‘దిశ’ కమిషన్‌ విచారణకు మహేశ్‌ భగవత్‌  | Disha Encounter Case: Telangana Govt To Present Evidence To Supreme Court | Sakshi
Sakshi News home page

‘దిశ’ కమిషన్‌ విచారణకు మహేశ్‌ భగవత్‌ 

Published Sun, Sep 5 2021 2:55 AM | Last Updated on Sun, Sep 5 2021 2:55 AM

Disha Encounter Case: Telangana Govt To Present Evidence To Supreme Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ ఎం భగవత్‌ శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే అప్పటికే నారాయణపేట జిల్లా జక్లేర్‌ గ్రామానికి చెందిన ఆరిఫ్‌ (ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు) తండ్రి హుస్సేన్‌ను విచారిస్తుండటంతో భగవత్‌ను విచారించలేదు. దీంతో ఆయన విచారణను కమిషన్‌ ఈనెల 13కి రీషెడ్యూల్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. హుస్సేన్‌ విచారణ శనివారం పూర్తయింది.

ఇప్పటివరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్తా, ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు అధికారి సురేందర్‌ రెడ్డి, షాద్‌నగర్‌ రోడ్లు, భవనాల విభాగం (ఆర్‌అండ్‌బీ) డీఈఈ ఎం రాజశేఖర్, దిశ సోదరిలను చైర్మన్, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇందులో దర్యాప్తు అధికారి సురేందర్‌ రెడ్డిని విచారించి కమిషన్‌ పలు కీలక సమాచారాన్ని రాబట్టింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత నిందితుల మృతదేహాలకు పంచనామ చేసిన వైద్యులు, ఆయుధాలు (తుపాకులు) నిర్వహణ అధికారులు, సాంకేతిక, కాల్‌ రికార్డింగ్‌ బృందాలను విచారించనున్నట్టు సమాచారం.

మరొక 15 రోజుల్లో సిర్పుర్కర్‌ కమిటీ విచారణ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా...ఇప్పటికే ఒక పర్యాయం నిందితుల కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్‌కు ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌’అని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement