బోగీల్లో మంటలు Concern among travelers due to fire hazards | Sakshi
Sakshi News home page

బోగీల్లో మంటలు

Published Fri, Jun 21 2024 6:21 AM | Last Updated on Fri, Jun 21 2024 6:29 AM

Concern among travelers due to fire hazards

వరుస అగ్ని ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన

రైల్వేయార్డులు, పిట్‌లైన్‌లలో భద్రత కరువు 

అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌: నగరంలోని ఏదో ఒక రైల్వేస్టేషన్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఏసీ బోగోల్లో మంటలు చెలరేగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ లేరు. 

⇒ గతంలో నాంపల్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పైన నిలిపి ఉన్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు దిగి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్‌లో పేలుడు స్వభావం ఉన్న పదార్థాల వల్లనే మంటలు అంటుకున్నట్టు అప్పట్లో గుర్తించారు.  

⇒ సికింద్రాబాద్‌ స్టేషన్‌లోనూ చారి్మనార్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి నగరానికి చేరుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ రైల్వే యార్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నాలుగేళ్ల క్రితం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రయాణికులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దిగిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఒకవేళ యార్డుకు చేరుకోకముందే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది.  ఇలా తరచుగా ఏదో ఒక ట్రైన్‌లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రైళ్లలో పొగలు రావడంతోనే గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు భారీ ఎత్తున మంటలు అంటుకొని ప్రయాణికులు, అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన సంఘటనలూ ఉన్నాయి.  

నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా..
రైల్వేయార్డులు, వాషింగ్‌లైన్‌లు, పిట్‌లైన్‌లలో నిలిపి ఉంచే బోగీలకు భద్రత ఉండటం లేదనే ఆరోపణలున్నా యి. కోచ్‌లను శుభ్రం చేసేందుకు రైళ్లను పిట్‌లైన్‌లకు తరలిస్తారు. కొన్నింటిని డిపోల్లో నిలిపివేస్తారు. రైళ్లు, బోగీలు ఎక్కడ నిలిపి ఉంచినా, వాటిపైన భద్రతా సిబ్బంది నిఘా కొరవడుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ బోగీలు అడ్డాలుగా మారుతున్నాయి. తాగుబోతులు, ర్యాగ్‌పిక్కర్స్, అసాంఘిక శక్తులు రాత్రి వేళల్లో బోగీల్లో తిష్టవేస్తూ మద్యం సేవిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి వంటివి తాగి మండుతున్న పీకలను బోగీల్లోనే వేస్తున్నారు. దీంతో సిగరెట్‌ పీకలు, వెలిగించిన అగ్ని పుల్లలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  

⇒ ఏసీ బోగీల నిర్వహణలో వైఫల్యం వల్ల తరచూ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా యి. ఏసీ బోగీల్లో ప్రయాణికులు చెత్తాచెదారం, ఆహారపదార్ధాలు వదిలేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఎలుకలు తరచుగా విద్యుత్‌ వైర్లు కట్‌ చేయడం వల్ల షార్ట్‌సర్క్యూట్‌ వంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే భద్రతా నిపుణుడు ఒకరు చెప్పారు. ఆరీ్పఎఫ్, జీఆర్‌పీ వంటి పోలీసు విభాగాలు పిట్‌లైన్‌లు, యార్డుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలి. బయటి వ్యక్తులు యార్డుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

ఏసీ కోచ్‌ల్లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గురువారం ఉద యం 10.30 గంటలకు ఏసీ కోచ్‌లను వాషింగ్‌ కోసం మెట్టుగూడ వద్దనున్న క్లీనింగ్‌ పిట్‌ యార్డ్‌ తీసుకెళ్లారు. క్లీనింగ్‌ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో తిరిగి రైల్వే స్టేషన్‌కు తరలిస్తుండగా ఏసీ బోగీల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన చిలకలగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రైల్వే అధికారులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది స్టేషన్లో మంటలు ఆర్పే యంత్రాలతో తగలబడుతున్న బోగీలను అదుపు చేసే ప్రయ త్నం చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించ కుండా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడకు చేరుకున్న ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. రైలు కోచ్‌లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై సమీక్షించి, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డివిజనల్‌ అధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement