ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్‌ఐ | ACB Raids On Meerpet SI Saidulu For Accepting Bribe, Check Details Inside - Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్‌ఐ

Published Sun, Mar 31 2024 7:27 AM | Last Updated on Sun, Mar 31 2024 12:25 PM

ACB Raids On Meerpet SI Saidulu - Sakshi

రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడిన పోలీసు అధికారి 

మీర్‌పేట్‌ స్టేషన్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైనం

హైదరాబాద్‌: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్‌గుల్‌కు చెందిన షేక్‌ నజీముద్దీన్‌ గత డిసెంబరులో సర్వే నంబర్‌ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్‌ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్‌ చేసుకున్నాడు.

ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్‌ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్‌ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్‌ ఈ నెల 23న మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్‌ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్‌కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్‌ ప్లాట్‌ కాగితాలు నజీముద్దీన్‌కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసి ఎస్‌ఐ సుభాష్‌కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు.

ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్‌ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్‌కు వచ్చిన సుభాష్‌ నుంచి ఎస్‌ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్‌ఐ సైదులును మేజి్రస్టేట్‌ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్‌నగర్‌ పీఎస్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్‌ఐ సైదులు సస్పెండ్‌ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement