-
జనన, మరణ నమోదులో జిల్లా వెనుకంజ
అద్దంకి: జనన మరణ నమోదు విషయంలో జిల్లా వెనుకబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ గుంటూరు కార్యాలయ డిప్యూటీ డైరక్టరు కే శివశంకర్బాబు అన్నారు. గుంటూరు జిల్లాలో జనన మరణనమోదు ప్రక్రియ 90 శాతం పూర్తైదని చెప్పారు. ఇక్కడ మాత్రం రెండేళ్లుగా ఆగిపోయిందని తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏడు మండలాల స్థాయి పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ ఎంలు, మునిసిపల్ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2013కు సంతమాగులూరు, అద్దంకి మండలాల లె క్కలు మాత్రమే అందాయని తెలిపారు. జనన, మరణ వివరాలు నమోదు చేసి ఆ రికార్డులను ఉన్నతాధికారులకు పంపకుంటే ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల భారీ తేడాలు వస్తాయన్నారు. భారత ప్రభుత్వ జనన, మరణ చట్టం- 1970 ప్రకారం నెలలోగా ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. కుదరకుంటే శాశ్వత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలని చెప్పారు. ఇవి విదేశాల్లోనూ చెల్లుబాటవుతాయని చెప్పారు. ఎలాంటి సెక్షన్ ప్రకారం మంజూరు చేశారో ఆ సెక్షన్ను ఉదహరిస్తూ నోటీసు ఇవ్వాలని చెప్పారు. కొన్ని సార్లు ధ్రువీకరణ పత్రంపై ఆధారపడి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి, ఉన్నత ఉద్యోగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. జనన , మరణ నమోదు ఫైలును ప్రతి నెలా ఐదో తేదీ లోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. జీఓ నంబరు 161 ఉంది.. 2000 జనవరి ఒకటో తేదీకి ముందు జరిగిన జనన, మరణ నమోదు రిజిస్టరు కార్యాలయంలో నమోదై.. బిడ్డ పేరును 15 సంవత్సరాల వయసు వచ్చే లోపుగా నమోదు చేయించుకోని వారు.. తిరిగి నమోదు చేసుకొనేలా జీఓ నంబరు 161 ద్వారా అవకాశం కల్పించామని డీడీ శివశంకరు బాబు తెలిపారు. జిల్లా స్టాటిటికల్ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో టీ వెంకటేశ్వర్లు, ఎంపీహెచ్ఈవో ఏ నాగేశ్వరరావు, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, కొరిశపాడు, జే పంగులూరు మండలాల సిబ్బంది పాల్గొన్నారు. -
పింఛన్ మంజూరు కాలేదని..మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో ఘటన పింఛన్ కోసం ఆ వృద్ధ దంపతులు కాళ్లరిగేలా తిరిగారు.. కనిపిం చిన వారినల్లా ప్రాథేయపడ్డారు.. అయినా ఫలితం శూన్యం.. అధికారుల ఈసడింపులూ చవిచూశారు..అయినా ప్రయత్నం మానలేదు..గురువారం కూడా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కనిపించిన వారందరినీ అడిగారు.. ఇక ఫలితం లేదనుకున్నాడో.. బతకడం వ్యర్ధమనుకున్నాడో.. తెలియదుకానీ ఇంటికెళ్లి ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. -పెద్ద అడిశర్లపల్లి పింఛన్ మంజూరు కాలేదనే బెంగతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల పెద్దులమ్మ వికలాంగురాలు. వైకల్యం శాతం తక్కువగా ఉందన్న కారణంతో ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఆమె భర్త పడాల రాములు(70)కు కూడా పింఛన్ మంజూరు కాలేదు. ఇద్దరు దంపతులు పింఛన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. గురువారం కార్యాలయానికి వచ్చిన రాములు కనిపించిన వారినల్లా పింఛన్ కొరకు ప్రాథేయపడ్డాడు.సరైన సమాధానం చెప్పేవారు లేకపోవడంతో సాయంత్రం గ్రామానికి చేరుకుని కనిపించిన వారితో తనకు పింఛన్ రాని విషయాన్ని ఆవేదనగా వెళ్లగక్కాడు. చీకటి పడుతుండగా ఇంటికి చేరుకుని తలుపునకు వస్త్రంతో ఉరేవేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతిచెందాడు. గురువారం రాములు ఎంపీడీఓ వి.సరస్వతిని కలిసి పింఛన్ గురించి అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని గుడిపల్లి ఎంపీటీసీ వి.చంద్రారెడ్డి ఆరోపించారు. ‘‘రాములుకు తక్కువ వయస్సు ఉండడంతోనే పింఛన్ మంజూరు కాలేదని, ఏ సంఘటన జరిగినా పింఛన్ కారణంగా చెప్పడం సరికాదని’’ ఎంపీడీఓ సరస్వతి అన్నారు. రాములు దరఖాస్తును పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. -
అర్హులకు పింఛన్లు ఇవ్వాలె..
తానూర్: ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలో అర్హులకు పింఛన్లు ఇవ్వాలని మండల ఎంపీడీఓ క్రాంతిని ఎల్వీ గ్రామస్తులు నిలదీశారు. మండలాధికారి దిష్టిబొమ్మను కూడా రోడ్డుపై దహనం చేశారు. పింఛన్లు ఇచ్చేదాకా అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమకు పింఛన్లు రావటం లేదని మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు పింఛన్లు వచ్చే విధంగా చూడాలని కోరారు. అర్హులకు తప్పనిసరిగా పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. -
ఆ వృద్ధుడు ఇప్పుడు చనిపోయాడు!
తుని: బతికుండగానే ఆ వృద్ధుడిని అధికారులు కాగితాలపై చంపేశారు. ఫలితంగా అప్పటివరకూ ప్రతి నెలా అందుతున్న రూ.200 వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది. దీనిపై బెంగటిల్లిన ఆ వృద్ధుడు.. తాను బతికే ఉన్నానంటూ పింఛను కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మూడు నెలలుగా కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు పెంచిన పింఛను అందకుండానే అతడి గుండె ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరానికి చెందిన తోట సూర్యనారాయణ(69) అనే వృద్ధుడి విషాదాంతమిది. ఆయనకు చాలాకాలంగా రూ.200 వృద్ధాప్య పింఛను వస్తోంది. బాబు సీఎం అయ్యాక, వృద్ధాప్య పింఛనును రూ.1000 చేస్తామని ప్రకటించడం తెలిసిందే. పింఛను అర్హతలను నిర్ణయించేందుకు వేసిన కమిటీ, సూర్యనారాయణ చనిపోయినట్టు నివేదిక ఇచ్చింది. దాంతో అప్పటిదాకా వస్తున్న రూ.200 పింఛను కూడా ఆగింది. తాను బతికే ఉన్నానని ఆయన అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ బెంగతోనే ఆయన మంగళవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
నర్సరీలను చంటి పిల్లల్లా కాపాడాలి
డ్వామా పీడీ ఎన్.సునందారాణి అడ్డాకుల: హరితహారం కోసం మొక్కలు పెంచే నర్సరీలను ఉపాధిహామీ ఏపీఓలు, వనకాపరులు చంటి పిల్లల్లా కాపాడాలని డ్వామా పీడీ ఎన్.సునందరాణి సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో శుక్రవారం ఆమె ఉపాధి సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 160 నర్సరీలను ఏర్పాటుచేసి 1.60కోట్ల మొక్కలను పెంచడ మే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలి పారు. ఇందుకోసం ఇప్పటివరకు 145 నర్సరీలకు అనుమతి లభించిందని, మరో 15 నర్సరీలకు మంజూరు రావాల్సి ఉందన్నారు. జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని జనవరి 15 నాటికి పూర్తిచేయాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు చనిపోతే ఉపాధి అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నర్సరీలకు వచ్చే కూలీలకు సకాలంలో డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘సాక్షి’ కథనానికి స్పందన ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన ‘మరుగున పడుతున్న బిల్లులు’ అనే శీర్షికన వచ్చిన కథనంపై ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో డ్వామా పీడీ సునందరాణి సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం నాబార్డు నుంచి రావాల్సిన వాటా నిధులు ఆలస్యమవడంతోనే బిల్లుల చెల్లింపులో ఆలస్యమైందన్నారు. నిధులు వచ్చినందున వెంటనే బిల్లులు చెల్లించాలని ఏపీఓ గట్టయ్యను ఆదేశించారు. -
‘ఆసరా’పై మళ్లీ సర్వే చేయాలి
యాచారం:ఆసరాకు సంబంధించి మళ్లీ రీసర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తు బుధవారం చింతుల్ల గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు 500 మంది వరకు ఉండగా ప్రస్తుతం కేవలం 279 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. పింఛన్లు కోల్పోయి అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 50 మందికి పైగా లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.అంజయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ... గ్రామంలో రీ సర్వే చేసి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఎంపీపీ రమావత్ జ్యోతి నాయక్ లబ్ధిదారుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. మళ్లీ రీ సర్వే చేయించి అర్వులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఉష దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. దీంతో శాంతించిన వారు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో చింతుల్ల సీపీఎం నాయకులు విజయ కుమార్, నర్సింహ, వెంటకయ్య తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల కోసం ఆందోళన పెద్దేముల్: పింఛన్ల పంచాయతీ ఆగడం లేదు. రోజూ ఏదో గ్రామం నుంచి తమకు పింఛన్ రావడం లేదంటూ ప్రజలు కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని బుద్దారం, పెద్దేముల్ తదితర గ్రామాలకు చెందిన పలువరు వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. మూడు రోజుల నుంచి తిరుగుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఈఓపీఆర్డీ సుహాసిని, పంచాయతీ కార్యదర్శులు విశ్వనాథం, అమృతలతో వాగ్వాదానికి దిగారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామంటూ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు. -
వేలి ముద్రల పెన్షన్ మాకొద్దు
కోడుమూరు : వేలి ముద్రలు తీసుకోక.. పెన్షన్ అందక రోజుల తరబడి ఆఫీసుల దగ్గర కూర్చోని విసుగుచెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టూ ముట్టారు. ఆగ్రహంతో ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడ్డారు.పెన్షన్దారులకు మద్దతుగా సీపీఐ మండల కార్యదర్శి క్రిష్ణ, ఏఐఎస్ఎఫ్ నేతలు శ్రీరాములుగౌడ్, శివశంకర్, వైఎస్సార్సీపీ నేతలు ఎల్లప్ప, బీమలింగన్న గౌడ్, రామకృష్ణారెడ్డి వచ్చి అధికారులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపు నాలుగు గంటల సేపు ధర్నా చేస్తూ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నాళ్లు ఈ అవస్థలు పెడతారు తిండి నీళ్లు మానుకొని తిరుగుతున్నా కనికరంలేదా.. రోజుకో నిబంధన పెట్టి చంపుతారా.. ఈ వయసులో మాకిన్ని కష్టాలు పెడతారా అని వృద్ధులు అధికారులపై నిప్పులు చెరిగారు. వేలిముద్రలతో తీసుకునే పెన్షన్ మాకొద్దు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేలిముద్రలు తీసుకోవడం లేదని పెన్షన్లను తీసేస్తారా అంటూ పెన్షన్దారులు ప్రశ్నించారు. వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డుమీద కూర్చొని ఆందోళన చేశారు. ముసలి వయసులో వేళ్లు అరిగిపోయి, ముద్రలు తీసుకోవడం లేదు. దీనికి మేం బలి కావాలా అని వృద్ధులు ఎంపీడీవో సువర్ణలతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పెన్షన్దారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేవిధంగా చూస్తానని హమీ ఇచ్చారు. వేలిముద్రలు తీసుకోక పెన్షన్ల్ రానివారందరూ ఆఫీస్ దగ్గరకు రావాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత మిగతా వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. సీఐ జోక్యంతో సద్దుమణిగిన సమస్య పెన్షన్దారుల ఉద్యమం ఉధృతంగా మారడంతో సీఐ డేగల ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పెన్షన్దారులతో మాట్లాడారు. సమస్య ఎక్కడ ఉందో ఆ కార్యాలయం దగ్గర ఆందోళన చేయండి. రోడ్డుపై కూర్చొని ఆందోళన చే పట్టడం సరైనా చర్య కాదు. మీకు న్యాయం జరిగే వరకు సహకరిస్తానని హమీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం పెన్షన్ పంపిణీ దారులు, ఎంపీడీవో సువర్ణలత, ప్రత్యేకాధికారి సుధాక ర్తో చర్చించి పెన్షన్దారులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో హామీ ఇప్పించారు. నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ సెంటర్లో సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు 10 పెన్షన్లు కూడా పంపిణీ కాలేదు. దీంతో మహిళలు ఆగ్రహం చెంది ఆందోళన చేపట్టారు. -
అమ్మమ్మ తోడుగా..
తిమ్మాపూర్ : ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బారె చంద్రమణికి ఎల్ఎండీ రిజర్వాయర్ శివారులోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆర్థిక స్థితి బాగాలేనందున, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేమని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి సమక్షంలో రామకృష్ణకాలనీ సర్పంచ్ సారయ్య, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. కొంతకాలంగా రామకృష్ణకాలనీలో ఉంటున్న బారె చంద్రమణి, పొరండ్లకు చెందిన నీలం భాస్కర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చంద్రమణి మరణించిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి ఆమె తల్లిగారి ఊరైన కాటారం మండలం దామెరకుంటకు పోలీ సులు సమాచారంమందించారు. చంద్రమణికి ఏడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉండగా రామకృష్ణాకాలనీ గ్రామస్తులే ఆలనాపాలనా చూశారు. మృతురా లి తల్లి మధునమ్మ, కుటుంబసభ్యులు బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకోగా ఆమె ఫిర్యాదు మేరకు గురువారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దామెరకుంటకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ ఆర్థికస్థితి బాగాలేదని చెప్పడంతో రామకృష్ణాకాలనీ సర్పంచ్ కిన్నెర సారయ్యతోపాటు గ్రామస్తులు కలి సి ఎల్ఎండీ శివారు లో ఖననం చేశారు. అప్పటి దాకా గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న మృతురాలి పిల్లలు మనోహర్(5), రమ్య(7)ను అంత్యక్రియల సమయంలో అక్కడికి తీసుకురాగా అమ్మమ్మను, మామయ్యను చూసి పిల్లలు విలపించారు. పిల్లల పరిస్థితి చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అంత్యక్రియల అనంతరం పిల్లలిద్దరూ అమ్మమ్మతో వెళ్లిపోయారు. జీవితంపై విరక్తిచెంది... భాస్కర్ ఇంట్లో గొడవల కారణంగా అతనితోపాటు తన కూతురు చంద్రమణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మధునమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రమణికి 2007 లో పోచమల్లుతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు. గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటినుంచి పిల్లలిద్దరినీ చంద్రమణి తీసుకుని పొరండ్లకు వచ్చి కూలీ పని చేసుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పొరండ్లకే చెందిన నీలం భాస్కర్తో కలిసి రెండేళ్ల నుంచి రామకృష్ణకాలనీలో ఉంటోందని, ఇదే సమయంలో భాస్కర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలియడంతో జీవితంపై విరక్తి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని, తన కూతురు చికిత్స పొందుతూ మరణించిందని మధునమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. -
‘ఆసరా’ ఆగమాగం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో పింఛన్ల (ఆసరా) పంపిణీ తొలిరోజు ఆందోళనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు జాబితాలో లేవని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకొని నిరసన తెలిపారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలం పెద్దతండాలో కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ కూడా లబ్ధిదారులు జాబితాలో తమ పేర్లు లేవని ఆయనకు మొర పెట్టుకున్నారు. గతంలో జాబితాలో పేరుండి పింఛన్ అందుకున్న వేలాది మంది లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి. వారనుకున్నట్టే జరిగింది. రెండు నెలలుగా పింఛన్ జాబితాలో తమపేరు ఉంటుందో.. లేదోనని ఎదురుచూశారు. చివరకు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆందోళనతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కూసుమంచి మండలం గంగబండ తండాకు చెందిన 50 మంది లబ్ధిదారులు తమ పేర్లు జాబితాలో లేవని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు. అర్హులకు పింఛన్లు రాలేదని తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్- ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దతండాలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాగా కొంతమంది లబ్ధిదారులు తమకు పింఛన్ రాలేదని మొరపెట్టుకున్నారు. పునర్విచారణ చేసి అర్హులైన వారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాబితా తారుమారు.. రఘునాథపాలెం మండలంలో అసరా పథకం గందరగోళంగా మారింది. మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలకు చెందిన ఆసరా లబ్ధిదారులు తమ పంచాయతీ జాబితాకు బదులు పక్క పంచాయతీల్లో నమోదు అయ్యాయి. ఇలా చింతగుర్తి, మల్లేపల్లి, కోయచెలక, రేగులచెలక పంచాయతీల పరిధిలో ఇలాంటి అస్తవ్యస్తతే నెలకొంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో అర్హులకు ఫించన్ మంజూరు కాలేదని మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. 17, 18 వార్డుల కౌన్సిలర్లు దుంపల అనురాధ, దుంపల సరోజలు అర్హులకు ఫించన్లు మంజూరు చేయని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని కమిషనర్ను హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీ కేంద్రాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చేరుకున్నారు. కార్యాలయం తెరవకముందే వారు వ్యయప్రయాసలతో అక్కడకు చేరుకున్నారు. కార్యాలయాలకు వచ్చిన అధికారినల్లా ‘నా పింఛన్ వచ్చిందా? సారూ..’ అని ప్రశ్నించారు. ‘ఇంకా రాలేదు.. ఇప్పుడే ఎందుకు వచ్చారంటూ’ అధికారుల చీదరింపులతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల జాబితా సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పింఛన్లు అందని అర్హులతో వేంసూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కొణిజర్ల మండలంలో పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో వారంతా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చిన్నగోపతికి చెందిన 60 మంది అర్హులకు పించన్లు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమే ఇప్పించాం.. ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి పట్టణాల్లో పింఛన్ జాబితాలు ప్రకటించడంతో ‘మీమే మీకు పింఛన్ ఇప్పిస్తున్నామని’ చోటామోటా నాయకులు గల్లీలో ప్రచారం చేశారు. పలువురు అర్హులు తమపేర్లు జాబితాలో ఎందుకు లేవని వారిని నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేక జారుకున్నారు. ఖమ్మం నగరంలో పంపింగ్ వెల్ రోడ్డు, గాంధీచౌక్, రాపర్తినగర్, ఇందిరాగనర్ ప్రాంతాల్లో ఇలా అర్హులు నేతలను నిలదీశారు. దరఖాస్తు సమయంలో రాజకీయం చేసిన పార్టీలు ఇప్పుడు అర్హులు తమకు పింఛన్ రాలేదని నిలదీస్తుండడంతో మొఖం చాటేస్తుండడం గమనార్హం. ఇక కొన్ని మండలాల్లో ఇంకా పింఛన్ జాబితాలు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఆంధ్రా అధికారుల అడ్డగింత
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విలీన మండలాల్లో పాలనపై పట్టుసాధించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశం మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆయా మండలాల్లోని ఉద్యోగుల జీతభత్యాల వివరాలు పంపించాలని డీడీవోలకు సూచించారు. ఈ క్రమంలో నెల్లిపాక మండల ఉపాధ్యాయుల వివరాల సేకరణకు అక్కడి అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న ముంపు ఉద్యోగ సంఘ నాయకులు అక్కడికి చేరుకొని ఆంధ్ర అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్ల విషయం తేల్చకుండా వివరాల సేకరణకు ఎలా వస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని, ఆ తరువాతనే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని కొద్దిసేపు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేలా చూశారు. కాగా, ఉద్యోగుల నిరసనల మధ్య వివరాలు సేకరించకుండానే అధికారులు వెనుదిరిగారు. -
ప్రభుత్వ భూమిలో ‘ప్రైవేటు' పట్టా
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నే రీతిలో తాజాగా సోమవారం మంథనిలో ఓ భూబాగోతం బయటపడింది. ఖాళీ స్థలంతో పాటు ఆర్డీవో వసతిగృహం, రెండు ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాన్ని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని మరో ముగ్గురికి అమ్మినట్టు రిజిస్ట్రేయడంతో పాటు దానిని ఆన్లైన్లో నమోదు చేసిన తీరు అధికారులనే నివ్వెరపర్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కూపీ లాగుతున్నారు. మంథని : మంథని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 108 సర్వే నంబరులో 36 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 18 గుంటల్లో ఆర్డీవో వసతిగృహం, మరో రెండు కార్యాలయాల పక్కా భవనాలు నిర్మించారు. మిగిలిన 18 గుంటల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి కేటాయించారు. ఈ సంఘానికి కేటాయించిన భూమిలో ఇటీవల ప్లాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సంబంధిత అధికారులను సంప్రదించారు. అధికారులు దీనిపై ఆరా తీయగా.. ఈ 36 గుంటల భూమి ముస్కె రాజు అనే వ్యక్తి పేరిట పట్టా అయిన విషయం బయటపడింది. సదరు పాసు పుస్తకాలు ఆన్లైన్లోనూ నమోదయ్యాయి. మరింత లోతుగా ఆరా తీస్తే.. ఈ భూమిని మరో ముగ్గురికి విక్రయించడంతో పాటు వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో గుంట స్థలానికి రూ.6-8 లక్షల ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ సుమారు 3కోట్లు. ఎలా జరిగింది..? ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలను సృష్టించడం ఈ మధ్యకాలంలో పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆన్లైన్ నమోదు మాత్రం అంత ఆషామాషీ కాదు. రైతు తన పేరును ఆన్లైన్లో నమోదు చేయాలని తహశీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే.. వీఆర్వో ధ్రువీకరించిన అనంతరం తహశీల్దార్ తన డిజిటల్ సంతకం ద్వారా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు మంథని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. విచారణ వేగవంతం ప్రభుత్వ స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట పట్టా, రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. సబ్రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో వివరాలు సేకరించి అక్కడ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లో అక్రమంగా పాస్బుక్లు నమోదు చేయడాన్ని సైబర్ నేరంగా భావించి ఆ దిశగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పట్టా, రిజిస్ట్రేషన్ రద్దు చేయించి సదరు బాధ్యులపై చర్యలకు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. పాస్బుక్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్బుక్, ఆన్లైన్ నమోదు రికార్డుల ఆధారంగానే మేం రిజిస్ట్రేషన్ చేశాం. భూమి వివరణలో పట్టా ఉండడమే కాకుండా పట్టాదారు, అనుభవదారు ఖాతాలో యజమాని పేరు నమోదైంది. అన్ని ఆధారాలున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో మాత తప్పేమీ లేదు. - మురళీకృష్ణ, సబ్ రిస్ట్రార్, మంథని పూర్తిగా ప్రభుత్వ భూమే.. మంథని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 108 సర్వే నంబర్లో ఉన్న 36 గుంటల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి అక్రమంగా పట్టా కావడం అయి, పాస్బుక్ జారీ కావడం, ఆన్లోన్లో నమోదవడం, రిజిస్ట్రేషన్ చేయడంపై వివచాణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - జల్ల సత్తయ్య, తహశీల్దార్, మంథని -
ఇదేమి న్యాయం..!
గాలివీడు: మాకు సెంటు భూమి కూడా లేదు.. ఐదెకరాలు ఉందని పింఛన్ రద్దు చేశారు.. ఇదేమి న్యాయం.. అధికారులు అక్రమాలకు పాల్పడి మా పింఛన్లను తీసివేశారు. అంటూ పింఛనర్లు శనివారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ఎంపీడీఓను కార్యాలయంలోనే నిర్బంధించి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్కుమార్రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పినా వినిపించు కోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపీడీఓ కార్యాలయానికి వేసిన తాళం తీయలేదు. ఎంపీడీఓ మినహా మిగిలిన అధికారులు కార్యాలయం బయటనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లడం కోసం వేచి ఉన్నారు. వీరు వ్యాన్లు, సుమోలలో వెళుతుండగా వారి వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి 10లోగా సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
మహిళా సంఘాల పనితీరు భేష్
- విదేశీ ప్రతినిధుల కితాబు - జిల్లా అధికారులతో కలిసి వెల్టూర్ గ్రామ సందర్శన సదాశివపేట: వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సెర్ప్, డీఆర్డీఏ, ఐకేపీ జిల్లా అధికారులు గురువారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సంఘాల సభ్యులతో మాట్లాడి సంఘం రికార్డులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 54 సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘం ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను స్థానిక సిబ్బంది, సమాఖ్య లీడర్లు వీరికి వివరించారు. బ్యాంకుల ద్వార 47 సంఘాలకుగాను రూ.1,78,5500 బ్యాంకు రుణాలతోపాటు, శ్రీనిధి బ్యాంకు ద్వారా 29 స్వయం సంఘాల గ్రూపుల్లోని 135 మందికి రూ.15,65,440 బ్యాంకు రుణాలు ఇచ్చారని తెలిపారు. వీటితో తాము పాడిగేదెలు, మేకలు, గొర్రెల పెంపకం, కూరగాయలను పండించడం, అమ్మడం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం తదితరాలకు వినియోగించామన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ మండల సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియా నుంచి స్నేహాల్సోహేల్, ఇరాన్ ప్రతినిధి ఫతేమహ అబ్కారి, కేన్యా నుంచి వెన్నా మొకారి ఓంవారి, మాడగాస్కర్ నుంచి రకోటమాలాల మిరియా రబియారిసో, షేశేల్లీస్ నుంచి బెట్టి మరియాసోపా, టంజానియా నుంచి ప్రోన్సికో ఎలాయాస్, తైలాండ్ నుంచి డమరోగో జయంతోలతో పాటు రాషఫకేశ్వర్లతో మండల ఐకేపీ ఎపీఎం వెంకట్ పాల్గొన్నారు. -
స్థానికంగానే ఉండాలి
మెదక్ రూరల్: వసతి గృహాల వార్డెన్లంతా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాలని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వసతి గృహాల వార్డెన్లు, అధికారులతో సలహాసంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ, కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పోల్చుకుంటే వసతిగృహాల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదన్నారు. సరైన పర్యవేక్షణ, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించిన రోజునే వసతి గృహాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు. వసతిగృహాల్లో చేరే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారికి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాల్సిన బాధ్యత వార్డెన్లపైనే ఉందన్నారు. అందువల్ల వార్డెన్లంతా స్థానికంగా ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో తాను కూడా వసతిగృహాల్లో రాత్రిబస చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా వసతిగృహాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులుంటేనే..వసతి గృహాల మనుగడ తగిన సంఖ్యలో విద్యార్థులుంటేనే వసతి గృహాల మనుగడ సాగిస్తాయన్న సత్యాన్ని వార్డెన్లంతా గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీసీ వసతిగృహాల్లో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు ఖాళీగా ఉన్నాయని మెదక్ బీసీడబ్ల్యూఓ రాంరెడ్డి డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకురాగా, ఆమె పై విధంగా స్పందించారు. వసతి గృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మెనూ ప్రకారం భోజనం పెడితే విద్యార్థులు ఎందుకు రారని ఆమె ప్రశ్నించారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సమష్టిగా కృషి చేసి వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని వసతి గృహాల్లోని సమస్యలను ఆయా మండలాల వసతి గృహాల అధికారులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె పురాతన భవనాల మరమ్మత్తులకోసం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అలాగే అవసరమైన చోట నూతన భవనాలను నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్లతో పాటు నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు నాలుగు మండలాల వసతిగృహ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వసతిగృహ అధికారులు డిప్యూటీ స్పీకర్కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా..
పత్తికొండ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా.. ఇప్పటికీ పలువురు పతుల చాటునే మిగిలిపోతున్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన భర్తలు.. వారిని వంటింటికే పరిమితం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ పలువురు మహిళా నేతల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పరిపాలనపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి అధిక శాతం మహిళా సర్పంచ్ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు హాజరు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోతిరాళ్ల శిరీష, హోసూరు వాకిట శారద, మండగిరి రసూల్బీ, పులికొండ రంగమ్మ, చిన్నహుల్తి హుల్తెమ్మ స్థానంలో వారి సంబంధీకులు హాజరయ్యారు. మహిళలు వంటింటి పరిమితమనే భావన ఎప్పటికి తొలగిపోతుందో.. వారిలో చైతన్యం ఎప్పుడొస్తుందో.. వేచి చూడాల్సిందే. -
కొవ్వూరు ‘సాక్షి’ విలేకరిపై ఎమ్మెల్యే రామారావు దాడి
ఏలూరు, న్యూస్లైన్ : కొవ్వూరు మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వివరాలు సేకరించేందుకు సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన సాక్షి విలేకరి జీవీవీ సత్యనారాయణపై ఎమ్మెల్యే టీవీ రామారావు దాడిచేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకునేందుకు అంగీకరించారని స్థానిక నాయకులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్ధేశిత గడువు ముగిసినందున నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించే అవకాశం లేదని ఎన్నికల అధికారి యు.వసంత్కుమార్ నాయకులతో స్పష్టం చేశారు. ఇదిలావుండగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎమ్మెల్యే టీవీ రామారావు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ల ఉప సంహరణకు అనుమతించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఆ సమయంలో ఎంపీడీవో పి.వసంతమాధురి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా ఏకగ్రీవం చేసుకుంటామని అడగడం సరికాదని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ అంశంపై ఏమీ మాట్లాడనవసరం లేదని దయచేసి మా పనులకు ఇబ్బంది కలిగించవద్దని ఎమ్మెల్యేను ఎంపీడీవో కోరారు. ఎన్నికల అధికారిని రహస్యంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా మీతో మాట్లాడాలి పక్క గదిలోకి రమ్మని ఎమ్మెల్యే ఎన్నికల అధికారిని కోరి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఎన్నికల అధికారిని ఫొటో తీసేందుకు సాక్షి విలేకరి ప్రయత్నిస్తుండగా ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే రామారావు విలేకరిపై దాడికి పాల్పడ్డారు. మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఫొటోలు తీస్తావా అంటూ దుర్భాషలాడి పిడిగుద్దులు గుద్దారు. నిన్ను, నీ పేపర్ను పెట్రోల్ పోసి తగలబెడతానంటూ ఆగ్రహంతో చిందులు వేశారు. తరచూ తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ దుర్భాషలాడుతూ రాయడానికి వీల్లేని బూతులను ప్రయోగించారు. కేకలు వేస్తున్న ఎమ్మెల్యేను ఎంపీడీవో, ఎన్నికల అధికారి దయచేసి బయటకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేను బయటకు పంపి కార్యాలయం బయట ద్వారం తలుపులు మూసివేశారు. ఆ సమయంలో కోపోద్రేకుడైన ఎమ్మెల్యే నా కొడకా బయటకు రారా నిన్ను చంపేస్తానంటూ సాక్షి విలేకరిపై చిందులు వేశారు. అనంతరం వెనుక గుమ్మం వద్ద నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సాక్షి విలేకరి వద్దకు వచ్చి బయటకు రా నా కొడకా చంపుతానంటూ కేకలు వేశారు. దీంతో భయం వేసిన విలేకరి కార్యాలయంలోకి పరుగు పెట్టారు. భయంతో తనపై జరిగిన దాడి విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సుమారు గంట పాటు తలదాచుకున్న సాక్షి విలేకరిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అధికారుల సమక్షంలోనే ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు ఓ ప్రత్రిక విలేకరిపై విచక్షణ కోల్పోయి దాడికి తెగబడడంతో అక్కడున్న కార్యాలయ సిబ్బంది, అధికారులు, పలువురు నాయకులు నిర్ఘాంతపోయారు. దీనిపై విలేకరి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ప్రతినిధులు పోలీసు స్టేషన్కు చేరుకుని విలేకరిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘ అధ్యక్షుడు దుద్దుపూడి రామచంద్రరావు (రాము), ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే టీవీ రామారావుపై 341, 323, 506 క్లాజ్-2 కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ ఎన్.చిరంజీవి తెలిపారు.