-
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
ఉద్దానంలో పెద్దపులి
కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడిచేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీమూరు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్నాయక్ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఒడిశా నుంచి రాక! పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బుగాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వరుణ్రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
తీరానికి మరింత రక్షణ
సాక్షి, అమరావతి: మడ అడవుల విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా వృద్ధిచెందుతోంది. తీర ప్రాంతానికి రక్షణలో ఈ అడవులు కీలకపాత్ర వహిస్తాయి. తుపానులు వచ్చినప్పుడు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కోతను నివారిస్తాయి. గడచిన ఎనిమిదేళ్లలో 10శాతం మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు అటవీశాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2014నాటికి రాష్ట్రంలో 31,888 హెక్టార్లలో ఇవి విస్తరించగా, ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మన రాష్ట్రంలోనే మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 2,114 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, గుజరాత్లో 1,175 చదరపు కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో 616 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువ మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాలు, కృష్ణా తీరంలో కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యంలో ఉన్న మడ అడవులు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 187.81 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకెళ్లి సముద్ర ముఖద్వారాల్లో చల్లించింది. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల సహకారంతో సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మడ అడవుల ద్వారా తీర ప్రాంత రక్షణతోపాటు, అక్కడ నివసించే లక్షలాదిమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
నడక మార్గంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు అటవీ శాఖ, టీటీడీ అధికారులను బుధవారం ఆదేశించింది. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గం వెంట ఇనుప కంచె ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా తెలియజేయాలని కోరింది. వన్యప్రాణులు తిరిగే చోట మనమంతా తిరుగుతున్నామని, అందువల్ల వన్యప్రాణుల జీవనం, భక్తుల భద్రత మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా తగిన రక్షిత మార్గాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. ఇటీవల చిరుత పులి దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి చెల్లించిన రూ.15 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, చిత్తూరు జిల్లా అటవీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున యలమంజుల బాలాజీ, అటవీ శాఖ తరఫున ఖాసిం సాహెబ్, టీటీడీ తరఫున అనూప్ వాదనలు వినిపించారు. -
కాకుల కొండ వద్ద చిరుత కళేబరం
మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు. -
భక్తుల రక్షణే ప్రధాన ధ్యేయం
తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు. జంతువులకు ఆహారం అందించడం నిషేధం నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వైల్డ్లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. -
చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది -
చిరుత కోసం గాలింపు
సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. పండ్లు.. కూరగాయల కోసమే! కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అక్కడికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమయంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడటంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపదను తప్పించే ‘ఆలోచన’ తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్ ఎలాస్టిక్ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకున్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు. – తిరుమల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కారణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలిస్తున్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయగూరలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది. – సతీష్రెడ్డి, డీఎఫ్ఓ, తిరుపతి -
అయ్యో.. ఆరేళ్లకే నూరేళ్లు!
తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భద్రత విషయంలో రాజీలేదు: భూమన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు. పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతో అత్యవసర సమావేశం అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించామన్నారు. వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు. -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
భూమిపై పెరిగే బంగారం! టేబుల్ రేటు రూ.7కోట్లు.. కుర్చీ రూ.2 కోట్లు!
‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది. నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట. ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు. ఎర్ర చందనం మార్కెట్పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది. గ్రేడ్లను బట్టి రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది. ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. – మధుసూదన్రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం ఈ డిమాండ్కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
ఆ ఎర్రచందనం మాదే.. మాకూ వాటా ఇవ్వండి
సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది. దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. 50 శాతం వాటా అడుగుతున్నాం ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది. – మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్ -
భర్తకు బంగారం లాంటి ఉద్యోగం.. సౌమ్యరంజన్ మృతి కేసులో మలుపు
ఒడిశా : గజపతి జిల్లా అటవీ శాఖలో ఏసీఎఫ్గా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా మృతిచెందిన సౌమ్యరంజన్ మహాపాత్రొ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు పర్లాకిమిడి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీజేఎం) కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జూలై 11న తన క్వార్టర్స్లో కాలిన గాయాలతో ఏసీఎఫ్ మృతిచెందగా, ఆయన భార్య విద్యాభారతి పండా, ఇంటి వంటవాడు మన్మథ కుంభో, అప్పటి డీఎఫ్ఓ సంగ్రాం బెహరా నిందితులుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దర్యాప్తు అనంతరం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(ఎస్ఐటీ) వీరి ముగ్గురికీ క్లీన్చీట్ ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్యరంజన్ తండ్రి అభిరాం బెహరా.. కేసును పునః విచారణ చేపట్టాల్సిందిగా పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దర్యాప్తులో ముందుగా పేర్కొన్న ప్రధాన నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ముగ్గురూ స్పందించక పోవడంతో కోర్టులో విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే హాజరు సైతం లేకపోవడంతో పలుమార్లు హెచ్చరించిన అనంతరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు సౌమ్యరంజన్ భార్య విద్యాభారతి పశువైద్య శాఖలో లైవ్స్టాక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, జూన్ 27నుంచి సెలవులో ఉన్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏసీఎఫ్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
నేడే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్లో ఆసిఫాబాద్కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్ చేరుకోనున్నారు. -
పట్టాలెక్కని హక్కు.. ఏళ్ల తరబడి అసైన్డ్ పట్టాదారుల నిరీక్షణ
హద్దుల సమస్యే అడ్డంకి.. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.. నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. – వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ -
సర్వే నంబరే మార్చేశారు.. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు. ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా? ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
రక్షణ విస్మరించి.. అడ్డగించి.. ‘కోట్పల్లి’కి పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్న అధికారులు
ధారూరు: కోట్పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది
చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ● భద్రాచలం డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్ ఆఫీసర్తో పాటు, ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● అదే ఏడాది జూన్లో అశ్వాపురం రేంజ్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● ఇల్లెందు రేంజ్ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్మాల్ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్తోపాటు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్ ఇరవెండి పరిధి లో జామాయిల్ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ఉపేక్షించేది లేదు అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, డీఎఫ్ఓ -
ఆలివ్ రిడ్లే.. సముద్రంలోకి వెడలె
సాక్షి, అమరావతి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. వెయ్యి తాబేళ్లలో ఒకటే.. ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్ సాక్ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది. అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. – డాక్టర్ సుప్రజ ధారిని, ఛైర్పర్సన్, ట్రీ ఫౌండేషన్ -
ఉగ్రవాదులపై అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్తో పాటు భోపాల్లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు. ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్–¿ోపాల్ మాడ్యుల్స్పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ నిర్ణయించింది. ఈ ఉగ్రవాదులు భోపాల్ శివార్లలోని రైసెన్ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు హైదరాబాద్, భోపాల్లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్ అధికారులు వీరిని భోపాల్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్ యాదవ్ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.