-
మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి
బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్ డీర్) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్లైఫ్ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శబ్దం వినబడితే ప్రాణం హరీ! మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వులు, పండ్లు, ఆకుల్ని తింటాయి. ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తోడు అడవుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వంటివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే అరుదైన మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు. సంతతి పెరుగుతోంది అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
అడవి ఒడిలోకి.. పులి పిల్లలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్లోని కన్హా, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, ఎన్ఎస్టీఆర్ (నాగార్జున్సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్గఢ్ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్సిటు ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్క్లోజర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్క్లోజర్ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. 50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్సిటు ఎన్క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్క్లోజర్ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్క్లోజర్లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక. అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో ఇన్సిటు ఎన్క్లోజర్లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్వీ జూపార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్సిటు ఎన్క్లోజర్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్సిటు ఎన్క్లోజర్ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ -
ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్వీ నేషనల్ పార్క్లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. ఒకేసారి ఎందుకంటే..! ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. లెక్క.. పక్కా..! ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు. ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానాల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏనుగులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏనుగులుగా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. ప్రణాళికాబద్ధంగా లెక్కింపు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏపీ అటవీ శాఖ -
వన్య ప్రాణులకు జీవధార
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్ డ్యామ్ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పాపికొండల అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
కొత్త టైగర్ రిజర్వ్ .. చాన్సున్నా చర్యల్లేవ్?
రాష్ట్రంలో కొత్త టైగర్ రిజర్వ్ల ఏర్పాటుకు అన్ని సానుకూల పరిస్థితులున్నా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్కటీ కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లు ఉండగా, కొత్తగా కనీసం రెండు పులుల అభయారణ్యాల ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కాగజ్నగర్, కిన్నెరసాని, ఏటూరునాగారంలలో సానుకూల వాతావరణం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులొచ్చే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వపరంగా ముఖ్యంగా అటవీశాఖ నుంచి గట్టి ప్రయత్నాలు సాగడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, హైదరాబాద్ తగ్గిన పులుల ఆక్యుపెన్సీ తాజాగా విడుదలైన టైగర్ స్టేటస్ రిపోర్ట్–2022లోనూ రాష్ట్రంలో ‘పులుల ఆక్యుపెన్సీ’ తగ్గిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వివిధ ప్రయోజనాలు చేకూరే అవకాశమున్నా గట్టి ప్రయత్నాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా 8, 9 పులుల అభయారణ్యాలు ఏర్పడినా, రాష్ట్రానికి ఒక్కటి కూడా రాకపోవడానికి ఈ దిశలో కనీసం ప్రతిపాదనలు కూడా కేంద్రానికి చేరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదనలు పంపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కవ్వాల్లో కనిపించని స్థిరనివాస పులులు! ఉమ్మడి ఏపీలో 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఏర్పడింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా (ఏటీఆర్) ప్రకటించారు.ప్రస్తుతం అమ్రాబాద్లో పులులు పుష్కలంగా ఉన్నాయని, 2018తో పోలి్చతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి. కవ్వాల్లోని చెన్నూరు డివిజన్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులే కనిపించకపోవడం ఆందోళన రేపుతోంది. ఎన్ని ఆడపులులు సంతానోత్పత్తి చేస్తున్నాయనే అంశం ప్రాతిపదికన ఆ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య వృద్ధికి అవకాశముంది, ప్రస్తుతం ఏటీఆర్లో కనీసం ఏడు ‘బ్రీడింగ్ ఫిమేల్ టైగర్స్’ ఉండటంతోపాటు కనీసం నాలుగు ఆడపులులు పిల్లలు పెట్టి వాటిని సంరక్షిస్తున్నాయని ఈ ప్రాంతంతో పరిచయమున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటీఆర్లో 30 దాకా పులులు (నాలుగైదు పులి పిల్లలు కలుపుకొని) ఉండగా, కేటీఆర్లో అసలు పులులే కనిపించని పరిస్థితులు ఏర్పడినందున కొత్త టైగర్ రిజర్వ్ల ఏర్పాటు అవశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగజ్నగర్లో కనిపిస్తున్నాయ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో తెలంగాణలోకి వాటి వలసలు పెరిగాయి. ప్రస్తుతం కొంతకాలంగా పులులు లేని ప్రాంతంగా కవ్వాల్ నిలుస్తోంది. దీని బయట టైగర్ కారిడార్లో ముఖ్యంగా కాగజ్నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడో టైగర్ రిజర్వ్ను కాగజ్నగర్ ఏరియాలో ఏర్పాటు చేసి ఉంటే పులుల సంరక్షణకు పెద్దమొత్తంలో కేంద్ర నిధులు రావడంతోపాటు ఉద్యోగుల కేటాయింపు, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉండేదంటున్నారు. టైగర్ సఫారీ వంటి వాటికీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారని, దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధారీ ప్రాంతానికి పక్కనే ఈ ప్రాంతం ఉండటంతోపాటు.. అక్కడి నుంచే పులులు ఇక్కడకు వస్తున్నందున మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. వైల్డ్లైఫ్ శాంక్చురీగా ఉన్న కిన్నెరసాని, ఏటూరు నాగారంలోనూ పులుల సంచారం ఉన్నందున వాటిని కూడా టైగర్ రిజర్వ్గా ప్రకటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిలో కనీసం రెండుచోట్ల టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేసినా అడవులు, పర్యావరణానికి మేలు చేకూరుతుందని అంటున్నారు. రాష్ట్రంలో పులుల అభయారణ్యానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాలు 1. కాగజ్నగర్ 2. కిన్నెరసాని 3. ఏటూరు నాగారం -
Project Cheetah: చీతాల మరణం ఊహించిందే!
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్క్లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్ఫెక్షన్లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సౌతాఫ్రికా ఫారెస్ట్, ఫిషరీస్, ఎన్విరాన్మెంట్ విభాగం(DFFE).. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు. ► ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, సౌతాఫ్రికా నుంచి భారత్ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్ఫెక్షన్లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది. ► భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్ ఫేజ్కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ► సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్క్లోజర్లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. ► వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు. ► అయితే ఈ ప్రకటనపై కునో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ► ప్రాజెక్ట్ చీతా చేపట్టిన టైంలోనే.. కునో పార్క్ చీతాల సంచారం, వేటకు సరిపోదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను.. కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు సూచించారు కూడా. ఇదీ చదవండి: భారత్ శాంతి మంత్ర -
అది పులి కాదు.. మరి ఏంటి?
-
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్హెచ్ అధికారులకు నోటీసులు ఎన్హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
గజ గజా.. పులి పంజా
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 163 మంది మృతి చెందారు. 2021లో 57 మంది మరణించగా 2022లో 105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏనుగుల దాడుల్లో మూడేళ్లలో 1,581 మంది చనిపోయారు. అత్యధికంగా ఒడిశాలో 322 మంది, జార్ఖండ్లో 291 మంది, పశ్చిమ బెంగాల్లో 240 మంది గజరాజుల క్రోధాగ్నికి బలయ్యారు. 2018 గణాంకాల ప్రకారం దేశంలో పులులు సంఖ్య 2,967 కాగా 2017 అంచనాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964 అని కేంద్ర అటవీ శాఖ తెలిపింది. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు నీటి వనరుల సంరక్షణ, చెట్లు నాటడం, స్థానిక ప్రజలను హెచ్చరించడం లాంటి చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ఏనుగుల ఆవాసాలను ‘ఎలిఫెంట్ రిజర్వ్’ ప్రాంతంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. -
కొల్లేరు పక్షుల లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్–2023 ముగిసింది. అటవీశాఖ సిబ్బంది 12 బృందాలుగా ఏర్పడి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ నెలాఖరు వరకు ఏలూరు జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతాల్లో పక్షుల గణన చేశారు. అభయారణ్యం పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో మొదటి స్థానంలో కోయిలలు, రెండోస్థానంలో పెలికాన్ పక్షులు ఉండగా... అరుదైన పిన్టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు కనిపించాయి. పక్షుల గణన ఎలా చేశారంటే... పొడిసిపెడి ఫారమ్స్ (గ్రేబ్స్, నీటి ప్రయాణ పక్షులు), అన్సెరి ఫారŠమ్స్ (బాతులు), చరాద్రి ఫారమ్స్ (నీటి దగ్గర నివసించే పక్షులు), సికోని ఫారŠమ్స్ (కొంగజాతి పక్షులు), చిత్తడి నేలలపై ఆధారపడే పక్షులు... ఇలా ఐదు కుటుంబ కేటగిరీలుగా తీసుకుని పక్షుల గణన చేశారు. పక్షి నిపుణుడు, రికార్డింగ్ చేసే వ్యక్తి, ఫొటోగ్రాఫర్, గైడ్తోపాటు మరో ముగ్గురు కలిసి మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన 12 బృందాలు ఈ సర్వే చేశాయి. 105 కొల్లేరు అభయారణ్యంలో గుర్తించిన పక్షిజాతులు 7,875 అత్యధికంగా గుర్తించిన కోయిలల సంఖ్య 81,495 ప్రస్తుతం ఉన్న మొత్తం పక్షులు 6,869 రెండోస్థానంలో ఉన్న పెలికాన్ పక్షుల సంఖ్య తక్కువగా కనిపించిన పక్షులు ఈ సర్వేలో పిన్టయల్ స్నిప్ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్ వాగ్టయల్ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు, మరికొన్ని జాతుల పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం కొల్లేరులోని సహజసిద్ధ వాతావరణం పక్షులను ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఏటా విడిది కోసం కొల్లేరుకు వేలాదిగా పక్షులు వస్తుంటాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన వల్ల రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణకు విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది. – ఎస్వీకే కుమార్, వైల్ట్లైఫ్ ఫారెస్ట్ రేంజర్, ఏలూరు -
కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు.. మండిపడ్డ మాజీ సీఎం!
లక్నో: గాయపడిన ఓ కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంద్ఖా గ్రామంలో ఆరిఫ్ ఖాన్ గుర్జార్కు గతంలో ఓ సారస్ కొంగ గాయంతో తన పోలంలో కనిపించింది. వెంటనే చికిత్స చేసి కొన్నాళ్లు పాటు ఆ కొంగను కాపాడుతూ వచ్చాడు ఆరిఫ్. ఆ పక్షి కొలుకున్న తర్వాత తనను కాపాడిన వ్యక్తితోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆ కొంగను స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్షి తన సహజ వాతావరణంలో జీవించేందుకు వీలుగా రాయ్బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆరిఫ్ ఖాన్ గుర్జార్కు నోటీసు జారీ చేసి అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. అసిస్టెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (గౌరీగంజ్) రణవీర్ సింగ్ జారీ చేసిన నోటీసు ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పక్షిని తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చర్యను ఖండించారు. అంతేకాకుండా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లను తీసుకెళ్లే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరోక్షంగా అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆరీఫ్ ఖాన్ గుర్జార్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి వేదికపై కూర్చున్నారు కానీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. ఆరిఫ్ సమ్మతితోనే కొంగను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటగా జీవిస్తాయని, అది ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. -
రోళ్లపాడులో తోడేళ్లు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి. దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు. బట్టమేక పక్షుల అభయారణ్యంలో.. ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి. తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా. – అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు -
తిరుపతి జూ పార్క్కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలం..
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు -
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్క్లోజర్లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
24 గంటలు గడిచినా జాడలేని తల్లి పులి..బిక్కుబిక్కు మంటున్న కూనలు
సాక్షి, అమరావతి/కొత్తపల్లి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులోని ఓ గోడౌన్లో సోమవారం ఉదయం నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. గ్రామస్తులు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ యువకుడు గ్రామానికి చివర నిర్మాణంలోని మల్టీపర్పస్ గోడౌన్ అవతలివైపునకు వెళ్లగా, పులిపిల్లల అరుపులు వినిపించాయి. మొదట జంగం పిల్లులుగా భావించినా.. దగ్గరకు వెళ్లి చూడగా నాలుగు పులి పిల్లలు కనిపించాయి. అతను వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరావు, సిబ్బంది పెద్దగుమ్మడాపురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు అడవిలో తిరిగినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపోయాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్లో ఉన్న జంతువైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండటంతో వేడి తీవ్రత తట్టుకోలేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్లలను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆత్మకూరు సర్కిల్ సీఐ ఆర్జీ సుబ్రహ్మణ్యం పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయమై సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయత్ మాట్లాడుతూ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతాయని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని ఆయన తెలిపారు. ఎన్క్లోజర్లో పెట్టి.. తల్లి కోసం ఎదురుచూస్తూ.. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్.శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పులి పిల్లలు దొరికిన సమీపంలోనే చిన్న ఎన్క్లోజర్లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామన్నారు. అలాకాకుండా అడవిలో వదిలేస్తే అవి ఇతర జంతువుల బారినపడతాయని చెప్పారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరుపతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం మంగళవారం ఆత్మకూరు రానుంది. ఇదిలా ఉండగా, సమీపంలోనే సంచరిస్తున్న తల్లి! పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరుగుతున్నట్లు దాని గాండ్రిపుల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ తల్లి పులిని డిసెంబర్ నెలలో కెమెరా ట్రాప్లో గుర్తించినట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో అది గర్భంతో ఉంది. ఇప్పుడు దాని పిల్లలే పెద్దగుమ్మడాపురంలో ఉన్నట్లు భావిస్తున్నారు. (చదవండి: ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు) -
కార్చిచ్చుకు పక్కా స్పాట్
సాక్షి, అమరావతి: అడవుల్లో చెలరేగుతున్న మంటలను వెంటనే నియంత్రించడానికి రాష్ట్ర అటవీశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల మంటలు చెలరేగాయి. వాటిని అటవీ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన నియంత్రించింది. చిన్న మంటలుగా ఉండగానే పసిగట్టి వాటిని ఆర్పేయడం ద్వారా అటవీ ప్రాంతాలను రక్షించగలిగారు. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకూ అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి. డిసెంబర్ నుంచి నెమ్మదిగా పెరుగుతూ మార్చి నుంచి మే నెల వరకు ఎక్కువగా అడవులు తగలబడతాయి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే రాయలసీమ ప్రాంతాలు, నల్లమల అడవుల్లో ఎక్కువగా మంటలను గుర్తించారు. గత నెలలో 5,972 చోట్ల మంటల్ని గుర్తించి ఆర్పేశారు. వైఎస్సార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అత్యధికంగా 1,013 పాయింట్లలో మంటలను నియంత్రించారు. మంటలకు కారణాలు వర్షాకాలంలో అడవుల్లో గడ్డి బాగా పెరిగి వేసవి నాటికి అది ఎండిపోతుంది. ఎండల వల్ల, లేదా అడవుల్లో సంచరించే వ్యక్తులు కాల్చిపడేసే చుట్టలు, బీడీల వల్ల మంటలు చెలరేగుతాయి. ఇలాంటి మంటలను నియంత్రించడానికి అటవీ శాఖ ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా మంటలు విస్తరించకుండా చూస్తారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల ద్వారా మంటల్ని ఆర్పుతారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా ఉండేందుకు సమీప గ్రామాల్లో అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు 6,229 ప్రాంతాల్లో మంటలు ఏర్పడినా వెంటనే ఆర్పేశారు. 2022లో 14,452 పాయింట్లలో ఏర్పడిన మంటలను వెంటనే ఆర్పేసి అటవీ ప్రాంతాన్ని రక్షించగలిగారు. సమాచారం ఇలా.. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం క్షుణ్ణంగా పరిశీలించే ఎస్ఎన్పీపీ, మోడిస్ శాటిలైట్లు మంటల పాయింట్లను గుర్తించడానికి సహాయపడుతున్నాయి. అక్షాంశ, రేఖాంశాలతో సహా మంటల సమాచారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అటవీ శాఖకు చేరుతుంది. మంటల సమాచారం అటవీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఫోన్లకు మెసేజ్ల రూపంలో వస్తుంది. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఫైర్ మానిటరింగ్ సెల్ ఈ సమాచారాన్ని డీఎఫ్వోలకు పంపుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా ఫిబ్రవరిలో మంటలను నియంత్రించగలిగారు. ఎక్కువ పాయింట్లలో వచ్చినా వెంటనే ఆర్పేశాం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎక్కువ పాయింట్లలో మంటలు వ్యాపించినా మా సిబ్బంది ద్వారా వెంటనే అదుపు చేశాం. ఆదివారం ఒక్కరోజే 825 పాయింట్లలో మంటలు ఏర్పడినట్లు శాటిలైట్ల నుంచి సమాచారం వచ్చింది. మా శాఖ వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పేసింది. ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో అడవుల్లో మంటలు వ్యాపించినా వెంటనే ఆర్పడం ద్వారా అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నాం. – ఎం రవిశంకర శర్మ, నోడల్ అధికారి, ఫైర్ మానిటరింగ్ సెల్, అటవీ శాఖ -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ
మార్కాపురం: పదేళ్ల కాలం అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో తోడేళ్ల కదలికలు కనిపించాయి. ఇటీవల దోర్నాల–ఆత్మకూరు సరిహద్దులోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి దోర్నాల– ఆత్మకూరు–శ్రీశైలం అటవీ ప్రాంతాల మధ్య కొద్ది సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి అరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి గుంపులుగా సంచరిస్తూ..జింకలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లను చంపి తింటాయి. అత్యంత వేగంగా పరిగెడతాయి. పాతికేళ్ల క్రితం మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, అర్థవీడు, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఇవి ఉండేవి. పంట పొలాలకు రక్షణ చర్యలో భాగంగా రైతులు కరెంటు తీగలు పెట్టడంతో జంతువుల్ని వేటాడేందుకు పొలాల్లోకి వచ్చి విద్యుత్ వైర్లు తగిలి చనిపోయి వాటి సంఖ్య క్రమేపి తగ్గిపోయింది. గడిచిన పదేళ్ల కాలంలో నల్లమలలో తోడేళ్ల జాడ లేకపోవడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నెల క్రితం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో తోడేళ్ల జాడ ట్రాప్డ్ కెమెరాల్లో కనిపించింది. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్య ప్రాణులను చంపవద్దు వన్య ప్రాణులను ఎవరూ చంపవద్దు. ఉచ్చులేసి వేటాడొద్దు. ఇటీవల రోళ్లపాడు ప్రాంతంలో తోడేళ్లు సంచరించాయి. రైతులు పొలాలకు విద్యుత్ కంచె వేయవద్దు. వన్య ప్రాణులను వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎ.విగ్నేష్, డిప్యూటీ డైరెక్టర్, అటవీ శాఖ -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్చాంగ్టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్చాంగ్టెరాన్ తెలిపారు. -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్తో తెలుగు ఆడియన్స్ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్పై బిగ్బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
పులిని చంపి వండుకుని తిన్నారు?
యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు పులులు సంచరిస్తున్నాయి పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు. అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్ఆర్ఓ చెప్పారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? -
శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు
అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మందపాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్రలు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురుగులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకుపోయి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్ల ద్వారా గుర్తించింది. సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగోలిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉనికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టపడుతున్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరియలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్లు పెట్టాలని భావిస్తున్నారు. అరుదైన పాంగోలిన్ జాతికి చెందినవి అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే. ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్ పాంగోలిన్ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్ పాంగోలిన్ బంతిలా ముడుచుకుపోతుంది. మన దేశంలోని హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్లో చైనీస్ పాంగోలిన్లు కనిపిస్తాయి. పాంగోలిన్ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవాసాలు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగోలిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్ మెడిసిన్లో విరివిగా వాడతారు. అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న క్షీరదాల్లో మొదటి స్థానం వీటిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ ఇండియన్ పాంగోలిన్ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం. – కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు