![Shivraj Chouhan Ram-Ram Post Amid Madhya Pradesh Chief Minister Suspense - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/12/10/chowhan.jpg.webp?itok=jVl4UMss)
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది.
పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు.
ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment