Sourav Ganguly Comments on India's T20 World Cup 2021 Performance - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!

Published Sat, Dec 4 2021 8:01 PM | Last Updated on Sat, Dec 4 2021 8:43 PM

Sourav Ganguly: India Poorest In Last 5 Years 15 Percent Ability T20 WC 2021 - Sakshi

Sourav Ganguly: India Poorest In Last 5 Years 15 Percent Ability T20 WC 2021: ‘‘నిజాయితీగా చెప్పాలంటే 2017, 2019లో టీమిండియా బాగానే ఆడింది. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా పాకిస్తాన్‌ చేతిలో ఓడి టైటిల్‌ చేజార్చుకుంది. అప్పుడు నేను కామెంటేటర్‌గా ఉన్నాను. ఇక 2019.. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌... మా జట్టు చాలా బాగా ఆడింది. కానీ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడటంతో రెండు నెలల శ్రమ తుడిచిపెట్టుకుపోయింది.

అప్పుడు కాస్త నిరాశకు లోనయ్యాను. అయితే, ఈసారి మాత్రం మరీ పేలవమైన ప్రదర్శన.. అన్ని ఓటముల్లోకెల్లా గత నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం’’ అని టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో కోహ్లి సేన ఆట తీరు పూర్తిగా నిరాశపరిచిందని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్‌లో ఆరంభ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైన టీమిండియా సెమీస్‌ కూడా చేరలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.

దీంతో భారత జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్‌ ఆడటంపై ఉన్న శ్రద్ధ దేశం కోసం ఆడటంలో లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లి సేన తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించలేదంటూ దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ... భారత జట్టు పేలవ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏం జరిగిందో తెలియదు కానీ.. వరల్డ్‌కప్‌లో మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారని అనిపించలేదు. ఇలాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఒకసారి గనుక నిరాశకు లోనై ఆగిపోతే ముందుకు సాగడం కష్టం.

నాకు తెలిసి మా జట్టు కనీసం వాళ్లకున్న శక్తిసామర్థ్యాల్లో కనీసం 15 శాతం కూడా ఉపయోగించుకున్నట్లు అనిపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహించనున్న నేపథ్యంలో.. గత అనుభవాల గురించి గుణపాఠం నేర్చుకుని మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ వరల్డ్‌కప్‌లో తమ జట్టు ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని పునరుద్ఘాటించాడు.  కాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 ముగిసిన తర్వాత విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పగా... రోహిత్‌ శర్మ ఆ బాధ్యతలు చేపట్టాడు.

చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్‌..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement