-
రామోజీ అక్రమాలు సుప్రీం తీర్పుతో బయటకు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీ రావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామోజీ.. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది. రామోజీ రావు అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. రామోజీ అక్రమాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయి. 2024 ఎన్నికలను కూడా శాసించాలని రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వాళ్లు సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనంగా ఇస్తున్నారు. అంతేకానీ, మార్గదర్శి గురించి చిన్న వార్త అయినా ఈనాడులో రాశారా?. అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను పాటించలేదు. రామోజీ ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా? అని ప్రశ్నించారు. వాలంటీర్లపై తప్పుడు రాతలు రాశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారు. ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు విషయం కక్కారు. ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయి. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఉంటారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయి. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైంది. గొడవలు వాళ్లు సృష్టించి మాపై నిందలు వేస్తున్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం సాధిస్తుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారు. వృద్ధులు చనిపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ గొడవలు సృష్టిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్వేనని తెలుస్తోంది. -
‘గురివింద’ బండారం బట్టబయలు
విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్కేస్తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది. రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్లో అకౌంట్స్ అసిస్టెంట్గా, మరొకరు శ్రీనివాస్ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. డిజిటల్ చెల్లింపులేవి రామోజీ! 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగదు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడులో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్ఫండ్స్ ద్వారా భారీగా నగదు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమనార్హం. చందాదారుల నుంచి డిజిటల్/ఆన్ౖలెన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా మనీ లాండరింగే.. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ మనీ లాండరింగ్కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్ఫండ్స్ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది. -
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్మనీ రాకెట్ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్మనీ రాకెట్ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్ఫండ్స్పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది కాల్మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ఫండ్స్లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్గా నిలుస్తున్న మార్గదర్శి చిట్ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్ను భర్తీ చేయవచ్చు. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
సుప్రీంకోర్టు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
రామోజీకి షాక్.. మార్గదర్శికి సుప్రీంకోర్టు ఝలక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఆంధ్రప్రదేశ్లోనే మార్గదర్శి చిట్ఫండ్స్ నేరాలకు పాల్పడింది. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. ఏపీలో మార్గదర్శి చిట్ఫండ్స్ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. చిట్ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం. కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది. మార్గదర్శిపై ఏపీ సీఐడీ దర్యాపు.. మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే, అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు?. రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ►ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ►ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. ►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు. ►ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు ►విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు ►రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. ►చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. ►చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. ►పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ►ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ►ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
రామోజీకి షాక్.. సుప్రీంకోర్టుకు యూరీ రెడ్డి
సాక్షి, అమరావతి: మార్గదర్శి విషయంలో ఈనాడు అధినేత రామోజీరావుకు మరోసారి షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. అయితే, ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఛాలెంజ్ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరీ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, యూరీ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు: యూరీ రెడ్డి -
’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాము మార్గదర్శి చిట్ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది. -
రామోజీ, శైలజా కిరణ్పై చర్యలన్నీ 8 వారాలు నిలిపివేత
సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్ఫండ్స్లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు. రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు. వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు
సాక్షి, విజయవాడ: ఏదైనా చిట్ఫండ్స్లో సేవింగ్స్ చేసేది ఆస్తులు కొనుక్కోవడానికే కాని.. అమ్ముకోవడానికి కాదని మార్గదర్శి బాధితురాలు అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శిలో ఎనిమిదేళ్లుగా చిట్లు వేసి వేధింపులు ఎదుర్కొన్నానని.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని సైతం అమ్మేసుకున్నానని.. తనలాంటి వాళ్ల జీవితాలను నాశనం చేసిన మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని కంటతడి పెట్టారామె. నా తల్లిదండ్రులు కొంత అమౌంట్ ఇచ్చారు. ఫ్రౌల్టీ ఫామ్ పెట్టుకుని.. ఆ తర్వాత మార్గదర్శిలో చిట్ వేశాను. మొదట్లో.. బాగానే ఇచ్చారు. దాని తర్వాత ఒత్తిడి చేసి ఒక చిట్ నుంచి రెండు.. రెండు నుంచి నాలుగు.. నాలుగు నుంచి ఎనిమిది.. ఇలా 90 చిట్ల వరకు తీసుకువెళ్లారు. ఆ ఆర్థిక భారాన్నంతా నా నెత్తి మీద రుద్దారు. వేసిన చిట్ డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడ్డారు. నేను వేసిన 17 చిట్స్లో నన్ను డిఫాల్ట్ చేశారు. మా గ్యారెంటీర్లను వేధించారు. మా ఇంటి పరువును బజారుకు కీడ్చేలా చేశారు. నా కూతుళ్ల పెళ్లి చేయలేకపోయా. వాళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు కూడా ఇచ్చేశా. నాలుగు ఫ్లాట్లు అమ్మించి డబ్బు కట్టించుకున్నారు. చదువుకున్న వాళ్లను కూడా సులువుగా మోసం చేయగలిగారు. ఇన్ని చిట్లు వేస్తే.. మాకు చివరగా వచ్చింది రూ.210 మాత్రమే. ఈ రకమైన కుట్రకు పాల్పడి.. తన లాంటివాళ్లెందరో రోడ్డున పడేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె మీడియా సాక్షిగా అధికారులను కోరారు. బాధితురాలు అన్నపూర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారని.. ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలు పొందుపరిచామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ మీడియాకు వెల్లడించారు. -
రామోజీ చట్టాలకు అతీతుడా?
సాక్షి, అమరావతి/ గాందీనగర్ (విజయవాడ): కేంద్ర చిట్ఫండ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈనాడు రామోజీరావుకు రాజ్యాంగం వర్తించదా? ఆయన చట్టాలకు అతీతుడా అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ‘చిట్ఫండ్స్ సంస్థలు, ఆర్థిక సంస్థల మోసాలు – నివారణ చర్యలు’ అనే అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో కొమ్మినేని శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్రాల్లో చిట్ఫండ్స్ సంస్థల మోసాలపై దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్గదర్శి చిట్ఫండ్స్ను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర చట్టాలు మార్గదర్శి చిట్ఫండ్స్కు వర్తించవా అని సామాన్యులకు సందేహం కలుగుతుండటం న్యాయ వ్యవస్థకు కూడా అపప్రదను తెస్తుందని అన్నారు. రామోజీరావు తప్పు చేయలేదని భావిస్తే సీఐడీ దర్యాప్తునకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని నిశితంగా పరిశీలించి అడ్డుకట్ట వేయాలని కోరారు. ♦ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ విచారణకు రామోజీరావు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీరావు ఈనాడు పత్రికను కవచంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సహకార వ్యవస్థను కుట్రపూరితంగా దెబ్బతీశారని శారదాంబ మహిళా సహకార బ్యాంకు మాజీ చైర్పర్సన్ శిష్టా ధనలక్ష్మి చెప్పారు. ఆర్బీఐ ఆడిటింగ్ నిర్వహించే పటిష్ట వ్యవస్థ కలిగిన సహకార బ్యాంకులపై ఈనాడు పత్రిక ద్వారా దు్రష్పచారం చేయించారన్నారు. ♦ ప్రముఖ ఆడిటర్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తోందని విమర్శించారు. చట్టాల అమలుకు అథారిటీ పోలీసు శాఖే అని, ఆ శాఖ ఆధ్వర్యంలోని సీఐడీ దర్యాప్తు చేయకూడదని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మేధావులు ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. కృష్ణా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సైకం భాస్కరరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ కేంద్రంగా నల్లధనం భారీగా చలామణి చేస్తున్నారని విమర్శించారు. నగదులోనే లావాదేవీలు నిర్వహిస్తూ ఆ పూర్తి మొత్తానికి కూడా రశీదులు ఇవ్వరని చెప్పారు. ♦ న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్గదర్శి తరహాలోనే విజయవాడలో 15 ఏళ్ల క్రితం అక్రమాలకు పాల్పడిన సిరి గోల్డ్ వంటి సంస్థలను మూసివేయించారన్నారు. అంతకంటే భారీ మోసాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో కనీ్వనర్ ఎం.కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు, ఆడిటర్లు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిబంధనలను అనుసరించి సోదాలు చేయొచ్చు
సాక్షి, అమరావతి: చిట్ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన అన్ని శాఖల్లో సోదాలు చేయవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం చిట్ పుస్తకాలు, రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్కు ఉందని తెలిపింది. అలాగే ప్రభుత్వం నియమించే అధీకృత అధికారి కూడా పని వేళలు లేదా పని దినాల్లో నోటీసు ఇచ్చి లేదా నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేయవచ్చని చెప్పింది. మార్గదర్శి రోజూవారీ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సోదాలు చేయొచ్చని, ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలిపింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా తప్ప, మార్గదర్శి చిట్ఫండ్స్లో ఎలాంటి సోదాలు నిర్వహించడానికి వీల్లేదంది. సీఐడీ లేదా ఇతర అధి కారులు సోదాల పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యా పార కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదని చెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ కొందరికి ఆథరైజేషన్ ఇవ్వడం చిట్స్ ఇన్స్పెక్టర్ల నియామకం కిందకు రాదని పేర్కొంది. అలాంటి ఆథరైజేషన్ అనుమతించదగ్గదా కాదా అన్న విషయాన్ని లోతుగా విచారిస్తామంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థకు చెందిన అన్ని శాఖల్లో చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోదాల నిమిత్తం జారీ చేసిన ప్రొసీ డింగ్స్ను స్టే చేయడంతో పాటు తమ సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య రెండు రోజుల క్రితం మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ వాదనలు విని తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. బుధవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖల్లో సోదాలను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే చట్ట ప్రకారం సోదాలు చేసేందుకు అనుమతినిచ్చారు. -
మార్గదర్శిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సామర్లకోట: మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడుకొన్నప్పటికీ, సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు. సామర్లకోట సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం కాకినాడలోని డెయిరీ ఫార్మ్ సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన పెంకె మోజెస్ 2020 మార్చిలో మార్గదర్శి ఏజెంట్ ద్వారా సామర్లకోట బ్రాంచిలో రూ.లక్ష విలువ కలిగిన రెండు చిట్స్ తీసుకొన్నారు. ఒక్కో చిట్కు నెలకు రూ.2,500 చెల్లిస్తున్నారు. నాలుగు నెలల తరువాత ఒక చిట్ను రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయనకు రావలసిన రూ.80 వేలకు సంబంధించి మార్గదర్శి బ్రాంచి మేనేజరును సంప్రదించగా ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ కావాలని చెప్పారు. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల స్యూరిటీ ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ ఇవ్వలేకపోయారు. దాంతో రూ.80 వేలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మోజెస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో మోజెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనిచ్చిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చట్ట ప్రకారమే సోదాలు
సాక్షి, అమరావతి : మార్గదర్శి చిట్ఫండ్స్ లిమిటెడ్ సంస్థే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం నివేదించింది. తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో తాజా సోదాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని నివేదించింది. చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైనాల జయసూర్య సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. చట్టం ఇచ్చిన అధికారం మేరకే చిట్ రిజిస్ట్రార్లు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పగలు సోదాలు చేస్తుంటే చందాదారులు ఇబ్బంది పడుతున్నారని, కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందంటున్న మార్గదర్శి.. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాత్రిళ్లు సోదాలు చేస్తుంటే తామేదో నేరం చేస్తున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేస్తోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. షట్టర్లు మూసి సోదాలు చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ సంస్థ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఘటనలు రిజిస్ట్రార్ల దృష్టికి వచ్చినందునే చట్ట ప్రకారం చర్యలు చేపట్టారని, నిబంధనలను అనుసరించే స్వతంత్రంగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలనూ ఉల్లంఘించలేదన్నారు. గత సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి సీఐడీ తరఫు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శిపై నమోతైన పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని, రెండింట్లో చార్జిషీట్లు దాఖలు చేశామని చెప్పారు. గతంలో నిర్వహించిన సోదాల్లో సీఐడీకి లభించిన పలు కీలక డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన తరువాత మార్గదర్శి ఎలాంటి మోసాలకు పాల్పడిందో అర్థమైందన్నారు. ఓ చిట్ గ్రూపులో ఇవ్వాల్సిన మొత్తాలను మరో చోట సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. నర్సరావుపేట చిట్ గ్రూపునకు చెల్లించాల్సిన మొత్తాలను రాజమండ్రి గ్రూపులకు సర్దుబాటు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. చందాదారులకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు మార్గదర్శిలో చాలా జరుగుతున్నాయన్నారు. రాత్రివేళ సోదాలు చేస్తున్నారు అంతకు ముందు మార్గదర్శి యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు, మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి వేళ సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిసారీ తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెస్తుంటే.. కొత్త ఎత్తుగడలతో ప్రభుత్వం సోదాలు చేస్తోందన్నారు. గతంలో ఇలాంటి సోదాలు జరగలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే జరుగుతున్నాయని అన్నారు. సోదాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళ లేదా బుధవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెలువరిస్తానని తెలిపారు. అప్పటివరకు సోదాలు చేయకుండా అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎస్జీపీ చింతల సుమన్కు మౌఖికంగా తెలిపారు. -
మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్ఫండ్ స్టార్టింగ్లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు ► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు. -
ఏపీవ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఆఫీసుల్లో సీఐడీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీలు చేపట్టింది. ఇక, మార్గదర్శి చిట్ఫండ్లో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా మార్గదర్శి చిట్ఫండ్లో రికార్డులు, పన్నులు చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 37 మార్గదర్శి బ్రాంచ్ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల సేకరించిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. నిన్న(బుధవారం) మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును సీఐడీ విచారణకు పిలిచింది. నేడు(గురువారం) మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, వీరిద్దరూ విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా రామోజీ, శైలజ కిరణ్ గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రాకపోవడం గమనార్హం. ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
రామోజీ, కిరణ్, శైలజలపై ప్రాథమిక ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది. ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది. ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు.. మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్ఐఆర్లు, రామోజీరావు, కిరణ్ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు. సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు.. ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు. సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. -
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు (ఫోర్మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్సైట్ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్మెంట్కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వెబ్సైట్ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్సైట్పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్సైట్ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
నమ్మబలికి మోసం చేశారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మార్గదర్శి యాజమాన్యం నన్ను నిలువునా ముంచేసింది. నా నుంచి 18 నెలల పాటు నెలకు రూ. లక్ష వాయిదాలుగా వసూలు చేసి పాట పాడిన డబ్బు ఇవ్వకుండా 4 నెలలు నరకయాతన చూపించారు.’ అంటూ ట్యాక్స్ కన్సల్టెంట్, న్యాయవాది, మార్గదర్శి బాధితుడు ముష్టి శ్రీనివాస్ వాపోయారు. ఆయన గురువారం విజయవాడలోని జిల్లా పోలీస్ కమిషనరేట్లో విలేకరులతో.. “మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ కె.శ్రీనివాసులు 2021 ఆగస్టులో నా దగ్గరకు వచ్చి మార్గదర్శిలో చిట్ వేయాలని కోరారు. అప్పటికే నా ఆస్తిని బ్యాంక్లో తనఖా పెట్టానని, చీటీ డబ్బులు ఇవ్వాలంటే సెకండ్ చార్జ్ తనఖా ద్వారా ఇస్తారా అని అడిగాను. ఓటీఎస్ తెచ్చుకుంటే హెడ్ ఆఫీస్తో మాట్లాడి చిట్ పాడుకునే అవకాశం కల్పిస్తామని ఇద్దరూ నమ్మబలికారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 నెలలు క్రమం తప్పకుండా వాయిదా డబ్బులు కట్టాను. 2022 డిసెంబర్ 29న బ్యాంకుతో ఓటీఎస్ ఒప్పందం చేసుకున్నాను. ఓటీఎస్ వచ్చిన వెంటనే మార్గదర్శి మేనేజర్కు తెలియజేసి చీటీ పాడాలని కోరాను. ఓటీఎస్ లెటర్, షూరిటీ, బ్యాంకు రసీదు, టైటిల్డీడ్ ఫారాలు మార్గదర్శికి అందించాను. ఫిబ్రవరి నెలలో చిట్ పాడతానంటే ఆ నెల వాయిదా కట్టించుకున్నారు. ఫిబ్రవరిలో పాట ఇవ్వకుండా మోసం చేశారు. మార్చిలో పాట ఇస్తామని, పాటలో పాల్గొనే అర్హత కోసం ముందే రూ. లక్ష వాయిదాగా చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బుల కోసం మా ఇంటికొచ్చారు. బార్బర్ షాపు వద్ద ఉన్నానని తెలుసుకుని అక్కడకొచ్చి మరీ డబ్బు వసూలు చేశారు. ఆ తరువాత పాట జరిగిందా.. లేదా అని అడిగినా ఎవరూ చెప్పలేదు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ ఫోన్ చేసి మీకే పాట వచ్చిందని, రూ. 11.50 లక్షలకు పాడారని చెప్పారు. పాట ఇంత మొత్తానికి పాడమని వాళ్లకు నేను లెటర్ ఇవ్వలేదు. వాళ్లే పాట నిర్ణయించేశారు. నా డబ్బులు నాకివ్వమని పలుమార్లు కోరినా ఇవ్వలేదు. షూరిటీ ఫారాలు ఇవ్వలేదని ఏప్రిల్ 14న, సెంకడ్ చార్్జపైనా అభిప్రాయం కోసం హెడ్ ఆఫీసుకు పంపామని 24వ తేదీన, సరైన షూరిటీలు సమర్పించ లేదని జూన్ 8న లెటర్లు పంపారు. వాటని్నంటికీ వెంటనే సమాధానం ఇచ్చాను. బ్రాంచి చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి తుదకు నేను కట్టిన డబ్బులనైనా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు’ అని వివరించారు. రిజిస్ట్రార్ను మేనేజ్ చేసి 50 మందికి బదులు 30 మందినే గ్రూపులో రిజిస్టర్ చేశారని తెలిపారు. ఈనాడు వితండవాదం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈనాడు బృందం బాధితుడు ముష్టి శ్రీనివాస్తో వితండ వాదానికి దిగింది. మార్గదర్శి తప్పేమీ లేదని, తప్పందా బాధితుడు ముష్టి శ్రీనివాస్దేనని చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. ఎన్పీఏపై ఈనాడు సంధించిన ప్రశ్నలకు ఏ మాత్రం జంకకుండా బాధితుడు సమాధానమిచ్చారు.. తాను డిఫాల్టర్ని అయితే, సరిగా వాయిదాలు కట్టకపోతే నేను పాట పాడేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. సెకండ్ చార్జ్ ద్వారా షూరిటీ తీసుకోకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. దాదాపు అరగంట పాటు ప్రశ్నించినా బాధితుడు దీటుగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక ఈనాడు బృందం అక్కడి నుంచి నిష్క్రమించింది. రామోజీరావుపై చీటింగ్ కేసు ♦ మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచి మేనేజర్, మరికొందరిపైనా కేసు ♦ మార్గదర్శి చిట్ఫండ్స్పై విజయవాడ న్యాయవాది ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్లో మోసాలపై మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.