-
అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానయానం విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. దర్శనం ఎలా? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్లైన్లో.. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను వెంట తీసుకువెళ్లాలి. సంప్రదాయ దుస్తులలో.. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. అయోధ్యలో నిత్యపూజలు అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? -
టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్!
2023 ప్రారంభం నుంచి టెక్ ఉద్యోగులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది (2024) ప్రారంభంలో కూడా కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. టీసీఎస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఏకంగా ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రారంభ దశలో ఉన్న Gen AIలో ఐదు లక్షలమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించింది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవాల్సి వస్తుందని, అప్పటికి అందులో శిక్షణ పొందిన ఉద్యోగుల అవసరం కంపెనీకి ఉంటుందని TCS ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వర్క్ఫోర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్లు అనే రెండు కీలక రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా AI భవిష్యత్తు కోసం TCS చురుకుగా సిద్ధమవుతోందని కంపెనీ AI.Cloud యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు. ఏఐ మీద శిక్షణ ఇవ్వడానికి కంపెనీ అత్యధునిక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించనుంది, ఎప్పటికి పూర్తి చేయనుందనే విషయాలను వెల్లడించలేదు. కానీ గతంలో టీసీఎస్ కంపెనీ 150,000 మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి ఏడు నెలల సమయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులో ఐదు లక్షల మందికి ఎన్ని రోజుల్లో శిక్షణ ఇస్తుందనేది అంచనా వేసుకోవచ్చు. ఇదీ చదవండి: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఏఐ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయని చాలా కంపెనీల సీఈఓలు గతంలో వెల్లడించారు, కానీ ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మానవ ప్రమేయం అవసరమని, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కొందరు భావించారు. ప్రస్తుతం ఆ భావనే నిజమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ ఏఐపైన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
ట్రైన్ టికెట్ ధరలపై రాయితీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఇస్తుంది కదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ-కోవిడ్కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు. రాయితీలపై అదే మాట కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు. ఆర్టీఐలో ఏముందంటే? అంతకుముందు, మధ్యప్రదేశ్కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది. -
జీవితంపై విరక్తితో వ్యక్తి బలవన్మరణం
రామన్నపేట: జీవితంపై విరక్తితో రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట శివారులో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటకు చెందిన బొడ్డు శ్రీరాములు(52) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన శ్రీరాములును కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం రామన్నపేట–వలిగొండ రైల్వేస్టేషన్ల మధ్య కీ మ్యాన్ ట్రాక్ చెక్ చేస్తుండగా 48/8–9పోల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని శ్రీరాములు మృతదేహంగా గుర్తించారు. జీవితంపై విరక్తితో గుర్తుతెలియని రైలుకింద పడి శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే అధి కారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ కె. సాలకమ్మ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్లోని నాల్గవ నంబర్ ప్లాట్ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్మెంట్లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జోధ్పూర్లో బయలుదేరి భోపాల్కు వెళ్తోంది. కోటా వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. రైలులోని రెండు కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం రైల్వే బృందం ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ఘటన అనంతరం ట్రాక్పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్లపైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. #WATCH | Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction. No casualties have been reported. Rescue operations underway. Details awaited. (5.1) pic.twitter.com/zKR7MLQRAr — ANI (@ANI) January 5, 2024 -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్లెస్ ట్రైన్ వీడియో వైరల్
ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన చైనా.. మరో కొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఇందులో పట్టాలు లేని లేదా ట్రాక్లెస్ ట్రైన్స్ నగరం నడిబొడ్డున తిరగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి. పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వెళ్లగలుగుతుంది, దాని పూర్వాపరాలు ఏంటనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం. రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒక్క సారికి 100మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ట్రాక్లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్.. వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది. Trackless train in China ...pic.twitter.com/MsMrW4Wi26 — Figen (@TheFigen_) December 29, 2023 -
మృత్యువుతో పోరాడి.. బిడ్డలను కాపాడిన తల్లి
పాట్నా: తల్లిప్రేమ అనంతమైంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మృత్యువు ఎదురొచ్చినా పిల్లలకు రక్షక కవచంగా మారుతుంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లల కోసం పోరాడుతుంది. ఇలాంటి ఘటనే బిహార్లో జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లడానికి బార్హ్ రైల్వే స్టేషన్ స్టేషన్ చేరుకుంది. జనం ఎక్కువగా ఉండటంతో తోపులాట జరిగింది. ఇంతలో ప్రమాదవశాత్తు తల్లి ఇద్దరు పిల్లలు రైల్వేట్రాక్పై పడిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదిలింది. ఇక ఏం చేయాలో తెలియక ఆ తల్లి అక్కడే ఉండిపోయింది. రైలు పట్టాలపైనే తన పిల్లలకు రక్షణ కవచంగా మారింది ఆ తల్లి. పిల్లలను కిందికి వంచి పట్టాలపై కదలకుండా ఉండిపోయింది. వారికి తగలకుండానే వేగంగా రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. రైలు వెళ్లిన తర్వాత వారిని క్షేమంగా స్థానికులు పైకి తీసుకువచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇదీ చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్ -
కుటుంబ సభ్యులు మందలించారని తీవ్ర నిర్ణయం తీసుకున్న విద్యార్థి!
మిర్యాలగూడ అర్బన్: కుటుంబ సభ్యులు మందలించారని ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన గుంటుపల్లి శ్రీనాథ్(15) మిర్యాలగూడ పట్టణంలోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. శ్రీనాథ్ రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వడ్డించేందుకు క్యాటరింగ్ బృందంతో కలిసి వెళ్లాడు. శ్రీనాథ్ పాఠశాలకు హాజరు కావడం లేదని హాస్టల్ సిబ్బంది అతడి తల్లికి సమాచారం అందించారు. శ్రీనాథ్ను కుటుంబ సభ్యులు ఫోన్లో అతడిని మందలించారు. మనస్తాపం చెందిన శ్రీనాథ్మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వచ్చి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ హుస్సేన్ తెలిపారు. -
ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. ‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి అక్కడిక్కడే మృతి
గద్వాల్ క్రైం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, నాపాడు జిల్లా, బాబుపలికి చెందిన గౌరి శంకర్(40) మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్పూర్ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో భార్య లంబేసాగర్, 6 ఏళ్ల కుమారుడితో బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల్ రైల్వేస్టేషన్ దాటిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు గౌరిశంకర్ జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. తాగిన మైకంలో కిందపడి.. జడ్చర్ల టౌన్: పట్టణానికి చెందిన విష్ణు (26) బుధవారం వీరశివాజీనగర్లోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న డ్రెయినేజీ పక్కన పడి మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పడిపోగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. అంత్యక్రియలకు వెళ్తూ మరొకరు.. జడ్చర్ల టౌన్: సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్ఫారంపై పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు (52) మహబూబ్నగర్లో సమీప బంధువు చనిపోవడంతో బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరాడు. జడ్చర్లలో ఉన్న కుమార్తెను తీసుకెళ్లేందుకు స్టేషన్లో రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్లాట్ఫారంపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు అపహరణ చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల బాల్నారయ్య ఈనెల 4న తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రెండు చైన్లు, పూసలదండా, రింగులు, బంగారు నగలు నాలుగు తులాలు, వెండి ఆభరణాలు, రూ.98 వేల నగదు చోరీకి గురయ్యాయి. బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
రైలు ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్!
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారి పడిపోయిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్ తన బంధువుతో పాటు హౌరా-తారకేశ్వర్ లోకల్ ఎక్కేందుకు వచ్చారు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఫాతిమా బ్యాలెన్స్ తప్పి ప్లాట్ఫారమ్పై పడిపోయింది. ఇంతలో రైలు వేగం పెరగడంతో ఆమె రైలు పట్టాలకు ప్లాట్ఫారమ్కు మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె బంధువు ఆమెను రైలు కిందకు జారిపోకుండా పైకి లాగడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన అక్కడే ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్కే బౌరీ వెంటనే ఫాతిమా వద్దకు పరిగెత్తారు. ఆమె చేయి పట్టుకుని పైకిలాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సీసీటీవీ ఫుటేజీలో.. ప్లాట్ఫారమ్పై ఉన్న పలువురు ప్రయాణికులు ఫాతిమాను రక్షించేందుకు ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పలువురు పోలీసులు కూడా ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసుల చొరవను తూర్పు రైల్వే ప్రశంసించింది. ఇది కూడా చదవండి: రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం चलती ट्रेन में चढ़ते समय फिसल गई महिला, फरिश्ता बनकर आए पुलिसकर्मी ने बचाई जान pic.twitter.com/7hyYXCh6Pc — NDTV India (@ndtvindia) November 30, 2023 -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! One of the main reasons for breaking of snack trays or defective snack trays in #VandeBharat and other trains! Even with photographic evidence, whiners would say that I pass on the blame only to passengers! #IndianRailways #Responsibility #passengers pic.twitter.com/ykv0VNED9a — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2023 -
‘దర్భంగా ఎక్స్ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్ప్రెస్లోని ఎస్-6 కోచ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్ప్రెస్లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్లో చేర్చారు. రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్టక్మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుడి చేతిపై పచ్చబొట్టు
బాలానగర్: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (35) మృతిచెందిన ఘటన బాలానగర్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుడి చేయిపై హితేష్ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
రైల్లో అలారం చైన్కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్లను ఎల్బీహెచ్ కోచ్లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్ఫోన్ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతిచెందారు. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొనటంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఢాకా వెళుతున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన నేపధ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయని, స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు. రైలులో సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల! -
పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? ఎక్కడ నడవనుంది?
భారతదేశంలో ప్రస్తుతం రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ భారత్ పుల్ అండ్ పుష్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. పుల్ అండ్ పుష్ రైళ్ల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి పుల్-పుష్ రైలును నవంబర్ నెలలో బీహార్ రాజధాని పాట్నా, మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడపనున్నారని సమాచారం. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రైళ్ల వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచడమే రైల్వేల లక్ష్యం. ఈ నేపధ్యంలో పుల్ అండ్ పుష్ రైళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పుల్ అండ్ పుష్ రైళ్ల కోచ్లు ఈ నెలలోనే సిద్ధం కానున్నాయి. కాగా ఈ రైళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి నడపాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైలుకు రెండు ఇంజన్లు అమర్చడం విశేషం. ఈ రైలుకు ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. రైలులో జనరల్, స్లీపర్ క్లాస్ల చొప్పున మొత్తం 22 కోచ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఈ రైలు నాన్-ఏసీగా నిర్వహించనున్నారు. ఈ రైలు కోసం పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో ప్రత్యేక కోచ్లను సిద్ధం చేశారు. ఈ డబుల్ ఇంజిన్ రైలులో ఒకసారి ఒక ఇంజిన్ మాత్రమే నడుస్తుంది. పుల్ అండ్ పుష్ టెక్నాలజీని ఉపయోగించడం వలన రైలు వేగాన్నిపెంచవచ్చు . అలానే తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా రైళ్ల సగటు వేగం 10 నుంచి 15 శాతం పెరుగుతుందని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని మార్గాల్లో ఈ రైలు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా నడవనుందని తెలుస్తోంది. ఈ రైలుకు ‘వందే జనసాధారణ’ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? -
రైల్వే కిచెన్లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!
ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం. కానీ తాజాగా రైల్వే కిచెన్(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. రైల్వే కిచెన్లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్గల మడ్గావ్ ఎక్స్ప్రెస్లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car. The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured. — IRCTC (@IRCTCofficial) October 18, 2023 ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
రైలులో అగ్ని ప్రమాదం
ముంబయి: మహారాష్ట్రలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులోని ఐదు కోచ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి