-
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
నిద్రలేమికి ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నిద్రలేమి సమస్యలతో పాటు నిద్రలో వచ్చే అనేక ఇబ్బందులకు ఎక్కడికి వెళ్లాలో చాలామందికి తెలియదని అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ రోడ్ నెం 82లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోడలు, స్లీప్ థెరపిటిక్స్ డాక్టర్ హర్షిణికి చెందిన ‘ది బ్రీత్ క్లినిక్’ను ఆయన మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ముఖ్యమని, చాలినంత నిద్రలేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా జనాభా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికోసం తాము మూడు ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాల్లోనే నిద్రకు సంబంధించి ఇది తొలి క్లినిక్ అని అన్నారు. -
దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. -
Sleep Paralysis: నిద్రిస్తున్నప్పుడు.. సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?
నిద్రిస్తున్నప్పుడూ..మీకు సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?. అక్కడ జరగుతున్నవన్నీ అర్థం అవుతుంటాయి. కానీ లేవలేరు. ఎంతలా.. లేద్దామనుకున్నా కళ్లు తెరవలేక నానా అవస్థలు పడతారు. చాలా సేపు కొట్టుకుని అతికష్టంపై మేల్కొంటారు. ఇలాంటి విషయాలు మీ స్నేహితులు లేదా మరేవరైనా చెబుతుండడం వినే ఉండే ఉంటారు. వాటిని తేలిగ్గా కొట్టిపారేయొద్దు అంటున్నారు వైద్యులు. ఎందకంటే అది స్లీప్ పెరాలసిస్ కావచ్చు అంటున్నారు. ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటి స్లీప్ పెరాలసిస్? ఎందుకు వస్తుంది నిద్ర పక్షవాతం ఇది ఒక పీడకలలా ఉంటుంది. నిద్రలేచినట్లు ఉంటుంది కానీ లేవలేం. లేవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. శరీరంలోని అవయవాలు ఏ మాత్రం సహకరించవు. విచిత్రం ఏమిటంటే.. అతను చూడటానికి నిద్రపోతున్నట్లు ఉంటాడు. తనకు హాని చేస్తున్న అనుభూతి పొందుతాడు. వినడం, లేచినట్లు, ఎవరైన సమీపస్తున్నట్లు తదితర అనుభూతులు అన్ని పొందుతాడు. ఇన్ని అనూభూతులు అనుభవించినా.. కదలలేడు. ఇలాంటి ఫీలింగ్ సాధారణంగా అందరికీ ఒక్కో సమయంలో అనిపించేవే. అయితే అది సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ కొందరికి అదొక భయానక అనుభవం. నిద్ర అంటే భయపడిపోయేలా చేస్తుంది ఆ పరిస్థితి. ఇంతకీ ఎందుకు వస్తుందంటే.. ఈ నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన సమాధానం లేదని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడం, నార్కోలెప్పీ, ఒత్తిడి, ఆందోళన, వివిధ భయాలు తదితర రుగ్మతలు ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే.. అది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి, మద్యం, ధూమపానం, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
తొలి ఏకాదశి..శయన ఏకాదశి.. ఆరోజు విష్ణువు నిజంగానే..
హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. అందుకే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు. దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ’ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆషాడంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. జూన్ 29వ తేది గురువారం నాడు తొలి ఏకాదశి వస్తున్న నేపధ్యంలో ఈ పండగ విశేషాలు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు తిరిగి నిద్ర లేస్తాడు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవ శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది, విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. నిజంగానే విష్ణువు ఆ రోజు నిద్రపోతారా.. నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే..చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం.. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటి పూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూలతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు. ఏకాదశి తిధి ఎలా వచ్చిందంటే.. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించు విధానం.. ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజున పిండిదీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగులా జరుపుకునే ఆచారం కూడా ఉంది. రైతులకు కూడా పండుగే.. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ.. తొలి ఏకాదశి రోజున శేషసాయిని(విష్ణువు) పూజించి..అలా ప్రతినెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేగాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. (చదవండి: ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో అదే..!) -
భోజనం చేసి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? పక్షవాతం వస్తుందట!
శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి ► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి ► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట. ► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. ► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. ► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఏ సమయంలో నిద్రపోతే మంచిది మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే. -
పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్మీడియాలో షేర్ చేశారు. పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Candid Impressions🧿📸 (@candid_impressions) చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..
ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్ గటన మధ్యప్రదేశ్లో ఇండోర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది. దీంతో విసిపోయిన శశిపాల్ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్మెంట్తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు. ఐతే ఆమె అతడి వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్ని అతని మూడో భార్య పాయల్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్ మొబైల్లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్పైకి విసిరేసిన తండ్రి) -
Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా కునుకు తీశాడు.. సస్పెండ్ చేశారు
గాంధీనగర్: స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగిస్తున్న సభలో కునుకు తీశాడు ఆ అధికారి. అయితే మామూలుగా అయితే విషయం ఎవరూ పట్టించుకునేవాళ్లు కారేమో. పాపం.. కెమెరా కళ్లన్నీ ఆయన మీదే పడ్డాయి. లోకల్ మీడియాలో పదే పదే ఆ దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఫలితంగా.. ఆయనపై కమిట్మెంట్ను ప్రశ్నిస్తూ సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్ భూపేంద్ర పటేల్ పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. శనివారం భుజ్లో ఈ ఘటన జరిగింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్గా గుర్తించారు. కచ్ జిల్లాలో.. 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను సీఎం భూపేంద్ర పటేల్ అందించారు. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.. ముందు వరుసల్లో కూర్చున్న జిగర్ పటేల్ కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ వీడియో విపరీతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ. విధి పట్ల నిబద్ధతా లోపం, పైగా ఆయన ప్రవర్తన నిర్లక్ష్యపూరితంగా ఉందన్న విషయం.. వీడియోల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అందుకే గుజరాత్ సివిల్ సర్వీస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్ షా. మరోవైపు వేటుపై ఆ అధికారి స్పందన కోసం మీడియా యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. Kutch News: ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરાયા, CMના કાર્યક્રમમાં ઉંઘતા હોવાથી કરાયા સસ્પેન્ડ #gujarat #kutch #bhuj #vtvgujarati pic.twitter.com/2nnJIv12no — VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 30, 2023 Video Credits: VtvGujarati ఇదీ చదవండి: అవును, శివుని కంఠంపై సర్పాన్ని: మోదీ -
ఆ చిన్నారి నిద్రిస్తే.. ఏ క్షణంలోనైనా శ్వాస ఆగిపోతుంది!
ఎన్నో రకాల వింత వ్యాధుల గురించి విన్నాం. కానీ నిద్రిస్తే శ్వాస ఆగిపోవడం అనే వ్యాధి గురించి విని ఉండరు కదా! నిద్రిస్తేనే శ్వాస ఆగిపోతే ఎలా? నిద్రపోకుండా ఉండటం కూడా అసాధ్యమే. ఇదోకరకమైన అరుదైన వ్యాధి అట. దేనిపైన దీర్ఘంగా దృష్టి కేంద్రీకరించినా లేదా ఏకాగ్రత పెట్టినా.. శ్వాస ఆగిపోవడమే ఈ వ్యాధి లక్షణం. యూకేలోని ఓ చిన్నారి అచ్చం అలాంటి వ్యాధి బారినే పడింది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని రక్షించుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా నానా అగచాట్లు పడుతున్నారు. అసలేం జరిగిందంటే.. యూకేలోని బర్మింగ్హామ్కు చెందిన 48 ఏళ్ల స్టార్ బౌయర్, ఆమె భర్త ఆండ్రూ బౌయర్ ఇద్దరు తమ కుమార్తె సాడీని రాత్రింబవళ్లు కంటి మీద కునుకులేకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. సాడీ పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొనడం ప్రారంభమైంది. ఆ తర్వాత దీని గురించి ఆ చిన్నారి కొన్నాళ్లు ఇంటెన్సీవ్ కేర్లో కూడా చికిత్స తీసుకుంది. ఐతే ఆమె పుట్టుకతో సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఏదైనా సినిమా చూస్తూ ఉండిపోయినా లేదా గట్టిగా దేనిమీద అయినా ఏకాగ్రత పెట్టినా ఆమె మెదడు శ్వాస తీసుకోవడం మర్చిపోవడంతో ఆమె శరీరం నీలంగా మారి చనిపోయే స్టేజ్కి వెళ్లిపోతుంది. దీంతో వైద్యులు ఆ చిన్నారికి ట్రాకియోస్టోమీ చేశారు. అంటే మెడకు రంధ్రం చేసి శ్వాసనాళ నుంచి ఒక గొట్టం ఏర్పాటు చేశారు. ఇది శ్వాస తీసుకునేలా చేసి మెదడుకు సంకేతాలు పంపి గుండె కొట్టుకునేలా చేస్తుంది. ఇది ఆమె ఏకాగ్రతగా ఉన్నప్పుడూ (దీర్ఘంగా సినిమా చూస్తుండిపోయినప్పుడూ).. శ్వాస తీర్చుకోవడం మర్చిపోయిన ప్రతి సారి ఈ గొట్టం శ్వాస గురించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. అదే ఒకవేళ ఆ చిన్నారి అకస్మాత్తుగా నిద్రపోయినా లేదా డీప్ స్లీప్లో ఉంటే అంతే సంగతి. శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. వెంటనే తల్లిదండ్రులు అది గమనించి వెంటిలేటర్పై ఉంచి కృత్రిమ శ్వాస అందించి తిరిగి బతికించుకుంటున్నారు. ఒకవేళ ఆమె శ్వాస ఆగిపోవడాన్ని గమనించనట్లయితే ఆమె శాశ్వతంగా దూరమైపోతుందని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రలుకు కంటి మీద కునుకు లేకుండా అయింది. 24/7 ఆమెను పర్యవేక్షించడమే వారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఆమె రోజులో సాధారణ బిడ్డ మాదిరిగానే ఉన్నా.. నిద్రించిందా ఇక అంతే! ఆ చిన్నారి రూమ్ అంతా వైద్య పరికరాలతో నిండి ఉంటుంది. ఐతే తల్లిద్రండులు ఆమెకు వెంటిలేటర్ లేకుండా శ్వాస పీల్చుకునేలా ప్రత్యామ్నాయ మార్గం గరించి తెలుసుకున్నారు. నిద్రలో శ్వాస ఆగిపోకుండా డయాఫ్రాగ్మాటిక్ పేసర్లను అమర్చాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమర్చితే ఆ చిన్నారి నిద్రపోయినా పర్వాలేదు, పైగా తాము నిద్రపోకుండా చూసుకోవాల్సిన సమస్య తప్పదంటున్నారు తల్లిదండ్రులు. ఐతే అందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బుల సేకరణ పనిలోనే తాము ఉన్నట్లు తల్లిదంద్రడులు వివరించారు. (చదవండి: మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!: జెసిండా) -
మీకు తెలుసా?
మెదడు తనను తాను రిపేర్ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు ♦ నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ♦ దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది. ♦ నిద్రలేమి కారణంగా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ♦ ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. ♦ నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం. ♦ కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. ♦ కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. -
మీరు నిద్రించే సమయం ఇదేనా? తేడా వస్తే కష్టమే! ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు
చిన్నా పెద్దా అని తేడా లేదు.. చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది.. పైకి తెలియకుండానే శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, విద్యాపరంగా ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో కెరీర్పై ఫోకస్ పెరగడంతో నెలకొన్న ఒత్తిడి వంటివి ఒకవైపు అయితే.. విపరీతంగా స్క్రీన్ టైమ్ (ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీ చూడటం వంటివి) పెరిగిపోవడం మరోవైపు దీనికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, రోజువారీ జీవన విధానంలో వచ్చిన మార్పులూ సమస్య పెరగడానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, వైద్య సంస్థలు అధ్యయనం చేసి.. నిద్ర లేమి కారణాలు, దీనివల్ల తలెత్తుతున్న సమస్యలపై నివేదికలు విడుదల చేశాయి. ఆ అంశాలపై ఓ లుక్కేద్దాం. – సాక్షి, హైదరాబాద్ 7 నుంచి 9 గంటల నిద్ర వల్ల ప్రయోజనాలివీ.. ►18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటల రాత్రి నిద్ర అవసరం. ►తగినంత నిద్రతో రోగ నిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అనారోగ్యం బారినపడే అవకాశాలు తగ్గుతాయి. ►ఒకవేళ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా వేగంగా కోలుకోగలుగుతారు. ►7 నుంచి 9 గంటల మధ్య నిద్రతో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుంది. ►ఏకాగ్రత కూడా పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ►రోజువారీ వ్యక్తిగత జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సమస్యను అధిగమించేందుకు ఇలా చేయొచ్చు ► క్రమం తప్పకుండా రోజూ అరగంటకుపైగా వ్యాయామం, నడక ►రాత్రి మితంగా భోజనం చేయాలి. సాయంత్రాలు సిగరెట్లు, మద్యం, పొగాకు వంటివి తీసుకోవద్దు. ►వీకెండ్స్, ఆదివారాలు సహా అన్నిరోజుల్లో నిద్రపోయేందుకు, పొద్దున లేచేందుకు ఒకే సమయం పాటించాలి. ►బెడ్రూంలలో టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలను వినియోగించొద్దు. ►నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 5, 6 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో సమస్యలివీ.. ►ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రతో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. ►ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, కుంగుబాటు వంటివి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. ►5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి. ►జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస 40%పైగా తగ్గిపోతుంది. ►దీర్ఘకాలం నిద్ర సమయం తక్కువగా ఉంటే మానసిక సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే ఆందోళన పడటం, కుంగుబాటు, షార్ట్ టెంపర్, ప్రతీదానికి విసుక్కోవడం, వాహనాలు నడిపేపుడు ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. ►చేసే పనుల్లో తరచూ తప్పులు దొర్లడం, పనివేగం తగ్గిపోవడం, మార్పులకు తగినట్టు సర్దుబాటుకాకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. నిద్ర తగ్గితే శారీరక, మానసిక సమస్యలు గత పదేళ్లలో భారతీయుల్లో నిద్ర అలవాట్లు, పద్ధతుల్లో బాగా మార్పులు జరిగాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరును మెరుగుపర్చుకునేందుకు, ఆ రోజంతా చేసిన పనులను ఒక క్రమపద్ధతుల్లో పెట్టుకోవడానికి, ‘మెటబాలిక్ రియాక్షన్ రిథమ్’లో ఉండటానికి నిద్ర తోడ్ప డుతుంది. అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండటం, లేవడం వంటివాటి వల్ల ‘సర్కాడియన్ సైకిల్’ దెబ్బతింటుంది. ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఐటీ ఉద్యోగుల్లో తీవ్రంగా సమస్య మూడేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు అధికంగా వర్క్ఫ్రం హోం పద్ధతికి మారారు. ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న వారిలో సరైన నిద్రలేకపోవడం, గురక, మధ్యలో ఉలిక్కిపడి లేవడం, పొద్దున లేచాక ఫ్రెష్గా అనిపించకపోవడం వంటి లక్షణాలతో కూడిన ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యలతో వస్తున్న ఐటీ ఉద్యోగులకు తగిన చికిత్స అందిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రోజుకు 7, 8 గంటల నిద్ర ఉండాలి. సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తీసుకోకపోవడం, రాత్రి 9 తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఆపేయడం మంచిది. నిద్రవచ్చినా, రాకపోయినా రాత్రి 9.30 గంటలకల్లా బెడ్పైకి వెళ్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. – వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
తండ్రి గిటార్పై పడుకుని బుడ్డోడి తన్మయత్వం..! క్యూట్ వీడియో
-
నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్ర.. ఈ డివైజ్ గురించి తెలుసుకోవాల్సిందే!
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది. ‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్కు చెందిన స్విచ్లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే! చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్హౌస్లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
వారంలో 4 రోజులే పని, మిగిలిన టైంలో ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగస్తుల పని దినాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని దినాలు తగ్గించేందుకు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. గతంలో వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసేలా సంస్థలు ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాయి. అయితే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసిన ఉద్యోగులు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు? రెండో ఉద్యోగం చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? అంటూ బోస్టన్ కాలేజీ ఎకనమిస్ట్, రిసెర్చర్ జూలియట్ షోర్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్! జూలియట్ షోర్ ఆరు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 సంస్థలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ అభిప్రాయ సేకరణలో.. వారానికి 4 రోజుల పనిచేస్తున్న ఉద్యోగులు 8 గంటల పాటు నిద్రకే కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 40 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా నిద్రపోలేదన్నారు. ఆఫీస్ వర్క్, ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గమనించినట్లు రీసెర్చర్ జూలియట్ షోర్ తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, స్నేహితులతో కాలక్షేపం, సినిమాలు, షికార్ల పేర్లతో ఎంజాయ్ చేయడం కంటే..వారానికి ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల పాటు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు రోజుల పని సమయాల్లో రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు భావించే ఉద్యోగుల శాతం 42.6 శాతం నుండి 14.5 శాతానికి పడిపోయింది. ఈ సందర్భంగా జూలియట్ షోర్ మాట్లాడుతూ..‘ఉద్యోగులు ఎక్కువ సేపు నిద్రపోవడంపై నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఉద్యోగుల్లో చోటు చేసుకుంటున్న బలమైన మార్పులపై ఆశ్చర్యపోయాను’ అని షోర్ చెప్పారు. ఈ అనూహ్య మార్పుల కారణంగా ఆఫీస్ వర్క్ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందోనని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయని అన్నారు. చదవండి👉 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్! -
జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?
ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్.. చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా.. జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట. -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
పని మధ్యలో నిద్ర.. ఏం పర్లేదు మా కంపెనీకి ఓకే!
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అప్పుడప్పుడు బల్లల మీదే తలవాల్చి కునుకుతీసే సందర్భాలు మామూలే! ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. మధ్యాహ్నంపూట కాస్త కునుకు తీస్తే, మెదడు చురుకుదేరి పనితీరు మెరుగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. అయినా, పనివేళల్లో ఉద్యోగులు కునుకుతీయడానికి తగిన ఏర్పాట్లు ఏ ఆఫీసులోనూ కనిపించవు. జపాన్లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్బాక్సెస్) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం. -
Smart Pillow: నిద్రను కనిపెట్టుకొనే దిండు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది అధునాతనమైన స్మార్ట్ దిండు. దీనిపై తలపెట్టుకుని నిద్రించే వారి నిద్రను ఇది కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి చక్కని వరప్రసాదం ఈ తలదిండు. అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ దిండు నమూనాను రూపొందించారు. ఇందులోని ట్రైబో ఎలక్ట్రిక్ నానో జెనరేటర్స్తో పనిచేసే సెన్సర్లు నిద్రను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. నిద్రించేటప్పుడు నిద్రించే వ్యక్తికి సౌకర్యంగా ఉండే భగింమ, గాఢంగా నిద్రించే సమయం వంటివన్నీ క్షుణ్ణంగా ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు హెడ్బ్యాండ్స్, రిస్ట్బ్యాండ్స్ వంటి రూపాల్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ కంటే ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
గురకకూ... ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా?
ఇటీవల బప్పీలహరి మరణం తర్వాత స్లీప్ ఆప్నియా సమస్య గురించి చర్చ జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా’ వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ ఆప్నియా కాకపోవచ్చుగానీ... స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం... అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్లీప్ ఆప్నియా గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈసీ వినయకుమార్ను అడిగి తెలుసుకుందాం. ప్రశ్న : అసలు గురక ఎందుకు/ఎలా వస్తుంది? జ: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ప్రశ్న : గురకకూ, ఆప్నియాకు సంబంధమేమిటి? జ: అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి... ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. పైగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్న : గురకకూ... ఆప్నియాకూ తేడా ఏమిటి? జ: గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. అది ఆరోగ్యపరంగానే కాదు... కుటుంబ బంధాల్లో... ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు... రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి. ప్రశ్న : మంచి జీవనశైలితో మెరుగవుతుందా? జ: మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. (బప్పీ లహరి స్థూలకాయం కూడా ఆయన సమస్యకు దోహదం చేసి ఉండవచ్చు). ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకూ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా మానేయాలి. ప్రశ్న : ఏ డాక్టర్ను కలవాలి? ఎప్పుడు సంప్రదించాలి? జ: వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్ స్పెషలిస్టులను లేదా ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. కారణాలు / నివారణ కొన్ని అలవాట్లు ఆప్నియాకు కారణం కావడంతో పాటు, మరిన్ని దుష్ప్రభావాలు కలిగేలా చేస్తాయి. మద్యం అలవాటు వాటిలో ముఖ్యమైనది. దాంతోపాటు పొగతాగడం, స్థూలకాయం ఆప్నియాను మరింతగా తీవ్రతరం చేస్తాయి.ఈ అలవాట్లను తప్పక మానేయాలి. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ – అంటే బరువు ను ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్య) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది 27 కంటే ఎక్కువ ఉంటే స్లీప్ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. మరీ ఎక్కువ బరువు (మార్బిడ్ ఒబేసిటీ) ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లడం మంచిది. చికిత్స స్లీప్ టెస్ట్ల తర్వాత... తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్’ అంటే... ‘కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్–వే’ మెషిన్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స (వ్యూలో పాలటో ఫారింగోప్లాస్టీ – యూపీపీపీ) అవసరం కావచ్చు. -ఇ.సి వినయ కుమార్ సీనియర్ ఇఎన్టి సర్జన్ -
Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా?
Health Tips: రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి. వాతం ఎక్కువైందా? ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం.. ►50 గ్రాములు సొంఠి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి. ►అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకుండా తీసుకుంటే సరి. ►ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..