-
కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం!
గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు. రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటిపడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవే కదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టింది.మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.‘ఔను! హనుమంతుడూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికి మాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు.అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.‘కపిలా! నువ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమసౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అంది నిష్ఠూరంగా.కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. ‘పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు.మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..! -
తిరుమల : శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారికి శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం (ఫొటోలు)
-
తిరుపతి : గంగమ్మకు మరుపొంగళ్లతో భక్తుల మొక్కులు (ఫొటోలు)
-
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
దేవుడు స్వతంత్రుడా?
ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
బ్రహ్మజ్ఞానం అంటే...
ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు బ్రహ్మజ్ఞానం తెలియాలని ఆశపడ్డారు. వారిద్దరినీ ఓ మంచి గురువు వద్దకు పంపారు. ఇద్దరూ గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు. తండ్రి తన పెద్దకొడుకుని చూసి ‘బ్రహ్మజ్ఞానం గురించి ఏం నేర్చుకున్నావు’ అని అడిగాడు. వెంటనే ఆ కొడుకు వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. వేదాల నుంచీ, శాస్త్రాల నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ‘సరే ఆపు’ అని తండ్రి అన్నాడు.ఈసారి బ్రహ్మజ్ఞానం గురించి నువ్వేం నేర్చుకున్నావని చిన్న కొడుకుని అడిగాడు తండ్రి. అతను నోరెత్తలేదు. తల వంచుకుని నిల్చున్నాడు. తండ్రి అతని వంక చూశాడు. నీ వాలకం చూస్తుంటే నీకే బ్రహ్మజ్ఞానం గురించి అంతో ఇంతో తెలిసినట్లుందన్నాడు. ‘బ్రహ్మం గురించి పూర్తిగా తమకు తెలుసని పలువురు అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన చక్కెర కొండ నుంచి ఒక్క రవ్వ చక్కెరను తీసుకుని పోతున్న చీమ మరోసారి వచ్చినప్పుడు ఈ మొత్తం కొండను తీసుకుపోతానని చెప్పడం లాంటి’దని రామకృష్ణపరమహంస చెప్పారు.బ్రహ్మం అనేది మన ఆలోచనలకు, మాటలకు అతీతమైనది. గొప్ప గొప్ప మహాత్ములను కూడా ఈ విషయంలో పెద్ద చీమలని చెప్పవచ్చు. వారందరూ ఓ ఏడెనిమిది చక్కెర రవ్వలను తీసుకుపోయి ఉంటారు. అంతే. బ్రహ్మం అనే మహాసముద్ర తీరాన నిల్చుని కాళ్ళు తడుపుకోవడం లాంటిదే వారు బ్రహ్మజ్ఞానం తమకు తెలుసునని చెప్పడం. నిజానికి వారందులో మునగలేదు. మునిగి ఉంటే వారు తిరిగివచ్చి ఉండరు.‘అనగనగా ఓ ఉప్పు బొమ్మ ఉండేది. సముద్రం లోతెంత అని తెలుసుకోవడంకోసం అందులోకి దూకాలన్నది దాని ఆశ. అలాంటి ఆశ పుట్టినప్పుడు అది ఉత్తినే ఉండగలదా! సరే, సముద్రం లోతెంత చూసేద్దామని నిర్ణయించుకుంది. వెంటనే అది సముద్రంలో దూకేసింది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో... అంతే సంగతులు. ఉప్పుబొమ్మ సముద్రంలో దూకితే ఏమవుతుంది... కొంచెం కొంచెంగా కరగనారంభించింది. కాస్సేపటికే బొమ్మ మొత్తం కరిగిపోయింది.అది ఇంకేం కనిపెట్టగలదు సముద్రం లోతుని! అలాగే బ్రహ్మజ్ఞానం తనకొచ్చేసింది అనుకున్న మనిషి మౌనంగా ఉంటాడు. అది వచ్చేంతవరకూ మట్లాడుతూనే ఉంటాడు. తేనె తాగడం కోసం ఓ భ్రమరం తోటలోకి వెళ్ళింది. అది పువ్వు మీద వాలే వరకే ఝుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పువ్వు మీద వాలిందో ఆ క్షణంలోనే అది మౌనమైపోతుంది. అలాటిదే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడ’మని పరమహంస అంటారు. – యామిజాల జగదీశ్ఇవి చదవండి: June11: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు. అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు. సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు. కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన -
జగత్తంతా ఈశ్వరమయం!
ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగానేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు -
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
కాశ్మీర దేశాన్ని పూర్వం వసువు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మాధర్మాలు ఎరిగిన వసువు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరచేవాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడినే మనసులో నిలుపుకొని ధర్మబద్ధ జీవనాన్ని కొనసాగించేవాడు.కొన్నాళ్లకు వసు మహారాజుకు మోక్ష కాంక్ష ఎక్కువైంది. రాజ్యభారాన్ని విడిచి, తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించాలనే కోరిక పెరగడంతో, ఒకనాడు తన సోదరుల్లో సర్వసమర్థుడైన వివస్వంతుడిని పిలిచి, అతడి కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత బంధుమిత్ర పరివారాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కాలినడకన సాగుతూ దారిలో ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ పరంధాముడైన శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడిగా కొలువైన పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. తన తపస్సుకు అనువైన క్షేత్రం పుష్కర తీర్థమేనని తలచి, అక్కడ తగిన చోటు వెదుక్కుని తపోదీక్షలో కూర్చున్నాడు. శరీరం శుష్కించిపోయేలా కఠోర తపస్సు సాగించాడు. పుండరీకాక్షుడే పరమదైవంగా భావిస్తూ ఒకనాడు ఆశువుగా స్తోత్రాన్ని పఠించసాగాడు.‘నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన/ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే/ విశ్వమూర్తి మహాబాహుం వరదం సర్వతేజసమ్/ నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం ప్రభుం/ ఆదిదేవం మహాదేవం వేద వేదాంగ పారగం/ గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం..’ అంటూ వసు మహారాజు పుండరీకాక్ష పారస్తుతిని పఠిస్తుండగా, ఒక్కసారిగా అతడి ముందు ఒక భయంకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. తుమ్మమొద్దులాంటి నల్లని దేహంతో, చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో ఉన్నాడు. అతడు ‘రాజా! ఏమి ఆజ్ఞ!’ అని అడిగాడు.ఈ పరిణామానికి వసు మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఓయీ కిరాతకా! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాడు. ‘రాజా! పూర్వం నువ్వు దక్షిణపథాన ధర్మప్రభువుగా ఉన్నావు. ఒకనాడు మృగయావినోదం కోసం అడవికి వెళ్లావు. అక్కడ జంతువులను వేటాడుతూ నువ్వు సంధించిన బాణం పొరపాటున ఒక మునికి తగిలింది. ముని ఆర్తనాదం విని నువ్వు హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నావు. అప్పటికే అతడు మరణించాడు. అనుకోని ఆ సంఘటనకు నీలో ఆందోళన కలిగింది. బ్రహ్మహత్యకు పాల్పడినందుకు బాధతో లోలోపలే కుమిలిపోయావు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఈ వృత్తాంతాన్ని నీ ఆంతరంగికుడికి చెప్పావు. అయినా అపరాధ భావన నీ మనసును తొలిచేయసాగింది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుడిని మనసారా ధ్యానించి ద్వాదశినాడు ఉపవాసం ఉన్నావు. ఆ పుణ్యదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు. ప్రాణాలు వదులుతున్న సమయంలో అప్పటి నీ భార్య ‘నారాయణి’ పేరును ఉచ్చరించావు. ఆ కారణంగా నీకు ఒక కల్పం వరకు విష్ణులోక నివాసయోగం లభించింది.రాజా! నేనొక బ్రహ్మరాక్షసుడిని. అత్యంత ఘోరమైన వాణ్ణి. నీ దేహంలోనే ఉన్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలని అనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బయటకు లాగి రోకళ్లతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాల నుంచి పూర్తిగా బయటపడ్డాను. నువ్వు స్వర్గంలోకి ప్రవేశించావు. నీలో నా తేజస్సును నింపి నేను కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడచిన కల్పంలో జరిగిన చరిత్ర.ఈ కల్పంలో నువ్వు కాశ్మీర రాజకుమారుడిగా జన్మించావు. ఆనాటి నుంచి నేను నీ రోమకూపాల్లోనే ఉండిపోయాను. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశావు. అవేవీ నన్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే, రాజా! ఇప్పుడు నువ్వు పుండరీకాక్ష పారస్తుతిని పఠించగానే నేను నీ రోమకూపాల నుంచి బయటపడి, ఇలా కిరాతుడిలా ఏకరూపాన్ని పొందాను. పరమాత్ముడి స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తిని పొందాను. నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది’ అని చెప్పాడు. కిరాతుడి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వసు మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జన్మాంతర వృత్తాంతాన్ని చెప్పిన కిరాతుడిని వరం కోరుకోమన్నాడు. పరమాత్మ జ్ఞానం తప్ప తనకు వరమేదీ అక్కర్లేదన్నాడు కిరాతుడు. ‘ఓ కిరాతుడా! నీ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాను. నీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇకపై నువ్వు నా అనుగ్రహంతో ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధి పొందుతావు. జ్ఞానమార్గంలో మోక్షం పొందుతావు. పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని తలచి, భక్తిశ్రద్ధలతో ఈ పుండరీకాక్ష పారస్తుతిని పారాయణం చేసిన వారికి, ఆలకించిన వారికి పుష్కరతీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది’ అని పలికాడు వసు మహారాజు. వెంటనే అతడి ముందు ఒక దివ్యవిమానం వచ్చి నిలిచింది. దేవదూతలు అతడికి సాదరంగా స్వాగతం పలికారు. తమతో పాటు విమానంలోకి ఎక్కించుకుని, వసు మహారాజును స్వర్గానికి తీసుకుపోయారు. – సాంఖ్యాయన -
Hanuman Jayanti: ఈ అద్భుత తెలివితేటలే.. శ్రీరామ–సుగ్రీవ మైత్రి కలిసేలా..
భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి) -
తిరుపతి : గంగమ్మకు మరు పొంగళ్లు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం (ఫొటోలు)
-
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
Tataiahgunta Gangamma Jatara: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మజాతర (ఫొటోలు)
-
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
-
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
-
Simhachalam Temple: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
-
హైదరాబాద్లోనే కోల్కత్తా కాళీ మందిర్.. స్వర్ణశిల్పి టెంపుల్ ప్రత్యేక (ఫొటోలు)