-
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్ఫండ్స్తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్ఫండ్స్కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఏ ఫర్ ఎటాక్... పీ ఫర్ పొక్లెయిన్?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్ చెప్పారు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనే కొటేషన్ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్ ఇంజన్ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్ వయసు డెబ్బయ్ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్ ఫీల్డ్ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్జెన్ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్ఫీల్డ్ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే. మయన్మార్ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్ జంగిల్ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్ ఎస్టేట్ మోడల్ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్ నిర్మాత కులీ కుతుబ్షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ఫీల్డ్ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.ప్రధాన డ్యామ్కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లుగా వ్యవహరిస్తారు.ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్ వాల్ కడతారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్ డ్యామ్లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్ డ్యామ్లను సగం కట్టి వదిలేశారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్ వాల్ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్ 11 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తయినట్టు అక్కడో పైలాన్ను ఆవిష్కరించారు.ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్లు పూర్తిచేయడానికి, స్పిల్ చానల్ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్ డ్యామ్లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్ వాల్ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్ నుంచి కోరుతూ వస్తున్నది.మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్ ఎటాక్, పీ ఫర్ పొక్లెయిన్’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్మోహన్రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్మోహన్రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్సభ స్పీకర్ జీ.వీ. మావలంకర్ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. మూడు – స్పీకర్ గుర్తించాలి. ఈ స్పీకర్ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్పాట్ మీకు రోల్మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్బుక్ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్కింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే.... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు. షర్మిల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు. తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి. చంద్రబాబు నాయుడు వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది. ఈ ఛాలెంజ్ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే! పురందేశ్వరి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్ వైస్రాయ్కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది. బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. షర్మిల తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్ జగన్లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు. చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్. రెండోది జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్కు చెందిన ప్రైవేట్ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి. కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా! చంద్రబాబునాయుడు అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్–స్టేషన్లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది! యెల్లో కార్డ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగితే జగన్ ఖండించలేదట. మణిపుర్ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు. బీజేపీకి జగన్ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఎంజీఆర్ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్ హుందాగా స్పందించారు. రెడ్కార్డ్ చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పెత్తందారుకు టిప్పర్ సవాల్!
మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్న మాట కూడా నిజం. ఈ కుల–వర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం. అవమానాలను మోసే స్థానం. ఈ విభజన సత్యాన్ని గుర్తించే సాహసం మన రాజకీయ నాయకులు చస్తే చేయరు. ఆ సత్యం మీద మసిపూసి మాయం చేస్తారు. అందరి క్షేమం తమ ధ్యేయమంటారు. సకల జనుల శ్రేయోరాజ్యం తమ ఆశయమంటారు. సర్వేజనాః సుఖినో భవన్తని ఆశీర్వదిస్తారు. అభివృద్ధి–సంక్షేమం తమకు రెండు కళ్లంటారు. ‘పేదల కోసం సంక్షేమం, పెద్దలతోనే అభివృద్ధి’ అనే చిత్ర రచన చేస్తారు. పేదలకు తిండి దొరకని పరిస్థితిని ఈ సంక్షేమం అరికట్టగలిగింది. లేబర్ మార్కెట్ నిక్షేపంగా నిలబడేందుకు ఈ సంక్షేమాన్ని మన పాలకులు వెదజల్లుతారు. ఐదు రూపాయలకే భోజనం పెట్టేంత అపురూపమైన ఔదార్యాన్ని కూడా మన పాలకులు కనబరుస్తుంటారు. అది బాల్యవివాహమైనా సరే ఓ పాతిక వేలు సర్కారీ కట్నం చదివించి మంచి మనసును చాటుకుంటుంటారు. బాల్యవివాహం వల్ల పిల్ల చదువు ఆగిపోయినా లెక్క చేయరు. హిందూ,ముస్లిం, క్రైస్తవులకు ఒక్కో పండుగ చొప్పున ఓ సంచెడు ఉప్పూ, పప్పూ, చక్కెర వగైరాలతో స్వయం పాకాన్ని అందజేస్తారు. పండు ముదుసళ్లను పదిసార్లు తిప్పించుకున్నప్పటికీ ఓ వేయి రూపాయలను పెన్షన్గా అందజేసేంత విశాల హృదయం మన సంక్షేమ పాలకుల్లో ఉన్నది. కానీ, పేదలు సాధికారత సంతరించుకునే అవకాశాలు వీరి కార్యక్రమంలో ఉండవు. ఈ తరహా రెండు కళ్ల సిద్ధాంత ‘సంక్షేమ’ పాలకుల్లో మన చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతంలో అభివృద్ధి – సంక్షేమం అనేవి రెండు సమాంతర రేఖలు మాత్రమే! ఒకదాన్నొకటి తాకదు. సంక్షేమం కోటాలోని జనం అభివృద్ధి కేటగిరీలోకి చేరిపోవడమనేది ఒక అరుదైన సన్నివేశం. లేబర్ మార్కెట్లోని ప్రజలు సంపన్న శ్రేణిలోకి చేరాలంటే వారికి నాణ్యమైన ఉచిత విద్య మొదటి షరతు. ఇక్కడే మన సంక్షేమ పాలకుల వర్గదృక్పథం బట్టబయ లయ్యేది. నాణ్యమైన ఉచిత విద్యకు మన పాలకులు ససేమిరా అంగీకరించరు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ముఖ్య మంత్రి హోదాలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. విద్యారంగాన్ని వ్యాపారస్తుల రేస్కోర్స్గా మార్చిన ఘనుల్లో నిస్సందేహంగా చంద్రబాబు అగ్రగణ్యుడు. విద్యాబేహారులకు ప్రభుత్వ పాలనలో పెద్ద పీట వేసినవాడు చంద్రబాబు. పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకుండా ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించాడో మనం చూశాము. నాణ్యమైన విద్యకు బదులుగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పు కొస్తున్నారు. పైగా దాన్ని తక్కువ ధరలకే అందజేస్తారట. ఇంకో రెండు రోజులు పోతే డోర్ డెలివరీ కూడా చేస్తామంటారేమో! మద్యం ఆరోగ్యానికి హానికరమైనదని వైద్యులందరూ చెబు తారు. నాణ్యమైన మద్యమైతే నెమ్మదిగా చస్తారు. నాసిరకం మద్యమైతే వెంటనే చస్తారని ఆయన భావం కావచ్చు. ఈ చంపే యడంలో నాణ్యతా ప్రమాణాలు దేనికి? ప్రజలను సాధికారం చేసే విద్యలోనూ, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే వైద్యంలోనూ నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వం పనికాదనీ, అది ప్రైవేట్ వ్యాపారుల క్రీడాస్థలమనేది చంద్రబాబు సిద్ధాంతం. అందువల్లనే ఆయన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలమై పోయాయి. ఈ రెండు వ్యవస్థల్లోనూ కార్పొరేట్ రంగం రంకె లేసింది. ఐదేళ్ల జగన్ పరిపాలన అందుకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాస్పత్రులు ఇప్పుడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 58 వేల ఉద్యోగ ఖాళీలను 58 మాసాల కాలంలో భర్తీ చేయగలిగారు. అంటే నెలకు వేయి ఖాళీల చొప్పున భర్తీ. ప్రభుత్వం ఎంత ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇది సాధ్యమవుతుంది? వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాస్పత్రులను ఆధునికం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో పీరియాడికల్గా ప్రభుత్వ వైద్యుడు పర్యటిస్తాడు. రోగగ్రస్తులందరి రికార్డు ఆయన దగ్గరుంటుంది. క్రమం తప్పకుండా ఆయనే వాళ్లను పరీక్షించి మందులిస్తాడు. ఆ రకంగా ప్రతి పేదరోగికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ను అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ విధానానికి ఈ ఐదేళ్లలోనే శ్రీకారం చుట్టారు. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. విద్య, వైద్య రంగాల్లో ఏ పాలకుని వైఖరి ఏమిటో తెలిస్తే ఆ పాలకుని వర్గ స్వభావమేమిటో చెప్పవచ్చు. చంద్రబాబు పుట్టుకరీత్యా పేదవాడే కావచ్చు. కానీ ఎత్తుజిత్తులతో పెత్తందారీ శ్రేణిలో చేరిన ఆయన ఆ వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక ఉగ్రవాదిగా మారిపోయాడు. ఇందుకు పూర్తి భిన్నంగా సంపన్న కుటుంబంలో పుట్టిన జగన్మోహన్రెడ్డి పేదల ఎజెండాను భుజానికెత్తుకున్నాడు. పేదవర్గాలు–మహిళల సాధికారతను తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాడు. సమాజంలోని రెండు వైరివర్గాల గురించి ప్రస్తావించడమే కాకుండా ఈ రెండు వర్గాల మధ్యన యుద్ధం జరుగుతున్నదనీ, ఈ యుద్ధంలో తాను పేద వర్గాల తరఫున అర్జునుడి పాత్ర పోషిస్తాననీ కూడా ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో క్లాస్ వార్ (వర్గ పోరాటం) గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే. కమ్యూనిస్టులు చెప్పే క్లాస్ వార్ వేరు. వర్గపోరు గురించి మాటలు చెప్పే కమ్యూనిస్టులు ఆచరణలో వర్గదృక్పథాన్ని కోల్పోయి ఉనికిని పోగొట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కమ్యూనిస్టులుగా ప్రకటించుకునే వారిలో కొంత మంది పెత్తందారీవర్గ ప్రవక్త చంద్రబాబు చుట్టూ చేరి చిడతలు వాయించే స్థితికి దిగజారిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పేదల విముక్తి కోసం క్లాస్ వార్కు పిలుపునిచ్చి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని జగన్మోహన్రెడ్డి సృష్టించారు. ఈ క్లాస్ వార్ మరో సారి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది. క్షేత్ర స్థాయి ప్రజా స్పందనల అంచనా ప్రకారం 2019 ఎన్నికల ఫలి తాలే పునరావృతం కాబోతున్నాయి. తాను పెత్తందారీ వర్గ ప్రయోజనాల కిరాయి మనిషిననే విషయాన్ని చంద్రబాబు తన చేతల్లోనే కాదు మాటల్లో కూడా పదేపదే వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే మొన్నటి టిప్పర్ ఎపిసోడ్. అనంతపురం జిల్లా సింగనమల నియోజక వర్గం నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన విద్యాధికుడైనప్పటికీ బ్రతుకుతెరువు కోసం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పార్టీ కార్యకర్తగా కూడా పని చేస్తున్న అతని సేవలను గుర్తించి జగన్మోహన్రెడ్డి అతడిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. పెత్తందారీ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు ఈ ఎంపికను అవహేళన చేస్తున్నారు. సింగనమలలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అనే మాటను పదేపదే వెటకారంగా ఒత్తి పలికారు. ఇటు వంటి నిశానీగాళ్లకు ఓటేస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతారని ఎద్దేవా చేశారు. అంటే పేదవాళ్లు అజ్ఞానులనీ, వాళ్లు రాజకీయాలకు అనర్హులనే అర్థంలో మాట్లాడారు. ఈవిధంగా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని మీడియా సమావేశంలోనే ఆయన తన మనస్తత్వాన్ని బయట పెట్టు కున్నారు. నాయీ బ్రాహ్మణ (బీసీ వర్గం) ప్రతినిధులను మీడియా సమక్షంలోనే ‘మీ తోకలు కత్తిరిస్తాన’ని బెదిరించారు. బీసీలకు జడ్జీ పదవులు ఇవ్వొద్దని, వారందుకు తగరని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికే ఆయన స్వయంగా లేఖ రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అని మహిళా విద్వేషాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. నాయకుడి నుంచి ఈ స్ఫూర్తిని తీసుకొని పేదవర్గాలపై ఆయన అనుచరగణం చేసిన దాష్టీకం అంతా ఇంతా కాదు. ఎన్నికల యుద్ధంలో తలపడకుండా పేద వర్గాలను, సంఘ సేవకులను దూరం చేసిన భాగ్యశాలి కూడా చంద్రబాబే. ఎన్టీఆర్ మరణానంతరం ప్రజాదరణ పెద్దగా లేని తాను నెగ్గుకు రావడం కోసం ఉపఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుపెట్టి సంచలనం సృష్టించారు. అప్పటినుంచీ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలవారినే నిలబెట్టడం మొదలుపెట్టారు. ఆయన్ను చూసి మిగిలిన పార్టీల వాళ్లు కూడా అంతో ఇంతో అనుసరించక తప్పలేదు. పెట్టుబడి – రాజ కీయాల మధ్యన ఉండే పరోక్ష బంధం నాటినుంచి ప్రత్యక్షంగా మారిపోయింది. వందల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచి పోవడమనే అప్రజాస్వామిక ధోరణికి గేట్లు తెరిచినవాడు చంద్ర బాబు. ఈ అక్రమార్జనపరులైన కోటీశ్వరులపై సామాన్యులు విజయభేరి మోగించినప్పుడే మళ్లీ మన సిసలైన ప్రజాస్వామ్యం మన చేతికొస్తుంది. టిప్పర్ డ్రైవర్గా చంద్రబాబు అవహేళన చేసిన వీరాంజ నేయులు సింగనమలలో విజయఢంకా మోగిస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుంది. మడకశిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్ప భారీ మెజారిటీతో నెగ్గితే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వికసిస్తుంది. చదువుల సరస్వతీదేవిని అంగడి సరుకుగా మార్చి లక్షలాది సామాన్యుల రక్తం తాగి తెగబలిసి వేలకోట్లు ఆర్జించిన నారాయణ నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తు న్నాడు. వందల కోట్లు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు. అతడితో తలపడుతున్న సామాన్యుడు స్వర్ణకార వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్ అహ్మద్ గెలిస్తేనే ప్రజా స్వామ్యం గెలిచినట్టు! అనకాపల్లి లోక్సభ సీటుకు సీఎం రమేశ్ పోటీ చేస్తున్నాడు. ఈయన మనిషి బీజేపీలో ఉంటాడు. ఆత్మ తెలుగుదేశంలో ఉంటుంది. స్నేహం కాంగ్రెస్తో ఉంటుంది. కాంట్రాక్టుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జన చేశాడని ప్రతీతి. చంద్రబాబుకు బినామీగా కూడా చెబుతారు. ఇప్పుడు ఎంపీగా గెలవడం కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకూ వందకోట్ల చొప్పున ఖర్చు చేస్తాడట! డబ్బు విసిరితే గెలుస్తామనే ధీమా. ప్రజల వివేకం మీద చిన్నచూపు. ఇతని మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర మంత్రి. పేరుకు మంత్రే కానీ,ఆర్థికంగా సామాన్యుడు. ఇప్పుడిక్కడ బీసీ వెలమ వర్సెస్ ఓసీ వెలమ, లోకల్ వర్సెస్ నాన్ లోకల్, సామాన్యుడు వర్సెస్ సంపన్నుడి మధ్యన పోటీ జరగబోతున్నది. సామాన్యుడు గెలి స్తేనే ధనస్వామ్యం తోక ముడుస్తుంది. ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఆ కంటెయినర్ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విలన్ డెన్లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్లో ఉండే విదూషక క్యారెక్టర్కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్నేహం కాదు, దాసోహం!
ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్సెన్స్ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్ విసరడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్టించుకున్న ‘ఇండియా’ బొంత ప్రతిపక్షాలకు స్ఫూర్తినివ్వలేక పోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సమరశీలతను కోల్పోవడం బీజేపీకి అయాచిత వరంగా మారింది. ఈ పరిస్థితు లలో తనకు ఏమాత్రం బలం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి రెండు సీట్లు గెలిచి తీరవలసిన అవసరం బీజేపీకి లేదు. ఈ ఎన్నికల్లో గెలవాల్సిన తక్షణ లక్ష్యంతోపాటు బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం కోసం అది వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఇది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బీజేపీ తొలి టార్గెట్ తెలంగాణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గురి తప్పినా 14 శాతం ఓట్లను సమీకరించుకోగలిగింది. గెలిచే అవకాశాలున్నాయన్న వాతావరణాన్ని ఎన్నికల ముందు సృష్టించగలిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం రెట్టింపు అయి వుండేదన్న అంచనా ఆ పార్టీకి ఉన్నది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న అంచనాతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. రాజకీయ పరిశీలకుల అభి ప్రాయాలు కూడా ఈ అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తేలిపోతుందని ఇటీవల లక్ష్మణ్ వంటి సీనియర్ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో గద్దెనెక్కిన మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ను ఈ నాయకుల మాటలు గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రయోగాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయగలిగితే బీజేపీ తన లక్ష్యాన్ని దాదాపుగా చేరు కున్నట్టే! తెలంగాణ షిండేకు పార్టీ తీర్థప్రసాదాలను ఇవ్వడం ఆ తర్వాత ఒక లాంఛనం మాత్రమే! లోక్సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడితే షిండే ప్రయోగం ప్రారంభం కావచ్చన్న అభిప్రాయం బలపడు తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే బీజేపీకి తన సహకారం అవసరమనే ఒక ప్రతిపాదన చంద్రబాబు ద్వారా ఆ పార్టీ పెద్దలకు చేరింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల కథ ముందుకు కదిలింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడి, బీజేపీ బలం పుంజుకుంటే ముందుగా ముప్పు ముంచు కొచ్చేది కాంగ్రెస్కే! తెలంగాణ భవన్లో స్విచాఫ్ చేస్తే గాంధీ భవన్లో చీకటి కమ్ముతుందన్నమాట!! తెలంగాణలో ఏక్నాథ్ ఎఫెక్ట్కూ, ఆంధ్రప్రదేశ్లో పొత్తు లకూ ఏమిటి లంకె? చంద్రబాబుకు బీజేపీ చేయగలిగిన ప్రత్యుపకారమేమిటి? బీజేపీ జతగూడితే చంద్రబాబు ఏపీలో గెలుస్తాడా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి తొంభై శాతం అవకాశాలున్నాయనుకుంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నూరు శాతం అవకా శాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 40 శాతం ఓటర్ల మద్దతు కనిపిస్తుంటే, ఏపీలో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటర్ల మద్దతు కనిపిస్తున్నది. డజన్కు పైగా జాతీయస్థాయి సర్వేలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. బీజేపీకి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. కానీ చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రాణావసరం. ఆయనకది జీవన్మరణ సమస్య. ఎన్డీఏ కూటమి తరఫున 400 సీట్లు, 50 శాతం ఓట్లు సంపా దించి రికార్డు సృష్టించాలని బీజేపీ పెద్దలు కలలు కంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏకి 45 శాతం ఓట్లు లభించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడిన సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలిచింది. 49 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి ఆ రికార్డుపై కన్నేసింది. అందు కోసం కలసిరాగల ప్రతి రాజకీయ పక్షాన్నీ తన దొడ్లో కట్టేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు విజ్ఞప్తిని మన్నించడానికి అది ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మరో ప్రత్యా మ్నాయం కూడా బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్నప్పటికీ, సైద్ధాంతికంగా బీజేపీ భావజాలానికి, రాజకీయ కూటమికి దూరంగానే ఉంటున్నారు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని ఎంజీ రామచంద్రన్ నుంచి నవీన్ పట్నాయక్ వరకు పలువురు ముఖ్య మంత్రులు అవలంబించి వారి రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడుకొచ్చారు. ఏపీ సీఎం జగన్దీ అదే వైఖరి. టీడీపీ వినతిని బీజేపీ నాయకత్వం అంగీకరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఫలించాలంటే వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ క్షీణించాలి. ఆ ఖాళీని మాత్రమే బీజేపీ ఆక్రమించగలదు. సాపేక్షంగా వైసీపీ యువ పార్టీ. పన్నెండేళ్ల వయసు. ఎదిగే దశ. యాభైశాతం ఓటుతో బలంగా ఉన్నది. పైగా అధికారంలో ఉన్నది. టీడీపీ అధినేతతో పోల్చితే వైసీపీ అధినేత వయసు పాతికేళ్లు తక్కువ. పాలనా సంస్కరణలు అమలు చేస్తూ, సామాజిక విప్లవాలను ఆవిష్కరిస్తూ, సరికొత్త శక్తులను పార్టీ నిర్మాణంలోకి సమీకరించుకున్నది. ఇప్పుడు మండే నెత్తురుతో ఆ పార్టీ ఇంజన్ నడుస్తున్నది. ఇందుకు భిన్నంగా టీడీపీ పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడింది. ఉపన్యాసాల్లో ఒక మాటకు బదులు మరో మాట చెబుతున్నారు. పార్టీలోకి కొత్త తరం రావడం లేదు. వచ్చినా ఒక సామాజిక వర్గం నుంచే వస్తున్నారు. పార్టీ నాయకత్వం బాగా బలహీనపడింది. అధినేత సొంత కొడుకుతో పాటు, బావమరిది కూడా అప్రయోజకులుగా ముద్ర పడ్డారు. ఆ కారణంగానే బాబు జైల్లో పడ్డప్పుడు అసలు వారసు లకంటే పవన్ కల్యాణ్ ఎక్కువ వీరంగం వేశారు. పార్టీ క్షీణ దశతో పాటు చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు పార్టీని గుప్పెట్లోకి తీసుకొని నెమ్మదిగా దాని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చు. గతంలో పలుమార్లు అవకాశ వాద పొత్తులతో బీజేపీని దగ్గరకు తీసుకొని, దాన్ని ఎదగనీయ కుండా బాబు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు దానికి బీజేపీ ప్రతీ కారం తీర్చుకోవచ్చు. ఈసారి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి కాబోతున్నది. ఏదో అద్భుతం జరగకపోతుందా? ఈ ఒక్కసారికి సూర్యుడు పడమటి కొండపై ఉదయించకపోతాడా? అనే ఆశ చంద్రబాబు, రామోజీ అండ్ గ్యాంగ్లో మిణుకుమిణుకుమంటున్నది. వారు తప్ప వివేకవంతులెవరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భావించడం లేదు. సర్వేలు మాత్రమే కాదు. క్షేత్ర వాస్తవికత కూడా అందుకు భిన్నంగా లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని పెత్తందారీ పోకడల కీళ్లు విరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయ స్రవంతిలోకి ప్రవేశిస్తున్నారు.ఒకటి కాదు,రెండు కాదు వరసగా మూడుసార్లు జగన్ సభలకు లక్షోప లక్షలుగా జనం హాజరయ్యారు. నేడు నాలుగో సభ పోటెత్తు తున్నది. రాజకీయ సభలకు ఈ స్థాయిలో జనం హోరెత్తడం వర్త మాన భారతంలో ఇంకెక్కడా మనకు కనిపించదు. వచ్చే ఎన్ని కల్లో జగన్ ప్రభంజనానికి ఇంతకంటే రుజువేమి కావాలి? మరోసారి అధికారం దూరం కాబోతున్నదన్న ఏడుపే కాదు, చేసిన పాపాలు శాపాలై కేసుల రూపంలో వెంటాడ బోతున్నాయన్న భయం బాబు, రామోజీలను నిద్రపోనీయడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన బాబు ఇప్పుడు బెయిల్పై బయటకొచ్చారు. ‘ముసలివాణ్ణి, ఆరోగ్యం బాగాలేదు, దయచూడండ’ని కోర్టువారిని బతిమాలు కొని బయటకొచ్చి తిరుగుతున్నారు. అమరావతి ప్రాంతాల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 1500 ఎకరాల అసైన్డ్ భూమిని కొల్లగొట్టిన కేసు తలపై వేలాడుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వప్రయోజనాల కోసం అష్టవంకర్లు తిప్పిన కేసు. నిబంధనలను అటకెక్కించి ఫైబర్నెట్ను బినామీకి అంటగట్టిన కేసు. చేలాగాళ్ల డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులిచ్చిన కేసు. ఇసుక కుంభకోణంలో పదివేల కోట్లు దోచేసిన కేసు... ఇలా వరుసగా అనేకం చంద్రబాబును వెన్నాడుతున్నాయి. ప్రతి కేసులోనూ చంద్రబాబు మీద పలు సెక్షన్లు నమోద య్యాయి. వాటిలో సీఆర్పీసీ 409 సెక్షన్ కింద నేరం రుజువైతే ప్రతి కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టం 13 (2) రెడ్ విత్ 13 (1) సీ, డీ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఒక్కో కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. 17ఏ సెక్షన్ సాయంతో తప్పించుకోవాలనే చంద్ర బాబు ఎత్తు పారలేదు. ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. చంద్రబాబు మీద నమోదు చేసిన అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు న్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆధారాలున్నందువలన కేసు కొట్టి వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పేర్కొ న్నది. బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. హరిహర బ్రహ్మాదులొచ్చినా ఆపలేరు. కానీ బీజేపీ వాళ్లు ఆపగలరని చంద్రబాబు దింపుడుకళ్లం ఆశ. అందుకే వారి ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కేసులే దడ పుట్టిస్తుంటే ముగిసిపోయిందనుకున్న ఐఎమ్జీ కేసు ముందు కొచ్చింది. సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా? మమ్మల్ని ఆదే శించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించడం బాబు క్యాంపులో గుబులు రేకెత్తిస్తున్నది. ఒకవేళ దర్యాప్తుకు ఆదేశిస్తే అచ్చం అలాంటిదే సింగపూర్ ప్రైవేట్ కంపె నీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా కుంభకోణం తెరమీదికొస్తుంది. దాని మీద విచారణ తప్పదు. గత మూడు రోజులుగా యెల్లో మీడియాలో కామెడీ షో నడుస్తున్నది. చివరి రోజు స్వయంగా చంద్రబాబే టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆ షోను కొనసాగించారు. ‘బాబ్బాబూ! మాక్కొంచెం ఎక్కువ సీట్లు దానం చెయ్యవా ప్లీజ్...!’ అని అమిత్ షా, నడ్డాలు బతిమాలుకున్నారట. ‘ఛస్తే కుదరదు, ఇచ్చింది తీసు కోండి, ఎక్కువ సీట్లిస్తే మీరు గెలవర’ని బాబు గట్టిగా చెప్పా రట! అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామా లను వారికి వివరించారట. ఆర్థికశాస్త్రాన్ని వారికి బోధించారట. చివరికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తును కుదుర్చుకుంటున్నట్టుగా వివరించి షా, నడ్డాల కళ్లు తెరిపించారట! బాబు విషయ పరిజ్ఞానానికి వారు అబ్బురపడిపోయారట. చివరికి బీజేపీ, జనసేనలకు కలిసి 8+30 సీట్లను బాబు అనుగ్రహించ డంతో వారు సంతృప్తి చెందారట! అమావాస్య తర్వాత సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటిస్తారట! ఆ తర్వాత మన యెల్లో మీడియా బాబు విజయో త్సవాలు పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. జయజయ మహావీర మహాధీర ధౌరేయ....... వంటి గద్యాలను రోజుకొకటి చొప్పున వినవలసి రావచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై బీజేపీ వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఒక్క సీటు కూడా తాము గెలవబోవడం లేదనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. వారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒకటి రెండు సీట్లు కాదు. మొత్తం పార్టీయే వాతాపి జీర్ణం. రాజకీయ చరమాంకంలో కూడా చంద్రబాబు అండ్ కో ప్రదర్శిస్తున్న అతిశయాన్ని చూస్తే మాత్రం దిగ్భ్రాంతి కలుగుతున్నది. తాను కేసుల నుంచి బయటపడేందుకు కాళ్ల మీద పడి పొత్తు కుదుర్చుకున్నారని లోక మంతా తెలుసు. కానీ దానికి ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అనే ముసుగు వేయడం, దాన్ని యెల్లో మీడియా విస్తృతంగా ప్రచా రంలో పెట్టడం మాత్రం ఏవగింపు కలిగిస్తున్నది. చంద్ర బాబుకు, రామోజీకి పడిసెం పడితే తెలుగు ప్రజలంతా తుమ్మా లన్నట్టుంది ఈ వ్యవహారం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
యెల్లో సేనలు డీలా!
పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు... ఇలా! పేరేదైనా సరే పెత్తందార్ల దోపిడీకి కాపుకాయడమే ఆ రాజు పని. భయంకరంగా కనిపి స్తున్నాడని వాడికి భయపడితే పేదల బతుకులు ఎప్పటికీ మారవు. మన ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ విషసర్పపు కోరలు పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. పేద పిల్లలకు బంట్రోతు చదువులు... సంపన్నులకు దొరబాబు చదువులా? ఎన్నాళ్లీ దుర్నీతి? ఇది ప్రజాస్వా మ్యమా... పెత్తందారీస్వామ్యమా?... ఇన్నాళ్లూ పెత్తందారీ స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది. ఈ దుష్పాలన ఇంకానా... ఇకపై చెల్లదని ఐదేళ్ల కింద జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లోని అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేదవర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన ‘మాగ్నాకార్టా’ను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తున్నది. రెండేళ్లు కోవిడ్ కోతకు గురైన ఈ అయిదేళ్ల పదవీ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒకపక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు కూడా అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధిరంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో పది పదిహేనేళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నదని పలువురు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుపట్టేవారు. ‘గుడ్ ఫిలాసఫీ బట్ బ్యాడ్ ఎకనామిక్స్’ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కదానిపైనా ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ‘గుడ్ ఫిలాసఫీ అండ్ గుడ్ ఎకనామిక్స్’గా పరిగణన పొందాయి. అందువల్లనే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశి స్తున్నది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వలన రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. అతి భయంకరుడూ, గండర గండడనుకున్న పెత్తందారులను తరిమికొట్టొచ్చన్న భావన బల పడుతున్నది. ఈ పెత్తందారీ శిబిరానికి తెలుగు నాట కాపలా దార్లయిన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగైరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నది కదా! మరి వాళ్లెట్లా పెత్తందారీ వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగవచ్చు. చంద్రబాబు పార్టీది పూటకూళ్ల సంక్షేమ సిద్ధాంతం. అన్న క్యాంటీన్లు, అక్క క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగేది తాత్కాలిక ఉపశ మనమైతే దాన్ని కంటితుడుపు సంక్షేమమంటారు. తాత్కాలిక ఉపశమనంతోపాటు లబ్ధిదారుని అభ్యున్నతికీ, సాధికారతకూ ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్ చేస్తే అది మానవాభి వృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు. పద్దెనిమిది వేల అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని ‘కల్యాణమస్తు’ పేరుతో జగన్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 యేళ్లు, వరుడికి 21 యేళ్లు వయఃపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. దాంతో పాటు పదవ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది. అందువల్ల తప్పనిసరి టెన్త్ పాసవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో మూడేళ్ల గడువుంటుంది. ఇంటర్ వరకూ ‘అమ్మ ఒడి’ కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు కచ్చితంగా ఇంటర్ కూడా పూర్తి చేస్తారు. డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారి కాళ్ల మీద నిలబడటానికి తోడ్పతే విధంగా డిజైన్ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే! జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్మెంట్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాల ప్రజలు కూడా పెద్ద వారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నతస్థాయి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్య మైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది. చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్య క్రమాలను అమలుచేస్తూ ఆర్బీకే సెంటర్ల పేరుతో గ్రామ గ్రామానా ఊతకర్రలను నిలబెట్టింది. పేదవర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధమ్యాలు చంద్రబాబు సర్కారులో కని పించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్ పాయింట్ ఎజెండా. అదో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. కాంట్రాక్టర్లకూ, పెట్టుబడులు పెట్టిన పెత్తందార్లకూ మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్ను కట్టి అందులో 30 శాతం కమిషన్ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్గా మార్చు కున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. కమిషన్ల కక్కుర్తికి ప్రతిష్ఠా త్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పనుల్లో అవాంఛ నీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు. ఇదొక్కటే కాదు ఆయన ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల భారీగా లబ్ధిపొందిన వారు ఆయన, ఆయన ఆంతరంగికులు, కాంట్రా క్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్లు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల లబ్ధి పొందినవారు రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాల ప్రజలు. ఈ ప్రాధమ్యాల కారణంగానే జగన్ ప్రభుత్వానికి ‘పేదల ప్రభుత్వం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, యెల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీషు మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేదవర్గాల భవిష్యత్తును సుంద రంగా మార్చివేస్తాయి. జగన్ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కీ తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి. వ్యవసాయ విధానాలు సాగుబాటను సంపన్నం చేస్తాయి. ఈ విధా నాలను వ్యతిరేకిస్తున్నారు కనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తున్నది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్మోహన్రెడ్డి పేదవాడా? ఆయనది పేదల ప్రభుత్వం ఎట్లా అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా, పేద వాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధా నాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేదే ముఖ్యం. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే! చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే! రాష్ట్రంలోని పేదవర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడు తున్నది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షో భంలోకి కూరుకొని పోయింది. జనసేన పార్టీని తన ప్రయో జనాలకోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం మూడో వంతు సీట్లయినా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకొని పోయారు. ఈ రెండు పార్టీల బలంతోనే జగన్ పార్టీని ఎదుర్కో లేమనీ, బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్లు తనవంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ ద్వారా లాబీయింగ్ నడిపిస్తున్నారు. అదేకాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు. పరిస్థితులను గమనిస్తుంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబు – పవన్ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్ భాగస్వామి పాత్ర పవన్ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీరోపన్యాసాలు చేశారు పవన్? వాళ్లు ‘సిద్ధం’ అంటే మేము ‘యుద్ధ’మని మొన్ననే ఆయన గర్జించి నట్టు కూడా గుర్తు. ఒకసారెప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు ‘సీఎం... సీఎం’ అనే నినాదాలు చేశారు. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏమిటి? ‘మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని. ఇప్పుడెలా అడుగుతామ’ని అశక్తతను ప్రకటించాడు. ఇప్పుడు కూడా అంతే! 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో పావలా పర్సెంట్ గెలిచినా 6 సీట్లే. కనుక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే అయిదేళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు కనుక! రెండు పార్టీలూ కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వుడు సీట్లు న్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే! బీసీ ఓట్లు పూర్తిగా దూరమైనట్టే! అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పవన్ కల్యాణ యితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు. కేటాయించిన 24 సీట్లలో ఐదుగురి పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం, ఆయన ముఖకవళి కల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా ఉండేందుకే కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గానీ, చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంతమాత్రమూ బలాఢ్యుడు కాదు. అతడొక గాలి తీసిన బెలూన్ మాత్రమే. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అబద్ధాలే ఆయుధాలు!
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది. ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ఫ్రంట్స్ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది. పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు. ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షౌహిణులు సిద్ధం!
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్మోహన్రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్రెడ్డి. ‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్ను రాష్ట్ర కాంగ్రె స్కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్ను ప్లస్గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
షణ్ముఖ కూటమి... సిద్ధమా?
ఒకే ఒక్కడు సిద్ధం! ‘జో జీతా వొహీ సికిందర్’ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలి కింది. ఏమా జనం? లక్షలాది నింగి చుక్కలు ఒక్కచోటనే రాలిప డ్డట్టు లేదూ! బీదాబిక్కీ జనం, బడుగు బలహీనవర్గాల ప్రజలే వారంతా! తమ జీవితాలకు గొడుగు పట్టిన జగన్మోహన్రెడ్డి జైత్రయాత్రకు తాము సైతం అన్నట్టుగా తరలివచ్చారు. యుద్ధా నికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో వారంతా శ్రుతి కలి పారు. జన హోరుపై గౌరవంతో సముద్రుడు తన కెరటాలను అవనతం చేశాడేమో! జన సాగర సందడిలో అలల చప్పుడు వినిపించలేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్ధమ య్యారు సరే! మరి ప్రత్యర్థుల సంగతి? ఆ ప్రత్యర్థి ఏకవచ నమా? బహువచనమా అనే సందేహం అవసరం లేదు. బహు వచనంగా కనిపించే ఏకవచనం. చంద్రబాబు బహురూపి. ఒక రూపం నుంచి మరో రూపంలోకి పాదరసంలా ప్రవహించగల నేర్పరి. పాదరసం ఒక లోహం. కానీ సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో కనిపిస్తుంది. ఈయనా అంతే – ద్రవరూపంలో కని పించే ఒక లోహ విశేషం. ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ఆరు రూపాల్లోకి ప్రవహించారు. ఇందులో కొన్ని పాత రూపాలే. కొన్ని కొత్తవి. ఆరు ముఖాల వాడిని సంస్కృతంలో షణ్ముఖం అంటారు. తమిళ సంప్రదాయంలో ఆర్ముగం అంటారు. ఇప్పుడు మన ఆర్ముగం చంద్రబాబు ఆరు ముఖాలతో ఆరు శిబిరాలను తన కోసం సన్నద్ధం చేసుకున్నారు. ఇందులో మొదటి ముఖం తనదైతే, రెండోది యెల్లో మీడియా లీడర్ రామోజీది. వీరిద్దరు సియామీ కవలలు. ఇద్దరిలో ఎవరిది ఒకటో నెంబరో తేల్చడం కష్టం. పొలిటికల్ ఫేస్ కనుక బాబునే ఒకటి అనుకుందాం. ఇక మూడో ముఖం జగమెరిగిన జనసేనాధిపతి. తన కోవర్టుల సాయంతో కబ్జా చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ నాలుగో ముఖం. తాను కొనుగోలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఐదో ముఖం. ఈ సిక్ యూని ట్ను ‘కొనుగోలు’ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ‘కనుగోలు’ సేవలు ఉచితంగా లభిస్తాయట! ఇక సందర్భాన్ని బట్టి తనకు ఉపయోగపడే పనులు చేసిపెడుతూ, అప్రకటిత ఓఎస్డీగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖ ఆరో ముఖం. ఇందులో ఎవరికి నిర్దేశించిన పాత్రను వారు పోషిస్తూ చంద్రబాబుకు తోడ్పాటునందిస్తుంటారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే చంద్రబాబు, యెల్లో మీడియాలు తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి నుంచే జగన్ సర్కార్పై యెల్లో మీడియాలో దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. కాకపోతే ఆరు శిబిరాలను సమయాత్తం చేసి ఆరు ముఖోటాలను తగిలించడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు షణ్ముఖ కూటమి సిద్ధమైంది. షడ్యంత్రం కూడా ఎప్పుడో సిద్ధమైంది. ఆరు రకాల మాయోపాయాలను ఉప యోగించి నడిపే కుట్రను ‘షడ్యంత్రం’ అని పూర్వం అనేవారు. శాస్త్ర ప్రకారం చేసే కుతంత్రమన్నమాట. మన ఆర్ముగం మాస్టారు ఆరు రకాలేం ఖర్మ... అరవై రకాల మాయోపాయాలను ఏకకాలంలో ప్రయోగించగల నేర్పరి. కీలకమైన ఆరు మాయలను చెప్పాల్సి వస్తే దాంట్లో మొద టిది మోసం లేదా వెన్నుపోటు లేదా నమ్మకద్రోహం. గూగుల్ ఇమేజెస్లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే వచ్చే బొమ్మల్లో 90 శాతానికి పైగా చంద్రబాబు బొమ్మలే కనిపిస్తాయి. అకడమిక్ ఆసక్తి ఉన్నవారెవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెన్నుపోటు కేటగిరీలో బాబు, యెల్లో మీడియాలు యూనివర్సల్ పేటెంట్ హోల్డర్లు. మిగిలిన నాలుగు ముఖాలకు కూడా తరతమ భేదా లతో ఈ లక్షణం ఉన్నది. మాయోపాయాల్లో రెండోది – దుష్ప్ర చారం లేదా గోబెల్స్ ప్రచారం. తప్పుడు ప్రచారాలకు ఆది గురువుగా పేరొందిన గోబెల్స్ మహాశయుడు ఇప్పుడు కనుక బతికి వుంటే యెల్లో మీడియా బడిలో మరోసారి ఓనమాలు దిద్దుకునేవాడు. యెల్లోమీడియా ఘనత ఈ రంగంలో దిగంతా లకు వ్యాపించింది. మూడో మాయోపాయం – అవకాశవాద పొత్తులు. నాలు గోది – వ్యవస్థలను దురుపయోగపరచడం. ఐదవది – పార దర్శకత లేమి. ఆరవది – గోముఖ వ్యాఘ్రంలా పెత్తందారీవర్గ స్వభావాన్ని దాచిపెట్టడం. ఈ ఆరు లక్షణాల్లో చంద్రబాబుకు, యెల్లో మీడియాకు ఉన్న ప్రావీణ్యతను గురించి కొత్తగా చెప్పన వసరం లేదు. వీరు కూడగట్టుకున్న కొత్త మిత్రులందరిలోనూ ఈ లక్షణాలు అంతో ఇంతో కనిపిస్తాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకొక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలు మార్లు రుజువైంది. మాట నిలకడ లేదని కూడా ఆయన పదేపదే నిరూపించుకుంటున్నారు. ఒక నమ్మదగిన నాయకుడుగా స్థిరపడలేకపోయాడు. చంద్రబాబు ప్రయోజ నాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శిస్తారు. అదొక సహజ వ్యతిరేకత. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఓట్లు పరోక్షంగా తనకు లభించేట్టుగా పన్నిన కుతంత్రమేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశమే ఎక్కువ. పవన్ కల్యాణ్ పార్టీని ఎన్టీఏ కూటమిలో చేర్పించడం కూడా చంద్రబాబు వ్యూహమేనని తెలియని వారెవరూ రాష్ట్రంలో లేరు. తన పార్టీ ఎంపీలను, పైరవీకార్లను కూడా బీజేపీలో చేర్పించింది చంద్రబాబేనన్న సంగతి జగమెరిగిన సత్యమే. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే మాత్రం లోకానికి నిజం తెలియకుండా ఉంటుందా? గడిచిన ఎన్నికల్లో జరిగిన దారుణ పరాభవంతో బాబుకు జ్ఞానోదయమైంది. రాష్ట్రంలో యాభై శాతం ఓట్లను అప్పటికే స్థిరపరచుకున్న జగన్తో పోరా డాలంటే తన బలం సరిపోదనీ మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలనీ ఆయనకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే కాదు, జగన్ అను కూల ఓటర్లలో కూడా ఏదో ఒకరకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనల్లోంచే ఈ షణ్ముఖ కూటమి పుట్టింది. బీజేపీలో చేరిన బాబు కోవర్టులు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కల్యాణ్ల ప్రయత్నాలతో పాటు తన పాత పరిచ యాలతో చేసిన లాబీయింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్రశాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలిగా వచ్చారు. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఆ వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబు మార్చేసు కున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దానితోపాటు ఈగలు తోలుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరి పించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలిగా వేయించుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిశోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియా చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డీకే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డీకేకూ, చంద్రబాబుకూ దోస్తీ కుదిరింది. ఆ దోస్త్ ద్వారా రాయ బారం నడిపి, షర్మిలను ఇక్కడికి డిప్యుటేషన్ వేయించుకున్నా డని కాంగ్రెస్ వర్గాల భోగట్టా.. దీన్నే చావు తెలివితేటలంటారు. ప్రభుత్వ అనుకూల వోటును ఎంతోకొంత చీల్చడం కోసం కాంగ్రెస్ కొంపను బాబు అద్దెకు తీసుకున్నారు. నెగిటివ్ ఓటును చీల్చడం సాధ్యమవు తుందేమోగానీ పాజిటివ్ ఓటును చీల్చలేమన్న కనీస అవగా హన అనుభవజ్ఞుడైన బాబుకు లేకపోవడం ఒక విషాదం. విశ్వస నీయతను కోల్పోవడంలో పవన్ కల్యాణ్ కంటే పదిరెట్ల వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై ఆమె వ్యక్తం చేసిన విరుద్ధ అభిప్రాయాలు వింటే చాలు, ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతా లేదనే విషయం ఎవరికైనా అర్థమ వుతుంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేకపోయినా చంద్రబాబు పడుతున్న పాట్లను వివరించడానికే ఈ ప్రస్తావన! అంతకన్నా ప్రాధాన్యత లేదు. సీపీఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అదొకప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం పోరాడిన పార్టీ. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తుంటే టీడీపీ పలురకాలుగా అడ్డుపడింది. ఆ పార్టీకి సీపీఐ వంతపాడటం విచిత్రం. ఈ అయిదేళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ షణ్ముఖ కూటమి ఆపసోపాలు పడుతున్నది. ఆయన చేసిందేమిటి? ఆయన ఎటువంటి వ్యక్తి! ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయ చరి త్రలో ఏ నాయకుడి మీద జరగనంత దుష్ప్రచారాన్ని జగన్ మీదా యెల్లో మీడియా సాగించింది. వ్యక్తిత్వ హననానికి ఉండ వలసిన హద్దులన్నీ చెరిపేసి బర్బర మనస్తత్వాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కయి ఒకే ఒక్క యువకుడిని వేధించడం, రాజకీయ అంకురాన్ని మొలకెత్తకుండా కేసులు పెట్టడం, పదహారు నెలలు జైల్లో ఉంచడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అవి తప్పుడు కేసులనీ, రాజకీయ కేసులనీ అర్థం కావడానికి మనిషికి కామన్ సెన్స్ ఉంటే చాలు. జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లమని గులామ్నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన అప్పట్లో సోనియా గాంధీ కోటరీలోని ముఖ్యవ్యక్తి. ముఖ్యమంత్రిని చేయనందుకే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని అప్పట్లోనే దుష్ప్రచారాన్ని సృష్టించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సంతకాలు సేకరించారని ఓ అభాండం వేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న యువకుడిపై ఇటు వంటి అమానవీయ దాడి చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి. ఆయనకు సంతకాల సేకరణతో ఎటువంటి సంబంధం లేదని అప్పట్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ ఇంట ర్వ్యూలో భట్టి విక్రమార్క కూడా ఈ ఆరోపణను నిర్ద్వంద్వంగా ఖండించారు. రోశయ్యను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నిండు పేరోలగంలో ప్రతిపాదించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డే అనే సత్యాన్ని దాచేస్తే దాగుతుందా! ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం. ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం! తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికి ముప్పయ్యారేళ్ల వయసున్న జగన్మోహన్రెడ్డి తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాల సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నిండు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను ఆయన వేసుకున్నారు. ‘పదవులూ, అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యమ’ని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కష్టాల పాలవుతావని నాయకత్వం హెచ్చరించింది. ఖాతరు చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా పదేళ్లపాటు కష్టాలు కడగండ్లతో కూడిన కడలిని ఈదవలసి వచ్చింది. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. పదేళ్లలో ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయననొక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనాదక్షునిగా తీర్చిదిద్దింది. షడ్ యంత్రాన్ని తిప్పికొట్టగల ఆరు అద్భుతమైన లక్షణాలు ఆయన అయిదేళ్ల పాలనలోంచి మనం గ్రహించవచ్చు. విశ్వస నీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్య – ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం. ఈ లక్షణాలు ఫలితాలివ్వడం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతు న్నది. నిన్నటి భీమిలి సభలో అదే ఆత్మవిశ్వాసం సమర శంఖం పూరించింది. ‘వైనాట్ 175?’ అని ఆ విజయశంఖం ప్రశ్నించింది. ‘యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా?’ అని ఆ సింహ నాదం ప్రశ్నించింది. సిద్ధం.. సిద్ధం.. సిద్ధం – లక్షలాది గళాల్లో ఓ తారకమంత్రం మార్మోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దగుల్బాజీ పాత్రికేయం!
కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించడానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ? మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది? మీరు సింపతీ కోసం లీక్ చేసిన పడక సీన్ ఫోటోలను చూసి ఉన్నప్పటికీ... మిమ్మల్ని తిట్టకుండా ఉండటం సాధ్యం కావడం లేదు. ఇది ఒక్కడి తహతహ కాదు. లక్షలాదిమంది మానసిక స్థితి. ఉన్మత్త ప్రేలాపనలతో మీరు అచ్చొత్తి ఫ్రీగా పంచుతున్న మీ అశుద్ధ పత్రికను చదివిన పాఠకులు అస్వస్థతకు గురవుతున్నారు. మీ కడుపు నొప్పితో, మీ కక్కుడు పారుడు రోగంతో జనసమూ హంలో జుగుప్సాకర వాతావరణాన్ని తయారు చేస్తున్నారు జీ. మంచిది కాదు జీ. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కుతంత్రాన్ని పన్నుతున్నారో ఆ ప్రయోజనం నెరవేరేది కాదని మీకు తెలియదా? అయినా... ఏమో గుర్రం ఎగరకపోతుందా అనే దింపుడు కళ్లం ఆశతో ఇంత దిగజారుడుతనం వాంఛనీయం కాదు జీ! మీ పేరు చివర జీ అక్షరం వింతగా ఉన్నది జీ. అది పెట్టుడు పేరో, దత్త పేరో తెలియదు గానీ అందులో తెలుగు దనం, తెలుగు సంప్రదాయం లేదు జీ. ‘తెలుగు భాష కోసం పుట్టిన ఏకవీర నేనే’నని తమరు వీరతాళ్లు వేయించుకుంటారు కదా! ఈ మరాఠీ సంప్రదాయ పేరు అందుకు నప్పలేదు జీ. ఇంగ్లిషు పదాలకు మీ విషపత్రికలో చేసే తెలుగు అనువాదా ల్లాగే ఉన్నది. ‘పిల్లి కాదు మార్జాలం’ అన్నట్టుగా ‘కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్’ అన్నట్టుగా మీ పత్రిక అనువాదాలుంటాయి. ఇదీ అలాగే ఉన్నది. దగుల్బాజీ అనే మాట పారశీక సంప్రదాయం నుంచి వచ్చిందేమో కానీ శతాబ్దాల కిందనే తెలుగులో కలిసిపోయింది. కనుక చివర్లో జీ ఉన్నప్పటికీ అది తెలుగు మాటగానే రూపాంతరం చెందింది. ఆ మాటను జనసామాన్యం యథేచ్ఛగా వాడేస్తున్నప్పటికీ దాని అసలు అర్థం మోసగాడు అనే! ఈ పేరేదో బాగా అతికినట్టున్నది. చూస్తారా? మీరు మోసగాళ్లే కదా జీ. అలా అని పలు సందర్భాల్లో కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయిగదా జీ! ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించినట్టు న్నారు కదా! జీజే రెడ్డి సహకారంతో మీరు వ్యాపారంలో వేసిన తొలి అడుగుల్లో మోసం లేదా? యాభయ్యేళ్ల కింద మీరు విశాఖపట్నంలో ‘ఈనాడు’ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని నమ్మి భూమి లీజుకిచ్చిన ఆదిత్య వర్మకు మీరు చేసిందేమిటి? మోసమే కదా! అది రుజువైంది కదా! దాన్ని దగుల్బాజీ వ్యవ హారం అంటారా అనరా? పైగా వర్మ భూమిని కొంతభాగం రోడ్డు విస్తరణకు అప్పగించి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమరు కైంకర్యం చేయలేదా జీ! దీన్నేమంటారు? ఈ వ్యవహారంలో మీ మీద ఫోర్జరీ కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించలేదా? ఫోర్జరీ కూడా మోసమే కదా! సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫిలిం సిటీలో వేలాది ఎకరాల భూమిని మీరు పోగేశారని రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదా? అది మోసం కాదా? ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని కూడా భోంచేశారు కదా! చిట్ఫండ్ పేరుతో ఫిలింసిటీలో ఉన్న 137 ఎకరాల భూమి చట్టప్రకారం చందాదారులకు దక్కాలి కదా? మీరెందుకు చంకలో పెట్టుకున్నారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మీరు వసూలు చేసిన 2600 కోట్ల డిపాజిట్లు మోస పూరితమైనవిగా రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయా, లేదా? చిట్ఫండ్స్ పేరుతో మీరు మోసగించారని చందాదారులు ఫిర్యాదులు చేశారా, లేదా? సీఐడీ కేసు నడుస్తు న్నదా, లేదా? ఇంకా చెప్పాలా? అబ్బబ్బ... తనువంతా ఇన్ని మచ్చలేంది స్వామీ? పైగా వేరొకరిపై నిత్యం అభాండాలా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా? ఎన్టీ రామారావు ఏమన్నారు? మీ పత్రిక ఓ చెత్త కాగితాల కట్ట. మీరు గోబెల్స్ను మించిన దుష్ప్రచారకులు. తిమ్మిని బమ్మిని చేయడమే మీ నైజం. చివరికి మీరు చరిత్ర పెంట కుప్పలోనే మిగిలిపోతారు. అవే మాటలు కదా ఆయనో ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఘడియలు తరుముకొచ్చి నట్టున్నాయి కదూ! అనారోగ్యంతో మంచం మీద ఉంటే మా నాన్న కాగితాల మీద సంతకాలు తీసుకున్నారనీ, నానా మాటలు అన్నారనీ స్వయంగా మీ కుమారుడే చెప్పిన విషయం మర్చిపోయారా? మీ విశ్వసనీయతకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకేముంటుంది? ఇంతటి ఘనత వహించిన తమరు చిత్తం వచ్చినట్టు కాకమ్మ కథలు చెబితే జనం నమ్ముతారా? ఈ కాకమ్మ కథలనూ, కనికట్టు రాతలనూ ఎవరూ ఊహించలేని అధమాధమ స్థాయికి తీసుకెళ్లారేమిటి జీ? పత్రికా ప్రమాణాల పాతాళం డైవింగ్లో మీ రికార్డులను మీరే బద్దలు కొట్టారు. హుర్రే! ఈ ఫీట్ ఇంకెవడి వల్లా కాదు. ఈ వయసులో అదేదో బూస్టర్ గోళీ వేసుకున్నట్టు ఇంత ఉన్మత్త ఆవేశమేమిటో? కారణముందిలే! అసలే జగన్మోహన్రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయన పేద వర్గాల రాజకీయ ప్రతినిధి. తమరు పెత్తందారీ వర్గాల కులగురువుగా నేమ్ ప్లేట్ను వాకిట్లో తగిలించుకున్నవారు. అయిదేళ్లుగా మీ వర్గం ఆటలు సాగడం లేదు. మీ కాకమ్మ కథలు పండటం లేదు. పేదలకు చదువు చెబుతున్న సర్కారు బళ్లు ఆధునికతను సంతరించు కున్నాయి. మీ పెత్తందారీ వర్గ పిల్లలతో సమానంగా పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోగలుగుతున్నారు. నాణ్యమైన వైద్యం పేదల ఇంటి ముంగిట్లోకి వచ్చింది. కార్పొ రేట్ వ్యాపారులకు సెగ తగిలింది. చిన్న రైతులకు వ్యవ సాయం గిట్టుబాటు కావడం మొదలైంది, లాభాల బాట వైపు కూడా పయనం ప్రారంభమైందని దేశదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి చూస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో సామాన్య మహిళలు సైతం సంపద సృష్టిలో పాల్గొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. రిటెయిల్ వ్యాపారం అనూహ్య లాభాలనార్జిస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు దేశంలోనే అగ్రస్థానంలో పెరుగుతున్నది. కరోనా కాటేసిన కాలం పోగా మిగిలిన స్వల్పకాలంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. పెత్తందార్లు పంచుకు తినవలసిన సొమ్ము ప్రజల చేతుల్లో వృద్ధి పొందుతున్నది. జగన్మోహన్రెడ్డి మీద పెత్తందారీ వర్గా నికి కంటగింపు కలగడానికి ఈ కారణాలు చాలవా? తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి గురు పత్రిక నాయకత్వంలోని యెల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం కనిపించడం లేదు. నిరాశా నిస్పృహలతో ఆ మీడియా హద్దుల్ని దాటేస్తున్నది. మర్యాదలను అతిక్రమిస్తున్నది. సంప్ర దాయాలను చాపచుట్టేసింది. కనీస ప్రమాణాలను కూడా అటకెక్కించింది. గజ్జి సోకిన గ్రామ సింహాల్లా యెల్లో మీడియా వర్తిస్తున్నది. వారి ఖర్మ కొద్దీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఇప్పుడే వచ్చింది. పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహం. ప్రపంచంలో అంబేడ్కర్ విగ్రహా లన్నిటిలోకీ పెద్దది. విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంత మైన బందర్ రోడ్డుపై పద్దెనిమిదిన్నర ఎకరాల స్వరాజ్ మైదాన్ ఆయన స్మృతివనానికి వేదికైంది. పెత్తందారీ వర్గానికి ఇది మరో కంటగింపు కారణం. ప్రాంతీయ పెత్తందారీ వర్గా నికీ, ఆ వర్గం వైభవానికీ గుర్తు బందర్ రోడ్డు. ఈ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు పోనూ మిగిలిన ఖరీదైన భవనాల్లో ముప్పాతిక శాతానికి పైగా ఒకే వర్గ పెత్తందారీ కుటుంబాల వారివే. విజయవాడ నగరంలో ఏం జరగాలన్నా బందర్ రోడ్డు బాద్షాలు ఎస్ అంటే ఎస్! నో అంటే నో!! రాష్ట్ర విభజన తర్వాత బందర్ రోడ్డు మీదుగా ఒక మెట్రోలైన్ను కేంద్రం కేటాయించింది. మనవాళ్ల భవనాలు చాలా కూల గొట్టవలసి వస్తుంది కనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. చంద్రబాబు పార్టీకి అభివృద్ధి అంటే పెత్తందారీ వర్గం అభివృద్ధి మాత్రమే! వారికి నష్టం కలిగించే అభివృద్ధిని అస్సలు సహించరు. మెట్రోలైన్నే కాదు రోడ్డు విస్తరణను సైతం ఈ వర్గాలు అడ్డుకున్నాయి. ఇదే రోడ్డు మీద లీజుకు తీసుకున్న స్థలంలో తిష్ఠ వేసిన ‘ఈనాడు’ జీ రోడ్డు విస్తరణకు ససేమిరా అన్నారు. మూడు దశాబ్దాలపాటు భూ యజమానిని ముప్పుతిప్పలు పెట్టి రెండు దశాబ్దాల పాటు రోడ్డు విస్తరణను అడ్డుకొని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరవై రోజుల కింద తట్టాబుట్టా సర్దుకొని, అన్ని గేట్లూ మూసుకొని తరలిపోవలసి వచ్చింది. చెన్నయ్లోని ‘ది హిందూ‘ కార్యాలయాన్ని ‘మౌంట్ రోడ్ మహావిష్ణు’ అనేవారట. అదేవిధంగా తన కార్యాలయాన్ని కూడా బందర్ రోడ్డు బాద్షాగానో, జాంగ్రీగానో పిలిపించు కోవాలని ఆయన ఆశించాడట! కానీ కథ అడ్డం తిరిగింది. వందేళ్ల కిందట ఒకసారి స్వరాజ్ మైదాన్లో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో దళిత సంఘాల సభ జరిగిందట! అప్పుడు స్థానిక పెత్తందార్లు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయం తలుపులు మూయించారట. దళితులు ఆలయానికి రాకూడ దన్న దుష్ట తలంపుతో! ఆ పెత్తందార్ల ఆటలు ఏదో రూపంలో సాగుతూ వచ్చాయి. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క! ఇప్పుడు బెజవాడంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేడ్కర్! జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత స్క్రీన్ప్లే మారింది. పెత్తందార్లు, వారి మీడియా కడుపు మంట ద్విగుణం, త్రిగుణం కావడానికి ఈ పరిణామాలన్నీ కారణం. ఆ కడుపు మంట ఫలితమే విగ్రహావిష్కరణ రోజున యెల్లో పత్రికల నిండా పరుచుకున్న అశుద్ధం. ఆ పద్దెనిమిది ఎకరాల్లో ఓ పెద్ద మాల్ కట్టించి తన వాళ్లందరూ వ్యాపారాలు చేసుకునేలా చూడాలని అప్పట్లో చంద్ర బాబు ప్లాన్ చేశాడట! మిగిలి ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యా లయాలను ఎక్కడికన్నా తరలిస్తే బందరు రోడ్డు మీద ఇక తమదే గుత్తాధిపత్యం. కలలు చెదిరిపోయి ఇప్పుడు అంబే డ్కర్ వచ్చి చేరాడు. అదే బందరు రోడ్డు మీద ముప్పయ్యేళ్ల క్రితం తమ పెత్తనాన్ని ధిక్కరించిన వంగవీటి రంగాను అడ్డు తొలగించుకోగలిగారు. ఇప్పుడెట్లా? మింగలేక కక్కలేక చస్తు న్నారు. అంబేడ్కర్పై ప్రేమ లేకున్నా అది బయటకు ప్రకటించలేరు. దళితులపై భూస్వాముల దాడులు, దౌర్జన్యాలకు ‘ఈనాడు’లో మొదటి నుంచి ప్రాధాన్యత లభించేది కాదు. కారంచేడులో దళితుల నెత్తురు ఏరై పారినప్పుడు కూడా ఆ పత్రికలో ఓ చిన్న క్రైమ్ వార్తగానే వచ్చింది. అటువంటి ‘ఈనాడు’ అంబేడ్కర్ ఆశయాల పట్ల గౌరవాన్ని నటిస్తూ ఒక దిక్కుమాలిన వార్తను అచ్చేసింది. ‘అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్’ అంటూ జీ పత్రిక ఒక ఫుల్పేజీని కేటాయించింది. అంబేడ్కర్కు ముడిపెడుతూ తలాతోకా లేని ఓ పది పాయింట్ల సొల్లు కార్చారు. ఈ చచ్చు పాయింట్లకు గ్రామసీమల్లోని ఏ సాధారణ పౌరుడైనా గట్టిగా సమాధానం చెప్పగలడు. అంత పారదర్శ కంగా జగన్ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తున్నది. మద్యనిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మద్యాన్ని పారిస్తున్నదట! దశలవారీ మద్య నియంత్రణకు వైసీపీ హామీ ఇచ్చిన మాట నిజం. ఆ హామీకి కట్టుబడి 43 వేల బెల్ట్షాపులను తొలగించారు. మద్యం ప్రైవేటు వ్యాపారాన్ని రద్దు చేసి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసు కున్నది. 4,380 నుంచి 2,934 వరకు షాపుల సంఖ్యను తగ్గించారు. రాత్రి తొమ్మిది గంటల వరకే అమ్మకాలకు అనుమతి నిచ్చారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. సహజ వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా వినియోగించుకోవాలని అంబేడ్కర్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ‘ఈనాడు’ భాష్యం. ఇసుక మీద ప్రభుత్వానికి ఎవరి హయాంలో ఆదాయం వచ్చింది? గ్రానైట్, సున్నపు రాయి, మాంగనీస్, రోడ్ మెటల్... ఇలా మైనింగ్ కారక్రమాలన్నింటిలో ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది? ఈ లెక్క లేవీ చెప్పకుండా బట్టకాల్చి మీద వేసే బద్మాష్ గిరీకి ‘ఈనాడు’ పాల్పడింది. ఆదాయాలకు మూలమైన పరిశ్ర మలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవని అంబేడ్కర్ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వానికి భారీ పరిశ్ర మలను తీసుకు రావడం సాధ్యం కాలేదట. పైపెచ్చు కొన్ని పరిశ్రమలు పారిపోయాయట. రాష్ట్రంలో తమ కార్యక్రమా లను విస్తరించబోతున్నట్టు అమరరాజా గ్రూప్ అధికారికంగా ప్రకటిస్తే ఆ సంస్థ పారిపోయిందంటూ ‘ఈనాడు’ గీకి పారే సింది. జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయి. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటిద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి మీట్ జరిగింది. పార్టీ కార్యకర్తలకు కోట్లు వేసి నకిలీ ఒప్పందాలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా పోలిక ఉన్నదా?ఇంగ్లిష్ మీడియంలో చదువొద్దని అంబేడ్కర్ చెప్పారట. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదట! పేద వర్గాల ఇంగ్లిష్ చదువుల మీద పెత్తందార్లు ఎంత ద్వేషం పెంచుకున్నారో ఈ అభూత కల్పనను చూస్తేనే అర్ధమవు తుంది. ఇంగ్లిష్ మీడియంపై ఏ అంబేడ్కరిస్టుతోనైనా ఓ గంటసేపు మాట్లాడి ఉంటే ఎంతోకొంత జ్ఞానోదయమై ఉండేది. ప్రతిపక్షాలు, పత్రికలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని అంబేడ్కర్ చెబితే జగన్ ప్రభుత్వం వారిని రాచిరంపాన పెడు తున్నదట. అధికారంలో ఉన్న వారిని పచ్చి బూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసత్య ప్రచారాలకు తెగ బడినా సరే కేసులు పెట్టొద్దని అంబేడ్కర్ ఎక్కడ చెప్పాడో మాత్రం ఆ పత్రిక చూపెట్టలేకపోయింది. ఇటువంటి తలాతోకా లేని పాయింట్లతో కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన యెల్లో మీడియా గుండెలు గుభేల్ మనేలా, కళ్లలో గుంటూరు కారం మండేలా లక్షలాదిమంది పేద వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ జైత్రయాత్ర ఏప్రిల్లో ఎన్నికలు ముగిసేవరకే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగనున్నది. ‘తెలుగుదేశం’ రాజ కీయ కూటమి పెద్దలూ, యెల్లో మీడియా గద్దలూ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది. కౌంటింగ్ రోజున వారందరి ఇళ్ల ముందు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. కడుపు మంట అదుపు తప్పితే ఏమౌతుందో ఏమో! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రామ్... భీమ్... యుగధర్మం!
బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామ మయం’’. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాఙ్మయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసముండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామా యణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మనవాళ్లు దేశదేశాలకూ మోసుకొని వెళ్లారు. రామనామం పవర్ ఏమిటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకీ తెలియదు. మన దేశంలోని ఆబాల గోపా లాన్ని టెలివిజన్ ఛానెళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్సభలో కేవలం రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే తొంభై సీట్లకు, మూడంకెలకు, ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. పూర్వం రాజాధి రాజులు, చక్రవర్తులు బలంగా ఉన్నప్పుడే అశ్వమేధ యాగాలు చేసేవారట! శత్రు నిశ్శేషం చేసుకోవడం వాటి లక్ష్యం. ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉన్నది. అయినా రామాలయ ప్రతిష్ఠాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకున్నది. అశ్వమేధయాగం స్థాయిలో ఈ మహా క్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్ఠాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన పదకొండు రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రక రకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామ చంద్రుడు భార్యావియోగ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు వశిష్టాది రుషులంతా పూనిక వహించి ఆయన చేత అశ్వమేధం చేయిస్తారు. రాముడికో అనుమానం వస్తుంది. భార్యా విహీనుడైన తానెట్లా యాగం చేయగలనని ప్రశ్నిస్తాడు. భార్యా సమేతంగానే యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనాలనేది నియమం. శ్రీరామునికి బావ గారైన రుష్యశృంగ మహాముని ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. బంగారంతో భార్య విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేయొచ్చని తరుణోపాయం చెబుతాడు. త్రేతాయుగంలోనే అవసరాన్ని బట్టి విరుగుడు మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కలియుగం చివరి పాదంలో ఇప్పుడుండవా? కనుక ఆ విషయంలో మోదీపై అభ్యంతరాలు చెల్లవని శ్రీరామ వర్సెస్ అదర్స్ కేసులో రుష్యశృంగ న్యాయమూర్తి తీర్పు స్పష్టం చేస్తున్నది. శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీకా? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ, అది ఎన్నికల హామీయే కనుక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తున్నది. శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుంది. అసలు హిందూమతం అంటూ ఒకటున్నదా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తున్నది. ఒక నిర్ధారిత పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్లూ, సంఘ్ పరివార్ వాళ్లూ హిందూమతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటనే ఎక్కువగా వాడుతుంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. హిందూ ధర్మం అంటే ఏమిటి? అనేది ఇంకో ప్రశ్న. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. సనాతనమంటే శాశ్వతమనే అర్థమున్నది. ధర్మం శాశ్వ తంగా స్థిరంగా ఉంటుందా? కాలానుగుణంగా మారదా? యుగ ధర్మం అంటారు కదా! అంటే ఏమిటి? ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడు కృష్ణ భగ వానుడు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని భావం. అంటే యుగధర్మాన్ని కాపాడేందుకు అవతరించడమా లేక శాశ్వత ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరించడమా? ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందనీ, రాముడు ధర్మ స్వరూపుడనే అర్థంలో! పైగా ఈ మాట అన్నది ఎవరో కాదు. శ్రీరాముని శత్రు శిబిరంలోని వాడైన మారీచుడు. శ్రీరాముడు వరాలిచ్చిన దేవుడు కాదు. ఆపద మొక్కులవాడూ కాదు. ఒక మనిషి. స్వయంగా కోరి కష్టాలను అనుభవించినవాడు. రుజు ప్రవర్తన కలిగినవాడు. తండ్రి మాటను తలదాల్చినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాడు. ఒక్కరితోనే జీవన సాహచర్యమని నమ్మినవాడు, ఒక రాజుగా ప్రజాభిప్రాయాన్ని మన్నించినవాడు. శిష్టరక్షణకు దుష్టశిక్షణకు వెనుకాడనివాడు. ఈ రకంగా తన జీవితాన్ని ఒక పాఠంగా ఈ సమాజానికి అందించినవాడు కనుకనే ఆయనను ధర్మస్వరూపుడని కీర్తించారు. భారతీయులపై రామాయణ ప్రభావం మత విషయాల కంటే సాంస్కృతిక రంగంలోనే ఎక్కువ. సామాజిక కట్టుబాట్లపైన, నైతిక నియమాలపైన, మన సాహిత్యం, సంగీతం, కళలు, నాట్యంపైనా రామాయణం ముద్ర ఉన్నది. ధర్మం, కర్మ, జీవిత పరమార్థం వంటి అంశాలు మన తాత్వికతను పరిపుష్టం చేశాయి. మన పాత్రను సక్రమంగా ఎలా అర్థం చేసుకోవాలో రామాయణం చెబుతుంది. నమ్మిన మార్గంలో సవాళ్లు ఎదురైనా ఎలా ముందుకు వెళ్లాలో రామా యణం బోధిస్తుంది. లోతుగా పరిశీలిస్తే శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తుంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ–సంఘ్పరివార్ కొంత రాజకీయం పులమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటని మతపెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు. కొద్దిరోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకిక వాదుల విమర్శలు సరేసరి! బీజేపీ, సంఘ్ పరివార్ల మూడు దశాబ్దాల కృషి అయోధ్య రామమందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి? శ్రీరాముడి ఆదర్శాలన్నీ త్రేతాయుగానికి సంబంధించినంత వరకు ధర్మబద్ధమే కావచ్చు. యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి. వేదవేదాంగాల వంటి శ్రుతులు చెప్పిన విషయాలు నిత్య సత్యాలనీ, మనుస్మృతి వంటి స్మృతులు పెట్టిన నియమాలు కాలాన్నిబట్టి మారుతాయనీ పండితులు చెబుతారు. శ్రీరాముడు చేసిన కొన్ని పనులు ఆ తర్వాతి యుగాలకు సమ్మతమయ్యేవి కావు. బహుశా ఆ కాలంలో కూడా అసమ్మతి గళాలున్నా రామాయణంలో వినిపించలేదేమో. వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి తపస్సు చేస్తున్న శూద్ర శంబూ కుని తలను శ్రీరాముడు తెగనరికాడు. ఒకే ఒక్కడి మాటకు ప్రజాభిప్రాయమనే ముద్రవేసి సీతమ్మను అడవులకు పంపించాడు. రావణుడి చెర నుంచి విడిపించినప్పుడు ఆమె శీల పరీక్షకు ఆదేశించాడు. ఇవన్నీ ఏ యుగంలోనూ ఆదర్శాలు కాబోవు. ప్రజా క్షేమం కోరే పరిపాలన, మాట తప్పని వ్యక్తిత్వం, సవాళ్లకు తలవంచకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం, ఏక పత్నీవ్రతం వంటి రామయ్య సుగుణాలు సర్వకాల సర్వా వస్థల్లోనూ ఆదర్శంగా నిలబడతాయి. అటువంటి ఆదర్శాలకు గుర్తుగా భవ్యమైన రామమందిరం రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైతే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయో ధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సరిగ్గా మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్య క్రమం జరగబోతున్నది. శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే, ఈ ప్రజా స్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి, రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నది. రామాలయం లేని ఊరు ఉండదనేది యాభయ్యేళ్ల కిందట తెలుగునాట తరుచుగా వినిపించిన నానుడి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వామి విజృంభించడంతో ఇప్పుడు ఆ నానుడి వినిపించడం లేదు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నకొద్దీ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు నాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున పద్దెనిమిది ఎకరాల స్వరాజ్య మైదాన్లో ఆవిష్కృతం కాబో తున్న ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేడ్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తయినది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. మొత్తం కలిపి 210 అడుగులు. ఆంధ్రప్రదేశ్లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధి పత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయపోరాటం చేస్తున్నది. ఆ పోరా టానికి నిరంతర స్ఫూర్తి జ్వలితరూపంగా ఈ విగ్రహం నిలబడబోతున్నది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛా ప్రజాస్వామిక యుగధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్దపీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు. కులవ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు. దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటనా, ఆరాధనా స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది. ఆ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. యెల్లో మీడియా చానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు ముప్పావు భాగం స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయ డానికి వినియోగిస్తున్నాయి. అవకాశవాద పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెద జల్లుతున్నాయ్. మీడియా–సోషల్ మీడియాల విషప్రచారాలు చాలవని వేలాదిమందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విషప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగయుగాల సందేశం ఇదే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉరఫ్ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్ మోడల్ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది. మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా? వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు. తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమ్ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్ స్కీమ్ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్ కల్యాణ్తో తాను పెట్టించిన పార్టీని ఎన్డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్’పైనే ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్ ఎకాంప్లిష్డ్’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!! చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి. విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే! తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్పోర్టులో బ్రదర్ అనిల్తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు? అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్రెడ్డి మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్ మోహన్రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు. ‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది. ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్ శర్మ టీమ్తో పాటు ఒక రిటైర్డ్ డీఐజీ ఈ వింగ్ను పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పీకే అండ్ పీకే ఫార్ములా!
ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్ర బాబు కోసం పవన్ కల్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్పివి) జనసేన. అది ప్యాకేజీ ఫీజుతో కాంట్రాక్టుపై పనిచేస్తున్నదని వైఎస్సార్సీపీ నాయకులు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా జనసేన కోసం జీవితాలను ధారబోసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న యువకులు ఇంకో అడుగు ముందుకు వేసి చెబుతున్న మాట – ‘చంద్రబాబు సినిమాలో... జనసేన ఓ ఐటమ్ సాంగ్ మాత్రమే!’ కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు జనసేన కార్యకర్తల్లోని అనుమానాలను బలపరుస్తున్నాయి. ‘రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. నేనేం చేసినా ప్రశ్నించవద్దు. తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించేవాళ్లు పార్టీలో ఉండనవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పదేళ్లు కొనసాగవలసిన అవసరం ఉన్నది’. ఈ రకమైన సుభాషితాలు విశదం చేస్తున్న విషయమేమిటి? తెలుగుదేశంతో ఇంకో పదేళ్ల పాటు పొత్తుకు డీల్ కుదిరిందనే కదా! ఈ డీల్ వల్ల జనసేనకు ఒనగూరే ప్రయోజనమెంత? ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి పదవి జనసేనకు ఎన్నేళ్లు... టీడీపీకి ఎన్నేళ్లు? ఇటువంటి ప్రశ్నలు అడగొద్దనే ఉద్దేశంతోనే సొంత పార్టీ అభిమానుల ముందరి కాళ్లకు పవన్ ముందుగానే బంధనాలు వేశారు. దాటవేత పద్ధతిలో సొంత పార్టీ వారిని ఏమార్చుతూ వచ్చారు. ‘ముందుగా సీట్లు గెలవాలి. ఎక్కువ సీట్లు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి పదవిని అడగగలం... ముందు ఎక్కువ సీట్లలో జనసేనను గెలిపించండ’ని కార్యకర్తల పైనే పవన్ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. సరే, పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామని కార్య కర్తల ప్రశ్న. ముఖ్యమంత్రి పదవి దక్కేంతగా మెజారిటీ సీట్లు తీసుకోబోతున్నామా? పోనీ హరిరామజోగయ్య వంటి శ్రేయోభి లాషులు చెబుతున్నట్టుగా కనీసం 60 సీట్లు? జనసేనకు అంత సీన్ లేదని తెలుగుదేశం పార్టీ కో– పైలట్గా భావించుకుంటున్న లోకేశ్బాబు కుండబద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఒక్క సీట్లోనే ఓడిపోతే పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. అందువల్ల ఆ మాత్రం చులకన భావం లోకేశ్కు సహజం. కచ్చితంగా 150 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని తాజాగా ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూలో లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే సమస్యే రాదనీ, అటువంటి ప్రస్తావనే రాలేదనీ, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థనీ లోకేశ్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అంగీకరించినట్టు లోకేశ్ వెల్లడించారు. లోకేశ్బాబు ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం గరిష్ఠంగా 25 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నది. అందులో కూడా సగంమంది అభ్యర్థులకు కొత్తగా జనసేన తీర్థ మిచ్చి టీడీపీ సమకూర్చుతుందని విశ్వసనీయ సమాచారం. మిగిలిన పది, పన్నెండుమంది ఎంపికను కూడా టీడీపీ నాయ కత్వం ఆమోదించవలసి ఉంటుంది. ఇంత అవమానకరమైన ఒప్పందానికి ఏ రాజకీయ పక్షమైనా ఒప్పుకుంటుందా? ఇంకేదో మనకు తెలియని కోణం ఉన్నందువల్లనే ఇటువంటి పొత్తులు సాధ్యమవుతాయి. ఏమిటా కోణం? అదో సింగపూర్ రహస్య మంటారు జనసేన వ్యవహారాలు బాగా తెలిసినవాళ్లు. చిదంబర రహస్యం గురించి విన్నాం గానీ ఈ సింగపూర్ రహస్యం ఏమిటో అంతుపట్టడం లేదు. చంద్రబాబుకు సింగపూర్తో వ్యాపార సంబంధాలు చాలాకాలం నుంచి ఉన్నాయనేది బహి రంగమే. బహుశా రాజకీయ లావాదేవీలను కూడా అక్కడి నుంచి నరుక్కొస్తారేమో! ఈ కోణాల సంగతీ, కుంభకోణాల సంగతీ పక్కన పెడదాం. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పుకొని, రాష్ట్రంలో ఉన్న మరో బలమైన సామాజికవర్గపు ఆకాంక్షలతో ఊపిరిపోసుకున్న పార్టీ నిజస్వరూపం ఇలా వెల్లడైతే దాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? జనసేన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వస్తున్న క్షేత్రస్థాయి జనసేన కార్యకర్తల్లో చాలామందికి లోకేశ్బాబు తాజా ఇంటర్వ్యూ కళ్లు తెరిపించి ఉండాలి. వారి మనోభావాలనే హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కల్యాణ్కు చేరవేశారు. ‘లోకేశ్ చెప్పిన మాటలకు మీ ఆమోదం ఉన్నదా’ అని లేఖలో జోగయ్య ప్రశ్నించారు. ‘మీరు ముఖ్యమంత్రి కావాలనీ, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనీ కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నార’ని కూడా ఆయన ప్రశ్నించారు. చివరకు 60 సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా దక్కించుకోవాలని పవన్ కల్యాణ్కు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్తో వ్యవహరించే తీరుపై పెదబాబు, చిన బాబుల అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలున్నాయట! కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జనసైనికులకు సర్దిచెప్పడం కష్టమన్న పవన్ వైఖరి పట్ల చంద్రబాబు ఒకింత సానుభూతిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేశ్బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో అరెస్టు భయంతో చినబాబు ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్తో (పీకే) స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయా లని పీకేను లోకేశ్ అడిగారట! ఇప్పటికే పీకే టీమ్లో పనిచేసిన రాబిన్సింగ్ తెలుగుదేశం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగానే పవన్ కల్యాణ్ను అతిగా ఊహించుకోవద్దనీ, అతనికి కాపు సామాజికవర్గంలో కూడా పెద్దగా బలం లేదనీ పీకే లోకేశ్కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అంత ఎక్కువ నష్టం జరుగు తుందని తన అభిప్రాయంగా చెప్పారట! అయితే వ్యూహకర్తగా పనిచేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, తన సమా చారం ప్రకారం వైసీపీ మరోసారి గెలిచే అవకాశాలున్నట్టు చెప్పా రట! అప్పటినుంచీ పీకేను వ్యూహకర్తగా ఒప్పించడం కోసం లోకేశ్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరి మితం చేయాలని లోకేశ్ పట్టుదలగా ఉండడంతో విషయం తెలిసిన పవన్ కల్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావడానికి అంగీకరించిన పవన్ మొండికేయడంతో చంద్ర బాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారట! ఇతరత్రా ఒప్పందాల సంగతి తెలియదు గానీ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 25కు పెంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. జనసైనికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని భయపడినప్పటికీ ఆ సంఖ్యకు ఒప్పుకోక తప్పలేదు. ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా అప్పటి వాతావరణ ప్రభావం కనిపించింది. చంద్రబాబును సాగనంపడానికి బయటకొచ్చిన పవన్ దూరంగా నిలబడి ఉండగా నాదెండ్ల మనోహర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బాబుకు వీడ్కోలు చెప్పడం కనిపిం చింది. ఎట్టకేలకు లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ సభకు పెట్టుకున్న పేరు విజ యోత్సవ సభ. లైవ్లో కార్యక్రమాన్ని చూసిన వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే – అది విజయోత్సవ సభ కాదు, సంతాప సభలా ఉన్నదని! పోనీ పాదయాత్ర తొలి రోజున చనిపోయిన తారకరత్న సంతాప సభగా దాన్ని మార్చారా అంటే అదీ లేదు. అతని పేరు తల్చుకున్నవారే లేరు. కానీ వేదిక మీదున్న నాయకుల ముఖాలు మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి. అందుకు సభ ఫెయిల్యూర్ ఒక కారణం కావచ్చు. ఆరు లక్షలమందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో తెలియదు. సభకు నలభై నుంచి యాభైవేల మంది వరకు వచ్చి ఉంటారని తేలింది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని పదివేల మంది లేరు. ఇదీ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేనల ఉమ్మడి ప్రభావం. ఇక సంతాప వాతావరణానికి రెండో కారణం – పొత్తులో కత్తుల వ్యవహారం కావచ్చు. జనసేన శ్రేణుల్లో ఒకపక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ ఊడిపడ్డారు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎమ్ రమేశ్కు చెందిన ప్రైవేట్ విమానంలో లోకేశ్, కిలారు రాజేశ్లతో కలిసి ఆయన విజయవాడకు వచ్చారు. చంద్ర బాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం రెండు రకాలుగా ఉన్నది. తెలుగుదేశం – జనసేన కూటమి మాత్రమే వైసీపీతో తలపడటానికి సరిపోదనీ, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ – కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పడానికే చంద్రబాబును పీకే కలిశారని ఒక సమా చారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే వింత ఇంకోటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానంలో! రాచకార్యం కాంగ్రెస్ కోసం!! ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్సింగ్ టీమ్ పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోనే పనిచేసినందున... వారితో మాట్లాడి సలహాలిచ్చేందుకు రావలసిందిగా లోకేశ్ చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చాడని మరో సమాచారం. చంద్ర బాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీమ్ కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమవైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు వినపడుతున్నది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిశోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలను కోవడం నదిలో కొట్టుకొనిపోయేవాడు గడ్డిపోచను చూసి ఆశపడిన చందం! వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిపించేట్లయితే పార్టీలను మూసేసుకుని నాయకులు వ్యూహకర్తలనే ఆశ్రయించేవారు. అంబటి రాంబాబు చెప్పినట్టు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రీ ఏం చేస్తాడు? ఈ పీకే భేటీ సంగతేమోగానీ, ఈ పరిణామం మన పీకే (పవన్ కల్యాణ్) పీకకు చుట్టుకుంటుందేమో చూడాలి. అసలే పార్టీ నుంచి వరసగా జారుకుంటున్నారు. కీలకమైన కాపు సామాజికవర్గం నేతలే తాము ఈ పార్టీలో ఇమడగలిగే పరిస్థితి లేదని బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పాతిక సీట్లతోనే పార్టీ నేతలను ఒప్పించలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ కూడా తోడైతే వాళ్లకిచ్చే నాలుగు సీట్లు కూడా తన ఖాతా లోంచే కోత పడతాయి. పైగా బీజేపీ మీద అపారమైన అభి మానాన్ని కురిపిస్తూ ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చేరిన పవన్ ‘ఇండియా’ కూటమిని అంగీకరిస్తారా? ఆ పరిస్థితి ఎదురైతే తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? తెగతెంపులు చేసుకునేంత సాధారణమైన సంబంధమే తెలుగుదేశంతో ఉన్నదా? ఇవన్నీ సందేహాలే. తెలుగుదేశం పార్టీ ‘ఇండియా’ కూటమిలో చేరే అవకాశం లేదనే అనుకుందాం. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం. అసలే బీజేపీ అంటేనే బాబు ఝడుసుకుంటు న్నారు. మరో దారి లేకపోతే తప్ప ‘ఇండియా’ కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వడానికే పీకే బాబును కలిశాడనుకుందాము. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లతో జనసైనికులను మన పీకే సంతృప్తిపరచ గలరా? పదేళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావహుల ఆగ్ర హాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదనీ, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనీ బహిరంగంగా ప్రకటించి కాపు సామాజికవర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు. ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్ పీరియడ్గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది. గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే. ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది. వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి. సెక్రటేరియట్కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి. రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్ చర్యే! వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది. అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్లోకి వచ్చే ప్రొసీజర్స్ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది. కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం. తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్... కథ అడ్డం తిరిగింది! ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్ పార్టీ టెన్ బై టెన్ స్కోర్ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది. తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్ఎస్ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్ బూత్ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్పల్లి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్లో బీఆర్ఎస్కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్బీ కాలనీ బూత్ నెంబర్ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com