రాజ్యసభలోనూ నీట్‌ రగడ | Rajya Sabha sessions 2024: NEET discussions in Parliament so far | Sakshi
Sakshi News home page

రాజ్యసభలోనూ నీట్‌ రగడ

Published Wed, Jul 3 2024 4:17 AM | Last Updated on Wed, Jul 3 2024 4:17 AM

Rajya Sabha sessions 2024: NEET discussions in Parliament so far

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్‌ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్, మరొకటి ఇండియన్‌ పేపర్‌ లీక్‌. ఒక ఐపీఎల్‌ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్‌ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.

నీట్‌–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్‌ ఎనీమోర్‌(ఎన్‌టీఏ)గా పలకాలి’ అని ఆప్‌ సభ్యుడు రాఘవ్‌ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్‌ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్‌ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్‌ నేత దిగి్వజయ్‌సింగ్‌ సూటిగా ప్రశ్నించారు.

ఎన్‌టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్‌ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్‌ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్‌ లీకేజీల్లో కోచింగ్‌ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌ను తక్షణం డిస్మిస్‌ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్‌ సుమన్‌ అనుమానం వ్యక్తంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement