సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్‌ పోరు Gorakhpur Seat of up Becomes Hot Seat | Sakshi
Sakshi News home page

సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్‌ పోరు

Published Wed, May 29 2024 7:34 AM | Last Updated on Wed, May 29 2024 12:41 PM

Gorakhpur Seat of up Becomes Hot Seat

లోక్‌సభకు చివరి దశ పోలింగ్‌ జూన్‌ ఒకటిన జరగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. వీటిలో వారణాసి, గోరఖ్‌పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్ ఉన్న నగరం. ఈ ప్రాంతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ కీలకంగా నిలిచింది. ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వస్థలం. ఇక్కడ ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీల మధ్యప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.

గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో హీరో వర్సెస్ హీరోయిన్‌ పోరు నెలకొంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవి కిషన్‌ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ భోజ్‌పురి నటి కాజల్ నిషాద్‌కు ఇక్కడి టిక్కెట్‌ కేటాయించింది. రవి కిషన్ 2019లో ఇక్కడి నుంచి బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. కాజల్ నిషాద్ 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ, మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు.

1990లో యోగి ఆదిత్యనాథ్  ఇక్కడి నుంచే తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించి, వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రవి కిషన్ విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఐదుసార్లు ఎంపీని చేసిన ఇక్కడి ఓటర్లు సీఎంపై మరింత నమ్మకం ఉంచారు. అందుకే బీజేపీకి మద్దతుగా నిలుస్తారనే అంచనాలున్నాయి.

గోరఖ్‌పూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 20 లక్షల 74 వేలు. ఈ సీటులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 లోక్‌సభ ఉప ఎన్నిక మినహా ప్రతిసారీ సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement