‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్‌ | Mamata Banerjee Challenges BJP To Cross Even 200 Seats, Wont Allow CAA In Bengal - Sakshi
Sakshi News home page

‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్‌

Published Sun, Mar 31 2024 3:25 PM | Last Updated on Sun, Mar 31 2024 5:29 PM

Mamata Banerjee Challenge Bjp To Cross Even 200 Seats - Sakshi

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్‌ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్‌ చేశారు. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్‌ కృష్ణానగర్‌ లోక్‌సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. 

ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్‌మార్క్‌ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్‌ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు.  

సీఏఏని అనుమతించబోం
‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు.

బీజేపీని వ్యతిరేకించినందునే
టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న బీజేపీ
ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement