చిరుత కోసం గాలింపు | Officials are sifting all over Tirumala for cheeta | Sakshi
Sakshi News home page

చిరుత కోసం గాలింపు

Published Mon, Aug 14 2023 3:07 AM | Last Updated on Mon, Aug 14 2023 3:07 AM

Officials are sifting all over Tirumala for cheeta - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడు­తున్నారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 

పండ్లు.. కూరగాయల కోసమే!
కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగా­యలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తు­న్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.

అక్క­డికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమ­యంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నా­యంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడ­టంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవి­లోకి వెళ్లిందని అధికారులు చెబుతు­న్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమా­నం వ్యక్తం చేస్తున్నారు.

ఆపదను తప్పించే ‘ఆలోచన’
తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్‌ ఎలా­స్టిక్‌ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకు­న్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు.    –  తిరుమల

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ రావాలి
ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కార­ణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలి­స్తు­న్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలి­­నడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపు­లుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయ­గూరలు ఎక్క­డంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది.     – సతీష్‌రెడ్డి, డీఎఫ్‌ఓ, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement