శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు | Pangolins foot steps found at Srisailam Forest | Sakshi
Sakshi News home page

శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు

Published Mon, Feb 20 2023 6:00 AM | Last Updated on Mon, Feb 20 2023 6:00 AM

Pangolins foot steps found at Srisailam Forest - Sakshi

అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మంద­పాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్ర­లు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురు­గులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకు­పో­యి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తు­న్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది.

సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్‌ పాంగోలిన్‌) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి.

శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పు­లుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగో­లిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీ­లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉ­నికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చ­ర్య­ల గురించి తూర్పు కనుమల వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి.

వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎ­లాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టప­డు­తు­న్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్య­యనం చేస్తు­న్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్క­డెక్కడ ఉన్నా­యో చూస్తూ వాటి గురించి తెలుసు­కుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరి­యలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్‌లు పెట్టాలని భావిస్తున్నారు.

అరుదైన పాంగోలిన్‌ జాతికి చెందినవి
అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్‌ పాంగోలిన్‌ (మానిస్‌ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే.

ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్‌ పాంగోలిన్‌ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకో­వడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయో­గపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్‌ పాంగోలిన్‌ బంతిలా ముడుచుకు­పో­తుం­ది. మన దేశంలోని హిమా­లయాలు, ఈ­శా­న్య రాష్ట్రాలు, నేపాల్‌లో చైనీస్‌ పాంగోలిన్లు కనిపి­స్తాయి.

పాంగోలిన్‌ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవా­సా­లు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగో­లిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్‌ మెడిసిన్‌లో విరివిగా వా­డ­తారు.

అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవు­తున్న క్షీరదాల్లో మొ­దటి స్థానం వీ­టిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్య­ప్రదేశ్‌లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది.

నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ
ఇండియన్‌ పాంగోలిన్‌ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్‌ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం. 
– కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement