-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్లో 26 శాతం, ఉత్తరప్రదేశ్లో 24 శాతం, బీహార్లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
ఆకలికి ఏదో ఒక ఆహారం తింటేసరి అని మనం అనుకుంటాం. చాలావరకు ఆ తినేదేదో రుచికరంగా ఉంటే చాలని కోరుకుంటాం అందరం. ఆఖరికి సన్యాసులు, పశుపక్ష్యాదులైనా!.. ఉత్త అన్నంమెతుకులే వేస్తే..కుక్కయినా సరే ముఖం చిట్లించేస్తుంది. ఏదో ఓ కూర కలిపి వేస్తే కాస్తయినా రుచి చూస్తుంది. అదే చికెన్, మటన్ లాంటిదైతే కృతజ్ఞతగా తోక కూడా ఊపుతూ మరీ లాగించేస్తుంది. మనం చెట్టుమీదున్న పండు అక్కడికక్కడ తెంపుకొని గబుక్కున తినేస్తాం మనం. కానీ అమెరికావాళ్ళకు ‘ ఏమి తింటున్నాం అనేదానికన్నా ఎలా తినాలి ’ అన్నది చాలా ముఖ్యం. చేతితో మాత్రం ముట్టరు..వాళ్ళు అదే పండును శుభ్రంగా కడిగి, ప్లేట్ లో పెట్టుకొని, ఎడమ చేతిలో ఫోర్క్, కుడి చేత చాకు పట్టుకొని కోసి తినడాన్నే ఇష్టపడతారు. అది శాఖాహారమైనా మాంసాహారమైనా చేతితో మాత్రం ముట్టుకోరు . ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో.. నేను పనిచేస్తున్న సంస్థ మార్కుఫెడ్ వారు ,సహకార శిక్షణలో భాగంగా మూడు మాసాల కోసం నన్ను బెంగుళూరు పంపారు. అక్కడి మెస్సులో భోజనాల దగ్గర బయటి రాష్ట్రాల మిత్రులను చూసి పట్టిన ‘ చెంచా ’ అలవాటును నేను ఇప్పటికీ వదలడం లేదు. మా ఇంట్లో ఈ కొత్త అలవాటును చూసి ‘ ఇదేం చెంచాగిరి ’ అని వెక్కిరించినా, ఆతర్వాత వాళ్లే అర్థం చేసుకున్నారు.అలా చేస్తే అమర్యాద కింద లెక్క..ఎటైనా బయటికి వెళ్తున్నామంటే చాలు ఎందుకైనా మంచిదని ఒకటి రెండు చిన్న చెంచాలు బ్యాగులో పెట్టేవారు. అమెరికాలో ఆతిథ్యం విషయంలో ఎన్నో కొత్త విషయాలు గమనించవచ్చు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వస్తామని రాకపోవడం, ఆలస్యంగా వెళ్లడం అమర్యాద కిందే లెక్క. అతిథులకు ముందు నాప్కిన్స్ పెడితే మనం చేతి, మూతి తుడుచుకొని పక్కకు పడేస్తాం. కానీ దాన్నే అమెరికన్స్ బట్టలు పాడుకాకుండా ఉండడానికి పైన వేసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర మనను ఆహ్వానించిన గృహస్తు అందరికీ వడ్డించి, తాను తినడం ప్రారంభించాకనే వచ్చిన అతిథులు తినడం, వైన్ లాంటి డ్రింక్ ఇస్తే గ్లాస్ పైకి లేపి ‘ చీర్స్ ’ చెప్పడం అక్కడి వారి మర్యాద (etiquette ). అంతేకాదు నోరు మూసుకొని తినాలంటారు వారు, లొట్టలేసుకుంటూ శబ్దంచేస్తూ తినడం, తింటూ తింటూ మాట్లాడడం, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ముక్కు చీదాల్సి వచ్చినా రెస్ట్ రూంకు వెళ్లకుండా అక్కడే కూర్చోవడం, వాళ్లకు అస్సలు నచ్చని విషయాలు.కచ్చితంగా థాంక్స్ చెప్పడం వంటివి..ఏదైనా కావాలనుకుంటే ముందు ‘ప్లీజ్ ’ జతచేసి అడగడం, వాళ్ళు అది మీకు వడ్డించినప్పుడు ‘ థాంక్స్ ’ చెప్పడం విధిగా పాటించాల్సిన మర్యాదలు. ముందు గబగబా ప్లేట్ నింపుకొని తర్వాత తినలేక అవస్థపడి వదిలేసినా అక్కడ బాగోదు సుమా! ఎంత అవసరమో.. అంతే వడ్డించుకుని అది తిన్న తర్వాత మళ్లీ పెట్టుకోవడం అక్కడ గమనించిన విషయం. ఫుడ్ వేస్టేజ్ను చాలా మంది అమెరికన్లు ఒప్పుకోరు. భోజనం తర్వాత బ్రేవుమని త్రేన్చితే అతిథి దేవుడు తృప్తిపడ్డట్టు మనం భావిస్తాం . వాళ్ళ లెక్కలో అదీ శబ్దకాలుష్యమే. అమెరికావాళ్ళు తెలివిగలవాళ్ళు. లంచ్, డిన్నర్లే కాదు బ్రేక్ ఫాస్ట్లను కూడా వాళ్ళ కుటుంబ, వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకోడానికి వాడుకుంటారు. క్లాసుమేట్స్తో కలిసి ఇంటికి వచ్చిన మా మనవరాలు స్నేహితురాలయిన ఒక తెల్లపిల్లను చూసి ‘ నీకన్నా చాల పెద్దదానిలా ఉందే ఈ అమ్మాయి ’ అన్నాను పొరపాటున. మా గ్రాండ్ డాటర్ చెవి పిండకుండానే నా చెవిలో చెప్పిన రహస్యం ‘ యూ ఎస్ లో ఎప్పుడూ ఎవరి ఏజ్ ప్రస్తావన తేవద్దు , వాళ్ళ పెళ్ళి గురించి , పిల్లల గురించి అస్సలు మాట్లాడొద్దు జాగ్రత్త ! వేముల ప్రభాకర్(చదవండి: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్) -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్మేన్ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్షాప్ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?
యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి. జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు. వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు. యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు. వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
అమెరికాలో ఘనంగా శ్రావణమాస మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు. డెలావేర్లోని మిడిల్ టౌన్లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
నలుమూలల సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే "పండుగ"!
యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నేపథ్యం ఎడిన్బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్తో కలసి ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు. ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
విశాఖలో శారీ వాక్థాన్
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన వస్త్రధారణపై నేటి యువతకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విశాఖ ఆర్కేబీచ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్థాన్ (చేనేత చీర నడక) నిర్వహించారు. భారీగా హాజరైన మహిళలతో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్థాన్ను ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ట్రేడిషనల్ వాక్, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
అడవితల్లికి ‘తొలి’ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు. వనంలో పూజలు.. అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు. కోడితో జాతకం.. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు. తుర్ర వాయింపు.. ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు. ఏత్మాసార్ పేన్కు పూజలు! అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు. -
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం
ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే. ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి. భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు. ఎంఎన్ రాయ్ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్ను దళితులు కనిపెట్టారు. అంబేడ్కర్ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ. భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది. గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది. అంబేడ్కర్ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్ చెప్పారు. మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానమైన అంశం. నిజానికి మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్ చెప్పారు. ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు. అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు. మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే... ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు. ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్: రోడ్మ్యాప్స్ ఫర్ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695 -
పాణిగ్రహణం.. దేశానికో సంప్రదాయం.. విదేశాల్లోని వింత సంప్రదాయాలివీ!
భారతదేశంలో వివాహం అనేది ఓ పవిత్ర కార్యం. రెండు హృదయాలను ఆలుమగలుగా మలిచే మనోహర ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే వివాహ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కాగా.. మరికొన్ని ఆధునికమైనవి. కొన్ని తెగల్లో ఇప్పటికీ బహుభార్యత్వం కొనసాగుతోంది. కొన్ని తెగల్లో బహుభర్తృత్వం కూడా ఉంది. కొన్నిచోట్ల వివాహానికి ముందే కాపురం చేసి పిల్లల్ని కూడా కనడం.. ఆ తరువాత నచ్చితే పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం వంటి పద్ధతులూ ఉన్నాయి. కాగా.. విదేశాల్లో అమలులో ఉన్న కొన్ని వింత సంప్రదాయాలివీ... సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ వివాహ సంప్రదాయాన్నీ, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటారు. అంత గొప్పది మన సంస్కృతి. అయితే జాతకాలను విశ్వసించే మన దేశంలో వధూవరులు పుట్టిన జాతకం (చార్ట్ మ్యాచింగ్) ఆధారంగా వివాహాలను నిశ్చయిస్తారు. వధువుకు కుజ దోషం ఉంటే.. భర్త చనిపోతాడనే నమ్మకం భారతదేశంలో ఉంది. దీనికి పరిహారంగా అమ్మాయికి చెట్టుతో పెళ్లి చేసి.. ఆ తరువాతే వరుడితో ముడిపెట్టడం ఆచారం. ఈ ప్రకారమే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకునే ముందు ఆమె మొదట ఒక చెట్టును వివాహం చేసుకుంది. ఒకవేళ వధువు ‘మంగ్లిక్’ అయితే శపించబడుతుందని నమ్ముతారు. కాగా.. వరుడి పాదరక్షల్ని దొంగిలించే (షూ గేమ్) విధానం భారతీయ వివాహ వేడుకల్లో ఒక సరదా. వధువు తరఫున యువతులు వరుడి పాదరక్షల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వరుడి సహచరులు వాటిని కాపాడతారు. ఒకవేళ వధువు సోదరీమణులు పాదరక్షల్ని దొంగిలించడంలో విజయం సాధిస్తే.. వాటిని తిరిగి పొందడానికి వరుడు డబ్బులివ్వాలి. భారతీయ వివాహాల్లో హెన్నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వధువు చేతికి ఎర్రగా పండే హెన్నా ఆమె భర్త ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. భారతీయ పెళ్లి తంతులో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు ఉంచుకోవడం.. వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వధువును విడిపించాలి రొమేనియాలో కొన్ని వివాహాల్లో వధువును స్నేహితులు, కుటుంబ సభ్యులు దాచడానికి ప్లాన్ చేస్తారు. భర్తను బెదిరించడానికి.. వధువును విడిపించడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. వరుడు ఆ మొత్తం చెల్లిస్తాడు. ‘టై’ ముక్కల వేలం స్పానిష్ వివాహ రిసెప్షన్ పార్టీలో వరుడి టైని ముక్కలుగా కోయడం కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. ఆ ముక్కలను వేలం వేస్తారు. వాటిని పాడుకున్న వ్యక్తి ఆ క్షణం నుంచి అదృష్టవంతుడవుతాడని భావిస్తారు. ముద్దాడాలి మరి స్వీడన్లో కొన్ని పెళ్లిళ్లలో వధువు గది నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుడిని ముద్దాడటానికి ఒంటరి మహిళలు క్యూలో ఉంటారు. వరుడు గదిని వధువు విడిచిపెట్టినప్పుడు యువకులు ముద్దాడుతారు. తెల్లటి డ్రెస్తో.. జపాన్లో అయితే.. పెళ్లి రోజున పైనుంచి కింది వరకు వధువు తెల్లటి డ్రెస్ ధరిస్తుంది. మహిళలు తెల్లని కిమోనోస్ ధరించి.. మేకప్ వేసుకుని.. వైట్ హుడ్ ధరిస్తారు. బరువు పెరిగితేనే.. పెళ్లికి ముందు అమ్మాయిలు స్లిమ్గా, ట్రిమ్గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం సాధారణం. కానీ.. మారిషస్లో మాత్రం కొందరు బరువు తగ్గడానికి బదులుగా.. లావు పెరగాలి. వధువు ఎంత లావుగా కనిపిస్తే అంత ధనవంతులుగా కనిపిస్తారని నమ్ముతారు. అలాంటి వారినే వరుడు వరిస్తాడు. ఫ్రెంచ్ పద్ధతి ఇలా.. ఫ్రెంచ్ దేశస్తుల్లో కొందరు వివాహ విందులో టాయిలెట్ బౌల్ నమూనా ఏర్పాటు చేస్తారు. బంధుమిత్రులు తాము తినగా మిగిలిన ఆహారాన్ని అందులో పడేస్తే.. వధూవరులు ఆ ఆహారాన్నే ఆల్కహాల్ కలుపుకుని విందు భోజనంగా తినాలి. గుండుగీసి.. కెన్యా దేశస్తుల్లో కాబోయే భార్యను వరుడు ఎంచుకోవడానికి కొందరి కుటుంబ సభ్యులు అంగీకరించరు. అతని కుటుంబమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. పెళ్లి రోజున వధువు జుట్టు పూర్తిగా తీసేసి గుండుగీసి, తలపై గొర్రె కొవ్వుతో రుద్దుతారు. స్కాట్లాండ్లో ఇదీ పద్ధతి కొత్తగా వివాహం చేసుకున్న స్కాటిష్ వధువులను బంధువులు కట్టేసే సంప్రదాయం కొందరు పాటిస్తారు. సాస్, చేపలు, గుడ్లు, పిండి మొదలైన వాటిని వారికి పూసి స్నానం చేయిస్తారు. శుభ్రం చేయాలి మరి.. జర్మనీలో అయితే.. కొన్ని పెళ్లిళ్లలో స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికి హాజరైన వారు నేలపై పింగాణీ పాత్రల్లో ఉన్న వంటకాలను నాశనం చేసి ప్లేట్లు పగులగొడతారు. వధూవరులిద్దరూ కలిసి దానిని శుభ్రం చేయాలి. నెలపాటు ఏడవాలి మరి వధువును బాణంతో కొట్టడం చైనా వివాహ సంప్రదాయంలో ఒకటి. పెళ్లి కూతుర్ని కొట్టడానికి పెళ్లికొడుకు మూడుసార్లు బాణాలను ప్రయోగిస్తాడు. పెళ్లిలో కాకున్నా వరుడు జీవితకాలంలో ఒకసారి వధువును ఇలా కొట్టవచ్చు. మరో ఆచారం ఇక్కడ ఉంది. పెళ్లి కుదిరిన తరువాత వధువు ఒక నెల పాటు క్రమం తప్పకుండా రోజూ ఓ గంటపాటు ఏడవాలి. మూడు వారాల ముందు ఆమె తల్లి, వారం గ్యాప్లో సోదరి, అమ్మమ్మ ఏడుపు మొదలు పెడతారు. -
7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది. -
మంచి మాట: నాణ్యతతో మాన్యత
నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి. నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి. నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది. గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది. ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది. ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి. కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి. నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి. నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం. – రోచిష్మాన్