ETF
-
గోల్డ్ ఈటీఎఫ్లకు ఈక్విటీల సెగ
అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు చూస్తుండటంతో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కళ తప్పుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 2018లో వీటి నుంచి రూ. 571 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) 2017తో పోలిస్తే 2018లో 6 శాతం క్షీణించి రూ. 4,571 కోట్లకు తగ్గింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి రూ. 1.27 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. యాంఫీ గణాంకాల ప్రకారం 2017లో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్ల నుంచి రూ. 730 కోట్ల ఉపసంహరణ జరిగింది. 2016లో రూ. 942 కోట్లు, 2015లో రూ. 891 కోట్లు, 2014లో రూ. 1,651 కోట్లు, 2013లో రూ. 1,815 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ను మదుపుదారులు వెనక్కి తీసుకున్నారు. పసిడికి కొంతైనా కేటాయించాలి.. ‘అంతర్జాతీయంగా 2011–13 మధ్య కాలంలో 1,900 డాలర్లకు ఎగిసిన ఔన్సు (31.1 గ్రాములు) బంగారం రేటు ఆ తర్వాత నుంచి 1,050–1,350 మధ్యలోనే తిరుగుతోంది. రూపాయి బలహీనపడటంతో ఇటీవల దేశీయంగా పసిడి రేటు కాస్త పెరిగినా.. మొత్తం మీద చూస్తే గత ఐదేళ్లుగా పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు భారీ రాబడులు ఇస్తుండటంతో.. గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. అయితే, పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్గా కొంతైనా పసిడికి కేటాయించడం శ్రేయస్కరం‘ అని మార్నింగ్స్టార్ సంస్థ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ చెప్పారు. రియల్ ఎస్టేట్, బంగారం, పొదుపు సాధనాలపై రాబడులు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఈక్విటీల వైపు ఇన్వెస్టర్లు మళ్లడానికి కారణంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే అనిశ్చితి పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పసిడిపై పెట్టుబడులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బేరావాలా చెప్పారు. -
సీపీఎస్ఈ ఈటీఎఫ్కు రూ.27,300 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటా యించిన వాటా 5.5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ కేటగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్లు వచ్చాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ప్రావిడెండ్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ రూ.1,500 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఎస్జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్లో ఉన్నాయి. -
విదేశాల్లో భారత్–22 ఈటీఎఫ్ లిస్టింగ్: కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడేడ్ ఫండ్)ను ఏదైనా విదేశీ స్టాక్ ఎక్సే్చంజ్లో లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ ఫండ్కు మరింత విలువ చేకూరుతుందని, విదేశీ నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రెండు అంచెల్లో రూ.22,900 కోట్లు సమీకరించింది. విదేశీ మార్కెట్లో భారత్ –22 లిస్టింగ్ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. విదేశీ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇన్వెస్టర్ల డిమాండ్, స్పందన తదితర అంశాలపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు మదింపు చేస్తాయని వివరించారు. ఆ తర్వాత ఏ దేశంలో భారత్–22 ఈటీఎఫ్ను లిస్ట్ చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మంచి స్పందనే వస్తుంది ...! గత ఆర్థిక సంవత్సరంలో ఆరంభమైన భారత్–22 ఈటీఎఫ్లో 16 కేంద్ర ప్రభుత్వ సంస్థల, మూడు పీఎస్యూ బ్యాంక్ల, మూడు ప్రైవేట్ రంగ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ పూర్తి వైవిధ్య భరితమైనదని, విదేశీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. భారత్–22 ఈటీఎఫ్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీ ఇండియా, ఐటీసీ, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ల షేర్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఈటీఎఫ్లు ఇన్వెస్టర్లను రక్షణనిస్తాయని నిపుణులంటున్నారు. -
మెరుపు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్లు!
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో (ఈటీఎఫ్) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది. ఇది అంతకు ముందు ఏడాది జూన్ నాటికి రూ.5,174 కోట్లుగా ఉంది. ఏప్రిల్లో రూ.54 కోట్లు, మేలో రూ.38 కోట్లు, జూన్లో రూ.54 కోట్ల మేర ఉపసంహరణలు ఉన్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం ఈటీఎఫ్ విభాగంలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే రావటం గమనార్హం. -
నిధులు పనిచేస్తేనే ఆర్జన
సురేశ్కు స్టాక్ మార్కెట్పై పూర్తి అవగాహన ఉంది. రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తుంటాడు. కాకపోతే మార్కెట్లు అనుకూలంగా లేవని భావిస్తే... కొద్దిరోజులు ఎలాంటి ట్రేడింగ్ చెయ్యకుండా మిన్నకుండిపోతాడు. డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవటం కూడా ఒకరమైన స్ట్రాటజీయేనన్నది సురేశ్ ఉద్దేశం. కాకపోతే అలా ట్రేడింగ్ మానేసినపుడు... మార్కెట్లు కాస్త అనుకూలంగా మారి మళ్లీ ఎప్పుడు చేస్తాడో తనకే తెలియదు కనక ఆ డబ్బుల్ని అలా ట్రేడింగ్ ఖాతాలోనే ఉంచేస్తుంటాడు. బ్యాంకు ఖాతాలోకి వెనక్కి తీసుకోకుండా అలానే ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి కదా అని ఉంచేస్తుంటాడు. ఒకోసారి రెండుమూడు వారాల పాటు ఇలానే ఉండిపోతాయి కూడా. మరి ఈ సమయంలో అవి బ్యాంకు ఖాతాలో ఉంటే కనీసం సేవింగ్స్ వడ్డీ అయినా వస్తుంది. అలాకాకుండా ఈ సమయంలో ఇంకా మెరుగైన రాబడులు రావాలంటే ఏం చేయాలి? లిక్విడ్ ఈటీఎఫ్లను ఎంచుకోవాలి. మీ ట్రేడింగ్ ఖాతా నుంచి బ్యాలన్స్ను విత్ డ్రా చేసుకోకుండానే... లిక్విడ్ ఫండ్స్ను కొనుగోలు చేసుకుని, మళ్లీ ట్రేడింగ్కు డబ్బులు అవసరమైన వెంటనే వీటిని విక్రయించేసుకోవచ్చు. దాంతో మీ బ్యాలన్స్పై కొంతైనా రాబడులు అందుకోవచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందో తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం అందుబాటులో రెండు ఫండ్లు... లిక్విడ్ ఈటీఎఫ్లనేవి ‘ప్యాసివ్లీ మేనేజ్డ్ డెట్ ఫండ్స్’. పాసివ్లీ అంటే ఫండ్ మేనేజర్ల ప్రమేయం లేకుండానే డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం.. అంతకుముందు రోజు రాత్రి బెంచ్మార్క్ (సూచీ) రేటును ట్రాక్ చేయటం వంటివి జరిగిపోతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్ల మాదిరే లిక్విడ్ ఈటీఎఫ్లు ట్రేడవుతుంటాయి. మార్కెట్ వేళల్లో అన్ని పనిదినాల్లో ఎప్పుడైనా వీటిని కొనటం, విక్రయించటం చేయొచ్చు. ప్రస్తుతం రెండు లిక్విడ్ ఈటీఎఫ్లు పనిచేస్తున్నాయి. రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్. వీటిలో రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్గా ట్రేడయ్యే ఈటీఎఫ్. 2003 జులై నుంచి మంచి బలమైన ట్రాక్ రికార్డు ఉంది. డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఏడాది నుంచే పనిచేస్తోంది. చార్జీలు లేవు..! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్... రెండూ డైలీ డివిడెండ్ ప్లాన్నే ఆఫర్ చేస్తున్నాయి. అంటే రోజువారీ రాబడులను డివిడెండ్గా మార్చేసి తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక డివిడెండ్పై 29.12 శాతం డివిడెండ్ పన్ను అమలవుతుంది. అయినప్పటికీ ఫండ్ ఎన్ఏవీని రోజువారీగా కనీసం రూ.1,000 స్థాయిలో ఉంచేందుకు ఇవి ప్రయత్నిస్తుంటాయి. ఒక్క బ్రోకరేజీ సంస్థ మినహా (ఈ బ్రోకరేజీ మాతృ సంస్థ బ్యాంకింగ్ కంపెనీ) మిగిలిన బ్రోకరేజీలు లిక్విడ్ ఈటీఎఫ్లలో లావాదేవీలపై బ్రోకరేజీ వసూలు చేయడం లేదు. ఎందుకంటే లిక్విడ్ ఈటీఎఫ్ల రూపంలో ఇన్వెస్టర్ల నిధులు బయటకు వెళ్లిపోకుండా ఉంటాయి. దీంతో వాటిని తిరిగి ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తే బ్రోకరేజీలకు ఎంతో కొంత లాభమే వస్తుంది కాబట్టి. కస్టోడియన్, ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా లేవు. దీంతో కొనుగోలు, అమ్మకాలపై పెద్దగా వ్యయాలుండవు. ఎక్సే్చంజ్ల్లో కనీస లావాదేవీ ఒక యూనిట్గా ఉంటుంది. లిక్విడిటీ సమస్య తక్కువే... రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్గా ట్రేడయ్యే ఈటీఎఫ్. అవసరమైన సందర్భంలో ఈటీఎఫ్ యూనిట్లను అమ్ముకోవడం ఎంతో సులభం. ఎన్ఎస్ఈలో రిలయన్స్ లిక్విడ్ బీస్ కౌంటర్లో రోజువారీగా రూ.92 కోట్ల మేర ట్రేడింగ్ గత రెండేళ్లుగా నమోదవుతోంది. గత రెండేళ్లుగా రోజువారీగా ఈ కౌంటర్లో 3,150 ట్రేడ్లు నమోదవుతున్నాయి. ఈ రెండు లిక్విడ్ ఈటీఎఫ్లు కూడా నిఫ్టీ 1డి రేటు ఇండెక్స్ను తమ బెంచ్ మార్క్గా పాటిస్తున్నాయి. అంటే ఇన్వెస్టర్లు లెండింగ్ మనీతో ఆర్జించే రాబడులను ఈ సూచీ ప్రతిఫలిస్తుంది. ఈ సూచీ రాబడుల రేటు ప్రస్తుతం 6.11 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో 4.3– 6.3 శాతం మధ్య ఉంది. దీంతో ఈ లిక్విడ్ ఈటీఎఫ్ల రాబడులు నిఫ్టీ 1డి రేటు సూచీల రేటుకు సమీపంలో ఉంటాయి. అంటే స్పష్టంగా చెప్పాలంటే డివిడెండ్ పన్ను పోను ఈ లిక్విడ్ ఈటీఎఫ్ల్లో రాబడులు ప్రతి రోజూ రూ.లక్షకు రూ.11–13 మధ్య ఉంటున్నాయి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో వచ్చే రాబడుల కంటే ఇవి ఎక్కువ. ఉపయోగపడని నిధులకు మార్గం లిక్విడ్ ఈటీఎఫ్లు ప్రత్యేకంగా క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఉపయోగం. ఉపయోగించకుండా ఉన్న నిధులతో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భంలో వెంటనే నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఖాతాలో యాడ్ అవుతుంది. కానీ రెండు రోజుల తర్వాతే బ్యాలన్స్ నిధులను రిడెంప్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం క్యాష్ మార్కెట్లో సెటిల్మెంట్కు సంబంధించి టీప్లస్2 అమలవుతోంది. అంటే ట్రేడ్ జరిగిన తరవాత రెండు రోజులకు సెటిల్మెంట్ అవుతుందన్న మాట. సెటిల్మెంట్ రోజున లిక్విడ్ ఈటీఎఫ్లు డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. కొత్త లావాదేవీకి డబ్బులు అవసరమయ్యేంత వరకు లిక్విడ్ ఈటీఎఫ్ల రూపంలో నిధులు హోల్డ్ అయి ఉంటాయి. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్ ఉంచుకుని, అవకాశం కోసం వేచి చూసే వారు కూడా ఆ అవకాశం వచ్చే వరకు లిక్విడ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదే. ట్రేడ్కు మార్జిన్ అవసరమైన వెంటనే ఒక క్లిక్తో లిక్విడ్ ఈటీఎఫ్లను అమ్మేసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ ఈటీఎఫ్లను డెరివేటివ్ ట్రేడ్లకు మార్జిన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. హేర్కట్ 10 శాతం అమలవుతుంది. ప్రతికూలతలూ ఉన్నాయ్! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంది. 60 బేసిస్ పాయింట్ల (0.60శాతం) మేర ఉంది. రెగ్యులర్ లిక్విడ్ ఫండ్స్తో పోలిస్తే ఇది ఎక్కువే. రెండోది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అన్నది రాబడులను తినేస్తుంటుంది. మరో అంశం మాతృ సంస్థ బ్యాంకుగా ఉన్న బ్రోకరేజీ కంపెనీ లిక్విడ్ ఈటీఎఫ్ల ట్రేడింగ్పై షేర్ల మాదిరే బ్రోకరేజీ ఛార్జీలను బాదేస్తోంది. దీంతో లిక్విడ్ ఈటీఎఫ్ల రాబడులు తగ్గిపోతాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇక, లిక్విడ్ ఈటీఎఫ్లను లిక్విడిటీ లేని ఈటీఎఫ్ల పనితీరుతో, బ్యాంకు ఎఫ్డీలతో పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే ఇవి సాధారణ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తగిన అవకాశం కోసం వేచి చూస్తూ ట్రేడింగ్ ఖాతాల్లో నిధులను అలాగే ఉంచేసేవారు, తాత్కాలికంగా ఆ నిధుల్ని లిక్విడ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువైనవి. అది కూడా ఒక నెల కాల వ్యవధి వరకు సమంజసం. -
భారత్–22 ఈటీఎఫ్ కోసం రూ.15,436 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన విపరీతంగా వచ్చింది. రూ.15,436 కోట్ల విలువ మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం సేకరించాల్సిన దానికి రెట్టింపు ఇది. 22 కంపెనీల్లో ప్రభుత్వం తనకున్న వాటాల్లో కొంత మేర భారత్–22 ఈటీఎఫ్ రూపంలో వేరు చేసి ఇన్వెస్టర్లకు విక్రయిస్తోంది. పెట్టుబడుల ఉససంహరణ ద్వారా నిధుల సమీకరణ కార్యక్రమంలో ఇదీ ఒక భాగమే. ప్రభుత్వం రూ.6,000 కోట్లను ఈటీఎఫ్ల జారీ ద్వారా, గ్రీన్షూ ఆప్షన్ ద్వారా (అవసరాన్నిబట్టి అదనపు కేటాయింపులు) రూ.2,400 కోట్లను సమీకరించాలనుకుంది. అంటే మొత్తం మీద రూ.8,400 కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉంది. బేస్ ఇష్యూ లక్ష్యమైన రూ.6,000 కోట్ల ప్రకారం చూస్తే 2.57 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయింది. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ చూస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన ఆఫర్ 22న ముగిసింది. అన్ని విభాగాల్లోనూ భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన అనూహ్యమనిఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో, ఎండీ నిమేష్ షా అన్నారు. భారత అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఈ ఈటీఎఫ్ ఓ మార్గమని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. అధిక డివిడెండ్ ఈల్డ్తో తక్కువ విలువకు లభిస్తోందన్నారు. -
భారత్–22 ఈటీఎఫ్కు రూ.12,500 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్( ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఆఫర్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిడ్లు ఎక్కువగా వస్తే, అదనంగా రూ.2,400 కోట్ల మేర నిధులను అట్టేపెట్టుకోవాలని (గ్రీన్ షూ ఆప్షన్) కూడా భావించింది. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ ఎఫ్పీఓ శుక్రవారం ముగిసింది. ఈ ఎఫ్పీఓ రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. రూ.6,000 కోట్లకు గాను రూ.12,500 కోట్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 3.44 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఎఫ్పీఓను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించింది. భారత్–22 ఈటీఎఫ్లో మొత్తం 22 కంపెనీలున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, గెయిల్, ఎన్ఎల్సీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు ఈ ఈటీఎఫ్లో ఉన్నాయి. 67 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన రీట్స్ ఐపీఓ న్యూఢిల్లీ: రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ‘రీట్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ 67 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ 2.52 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. 167 కోట్ల షేర్లకు గాను బిడ్లు వచ్చాయి. రూ.180–185 ప్రైస్బ్యాండ్తో ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 466కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. వచ్చే నెల 2న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. -
19న రెండో దశ భారత్ –22 ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 19న రెండో దశ భారత్– 22 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ను (ఈటీఎఫ్) ప్రారంభిస్తోంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.8,400 కోట్లు సమీకరించనుంది. ఈ నెల19న యాంకర్ ఇన్వెస్టర్లు, ఈ నెల 20న సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు సబ్స్క్రైబ్ చేయవచ్చని, ఈ నెల 22 వరకూ ఈ ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా వచ్చే నిధుల్లో రూ.2,400 కోట్ల వరకూ అట్టిపెట్టుకునే (గ్రీన్ షూ ఆప్షన్) వెసులుబాటును కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,400 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉంది. గత నవంబర్లో తొలిసారి... గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం భారత్ –22 ఈటీఎఫ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈటీఎఫ్లో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీతో పాటు ప్రభుత్వ బ్యాంక్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మొత్తంగా 22 సంస్థల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, గెయిల్, బీఓబీ, ఇండియన్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఈటీఎఫ్కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ.32,000 కోట్ల వరకూ బిడ్లు వచ్చినా, ప్రభుత్వం రూ.14,500 కోట్ల బిడ్లనే స్వీకరించింది. -
ఈక్విటీలే ముద్దు.. గోల్డ్ ఈటీఎఫ్లు వద్దు
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్లో 14 గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అటు లిక్విడ్ ఫండ్స్లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్లో మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. గడిచిన అయిదేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్స్టార్ మేనేజర్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్ ఈటీఎఫ్లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. -
తగ్గిన గోల్డ్ ఫండ్స్ మెరుపు!
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి నిధులు వెనక్కుమళ్లడం కొనసాగుతోంది. 2017లో గోల్డ్ ఫండ్స్ నుంచి రూ.730 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇలాంటి ధోరణి వరుసగా ఇది ఐదవ సంవత్సరం. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2016తో పోలిస్తే 2017లో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని (ఏయూఎం–అసెట్ అండర్ మేనేజ్మెంట్) నిధులు 12 శాతం క్షీణించి రూ.4,855కు తగ్గాయి. ♦ మంచి రాబడులు వస్తున్న నేపథ్యంలో గడచిన ఐదేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అధికంగా ఈక్విటీల్లో పెడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గాయి. ♦ ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి గత ఏడాది రూ.1.5 లక్షల కోట్ల మొత్తంరాగా, మ్యూచువల్ ఫండ్స్కీమ్ల్లోకి మొత్తంగా రూ.2.4 లక్షల కోట్లు వచ్చాయి. ♦ 2016లో ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లిన మొత్తం రూ.942 కోట్లు. 2017లో ఇలా బయటకు వెళ్లిపోయిన మొత్తం రూ.730 కోట్లు. 2015 (రూ.891 కోట్లు), 2014 (రూ.1,651 కోట్లు), 2013 (రూ.1,815 కోట్లు)లలో కూడా నిధులు ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లాయి. అయితే ఇలా బయటకు వెళుతున్న నిధుల పరిమాణం తగ్గుకుంటూ రావడం ఇక్కడ గమనార్హం. ♦ 2012లో ఈటీఎఫ్ల్లోకి రూ.1,826 కోట్లు వచ్చాయి. అటు తర్వాత నుంచి నికరంగా బయటకు నిధుల ప్రవాహం కొనసాగింది. ఈక్విటీల ఆకర్షణ... రియల్టీ, బంగారం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. సాంప్రదాయక పొదుపు పథకాల్లో కూడా వడ్డీరేట్లు తగ్గాయి. దీనితో ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపునకు మొగ్గుచూపుతున్నారు. – రాహుల్ పరేఖ్, సీఈఓ, బజాజ్ క్యాపిటల్ -
భారత్–22 ఈటీఎఫ్.. భేష్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 22 కంపెనీల్లో తనకున్న వాటాలను భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా కేంద్రం విక్రయానికి ఉంచగా... కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.8,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఈ ఇష్యూని తీసుకురాగా, ఏకంగా సుమారు రూ.32,000 కోట్లకు సరిపడా బిడ్లు వచ్చాయి. ఇందులో మూడోవంతు విదేశీ ఇన్వెస్టర్ల రూపంలో వచ్చిందే. దీంతో కేంద్రం అనుకున్నదానికంటే అధికంగా రూ.14,500 కోట్లను సమీకరించింది. ఆశించినదానికంటే అధికంగా బిడ్లు వస్తే అదనపు నిధులు సమీకరించాలని కేంద్రం ముందే నిర్ణయించుకుంది. దీంతో రూ.14,500 కోట్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సెక్రటరీ నీరజ్గుప్తా తెలియజేశారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో ఓ కొత్త ఫండ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇప్పటిదాకా జరగలేదని తెలిపారు. ఇష్యూ నాలుగు రెట్లు అధికంగా సబ్ స్క్రయిబ్ అయిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.45 రెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి 1.5 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) నుంచి ఏడు రెట్లు అధికంగా స్పందన వచ్చింది. భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా సమకూరిన రూ.14,500 కోట్లను కూడా కలిపి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సమీకరించిన మొత్తం రూ.52,500 కోట్లకు చేరింది. 2017–18లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,500 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ భారత్– 22 ఈటీఎఫ్ను నిర్వహిస్తోంది. ప్రారంభ ఇష్యూ సైజుగా రూ.8,000 కోట్లను నిర్ణయించగా, ఇందులో 25 శాతం కోటా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రూ.2,000 కోట్లకు గాను రూ.12,000 కోట్ల మేర సబ్స్క్రిప్షన్ రావడం గమనార్హం. తగిన సమయంలో దీన్ని లిస్ట్ చేస్తామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ నిమేష్ షా తెలిపారు. -
వన్నె తగ్గుతున్న గోల్డ్ ఈటీఎఫ్లు
న్యూఢిల్లీ: పెట్టుబడి సాధనంగా ఓ వెలుగు వెలిగిన గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) ప్రాభవం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – అక్టోబర్ మధ్య కాలంలో ఈ తరహా సాధనాల నుంచి ఇన్వెస్టర్లు సుమారు రూ. 420 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవటమే దీనికి నిదర్శనం. మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్ల నుంచి నికరంగా రూ.422 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గతేడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.519 కోట్లు. దీంతో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ. 5,480 కోట్లుగా ఉన్న గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ అక్టోబర్ ఆఖరు నాటికి రూ. 5,017 కోట్లకు తగ్గింది. నాలుగేళ్లుగా ఇదే తీరు.. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2016–16లో రూ. 775 కోట్లు, 2015–16లో రూ. 903 కోట్లు, 2014–15లో రూ. 1,475 కోట్లు, 2013–14లో రూ. 2,293 కోట్ల మేర పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు, ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సేవింగ్ స్కీములలో (ఈఎల్ఎస్ఎస్) మాత్రం గణనీయ స్థాయిలో ఏకంగా రూ. 96,000 కోట్ల మేర పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒక్క గత నెలలోనే ఏకంగా రూ. 17,000 కోట్లు వచ్చాయి. స్టాక్మార్కెట్లు కొంగొత్త గరిష్ట స్థాయులను తాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, ఇతర సాధనాల కన్నా కూడా ఈక్విటీలవైపే మొగ్గు చూపుతున్నారని కోటక్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ తెలిపారు. -
ఈటీఎఫ్... దీర్ఘకాలానికి బెటర్!
♦ పాసివ్ ఫండ్స్కు ఇంకా పెరగని ఆదరణ ♦ ప్రస్తుతం యాక్టివ్ ఫండ్స్కే ఎక్కువ నిధులు ♦ సూచీ ఆధారిత ఈటీఎఫ్లకూ ఆదరణ అంతంతే ♦ చాలా ఈటీఎఫ్ పథకాల్లో లిక్విడిటీ సమస్య ♦ ఎంచుకునే ముందు చూడాల్సిన అంశాలు చాలా... ఈటీఎఫ్ అని ముద్దుగా పిలిచే ఇన్వెస్ట్మెంట్ సాధనాల పూర్తిపేరు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వస్తున్నాయివి. అంటే... ఏదో ఒక స్టాక్లో పెట్టుబడి పెట్టకుండా... కొన్ని రకాల స్టాక్స్ కలసి ఎక్సే్ఛంజీ తయారు చేసే ఒకరకమైన ఇండెక్స్ లాంటి సాధనంలో ఇవి పెట్టుబడి పెడతాయన్న మాట. కేంద్ర ప్రభుత్వం ‘‘భారత్ 22’’ పేరుతో ఇటీవలే ఓ ఈటీఎఫ్ను ఆవిష్కరించటంతో ఈటీఎఫ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంతో పోలిస్తే వీటిని ఎంచుకునే వారి సంఖ్యలో ఇటీవల పెరుగుదల కనిపిస్తున్నా... ఇప్పటికీ చాలామందికి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో... ఈటీఎఫ్లంటే ఏంటో... ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటో పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అంతేకాక.... ఈటీఎఫ్లలో ఎన్ని రకాలుంటాయి? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వేటిలో పెట్టుబడి పెడితే బెటర్? ఇలాంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? ఒకరకంగా చెప్పాలంటే ఈటీఎఫ్లు కూడా ఇండెక్స్ ఫండ్ల లాంటివే. రెండింటి పెట్టుబడి విధానం దాదాపు ఒకటే అయినా... ట్రేడింగ్, లిక్విడిటీ పరంగా ఉన్న తేడాలు ఈ రెండింటినీ వేరు చేస్తుంటాయి. ఈటీఎఫ్లు కూడా ఇండెక్స్లలోనే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్నే తీసుకుందాం!!. దీన్లో 30 షేర్లుంటాయి. ఈ ఈటీఎఫ్ ఏం చేస్తుందంటే... తన దగ్గరున్న నిధులను ఇండెక్స్లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా పెట్టుబడి పెడుతుంది. ఉదాహరణకు సెన్సెక్స్లో రిలయన్స్ వెయిటేజీ గనుక 10 శాతం ఉంటే... తన నిధుల్లో 10 శాతాన్ని ఇది రిలయన్స్కు కేటాయిస్తుంది. సెన్సెక్స్లోని అన్ని షేర్లకూ ఇలా చేయటం వల్ల కొన్ని షేర్లు తగ్గినా... కొన్ని షేర్లు పెరుగుతాయి కనుక... మొత్తమ్మీద ఇండెక్స్ పెరిగితే ఈ ఫండ్ల విలువ కూడా పెరుగుతుంది. ఇండెక్స్ తగ్గితే వీటి విలువ కూడా తగ్గుతుంది. కాకపోతే ఈటీఎఫ్లు చాలావరకు దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి చక్కని పెరుగుదల సాధ్యమని చెప్పవచ్చు. ఇండెక్స్ ఫండ్ – ఈటీఎఫ్ ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్స్ కంటే కొన్ని అంశాల్లో ఆశాజనకంగా ఉన్నాయి. ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టయి ఉంటాయి. స్టాక్స్ మాదిరిగా వీటిలో కూడా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. పైగా ఇండెక్స్ ఫండ్స్తో పోలిస్తే ఈటీఎఫ్ల ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. చాలా వరకు ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 1–1.5 శాతంగా ఉంది. ఈటీఎఫ్లలో మాత్రం ఎక్స్పెన్స్ రేషియో ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), ఈపీఎఫ్ల నుంచి పోటీ పెరగటం దీనికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈటీఎఫ్లలో కొన్ని ఎక్స్పెన్స్ రేషియో కింద 0.1 శాతాన్ని మించి వసూలు చేయడం లేదు. అయితే, ప్రత్యేక థీమ్ ఆధారిత ఈటీఎఫ్లు మాత్రం ఇప్పటికీ అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్లను మాత్రం మార్కెట్ సమయాల్లో ఈటీఎఫ్ల మాదిరిగా ట్రేడ్ చేయలేం. వీటి విలువ మార్కెట్ ముగిశాక వెల్లడవుతుంది. ఆ ధరకు ఫండ్ సంస్థకు సరెండర్ చేసి వైదొలగవచ్చు. యాక్టివ్ – పాసివ్ ఫండ్స్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సుదీర్ఘకాలంపాటు తమ పెట్టుబడుల్ని కొనసాగించే ఈటీఎఫ్లను పాసివ్ ఫండ్స్గా పిలుస్తారు. ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్ నిర్ణయాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోను మార్చేవి యాక్టివ్ ఫండ్స్. కాకపోతే ఈ తరహా పాసివ్ ఫండ్స్కు మన దేశంలో ఇంకా చెప్పుకోతగ్గంత ఆదరణ మొదలు కాలేదు. యాక్టివ్ ఫండ్స్ బెంచ్ మార్క్ సూచీలకు మించి రాబడులను అందిస్తుండటమే దీనికి కారణమని చెప్పాలి. ‘‘గత చరిత్ర చూస్తే యాక్టివ్ ఫండ్స్లో భాగమైన లార్జ్క్యాప్ ఫండ్స్ బెంచ్మార్క్ సూచీలకు మించి రాబడులను అందించాయి. భవిష్యత్తులోనూ ఇవి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లను మించి రాబడులను ఇవ్వగలవు’’ అని సానా సెక్యూరిటీ సీఈవో రజత్ శర్మ చెప్పారు. అయితే, దీర్ఘకాలంలో ఇది ఇలానే కొనసాగదని, పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘సామర్థ్యం విషయంలో మన మార్కెట్ పరిస్థితి మెరుగుపడింది. ఈ సమర్థత అన్నది వచ్చే 5–10 ఏళ్లలో మరింత పెరుగుతుంది. దీంతో యాక్టివ్ ఫండ్స్ ప్రభావం తగ్గుతుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈటీఎఫ్లలో ఎన్నో రకాలు... ఈటీఎఫ్ల్లోనూ భిన్న రకాలున్నాయి. పాసివ్ ఇన్వెస్టర్ అయి ఉండి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్ను కొనసాగించేవారు బెంచ్మార్స్ సూచీల ఆధారిత ఈటీఎఫ్లను పరిశీలించొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్పై అవగాహన ఉంటే లార్జ్క్యాప్ ఆధారిత సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఈటీఎఫ్లను ఎంచుకోవచ్చు. లేదందే మిడ్క్యాప్ సూచీలైన బీఎస్ఈ మిడ్క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 లను కూడా పరిశీలించొచ్చు. సూచీల ఆధారిత ఈటీఎఫ్లలో ఉన్న సౌలభ్యమేంటంటే ఫండ్స్ పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. కేవలం బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే చాలు. అంటే సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు గనుక వాటి పనితీరు, రాబడులు సూచీలకు సమాన స్థాయిలో ఉంటాయి. రంగాల వారీ ఈటీఎఫ్లు మరో రకం. ప్రత్యేకంగా ఓ రంగం పనితీరుపై ఆశాజనకంగా ఉన్నప్పటికీ... ఆ రంగంలోని మంచి స్టాక్స్ను ఎంచుకోవడం, వాటి పనితీరును పర్యవేక్షించే తీరిక, సమయం లేని వారికి ఇవి అనువైనవని చెప్పాలి. థీమ్ ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. అంటే వినియోగం, డివిడెండ్ విరివిగా ఇచ్చే స్టాక్స్... ఇలా ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకునే విధానంతో పనిచేస్తుంటాయి. స్టాక్ ఎక్సేంజ్లు ఈ మధ్య తక్కువ వోలటాలిటీ (ఆటుపోట్లు) ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్ పేరుతో కొత్త సూచీలను మొదలు పెట్టాయి. వీటికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్లను ప్రారంభించాయి. అయితే, ఇవి కొత్తవి, వీటి నిర్వహణలో ఆస్తులు తక్కువగా ఉన్నందున కొంత కాలం పాటు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచన. ఈక్విటీ కాకుండా డెట్ ఆధారిత ఈటీఎఫ్లు సైతం ఉన్నాయి. వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా పనిచేసేవి. మన దేశంలో బంగారం ఆధారిత ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. అయితే, గోల్డ్ బాండ్ల రాకతో వీటి ఆకర్షణ తగ్గింది. ఇక్కడ పేర్కొన్న ఈటీఎఫ్లు అన్నింటిలోనూ సూచీల ఆధారితంగా పనిచేసే ఈటీఎఫ్లు మినహా మిగిలినవి కొంచెం క్లిష్టమైనవి. కనుక ఆయా ఈటీఎఫ్లు వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయన్న వ్యూహాలు తెలిసి, ఆయా రంగాల పనితీరుపై అవగాహన ఉంటేనే ఎంచుకోవడం సరైనది. లిక్విడిటీ... ఒక సమస్యే ఈటీఎఫ్లో వ్యయాలు తక్కువగా ఉండడం ఆకర్షణీయమైన అంశం. అదే సమయంలో లిక్విడిటీ తక్కువగా ఉండడం ప్రతికూలం. తరచుగా ట్రేడ్ కాని ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. దీంతో అమ్మడం, కొనడం చేయాలనుకుంటే అనుకున్న ధర రాకపోవచ్చు. దీంతో ధరల ప్రభావం పడుతుంది. అదే ఇండెక్స్ ఫండ్స్లో ఈ సమస్య లేదు. ఇవి యాక్టివ్గా పనిచేసే ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న యూనిట్లను ఫండ్ హౌస్కు సరెండ్ చేసేస్తే సరిపోతుంది. కనుక ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసేవారు లిక్విడిటీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ దీపేష్ రాఘవ్ సూచన. ఈటీఎఫ్లలో అస్సెట్ బేస్ (పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ) అధికంగా ఉన్న వాటిని ఎంచుకుంటే ఈ సమస్య ఉండదని ఆయన చెప్పారు. ఇక ఈటీఎఫ్లలో పెట్టుబడుల విషయంలో అధిక ఎక్స్పోజర్ తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమైనదే. విభిన్న ఈటీఎఫ్... భారత్ 22కు దూరమే బెటర్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొత్త ఈటీఎఫ్ పథకం భారత్ 22!!. దీనికి దూరంగా ఉండడమే సరైనదని కొందరు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈటీఎఫ్ అంటే సూచీల ఆధారంగా పనిచేసేవి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన పథకం సూచీలకు భిన్నంగా 22 స్టాక్స్తో ఉండడం మొదటి అంశం. ఈ 22 స్టాక్స్ ఏవన్నది ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. సూచీల ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్లలో మార్పులు జరుగుతుంటాయి. అంటే సూచీలోని స్టాక్స్లో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈటీఎఫ్లు కూడా తమ పోర్ట్ఫోలియోలో అందుకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. కానీ, భారత్ 22 పథకం మాత్రం ఆ విధమైన మార్పులు లేకుండా అవే 22 స్టాక్స్తో ఉంటుంది. ఈ స్టాక్స్ కూడా ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నవి. అంటే ప్రభుత్వం అమ్మితే ఆ మేరకు వాటాలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. సీపీఎస్ఈ ఈటీఎఫ్ అన్నది ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన ఈటీఎఫ్ కాగా, భారత్ 22 కేవలం 22 కంపెనీలకే పరిమితం.పైగా పనితీరు సరిగా లేని బ్లూచిప్ కంపెనీలను, ఇతర బ్లూచిప్ కంపెనీలతో కలిపి ఈ సూచీని రూపొందించినట్టు కనిపిస్తోందని రజత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ రంగానికి చెందినది కాకపోవడం, అదే సమయంలో ఓ థీమ్ ఆధారంగా పనిచేసేది కూడా కాకుండా భిన్నంగా ఉండడంతో భారత్ 22లో పెట్టుబడులకు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచనగా ఉంది. దీనికి బదులు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్లను ఎంచుకోవడం నయమన్నది వారి అభిప్రాయం. -
ఈటీఎఫ్లతో రిస్క్ తక్కువ
♦ పాసివ్ ఇన్వెస్ట్మెంట్లతో మంచి రాబడి ♦ ఫండ్ ఖర్చులు తక్కువ కనక దీర్ఘకాలానికి బెటర్... ♦ ఇండెక్స్ల రూపకల్పనలోకఠిన నియమాలు ♦ తాజాగా స్మార్ట్బీటా పేరిటవోలటాలిటీ ఇండెక్స్ కూడా... ♦ ఏసియా ఇండెక్స్ సంస్థ బిజినెస్ హెడ్ కోయల్ ఘోష్ వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో సహజమైన ఊగిసలాటల నుంచి ఇన్వెస్టర్లను రక్షించడానికి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఉపకరిస్తాయని ఏసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణాసియా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ కోయల్ ఘోష్ చెప్పారు. స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) డౌజోన్స్, బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ సమాన భాగస్వాములుగా నాలుగేళ్ల కిందట ఈ ఏసియా ఇండెక్స్ సంస్థ ఏర్పాటయింది. ‘‘ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్, కమాడిటీస్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తులు, థీమ్ల ఆధారంగా ఇండెక్స్లు రూపొందిస్తున్నాం. వీటి రూపకల్పనలో ఖచ్చితమైన అంతర్గత నియమావళిని, వ్యవస్థాగత ప్రామాణిక ప్రక్రియల్ని పాటిస్తున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇవి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లకన్నా పరోక్ష (పాసివ్) ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలమైనవి’’ అని ఈ సందర్భంగా కోయల్ తెలియజేశారు. ఇండెక్స్లకు సంబంధించి ఇండియాలో 2005లో కేవలం 6 ఉత్పత్తులే అందుబాటులో ఉండేవని, ఇపుడు వాటి సంఖ్య ఏకంగా 65కు చేరిందని, వీటి విలువ 5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని తెలియజేశారు. అంటే ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100, ఎస్ అండ్ పీ– బీఎస్ఈ 500 తదితర ఇండెక్స్లన్న మాట. వీటిలో సెక్టార్ల వారీ ఫండ్లు కూడా ఉన్నాయి. ఈ ఇండెక్స్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెన్షన్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కోయల్ చెప్పారు. ఇండియాలోనూ ఈ ట్రెండ్ పెరుగుతోందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ కోసంప్రారంభించిన భారత్–22 ఈటీఎఫ్ను ఆమె ఉదహరించారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ఆరంభించనుందని చెబుతూ... ‘‘గతంలో కేంద్రం ఆవిష్కరించిన సీపీఎస్ఈ ఈటీఎఫ్కన్నా తాజా భారత్– 22 మెరుగైనదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ నవరత్న, మినీరత్న సంస్థలున్నాయి’’ అని చెప్పారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆవిష్కరించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే... ప్రత్యక్ష, పరోక్ష ఇన్వెస్ట్మెంట్ విధానాల మధ్య తేడాల్ని కోయల్ ఘోష్ వివరిస్తూ... ‘‘యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇన్వెస్టరు లేదా ఫండ్ మేనేజరు తానే షేర్లను ఎంచుకుంటారు. తన సమర్థతనే నమ్ముకుంటారు. అనలిస్టుల అంచనాలు, స్టోరీలు, వార్తలు, వదంతుల ఆధారంగా తన ఇన్వెస్ట్మెంట్లను మారుస్తుంటారు. పాసివ్ విధానంలో అలా కాదు. ఇన్వెస్టర్లు మార్కెట్నో, మార్కెట్ను ప్రతిబింబించే ఒక ఇండెక్స్నో ఎంచుకుంటారు. అందులో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములవుతారు’’ అని వివరించారు. తరచు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా... ఆ ఖర్చు కూడా మిగిలేలా సుదీర్ఘకాలంపాటు ఇండెక్స్లలో ఇన్వెస్ట్ చేయటాన్నే పాసివ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తున్నట్లు కోయల్ తెలియజేశారు. పాసివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇండెక్స్ల పనితీరును పోలుస్తూ... ఈ ఏడాది పాసివ్ విధానం ద్వారా వచ్చిన రాబడులు దాదాపు 66 శాతం యాక్టివ్ ఫండ్లకన్నా మెరుగ్గా ఉన్నాయని కోయల్ చెప్పారు. ఖర్చులు కూడా మ్యూచ్వల్ ఫండ్లలో 1.25 నుంచి 2.25 శాతం వరకూ ఉంటే... ఈటీఎఫ్లలో 0.3 శాతమే ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ఆయా ఇండెక్స్లలోని షేర్లను కూడా మారుస్తున్నామని, ఇలా మార్చటానికి కఠినమైన నియమాలతో పాటు పారదర్శక కమిటీ కూడా ఉందని తెలియజేశారు. ‘‘తాజాగా హెచ్చుతగ్గుల ఇండెక్స్ను రూపొందించాం. స్మార్ట్బీటాగా వ్యవహరించే ఈ హెచ్చుతగ్గుల ఇండెక్స్లో భారీగా ఒడిదుడుకులకు గురికాని షేర్లుంటాయి. అంటే మార్కెట్ బాగా పెరిగిన సందర్భాల్లో కూడా ఇవి తక్కువే పెరుగుతాయి. అలాగే మార్కెట్ బాగా పడినపుడు ఇవి తక్కువే పడతాయి. వీటిలో రిస్క్ తక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలనిస్తాయి’’ అని వివరించారు. ఈటీఎఫ్లలో పెట్టుబడులపై ఇండియాలో ఇపుడిపుడే ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉందని చెబుతూ... ఎప్పటికప్పుడు ఇండెక్స్లలోని షేర్లు మారుతుంటాయి కనక చక్కని రాబడుల కోసం ఈటీఎఫ్లు మంచివేనని కోయల్ చెప్పారు. -
కరిగిపోతున్న పసిడి ‘పెట్టుబడులు’
ఏప్రిల్ – జూలై మధ్య గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.256 కోట్లు బయటకు... న్యూఢిల్లీ: పెట్టుబడుల రూపంలో పసిడి ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వెలవెలబోయింది. ఈ కాలంలో 14 గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంటే ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 14 ఈటీఎఫ్ హౌస్ వద్ద నిర్వహణలో ఉన్న మొత్తం పసిడి పెట్టుబడుల విలువ మార్చిలో దాదాపు 5,354 కోట్ల వద్ద ఉంటే, ఈ మొత్తం జూలై ముగిసే నాటికి రూ.5,098 కోట్లకు పడిపోయింది. దీనికన్నా ఈక్విటీలే మంచిదని ఈ కాలంలో ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు... నెలవారీగా విత్డ్రాయెల్స్ చూస్తే... ఏప్రిల్లో రూ.66 కోట్లు, మేలో రూ.71 కోట్లు, జూన్లో రూ.81 కోట్లు, జూలైలో 38 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది చిట్టచివరిసారి రూ.20 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. అటు తర్వాత నుంచీ నికరంగా విత్డ్రాయెల్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈక్విటీ, ఈక్విటీ సంబంధ పొదుపు పథకాల్లో (ఈఎల్ఎస్ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్–జూలై) రూ.41,000 కోట్లకుపైగా వచ్చి చేరాయి. ఈ కాలంలో స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీద ఉండడం గమనార్హం. అమెరికా వడ్డీరేట్ల పెంపు, 2018 నాటికి యూరోప్లో కూడా ఉద్దీపనలు వెనక్కు తీసుకునే అవకాశాలు పసిడిపై పెట్టుబడులకు సంబంధించి కొంత ప్రతికూల ప్రభావం చూపే అంశాలని ఫండ్స్ ఇండియా. కామ్లో పనిచేస్తున్న ఎంఎఫ్ రీసెర్స్ హెడ్ విద్యా బాల పేర్కొన్నారు. బాల అభిప్రాయం ప్రకారం– యల్లో మెటల్ దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, డీమోనిటైజేషన్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు పసిడి ధరను పెరక్కుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ వరకూ పసిడి దిగుమతుల పరిమాణాన్ని చూస్తే, ఇది 2016లో మొత్తం దిగుమతుల పరిమాణాన్ని అధిగమించింది. ఆశలూ ఉన్నాయ్..! భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం– వార్షికంగా చూస్తే... గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడుల విషయంలో కొంత ఆశాజనకంగా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళుతున్న డబ్బు క్రమంగా తగ్గుతూ వస్తుండడమే దీనికి కారణం. 2013–14లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి భారీగా రూ.2,293 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. 2014–15లో ఈ మొత్తం రూ.1,475 కోట్లకు తగ్గగా, అటు తరువాత సంవత్సరాల్లో ఈ మొత్తాలు తగ్గుతూ రూ.903 కోట్లు (2015–16), రూ.775 (2016–17)కోట్లకు దిగివచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్ నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోతే, గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం ఏకంగా భారీ మొత్తంలో రూ.411 కోట్లుగా ఉంది. -
‘భారత్ -22’ కొత్త ఈటీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ -22 పేరుతో కొత్త ఇటిఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ , ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, తదితర 22 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మొత్తం డివెస్ట్మెంట్ టార్గెట్ రూ.72,500 కోట్ల గా ఉండనుందని జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన బారత్-22 ఇండెక్స్లో మొత్తం 22 కంపనీలు ఉండనున్నాయని ఆర్థికమంత్రి మీడియాకు వివరించారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం రూ.9,300 కోట్ల రూపాయల మేరకు గుర్తించామని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ నుంచి రూ. 72,500 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మరోసారి స్పష్టం చేశారు. భారత్-22 ఈటీఎఫ్లో సెక్టార్ల వారీగా బ్యాంకులు అత్యధికంగా 20.3శాతం. 17.5 శాతం వాటాతో ఎనర్జీ సెక్టార్ రెండవ స్థానంలో ఉంది. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. నాల్కో, ఒఎన్జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బిపిసిఎల్, కోల్ ఇండియా ఎనర్జీ , దీని తరువాత ఎఫ్ఎంసీజీ, కంపెనీలు, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసిసిలది 22.6 శాతం వాటా. అలాగే పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపిసి లిమిటెడ్, గెయిల్ ఇండియా, ఎన్హెచ్పీసి, ఎన్ఎల్సీ ఇండియా, ఎస్వీజేఎన్ఎన్ ఆరు యుటిలిటీ కంపెనీలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జైట్లీ ఈ ప్రకటన వెంటనే శుక్రవారం నాటి మార్కెట్ ముగింపులో పీఎస్యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్గ్యాస్ సెక్టార్ భారీగా లాభపడింది. -
ప్రపంచ డిమాండ్ తగ్గినా... భారత్లో బంగారం మెరుపు!
♦ జనవరి–మార్చిలో కనకం కాంతి ♦ డబ్ల్యూజీసీ నివేదిక ముంబై: బంగారానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2017 జనవరి–మార్చి) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినా... భారత్లో మాత్రం డిమాండ్ బాగుంది. ప్రపంచ పసిడి వేదిక (డబ్ల్యూజీసీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 2017 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 18 శాతం తగ్గి 1,034 టన్నులకు పడిపోయింది. 2016 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 1,262 టన్నులు. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తక్కువ నిధులు రావడం, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. భారత్ ధోరణి: ఇక భారత్లో మాత్రం మొదటి త్రైమాసికంలో డిమాండ్ 15 శాతం పెరిగి 107.3 టన్నుల నుంచి 123.5 టన్నులకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఎక్సైజ్ సుంకం ప్రవేశపెట్టడంపై ఆభరణ వర్తకుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై ప్రధానంగా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విలువ రూపంలో చూస్తే. డిమాండ్ 18 శాతం పెరిగి రూ. 27,540 కోట్ల నుంచి రూ.32,420 కోట్లకు చేరింది. దేశంలో ఈ కాలంలో డిమాండ్ పెరగడానికి డీమోనిటైజేషన్ కూడా ఒక కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
గోల్డ్ ఈటీఎఫ్లపై ఆనాసక్తి
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లపై ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2016–17) ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇన్వెస్టర్లు రూ.775 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సోమవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం వరుసగా ఇది నాల్గవ ఏడాది. వరుసగా నాలుగు సంవత్సరాల్లో ఉపసంహరణల మొత్తం తగ్గుతుండటం గమనార్హం. అసెట్ క్లాస్గా ఈక్విటీల్లోకి ఇన్వెస్ట్మెంట్లు మళ్లించడమే ఈటీఎఫ్ల నుంచి ఉపసంహరణలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క గడచిన ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్క అక్టోబర్ మినహా ప్రతి నెలలోనూ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్ట్మెంట్లు వెనక్కు మళ్లాయి. పండుగల సీజన్ వల్ల అక్టోబర్లో ఇన్ఫ్లోస్ జరిగినట్లు మ్యూచువల్ ఫండ్ రిసెర్చ్ సంస్థ– ఫండ్స్ ఇండియా. కామ్ హెడ్ విద్యా బాల అంచనావేశారు. గోల్డ్ ధరల ఆధారంగా రాబడులను అందించే ఇన్స్ట్రు మెంట్లే గోల్డ్ ఈటీఎఫ్లు. ప్రత్యక్షంగా పసిడి ధరతో ముడివడి ఉన్నందున, ఈ ప్రొడక్ట్లో పూర్తి పారదర్శకత ఉంటుంది. భారత్ మ్యూచువల్ ఫండ్ రంగంలో 2006–07 నుంచీ 14 గోల్డ్–ఆధారిత స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. -
గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్ల్లో ఏవి బెటర్?
నేను బీఎస్ఎల్ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్లో 2010 నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ ప్రస్తుతం రూ.4,10,000గా ఉంది. ఈ ప్లాన్లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? –రవికాంత్, విశాఖపట్టణం బీఎస్ఎల్ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). బీమా, మదుపు కలగలపిన ప్లాన్ ఇది. కానీ ఈ తరహా ప్లాన్లు తగిన బీమా కవర్ను, కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ తరహా ప్లాన్ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా వీటిల్లో చార్జీల వ్యయాలు అధికంగా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా చూసినా ఇవి ఇన్వెస్ట్మెంట్కు తగినవి కావు. బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్లను ఎంచుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్లు చాలా తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీ ఇన్వెస్ట్మెంట్స్పై సగటున ఏడాదికి 1 శాతం కంటే తక్కువగానే రాబడులు వచ్చాయి. మీరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకుమించి రాబడులు వచ్చేవి.మీరు ఈ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయినందున మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే సరెండర్ వేల్యూపై కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని ఈ ప్లాన్ను సరెండర్ చేయండి. ఈ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియమ్ నుంచే కొంత మొత్తాన్ని టర్మ్ బీమా పాలసీ కోసం, మిగిలిన దానిని ఒకటి లేదా రెండు మంచి ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇటీవలే గోల్డ్ బాండ్ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే వీటి కంటే కూడా గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయని మిత్రులంటున్నారు. గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదా ? –బాబూరావు, వరంగల్ సావరిన్ గోల్ట్ బాండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమే. గోల్డ్ ఇటీఎఫ్ల్లో కన్నా గోల్డ్బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మూడు విధాలుగా ప్రయోజనకరం. మొదటిది.. గోల్ట్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్పై మీకు 2.75 శాతం చొప్పున వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. రెండవది.. గోల్ట్ ఈటీఎఫ్లు 1 శాతం చొప్పున మేనేజ్మెంట్ చార్జీలు విధిస్తాయి. గోల్డ్ బాండ్స్ ఎలాంటి చార్జీలు విధించవు. మూడవది గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక ఈటీఎఫ్ల ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసహరించుకుంటే మీరు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్ట్ బాండ్స్ విషయానికొస్తే, వీటి కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి కావాలనుకుంటే వైదొలిగే అవకాశముంది. వీటిని డి–మ్యాట్లోకి మార్చుకోవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అవుతాయి. ఫలితంగా మెచ్యురిటీకి ముందే ఈ బాండ్ల నుంచి వైదొలగవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే గోల్ట్ ఈటీఎఫ్ల కన్నా, సావరిన్ గోల్డ్బాండ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మిత్రుల దగ్గర తక్కువ వడ్డీకి రుణం తీసుకొని, ఈ మొత్తంతో 3–15 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. లాక్–ఇన్ పీరియడ్, పన్ను తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని నాకు కొన్ని మంచి ఫండ్స్ను సూచించండి? –సూరజ్, హైదరాబాద్ అప్పు చేసి పప్పు కూడా వద్దని పెద్దలు ఆనాటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్తో సహా అన్ని ఇన్వెస్ట్మెంట్స్కు వర్తిస్తుంది. తక్కువ వడ్డీకైనా సరే, మిత్రుల దగ్గర రుణం తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. దీనివల్ల ఆర్థిక ఊబిలో కూరుకుపోవడమే కానీ ఎలాంటి ప్రయోజనాలు మీరు పొందలేరు. చాలా ఫండ్స్ రాబడులు ఊరిస్తూ ఉంటాయి. దీంతో చేతిలో డబ్బుల్లేకపోయినా, అప్పు చేసైనా సరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం టెంప్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇది సరైన విధానం కాదు. స్టాక్మార్కెట్లో ఒక్కోసారి సుదీర్ఘ బేర్ దశలు నడుస్తూ ఉంటాయి. ఒకసారి ఆ దశ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హరించుకుపోతాయి, రాబడులు రాకపోగా, వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అప్పు చేసి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పండి. మీ సొంత డబ్బులనే ఇన్వెస్ట్ చేయండి. ఏవైనా రెండు, మూడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. సంపద సృష్టికి ఇదొక చక్కని మార్గం. ఈ ఫండ్స్కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. ఈ ఫండ్స్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని కూడా ఉండదు. -
ఈటీఎఫ్ అంటే..
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఈటీఎఫ్ అంటే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ప్రతి విషయంలోనూ మ్యూచువల్ ఫండ్లానే ఉంటుంది. అయితే మ్యూచ్వల్ ఫండ్ల మాదిరి కాకుండా ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో షేర్లను ఎలాగైతే కొనుగోలు చేస్తారో అలాగే బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా ఈటీఎఫ్లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజ్లలో ట్రేడ్ అవుతాయి. ఉదయం కొని సాయంత్రం విక్రయించొచ్చు కూడా. తక్కువ వ్యయాలు, పన్ను రాయితీలు, డైవర్సిఫికేషన్, స్టాక్స్కు ఉండే సౌకర్యాలను కలిగి ఉండటం వంటి పలు ప్రయోజనాల నేపథ్యంలో ఈటీఎఫ్లు ఇన్వెస్ట్మెంట్లకు అనువుగా ఉంటాయి. ఇవి 1993 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈటీఎఫ్లు స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ, ఆప్షన్స్ వంటి పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు చేస్తాయి. ప్రధానంగా మాత్రం స్టాక్ సూచీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. -
స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈటీఎఫ్లలో రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది చందాదారులకు లాభదాయకమన్నారు. ఈపీఎఫ్వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. -
ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ను ప్రారంభించాలని యోచిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి అదనపు మార్గంగా ఈ కొత్త ఈటీఎఫ్ను తేవాలనేది ఆర్థిక శాఖ ఆలోచన. 2014, మార్చిలో ప్రభుత్వం తొలి ఈటీఎఫ్ను ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ పేరుతో అందించిన ఈ ఈటీఎఫ్లో 10 ప్రభుత్వ రంగ షేర్లున్నాయి. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతమున్న ఈ సీపీఎస్ఈ ఈటీఎఫ్కు అదనంగా మరో కొత్త ఈటీఎఫ్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపమ్) సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత ఈటీఎఫ్ ఏర్పాటు నిమిత్తం సలహాదారుల నుంచి బిడ్స్ కోరింది. వచ్చే నెల 11లోపు బిడ్స్ సమర్పించాలని పేర్కొంది. -
గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!
శ్రీధర్కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అవసరం కాబట్టి కొంత బంగారాన్ని కొనాలనుకున్నాడు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గాయి కదా!! కొనుగోలుకు ఇదే మంచి సమయమనుకున్నాడు. కాకపోతే అదే సమయంలో పేపర్లో ఓ వార్త చదివాడు. బంగారం ధరలు మరింత తగ్గుతాయన్నది ఆ వార్త సారాంశం. దీంతో శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు. బంగారంపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఈ వ్యవహారాల్లో అనుభవం ఉన్న స్నేహితుడితో విషయం చెప్పగా... ‘‘బంగారాన్ని భౌతికంగా కొనటమే కాదు! గోల్డ్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, బంగారం బాండ్లు వంటి సాధనాల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు’’ అని చెప్పాడాయన. కాకపోతే పేపర్ గోల్డ్ పథకాలుగా కూడా పిలిచే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్లు) కొన్నాళ్ల కిందటివరకూ బాగా ప్రాచుర్యం పొందాయని, ఇపుడు మాత్రం చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... ఏడాది కాలంలో2-8% మేర తగ్గిన రాబడి ⇒ బంగారం ధరలు పడితే పరిస్థితి మరింత దారుణం! ⇒ 2013 నుంచి సగానికి క్షీణించిన ఈటీఎఫ్ నిర్వహణ విలువ ⇒ రెండేళ్లలో ఈటీఎఫ్ల నుంచి రూ.3,900 కోట్ల ఉపసంహరణ ⇒ కొన్నాళ్లపాటు బంగారానికి దూరంగా ఉండమంటున్న నిపుణులు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి గోల్డ్ ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యం పొందటానికి కారణం బంగారం ధరలే. ఈ ధరలు ఎగిసే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ పెరుగుతుంది. కానీ కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి దాదాపు 2-8 శాతం మేర తగ్గింది. దీంతో అందులో ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి చక్కని రాబడి రాలేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు వారి డబ్బులను గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. మ్యూచ్వల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం.. ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లలో మొత్తంగా రూ.3,900 కోట్లను విత్డ్రా చేసుకున్నారు. దీనిపై సీఎల్ఎస్ఏ చీఫ్ స్ట్రాటజిస్ట్, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్ వుడ్ మాట్లాడుతూ... ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 1,000 డాలర్ల దిగువకు వస్తుందన్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి కూడా తగ్గుతుంది. ఈటీఎఫ్లలో ఆగని ఉపసంహరణ ... గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి తరలివెళ్లే పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా 28 నెలలుగా కొనసాగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా 2013-14లో రూ.2,293 కోట్లను, 2014-15లో రూ.1,475 కోట్లను, ఈ ఏడాది జవనరి-నవంబర్ వరకూ రూ.845 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల మొత్తం నిర్వహణ విలువ మే నెలలో రూ.6,688 కోట్లకు, ఆగస్ట్లో రూ.6,226 కోట్లకు, నవంబర్లో రూ.5,830 కోట్లకు పడిపోయింది. 2007 మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ విలువ (ఏయూఎం) రూ.96 కోట్లుగా ఉంది. అలా అలా పెరుగుతూ... 2013 మార్చిలో గరిష్టంగా రూ.11,648 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఉపసంహరణల దెబ్బకు తగ్గటం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే సగం మేర తగ్గిపోయింది. ఆకర్షణ తగ్గిందెందుకు? గోల్డ్ ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్లు దూరమవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈక్విటీ మార్కెట్ మంచి రాబడిని అందిస్తుండటం. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో బీఎస్ఈ ఇండెక్స్ 5 శాతంమేర బలపడింది. రెండవదేమో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులుండటం. పెపైచ్చు ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంత ఆశాజనకంగా ఉండవనేది మార్కెట్ నిపుణుల మాట. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ... ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే 10 గ్రాముల బంగారం ధర దేశీయంగా రూ.20,000-రూ.24,000కు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు... యూకేలో యూరో రెఫరెండమ్, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పలు అంశాల వల్ల కూడా బంగారం, వెండి ధరలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాయనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 8 గోల్డ్ ఈటీఎఫ్ల పెట్టుబడులు కూడా మే నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరటం గమనార్హం. దూరంగా ఉండటమే బెటర్! ఇన్వెస్ట్మెంట్లు, రాబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల పనితీరు బాగులేదు. ఈ ఏడాది భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు కనక బంగారం సంబంధిత ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. ఇటీవల ప్రారంభించిన గోల్డ్ బాండ్ల పథకం కూడా గోల్డ్ ఈటీఎఫ్కు పోటీ అయింది. గోల్డ్ బాండ్స్కు ప్రభుత్వం 2.75% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ సౌకర్యం ఈటీఎఫ్ల లో లేదు. మార్కెట్లను బట్టి ఈటీఎఫ్ ధర నిర్ణయం జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ కొన్నాక బంగారం ధర పెరిగితే గోల్డ్ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. డీ మ్యాట్ రూపంలో గోల్డ్ బాండ్లను కొనొచ్చు. బాండ్లపై రుణమూ తెచ్చుకోవచ్చు. ఒడిదుడుకుల్లో బంగారం ధర బంగారం ధరల పతనం 2013 నుంచి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రూ.28,000 మైలురాయిని తాకిన బంగారం ధర... జనవరి మధ్యలో రూ.28,215 స్థాయిక్కూడా చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, వినియోగపు భయాల నేపథ్యంలో జులైలో రూ.24,590 వద్దకు పతనమైంది. ఇది 2011 తరవాత కనిష్ఠ స్థాయి. 2013 ఆగస్ట్ 28 నాటి ఆల్టైం గరిష్ట స్థాయి ధర రూ.33,790తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 25 శాతం దిగువన ఉంది. ప్రస్తుతం రూ.25,000 శ్రేణిలో కదలాడుతోంది. -
ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?
బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్. ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ. * అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు * పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు * ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ * చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్ * కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు... గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కొనుగోలు చేయాలి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది. ఎవరికి లాభం? వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు. నష్టాలున్నాయా? బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్మెంట్ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది. కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్లు/ మ్యూచ్వల్ ఫండ్లు ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్లు), గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్ల (ఎంఎఫ్లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట. షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్.. ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు. ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు. ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు. ఎవరికి లాభం? ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. నష్టాలు ఉన్నాయా? బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి. కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్మెంట్గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి. ఎవరికి ఏ పథకం లాభం? గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్స్ : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్) గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం... ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్లు, గోల్డ్ ఎంఎఫ్లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది. లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు. -
ఈటీఎఫ్ల్లోకి ఈపీఎఫ్ఓ నిధులు
⇒ 2015-16లో 5 శాతం ఇన్వెస్ట్మెంట్కు అనుమతి ⇒ మార్కెట్లోకి రూ.5,000 కోట్లు..! ⇒ ప్రణాళికను నోటిఫై చేసిన కార్మిక శాఖ న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిధుల్లో కొంత మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతాన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పెట్టుబడుల ప్రణాళిక, విధివిధానాలను రెండు రోజుల క్రితం కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ఇక్కడ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాదాపు రూ.5,000 కోట్ల ఈపీఎఫ్ఓ నిధులు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత నిధిలో ఒక శాతాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని, అటు తర్వాత దీనిని క్రమంగా ఐదు శాతం వరకూ పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందని అగర్వాల్ తెలిపారు. ఈటీఎఫ్ అంటే... ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్పై ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. 2001లో భారత్లో ఈటీఎఫ్ల ప్రొడక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్ల హవా భారీగా ఉంది. ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సానుకూలంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. 2014లో సీపీఎస్ఈ ఈటీఎఫ్ను ఏర్పాటు చేశారు. 10 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో ఈ ట్రేడెడ్ ఫండ్ బాస్కెట్ ఉంటుంది. ఈ ఫండ్లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్లో సహవాటాదారుల అవకాశాన్ని పొందగలుగుతారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని త్వరలో నిర్ణయిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు. నిధి... రూ.6.5 లక్షల కోట్లు... ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కూడా కనీసం 5 శాతం వరకూ ఈపీఎఫ్ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15 శాతం వరకూ ఈ నిధులు ఉండవచ్చని సైతం ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు స్వయంగా కార్మిక శాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తూ, ఈ దిశలో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. తొలుత ఈటీఎఫ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఈ ‘జాగరూకతే’ కారణమనీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2014-15లో ఈపీఎఫ్ఓ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల కింద కవరేజ్కు నెలవారీ వేతన సీలింగ్ను రూ.6,500 నుంచి రూ.15,000 కు గత ఏడాది సెప్టెంబర్లో పెంచడం దీనికి ఒక కారణం.