-
బ్యాంకు అధికారులమంటూ టోకరా
ఏటీఎం కార్డు నంబర్ తెలుసుకొని రూ.5 వేలు డ్రా సంగెం : ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని గుర్తుతెలియని వ్యక్తి కోరగా అతడిని నమ్మి చెప్పడంతో రూ.5 వేలు అతడి ఖాతా నుంచి డ్రా అయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి శివారు సోమ్లాతండాకు చెందిన బానోత్ రాజేందర్కు ఈ నెల 15న సంగెం ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ 7808602755 నంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని కోరారు. అడిగినట్లుగా ఆ నంబర్లు చెప్పిన రాజేం దర్ సెల్ఫోన్కు తన ఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వచ్చి తనఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయిన విషయం బ్యాంకు అధికారులకు చెప్పడంతో తాము చేసేది ఏమి లేదని చేతులెత్తేశారు. దీంతో నెత్తినోరు బాదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఏమార్చి ఏటీఎం కార్డు కొట్టేశాడు!
జోగిపేట (మెదక్) : పక్క వ్యక్తి నుంచి తెలివిగా ఏటీఎం కార్డును కొట్టేసిన ఓ ఘనుడు అదే కార్డు నుంచి రూ.10వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఇది. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. అల్లాదుర్గం మండలం బిబిజీపూర్ గ్రామానికి చెంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లింగపురం రాములు ఆదివారం జోగిపేటలో బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం వద్ద చాంతాడంత లైను ఉంది. ఆ వరుసలో ముందు నిలబడి ఉన్న ఓ అపరిచితుడు.. తనకి ఏటీఎం కార్డు ఇస్తే డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ నమ్మబలికాడు. నిజమేననుకుని అతడి వంతు వచ్చేదాకా అక్కడే ఉండి..అతనితో కలిసి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. రాములు కార్డు ఇవ్వగా ఆ వ్యక్తి ఆ కార్డును తీసుకొని ఏటీఎం మిషన్లో పెట్టి తీసి సీక్రెట్ నంబరు కొట్టమని చెప్పాడు. ఆ నంబరును గుర్తుంచుకున్న అపరిచితుడు తర్వాతి ఆప్షన్లను తప్పుగా నొక్కి ఆ కార్డు పనిచేయడంలేదంటూ తన వద్ద నున్న మరో సీతారాం అనే పేరున్న ఏటీఎం కార్డును రాములు చేతిలో పెట్టి అక్కడి నుంచి నిష్ర్కమించాడు. అయితే, లైన్లోనే ఉన్న రాములు కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మిషన్లో కార్డు పెట్టగా వేరొక పేరు కనిపించింది. దీంతో రాములు అపరిచితుడి కోసం అటూఇటూ గాలించాడు. కనిపించకపోవడంతో వెంటనే తన ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలంటూ బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అతని సెల్కు రూ.10 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ అందింది. సోమవారం ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లగా స్థానిక క్లాక్టవర్ ఏటీఎంలో నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటీజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ తెలుసుకుంటామని ట్రైనీ ఎస్సై గౌతం తెలిపారు. -
‘గుండె’ను పిండిన దగా!
- కొడుకు గుండె పరీక్షకు దాచుకున్న డబ్బు - ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మాయం గట్టు : ఏటీఎం కార్డు రెన్యువల్ అంటూ ఓ ఫోన్ కాల్కు స్పందించిన పాపానికి కొడుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. గట్టు మండలం చింతలకుంటకు చెందిన వీరన్నకు మాచర్ల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. వీరన్న పెద్ద కుమారుడు సంతోష్(9) గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను డబ్బు పోగు చేసి రూ.15,200 ఖాతాలో వేశాడు. హైదరాబాద్కు వెళ్లే క్రమంలో డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుందని భావించి ముందు జాగ్రత్తగా ఖాతాలో వేసి ఏటీఏం కార్డును తీసుకున్నాడు. ఇదే క్రమం లో శుక్రవారం ఉదయం 99340 41804 నంబర్ నుంచి వీరన్న సెల్కు కాల్ వచ్చింది. ఆంధ్రాబ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాలని కోరడంతో వాటిని సదరు వ్యక్తికి తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత అతని సెల్కు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వెంటనే మాచర్లలోని ఆంధ్రాబ్యాంక్ అధికారులకు విషయం చెప్పినా ఏమి చేయలేమని చేతులేత్తేసినట్లు బాధితుడు తెలిపాడు. జరిగిన మోసంపై గట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దృష్టి మళ్లించి.. కార్డు మార్చేసి !!
ఏటీఎం కేటుగాడి అరెస్టు రూ. 77 వేలు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం పంజగుట్ట: ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవ లం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌం ట్లో రూ. 40 వేలు ఉన్నాయి. ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు. నాగేశ్వర్రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ‘‘ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు ప్రేమ్నగర్కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ‘‘ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్లో పెట్టి మినీ స్టేట్మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు. చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..'
ఆస్ట్రేలియా: కనిపించకుండా పోయిన ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రాచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బహుశా ఆ యువతిని డబ్బు డ్రా చేసిన వ్యక్తే చంపేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన జోడీ మేయర్స్ అనే యువతి ఆగస్టు 26న కనిపించకుండా పోయింది. మరుసటి రోజే ఆ అమ్మాయికి చెందిన బ్యాంక్ ఎస్ఏ ఏటీఎం కార్డు ద్వారా మార్గరెట్ ఆర్చర్ (55) అనే మహిళ డబ్బులు డ్రా చేసింది. అయితే, ఈ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు గతవారం మేయర్స్ చాలా రోజు నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆమె చనిపోయి ఉందని తాము నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అలా చెప్పిన వారం తర్వాత తాజాగా మార్గరెట్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేయర్స్ ఆగస్టు 26న ఇంటి నుంచి బయలు దేరేముందు తన జీవిత భాగస్వామి నెయిల్ అర్చర్తో వెళ్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అతడిని అనుమానితుడిగా చేర్చడం లేదని పోలీసులు తెలిపారు. మున్ముందు దర్యాప్తులో ఏ మార్పు జరుగుతుందో చెప్పలేమని తెలిపారు. కాగా, మార్గరెట్ బెయిల్ తీసుకొని విడుదలైంది. తిరిగి ఈ నెల 30న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. -
బ్యాంకు అధికారినంటూ టోకరా
ఏటీఎం నుంచి రూ.43వేలు డ్రా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సిరిసిల్ల : బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసి ఆధార్ నంబర్ చెప్పాలి.. లేదంటే మీ ఏటీఎం కార్డు పనిచేయదని బెదిరించి రూ.43వేలు డ్రా చేసిన సంఘటన ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన రాగుల దేవయ్యకు ఎస్బీహెచ్ సిరిసిల్ల శాఖలో ఖాతా ఉంది. ఆయనకు బ్యాంకు అధికారులు ఏటీఎం ఇచ్చారు. రెండురోజుల క్రితం దేవయ్యకు ఒకరు ఫోన్ చేసి ‘ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. నీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాలేదు.. నంబర్ చెప్పాలి.. లేదంటే నీ ఏటీఎం కార్డు పనిచేయదు’ అని అన్నాడు. దీంతో ఆందోళన చెందిన దేవయ్య ఆధార్ నంబర్ చెప్పాడు. బ్యాంకు ఏటీఎం కార్డుపై ఉన్న సీరియల్ నంబర్ సైతం చెప్పాలనగా అదికూడా చెప్పేశాడు. మీ సెల్ఫోన్కు మరో మెసేజ్ వస్తుంది.. మళ్లీ ఫోన్ చేస్తానంటూ పెట్టేశాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి నీ ఫోన్కు వచ్చిన మెసేజ్లో ఉన్న నంబర్ చెప్పమనగా బ్యాంకు అధికారే మళ్లీ ఫోన్ చేశాడని భావించి మెసేజ్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాడు. తర్వాత దేవయ్య ఏటీఎం కార్డుతో బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.43 వేలను డ్రా అయినట్లు ఉంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అపరిచిత వ్యక్తిపై అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి మోసాలు జిల్లా వ్యాప్తం గా ఇటీవల పెరిగిపోయాయి. జాగ్రత్తగా ఉండాలని, పిన్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
పంచాయతీ ఏఈకి ‘సైబర్’ టోకరా
- ఖాతా నుంచి రూ. 40 వేలు మాయం - కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని బురిడీ తాండూరు రూరల్: ఓ సైబర్ నేరగాడు పంచాయతీ ఏఈకి టోకరా వేశాడు. కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని ఆయన నుంచి వివరాలు తీసుకొని ఖాతా నుంచి దాదాపు రూ. 40 వేలు మాయం చేశాడు. ఈ సంఘటన తాండూరు మండలంలో అలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. తాండూరు మండల పంచాయతీ ఏఈగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహహ్మద్ ఇషాక్ పని చేస్తున్నారు. ఈ నెల 4న ఆయన విధుల్లో ఉండగా 7050009820 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఁనేను శరణ్జిత్శర్మ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు చెడిపోయింది.. కొత్త కార్డు ఇస్తున్నా ము... కార్డు వివరాలు చెప్పండి అని అన్నా డు. దీంతో తన ఏటీఎం కార్డు నిజంగానే చెడిపోయిందేమోనని భావించిన ఏఈ ఇషాక్ వివరాలు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ నెల 6న ఇషాక్ డబ్బుల అవసరం రావడంతో తాం డూరు పట్టణంలోని ఏటీఎంకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో స్టేట్ బ్యాం క్ ఆఫ్ హైదరాబాద్ తాండూరు బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి ఏఈ ఇషాక్కు తెలియకుండా ఓసారి రూ.31,990, మరోసారి రూ.8,800 డ్రా చేసుకున్నట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. -
ఏమార్చి... ఏటీఎం కార్డు మార్చి...
లంగర్హౌస్(హైదరాబాద్): ఏటీఎం కేంద్రంలో దృష్టి మరల్చి ఓ వ్యక్తి ఏటీఎంను కొట్టేశారు.. దానిని వాడుకుని రూ.61 వేలు డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... లంగర్హౌస్ బాగ్దాద్ కాలనీ నివాసి సుభాన్ ప్రై వేట్ ఉద్యోగి. సోమవారం అతడు నానల్నగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. కార్డుతో డబ్బు డ్రా చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో వరుస క్రమంలో ఉన్నట్లుగా వెనక కొందరు ఉండగా ఇద్దరు వ్యక్తులు అతనికి చెరో వైపు చేరారు. తాము సహకరిస్తామంటూ వారిద్దరూ అతని చేతిలో ఏటీఎం కార్డును యంత్రంలోకి పెట్టి తీసి, పిన్ నంబర్ కొట్టమన్నారు. అనంతరం 3 వేల నగదు సుభాన్ డ్రా చేశాడు. ఆపై వారి వద్ద నుంచి తన ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేయడానికి సుభాన్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కార్డు పని చేయడం లేదని తెలిసింది. అప్పటికీ గమనించని అతను తన కార్డు పని చేయడంలేదని బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది చూసి... డబ్బు డ్రా అయినట్లు చెప్పటంతో లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం కేంద్రంలో సాయం చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి..పనికిరాని కార్డును తనకు అంటగట్టి వెళ్లిపోయారని, తన కార్డును వాడుకుని ఖాతాలోని రూ.61 వేలు డ్రా చేసుకున్నారని పేర్కొన్నాడు. -
పోలీసుల అదుపులో ఏటీఎం కార్డు దొంగ !
మందస: ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బును డ్రా చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చిన్నకేసుపురం గ్రామానికి చెందిన మడియా హేమలత డబ్బులు తీసేందుకు హరిపురం ఎస్బీఐ ఏటీఎంకు వచ్చింది. అయితే ఆమెకు ఆపరేటింగ్ తెలియక పోవడంతో ఇతరుల సహాయం కోసం వేచిఉంది. ఇదే సమయం ఓ యువకుడు రావడంతో హేమలత అతనికి ఏటీఎం కార్డును ఇచ్చి రూ.1000 తీయించారు. ఇదే అదనుగా ఆ యవకుడు అదే రంగులో ఉన్న వేరే ఏటీఎం కార్డును ఆమెకు ఇచ్చాడు. అది గమనించని హేమలత దాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అక్కడికి కొన్ని గంటల తరువాత తన అకౌంట్ నుంచి రూ.25 వేలు విత్డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే హేమలత గురువారం మందస వచ్చేందుకు హరిపురంలో ఆటో ఎక్కగా అందులో ఏటీఎం దగ్గర సాయం చేసిన యువకుడు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అయితే మందసలో ఆటో ఆగిన వెంటనే యువకుడు పారారయ్యేందుకు ప్రయత్నించగా హేమలత అతన్ని పట్టుకున్నప్పటికీ ఆమె నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేయడంతో అప్రమత్తమైన సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెతికారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులను గుర్తించలేని ఆ యువకుడు హరిపురం అర్జంట్గా వెళ్లాలని, తనను డ్రాప్ చేయాలని ఒడియా భాషలో అడిగాడు. అతని తొందరపాటును గ్రహించిన పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకువచ్చారు. సీఐ దృష్టిలో ఈ విషయాన్ని పెట్టామని, ఆయన వచ్చాక యువకుని పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ మోసం
పెదవాల్తేరు: బ్యాంకు అధికారినని చెప్పి ఫోన్లో ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకుని.. దర్జాగా రూ.10 వేల విలువైన ఆన్లైన్ షాపింగ్ చేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీకాలనీకి చెందిన సిహెచ్ అప్పారావు రిటైర్డ్ ఉద్యోగి. అతనికి స్టేట్బ్యాంక్లో ఖాతా ఉంది. ఈనెల 11న మధ్యాహ్నం 85810 58891 నంబరు నుంచి అప్పారావుకు ఫోన్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. ‘మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల’ని తెలిపి ఆధార్ కార్డు నంబర్ అడిగాడు. తర్వాత ఏటీఎం కార్డుపై ఉన్న పదహారు అంకెలు చెప్పమన్నాడు. ఏటీఎం కార్డు మరో వైపు ఉన్న చివర మూడు అంకెలు తెలపాలని అడగ్గా అప్పారావు నంబర్లు చెప్పారు. ఏటీఎం కార్డు నంబర్ చెప్పగానే అతను ఫోన్ కట్ చేశాడు. పది నిమిషాలకే మోబి క్విక్ ఆన్లైన్ షాపింగ్లో రూ.9999 చెల్లించినట్టు అప్పారావు ఫోన్కు సందేశం రావడంతో అవాక్కయ్యాడు. వెంటనే తనతో మాట్లాడిన వ్యక్తి నంబర్కు డయల్ చేయగా ఆ నంబర్ పనిచేయలేదు. దీంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్'
అలహాబాద్ : ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లి సదరు మెషిన్లో కార్డును ఇన్సర్ట్ చేయగానే బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోజంగాయిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉల్కిపడిన బ్రిజేష్... బ్యాంక్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు సదరు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగంబర్ కుష్వాన్ మాట్లాడుతూ... బ్రిజేష్ కుమార్ వర్షంలో పూర్తిగా తడిసి... ఏటీఎంలో నగదు డ్రా చేసే ప్రయత్నంలో షాక్ కొట్టి ఉంటుందని తెలిపారు. అదికాక ఏటీఎం ఉన్న భవంతి అత్యంత పురాతనమైనదని... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవంతి పూర్తిగా తడిసిపోయిందని వెల్లడించారు. అంతేకాకుండా మెషిన్లో వైరింగ్ తేడా వల్ల కూడా ఇలా జరిగే అస్కారం ఉండవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది మెషిన్ను పరిశీలిస్తున్నారని చెప్పారు. -
ఏటీఎం కార్డులో నగదు చోరీ
మెదక్ (సిద్దిపేట రూరల్): ఏటీఎం పోవడంతో అందులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఈ సంఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు సోమవారం రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన కూరెళ్ల మల్లారెడ్డి కుటుంబ సమేతంగా మే 26న తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. దర్శనానంతరం అదే నెల 31న ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అతన్ని వద్ద ఎస్బీఐ ఏటీఎం కనపడకుండా పోయింది. వెంటనే బాధితుడు స్థానిక ఎస్బీహెచ్ బ్రాంచ్కు వెళ్లి అతని అకౌంట్ వివరాలు తెలుసుకున్నాడు. తిరుమలలో రూ. 40వేలు, విజయవాడలో రూ. 40వేలు, భువనగిరిలో రూ. 48వేలను డ్రా చేశారు. దీంతో బాధితుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఏటీఎం పిన్ నెంబర్ అడిగి...
నల్లగొండ : బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు అడగటంతో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పేశాడు. దీంతో అతని ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ విషయాన్ని సదరు మోసగాడు తెలుసుకుని... మాయం చేసిన నగదును తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాకు బదిలీ చేశాడు. నల్లగొండ పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన దాదాబాషా బత్తాయి వ్యాపారి. అతనికి గురువారం ఓ వ్యక్తి బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేశాడు. సాంకేతిక కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని...పిన్ నంబర్ చెబితే సరి చేస్తానని నమ్మబలికాడు. దీంతో దాదాబాషా తన ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. ఆ వెంటనే సదరు వ్యక్తి అతని ఖాతాలో ఉన్న రూ.5 లక్షలను తన ఖాతాలోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా మార్చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాదాబాషా బ్యాంకుకు వెళ్లి... డబ్బు డ్రా చేయబోగా నగదు లేదని సమాచారం వచ్చింది. దీంతో అతడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. ఆయన సూచన మేరకు డీఎస్పీని కలిసి విషయం వివరించాడు. దాంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేసి... నగదు మాయం చేసిన ఆగంతకుడి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో ప్రమాదం శంకించిన మోసగాడు రూ.5 లక్షలను తిరిగి దాదాబాషా ఖాతాకు జమ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయం చేయమంటే మోసం చేశాడు
ఏటీఎం విత్డ్రాలో రూ.7వేలు మోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పలమనేరులో కార్డు చేతిలోపెట్టి ఉడాయించిన ఘనుడు పలమనేరు: ఏటిఎంలో డబ్బు డ్రా చేసి ఇవ్వాలని ఓ మహిళ క్యూలో ముందున్న వ్యక్తికి ఏటీఎం కార్డు ఇవ్వడంతో అతను ఆమె అకౌంట్లోని మొత్తం సొమ్మును డ్రాచేసి మోసగించిన సంఘటన శుక్రవారం పలమనేరులో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన దాము భార్య భారతి స్థానిక బజారువీధిలోని ఏటీఎంలో రూ.1000 డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. అయితే ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బును డ్రా చేసుకునేది తెలీక క్యూలో తన ముందున్న ఓ వ్యక్తికి కార్డును ఇచ్చిన రూ.1000 డ్రాచేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆమె కార్డును దాని వెనుకనున్న పిన్ నెంబర్ను తెలుసుకున్న అపరిచిత వ్యక్తి తొలుత బ్యాలెన్స్ను చూసి అందులో రూ.8,300 ఉండగా, 8వేలను డ్రా చేశాడు. ఆమెకు రూ.1000, ఏటీఎం కార్డును చేతిలో పెట్టి ఏడు వేలతో అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రావడంతో దాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తికి చూపెట్టి తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడమని కోరింది. అయితే రూ.300 మాత్రమే బ్యాలెన్స్ అందులో ఉందని, ఎస్ఎంఎస్ను చూసిన వ్యక్తి ఆమెకు తెలిపాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు చుట్టుపక్కల చూసినా అపరిచిత వ్యక్తి కనిపించలేదు. దీంతో జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏటీఎం కార్డుతో మోసగాడి ఉడాయింపు
రూ.38 వేల నగదు డ్రా విశాఖపట్నం: ఏటీఏంలో డబ్బు తీసేందుకు వచ్చిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడికి సహాయపడుతున్నట్టు నటించి టోకరా వేసి పరారయ్యాడో మాయగాడు. దువ్వాడ జోన్ పోలీస్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులకు బాధితుడు అందించిన ఫిర్యాదు మేరకు వివరాలివి. విజయనగరం జిల్లాకు చెందిన రిటైర్ట్ ప్రధానోపాధ్యాయుడు ఎ.హరినారాయణ కూర్మన్నపాలెం వుడా ఫేజ్-7లో నివసిస్తున్న కుమారుని ఇంటికి వచ్చారు. రాజీవ్నగర్ వైఎస్సార్ కూడలిలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో శుక్రవారం ఉదయం డబ్బులు తీసేందుకు వెళ్లారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో డబ్బులు రాలేదు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఘరానా మోసగాడు హరినారాయణ ఏటీఎం కార్డుతో డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించాడు. అనంతరం తన చేతిలోని అలాంటి కార్డు హరినారాయణకు అప్పగించి పరారయ్యాడు. వెళ్లిన పది నిమిషాల్లోనే కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్లోని ఏటీఎంలో రూ.38 వేలు విత్డ్రా చేశాడు. నగదు ఏటీఎం ద్వారా డ్రా కాకపోవడంతో సమీపంలోని బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు పాస్పుస్తకాన్ని అప్డేట్ చేయించగా, నగదు వేరే ఏటీఎంలో విత్డ్రా అయినట్టు గుర్తించారు. కార్డును మార్చేసి మోసగించినట్టు గుర్తించిన బాధితులు దువ్వాడ జోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్లో నిందితుని గుర్తింపు రాజీవ్నగర్, కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్లలోని ఏటీఎంల్లోని ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించామని ఎస్బీహెచ్ మేనేజర్ సమిత బాగ్ తెలిపారు. బాధితునికి చేతిలో పెట్టిన ఏటీఎం కార్డు వాస్తవానికి నిందితునిది కాదన్నారు. -
మాతృమూర్తిపై మానవత్వం మృగ్యం
రాజవోలు (రాజమండ్రిరూరల్) :ఆమె ముగ్గురు బిడ్డలకు కన్నతల్లి. పిల్లలను కంటికి రెప్పలా సాకింది. మూడు నెలల క్రితం భర్త కన్నుమూయడంతో ఆ బెంగతో ఆమె మంచం పట్టింది. ఒంటిపై పుండు ఏర్పడి దుర్వాస వస్తోంది. ఆ దశలో ఆమెను వంటరిగా వదిలేశారు ఆమె బిడ్డలు. ఆమెకు వచ్చే పింఛన్ను అనభవిస్తూ ఆమెకు కనీసం ఆసరాగా నిలవని ఆమె సంతానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... రాజవోలు ఎస్సీపేటకు చెందిన ఎలక్ట్రికల్ ఉద్యోగి అంబటి భీమ్సింగ్ విద్యుత్శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసి మూడు నెలల క్రితం మృతిచెందాడు. ఆ బెంగతో అతని భార్య అంబటి మేరీరత్నం అనారోగ్యంతో మంచానపడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ప్రశాంత్కుమార్(దొరబాబు), ప్రవీణ్(నాని), కుమార్తె ప్రసన్నకుమారి ఉన్నారు. పెద్దకుమారుడు దొరబాబు జి.మామిడాడలో, కుమార్తె ప్రసన్నకుమారి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉంటున్నారు. చిన్న కుమారుడు ప్రవీణ్ రాజమండ్రిలో ఉంటున్నాడు. మేరీరత్నం గ్రామంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలు వద్ద తన ఇంట్లో ఉంటోంది. ఆమెకు రూ. 18 వేలు పింఛన్ వస్తోంది. దానికి సంబంధించిన ఏటీఎం కార్డు ప్రవీణ్ వద్దే ఉంది. ఆమెను ఇంటి వరండాలోనే ఒక మంచంపై పడుకోబెట్టారు. ప్రవీణ్ ఈమధ్యనే మేరీరత్నానికి వైద్యం చేయించి ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె లేవలేని పరిస్థితిలో ఉండగా ఒంటిపై పుండు ఏర్పడింది. ఆ పుండు నుంచి వస్తున్న దుర్వాసనను చుట్టుపక్కలవారు భరించలేకపోయారు. దీంతో ఈవిషయాన్ని స్థానికులు ప్రవీణ్కు ఫోన్చేసి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు రూరల్ తహశీల్దార్ జి.భీమారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన వీఆర్వో భాస్కరరామారావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావులను ఆమె ఇంటికి పంపించారు. వారు స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఎవరైనా మేరీరత్నానికి అన్నంపెడితే మీరే చూడండి అంటూ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడని వారు తెలిపారు. ప్రవీణ్కు వీఆర్వో ఫోన్చేసి వెంటనే వచ్చి మీతల్లిని ఆస్పత్రిలో చేర్పించాలని, లేని పక్షంలో తామే ఆస్పత్రిలో చేర్పిస్తామని తెలిపారు. దానికి ప్రవీణ్ సాయంత్రం వచ్చి తనతల్లిని ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పాడని ఆయన తెలిపారు. అయితే రాత్రి 9 గంటల వరకు అతను తల్లివద్దకు రానేలేదు. దీనిపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
కంటికి కనపడరు.. కన్నమేస్తారు మారుతున్న కాలానుగుణంగా ఆధునిక పరిజ్ఞానం కూడా కొంత పుంతలు తొక్కుతోంది. అదేస్థాయిలో నేరాలు కూడా దడ పుట్టిస్తున్నాయి. బ్యాంకు ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంటుంది.. కానీ ఖాతాలో నగదు ఖాళీ అవుతుంది. ఫేస్బుక్ మనం వాడకపోయినా.. మన అకౌంట్ పేరిట వాళ్లు వాడుతుంటారు. మెయిల్ పాస్వర్డ్లు, అన్నీ హ్యాక్ చేస్తుంటారు వారే సైబర్ నేరగాళ్లు. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. న్యూఢిల్లీ: ఏడాది కిందట ఓ వ్యక్తి ఆధునిక పరిజ్ఞానంతో ఇతరుల ఏటీఎం కార్డులకు నకిలీలను త యారుచేసి సొమ్ము డ్రా చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్బుక్ను వినియోగిస్తున్న వారికి తెలియకుండానే వారి ఫేస్బుక్ అకౌంట్నుంచి ఇతరులకు అసభ్యకర సందేశాలు, అసభ్యకర ఫొటోలు అప్లోడ్ చేయడంతో ఈ ఘటనలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా కొంతకాలంగా నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఏవైనా పొరపాటు జరిగితే కటకటాలు లెక్కించేది మనమే. మీ నంబర్ బంపర్ లాటరీకి సెలెక్ట్ అయిందనీ, కోట్లు వచ్చాయని... వెంటనే సొమ్ము డ్రా చేసుకొమ్మని లోకల్ నంబర్ నుంచి సెల్కు ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెయిల్కు కూడా ఇలాంటి మెసేజ్లే వస్తుంటాయి. కోట్లు డ్రా తగిలిందిగా... అనే సంబరంలో వారడిగిన వివరాలు ఇచ్చామా.. అంతే... ఇక మన పనిగోవిందా.. ఇలాంటి సైబర్ నేరాలు తరచూ విని ఆశ్చర్యపోతుంటాం. సైబర్ నేరాలకు శిక్ష, వాటి బారినుంచి రక్షణ పొందడంపై ఈ ప్రత్యేక కథనం. నిజజీవితంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ నిత్యావసరంగా మారింది. ఇంటర్నెట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంతవరకు ప్రతి సందర్భంలోనూ నెట్ వాడుతుంటాము. స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. సెల్లో నెట్ అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. దీంతో నేరాలు సైతం ఎక్కువగా నమోదువుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇతరుల సాఫ్ట్వేర్లు, మెయిల్స్ను హ్యాక్చేసి వాటిని వినియోగించుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు, క్రీడాకారులు, బ్యాంకులు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మెయిల్ ఫిషింగ్ ఈ మెయిల్ హ్యాకింగ్ రెండురకాలు. మనం మెయిల్ ఉపయోగించే ముందుగానే నకిలీ పేజీ ఒకటి సృష్టించి ఉంచుతారు. అందులో మన చిరునామా, ఈ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ నమోదుచేసి చూస్తే పేజీ కెనాట్ బీ ఓపెన్ అని వస్తుంది. దీంతో మనం నెట్వర్క్ సమస్య ఉందని వదిలేస్తాం. కానీ ఈలోపే మన వివరాలు, ఈ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ హ్యాకర్ల కంప్యూటర్లో నమోదవుతాయి. మనం మళ్లీ ఈమెయిల్ ట్రైచేస్తే ఎప్పటిలాగానే ఓపెన్ అవుతుంది. ఆ తరువాత మెయిల్స్ చెక్ చేసుకుని సైన్ అవుట్ చేసేస్తాం. కానీ మన వివరాలు సేకరించిన హ్యాకర్లు మన పనిని నిశితంగా గమనిస్తుంటారు. మనం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు వారికి తెలిసిపోతూ ఉంటుంది. దీని ద్వారా విలువైన సమాచారం, పాస్వర్డ్స్, బ్యాంకు ఖాతాల వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. మనకు తెలియకుండానే మెయిళ్లు వెళుతుంటాయి. మనం ఉపయోగించినట్టే సులభంగా లాగిన్ అవుతారు. తీవ్రంగా నష్టపోవడంతో పాటు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫేస్బుక్ అవుతారు ఫేస్బుక్ వినియోగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న బుక్ అవడం ఖాయం. ఇటీవల ఫేస్బుక్ పాస్వర్డ్లను తెలుసుకొని కొందరు అపరిచితులు అసభ్యచిత్రాలను అప్లోడ్ చేస్తున్న సంఘటనలు జిల్లాలో వెలుగుచేశాయి. ఇటీవల ఫేస్బుక్లో ఎలాంటి అడ్డూ లేకుండా పలు చిత్రాలు, మెస్జేలు వస్తుండేవి. వీటికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఐటీ యాక్టును బలోపేతం చేసింది. ఏటీఎం క్లోనింగ్: ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డులు విచ్చలవిడిగా క్లోనింగ్కు గురవుతున్నాయి. ఏటీఎం మాదిరిగానే మరో ఏటీఎం కార్డును హ్యాకర్లు తయారుచేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇదెలాగంటే... మొదట నేరగాళ్లు వారు ఎంచుకున్న వ్యక్తి కదిలకలపై నిఘా ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రాచేసే సమయాన్ని గమనిస్తారు. స్కిమ్మర్ అనే పల్చని పొర ఉన్న పేపర్ను ముందుగానే ఏటీఎం మెషీన్లో ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎం ఉపయోగించి డబ్బు డ్రా చేసినప్పుడు కార్డు వివరాలు, ముద్రలు ఆ పొరమీద అచ్చుగుద్దినట్లు కనపడుతాయి. స్కిమ్మర్తోపాటు అక్కడ రహస్యంగా ఏర్పాటుచేసిన కెమేరా ఆ వ్యక్తి కీబోర్డును ఉపయోగించిన ఫొటోలు తీస్తుంది. దీని ద్వారా పిన్నంబర్ను నేరగాళ్లు ఈజీగా తెలుసుకుంటున్నారు. స్కిమ్మర్లో నమోదైన వివరాలతో మరో ఏటీఎం కార్డును తయారు చేసి దానికి ఉన్న ప్రత్యేకమైన, రహస్య అంకెలను బ్రూట్ఫోర్సు విధానంతో తెలుసుకుంటారు. దీంతో యథేచ్ఛగా నగదు డ్రా చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచే సుకుంటున్నాయి. బ్యాంకు అకౌంట్ నుంచి మనకు తెలియకుండానే డబ్డు డ్రా అయినట్లు భావిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారికి తెలియజేయాలి. వారు మన ఫిర్యాదును ఆన్లైన్ ద్వారా ఏజీఎంకు పంపుతారు. ఫిర్యాదుపై స్పందించిన సైబర్ పోలీసులు నిందితులపై కేసు నమోదుచేస్తారు. వారి నుంచి ఎఫ్ఐ ఆర్ నకలును తీసుకోవాలి. -
మీ ఏటీఎం కార్డు పోయిందా?
న్యూఢిల్లీ: రంజిత్ హైదరాబాద్ నుంచి కర్నూల్కు రైలులో బయల్దేరాడు. ప్రయాణంలో అతని ఏటీఎం కార్డు పోయింది. అందులో అధిక మొత్తం ఉండడంతో ఆయనలో ఆందోళన పెరిగింది. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురైతే ఏం చేయాలి. ఇలాంటి సందర్భాల్లో మీకు సహాయం అందించేందుకు ప్రతి బ్యాంకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలూ వినియోగదారుల సేవకు సిద్ధంగా ఉంటాయి. సంబంధిత నెంబర్కు ఫోన్ చేసి మీరు అకౌంట్ నెంబర్, వివరాలు తెలియపరిస్తే మీ అకౌంట్ లావాదేవీలను తక్షణమే నిలిపివేస్తారు. మీకు ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉందా..! ప్రతి బ్యాంకు ఇప్పుడు వినియోగదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కొత్తగా ఖాతా తెరిచే వారికి దరఖాస్తులోనే దాన్ని పొందుపరిస్తే ఈ సౌకర్యం వర్తిస్తుంది. పాత ఖాతాదారులు ఆయా బ్రాంచ్లకు వెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే ఈ సౌకర్యం పొందవచ్చు. ఖాతాలో డబ్బు డ్రా/జమ చేసినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు సంబంధిత వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తాయి. బ్యాంకు పేరు టోల్ ఫ్రీ నెంబర్ ఎస్బీఐ - 1800112211 ఎస్బీహెచ్ - 18004251825 హెచ్డీఎఫ్సీ - 99494 93333 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 18002 22244 కరూర్ వైశ్యా బ్యాంక్ - 186020 01916 ఆంధ్రాబ్యాంక్ - 18004 252910 -
కార్డు పోతే..?
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం... పాన్కార్డు... ఈ రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సామాన్యులు సైతం పాన్కార్డు తీసుకుంటున్నారు. దీన్ని పోగొట్టుకుంటే దీనికి సంబంధించిన ఏజెన్సీలో ఫిర్యాదు చేయాలి. దీనికి పాన్కార్డు నంబర్, కలర్ఫొటో, నివాస ధృవీకరణపత్రం లేదా రేషన్కార్డు జిరాక్స్ జతచేయాలి. దరఖాస్తుకు రూ.5, మరో కార్డు మంజూరు చేసేందుకు రూ.60 వసూలు చేస్తారు. విచారించి 20 రోజుల్లోపు పాన్కార్డు పంపిస్తారు. రేషన్కార్డు పోతే... ప్రస్తుతం రేషన్కార్డు ప్రాధాన్యత ఎక్కువే. దీని ద్వారా సరుకులు పొందడంతో పాటు, బ్యాంకు అకౌంట్లు, సిమ్కార్డులు పొందటం ఇలాంటి వాటన్నింటికీ దీన్నే ఉపయోగిస్తారు. ఒకవేళ రేషన్కార్డు పోగొట్టుకుంటే ముందుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దానికోసం రూ.10 లేదా 20 చెల్లిస్తే దీని స్థానంలో మరోకార్డును అందజేస్తారు. ఇలాగే ఓటరు గుర్తింపు కార్డు కూడా పొందవచ్చు. ఒకవేళ కార్డు నంబర్ తెలిసి ఉంటే అప్పటికప్పుడే మీ సేవాలో నామమాత్రపు ఖర్చుతో పొందవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం... పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు. ఏటీఎం కార్డయితే... ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముందుగా మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్కోడ్ నంబర్ ఇస్తారు. -
కార్డు కాజేసి.. క్యాష్ డ్రా చేసి..
సాయం కోరితే ఓ ఎస్.. అన్నాడు. పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. కళ్లు గప్పి కార్డు మార్చేశాడు. తర్వాత బాధితుడి కార్డుతో వారం రోజుల్లో విడతలు విడతలుగా రూ.1.89 లక్షలు డ్రా చేసుకున్నాడు. మళ్లీ డబ్బులు అవసరమై శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన అసలు ఖాతాదారుడు ఖాళీ ఖాతా వెక్కిరించడంతో లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. 1.89 లక్షల స్వాహా చేసిన ఘనుడు రణస్థలం, న్యూస్లైన్: ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలో సహాయం చేసినట్లు నటించి ఏటీఎం కార్డు తస్కరించిన ఓ ఆగంతకుడు సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు విత్డ్రా చేశాడు. విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... లావేరు మండలం లింగాలవలసకి చెందిన లుకలాపు అప్పలనాయుడికి రణస్థలంలోని ఎస్బీఐలో 32033222913 నంబరుతో ఖాతా ఉంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడంతో ఆ సంస్థ యాజమాన్యం అప్పలనాయుడు ఖాతాలో ఈ నెల 3న రూ.2 లక్షలు జమచేసింది. అదేరోజున అప్పలనాయుడు డబ్బులు తీసుకోడానికి రణస్థలంలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. మూడు విడతలుగా రూ.35 వేలు తీసుకున్న తర్వాత ఆగంతుకుడు అప్పలనాయుడుకు వేరొకరి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిని అప్పలనాయుడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బలు అవసరమై ఏటీఎంకు వెళ్లగా డబ్బులు రాకపోవడంతో అప్పలనాయుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా కార్డు టిబిక్రమ్ ప్రధాన్ది అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. ఖాతాలో నిల్వ ఎంత ఉన్నదీ వాకబుచేయగా రూ.2 లక్షలకు రూ.71 మాత్రమే ఉండడంతో విస్తుపోయిన అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పై ఎల్.సన్యాసినాయుడు బ్యాంకుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్లో ఆగంతుకుడి ఆనవాళ్లు గమనించారు. అప్పలనాయుడి నుంచి ఏటీఎం కార్డు తస్కరించిన వ్యక్తి 3వ తేదీన కోస్టలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసుకోవడమేకాకుండా మహాబీర్ ప్రధాన్ అనే వ్యక్తి ఖాతాకి రూ.20 వేలు బదిలీ చేశాడు. 4వ తేదీన ఒడిశా రాష్ట్రం జైపూర్లోని హోటల్ ప్రిన్స్ ఏటీఎం నుంచి రూ.40 వేలు, 5న కోరియా బైపాస్ దికానా ఏటీఎం నుంచి మూడు విడతల్లో రూ.35 వేలు డ్రా చేశాడు. అలాగే మహాబీర్ ప్రధాన్ ఖాతాకి మరోకసారి రూ.20 వేలు బదిలీ చేశాడు. 6న చండోల్ ఏటీఎం నుంచి రూ.30 వేలు, 7న జైపూర్ ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేశాడు. మొత్తంమీద 3వ తేదీ నంచి 7వ తేదీ వరకూ అప్పలనాయుడి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు డ్రాచేశాడు. ఒకే ఖాతాకు రెండుసార్లు నగదు బదిలీ చేసినందుకు నిందితుడు దొరికిపోతాడని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
రైతులకు రూపాయి కార్డు
మరికల్ , న్యూస్లైన్ : రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మొట్టమొదటిసారిగా దేశంలోనే మనరాష్ట్రంలో రైతులకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రూపాయి కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి వెల్లడించారు. సహకార సంఘాల్లో రుణాలు పొందే ప్రతి రైతుకు ఏటీఎం కార్డులను ఆరునెలల్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా జిల్లాలో 46 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. దన్వాడ మండలం తీలేర్ గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో మాట్లాడారు. నాబార్డు సౌజన్యంతో సహకార సంఘాల్లో టాక్స్ను అమలుపర్చి వాటి అభివృద్ధి కోసం, రైతులకు మరింత దగ్గర కావడం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నాబార్డు సౌజన్యంతో రూపాయి కార్డు ప్రవేశపెట్టే సీబీఎస్ సంస్థ యజమాన్యంతో ఈనెల 29న ముగ్గురు డెరైక్టర్లు, 13మంది అధికారులు చర్చలు జరుపుతారని తెలిపారు. మహారాష్ట్రలోని రాయికాడ్ బ్యాంకులో సీబీఎస్ పద్ధతి ప్రవేశపెట్టడంతో నష్టాల్లో ఉన్న బ్యాంకు లాభాల బాటలోకి వచ్చిందన్నారు. రూపాయి కార్డు ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చి ఏ బ్యాంకు ద్వారానైనా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఇప్పటికే ఖరీఫ్లో రైతులకు రూ.250 కోట్ల రుణాలు ఇవ్వగా, ప్రస్తుత రబీలో రూ.180 కోట్ల రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. రబీలో రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి సహకార బ్యాంకును బలోపేతం చేయడం కోసం ఈనెల 17, 18, 19న జిల్లాకేంద్రంలో సహకార సంఘాల బలోపేతం, రైతులకు మెరుగైన సేవలు అందించే విధానంపై ఉన్నతాధికారులతో సింగిల్విండో కార్యదర్శులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతులు రాంచంద్రయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, రాము, రాజన్నలు పాల్గొన్నారు. -
ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్ .
కాజీపేట, న్యూస్లైన్ : రైల్వే ఉద్యోగిని బెది రించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి, రూ.40 వేలు డ్రాచేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరె స్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ ఎస్ఏ జబ్బార్ తెలిపా రు. కాజీపేట పోలీస్స్టేషన్లో ఎస్సైలు రామారావు, శ్రీధర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. మడికొండ గ్రామానికి చెందిన రైల్వేఉద్యోగి మోడెం మధుసూదన్ ఈనెల 2న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా డీజిల్ కాలనీ ప్రధాన రహదారిపై ముగ్గురు యువకులు అడ్డగించారు. రూ.100 అర్జంట్గా కావాలని ప్రాధేయపడ్డారు. వారిని చూసి జాలిపడిన మధుసూదన్ జూబ్లీమార్కెట్లోని ఏటీఎం కేంద్రం వద్దకు యువకులను తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయనపై ఒక్కసారిగా దాడి చేసి, ఏటీఎం కార్డు, సెల్ఫోన్ లాక్కుని పరారయ్యూరు. బాధితుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫొటోలను తీసుకుని ప్రింట్లు వేయించి చూడగా డీజిల్ కాలనీకి చెందిన రామడుగు సందీప్, మానుపాటి రవి, నేరేళ్ల శ్రీకాంత్తో సరిపోయినట్లు చెప్పారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి నుంచి రూ.36 వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు పంపినట్లు వివరించారు.