-
అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష.. జేడీ సంగ్రామ్కు సజ్జనార్ అభినందన
హైదరాబాద్: 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. హైదరాబాద్ బస్భవన్లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ను ప్రశంసించారు. కెరిర్ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు. "పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చొరవ ప్రశంసనీయం." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు. చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్, రాజేంద్ర కుమార్, హరిగోపాల్, కానిస్టేబుల్ హనుమంతరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ (ఐటీ) రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, చీఫ్ మేనేజర్(ఫైనాన్స్) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే సాఫ్ట్వేర్లో ఆర్టీసీ సమస్త సమాచారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఓ బోల్టు కొనాలన్నా, దానికి బిల్లు చెల్లించాలన్నా.. బస్సుల నిర్వహణ, రూట్ మ్యాప్, తిరిగిన కి.మీ.లు, వచ్చిన ఆదాయం, బ్యాంకులో జమ, సిబ్బంది హాజరు, పనితీరుపై జాబితా తయారీ, కొత్త బస్సుల కొనుగోలు, సొంత వర్క్షాప్లో బస్ బాడీల తయారీ.. ఇలా ఆర్టీసీకి సంబంధించిన సమస్త సమాచారం ఓ మీట నొక్కగానే ప్రత్యక్షమయ్యేలా యాజమాన్యం ఓ సరికొత్త సాఫ్ట్వేర్ను సమకూర్చుకోనుంది. ఒరాకిల్ ఆధారిత ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్ ప్రోగ్రాంతో ఇది సాధ్యం కానుంది. ఈ తరహా ప్రోగ్రామ్స్ తయారీ, సేవలు అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నల్సాఫ్ట్ అనే సంస్థతో ఆర్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్ సీఈఓ వెంకట నల్లూరిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ)విజయ పుష్ప, ఐటీ సీఓ రాజశేఖర్, నల్సాఫ్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. తొమ్మిది నెలల్లో ప్రోగ్రాంను సిద్ధం చేసి ఆ సంస్థ ఆర్టీసీకి అందించనుంది. -
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్ ఆర్టీసీ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్కు గురి కావడం చాలా దురదృష్టకర సంఘటనగా టీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టీఎస్ ఆర్టీసీ పీఆర్వో పేర్కొన్నారు. ట్విట్టర్ అకౌంట్ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. -
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో " స్ట్రెయిట్ టాక్ "
-
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. పండగ రద్దీ దష్ట్యా నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని, స్పెషల్ చార్జీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆర్టీసీకి సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ఇతర ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ భవన్లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని సజ్జనార్ తెలిపారు. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లి ముందస్తు రిజర్వేష¯Œన్ చేసుకోవాలని కోరారు. పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా భద్రంగా గమ్యం చేరేందుకు వీలుంటుందన్నారు. రోడ్లపై రద్దీ అధికంగా ఉండే సమయం అయినందున, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ప్రజలకు తెలపాలని కోరారు. సమావేశానికి హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్రెడ్డి, కరుణాకర్, టి.శ్రీనివాస రావు, డి.శ్రీనివాస్లతో పాటు రవాణా శాఖ రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ రావు, ఆర్టీవోలు శ్రీనివాస్రెడ్డి, రామచందర్లను ఆయన సన్మానించారు. -
TSRTC: ఏపీకి స్పెషల్ స్లీపర్ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులను హైదరాబాద్ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మొదలైన సంక్రాంతి పండుగ
-
ప్రైవేట్ ట్రావెల్స్ కు ధీటుగా టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు
-
ప్రయాణికుల ఆదరణతో ప్రగతిరథం పరుగులు
భాగ్యనగర్కాలనీ (హైదరాబాద్): ప్రయాణికుల ఆదరణతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థికంగా పటిష్టంగా తయారవుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల వల్లే ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతోందని, 2022లో ప్రయాణిక దేవుళ్లు టీఎస్ఆర్టీసీని ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించారని పేర్కొ న్నారు. బుధవారం కూకట్పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీలోని బస్స్టాప్లో కొత్త స్లీపర్, స్లీపర్ కమ్ సీట్ బస్సులను ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొ న్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. గత 15 రోజుల క్రితం సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించామని, ఈ నెలాఖరులో కొత్త ఏసీ బస్సులను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్లీపర్ బస్సులు హైదరాబాద్–విజయవాడ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. సీఎం సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి: బాజిరెడ్డి ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్థలోని 50 వేల మంది ఉద్యోగుల కృషి వల్లే రోజు రోజుకూ రెవెన్యూ మెరుగుపడుతోందని చెప్పారు. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్బండ్పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు. దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల డీజిల్ సెస్ను మాత్రమే సవరించామని, టికెట్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలారం, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్ ట్రాకింగ్ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్కుమార్, జీవన్ప్రసాద్, మోహన్(అశోక్ లేలాండ్), ఎంజీ ఆటోమోటివ్స్ ఎండీ అనిల్ ఎం కామత్ పాల్గొన్నారు. -
నెక్లెస్ రోడ్డు : ఉత్సాహంగా ప్యూరథాన్ 5కే, 2 కే రన్ (ఫోటోలు)
-
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరలో కొనే కొత్త బస్సులకు పేర్లు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిసారి స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ ... ప్రయాణికులకు చేరువయ్యేందుకు వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఏడాది చివరికి మొత్తం 630 కొత్త బస్సుల రాక మొదలువుతుంది. డిసెంబరులో వీటి సరఫరా ప్రారంభమై మార్చి వరకు పూర్తిగా అందుతాయి. వీటి ల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. మిగతావి సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులు. అద్దె రూపంలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీమియం కేటగిరీలో గరుడ, గరుడప్లస్, రాజధాని పేరుతో బస్సులున్నాయి. ఇప్పుడు ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ కేటగిరీ సర్వీసులకు పేర్లు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. బస్సులకు ఆకర్షణీయమైన పేర్లు సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పేర్లు సూచించటం మొదలైంది. ఇటీవలే భారత్కు ఆఫ్రికా చీతాలు రావటంతో వాటి పేరు జనం నోళ్లలో బాగా నానుతోంది. దీంతో ఏసీ స్లీపర్ సర్వీసుకు చీతా పేరు పెట్టాలని కొందరు, ప్యారడైజ్ ఆన్ వీల్స్, డెక్కన్ ప్రైడ్, స్వర్ణ రథం, మయూఖా, జాగ్వార్, విహారీ, షీతల శయన, శాతవాహన, కాకతీయ, రుద్రమ, జనతాబస్, విహంగ, హరివిల్లు, రోడ్ ఫ్లైట్, మయూర, రాజహంస, అంబారీ, ఉయ్యాల.. ఇలా చాలా పేర్లు సూచించారు. మరిన్ని సూచనలు రానున్నాయి. వీటిల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆయా సరీ్వసులకు పెట్టనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఆరంభంలో బ్యాటరీ నాన్ ఏసీ బస్సులు కూడా సమకూరనున్నాయి. వాటికి కూడా పేర్లు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టుకు తిరుగుతున్నాయి. నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు పేర్లు పెట్టాల్సి ఉంది. కొనసాగుతున్న దసరా ప్రత్యేక బస్సులు.. బతుకమ్మ, దసరా పండుగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు నగరం నుంచి మూడు వేల బస్సులు ప్రయాణికులను గమ్యానికి చేర్చాయి. రెండో శనివారం, ఆదివారం సెలవురోజులు కావటంతో భారీగా జనం ఊళ్లకు తరలివెళ్లారు. శనివారం షెడ్యూల్ ప్రకారం 560 బస్సులు నడపాల్సి ఉండగా, రద్దీ ఎక్కువగా ఉండటంతో 820 బస్సులు నడిపారు. ఆదివారం 565 బస్సులు నడపాల్సి ఉండగా, 765 బస్సులు తిప్పారు. మంగళవారం మళ్లీ రద్దీ ఎక్కువగా ఉండనున్నందున వేయి బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
ఈరోజు పుట్టినవారికి 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నేడు (పంద్రాగస్టు) జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు నేడు(సోమవారం) బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ఉచిత మెడికల్ చెకప్లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. హైదారాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
సిర్పూర్కర్ కమీషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ ఎన్ కౌంటర్ కేసులో లాయర్ సంచలన నిజాలు..!!
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
దిశ కేసు హైకోర్టుకు బదిలీ
-
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్...కట్టుకథే..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పది మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది. కమిషన్ జనవరి 28నే సీల్డు కవర్లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ సెక్రటేరియట్ శుక్రవారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ తమ నివేదికలో ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలివీ.. ‘‘పోలీసులపై దాడి కట్టుకథ! పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్ గౌడ్ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్నగర్ సీహెచ్సీకి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్ రికార్డులో, మెడికో లీగల్ సర్టిఫికెట్లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్లో వారిని కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంది. కేర్ ఆస్పత్రిలో చికిత్స విషయానికొస్తే.. ఒరిజినల్ రికార్డులన్నీ సిట్కు ఇచ్చారు. కానీ కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్రే, సీటీ స్కాన్ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయనేది, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనేది అబద్ధం. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు అపహరించారనేది కట్టుకథ, నమ్మశక్యం కానిది. తుపాకీలను అపహరించారనడానికి ఆధారాలను రూపొందించారు. ఇద్దరు అధికారుల నుంచి తుపాకీలు అపహరించారని ఒకసారి.. ఒక అధికారి నుంచే అపహరించారని పోలీసుల తరఫు సాక్షి వేర్వేరుగా చెప్పారు. నిందితులు కాల్పులు జరిపే అవకాశమే లేదు పోలీసుల నుంచి నిందితులు తుపాకీ అపహరించారనే అంశంలోనూ అనుమానాలు ఉన్నాయి. పోలీసు బెల్టుకు ఉండే పౌచ్ బటన్ తీసి 9ఎంఎం పిస్టల్ ఎలా అపహరించగలిగారు? నిందితులకు ఆయుధాల నిర్వహణ తెలుసనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ సమయంలో సదరు పిస్టల్ను ఎలా నిర్వహిస్తారనేది అధికారులు చూపారు. ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. తుపాకీలను ఉపయోగించడం తెలియని వ్యక్తి అంత సులభంగా వాడటం చాలా కష్టం. నిందితులు వాటిని వాడటం సాధ్యం కాదు. తుపాకీలో మేగజీన్ (బుల్లెట్లు ఉండే చాంబర్) లోడ్ పొజిషన్లో ఉందని అధికారులు చెప్తున్నారు. తుపాకీ కాల్చాలంటే పైభాగాన ఉన్న స్లయిడ్ను లాగడం ద్వారా చాంబర్లోకి బుల్లెట్ క్యాట్రిడ్జ్ వెళ్లేలా చేయాలి. సేఫ్టీ స్విచ్ ఎక్కడ అనేది సూచించే ఆధారాలు రికార్డుల్లో లేవు. శిక్షణ లేని వ్యక్తి సేఫ్టీ స్విచ్ను గుర్తించి తుపాకీ కాల్చడం సాధ్యం కాదని బాలిస్టిక్ నిపుణులు చెప్తున్నారు. నిందితులు ఆయుధాలు లాక్కొని వెంటనే కాల్పులు ప్రారంభించారన్న పోలీసుల ఆరోపణలు ఊహకు కూడా అందడం లేదు. పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారా? ఆత్మరక్షణ కోసమా? నిందితులను పట్టుకోవడానికి ప్రతీకార కాల్పులు ప్రారంభించారా అనేది అస్పష్టంగా ఉంది. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనేది తేలలేదు. కాల్పులు నిజంగానే జరిగాయని చెప్తుండటంపై అనుమానం తలెత్తుతోంది. మృతి చెందిన నలుగురి మొండెం, తలపై తుపాకీ గాయాలున్నాయి. అవి పరిశీలిస్తే పోలీసులు స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్టుగా విశ్వసించాల్సి వస్తోంది. ఎన్నో అంశాల్లో వ్యత్యాసాలు.. ఘటన ప్రాంతానికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు కమిటీకి అందాయి. అవి ఒక ఆర్డర్లో లేవు. పైగా నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్లు. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయి. కమిషన్ ముందు పూర్తి ఫుటేజీ ఎందుకు ప్రవేశపెట్టలేదో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. సెక్షన్ 161 సీఆర్పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్బుక్స్ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్ క్యాట్రిడ్జ్లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనాస్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది. కస్టడీ అనుమతిలోనూ చట్ట ఉల్లంఘన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించే సమయంలోనూ తీవ్రమైన చట్ట ఉల్లంఘన జరిగినట్టు తేలింది. ఎలాంటి పత్రాలను పరిశీలించకుండానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు ప్రొసీడింగ్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గానీ, పోలీసు అధికారిగానీ లేరు. ఏసీపీ వి.సురేందర్ స్థానంలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా అజ్మల్ కసబ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనలను గుర్తుంచుకోవాలి. బెయిల్ కోసం దరఖాస్తు/పోలీసు రిమాండ్ను వ్యతిరేకించడం/జ్యుడీషియల్ కస్టడీని వ్యతిరేకించడం వంటి అంశాల్లో నిందితులకు న్యాయ సలహా అవసరం. ఘటన నాటికి ముగ్గురూ మైనర్లే.. జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ మైనర్లు.. పాఠశాల రికార్డులను పరిశీలించినప్పటికీ పోలీసులు వారి వయసును నమోదు చేయలేదు. మరణించే నాటికి ముగ్గురు మైనర్లేనని వారి బంధువులు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డుల్లోనూ వారి పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. ఆధార్కార్డు పుట్టినతేదీకి అధికారిక రుజువు కాదు. ఈ నేపథ్యంలో పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన విధంగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉండాల్సింది.’’ నిందితులను చంపే ఉద్దేశంతోనే.. రికార్డుల్లోని అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. నిందితులు 6.12.2019 నాటి ఘటనలో ఆయుధాలను లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడి, కాల్పులు జరపడం వంటివి చేయలేదని నిర్ధారించాం. రెండో విషయం ఏమిటంటే నిందితులు 9ఎంఎం పిస్టల్తో కాల్చడమనే సందర్భమే తలెత్తలేదు. నిందితులంతా బుల్లెట్ల గాయాల కారణంగానే మరణించారు. వారిపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారుల చర్యలను సమర్థించడానికి వీల్లేదు. షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను 302 ఐపీసీ కింద విచారణ చేయాలి. ఈ అధికారులు ఐపీసీ సెక్షన్ 76, సెక్షన్ 300 ఐపీసీ (3) నుంచి మినహాయింపు పొందలేరు. ఎందుకంటే వారు నిందితులపై కావాలనే కాల్పులు జరిపారనే వాదన నమ్మదగినది. దీని ప్రకారం.. వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్.. ఈ పది మందినీ కూడా ‘సెక్షన్ 302 రెడ్ విత్ 34 ఐపీసీ, 201 రెడ్ విత్ 302 ఐపీసీ, 34 ఐపీసీ’ల కింద విచారించాలి. వేర్వేరు చర్యలు చేసినప్పటికీ నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే వారు ఉన్నారు. ఆ పది మంది పోలీసులు కూడా నలుగురు నిందితులను సురక్షితంగా ఉంచే బాధ్యత కలిగిన వారే. ఏవైనా చర్యలు లేదా లోపాలు ద్వారా ఆ బాధ్యతలో విఫలమైతే.. నిందితుల మృతి పట్ల ఉమ్మడి ఉద్దేశం ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాదు ఎన్కౌంటర్ తర్వాత రికార్డులు తారుమారు చేయడంలో వారి ప్రవర్తన, నిందితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన తీరు చూస్తే వారి ఉమ్మడి ఉద్దేశం స్పష్టమవుతోంది. మాబ్ లించింగ్ (మూక దాడి) ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా తక్షణ న్యాయం వంటి ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ సమయంలోనైనా చట్టం నియమాలు బలంగా ఉండాలి. నేరానికి శిక్ష అనేది చట్టం ఏర్పాటు చేసిన విధానం ద్వారానే ఉండాలి. పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టాలి విచారణ సమయంలో గమనించిన అంశాల మేరకు పలు సాధారణ సిఫార్సులు చేయాల ని నిర్ణయించినట్టు కమిషన్ నివేదికలో పే ర్కొంది. ఈ మేరకు 15 సిఫార్సులు చేసింది. ∙మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ∙ శాంతిభద్రతల నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలి. ∙అరెస్టు సమయంలో రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ∙దర్యాప్తు మొత్తం వీడియో రికార్డు చేయాలి. ∙ పోలీసుల శరీరానికి కెమెరాలు పెట్టాలి. ∙ అన్ని కేసుల్లోనూ సీసీ టీవీ ఫుటేజీని తప్పనిసరిగా సేకరించాలి. ∙సాక్షుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. ∙క్రైం సీన్పై ఫోరెన్సిక్ నిపుణులకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ∙అన్ని ఫోరెన్సిక్ ఆధారాలను వరుస క్రమంలో భద్రపర్చాలి. ∙ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్వహించడాన్ని నివారించాలి. ∙పోలీసు కస్టడీకి దరఖాస్తు చేసిన ప్రతీసారి నిందితుడిని హాజరుపర్చేలా మేజిస్ట్రేట్ ఆదేశించడాన్ని తప్పనిసరి చేయాలి. ∙పోలీసుల కస్టడీ పిటిషన్పై నిందితులకు నోటీసులు జారీ చేయాలి. ∙ సెక్షన్ 176(1–ఏ) కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 కింద మేజిస్టీరియల్ విచారణ చేయాలి. ∙దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు మీడియా సమావేశాలు నిర్వహించాలి. ∙అసత్య సాక్ష్యాలకు సంబంధించి చర్యలను సరళీకృతం చేయాలి. ఇది కూడా చదవండి: దిశ కేసు హైకోర్టుకు బదిలీ -
దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి దోషులెవరో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ గుర్తించిందని, ఇందులో దాపరికానికి తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టుకే అప్పగిస్తున్నట్టు తెలిపింది. నివేదిక సాఫ్ట్ కాపీలను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ పంపాలని కమిషన్ సెక్రటేరియట్ను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తామని.. నివేదికపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకొనే స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపింది. ఆయా అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో ఈ విచారణను ముగిస్తున్నామని ప్రకటించింది. నివేదికపై గోప్యత అవసరమేంటి? దిశ నిందితుల ఎన్కౌంటర్పై మృతుల బంధువులు, న్యాయవాది జీఎస్ మణి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. కేసు తీవ్రత దృష్ట్యా సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని, బహిర్గతం చేసేందుకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయకూడదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో కొన్ని కేసుల్లో నివేదికలను సీల్డు కవర్లోనే ఉంచిందని దివాన్ గుర్తుచేయగా.. ‘‘ఏదైనా దేశ భద్రతకు సంబంధించిన అంశాలుంటే పరిశీలిస్తాం. కానీ ఇది ఎన్కౌంటర్ కేసు. కమిటీ నివేదిక ఇచ్చింది. అంతిమంగా ముగింపు ఉండాలి కదా.. నివేదికను చూడకుండా మీరు వాదించలేరు కదా.. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. అలాంటిది గోప్యత అవసరం ఏముంది?’’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేసు రోజువారీ విచారణ సుప్రీంకోర్టులో సాధ్యం కాదని, కమిషన్ నివేదిక అనంతరం చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా ఉందని గుర్తుచేశారు. ఇక సుప్రీంనియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచరాదో చెప్పాలని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని శ్యాం దివాన్ మరోసారి అభ్యర్థించినా జస్టిస్ ఎన్వీ రమణ తిరస్కరించారు. దేశంలో ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కేసును పర్యవేక్షించలేం కాబట్టి హైకోర్టుకు తిరిగి పంపాల్సి ఉంటుంది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వివరణాత్మక నివేదిక సమర్పించింది. అయితే సరైన చర్య ఏమిటన్నదే ప్రశ్నగా ఉంది. కమిషన్ కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఈ కేసును హైకోర్టుకు పంపుతాం’’ అని పేర్కొంటూ విచారణను ముగించారు. నిష్పక్షపాతంగా నివేదిక సిర్పూర్కర్ కమిషన్ నివేదిక నిష్పక్ష పాతంగా ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించింది. నివేదిక అంశాలను చూస్తే బాధిత కుటుంబాలకు సగం న్యాయం అందినట్టే ఉంది. హైకోర్టు మీద నమ్మకంతో పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – పీవీ కృష్ణమాచారి, మృతుల కుటుంబాల తరఫు న్యాయవాది, ఇండిపెండెంట్ కౌన్సిల్ నిందితుల కుటుంబాలకుసమాచారమే లేదు శుక్రవారం సుప్రీంకోర్టులో దిశ కేసు విచారణ జరగనుందన్న విషయంపై తమకు సమాచారం లేదని నిందితుల కుటుంబ సభ్యులుతెలిపారు. మరోవైపు దిశ కేసు విచారణ పూర్తయ్యే వరకూ మృతుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా తమ ఇళ్ల ముందు పోలీసు భద్రతేదీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్య మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వచ్చి కాసేపు ఉండి వెళుతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: తుది దశకు ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు -
ఇంటికెళ్లి.. మామిడిపండ్లు అందించి..
నిజాంపేట్: విశ్వసనీయతకు మారుపేరైన టీఎస్ ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ సేవలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదటి మ్యాంగో ప్యాకెట్ను బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎన్జేఆర్ సుఖీ–9లో నివాసముంటున్న మల్లిపూడి కిరణ్రాజ్, హేమలత దంపతుల గృహానికి సజ్జనార్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ ద్వారా ప్రసిద్ధి చెందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను అందిస్తున్నామని, కొనుగోలు దారులు 5 కిలోలకు తక్కువ కాకుండా ఆన్లైన్ (tsrtcparcel.in)లో బుక్ చేసుకుంటే 4 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్లో 12 వేల మంది మామిడి పండ్లను బుక్ చేసుకున్నారని చెప్పారు.