మార్మోగింది. – మహబూబ్నగర్ రూరల్/స్టేషన్ మహబూబ్నగర్/కోయిల్కొండ/ జోగుళాంబ శక్తిపీఠం/ఎర్రవల్లిచౌరస్తా భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు కనులపండువగా రాములోరి లగ్నం మార్మోగిన రామనామస్మరణ.. పులకించిన భక్తజనం -
శ్రీరామకొండ.. జనసంద్రం
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామకొండ క్షేత్రంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తిలకించారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొనగా.. కోయిల్కొండకు చెందిన లక్ష్మీనారాయణగౌడ్ బియ్యం గింజలపై శ్రీరామనామం రాసి, తలంబ్రాలుగా అందజేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీరామకొండలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 130 రోజులైనా రూ. 2లక్షల రైతు రుణాన్ని ఎందు కు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో పంటలు చేతికి అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని అన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ కోతలు ఆరంభమయ్యాయని, సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త ఆషాప్రియా ఉన్నారు.