-
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సేవలో వలంటీర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా రైతుల సేవలో భాగస్వాములు కానున్నారు. ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేసే వలంటీర్లను ఆర్బీకేలకు ప్రభుత్వం అనుసంధానించింది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లోనూ ఒక్కోవలంటీర్ చొప్పున కేటాయించింది. ఇంటర్లో బయాలజీ చదివిన వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ కేవైసీ నమోదులో వలంటీర్లు ఈ పంట నమోదులో ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే 100 శాతం ఈ పంట నమోదు పూర్తయ్యింది. వీఏఏ/ వీహెచ్ఏలు 87 శాతం, వీఆర్ఏలు 77 శాతం ఈ కేవైసీ (వేలిముద్రలు) పూర్తి కాగా, 10 శాతం రైతుల నుంచి వేలిముద్రల సేకరణ పూర్తయ్యింది. ఈ దశలో వలంటీర్లను రైతుల ఇళ్లకు పంపి వారి వేలిముద్రల నమోదులో భాగస్వామ్యం చేశారు. స్పెషల్ డ్రైవ్ రూపంలో ఈ నెల10 కల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణలోనూ భాగస్వామ్యం అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ ధాన్యం సేకరణలోనూ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఏ కేటగిరీ ఆర్బీకేలకు నలుగురు, బి, సి కేటగిరీ ఆర్బీకేలకు ఇద్దరు చొప్పున వలంటీర్లను కేటాయిస్తున్నారు. వీరిలో ఒకరు ఆర్బీకేకు అనుసంధానించిన వలంటీర్ కూడా ఉంటారు. ధాన్యం సేకరణ అసిస్టెంట్, రూట్ అసిస్టెంట్లుగా వీరి సేవలను వినియోగించుకుంటారు. కల్లాల్లోని ధాన్యం శాంపిళ్లను తీసుకొచ్చి తేమ శాతం తదితర ఐదు రకాల పరీక్షలు నిర్వహించడం, గోనె సంచులు సిద్ధం చెయ్యడం, లోడింగ్, అన్ లోడింగ్కు హమాలీలు, రవాణాకు వాహనాలను సమకూర్చడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడం, మొత్తం ప్రక్రియను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం వంటి సేవలందిస్తారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు వీరికీ శిక్షణ ఇస్తారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. దసరా తర్వాత రెండ్రోజుల పాటు శిక్షణ ఆర్బీకే కార్యకలాపాలపై వలంటీర్లకు దసరా తర్వాత రెండ్రోజులు శిక్షణ ఇస్తారు. ఆర్బీకేలకు వచ్చే రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్పుట్స్ కోసం కియోస్క్ ద్వారా దగ్గరుండి బుక్ చేయించడం, ఆర్బీకేలకు కేటాయించే ఇన్పుట్స్ను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పంటల వారీగా శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో కూడిన వీడియోలను స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, డిజిటల్ లైబ్రరీలో ఉండే పుస్తకాలను, ఇతర సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు ఆర్బీకే ద్వారా అందించే ఇతర సేవల్లోనూ రైతులకు తోడుగా నిలిచేలా తర్ఫీదునిస్తారు. సీఎం ఆశయాల మేరకు.. నేను పల్లంట్ల 2వ వార్డు వలంటీర్ను. నా పరిధిలో 93 కుటుంబాలున్నాయి. ఇప్పటివరకు వారికి అవసరమైన సేవలు మాత్రమే అందిస్తున్నా. ఇప్పుడు పల్లంట్ల ఆర్బీకేకు నన్ను అటాచ్ చేశారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉంది. వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయాల మేరకు సేవలందిస్తా. – పి.సందీప్, పల్లంట్ల ఆర్బీకే, ఏలూరు జిల్లా రైతులకు తోడుగా ఉంటా ఊళ్లో ఉన్న రైతులందరికీ సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టే. కొత్తగా వచ్చే తెగుళ్లు, పురుగుల సమాచారాన్ని పై అధికారులకు తెలియజేసి వాటి నివారణలో రైతులకు తోడుగా ఉంటాను. –పూల అన్వర్బాషా, ఎర్రగుడిదిన్నె ఆర్బీకే, నంద్యాల జిల్లా ఆర్బీకే సేవలు రైతు ముంగిటకు తీసుకెళ్తా మూడేళ్లుగా వలంటీర్గా సంతృకరమైన సేవలందించాను. ఇప్పుడు మా ఆర్బీకే పరిధిలో రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటా. ఆర్బీకే సేవలు రైతుల ముంగిటకు తీసుకెళ్తాను. – గంగదాసు ఉషారాణి,పెద్దవరం ఆర్బీకే, కృష్ణా జిల్లా -
'హర్ష'పాతం
సాక్షి, విశాఖపట్నం: కరువు ఛాయల్లేకుండా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపించాయి. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవి ప్రభావం చూపుతాయి. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవనాలే కీలకం. అందుకే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఇటు రైతులు, అటు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తి చూపుతాయి. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు ఇప్పటివరకు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తరచూ తేలికపాటి నుంచి మోస్తరుగాను, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిశాయి. ఇలా వరుసగా నాలుగేళ్ల నుంచి ఖరీఫ్ సీజనులో వరుణుడు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఎంతో దోహదపడ్డాయి. రుతుపవనాల సీజను మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏడు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల్లో ‘నైరుతి’ సీజన్ ముగింపు ఇక మరికొద్ది రోజుల్లోనే నైరుతి రుతుపవనాల సీజను ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో సాధారణం, ఐదు జిల్లాల్లో అధిక, ఒక జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం, కాకినాడ, బాపట్ల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అధిక వర్షపాతం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అరకొర వర్షాలతో కరువు పరిస్థితులేర్పడే అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణానికి మించి అధిక వర్షం కురవడం విశేషం. సాధారణం కంటే అధికం.. మరోవైపు.. నైరుతి రుతుపవనాల సీజనులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 514.7 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 544.3 మి.మీలు కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 6.0 శాతం అధికమన్నమాట. ఒక్క సెప్టెంబర్లోనే 95 మి.మీలకు గాను 115.9 మి.మీలు (22 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. నిజానికి.. సాధారణంకంటే 20 శాతానికి పైగా తక్కువ వర్షం కురిస్తే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇలా ఈ నైరుతి రుతుపవనాల సీజనులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు ఏర్పడకుండా ఖరీఫ్ సీజను ముగుస్తుండడం, అవసరమైనప్పుడల్లా వర్షాలు కురుస్తూ పంటలకు ఢోకా లేకపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
సూక్ష్మ సేద్యం విస్తరిస్తోంది
ఈయన పేరు ఆర్. రామ్మోహన్రెడ్డి.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేముల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.57 ఎకరాల్లో కంది, ఆముదం పంటలు సాగుచేసే వారు. 90 శాతం సబ్సిడీపై బిందు పరికరాల కోసం ఆర్బీకేలో నమోదు చేసుకున్నారు. సర్వేచేసి బిందు సేద్యానికి అనువైనదిగా గుర్తించారు. తన వాటాగా రూ.44,343 చెల్లించారు. దీంతో గతానికంటే భిన్నంగా నేడు ఎలాంటి సిఫార్సుల్లేకుండా దరఖాస్తు చేయగానే వెంటనే పరికరాలు అమర్చారు. ఇప్పుడు కొత్తగా బత్తాయి మొక్కలు వేసుకున్నారు. దీంతో రైతు రామ్మోహన్రెడ్డి ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతుభరోసా కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతో పాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. ఫలితంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులు దేశవ్యాప్తంగా సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు.. 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. సూక్ష్మ సేద్యానికి మరో 28.35 లక్షల ఎకరాలు అనువైనవి కాగా.. దశల వారీగా దీనిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. తొలివిడత కింద 2022–23లో రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం ద్వారా 1.70 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చాలని నిర్ణయించారు. తద్వారా అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులతో రూ.1,500 కోట్లకు పైగా జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్ : అదనపు స్థూల విలువ) సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. అనంతపురంలో అత్యధికంగా.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలకు చెందిన 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు.. 50 శాతం రాయితీపై రాష్ట్రవ్యాప్తంగా తుంపర పరికరాలు అందిస్తున్నారు. పరికరాల సరఫరాకు 37 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు 3,60,120 ఎకరాల్లో బిందు పరికరాల కోసం 1,13,757 మంది.. 57,817 ఎకరాల్లో తుంపర పరికరాల కోసం 20,080 మంది రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.02 లక్షల ఎకరాలకు 28,339 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 76,140 ఎకరాలకు 22,827 మంది, ప్రకాశం జిల్లాలో 37,245 ఎకరాలకు 12,759 మంది, వైఎస్సార్ జిల్లాలో 35,780 ఎకరాలకు 11,097 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ నాటికి లక్ష్య సాధన ఈ నేపథ్యంలో.. టెక్నికల్ కమిటీలతో క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ చురుగ్గా సాగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తయ్యింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అర్హత పొందిన రైతులకు తుంపర పరికరాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. బిందు పరికరాల కోసం ఇప్పటికే 20 వేల ఎకరాల్లో సర్వే పూర్తికాగా, 5వేల ఎకరాల్లో అమరిక పూర్తయ్యింది. పరికరాల అమరిక ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజుల్లోనే పరికరాలిచ్చారు. నేను 2.5 ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నా. 50 శాతం రాయితీపై తుంపర పరికరాలు తీసుకున్నాను. ఆర్బీకేలో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పొలానికి తీసుకొచ్చి ఇచ్చారు. మిరప సాగు తర్వాత అపరాలు సాగుకు వినియోగిస్తా. – శ్యామల సత్యనారాయణరెడ్డి, రామచంద్రపురం, ఎన్టీఆర్ జిల్లా డ్రిప్తో రూ.75వేల నికర ఆదాయం నాకు నీటి సౌకర్యం ఉన్న ఐదెకరాల పొలం ఉంది. డ్రిప్ లేకపోతే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు ఖర్చవుతుంది.. పంట దిగుబడి తక్కువగా వస్తుంది. అదే డ్రిప్ ఉంటే రూ.15వేలు సరిపోతుంది. ఆదాయం కూడా ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.75వేల వరకు వస్తుంది. – చుక్కా లక్ష్మీనారాయణ, రేకులకుంట, అనంతపురం జిల్లా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు నేను 4.91 ఎకరాల్లో నేరేడు పంట సాగుచేస్తున్న. ఆర్బీకేలో దరఖాస్తు చేయగానే సర్వేచేసి మంజూరు ఆర్డర్ ఇచ్చారు. ఈ మధ్యే పొలంలో పరికరాలు అమర్చారు. వీటి వినియోగంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషిచేస్తా. – చమరాతి ప్రమీలమ్మ, ఓదివీడు, అన్నమయ్య జిల్లా బుడ్డశనగ కూడా వేస్తున్నా.. నేను 2.44 ఎకరాల్లో వేరుశనగ సాగుచేస్తున్నా. సబ్సిడీపై తుంపర పరికరాలు ఇటీవలే అమర్చారు. వీటి ద్వారా వేరుశనగ పంటే కాకుండా బుడ్డశనగ ఇతర పంటలను కూడా సాగుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. – సి. రామసుబ్బారెడ్డి, గడ్డంవారిపల్లి, వైఎస్సార్ జిల్లా ఈసారి దిగుబడులు పెరుగుతాయి సూక్ష్మ సాగునీటి పథకం కింద తుంపర, బిందు పరికరాల కోసం రైతుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. పెద్దఎత్తున రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేరుకున్నారు. అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరిక చురుగ్గా సాగుతోంది. డిసెంబర్ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా దిగుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. – డాక్టర్ సీబీ హరనాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
ఖరీఫ్లో పంటల నమోదుకు ‘ఈ–క్రాప్’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. పక్కాగా నమోదు ఈ ఖరీఫ్లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్లో వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్తో సహా పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అనంతరం యాప్లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది. ఆ తర్వాత వీఏఏ /వీహెచ్ఏ, వీఆర్వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు. ఈ ఆప్షన్లో వివరాలు.. సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్ల్యాండ్లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్లు 5 శాతం, డీఏవో/డీహెచ్ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్గా తనిఖీ చేయాలి. ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్గఢ్లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
20 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను ఈ నెల 20వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కె–6, నారాయణి, కదిరి లేపాక్షి (కె–1812) రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. గత సీజన్లో మాదిరిగానే ఈ విత్తనాల్లో మూడోవంతును సొంతంగా అభివృద్ధి చేసిన వాటినే పంపిణీ చేయనుంది. ఖరీఫ్లో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలు కాగా గతేడాది 18.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 5.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు కాగా, మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సర్టిఫై చేసిన సొంత విత్తనం సబ్సిడీ విత్తనం కోసం గతంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడే వాళ్లు. కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే సబ్సిడీపై పంపిణీ చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ కనీసం మూడోవంతు విత్తనమైనా సొంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత సీజన్ నుంచి సొంత విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. రబీ 2020–21లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత సర్టిఫై చేసి ఖరీఫ్–2021లో పంపిణీ చేశారు. గడిచిన రబీ 2021–22లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో సర్టిఫై చేసి ఖరీఫ్ సీజన్ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో.. లక్ష క్వింటాళ్లు రబీలో రైతులు ఉత్పత్తి చేసినవే. టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించే మిగిలిన విత్తనాన్ని సైతం ర్యాండమ్గా అగ్రి ల్యాబ్స్లో సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. అదేరోజు నుంచి కిలో రూ.85.80 ధర ఉన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను రూ.51.48కి రైతులకు పంపిణీ చేయనున్నారు. రైతుకు నాణ్యమైన విత్తనం విత్తనోత్పత్తి చేసే రైతు నుంచి నేరుగా విత్తనాలు సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమచేస్తున్నాం. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగుచేసే రైతుకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పోటీపడుతున్నాయి. సర్టిఫై చేసిన విత్తనాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
AP: ఈ-పంట ఉత్పత్తులు భేష్..
సాక్షి, అమరావతి: రసాయన అవశేషాల్లేని పంటల ధ్రువీకరణ (క్రాప్ సర్టిఫికేషన్) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం 2019 రబీ సీజన్లో వైఎస్సార్ పొలంబడులకు శ్రీకారం చుట్టింది. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? ఇందులో భాగంగా గ్రామానికి 25 ఎకరాలను ఎంపిక చేసి, విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతుల(జీఏపీ)పై ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తారు. తోటి రైతులతో కలిసి ప్రతి రోజూ పంటను పరిశీలిస్తూ సమగ్ర సస్యరక్షణ, పోçషక, నీటి, కలుపు, పురుగు మందుల యాజమాన్య పద్ధతులతో పాటు కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు ఎప్పుడు.. ఎలాంటి యంత్ర పరికరాలను వినియోగించాలో ఫామ్ మెకనైజేషన్ ద్వారా ఎంపికైన రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా సమగ్ర పంట నిర్వహణా పద్ధతులను పాటిస్తూ పర్యావరణహితంగా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో రసాయన అవశేషాలు లేకుండా మేలైన దిగుబడులను ఏవిధంగా సాధించవచ్చో తెలియజెపుతారు. రైతులు తమ సొంత వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని పాటించేలా ప్రోత్సహిస్తారు. పొలంబడులతోపాటు తోట, పట్టు, మత్స్యసాగు, పశు విజ్ఞాన బడులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. 10 నుంచి 22 శాతం పెట్టుబడి ఆదా 5 సీజన్లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యాల వంటి పంటల్లో 10 నుంచి 22% మేర పెట్టుబడి ఖర్చు ఆదాతో పాటు 10 నుంచి 24% మేర దిగుబడులు పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. మూడేళ్లలో రూ.71.17 కోట్లతో 39,944 పొలంబడుల ద్వారా 11.98 లక్షల మంది రైతులను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దారు. ఇదే స్ఫూర్తితో 2022–23 సీజన్లో రూ.50.27 కోట్లతో 17 వేల పొలంబడులు నిర్వహించాలని సంకల్పించారు. ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పటి వరకు శిక్షణలకే పరిమితమైన వ్యవసాయ శాఖ రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్, ప్రొటోకాల్స్పై రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది, రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు టెక్నికల్ కో ఆపరేషన్ ప్రొగ్రామ్ (టీసీపీ) కింద ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 30 మంది వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మలిదశలో ఈ నెల 16 నుంచి విడతల వారీగా ఆగçస్టు్ట 20 వరకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన 130 మంది అధికారులు, 260 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణనిస్తారు. శాస్త్రవేత్తలు పరీక్షించాకే ధ్రువీకరణ రానున్న ఖరీఫ్లో 9 రకాలు, రబీలో 7 రకాల పంటలకు సంబంధించి 5.10 లక్షల మంది రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. 3 సీజన్లలో పొలంబడులలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించిన రైతులను పంటల వారీగా గుర్తిస్తారు. వారికి దశల వారీగా శిక్షణనిస్తారు. నిర్ధేశించిన ప్రొటోకాల్ మేరకు రానున్న ఖరీఫ్ సీజన్లో మోతాదుకు మించి రసాయన పురుగు మందులు వినియోగించకుండా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను గుర్తిస్తారు. వీరు పండించిన పంట ఉత్పత్తుల నాణ్యతను వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించిన తర్వాత వారికి ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా జీఏïపీ సర్టిఫికేషన్ (ధ్రువీకరణ) జారీ చేస్తారు. ఇలా ధ్రువీకరణ పొందిన రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది. పొలంబడి పండితుడంటున్నారు నాకున్న రెండెకరాల్లో ఏటా కూరగాయలు సాగు చేసేవాడిని. గడిచిన రబీలో 1.5 ఎకరంలో పొలం బడి పద్ధతిలో, మిగిలిన అరెకరంలో పాత పద్ధతిలో వరి సాగు చేశాను. పొలం బడిలో సాగు చేసిన క్షేత్రంలో 42 బస్తాలు, మిగిలిన అరెకరంలో 12 బస్తాల చొప్పున మొత్తం 54 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.19,400 పోగా, రూ.55,400 మిగిలింది. పొలంబడిలో నేర్చుకున్న పాఠాలు తోటి రైతులకు చెబుతుంటే ఊళ్లో నన్ను పొలంబడి పండితుడు అంటున్నారు. ఇదే రీతిలో సాగు చేస్తే రానున్న ఖరీఫ్ సీజన్లో జీఏపీ గుర్తింపును ఇస్తామంటున్నారు. – జి.శ్రీనివాసులు, గాజులవారిపల్లి, చిత్తూరు జిల్లా జీఏపీ కోసం రూట్ మ్యాప్ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి జీఏపీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. టెక్నికల్ కో ఆపరేషన్ ప్రాజెక్టు కింద ఎఫ్ఏఓ ద్వారా రైతులతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా మూల్యాంకనం చేసి నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు జీఏపీ గుర్తింపునిస్తాం. కనీసం 5 లక్షల మందికి ఇలా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
AP: ముందస్తు ఏరువాక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్లో జలాశయాల కింద రైతులకు ముందుగానే సాగునీరు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సీజన్ను ముందుగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు సోమశిల కింద ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్కు ముందస్తుగా నీటిని విడుదల చేయాలని గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తుపానుల బారిన పడి రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా ఖరీఫ్కు ముందస్తు నీటి విడుదల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో హెల్త్ హబ్లకు భూములను కేటాయించడంతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2022–27 ఏపీ ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి, 2022–27 ఏపీ లాజిస్టిక్ విధానానికి పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు. వరుసగా వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు నీటితో మూడో పంటకు అవకాశం ► వైఎస్సార్ హాయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలిజేయడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకుని సమాయత్తం అవుతారు. ► గతంలో ఆగస్టులో నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఖరీఫ్కు వివిధ ప్రాజెక్టుల నుంచి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నాం. దీనివల్ల నవంబర్, డిసెంబర్లలో వచ్చే తుపానుల బారిన పడకుండా రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. అలాగే రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ► గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటి విడుదల చేయనున్నాం. పోలవరం రివర్ స్లూయిస్ డెడ్ స్టోరేజీ నుంచి, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. కృష్ణా డెల్టాకు, గుంటూరు చానల్కు జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తాం. పులిచింతలలో 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిచింతల పునరావాసానికి రూ.100 కోట్లు చెల్లించడంతో ఇది సాధ్యమైంది. దీంతో పట్టిసీమతో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. ► పెన్నా బేసిన్లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల ప్రాజెక్టుల నుంచి జూన్ 10న సాగునీటిని విడుదల చేస్తాం. సోమశిలలో 56 టీఎంసీల నీరు ఉంది. రాయలసీమలో ఎస్ఆర్బీసీ పరిధిలోని అవుకు, గోరుకల్లు నుంచి జూన్ 30వ తేదీన నీటిని విడుదల చేస్తాం. నాగార్జున సాగర్ కింద కుడిగట్టు ఆయకట్టుకు జూలై 15న నీళ్లిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా భరోసా ► ఖరీఫ్కు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సమస్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ► కొన్ని ప్రాంతాల్లో ఖరీప్ సీజన్ ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కింద ముందస్తుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభించడంతో ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తవని భావిస్తున్నాం. అలాగే మూడో పంట ద్వారా పంటల మార్పిడికి అవకాశం కలుగుతుంది. సాగునీటి విడుదల షెడ్యూల్ ఆధారంగా సాగు నీటి సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం ► ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం మే 13వ తేదీన ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా, మే 16న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తారు. మే 19న పశువులకు చెందిన అంబులెన్స్లను విజయవాడలో ప్రారంభిస్తారు. ► జూన్ 6న 4,014 కమ్యునిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్–21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను జూన్ 14న, జూన్ 21న అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)గా అప్గ్రేడ్. 38 అదనపు పోస్టులు మంజూరు. అప్గ్రెడేషన్ కోసం రూ.8.18 కోట్లు వ్యయం. ► పులివెందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. ► మార్క్ఫెడ్లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు. ► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం. ► రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం. కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ హబ్స్లో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూముల కేటాయింపు. మచిలీపట్నంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రి కోసం ఎకరా భూమి కేటాయింపునకు ఆమోదం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు. ► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్కు కేటాయింపు. ► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. ► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి. ► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు. ► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు. -
ఏపీలో మాత్రమే.. ఎరువుల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం గ్రామస్థాయిలో వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సేవలందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కేటాయింపులు, పంపిణీ అమలు తీరుపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా.. ఏపీలో మాత్రమే గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీ జరుగుతున్నదన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే రైతులకు అందించడంలో ఆర్బీకేలు కీలకభూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్ 2022 కోసం 19.02 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని, వాటిని నెలవారీగా నిర్ధేశించిన మేరకు రాష్ట్రానికి కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు గోదాముల నుంచి ఆర్బీకేలకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఖర్చులను కేంద్రం భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఏపీ ఎరువులకు ఇస్తున్న రాయితీలను కాంప్లెక్స్ ఎరువులకు కూడా ఇచ్చి ధరల వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ సూచించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు, రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగినప్పటికీ.. సబ్సిడీని పెంచిన విషయాన్ని గుర్తించాలన్నారు. -
ఆర్బీకేల ద్వారానే పత్తి విత్తన విక్రయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. -
ఏపీకి 19.02 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్–2022 సీజన్లో ఏపీకి రూ.19.02 లక్షల టన్నుల ఎరువులను కేటాయించనున్నట్టు కేంద్ర, వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజ వెల్లడించారు. ఖరీఫ్ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లతో సోమవారం ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పంటలు, భూసార పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్లుగా ఎరువుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. వరి సాగు లక్ష్యం 16.33 లక్షల హెక్టార్లు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్రంలో 57.32 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా వరి 16.33 లక్షల హెక్టార్లు, వేరు శనగ 7.30 లక్షల హెక్టార్లు, పత్తి 6.24 లక్షల హెక్టార్లు, కంది 2.70 లక్షల హెక్టార్లు, మినుము లక్ష హెక్టార్లు, పెసర 14 వేల హెక్టార్లు, జొన్న 17 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.16 లక్షల హెక్టార్లు, నువ్వులు 13 వేల హెక్టార్లు, రాగి 26 వేల హెక్టార్లు, మిరప 1.80 లక్షల హెక్టార్లు, కూరగాయలు 2.65 లక్షల హెక్టార్లు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 57.32 లక్షల హెక్టార్లుగా అంచనా వేశామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 79.8 శాతం నేలల్లో నత్రజని, 15.80 శాతం నేలల్లో భాస్వరం, 14.71 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్ లభ్యత తక్కువగా ఉన్న విషయాన్ని భూసార పరీక్షల్లో గుర్తించినట్టు కమిషనర్ తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రానికి యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ 2.25 లక్షల టన్నులు, ఎంవోపీ 1.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 6.41 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 95 వేల టన్నులు.. మొత్తం 19.02 లక్షల టన్నులు అవసరమని కమిషనర్ కోరగా.. ఆ మేరకు ఏపీకి ఎరువులను కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజలు ప్రకటించారు. -
ఖరీఫ్లో సిరుల పంట
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుంది. ఇది గత ఖరీఫ్ కన్నా 12.86 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. భారీ వర్షాలవల్ల ఈసారి ఉభయ గోదావరి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నప్పటికీ దిగుబడి కూడా మెరుగ్గా ఉంది. వ్యవసాయ రంగంపై రెండో ముందస్తు అంచనాలతో కూడిన వాస్తవ పత్రాన్ని ఆ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. ఆ వివరాలు.. ► ఈ ఖరీఫ్లో 40.29 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అదే గత ఖరీఫ్లో 39.86 లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేయగా 67.60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయినట్లు తుది అంచనాలు స్పష్టంచేశాయి. ► గత ఖరీఫ్లో ఎకరానికి సగటున 1,700 కేజీల ధాన్యం దిగుబడి కాగా.. ఈ ఖరీఫ్లో 1,997 కేజీలు రానుందని అంచనా వేశారు. ► మొక్కజొన్న ఉత్పత్తి కూడా గత ఖరీఫ్తో పోలిస్తే ఈసారి పెరిగింది. గత ఏడాది 4.34 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఖరీఫ్లో 5.26 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. ► కందులు కూడా ఈ ఖరీఫ్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ఇవి ఈసారి 1.19 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా గత ఖరీఫ్లో కేవలం 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. ► ఇక గత ఖరీఫ్లో మొత్తం పప్పు ధాన్యాలు 1.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే.. ఇప్పుడు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయి. ► గత ఖరీఫ్తో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఖరీఫ్లో అదనంగా 13.96 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. గత ఖరీఫ్లో 74.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా ఈ ఖరీఫ్లో 88.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కానున్నాయి. రూ.172 కోట్లతో సబ్సిడీ విత్తనాలు గడచిన ఖరీఫ్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.172 కోట్ల సబ్సిడీతో 11.80 లక్షల మంది రైతులకు 6.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అలాగే.. రైతుభరోసా కేంద్రాల ద్వారా 1.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసింది. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
'ఆర్బీకేల్లో' దండిగా ఎరువులు
సాక్షి, అమరావతి: రబీ–2021–22 సీజన్లో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. సీజన్లో 23.44 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. దీంతో ఆ మేరకు కేటాయింపులు జరిపేందుకు కేంద్రం కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏ దశలోనూ ఎరువుల కోసం ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రబీ పంటల సాగు కోసం అక్టోబర్లో 4.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం. ప్రారంభ నిల్వలు 6.51 లక్షల టన్నులుండగా.. అక్టోబర్ 26 నాటికి కేంద్రం 2.50 లక్షల టన్నుల మేర సరఫరా చేసింది. దీంతో ఎరువుల నిల్వలు 9.01 లక్షల టన్నులకు చేరుకున్నాయి. వీటిలో ఇప్పటివరకు 3.37 లక్షల టన్నుల ఎరువులను విక్రయించారు. ప్రస్తుతం 5.64 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల ద్వారా అవగాహన రబీ సీజన్ కోసం ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల టన్నులు ఎరువులు సరఫరా చేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 88 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ ఉంచగా.. అక్టోబర్ 26 నాటికి 25 వేల టన్నుల ఎరువులను రైతులకు విక్రయించారు. మిగిలిన ఎరువులను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్ మేరకు డీఏపీ, ఎంవోపీ ఎరువులను ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నివేళలా అన్ని పంటలకు డీఏపీ, ఎంవోపీ ఎరువులపైనే ఆధారపడకుండా సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కాంప్లెక్స్ ఎరువులే మేలు రబీలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డీఏపీ, ఎంవోపీలపైనే పూర్తిగా ఆధార పడకుండా కాంప్లెక్స్ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. డీఏపీలో నత్రజని, భాస్వరం, ఎంవోపీలో పొటాష్ మాత్రమే లభిస్తాయి. అదే కాంప్లెక్స్ ఎరువుల్లో నత్రజని, భాస్వరంతోపాటు పొటాష్, గంథకం వంటి ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల పంట ఎదుగుదల, దిగుబడిలో ఏ మాత్రం తేడా రాదు. ఎరుపు రంగు పొటాష్కు బదులు మార్కెట్లో తెలుపు రంగు పొటాష్ లభిస్తోంది. ఎరుపు రంగులో లభ్యమయ్యే 60 శాతం పొటాష్ తెలుపు రంగులోనూ ఉంటుంది. ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్న వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
వాస్తవ సాగుదారులకే పంటరుణాలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ).. ఇక ఈ–క్రాప్ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీతో అండ చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి ఎన్ఐసీ రూపొందించిన పోర్టల్లో బ్యాంకర్స్ అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్లో ఆధార్ నంబర్తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్ కమిటీ రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్సీ) పొందిన కౌలుదారులు, జేఎల్జీ గ్రూపులకు ఈ–క్రాప్ ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్వీపీఆర్) పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ–క్రాప్ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ–క్రాప్ ఆధారంగా రుణాలిస్తాం ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్ పోర్టల్స్ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు ఈ–క్రాప్ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్ ఆడిట్లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్చార్జ్ రిజిస్టర్కి అనుసంధానం చేస్తాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
ఆహార ధాన్యాల సాగు.. బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసింది. చివర్లో ‘గులాబ్’ తుపాను గుబులు పుట్టించినప్పటికీ ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలతో సాగు సజావుగా సాగింది. గత ఖరీఫ్తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణంలో కాస్త తగ్గినప్పటికీ ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త పెరిగింది. వరితో సహా మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఉల్లి లక్ష్యానికి మించి సాగయ్యాయి. మొత్తమ్మీద 96.4 శాతం మేర సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో నూరు శాతం అధిగమించగా, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 99 శాతం మేర సాగయ్యాయి. ఇక విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 90–96 శాతం మేర అయితే.. విశాఖలో మాత్రం 87 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమలో ‘వరి’ సిరులు ఖరీఫ్లో వరి సాధారణ విస్తీర్ణం 38.40 లక్షల ఎకరాలు. 2019లో అది 38.15 లక్షల ఎకరాలు అయితే, 2020లో 38.52 లక్షల ఎకరాల్లో సాగయింది. అదే ఈ ఏడాది 39.17లక్షల ఎకరాల్లో సాగైంది. విశాఖ (95 శాతం), శ్రీకాకుళం (96 శాతం), పశ్చిమగోదావరి (97 శాతం) జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నూరు శాతానికి మించి వరి సాగైంది. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరులో 193 శాతం, వైఎస్సార్ కడపలో 133 శాతం, అనంతపురంలో 125 శాతం, కర్నూలులో 100 శాతం మేర వరి సాగైంది. పెరిగిన మిరప, మొక్కజొన్న, అపరాలు ► గడిచిన సీజన్తో పోలిస్తే ఈసారి మిరప, మొక్కజొన్న రికార్డు స్థాయిలో సాగయ్యాయి. ► మిరప దాదాపు 1.24 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దీని సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలైతే.. గతేడాది 3.43 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఏకంగా 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఇక మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. తొలిసారిగా ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాల్లో సాగైంది. ► అపరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఖరీఫ్లో 6.76 లక్షల ఎకరాల్లో సాగైన అపరాలు ఈసారి 7.41 లక్షల ఎకరాల్లో సాగైంది. తగ్గిన వేరుశనగ, పత్తి సాగు ఇక ఖరీఫ్లో నూనె గింజల సాధారణ విస్తీర్ణం 18.97 లక్షల ఎకరాలు కాగా.. గత సీజన్లో 19.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 17.37 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే, గతేడాది 18.41 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ ఈ ఏడాది 16.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 14.73 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 12.86 లక్షల ఎకరాల్లో సాగైంది. -
విత్తన మాఫియా పెత్తనానికి చెక్ పెట్టేలా!
విత్తన మాఫియా నుంచి రైతుల్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ ఒక్క రైతు కల్తీ, నకిలీ విత్తనాల బారిన పడకూడదన్న సంకల్పంతో నాణ్యమైన విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. వచ్చే సీజన్కు సరిపడా విత్తనాలను ఇప్పటినుంచే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసింది. సీజన్ ప్రారంభానికి ముందే సర్టిఫై చేసిన విత్తనాన్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సీడ్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. – సాక్షి, అమరావతి 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేసేలా.. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్లో 94 లక్షల ఎకరాలు, రబీలో 59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. రెండు సీజన్లలో వివిధ పంటలకు సంబంధించి 8.75 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.06 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 2.50 లక్షల క్వింటాళ్ల శనగ, 2 లక్షల క్వింటాళ్ల వరి, 16,762 క్వింటాళ్ల అపరాలు, 2,500 క్వింటాళ్ల చిరు ధాన్యాల విత్తనాలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ దృష్ట్యా 2022–23 సీజన్కు సరిపడా విత్తనం కోసం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్యంగా విశేష ప్రాచుర్యం పొందిన రకాల విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ప్రస్తుత ఖరీఫ్లో కనీసం 38,468 క్వింటాళ్ల వేరుశనగ, 7,820 క్వింటాళ్ల శనగ, 3 వేల క్వింటాళ్ల వరి, 245 క్వింటాళ్ల అపరాలు, 3 క్వింటాళ్ల చిరు ధాన్యాలకు సంబంధించి ఫౌండేషన్ సీడ్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన 4,800 ఎకరాల్లో మొత్తం 49,537 క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సీడ్ ఆధారంగా రానున్న రబీ 2021–22 సీజన్లో 1,470 గ్రామాల్లో కనీసం 85,764 ఎకరాల్లో 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిలో డిమాండ్ అధికంగా ఉన్న 4,05,713 క్వింటాళ్ల వేరుశనగ (కే–6, కదిరి, లేపాక్షి, నారాయణి రకాలు), 2 లక్షల క్వింటాళ్ల 20 రకాల వరి విత్తనాలు, 2,50 లక్షల క్వింటాళ్ల శనగలు (జేఎల్జీ–11, ఎన్బీఈజీ –49)తో పాటు 17 వేల క్వింటాళ్ల అపరాలు (కందులు, మినుములు, పెసలు), 2,500 క్వింటాళ్ల చిరుధాన్యాలు, నువ్వులు ఇతర విత్తనాలు సిద్ధం చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా వాటి నాణ్యతను పరీక్షించి.. సర్టిఫై చేసిన విత్తనాలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచే ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇకనుంచి క్రమం తప్పకుండా ఇదే రీతిలో ఫౌండేషన్ సీడ్ ద్వారా విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలు తీరగా మిగిలిన విత్తనాలను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయిలో రాష్ట్రాన్ని విత్తన హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టు ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు ‘సాక్షి’కి తెలిపారు. -
లక్ష్యం దిశగా 'సాగు'తున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యం దిశగా సాగవుతున్నది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండడంతో ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంది. రాయలసీమలో అధిక వర్షపాతం సీజన్లో సాధారణ వర్షపాతం 556 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 441 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉండగా, 500 ఎంఎం వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర సాధారణ వర్షపాతం 622.4 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 497.9 ఎంఎం కురవాల్సి ఉండగా.. 536.2 ఎంఎం వర్షపాతం కురిసింది. ఇక రాయలసీమలో సాధారణ వర్షపాతం 406.6ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 312.9 ఎంఎం కురవాల్సి ఉండగా..415.4 ఎంఎం కురిసింది.కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం కురవగా, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కురిసింది. లక్ష్యం దిశగా ఖరీఫ్.. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 93.32లక్షల ఎకరాలు కాగా, 2019లో రికార్డు స్థాయిలో 90.38లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2020లో 90.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగైంది. కాగా ఈఏడాది 95.35లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటికే 75లక్షల ఎకరాల (80 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి సాధారణ విస్తీర్ణం 38.4లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల్లో (83శాతం) వరి సాగైంది. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యానికి మించి సాగైంది. 2.55లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 2.60లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇక 9లక్షల ఎకరాల్లో అపరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 86 శాతం సాగయ్యాయి. అత్యధికంగా కందులు 5.05 లక్షల ఎకరాల్లో సాగవగా, మిగిలిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, ఉలవలు సాగయ్యాయి. 19.95లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 16.47లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తగ్గనున్న వేరుశనగ, పత్తి, మిరప ప్రధానంగా 18.62లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ఈసారి 15.47లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అదే విధంగా పత్తి సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా, 12లక్షల ఎకరాల్లోనే సాగైంది. అదే విధంగా 3.72లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప ఈ ఏడాది 2.23లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఈ మూడు పంటలకు సంబంధించి ఏటా సాగవ్వాల్సిన విస్తీర్ణం పూర్తయినట్టుగా వ్యవసాయశాఖాధికారులు లెక్కతేల్చారు. దీంతో ఆ మేరకు మిగిలిన విస్తీర్ణంలో రైతులు అపరాలు, చిరు ధాన్యాల వైపు మళ్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 7.56లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఖరీఫ్ సీజన్కు 20.20లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 19.69లక్షల టన్నుల నిల్వలుండగా, ఇప్పటి వరకు 12,13,187 టన్నుల అమ్మకాలు జరిగాయి. కాగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్సాగు పూర్తయ్యే అవకాశాలుకన్పిస్తున్నాయి. ఆమేరకు అవసరమైన ఎరువులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కడా కొరత రానీయకుండా సమృద్ధిగా నిల్వ ఉంచారు. ఖరీఫ్ సాగు కోసం సెప్టెంబర్ నెలకు రైతులకు 6,07,017 ఎంటీల ఎరువుల అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.56లక్షల ఎంటీల ఎరువుల నిల్వలు ఉన్నాయి. లక్ష్యానికి మించి పంటల సాగు ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై నిఘా ఉంచాం. –హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
రేటు పెంచితే వేటు.. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఎరువుల విషయంలో అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సమృద్ధిగా ఎరువులు ఉన్నప్పటికీ, కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీకి మించి విక్రయిస్తోన్న డీలర్లపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న దాడుల్లో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఎరువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను సీజ్ చేయడమే కాకుండా, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.2.09 కోట్ల విలువైన 810.61 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. ఫారమ్ ‘ఓ’లో పేర్కొన్న ఎరువులకు మించి నిల్వ చేసిన డీలర్లపై కేసులు నమోదు చేసి, వారి వద్ద ఉన్న రూ.6.92 కోట్ల విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, విజయనగరంలో ఒక డీలర్ లైసెన్స్లను సస్పెండ్ చేశారు. శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో విచారించే ఈ కేసుల్లో నేరారోపణ రుజువైతే సీజ్ చేసిన స్టాక్ విలువలో 25 నుంచి 100 శాతం వరకు జరిమానాలు విధించవచ్చు. తీవ్రతను బట్టి వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తారు. లైసెన్స్ లేకుండా డీఏపీ నిల్వలు నోటిఫైడ్ లైసెన్స్లో లేని ఎరువులను విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని యాషువా ఎంటర్ ప్రైజెస్ యజమాని కొల్లూరి సురేష్తో పాటు విశాఖ జిల్లా నర్సీపట్నంలో లైసెన్సు లేకుండా 11.52 ఎంటీల ఐపీఎల్ కంపెనీకి చెందిన డీఏపీని నిల్వ చేసి, అనధికారికంగా విక్రయిస్తోన్న గొలుసు శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాన్ నోటిఫైడ్ బయో ఫెర్టిలైజర్స్ను తెలంగాణలో విక్రయిస్తోన్న కృష్ణా జిల్లా గన్నవరంలోని దశరథ్ ఫెర్టిలైజర్స్ లైసెన్సును రద్దు చేశారు. ఎరువుల నిల్వలు ఇలా.. ఖరీఫ్ సీజన్లో 95.35 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 39.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 26 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. సీజన్ కోసం 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రారంభ నిల్వతో కలిపి రాష్ట్రంలో 18.04 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 9.94 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 8.10 లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇందుకోసం ఆర్బీకేల్లో 1,36,805 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 69,874 టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 66,931 టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. సీజన్ ముగిసే వరకు దాడులు ఖరీఫ్ సీజన్కు సరిపడా సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయి. అయినా కొంత మంది డీలర్లు లైసెన్సుకు విరుద్ధంగా నిల్వ చేయడమే కాకుండా, ఎమ్మార్పీకి మించి, బిల్లుల్లేకుండా విక్రయిస్తున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం. సీజన్ ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయి. ధరలు పెరిగి పోతున్నాయంటూ కొంత మంది డీలర్ల సంఘ ప్రతినిధులు తప్పుడు ప్రకటనలు ఇస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటువంటి వారిపై కూడా క్రిమినల్ కేసులు పెడతాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
Kurasala Kannababu: ఎరువుల కొరత లేదు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో డీఏపీతో సహా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్బీకేల్లో కూడా చాలినంత ఎరువు నిల్వలున్నాయని చెప్పారు. ప్రస్తుత సీజన్కు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.71 లక్షల ప్రారంభ నిల్వలున్నాయని, కేంద్రం ఇప్పటి వరకు 10.22 లక్షల టన్నులు సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 8,19,089 టన్నుల విక్రయాలు జరగ్గా ప్రçస్తుతం రాష్ట్రంలో 8,73,591 టన్నుల నిల్వలున్నాయన్నారు. ఆర్బీకేల్లో 1,60,311 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 64,795 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ఇంకా 62,491 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమృద్ధిగా డీఏపీ నిల్వలు తూర్పు గోదావరితో పాటు పలు చోట్ల డీఏపీ కొరత సృష్టించి కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సీజన్లో డీఏపీ 2,49,999 టన్నులు అవసరం కాగా, ప్రారంభ నిల్వ 42,589 టన్నులుండగా, కేంద్రం ఇప్పటివరకు 1,29,185 టన్నులు రాష్ట్రానికి సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 93,195 టన్నులు అమ్మకం జరగ్గా, ఇంకా 78,579 టన్నులు నిల్వలున్నాయని చెప్పారు. ఆగస్టుకు సంబంధించి 63,320 టన్నులు అవసరం కాగా, ఇప్పటికే కేంద్రం 63,450 టన్నులు కేటాయించిందన్నారు. డీఏపీ 50 కేజీల బస్తా రూ.1200 మించి విక్రయించడానికి వీల్లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క డీలర్ అయినా ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయిస్తామన్నారు. -
కాడి, మేడి సిద్ధం.. ఖరీఫ్కు సన్నద్ధం
నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పలకరిస్తున్న వేళ.. పుడమితల్లి పులకిస్తుండగా.. కొండంత ఆశతో ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్నేందుకు కాడి, మేడి సిద్ధం చేసుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, ఎడ్లను అలంకరించి పొలం పనులకు శ్రీకారం చుట్టడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి తోడు వాతావరణం కాస్త అనుకూలంగా ఉండడంతో రెట్టించిన రైతులు ఉత్సాహంతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు ముందే వైఎస్సార్ రైతుభరోసా కింద అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతన్నల ముంగిటకు తీసుకెళ్లింది. గతం కంటే మిన్నగా పంటరుణాల మంజూరుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2019 ఖరీఫ్లో 90.38 లక్షల ఎకరాల్లోను, 2020లో 90.20 లక్షల ఎకరాల్లోను పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్లో 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో నారుమళ్లు పోసేందుకు పనులు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 7.40 లక్షలమందికి 4.21 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సబ్సిడీ, నాన్సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందుల్ని కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. సాగుకుముందే 4,78,829 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 5,09,762 క్వింటాళ్ల విత్తనాల కోసం 9,35,905 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 7,40,885 మందికి రూ.129.88 కోట్ల సబ్సిడీతో 4,21,245 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్బీకేల ద్వారా 4,44,960 మంది రైతులకు రూ.111.09 కోట్ల సబ్సిడీతో 3,19,960 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేశారు. ఖరీఫ్లో 2.37 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు 1,46,976 మందికి రూ.5.89 కోట్ల సబ్సిడీతో 62,184 క్వింటాళ్లు అందజేశారు. ఆర్బీకేల ద్వారానే నాన్సబ్సిడీ విత్తనాలు నాన్సబ్సిడీ విత్తనాలకు సంబంధించి తొలిసారిగా 45,412 ప్యాకెట్ల మిరప విత్తనం కోసం ఇండెంట్ పెట్టగా, ఇప్పటివరకు 23,047 ప్యాకెట్లు పంపిణీ చేశారు. మొక్కజొన్న, పత్తి, వరి విత్తనాలకు సంబంధించి 28,144 ప్యాకెట్ల విత్తనాల కోసం ఇండెంట్ పెట్టగా ఇప్పటివరకు 5,936 ప్యాకెట్ల విత్తనాలు సరఫరా చేశారు. మరోపక్క తొలిసారిగా ఆర్బీకే స్థాయిలో ఎరువులను కూడా నిల్వచేశారు. 88,930 టన్నుల ఎరువుల కోసం ఇండెంట్ పెట్టారు. 70,256 టన్నుల ఎరువుల్ని ఆర్బీకేల్లో నిల్వ చేయగా.. 16,477 మంది రైతులు 7,779 టన్నుల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆర్బీకేల్లో 62,477 టన్నుల ఎరువులున్నాయి. మరోవైపు తొలిసారిగా సర్టిఫై చేసిన 900 టన్నుల పురుగుమందులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్లో 8,604 పొలంబడులు నిర్వహిస్తుండగా, తొలిసారిగా రైతు భరోసా–యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ (ఆర్బీ–యూడీపీ) యాప్ ద్వారా ఈ–క్రాప్ బుకింగ్కు శ్రీకారం చుడుతున్నారు. పంటరుణాలు రూ.65,149 కోట్లు, టర్మ్ రుణాలు రూ.19,039 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. సన్న, చిన్నకారు రైతులకు ఆర్బీకేల వద్ద అద్దెకు సాగుయంత్రాలను సమకూర్చే లక్ష్యంతో తొలివిడతగా ఒక్కొక్కటి రూ.15 లక్షలతో 3,250 సీహెచ్సీలతో పాటు రూ.210 కోట్లతో నియోజకవర్గస్థాయిలో నిర్మించిన 162 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఖరీఫ్లో ఎన్నో ప్రయోగాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారి సర్టిఫై చేసిన సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. మిరప, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా ఆర్బీకేల్లో ఉంచడం వల్ల బ్లాక్మార్కెట్ను నిరోధించగలిగాం. ఇన్పుట్స్లో ఏ ఒక్కటి ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
ఖరీఫ్ సాగు.. మరింత బాగు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2021 పంటల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గడచిన ఖరీఫ్ సీజన్లో 90.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఖరీఫ్లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 94.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసింది. గత ఖరీఫ్తో పోలిస్తే.. ఈ ఖరీఫ్లో 3.34 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకు రావడం ద్వారా 7.23 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఖరీఫ్–2021 సాగు లక్ష్యానికి అనుగుణంగా దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయించాలని నిర్ణయించగా.. అందులో వరి విస్తీర్ణం అత్యధికంగా 39.50 లక్షల ఎకరాలుగా ఉంది. 5.21 లక్షల ఎకరాల్లో తృణధాన్యాలు, 8.97 లక్షల ఎకరాల్లో అపరాలు కలిపి మొత్తం ఆహార ధాన్యాలు 53.68 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 19.72 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 14.81 లక్షల ఎకరాల్లో పత్తి, 3.69 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, మరో 1.31 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతం కంటే ఘనంగా.. టీడీపీ హయాంలో సగటున ఏటా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 80.51 లక్షల టన్నులు కాగా, అందులో 73.86 లక్షల టన్నుల వరి దిగుబడి ఉంది. ఖరీఫ్–2019లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 87.77 లక్షల టన్నులు కాగా, అందులో వరి దిగుబడి 80.13 లక్షల టన్నులు. ఖరీఫ్–2020లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 86.78 లక్షల టన్నులు కాగా, ఇందులో వరి దిగుబడి 78.89 లక్షల టన్నులు. పెరగనున్న దిగుబడులు ఈ ఖరీఫ్లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరాకు 2,156 కేజీల చొప్పున 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తృణధాన్యాల దిగుబడి 6.74 లక్షల టన్నులు, అపరాల దిగుబడి 2.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఈ విధంగా 53.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల దిగుబడి 94.01 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆయిల్ సీడ్స్ 8.34 లక్షల టన్నులు, చెరకు 29.70 లక్షల టన్నులు, పత్తి 10.43 లక్షల టన్నులు, మిరప 8.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలేశారు. రానున్న ఖరీఫ్–21 సీజన్లో మొత్తంగా 94.20 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలతో పాటు అన్నిరకాల పంటల ద్వారా 154.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండేళ్ల కంటే మిన్నగా దిగుబడులు గడచిన రెండేళ్ల కంటే మిన్నగా రానున్న ఖరీఫ్లో దిగుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆహార ధాన్యాలు ఖరీఫ్–2019లో 87.77 లక్షల టన్నులు, ఖరీఫ్–2020లో 86.78 లక్షల టన్నుల దిగుబడులు రాగా, ఈ ఖరీఫ్లో 94.01 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశాం. గత ఖరీఫ్లో 78.89 లక్షల టన్నుల వరి దిగుబడి రాగా, వచ్చే ఖరీఫ్లో 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అశిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
అపరాల దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుత కరోనా సమయంలో అందరికీ పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మూడు పప్పుధాన్యాలను ఓపెన్ క్యాటగిరీలో చేర్చి దిగుమతికి అనుమతించినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను కాపాడడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ఆంక్షల తొలగింపు గడువు అక్టోబర్ 31 వరకే ఉండడంతో వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగారు. రెండున్నర లక్షల టన్నుల కంది, ఒకటిన్నర లక్షల టన్నుల మినుము, 50–75 వేల టన్నుల పెసరపప్పును మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. గతేడాది పంటల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) వద్ద బఫర్ నిల్వలు తరిగిపోవడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులకు అనుమతించింది. మీ దగ్గరున్న నిల్వలెంతో చెప్పండి.. నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి పప్పుధాన్యాల నిల్వలు, వాటి ధరలు ఎంతెంత ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని పప్పుల ధరలు భారీగా పెరగడంతో కేంద్రం రాష్ట్రాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎవరెవరి వద్ద ఎన్నెన్ని నిల్వలున్నాయో తేలనుంది. ధర పెరుగుతుందని కొంతమంది బడా వ్యాపారులు సరకును దాస్తుంటారు. ఇప్పుడా లెక్కలు కూడా తేలతాయని మార్కెటింగ్ శాఖాధికారి ఒకరు తెలిపారు. తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల హెక్టార్లు, రబీలో 23.74 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తులన్నింటికీ కనీస మద్దతు ధర లభించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రబీలో అపరాల సాగు బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడి చేతికి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినందున రైతులు ఈసారి గిట్టుబాటు ధరలకు అపరాలను అమ్ముకోవచ్చునని, దళారుల మాట విని తక్కువ ధరలకు అమ్ముకోవద్దని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సూచించారు.