-
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్25) మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఎస్జీటీ రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు. -
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
టెట్లో పెరిగిన ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం విడుదల చేశారు. డీఎడ్ అర్హతతో నిర్వహించే పేపర్–1లో 57,725 మంది (67.13%), బీఈడీ అర్హతతో రాసే పేపర్–2లో 21,842 మంది (34.18%) అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం పేపర్–1లో 30.24 శాతం, పేపర్–2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు గత ఏడాది నుంచి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రెండేళ్లుగా టెట్ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు ఉండేలా సవరణ చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో టెట్కు వెయిటేజ్ ఇస్తారు. ఈసారి ఇన్సర్విస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాశారు. ప్రతీ పేపర్లోనూ దాదాపు 5 వేల మందికిపైగా హాజరయ్యారు. వాస్తవానికి 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. కానీ 2010కి ముందు నియమించిన టీచర్లకు పదోన్నతుల్లో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో టెట్ రాసే ఇన్ సర్విస్ టీచర్ల సంఖ్య తగ్గింది. మొత్తం 7 భాషల్లో పరీక్ష నిర్వహించినా, తెలుగు మీడియం నుంచే ఎక్కువమంది హాజరయ్యారు. మళ్లీ రాస్తే ఫీజు ఉండదు: రేవంత్రెడ్డి టెట్ ఫీజు పెంపుపై పరీక్ష సమయంలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని చెప్పింది. కంప్యూటర్ బేస్డ్గా టెట్ నిర్వహించడంతో ఫీజు పెంచారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు.ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటం వల్లే టెట్ ఫీజు తగ్గించలేకపోయామన్నారు. టెట్లో ఫెయిల్ అయిన వారికి మరోసారి రాసేప్పుడు ఫీజు నుంచి ఉపశమనం ఇస్తామన్నారు. 2024 టెట్ ఉత్తీర్ణులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తామని చెప్పారు. -
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్కు హరీష్రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్తో పోల్చితే డబుల్గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్కు ఒక్కో పేపర్కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
అంతా సిద్ధం!
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు విద్యా శాఖ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలి రోజు గురువారం దాదాపు 10 వేల దరఖాస్తులు అందాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్న టెట్కు సుమారు 5.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలో 185 సెంటర్లు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలలో 22 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టెట్ నిర్వహణలో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మందికి రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సెంటర్లలో 12 రోజుల్లో రెండు సెషన్స్ కింద స్లాట్లను సిద్ధం చేశారు. రోజుకు 60 వేల మంది చొప్పున 7.20 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోని అభ్యర్థులు వారికి దగ్గరలోని సెంటర్లో స్లాట్ను ఎంచుకుంటే అక్కడే పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు! సోమవారం డీఎస్సీ–2024 నోటిఫికేషన్కు కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. డీఎస్సీకి కూడా 185 సెంటర్లలో రెండు సెషన్స్లో స్లాట్లు సిద్ధం చేసింది. ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటించి, తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు ఇచ్చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టులను ప్రకటించగా, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గత పరీక్షల మాదిరిగానే ప్రకటించిన షెడ్యూల్ మేరకు టెట్తో పాటు డీఎస్సీ కూడా పూర్తిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నియాకమ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2019 జూన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసి, మినిమం టైమ్ స్కేల్తో పోస్టింగ్లు ఇచ్చింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు సైతం భర్తీ చేయడంతో పాటు మొత్తం 14,219 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ టీచర్లు ఎంతో ప్రత్యేకం గతంలో నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన వారికి, ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకు ఎంతో తేడా ఉంటుంది. ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ – 2020) ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ను అమలు చేస్తోంది. ఈ బోధనకు అనుగుణంగా ఈ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైనవారికి ఇంటర్నేషనల్ బాకలారియెట్, టెక్నాలజీ వినియోగం, టోఫెల్, టీచింగ్ ఎఫిషియనీ్సపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. గతంలో ఈ తరహా శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అవసరానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం తప్ప, ప్రాథమిక స్థాయి నుంచే పూర్తిస్థాయి శిక్షణ లేదు. టెట్ నిబంధనలు సడలింపు టెట్ అభ్యర్థులకు మేలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించి, ఈ మార్కులను 40 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎక్కువ మంది టెట్ రాసేందుకు అవకాశం వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్/సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటరీ్మడియట్, రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపునిచ్చిది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెట్.. ఇదేమి టెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో..: టెట్లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్ చెప్పే టీచర్కు సైన్స్, సైన్స్ చెప్పే టీచర్కు మేథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. టెట్పై ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. - పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి) డిపార్ట్మెంటల్ పరీక్షలా నిర్వహించాలి టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్మెంటల్ టెస్ట్లా చేపడితే మేలు. – పింగిలి శ్రీపాల్రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
TS TET 2024: ఏప్రిల్లో టెట్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వ హించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పే ర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డీఎస్సీకీ టెట్ ఆటంకం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాసయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలి. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ♦మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్టికెట్ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ఓఎమ్మార్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. అభ్యర్థుల హాల్టికెట్లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్టికెట్పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. -
టెట్పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.