రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు | Police Speed Up Investigation In Bangalore Rave Party Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Bangalore Rave Party: రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు

Published Wed, May 22 2024 7:26 AM | Last Updated on Wed, May 22 2024 11:09 AM

Police Speed Up Investigation In Bangalore Rave Party Case

రేవ్‌పార్టీలో తెలుగు నటులు

పార్టీలో సినీనటి హేమపాల్గొన్నారు.. 

ఆమె రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించాం 

తాను లేనంటూ హేమ పోస్ట్‌ చేసిన వీడియోపై విచారణ జరుపుతాం

రాజకీయ నేతలెవరూ రేవ్‌ పార్టీలో  లేరు

రేవ్‌ పార్టీ వ్యవహారంపై బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌

బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘రేవ్‌ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ అని ఈ రేవ్‌పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్‌ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. 

..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్‌పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్‌ సిటీ పీఎస్‌ నుంచి హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశాం. 

డ్రగ్స్‌ విసిరేశారు: రేవ్‌పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్‌పూల్, టాయ్‌లెట్‌ తదితర స్థలాల్లోకి డ్రగ్స్‌ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్‌సిద్దికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. 

పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్‌బావ డ్రగ్స్‌ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్‌ తెలిపారు.

నిందితుల అరెస్ట్‌
రేవ్‌పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్‌ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.

వాసుది విజయవాడ
బెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్‌ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement