అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు Analysis Of The Situation Of Nellore Janasena | Sakshi
Sakshi News home page

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు

Published Sat, Mar 2 2024 8:34 PM | Last Updated on Sat, Mar 2 2024 8:55 PM

Analysis Of The Situation Of Nellore Janasena - Sakshi

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అనేకసార్లు చెప్పుకున్నారు. అందుకే జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని అక్కడి నేతలు ఆశించారు. కనీసం ఒక్క సీటులో అయినా జనసేన పోటీ చేస్తుందని భావించారు. కాని చంద్రబాబు, పవన్ ప్రకటించిన జాబితాలో నెల్లూరు జిల్లాలో జనసేన పేరే ప్రస్తావనకు రాలేదు. పవన్‌ను నమ్మితే నిండా ముంచాడని అక్కడి నేతలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. నెల్లూరు జనసేన పరిస్థితిపై లుక్కేద్దాం.

పుట్టి పెరిగిన నెల్లూరు అంటే తనకు ఎంతో అభిమానం అని..ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టానని పవన్‌ అనేకసార్లు ప్రకటించారు. జిల్లాలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని కూడా అక్కడకు వచ్చినపుడు వారికి హామీ ఇచ్చారు. కాని పవన్‌ మాటలకు చేతలకు..అసలు పొంతనే ఉండదని..టీడీపీ, జనసేన కలిసి విడుదల చేసిన ఉమ్మడి జాబితాతో మరోసారి రుజువైంది. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటుకు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపని పవన్‌..తన పుట్టినగడ్డకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తేలిపోయిందని అక్కడి జనసైనికులు మండిపడుతున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన సిటీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. నగర అధ్యక్షుడు సుజయ్ బాబుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ.. నెల్లూరు సిటీ టికెట్ తమకేనంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని..తనకు అవకాశం కల్పిస్తే సిటీ నుంచి పోటీ చేస్తానని మనుక్రాంత్‌రెడ్డి పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను కలిసి చెప్పారని తెలిసింది. ఇది జరుగుతున్న క్రమంలోనే టీడీపీ నేత, విద్యావ్యాపారి పొంగూరు నారాయణ స్క్రీన్ మీదకు వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకేనంటూ ప్రచారం ప్రారంభించారు. 

ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన తొలి జాబితాలో నెల్లూరు సిటీ టికెట్ నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పొంగూరు నారాయణకి కేటాయించారు. దీంతో మనుక్రాంత్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. జిల్లా పార్టీ ఆఫీస్ ఎదుట పలువురు నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం తన కెరీర్‌ను త్యాగం చేశానని.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా..తనకు టికెట్ ఇవ్వకుండా పవన్ మోసం చేశారంటూ మనుక్రాంత్ రెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకొని బాధపడ్డారట. నెల్లూరు సిటీ లేదా రూరల్ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని మనుక్రాంత్‌ భావిస్తున్నారట.

నెల్లూరు సిటీ నియోజకవర్గం కాకపోయినా.. కనీసం నెల్లూరు రూరల్ టికెట్ అయినా తనకు వస్తుందని మనుక్రాంత్ రెడ్డి భావించారు. అది కూడా రాకపోవడంతో ఆయన వర్గం పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అగ్రహంతో ఉన్నారనే చర్చ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉండే కొందరు నేతలు మునుక్రాంత్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుపడ్డారని.. ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.. టికెట్ విషయంపై మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్‌ని అపాయింట్‌మెంట్ అడిగినా.. ఆయన లైట్ తీసుకున్నారనే ప్రచారం నెల్లూరులో జరుగుతోంది. 

పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ స్థాపించింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసమనే విషయం గత పదేళ్ళుగా ఆయన నడవడిక చూస్తేనే తెలుస్తోంది. చంద్రబాబు ప్యాకేజీ కోసం పనిచేసే పవన్‌ను ఎలా నమ్మావని మనుక్రాంత్‌రెడ్డిని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. పవన్‌ను నమ్ముకుంటే మునుగుడు తప్పదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్‌ రియల్‌ సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement