మరిచిపోలేని క్షణాలు.. సచిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌! ఎవరీ జసింత? Womens Day: Sachin Tendulkar Honours Female Pitch Curator Heartwarming Post | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: మరిచిపోలేని క్షణాలు.. సచిన్‌ ఉద్వేగపూరిత పోస్ట్‌! ఎవరీ జసింత?

Published Fri, Mar 8 2024 5:05 PM | Last Updated on Fri, Mar 8 2024 5:38 PM

Womens Day: Sachin Tendulkar Honours Female Pitch Curator Heartwarming Post - Sakshi

International Women’s Day: గత కొన్నేళ్లుగా క్రీడా రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అన్నాడు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే క్రీడలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నాడు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన కెరీర్‌లోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ సచిన్‌ టెండుల్కర్‌ ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన కొన్నేళ్లలో భారత్‌, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది.

2008లో.. 26/11 (ముంబై పేలుళ్ల) ఘటన తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. జాతి మొత్తానికి అదో భావోద్వేగపూరిత సందర్భం. ఆ సమయంలో గ్రౌండ్‌ స్టాఫ్‌ మెంబర్స్‌లో ఒకరైన మహిళ నా దగ్గరకు వచ్చి అందరి తరపునా శుభాకాంక్షలు తెలిపి.. తన ఆనందాన్ని పంచుకున్నారు.

నా జీవితంలో అదొక మరుపురాని అనుభూతి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024లో.. జసింత కళ్యాణ్‌ ఇండియాలో మొట్టమొదటి మహిళా పిచ్‌ క్యూరేటర్‌గా అవతరించారు. ఆమె ఒక అడుగు ముందుకు వేశారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. 

అడ్డంకులు అధిగమించి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న  ఇలాంటి రోల్‌ మోడల్స్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ప్రశంసించుకుందాం’’ అని సచిన్‌ టెండుల్కర్‌ వుమెన్స్‌ డే విషెస్‌ తెలియజేశాడు. 

ఎవరీ జసింత కళ్యాణ్‌?
కర్ణాటకకు చెందిన జసింత బెంగళూరులోని హరొబెల్‌ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి రైతు. ఇక చిన్నతనం నుంచే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడ్డ జసింత.. ఉపాధి కోసం బెంగళూరులో అడుగుపెట్టారు.

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరి.. అనంతరం అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆట కంటే పిచ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించిన జిసింత అభిరుచిని గమనించిన అసోసియేషన్‌ కార్యదర్శి బ్రిజేష్‌.. స్టేడియంలో పనిచేసే మాలీలపై బాస్‌గా బాధ్యతలు అప్పగించాడు. 

ఈ క్రమంలో పిచ్‌ క్యూరేటర్‌ ప్రశాంత్‌రావు జసింత ఆసక్తిని గమనించి పిచ్‌ తయారీలో మెళకువలు నేర్పాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి అనుభవం గడించిన జసింత.. భారత దేశంలోనే మొదటి మహిళా క్యూరేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరు పిచ్‌ల తయారీని ఆమె పర్యవేక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement