-
భారత్పై అభియోగాల పత్రం
విలియం షేక్స్పియర్ నాటకం ‘ద మర్చెంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ కనికరం లేని వడ్డీ వ్యాపారి. స్నేహితుడి కోసం ‘నాదీ పూచీ’ అంటూ డబ్బు తీసుకుని చివరికి తీర్చలేకపోతాడు ఆంటోనియో. పరిహారంగా ఒక పౌండు ఆంటోనియో మాంసాన్ని అడుగుతాడు షైలాక్. భారత్పై యూఎస్ తాజా అభియోగ పత్రంలోని నేరారోపణలు కొంతవరకు ఆంటోనియోను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. అమెరికన్ పౌరుడు గురుపథ్వంత్ సింగ్ పన్నూపై కొద్దిరోజుల క్రితం జరిగిన హత్యాయత్నం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. సంబంధాలు ఇరు దేశాలకూ ముఖ్యమే కనుక యూఎస్ ఈ విషయంలో మౌనంగా ఉండి, షైలాక్లాగా భారత్ నుంచి పరిహారంగా ‘ఒక పౌండు మాంసాన్ని’ కోరుతుందా? చేర్పులు, జోడింపులతో మరింతగా బలప రిచి అమెరికా ప్రభుత్వం తాజాగా బహిర్గత పరచిన పూర్వపు అభియోగ పత్రాన్ని ఒక కల్పిత కథనంగా మీరు విశ్వసిస్తే తప్ప, అందులోని వెల్లడింపుల పట్ల అందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ, విచారణకు వెళ్లనున్న కేసు అది. తేలిగ్గా కొట్టి పడేసి పక్కకు తోసేయవలసినది కాదు. కాబట్టి, సహాయకారిగా ఉంటుందనుకుంటే కనుక మనం దృష్టి సారించవలసిన అంశాలను కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా ఒక జాబితాగా పొందుపరుస్తాను. మొదటిది – అమెరికా గడ్డ మీద ఒక అమెరికన్ పౌరుడిని (నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నేత గురుపథ్ వంత్ సింగ్ పన్నూ) హత్య చేయించేందుకు సిసి–1 అనే సంకేత నామధారి పథక రచన చేయడం! యు.ఎస్. తిరగ రాసిన అభియోగ పత్రంలోని అరోపణ లను బట్టి– ‘భద్రతా నిర్వహణ’, ‘ఇంటెలిజెన్స్’ విభాగాలలో బాధ్య తలు నిర్వర్తిస్తూ తనను తాను ‘సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్’నని చెప్పుకుంటున్న ఆ సంకేత నామధారి భారత ప్రభుత్వ సంస్థలో గుర్తింపు పొందిన ఉద్యోగిగా ఉన్నాడు. గతంలో అతడు సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్లో కూడా పని చేశాడు. మరీ ముఖ్యంగా ఈ సిసి–1 అనే వ్యక్తి ఆ అభియోగ పత్రంలో పేర్కొన్న అన్ని సమయాలలోనూ భారత ప్రభుత్వం నియమించిన విధుల నిర్వహణలో ఉన్నాడు. ఇండి యాలోనే ఉన్నాడు. ఇండియా నుంచే హత్యకు కుట్ర పన్నాడు. ఇదేం సూచిస్తోంది? సిసి–1 వెనుక భారత ప్రభుత్వం ఉందనా? లేక సిసి–1 అనే అతడు ఒక మోసగాడు అయి ఉండవచ్చుననా? రెండవది – ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మోసగాడు ఎలా ఉండి ఉంటాడు? ఒంటరి తోడేలు మాదిరిగానా? లేక, దేశ అత్యుత్తమ ప్రయో జనాల కోసం పనిచేస్తున్న ఒక చిన్న సమూహంలో భాగంగానా? లేదా అన్ని అధికారిక అనుమతులతో వ్యూహాత్మక టక్కరిగా నటిస్తున్న అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికారి అయివుంటాడా?మూడవది – ఆ సిసి–1 ఎవరైనా గానీ అసమర్థంగా ఈ పనిని నిర్వహించాడా? ‘నిఖిల్ గుప్తా అనే ఒకానొక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వ్యాపారిని సిసి–1 పనిలోకి దింపాడు.’ తనకు తెలియకుండానే అలా చేశాడా? తెలియకపోతే తెలుసుకోవలసిన పని లేదా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ గుప్తాను ఎంచుకుని ఉంటే అది తెలివైన ఎంపికేనా? నాల్గవది – ఇక నిఖిల్ గుప్తా ఏం చేశాడంటే ‘డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ (డి.ఇ.ఎ.)కు రహస్య సమాచారం అందించే వ్యక్తిగా మారిన ఒక భాగస్వామ్య నేరస్థుడిని సంప్రదించాడు. ఆ వ్యక్తి కిరాయి హంతకుడిగా నటిస్తున్న ఒక రహస్య ప్రభుత్వ అధికారి (అండర్ కవర్ ఏజెంట్) దగ్గరికి గుప్తాను తీసుకెళ్లాడు. దీన్నిబట్టి డి.ఇ.ఎ. గుప్తాను నీడలా వెంటాడుతోందనీ, కాబట్టి గుప్తా గురించి మన వరకు రాని అనేక విషయాలు డి.ఇ.ఎ.కు తెలిసి ఉంటాయనీ అనుకోవచ్చా? మరీ ముఖ్యంగా, ఇదొక దారుణమైన గందరగోళంగా అనిపించడం లేదా? బహుశా దీనికంటే ‘డాడ్స్ ఆర్మీ’ (హోంగార్డులు) నయం కదా? ఐదవది – కెనడాలో జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ‘రక్తంతో తడిసిన నిజ్జర్ మృతదేహం ఆయన వాహనంపై పడివున్నట్లు చూపించే వీడియో క్లిప్పును గుప్తాకు సిసి–1 పంపించాడు.’ ఈ ఆరోపణ... సిసి–1కి నిజ్జర్ హత్యతో నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి యు.ఎస్. అధి కారులు సాక్ష్యాధారాలను సృష్టించడాన్ని సూచిస్తోందా? అదే నిజమైతే భారత్పై జస్టిన్ ట్రూడో ఆరోపణలకు ఆ సాక్ష్యాధారాలే బలం చేకూరుస్తున్నాయా? కలవరపరిచే సమాచార వ్యవస్థ ఆరవది – ‘హత్య తర్వాత కొన్ని వారాల పాటు గుప్తా... భాగ స్వామ్య నేరస్థునితో, ఆ తర్వాత కిరాయి హంతకుడితో – ఫోన్, వీడియో, టెక్స్›్ట మెసేజేస్ వంటి వాటి ద్వారా వరుసగా ఎలక్ట్రానిక్, రికార్డెడ్ సంభాషణలను జరిపాడు’ అని యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. ఆ సంభాషణలు సంకేత నిక్షిప్త సందేశాల రూపంలో ఉన్నప్పటికీ వాటిని అడ్డగించి ఉంటారు. అంటే యు.ఎస్. అధికారుల వద్ద ఇప్పటికీ బయట పెట్టని సమాచారం గుట్టలు గుట్టలుగా మిగిలి ఉందనేనా? అది కూడా మన సమాచార వ్యవస్థ తాలూకు పటిష్ఠత, భద్రతల గురించి కలవరపరిచే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఏడవది – కనీసం నాలుగు వేర్వేరు చోట్ల హత్యకు వ్యూహం పన్నినట్లు యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. వాటిల్లో ఒకటి న్యూయార్క్లో... బహుశా గురుపథ్వంత్ సింగ్ పన్నూని హత్య చేయడం కోసం... మరొకటి క్యాలిఫోర్నియాలో, మరో రెండు కెనడాలో! నిజానికి ఒక దశలో గుప్తా... ‘‘మేము ప్రతి నెలా 2–3 జాబ్ వర్క్లు ఇస్తాం’’ అని అన్నట్లు యు.ఎస్. ఆరోపణలలో ఉంది. ఇదెలా వినిపిస్తోంది? ఒకే ఒకసారి హత్యలన్నిటికీ లేదా వరుస హత్యల ప్రారంభానికి పథక రచన జరిగిందనే అర్థం ధ్వనించడం లేదా? చివరిగా – యు.ఎస్. ప్రభుత్వ స్పందన. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ఆగస్టు నెలలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎదుట అమెరికా స్పందనను ప్రస్తావనకు తెచ్చారు. ఒక వారం తర్వాత సి.ఐ.ఎ. అధినేత విలియమ్ బర్న్స్ భారత్లోని ఆర్.అండ్ ఎ.డబ్లు్య.(రా) అధినేతతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చారు. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబరులో జి–20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ నెలాఖరున వాషింగ్టన్లో మళ్లీ సల్లివాన్, యు.ఎస్. విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్... విషయాన్ని జైశంకర్ దృష్టికి తెచ్చారు. చివరిగా అక్టోబర్లో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ మరిన్ని అభియోగ వివరాలతో భారతదేశానికి వచ్చారు. దీనర్థం... వైట్ హౌస్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందనే కదా! వాస్తవానికి దోవల్తో సల్లివాన్ ‘‘ఇలాంటిది మరోసారి జరగదన్న హామీని అమెరికా ప్రభుత్వం కోరుతోంది’’ అని అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. కఠినమైన భాష కాదా ఇది? యు.ఎస్. అభియోగ పత్రం మొత్తం అంతా కల్పితం అని విశ్వసించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలన్నిటినీ విస్మరించగలం. కానీ మీరు ఈ ప్రశ్నలను పూర్తి పరిగణనలోకి తీసుకుంటే కనుక మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ, చివరికి వాషింగ్టన్ ఈ వ్యవహారాన్నంతా చూసీ చూడనట్లు ఉండిపోయేందుకు నిర్ణయించుకుంటే – భాగస్వామ్య వ్యూహాత్మక ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి – భారత్ నుంచి ఒక ‘మాంస ఖండాన్ని’(పౌండ్ ఆఫ్ ఫ్లెష్) ప్రతి ఫలంగా కోరుతోందా? అమెరికన్ షైలాక్ దయతో నేనొక భారతీయ ఆంటోనియోగా ఉండటాన్ని ద్వేషిస్తాను. లేదా మనల్ని కాపాడేందుకు పోర్షియా వంటి కారుణ్యమూర్తి ఎవరైనా రెక్కలు కట్టుకుని ముందుకొస్తుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గాజా ఒడ్డున విపత్తు వంటకం
సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్బ్యాంక్ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొదటిది, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్ స్టేట్ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్ రిటర్న్) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది. రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ లా’ను ఇజ్రాయెల్ కలిగి ఉంది. ‘అల్ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్ 7 తర్వాత (ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన రోజు) అరెస్ట్ అయినవారే. ఇక, వెస్ట్ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్ బ్యాంక్ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది. వెస్ట్ బ్యాంక్కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న హమాస్ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. కానీ బైడెన్ మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన. చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్ ఆడమ్స్ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.ఆర్.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్ జూలియెట్ తౌమా... అల్– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్నెంట్ కల్నల్ హెక్ట్ కూడా ‘‘అల్–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు. అల్–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు. ‘‘అల్–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ అల్–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు. ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి
పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్కి చాలా పెద్ద మ్యాచ్. అతడు ఆ మ్యాచ్ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది. పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు! ‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్ కమిన్స్ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్ ‘న్యూస్.కామ్.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్ టెండూల్కర్తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్కి చాలా పెద్ద మ్యాచ్. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్ స్లామ్ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్ లేవర్ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్లో ఒక ఏడాదిలోని గ్రాండ్ స్లామ్లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష. జొకోవిచ్ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్ మెద్వెదేవ్ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు. గ్లాండ్ స్లామ్ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్ స్లామ్లు గెలవాలని, మరిన్ని మేజర్ లీగ్స్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్. అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాలశకలమై మిగిలిన జ్ఞాపకం
సీజర్ విషయంలో జరిగినట్లే ఇందిరా గాంధీకీ జరిగింది! ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తుపెట్టుకున్నది చెత్తను మాత్రమే! ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు ఈనాటికీ ఎంతో ఉత్తేజభరితమైనది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్కు లేఖ రాయడం అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం. అయినప్పటికీ నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యాయంగా తిరస్కరిస్తున్నాం. ఒకవేళ నేటికీ ఆమె సజీ వంగా ఉండి ఉంటే, తన 106 ఏళ్ల వయసులో ఉండేవారు (నవంబర్ 19న జయంతి). ఆమె హత్యకు గురయ్యారన్న నాలుగు దశాబ్దాల నాటి వాస్తవం నేడొక వెలిసిపోయిన జ్ఞాప కంగా మాత్రమే మిగిలినప్పుడు ఇందిరాగాంధీని నేనిలా గుర్తు చేసుకోవడం చిత్రమైన సంగతే. అయితే సఫ్దర్జంగ్ రోడ్డులోని ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శించే అసంఖ్యాక జనసమూహానికి అదొక పర్యాటక ఆకర్షణ. తక్కిన మనందరికీ గతించి పోయిన కాల శకలం. ఎమర్జెన్సీ (అత్యవసర పరి స్థితి) తప్ప, మరేదీ మన మదిలో లేనిది. తొలిసారి నేనామెను నిబిడాశ్చర్యంతో చూశాను. అది 1975. ఎమర్జెన్సీ పరిస్థితులు పరా కాష్ఠకు చేరుకుని ఉన్న సమయం. నిజానికి నేనొక పురుషాధిపత్య స్వభావం కలిగిన ఒక మహిళను చూడబోతున్నాననే అనుకున్నాను. కానీ ఆమె సొగసుగా, స్నిగ్ధంగా ఉన్నారు. ఆమెలో నాకు అత్యంత స్పష్టంగా గుర్తున్నవి ఆమె చేతులు. అవి సన్నగా, కోమలమైన ఆకృతిని కలిగి ఉన్నాయి. ఒక నియంతలో అవి నేను ఊహించనివి. అప్పటికి నాలుగేళ్ల క్రితం ‘ది ఎకనమిస్ట్’ ఆమెను భారత సామ్రాజ్ఞి అని అభివర్ణించింది. ఆమె మణికట్టుకు మగవారి చేతివాచీ ఉన్నప్పటికీ ఒక రాకుమారిలోని సౌకుమార్యం ఆమెలో ఉట్టిపడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె అతి సామాన్యంగా ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆదివారం నేను, మా అక్కచెల్లెళ్లు... గాంధీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ‘ద పింక్ పాంథర్’ను చూసేందుకు వెళ్లడానికి ముందు అంతా కూర్చొని అల్పాహారం తీసుకుంటూ, పూర్తిగా మాటల్లో మునిగిపోయాం. శ్రీమతి గాంధీ ఒక్క ఉదుటన ‘‘పదండి, పదండి...’’ అనేంత వరకు కూడా సమయం మించిపోతున్నట్లు మేము గమనించనే లేదు. ‘‘ఇప్పటికే మనం లేట్ అయ్యాం. ఎవరైనా ఒకటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిరండి’’ అని కూడా ఆమె అన్నారు. అప్పుడు మా ప్రమీలక్క, ‘‘ప్రచారంలో ఉండగా ఒకటికి వెళ్ల వలసి వచ్చినప్పుడు మీరేం చేశారు?’’ అని శ్రీమతి గాంధీని అడి గారు. మా మాటకు ఆమె... ‘‘రాత్రి పడుకునే ముందు చివరిగా నేను చేసే పని కడుపునిండా నీళ్లు తాగడం. దాంతో ఉదయానికంతా నా సిస్టమ్ ఖాళీ అయిపోతుంది. తర్వాత ఒకటికి వెళ్లే అవసరమే ఉండదు’’ అని చెబుతూ, ‘‘మగవాళ్లలా నేను చెట్టు వెనక్కు వెళ్లలేను కదా’’ అని నవ్వారు. ఏమైనా సీజర్ విషయంలో జరిగినట్లే, ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తు పెట్టుకున్నది చెత్తను మాత్రమే! నా జ్ఞాపకాలలో 1971 డిసెంబర్ 16 నాటి ఉత్తేజం నేటికింకా స్పష్టంగా ఉంది. ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు అది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్కు లేఖ రాసినప్పుడు అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం ఇచ్చారని నా పదహారేళ్ల వివే చనకు అనిపించింది. నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యా యంగా తిరస్కరిస్తున్నాం. విదేశాలలో ఇందిరా గాంధీ నెలకొల్పిన భారతదేశ ప్రతిష్ఠను చూసి గర్వించిన తరం నాది. 1960ల మధ్యలో లిండన్ జాన్సన్ పక్కన చక్కటి దుస్తులలో, తీరుగా కత్తిరించిన ఒత్తయిన జుత్తుతో ఇందిరా గాంధీ నిలబడి ఉండగా ఫొటో తియ్యడం ఆ ఫొటోగ్రాఫర్ జన్మకు ధన్యత అనే చెప్పాలి. శ్వేతసౌధం పచ్చిక బయళ్లలో తీసిన ఆ ఫొటోల కంటే మెరుగ్గా మళ్లీ ఎవరైనా తియ్యడం అసాధ్యం అను కున్నాను. అయితే అది 1982లో లండన్లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో నేను ఆమెను చూసేంత వరకే! ఆ కార్యక్రమంలో మార్గరెట్ థాచర్తో కలిసి నడుస్తున్నప్పుడు ఇందిరా గాంధీ ఆహా ర్యాన్ని చూసి ప్రేక్షకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. జామావర్ షాల్తో తయారైన అద్భుతమైన కోటును ధరించి ఉన్నారామె. ఆమెను అలా చూసి నా మనసు పాఠశాల రోజు లలో నేను చదువుకున్న ఎనోబార్బస్ వర్ణనను గుర్తు చేసింది. ‘‘వయసు ఆమెను వడలిపోనివ్వదు. సంప్రదాయం ఆమె అనంతమైన వైవిధ్యాన్ని నశించ నివ్వదు’’ అంటాడు ఎనోబార్బస్, క్లియో పాత్ర గురించి! 1977లో ఇందిరా గాంధీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి కారణం ఏమిటి? బహుశా అది ఆమె గురించి ఎప్పటికీ విడివడని ముడి కావచ్చు. ఆ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఏమీ లేకపోవచ్చు. కానీ వాటిని వాయిదా వేయగల సామర్థ్యం ఆమెకు లేకపోతే కదా! ఎన్నికలకు ఆమెను బలవంతం చేసే బయటి శక్తులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆమె తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్లారని అనుకోవాలా? లేక ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెలో పశ్చాత్తాపం కలిగిందా? లేదంటే, ఎమర్జెన్సీ చాలా కాలం సాగిందన్న విషయాన్ని ఆమె అంగీకరించి ఉంటారా? వేర్వేరు వ్యక్తులు ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటి కూడా సబబైన జవాబుగా అనిపించదు. నిజానికి ఇంకా లోతైన ప్రశ్న ఉంది. ఆ ఎన్నికలలో తను విజయం సాధించగలనని ఆమె భావించి ఉంటారా, లేదా తనొక ఘోర పరాజయం వైపు వెళుతున్నానన్న అవగాహనను ముందే కలిగే ఉన్నారా? జరగబోయేదేమిటో తెలిసి కూడా విధిని ఆమె స్వాగతించారా? అది తనకు తను విధించుకున్న శిక్షా? ఎమర్జెన్సీ అనే పాపానికి చేసుకున్న పరిహారమా? ఇందిరా గాంధీ తర్వాత కూడా మనకు బలమైన పాలకులు వచ్చారు. చక్కటి వస్త్రధారణతో మనల్ని ముగ్ధుల్ని చేసిన అనేకమంది ప్రధానులూ ఉన్నారు. అందరిలోకి ఇందిరా గాంధీ ఒక్కరే ప్రత్యేకమైన వారిగా ఎందుకు నిలిచారు? బహుశా అలా అనిపించడం యవ్వనంలోని జ్ఞాపకాలు జమ చేసుకుని ఉంచుకున్న అవ్యక్త గతానుభూతులు ప్రతిధ్వనించడం వల్లనా? మనోవైజ్ఞానిక నిపుణులు, తత్త్వవేత్తలు దీనికి మెరుగైన వివరణ ఇవ్వగలరనుకుంటాను. నేను చెప్పగలిగింది మాత్రం ఒక్కటే – అలాగని ఏదో చెప్పాలని చెప్పడం కాదు – నేను ఏమనుకుంటానంటే ఆమెలో ఏదో లేకుండానైతే లేదని! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మంకుపట్టుకు మనస్సాక్షి విడుపు
గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వేలాది మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలోని మిక్కిలి ‘సుందరమైన’ దృశ్యాలలో ఇది ఒకటి అనిపిస్తుంది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు ప్యారిస్, బెర్లిన్ లాంటి నగరాలలోనూ జరిగాయి. యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్లోనూ, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోనూ స్థానిక యూదులు భారీ ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? జరగబోయే అకృత్యాలను ఆపగలవా? ఏమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి. ప్రజాస్వామ్యంలోని మిక్కిలి సుందరమైన దృశ్యాలలో ఒకటి – ఈ ‘సుందరమైన’ అనే విశేషణాన్ని నేను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగిస్తున్నాను – పదులు లేదా వందల వేలమంది తాము సహించరాని అన్యాయంగా భావిస్తున్న దానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనను వ్యక్తం చేయడం. ఆ నిరసనకు మీ సొంత ప్రభుత్వం దారి ఇచ్చిందా లేక ప్రపంచంలోని మరొక చివరన అది మలుపు తిరిగిందా అన్నది విషయమే కాదు. అదొక మూకుమ్మడి నైతిక వివేచనను రేకెత్తించిందన్నది, మానవుల ఆత్మను కదిలించిందన్నది ముఖ్యం. నిజానికి అది వారి ఉనికి యొక్క లోతు. అందుకే వారి స్పందన మానవత్వానికి సహేతుకమైన సమర్థన. అది మానవులను జంతువుల కన్నా ఉన్నతంగా ఉంచుతుంది. గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వందల వేల మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు నాలో ఈ ఆలోచన మెదిలింది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు పారిస్, బెర్లిన్, అమెరికా నగరాలలోనూ జరిగాయి. వాస్తవానికి యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్ లోనూ, అలాగే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోను స్థానిక యూదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ సందర్భంలోనైతే అది విశ్వాసాల వెన్నుదన్నులను కలుపుకున్న మతం పట్టు కంటే గట్టిది. నన్ను తప్పుగా అనుకోకండి. అక్టోబర్ 7న హమాస్ ఏదైతే చేసిందో అది అనాగరికమైనది, క్రూరమైనది, ఏమాత్రం క్షమార్హం కానిది. అయితే ఒక నెల తర్వాత అది అర్ధసత్యం మాత్రమే. హమాస్ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ 9,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 22,000 మందిని గాయపరిచింది. మృతులలో నలభై శాతం మంది చిన్నారులే. విద్యుత్తు, నీరు, ఇంధనం, ఆహారం అంద కుండా చేస్తూ వస్తున్న కొన్ని వారాల దారుణమైన వైమానిక దాడుల తర్వాత ఇప్పుడు రెండవ దశ భూతల దాడులు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు అడుగుతున్నది చాలా సరళమైనదనీ, సూటి అయినదనీ నేను ఊహించగలను. శిక్ష, ప్రతీకారం సమర్థనీయం అయినప్పటికీ ఇది చాలాదూరం వెళ్లలేదా? చాలాకాలం అయి పోలేదా? ఉత్తర గాజాలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం కోసం దక్షిణం వైపునకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కానీ అలా వెళ్లినవారు తలదాచుకున్న దక్షిణ ప్రాంతాలైన ఖాన్ యూనిస్, రాఫాల పైన కూడా బాంబులు కురిపించడం మొదలుపెట్టింది. ‘అల్ జజీరా’ ప్రతినిధి కుటుంబం నుసిరత్ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో మరణించింది. గాజా నగరంలో 600 మంది మాత్రమే పట్టే సామర్థ్యం గల షిఫా ఆసుపత్రి ఇప్పుడు బాంబు దాడుల నుంచి తప్పించుకోడానికి అక్కడికి చేరిన 20,000 మందితో కిక్కిరిపోయిందనీ; శిథిలాలు, మురుగు నీరును మాత్రమే తాము చూడగలుగుతున్నామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు. మత్తుమందు లేకుండానే ఆసుపత్రి కారిడార్ నేలపైన శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లుగా కూడా నివేదికలు అందుతున్నాయి. అదే నగరంలోని అల్ ఖుద్స్ ఆసుపత్రికి – నేరుగా వైమా నిక దాడులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నందున రోగులను ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు అందాయి. మరి ఇంక్యుబేటర్లలో, అత్యవసరంగా వెంటిలేటర్ల పైన ఉన్న శిశువులను ఎక్కడికి తరలించాలి? గాజాకు అయిన వర్ణనాతీతమైన గాయం గురించి ఒక పాలస్తీనా వ్యక్తి గుండెను పిండేసే మాటలను ‘బీబీసీ’తో అన్నారు: ‘‘సురక్షితంగా ఉండేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి అని ప్రజలు అడగడం లేదు. మనం చనిపోయేటప్పటికి ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నారు.’’ నిజం ఏమిటంటే ఇజ్రాయెల్ అంత రాత్మ కూడా ఈ భయానక స్థితికి చలించింది. ఆ స్థితిని వ్యక్తీకరించడం అంత తేలిగ్గా కనిపించకపోవచ్చు. హమాస్ కంటే ఎక్కువ అని కాదు, హమాస్తో సమానంగా అణచి వేసే ప్రయత్నాలతో ఇజ్రాయెల్ ఏమీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. కనుక నెమ్మ దిగా, కానీ స్థిరంగా మాటలను కూడబలు క్కుంటోంది. ‘హఆరెడ్జ్’... ఇజ్రాయెల్లో పేరున్న వార్తా పత్రిక. ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిగిన మరుసటి రోజు, అక్టోబర్ 8న తన సంపాదకీయ వ్యాసంలో... ‘దాడి వల్ల ఇజ్రాయెల్కు సంభవించిన విపత్తుకు బాధ్యత వహించవలసిన ఒకే ఒక వ్యక్తి బెంజమిన్ నెతన్యాహూ’ అని రాసింది. పాలస్తీనా ఉనికిని, హక్కులను నెతన్యాహూ విస్మరించారని ఆరోపించింది. 9వ తేదీన ఆ పత్రిక ‘ప్రతీకార ఉద్యమాలకు, యుద్ధ నేరాలకు ఆస్కారం ఉండొచ్చు’ అని హెచ్చరించింది. ఆ పత్రిక వ్యాసకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గిడియన్ లెవీ 19వ తేదీన ‘ఎనఫ్’ (చాలు) అనే శీర్షికతో సంపాదకీయం పేజీలో రాసిన వ్యాసాన్ని ‘ఈ రక్తపాతాన్ని తక్షణం ఆపి తీరాలి, వినాశానికి హద్దులు ఉంటాయి’ అని ప్రారంభించారు. ఇజ్రాయెల్ గురించి మీరేం అనుకున్నా, స్థానిక యూదు పౌరులకు అది ప్రజాస్వామ్య దేశం అనేందుకు ‘హఆరెడ్జ్’ ఒక కాదన లేని రుజువు. భారతదేశంలో ఈ విధమైన పరిస్థితుల్లో పత్రికలు రాసే సంపాదకీయాలు, అభిప్రాయాలు తీవ్రవాదం, దేశద్రోహం అభియో గాలను ఆహ్వానించవచ్చు. అంటే ఇజ్రాయెల్లోనూ ఇప్పుడు నిరస నల సౌందర్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? మరింత దారుణంగా జరగబోయే అకృత్యాలను అవి ఆపగలవా? చెప్పలేను. బహుశా ఆపలేవేమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి.అందుకు ఒకే కారణం అవి జరగవలసి ఉండటం. నిశ్శబ్దంగా ఉండ లేని స్వరాలు అవి. కనుక మాట్లాడటాన్ని మన మనస్సాక్షి కొన సాగిస్తూనే ఉంటుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పోయినవాళ్లు మిగిల్చేవి జ్ఞాపకాలే!
ఇటీవల మరణించిన క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు పారదర్శకంగా ఉండేవి. మంచి సంభాషణను ఇష్టపడతారు. మాట్లాడినదంతా ఓపిగ్గా వింటారు. ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మరో క్రికెటర్ స్నేహితుడు టైగర్ పటౌడీలో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి ఉంటుంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి,సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. మరో క్రికెట్ దిగ్గజం అబ్బాస్ అలీ బేగ్ లోతైన రాజకీయ అవగాహనను కలిగి ఉండేవారు. టైగర్, బిషన్ ఇప్పుడు మనతో లేరు. స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే. నేను క్రికెట్ అభిమానిని కాదన్న సంగతి రహస్యమేమీ కాదు. నిజానికి ఆ ఆట నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో గాని చూడను కూడా. ఫలితంగా చాలా మంది క్రికెటర్లు నాకు తెలియదు. కానీ గొప్ప జ్ఞాన గాంభీర్యంతో నేను క్రికెట్ చర్చలకు తెగించినప్పుడు, తెలిసీ తెలియని విషయ సమా చారంతో బుద్ధిహీనమైన ప్రశ్నలు సంధించినప్పుడు పదే పదే నన్ను గట్టున పడేసిన వారిలో నేను స్నేహితులుగా పరిగణించే క్రికెటర్లు ముగ్గురున్నారు. వారు – టైగర్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, అబ్బాస్ అలీ బేగ్. బాధాకరం... టైగర్(2011లో మరణించారు), బిషన్ ఇప్పుడు మనతో లేరు. బగ్గీ (అబ్బాస్ అలీ బేగ్) ఈ మధ్యే తన భార్య వినూ (వినూ మీర్చందానీ)ను కోల్పోయారు. గత సోమవారం (23 అక్టోబర్) నాటి బిషన్ సింగ్ మరణం ఈ ముగ్గురు స్నేహితుల జ్ఞాప కాలను తిరిగి తెచ్చిపెట్టింది. వారి గౌరవార్థం, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. టైగర్కు నా క్రీడా పరిజ్ఞానం అంతంత మాత్రమేనని తెలుసు. ఒక్క టీవీ స్టూడియోలో తప్ప, ఆయన నా ముఖంపై కోడిగుడ్లు పగిలే అవకాశం ఉన్న పరిస్థితికి నన్ను వదిలేయకుండా మా సంభాషణను సున్నితంగా, నేర్పుగా నాకు నచ్చిన విషయాల వైపు మళ్లించేవారు. తరచు ఆ మళ్లింపు నేను ధరించిన టై గురించిన పొగడ్త అయివుండేది. వివేచనను అభిరుచిగా కలిగిన వ్యక్తి ఆయన. కనుక ఆయన మెచ్చు కోలు నన్ను అదే టైని మళ్లీ మళ్లీ ధరించేలా చేసేది. ఒక సందర్భంలో తొలిసారిగా ఆయన తన కనుబొమ నొకదాన్ని ఎగరేస్తూ, నెమ్మదైన స్వరంతో... ‘‘మీరు ఆ టై ధరించడం ఇది మూడోసారి!’’ అని అనేంతవరకు ఆ టైని నేను వదిలిపెట్టలేదు. టైగర్లో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి కూడా ఉంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి, సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. బిషన్ చాలా భిన్నమైనవారు. ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు, అంతర్గత భావాలు తరచు పారదర్శకంగా, పైకి కని పించేలా ఉండేవి. మంచి సంభాషణను ఆయన ఇష్టపడతారు. మాట్లా డినదంతా ఓపికగా వింటారు. అలాగే ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మేము తరచు బగ్గీ, వినూ వాళ్లింట్లో కలుసుకునేవాళ్లం. మేడపైన మాటల్లో మునిగిపోయేవాళ్లం. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏమిటి’ అని బగ్గీ నన్ను అడిగేవారు. అయితే రాజకీ యాలను ఆయన నాకంటే బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమ యేందుకు ఎక్కువ సమయం పట్టేది కాదు. నేను చెప్పేది వినేవారు. నా గ్రహింపులో లేని లోతైన గమనింపుల గురించి చెప్పి నన్ను ఉల్లాస పరిచేవారు. ముగ్గురిలోకి బగ్గీ ఎక్కువగా తటపటాయింపుతో ఉండేవారు. వినూ అప్పుడు ఆ సంకోచాల నుంచి ఆయన్ని కాపాడేందుకు ముందు కొచ్చేవారు. ఆమె చురుకైనవారు. సంభాషణ ప్రియత్వం కలిగి నవారు. విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించే స్నేహశీలి. అతిథు లను ఆదరించే అద్భుతమైన మహిళ. రుచిగా వండినంత మాత్రానే కాదు, అతిథుల సన్నిధి ఆమెను ఉల్లాసపరచడం వలన కూడా వారింట్లో భోజనం ఆరగించడం అన్నది ఒక సంతుష్టికరమైన భావ నను కలిగించేది. తన స్నేహితుల సమక్షంలో ఆమె అపరిమితమైన సంతోషంతో ఉండేవారు. నేనిది రాస్తున్న సమయానికి, స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే నన్న మెలకువను కూడా మొత్తంగా నేను కలిగి ఉన్నాను. మీరు నెలలు లేదా ఏళ్లపాటు కలుసుకుని ఉండకపోవచ్చు. మిమ్మల్ని సముద్రాలు, తరచు రాసుకోని ఉత్తరాలు వేరు చేస్తుండొచ్చు. అయితే ఆ దూరమే మిమ్మల్ని కలిపి ఉంచే జ్ఞాప కాలను శక్తిమంతం చేస్తుంది. కాల క్రమేణా ఆ జ్ఞాపకాలు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పచుకుంటాయి. ఇప్పుడు టైగర్, బిషన్, వినూ గురించి నాకు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే! ఆ ముగ్గురూ నాకు దూరమయ్యాక తమవైన స్థానాలను నాలో ఏర్ప చుకున్నారు. ఒక అర్థంలో నేను స్పష్టమైన దానిని చెబుతున్నాను. అలాగే, మరొక విషయం కూడా చెబుతాను. మనుషులు చనిపోయినప్పుడు మాత్రమే మళ్లీ ఇక వారిని కలవలేం అన్న భావనలో మనం మునిగి పోతాం. అప్పుడు వారి జ్ఞాపకాలు వేరే భిన్నమైన స్థాయిని పొందు తాయి. బతికున్నవాళ్లను – రేపో, తర్వాతి వారమో, ఫోన్ కాల్లోనో, ఈమెయిల్ ద్వారానో – జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది ఇకపై ఉండదు. ఇప్పుడిక మీకున్నవన్నీ కేవలం జ్ఞాపకాలే! ఒక సమావేశం, ఒక సంభా షణ, ఒక ఈమెయిల్ అన్నది ఇక ఎప్పటికీ సంభవించవివే! అనేకమైన ఈ ఆలోచనలు నిస్సందేహంగా వయసు నిర్దేశించి నవే. అది అనివార్యం. నిజాయతీగా చెప్పాలంటే 34 ఏళ్ల క్రితం నా భార్య నిషా చనిపోయినప్పుడు కూడా పూర్తి భిన్నంగా ఏమీ లేదు. 2015లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా! లేదా నేను సన్నిహితంగా ఉన్న మరెవరి విషయంలోనైనా! నా చిన్నతనంలో నేను జ్ఞాప కాలు ఎలా జనిస్తాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనే ఆలోచ నను కలిగిలేను. ఇటీవల కొద్ది వారాల తేడాతో సంభవించిన విను, బిషన్ మరణాలు నాలో ఆ స్పృహను కలిగించాయి. ప్రియ మిత్రమా! నా ఉద్దేశం మనో దౌర్బల్యం లోనికో, తాత్విక చింతన లోనికో జారుకోవడం కాదు. ఆనందకరమైన జ్ఞాపకాలతోనే నేను మొదలయ్యాను. కానీ నేను చెప్పాలని భావించిన దానికంటే విచారంగా ముగించినట్లున్నాను. అంటుంటారు కదా: ఇదే జీవితం! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చేరువ కానివ్వని విరోధం!
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితులమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు వారి వారి కరడుగట్టిన సమూహాలు వారిని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే... వారి స్నేహితులు, మిత్ర పక్షాలు.. వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారాలు నాకు ఏ విధంగానూ అంతుబట్టనివి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య వివాదం గురించి నాకు తెలిసిన రవ్వంత కూడా నేను ఈ రెండు మూడు వారాలుగా తెలుసుకుంటూ వచ్చినదే. అయితే ఆ తెలివిడి నాకు ప్రశ్నలు అడిగేందుకు సరిపోయేదే తప్ప, జవాబులు ఇవ్వగలిగేటంతటిది కాదు. అయినప్పటికీ ఆ మాత్రపు జ్ఞానం నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచి దానిని నేను పూర్తిగా విశ్వసించేలా క్రమంగా నాలో నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉదయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నది ఇదే. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితు లమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. అయితే బాధ కంటే కూడా గర్వమే తరచూ ఆ ప్రభామండలం చుట్టూతా కాంతిలా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. చరిత్రపై తమ దృష్టికోణమే నరైనదనే నమ్మకంతో, ఎవరికివారు స్వీయ నైతిక వర్తనను కలిగి ఉన్నామన్న విశ్వాసాన్ని సమానంగా కలిగి ఉన్నారు. వారు వర్తమానాన్ని ఎలా చూస్తున్నారన్న విషయంలోనూ ఇదే నిజం. ‘అవతలి’ దేశం తమ పట్ల ఘోరమైన తప్పిదాలకు ఒడిగట్టిందని ఆ రెండు దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అయితే వారు అంగీకరించలేని విషయం ఏమిటంటే... శత్రువు పట్ల తాము వ్యవహరిస్తున్న తీరులో ఇద్దరూ కూడా సరి సమానంగా దోషులేనన్నది! తమకేదైతే జరిగిందో సరిగ్గా అదే తమ ప్రత్యర్థికీ జరిగిందని వారు అంగీకరించరు, అంగీకరించబోరు. ఆ విధమైన ‘సమాన త్వాన్నే’ వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అందుకే చాలా తక్కువ మినహాయింపులతో – వాస్తవానికి మీరు వాటిని బహుశా చేతి వేళ్లపైన కూడా లెక్కించవచ్చు – ఇంటర్వ్యూలన్నీ భయానకమైన ఏకపక్ష ధోరణితో ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రశ్న వేసినా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆహ్వానిత పాలస్తీనీయుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శిస్తూ తామెంత ధర్మ బద్ధులో, రుజు ప్రవర్తన కలిగినవారో చెప్పుకుంటారు. ఒక ఇజ్రాయె లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కచ్చితంగా ఇదే విధమైన స్వీయ సమర్థన వైఖరి వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ! ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై పద్నాలుగు రోజులలో పది ఇంటర్వ్యూల తర్వాత... ఈ రెండు వర్గాల వారు ఒకే భూమిపై – నిస్సందేహంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూనే, గాయాల రక్తం ఓడుతూనే – కలిసి ఉంటూ కూడా భిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారని నేను గ్రహించాను. పర్యవసానంగా తమ భిన్న చరిత్రల నుంచి మాత్రమే కాకుండా తాము పంచుకున్న చరిత్రల నుంచి కూడా వారు అంగీకరించిన కఠిన సత్యాలతో వారికొక జగమొండి ప్రాపంచిక దృష్టి కోణం ఏర్పడింది. తర్వాత అది వర్తమానంలోని విరుద్ధ కోణాలతో బలోపేతం అయింది. వాస్తవాలు ఒకేలా ఉన్నప్పటికీ వాటి అర్థ, వివరణలు పూర్తిగా భిన్నమైనవి. విచారకరమైన వాస్తవం ఏంటంటే – ఈ రెండు దేశాల స్నేహి తులు, మిత్రపక్షాలు దేనికి దానిని విడిగా చూడటం అనే ఏక వైఖరి దృష్టి కోణానికి లోబడి ఉండటం. ‘ఏంటిది?!’ అని పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ను ఏమాత్రం నిలదీయకుండా భూత వర్తమానాలపై ఆ దేశపు దృష్టి కోణాన్ని అంగీకరిస్తుండగా, మధ్యప్రాచ్యంలోని అరబ్, ముస్లిం దేశాలు పాలస్తీనా పట్ల తమ తమ అవగాహనలపై ఒకే విధమైన నిబద్ధతతో నిలబడి ఉన్నాయి. పర్యవసానంగా మీరు ఎవరికి మద్ధతు ఇస్తున్నారనేది మీరెలాంటి ఆలోచనను కలిగివున్నారన్న దానిని మాత్రమే కాక, జరుగుతున్న పరిణామాల పట్ల మీ స్పందనను కూడా నిర్ధారణగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తోక పశ్చిమ కుక్కను ఊపుతుంది, అదే సమయంలో పాలస్తీనా తోక మధ్యప్రాచ్య కుక్కల్ని గుర్రుమని చూసేలా, మొరిగేలా ప్రేరేపించి వాటిని రెచ్చగొడుతుంది. బహుశా అందుకే పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదం నేడు మనం ఎదుర్కొంటున్న వాటన్నింటిలోనూ కొంచెమైనా కొరుకుడు పడని అత్యంత కఠినమైన పరిస్థితిగా పరిణమించింది. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు కూడా వారి వారి కరడుగట్టిన సమూహాలు ఆ సంశయా త్మక ప్రారంభ ఉద్దేశాన్ని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. బహుశా అధ్వాన్నమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు, మిత్ర పక్షాలు... వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. శత్రుత్వ విరమణ కోసం, స్వల్పకాలిక అర్భక ఒప్పందాల కోసమైతేనే నెడతాయి. కానీ ఏదైనా – అసలు స్వరూపాలకు భిన్నంగా నిజాయితీతో అడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే – దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం నెట్టవు. అందుకే నేను చేసిన గత రెండు వారాల ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉన్నాయి తప్పితే, ఆశాజనకంగా ఏమీ లేవు. పైగా నిస్పృహను కలిగించేలా ఉన్నాయి. నిజానికి, చెరగని విధంగా వారు వేసిన ముద్రే ఇక ఎటువంటి ఆశల్నీ పెట్టుకోలేని మనఃస్థితికి కారణం అయింది. ఇజ్రాయెల్–పాలస్తీనా ఊబిని బాగు చేయడం, ఆ సమస్యను పరిష్క రించడం అసాధ్యంలా కనిపిస్తోంది. నా భయం ఏంటంటే అనంతంగా అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని! రేపన్నది మిగతా ప్రపంచానికి మరొక రోజు కావచ్చు కానీ ఇజ్రాయెల్–పాలస్తీనాలకు మార్పును వాగ్దానం చేయని రోజూ ఉండే ఒక రోజే! కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆలోచించండి. భీకరమైన హమాస్ దాడి ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేసి,ఆ దాడిని తిప్పి కొట్టాలన్న ఆగ్రహ జ్వాలల్ని రగిల్చినందువల్ల – సాధ్యమైతే – ఏకంగా హమాస్ను తుడిచిపెట్టాలన్న ఇజ్రాయెల్ ప్రతీకారం వల్ల తీవ్రమైన మనోవేదన, ఎంతకూ తరగని బాధ మాత్రమే మిగిలి అనివార్యంగా అది భవిష్యత్తులో అధ్వాన్న పరిస్థితికి పునాదులు వేస్తుంది. ఇది దేనిని సూచిస్తోంది? అత్యంత విచార కరమైన, శోచనీయమైన ముగింపు ఏమిటంటే ఈ అంతులేని కథలో మరొక విషాద అధ్యాయానికి పునాది పడబోతుండటం! భవిష్యత్తు ప్రతిసారీ కూడా తిరిగి మనల్ని గతంలోకే తీసుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ
సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్ ఆకార్ పటేల్ తొలి నవల ‘ఆఫ్టర్ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్ పటేల్ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు ధీశాలి అయిన ఛైర్మన్గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. ఇంతేనా నాకు పటేల్ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్ మ్యాన్’ అంటారు పటేల్. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్ మ్యాన్ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. ఆ బిగ్ మ్యాన్ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్ మ్యాన్ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. పటేల్ పుస్తకంలో బిగ్ మ్యాన్ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్ కలెక్టివ్’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు. అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్ మేనేజర్’ అంతే. ఆ మేనేజర్కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్ మేనేజర్. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. ఈ విధంగా పటేల్ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది. మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్ మేనేజర్ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్ ‘బిగ్ మ్యాన్’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కలవర పెడుతున్న ప్రశ్నలు
ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్–వాష్ స్టేషన్లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్ థీక్ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా? రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్ 27 సాయంత్రం ఇంఫాల్ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్.ఎఫ్. (ఇండీజనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది. కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్పుర్లో అరెస్ట్ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా? కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్.ఎఫ్. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్ లోని పరిణామాలు చురాచాంద్పుర్ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు. ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా? యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్ ఆనంద్ సింగ్ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్ల నుండి మణిపుర్లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. నా ముగింపు: మణిపుర్ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్ తప్పించుకోగలదా?
ఖలిస్థానీ సానుభూతిపరుడు, నిషేధిత ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ అత్యంత వివాదాస్పదం అయింది. ఈ ఏడాది జూన్లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ని కాల్చి చంపిన నేపథ్యంలో... భారత్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు ‘విశ్వసనీయమైన ఆరోపణలు’ ఉన్నాయని ట్రూడో గత నెలలో తమ పార్లమెంటులో ప్రకటించారు. దరిమిలా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిణామాలను అమెరికాపై దృష్టిని కేంద్రీకరించి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశ స్పందన మనకు అత్యంత కీలకం కాబట్టి! జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధానమంత్రి) ఆరోపణలపై మన ప్రభుత్వ ప్రతిస్పందనను నేను విశ్వసిస్తున్నప్పటికీ, ఒక జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలను కూడా మన మది పరిగణనలోకి తీసుకోవాలేమోనని నా ఆలోచన. అయితే ఆ వాస్తవాలు అవసరమైనంత మేర కైనా నివేదనకు వచ్చాయని నేను అనుకోవడం లేదు. కొన్నిసార్లు అవి ఉద్దేశపూర్వకమైన విస్మ రణకు కూడా గురయ్యాయి. అందువల్ల వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా కర్తవ్యంగా భావిస్తూ, ముగింపును మాత్రం మీకే వదిలేస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయంతో మిమ్మల్ని ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. మొదటిది– ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ ఆరోపణలను లేవనెత్తి ‘‘ఆందోళన వ్యక్తం చేసినట్లు’’ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రాసింది. యూఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ‘‘అత్యున్నత స్థాయుల్లో ఈ అంశంపై చర్చ జరిగింది,’’ అని చెప్పినప్పుడే ఆయన ఈ ‘‘అందోళన వ్యక్తం అవడాన్ని’’ ధ్రువీకరించి ఉండొచ్చు. భారత్పై కెనడా చేసిన ఈ ఆరోపణలను బైడెన్ ఎలా చూస్తున్నారన్న విషయమై ఇది మనకు ఏం చెబుతోంది? గట్టి సాక్ష్యాలు ఉన్నాయా? రెండవది– కెనడాలోని అమెరికన్ రాయబారి ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ ‘పంచనేత్ర నిఘా కూటమి దేశాలు’ (ఫైవ్–ఐస్ కంట్రీస్: యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) రహస్య సమాచారాన్ని అట్టావా (కెనడా రాజ ధాని)తో పంచుకున్నట్లు రూఢి పరిచారు. వాటిలో ఒక దేశం యూఎస్ఏ అని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది: ‘‘చూస్తుంటే కెనడా దగ్గర ‘పొగలు గక్కే తుపాకీ’ (వివాదానికి తావులేని సాక్ష్యం) ఉన్నట్టు కన బడుతోంది. ఆ దేశంలోని భారతీయ దౌత్యవేత్తల సమాచార వ్యవస్థలోకి చొరబడటం అన్నది పన్నాగంలో (వారికి) ప్రమేయం ఉందన్న సంకే తాలను ఇస్తోంది.’’ ఈ చొరబాట్లు ఏం చెబు తున్నాయి? అవి నిజంగానే పొగలు గక్కుతున్న తుపాకీతో సమానమైనవా? మూడవది – ఆరంభంలో జేక్ సల్లివాన్, ఆ మర్నాడు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్: ‘‘మేమే మా కెనడియన్ సహోద్యోగులతో చాలా దగ్గరగా సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం సంప్రదింపులు మాత్రమే కాదు, ఈ అంశంపై వారితో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అంటే ఏమిటి? కెనడా దగ్గర ఉన్న సమాచారం ఎలాంటిదో మాత్రమే కాదు,అందులోని నాణ్యత ఎంతటిదో కూడా వాషింగ్టన్కు అవగాహన ఉందని ఇది సూచిస్తోందా? నాల్గవది – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్లింకెన్, ‘‘ఈ పరిశోధనలో కెనడాతో కలిసి ఇండియా పని చేయడం చాలా ముఖ్యం. దీనికి బాధ్యులెవరో చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు దానికై అదే జరిగి, ఫలితం వైపునకు దారి తీయాలి’’ అన్నారు. ఆయన అలా అన్నది ఒక పత్రికా సమావేశంలో అయినప్పటికీ అది న్యూఢిల్లీకి ఒక సందేశం అనుకోవాలా? ఐదవది – ‘‘ఇలాంటి చర్యలకు మీకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులేమీ ఉండవు. దేశంతో నిమిత్తం లేకుండా మేము గట్టిగా నిలబడి, మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటాం’’ అని సల్లివాన్ అనడం చూస్తుంటే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిది అబద్ధం? ఆరవది–కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్... కెనడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ హెడ్తో కలిసి ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు లేదా ఆరు రోజులు ఢిల్లీలో ఉండి, భారత నిఘా సంస్థలకు సమాచారం అందించినట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్ల డించింది. అయితే భారత ప్రతినిధి మాత్రం... ‘‘కెనడా అప్పుడు గానీ, ఇప్పుడుగానీ, ఎప్పుడూ గానీ తమతో ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోలేదు’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి సమాచారం ఏదీ లేకుంటే జోడీ థామస్ భారత దేశంలో పది రోజుల పాటు ఎందుకు గడిపినట్లు? ఏడవది– మన భారత ప్రతినిధి అరిందమ్ బాగ్చి కెనడాను... ‘‘ఉగ్రవాదులకు, తీవ్రవాదు లకు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్వర్గ ధామం’’ అని పేర్కొన్నారు. ఆ మాటలు సాధార ణంగా పాకిస్తాన్ను ఉద్దేశించి వాడుతుంటారు. అలాంటిది తమ నాటో మిత్రపక్షం, జీ–7 సభ్య దేశం, మరీ ముఖ్యంగా సన్నిహిత, సాంస్కృతిక పరిచయాలు కలిగిన తమ పొరుగు దేశం అయిన కెనడా గురించి ఇండియా అలా అనడాన్ని అమెరికా ఎలా చూస్తుంది? అమెరికా వైఖరి కీలకం ఎనిమిదవది– అట్లాంటిక్కు ఇరు వైపులా ఉన్న అనేక ఆంగ్ల భాషా వార్తాపత్రికలు భారతదేశం ఇలా ఎలా మారిందీ అని ప్రశ్నల్ని లేవదీశాయి. ఉదాహరణకు, ‘ది అబ్జర్వర్’ పత్రిక ‘‘స్వదేశంలో, విదేశాలలో మోదీ ప్రభుత్వ విధానం ప్రజా స్వామ్యం పట్ల ఆ దేశ నిబద్ధత, భాగస్వామ్య దేశంగా తన విశ్వసనీయతల పైన సందేహాలను లేవనెత్తుతోంది’’ అని రాసింది. ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ నికోలస్ క్రిస్టోఫ్ పాకిస్తాన్ పాలకుడు జనరల్ జియాతో మోదీని పోల్చారు. ‘ది ఎకనామిస్ట్’ నిర్మొహమాటంగా ‘‘ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం’’ అని పేర్కొంది. మన దేశం గురించి ఇలాంటి వ్యాఖ్య లన్నిటికీ మనం ఎలా స్పందించాలి? చివరిగా– ఒక అధికారిక ప్రకటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రూడో ఆరోపణలను ‘‘పూర్తిగా తిరస్కరించింది’’. వాటిని ‘‘అసంబద్ధము, ప్రేరణపూరితమూ అయినవి’’గా పేర్కొంది. బైడెన్ గురించి మనకు తెలిసిన దానిని బట్టి... అలాగే సల్లివాన్, బ్లింకెన్ల ప్రకటనలను బట్టి చూస్తే అమెరికా ఈ ప్రతిస్పందనను అంగీ కరిస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు నేను అమెరికా పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకంటే ఆ దేశ ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. భారత్ కేవలం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటుండగా, బ్లింకెన్ అంటున్న ‘అంతర్జాతీయ అణచివేత’లో దోషి కచ్చితంగా అమెరికానే అని నాకు తెలుసు. అయినప్పటికీ అమెరికా దీని నుంచి పదే పదే తప్పించుకుంటూ వచ్చింది. భారత్ కూడా అలా తనపై వచ్చిన ఆరో పణల నుంచి తప్పించుకోగల స్థితిలో ఉందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నాటకీయత లేని యాక్షన్ సినిమా
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది. ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో! ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్ను మనం ఊహించుకోవచ్చు. పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’ ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు. ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు. బేనజీర్తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే. అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్లోని ఓ రెస్టారెంట్లో బేనజీర్తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం! ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశానికి తగిలిన చెంప దెబ్బ
మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంప దెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. రెండో ఘటన జమ్మూ–కశ్మీర్లో చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాసినందుకు, ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలయ్యాయి. దారుణాతి దారుణం ఏంటంటే... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా అలా జరగడం! అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! మాట వినని పిల్లలు చెంపదెబ్బ తింటారని తెలియని తరం నుండేమీ నేను రాలేదు. కానీ నాన్న ఎప్పుడూ నాపై చెయ్యి ఎత్తలేదు. ఆయన ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ నన్ను గారం చేసేవారు. సున్నితమైన మనసు గల తండ్రిగా ఆయన నా పట్ల వ్యవహరించేవారు. అమ్మ మాత్రం నన్ను క్రమశిక్షణలో ఉంచేవారు. అమ్మ చేతి దెబ్బలు ఒకటీ రెండు తిన్నట్లు కూడా నాకు గుర్తు. నిస్సందేహంగా నేను ఆ దెబ్బలకు యోగ్యమైనవాడినే! నిజానికి, ఆ విధమైన దండన ఆ కాలంలో సమర్థనీయతను కలిగి ఉందన్న సంగతి కూడా నాకు తెలియందేమీ కాదు. అయితే గత వారం రెండు వేర్వేరు పాఠశాలల్లో, ఇద్దరు వేర్వేరు వర్గాలకు చెందిన పిల్లలపై ‘ఇతర’ వర్గం నుంచి జరిగింది ఇందుకు భిన్నమైనది. వారు చెంపదెబ్బలు తినలేదు. దెబ్బలు తిన్నారు. ఇది మొదటిది. ఇక రెండవది... వారిని మందలించడానికి గానీ, సరిదిద్దడానికి గానీ కొట్టలేదు. అవి వారిని అవమానించడానికీ, ఆత్మా భిమానాన్ని దెబ్బతీయడానికీ కొట్టినవి. మూడవది, వారు వేరే మతానికి చెందిన వారైనందువల్ల జరిగినవి. వెల్లువెత్తిన మత విద్వేషం అది. ఇదేమీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం జరిగినది కాదు. నిజం చెప్పాలంటే... ఆ ధోరణి గర్హనీయమైనది, నీచమైనది, అసహ్యకరమైనది. మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఖుబ్బాపుర్లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. ఆమె ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కూడా! ఆ బాలుడిని అలా కొట్టిస్తున్న సమయంలో ఆ టీచరు... ‘మహమ్మదీయ పిల్లలు’ అంటూ అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ, ‘‘ఇంకా గట్టిగా కొట్టండి’’ అని సాటి పిల్లల్ని ప్రోత్స హించడం మరో మాటకు తావులేకుండా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రెండో ఘటన, జమ్మూ–కశ్మీర్లోని బనీలో చోటు చేసుకుంది. అక్కడ పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాశాడు. అది చూసిన ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ ‘‘పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి ఆ బాలుడిని ప్రిన్సిపాల్ గది లోకి లాక్కెళ్లి అక్కడ మళ్లీ ఆ టీచరు, ప్రిన్సిపాల్ కలిసి, గదికి తాళం వేసి మరీ ఆ చిన్నారిని కొట్టారు. ఇంకోసారి అలా రాస్తే చంపేస్తామని హెచ్చరించారు’’ అని ఎఫ్.ఐ.ఆర్.లోని వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కూడా అత్యంత భయానకమైనవి. రెండో ఘటన గురించి కొద్దిగా మాత్రమే మనకు తెలుసు. మొదటి ఘటన తాలూకు వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించే లోపే సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు. ఏడేళ్ల ముస్లిం బాలుడిని కొట్టినందుకు వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఇక్కడే మరొక ఆందోళన కూడా కలుగుతోంది నాకు. బాలుడి తండ్రి న్యాయం కోసం డిమాండ్ చేసే స్థితిలో లేక పోగా... రాజీపడమని, ఇంకా చెప్పాలంటే ఆ టీచర్ను క్షమించి, జరిగిన దానిని మరచిపొమ్మని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అలా ఒత్తిడి తెస్తున్నవారిలో రైతుల పోరాట యోధుడు నరేశ్ టికైత్ కూడా ఉన్నారు. బాలుడి తండ్రిని రాజీ పడమని చెబుతూ, ఎందుకంటే, ‘‘ఆ టీచర్ చెడు ఉద్దేశంతో అలా చేయలేదు’’ అంటున్నారు. ‘‘కనీసం ఆమె క్షమాపణైనా చెప్పాలి కదా’’ అని అడిగినప్పుడు, ‘‘క్షమాపణ అనేది పెద్ద మాట. కానీ ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు’’ అని రాకేశ్ టికైత్ అన్నారు. ఖుబ్బాపుర్ పరిసర ప్రాంతాల గ్రామ పెద్దల ప్రతిస్పందన అయితే మరింత నిరుత్సాహకరంగా ఉంది. పూరా గ్రామానికి చెందిన నరేంద్ర త్యాగి ఆ ఏడేళ్ల పిల్లవాడి తండ్రితో, ‘‘ఇక ఈ నాటకాన్ని ఆపండి. గ్రామంలోకి మీడియా అడుగు పెట్టడం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్.ఐ.ఆర్. వద్దని చెప్పండి. వెనక్కు తీసుకోండి. లేకుంటే మీరే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అన్నారు. చివరికి పోలీసులు కూడా కనీసంలో కనీసమైనా చేయలేదు. వారెంటు లేకుండా అరెస్టు చేయడానికీ, కోర్టు అనుమతి లేకుండా విచారణ చేపట్టడానికీ వీల్లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘‘తృప్తి త్యాగికి ద్వేషపూరిత ఉద్దేశాలు లేవు’’ అని ముజఫర్నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఇక స్థానిక బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యాన్ ‘‘ఇదొక చిన్న విషయం’’ అనేశారంటే ప్రభుత్వ స్పందన ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. ఎన్నికలు మరో ఏడు నెలల్లో ఉన్నాయి కనుక క్షమించి, ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలని అది కోరుతోంది. కానీ మీరు, నేను అలా క్షమించి, మర్చిపోకూడదని నేను అంటాను. లేదా మొత్తంగా మనం. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలు అయ్యాయి. అవి నయం అవడానికి ఎంతో సమయం, ఎంతగానో ప్రేమ అవసరం అవుతాయి. వారికి జరిగిన దారుణాతి దారుణం... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా జరిగింది. అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! చివరిగా ఒక మాట. ఇవి ‘అచ్ఛే దిన్’(మంచి రోజులు) కాదు. ఇది ‘అమృత్ కాల్’కు పిలుపు కాదు. ఇది నరకానికి ప్రవేశ ద్వారం కావచ్చు. అందుకనే ఈ టీచర్లకు గుణపాఠం నేర్పాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కనీసంగా మనం ఆశించగలిగింది ఇదే! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిజంగానే అంత చెడ్డ దేశమా?!
‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ జిహాదీలేనని మనం నమ్ముతున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి సంఝౌతా ఎక్స్ప్రెన్ను ఎందుకు రద్దు చేయాలి? పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవనీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించుకుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’... ఈ ప్రశ్నలన్నిటినీ మనం ఎదుర్కోవలసిన అవసరం ఉందని మణి శంకర్ అయ్యర్ తన ఆత్మకథలో రాశారు. కరాచీలో కాన్సుల్–జనరల్గా ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలామంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియబరుస్తుంది. మణి శంకర్ అయ్యర్ ఆత్మకథలోని మొదటి సంపుటం గురించి నా అభిప్రాయం ఏంటంటే – చెప్పడంలోని సొగసంతా క్లుప్తతలోనే ఉంటుందన్న మాటపై ఆయనకు నమ్మకం లేదని. ‘మెమోయిర్స్ ఆఫ్ ఎ మావెరిక్’లోని ప్రారంభ అధ్యాయాలు మరీ అంత మితిమీరిన సమాచారంతో ఉండవలసింది కాదు. ఉల్లాసమైనవీ విసుగు తెప్పించేవీ, ఆసక్తికరమైనవీ అసంబద్ధమైనవీ, హాస్యభరితమైనవీ నిస్సారమైనవీ... అన్నిటినీ కూడా అయ్యర్ తనకు సాధ్యమైనంతగా వివరాలతో కిక్కిరిసిపోయేలా చేశారు. అందంగా రాశారు, అందులో సందేహం లేదు. కానీ అవస రంలేని దీర్ఘమైన నిరంతరాయ సాగతీతలు ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అనివార్యంగా కథనంలో అంత స్సూత్రతను కోల్పోయానని తనను తాను తిట్టుకున్నారు కూడా. అయితే అంతకుమించి ఆయన్ని తప్పు పట్టేందుకేమీ లేదని వెంటనే నేను గుర్తించాను. తన జన్మనక్షత్రాలు, కుటుంబ వివరాలు, పెంపుడు జీవుల విశేషాలు, లేదా తన డూన్ స్కూల్ నాటి జ్ఞాపకాలను అలుపు తెప్పించేలా చెప్పడంలోని ఆయన స్వీయ సంతృప్తిని మీరు క్షమించాలి. కేవలం యూనియన్ (విద్యార్థి సంఘం) అంటే ఉన్న మక్కువతో మాత్రమే ఆయన కేంబ్రిడ్జిలో చేరే సమయం రాగానే పుస్త కంలోని పఠనీయ పరిస్థితులు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. యూనియన్ అధ్యక్షుడవడం ఆయన ఏకైక ఆశయం. పాపం ఆ ఆశయాన్ని సాధించలేకపోయారు. వాస్తవానికి యూనియన్ అధ్యక్ష స్థానానికి చేరువయ్యే సోపాన క్రమంలో అట్టడుగున ఉండే స్థాయీ సంఘానికి ఎన్నికవడానికి కూడా ఆయనకు కష్టమయింది. కానీ ఆయన ప్రయత్నంలోని మనోహరమైన నిజాయితీ మీ మనసును గెలుచుకుంటుంది. అంతేకాదు, 21వ శతాబ్దపు తొలి దశాబ్దానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పన్నెండవ శతాబ్దపు రౌండ్ చర్చి వెనుక ఉన్న కేంబ్రిడ్జి యూనియన్ చాంబర్లో రూపొందాడన్నది స్పష్టంగా తెలుస్తుంది. బంజరు భూముల వంటి ఈ ప్రారంభ పుటలను దాటితే డిసెంబరు మాసపు మొఘల్ గార్డెన్స్లా పుస్తకం వికసించి కనిపిస్తుంది. హఠాత్తుగా ఆయన అలవిమాలిన సమాచారం... చూపు తిప్పని వివరాలతో కూడిన కథనంగా మారిపోతుంది. కథకు అందే ప్రతి చిన్న చేరికతో ఆయన చూపుతున్న ప్రపంచం మనల్ని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను పుస్తకాన్ని కింద పెట్టలేకపోయాను. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా, దానికి ఏదీ సాటిరాని స్కాట్లాండ్ జలాలతో బలోపేతం అయిన పేజీలను తిప్పుతూ ఉండి పోయాను. ఓ, ఢిల్లీలోని ఉష్ణో గ్రతల కారణంగా కొంచెం ఐసుతో కూడా! ఆయన ఫారిన్ సర్వీసుకు ఎప్పటికీ ఎలా చేరుకోలేక పోయా రనే గాథను పుస్తకంలోని ముఖ్యాంశంగా పత్రికలు ఇచ్చి తీరాలి. మన ప్రముఖ పత్రికలలో ఒకటేదైనా ఇస్తుందని నాకు గట్టి నమ్మకం కనుక ఆ వివరాలను ఇక్కడ వెల్లడించడం ద్వారా పాఠకుల ఆసక్తిని ముందే చెప్పి పాడు చేయలేను. ఒకటైతే చెబుతాను. పుస్తకంలోని ఈ ముఖ్యాంశాన్ని ఇవ్వకపోతే మీ అభిమాన దిన పత్రికను కొనడం మానేయండి. ఏదేమైనా, కరాచీలో కాన్సుల్–జనరల్గా పాకిస్తాన్లోని ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలా మంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియ బరుస్తుంది. మీలో చాలామందిని అది అక్షరాలా ఆకట్టుకునేలా ఉంటుంది. పాకిస్తాన్ని ఆయన ఉన్నదున్నట్లుగా లేదా, నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ అప్పట్లో ఉన్న విధంగా... మనవాళ్లు మనలో కలిగించిన, విధేయతతో సత్యం అని మనం నమ్మిన అపోహలను, అబద్ధాలను చెల్లాచెదురు చేసేలా ఆయన చిత్రీకరించారు. మర్యాదపూర్వకంగా, ఆప్యాయతతో ఉండండి, అప్పుడు పాకి స్తానీలు అదే విధమైన తమ ప్రతి స్పందనతో మిమ్మల్ని ముంచె త్తుతారు అని మణి కటువైనది కాని సూచనగా మీకు చెబుతారు. ‘‘భారతీయ శత్రుత్వం, లేదా శత్రుత్వ భావన పాకిస్తానీలను వారి ప్రభుత్వం లేదా సైన్యం వెనుక సమైక్యం అయ్యేలా చేస్తోంది’’అంటారు మణి. ఇప్పుడూ అంతే కదా... మనం వారిని వారి సైన్యం బాహువుల్లోకి విజయవంతంగా నెట్టేస్తున్నాం. మనం ఎదుర్కోవలసిన అవసరం ఉన్న ప్రశ్నలను మణి లేవ నెత్తారు. ‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే జిహాదీలేనని మనం నిజంగా నమ్ము తున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చు కోవడానికి సంఝౌతా ఎక్స్ప్రెన్ను ఎందుకు రద్దు చేయాలి? మనం కనుక పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవ నీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించు కుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’ ఇందుకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను సమర్థిస్తాను... అది భౌగోళికంగా కచ్చితంగా లేకుండా ధ్వనిపూర్వకంగా మాత్రమే దగ్గరగా ఉన్నప్పటికీ. ‘‘పరాగ్వేలో మనం పడిపోకుండా ఉన్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో నిలబడలేకున్నాం.’’ మనలో చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని సంగ్రహించే ఒక వాక్యాన్ని మీకు వదిలేస్తాను. అయితే కొద్ది మంది దానిని అంగీకరించరు. ‘‘శాంతి కోసం జరిగే ప్రయత్నాలు భారతదేశంలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువని అయిష్టంగానే నేను ముగించాల్సి వచ్చింది.’’ ఈ మాటను మీరు అంగీకరిస్తే... మీరు ఈ పుస్తకాన్ని చదివేందుకు, మీరెంత కచ్చితమైన వారో తెలుసుకునేందుకు అది మిమ్మల్ని ప్రలోభపెడుతుందని నా ఆశ. అలా కాకపోతే మీకు ఎన్నడూ చెప్పని, లేదా మీ నుండి దాచి పెట్టినవాటిని ఎదుర్కోడానికి మీలో కోపాన్నైనా రేకెత్తించనివ్వండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాజపుత్రుల చిత్ర విచిత్రాలు
రాజకోట రహస్యాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్తనలు, వారి అపకీర్తుల గురించి ఎప్పుడో దివాన్ జర్మనీ దాస్ ఆసక్తికరంగా రాశారు. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! అయితే భారత రాజపుత్రుల లాగానే పాకిస్తాన్ రాజపుత్రులు కూడా ఉండేవారా? వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదని వెల్లడిస్తుంది ‘డీథ్రోన్డ్’ పుస్తకం. భారత చరిత్ర మీద పరిశోధించిన ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిచికీ రాసిన ఈ పుస్తకం ఎన్నో వింత సంగతులను వెల్లడిస్తుంది. రాజకోట రహస్యాలు నన్ను అమితంగా సమ్మోహన పరుస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్త నలు, వారి అపకీర్తుల పట్ల నాలో ఆసక్తి జనించడానికి కారణమైన వారు మహారాజా దివాన్ జర్మనీ దాస్. నేను కౌమార ప్రాయంలో ఉండగా తొలిసారి ఆయన పుస్తకం చదువుతూ వదల్లేకపోయాను. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! ఉదాహరణకు పటియాలా మహారాజులలో ఒకరు తమ రాచ ఠీవికి చిహ్నంగా స్తంభించిన తమ పురుషాంగాన్ని పురవీధులలో ప్రదర్శించుకుంటూ ఊరేగింపుగా ముందుకు సాగిపోయేవారట. ఉక్క పోతల వేసవి రాత్రులలో ఆయన మహారాణులు, ఉంపుడుగత్తెలు అంతఃపుర కొలనులో తేలియాడే భారీ మంచు దిబ్బలపై శృంగార నాట్య విన్యాసాలతో విహరించేవారట. పాకిస్తాన్ వైపున ఉన్న రాజ కుటుంబీకులు కూడా ఇలానే ఉండేవారా, లేకుంటే ఇందుకు భిన్నంగానా అని అప్పుడు నాకొక ఆశ్చర్యంతో కూడిన సందేహం కలిగేది. అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు, ఆనాటి నా ఆశ్చర్యంతో కూడిన సందేహం జాన్ జుబ్రిచికీ పుస్తకం ‘డీథ్రోన్డ్’తో నివృత్తి జరిగింది. వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి వారి చిత్ర విచిత్రాలతో ఈ ఉదయం నన్ను మీకు వేడుకను చేయనివ్వండి. నాల్గవ సాదిఖ్ ముహమ్మద్ ఖాన్... బహావల్పుర్ నవాబు. ఆయన తన మూలాలు ముహమ్మద్ ప్రవక్త సంతతిలో ఉన్నాయని చెప్పు కొంటారు. అయితే ఆయన బూట్లు, ప్యాంట్లు, సుతిమెత్తని నూలు గుడ్డతో నేసిన మందపాటి చొక్కాలు ధరించి రాజప్రాసాద క్రికెట్ మైదానంలో కనిపిస్తూ తనకు గల ఆ ప్రత్యేక ఐరోపా క్రీడా వస్త్రధారణ అభిరుచుల పట్ల గర్వభూయిష్టంగా ఉండేవారని జుబ్రిచికీ రాశారు. ‘‘మహా ధన సంపన్నుడై, తెల్లజాతి మగువల పట్ల అమిత మక్కు వను కలిగిన ఈ నవాబు (ఆయన భార్యలలో ముగ్గురు యూరోపి యన్లు) 1882లో అత్యంత గోప్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన ‘లా మేజన్ క్రిస్టోఫ్లా’ గృహ సామగ్రి సంస్థ నుంచి ఖరీదైన కలపమంచాన్ని 290 కిలోల నాణ్యమైన వెండి అలంకరణలతో తన అభీష్టానికి అనుగుణంగా తయారు చేయించుకున్నారు. మంచానికి నలువైపులా మంచంకోళ్ల స్థానంలో సహజమైన జుట్టు; కదలిక కలిగిన కళ్లూ, చేతులూ; ఆ చేతులతో విసనకర్రలు, గుర్రపు తోకలు పట్టుకుని ఉన్న నగ్న స్త్రీల జీవమెత్తు కాంస్య విగ్రహాలు ఉండేవి. ఆ నలుగురు నగ్న స్త్రీలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు. యంత్ర శక్తి కలిగిన ఆ మంచం... నవాబు ఆదేశాలను అనుసరించి ఆ నగ్న దేహాలలో చలనం తెప్పించేది. ఫ్రెంచి సంగీతకారుడు గునోద్ సృష్టించిన ప్రఖ్యాత సంగీత రూపకం ‘ఫౌద్’ తన ముప్పై నిముషాల నిడివిని పూర్తి చేస్తుండగా మాగన్నుగా పడుతున్న నిద్రలో నవాబు సరసంగా కన్ను గీటగానే ఆ నగ్న యువతుల హస్తాలలోని విసన కర్రలు మెల్లగా వీచడం మొదలయ్యేది. అందుకు తగిన సాంకేతికత ఆ చెక్క మంచం లోపల ఉండేది’’ అని జుబ్రిచికీ వర్ణించారు. సింద్లోని ఖైర్పూర్లో ఇద్దరు పాలకులు కూడా జుబ్రిచికీ దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు విపరీతమైన ఊబకాయం కలిగిన మీర్ అలీ నవాజ్ ఖాన్. ‘‘అమెరికన్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ 1930లో సిమ్లా లోని సిసిల్ హోటల్లో మీర్ అలీని కలిశారు. మీర్ అలీ భోజనం చేస్తున్న సమయంలో ఆయన నోటికి, చేతికి మధ్య గల ప్రయాణ మార్గంలో పులుసు ఒలికి ఆయన భారీ ఉదరం అంతటా చింది పడింది’’ అని ‘డీథ్రోన్డ్’లో మీర్ అలీని గుర్తు చేసుకున్నారు జుబ్రిచికీ. మీర్ అలీ నవాజ్ ఖాన్ కుమారుడు ఫైజ్ ముహమ్మద్ ఖాన్కు స్కిజోఫ్రెనియా గానీ, లేదంటే ఏదైనా చిన్న మనోవైకల్యం గానీ ఉండి ఉండాలి. ‘‘అనుకోకుండా తన తొమ్మిది నెలల కుమారుడిని తుపా కీతో కాల్చినప్పుడు తొలిసారి ఆయన మానసిక స్థితి సందేహాస్పదం అయింది. బులెట్ శిశువు కడుపులోంచి ఊపిరి తిత్తులలోకి దూసుకెళ్లి కుడి భుజం నుంచి బయటికి వచ్చేసింది.’’ నమ్మలేని విధంగా బాలుడు బతికి, తండ్రి మరణానంతరం ఆయనకు వారసుడయ్యాడు. పాకిస్తాన్కు వాయవ్య దిశలో ఉంటుంది దిర్. 1947లో ఆ ప్రాంతానికి పాలకుడు నవాబ్ షా జహాన్. రచయిత జుబ్రిచికీ ఆ ప్రాంతాన్ని ‘ఒక నిలువనీటి కయ్య’ అంటాడు. ‘‘అక్కడ ఆసుపత్రి పడకల కంటే నవాబు వేటకుక్కల కోసం కట్టిన గృహాలే ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలను నిర్మించడానికి ఆయన నిరాకరించాడు. చదువు ఎక్కువైతే తన పాలనను అంతం చేస్తుందని ఆయన నమ్మాడు’’ అని రాశారు జుబ్రిచికీ. కలాత్ అనేది పాకిస్తాన్లోని ఒక సమస్యాత్మక ప్రాంతం. ఆ ప్రాంతం కథ మన హైదరాబాద్, కశ్మీర్లకు పోలిక లేనిదేమీ కాదు. ఆ వివరాలను మీరు గూగుల్లో, వికీపీడియాలో వెతికి తెలుసుకోవచ్చు. కలాత్ నవాబు ఖాన్ తన రాష్ట్ర విలీనానికి సంబంధించిన సంప్రతింపుల కోసం పాకిస్తాన్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాను కలిసినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం నేను వివరిస్తాను. కశ్మీర్లో మాదిరిగానే 1947 ఆగస్టు తర్వాత కలాత్ లో స్వాతంత్య్ర సంస్థాపన జరిగింది. ఆశ్చర్యకరంగా, ‘‘కరాచీలో ఒక రాయబారిని నియమించుకోడానికీ, ఆకుపచ్చ రంగు గుడ్డపై ఎరుపు రంగు ‘పవిత్ర యుద్ధ’ ఖడ్గం ఉన్న బలూచీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకూ కలాత్ ప్రాంతానికి అనుమతి లభించింది.’’ కలాత్ విదేశాంగ మంత్రిగా ఐ.సి.ఎస్. అధికారి డగ్లాస్ ఫెల్ నియమితులయ్యారు. ఫెల్ తన జ్ఞాపకాలలో... కలాత్ నవాబు – జిన్నాల మధ్య సమావేశం తిన్నగా సాగకపోవడంపై ఇచ్చిన వివరణను జుబ్రిచికీ పుస్తకంలో చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలయ్యేంతగా నేను నవ్వేశాను. ‘‘కలాత్ నవాబు ఖాన్ అనర్గళమైన ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతున్నారు. జిన్నా కూడా అంతే అనర్గళంగా, గంభీరంగా ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. జిన్నాను ఒప్పిస్తున్నానని ఖాన్, ఖాన్ని ఒప్పిస్తున్నానని జిన్నా అత్యంత ఆత్మవిశ్వాసంతో చర్చల్ని నడిపి స్తున్నారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి గమనించినదే మిటంటే ఒకరు మాట్లాడుతున్నది ఒకరికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదని...’’ అని రాశారు జుబ్రిచికీ. ఆ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ ఇక్రముల్లా మన మాజీ ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హిదయతుల్లాకు సోదరుడు. ఇక్రముల్లా జోర్డాన్ యువ రాణి సర్వత్ తండ్రి. నిజమైన రాజవంశీకుడైన ఏకైక పాకిస్తానీ, నాకు ప్రియమైన స్నేహితుడు కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రేమ పెళ్లిళ్లపై రాజకీయ పెత్తనం
ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించడంపై తాజాగా చర్చ మొదలైంది. ఇంకా విచిత్రం ఏంటంటే, పలువురు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని సమర్థించడం! ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం! నిజమైన ప్రజాస్వామ్యం... తల్లితండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మన రాజకీయ నాయకుల నుండి, అంత కంటే ఎక్కువగా మన ప్రభుత్వాధినేతల నుండి నేను ఆశించే ఒక విషయం... కొద్ది మోతాదులోనైనా వారు జ్ఞానం కలిగి ఉండటం, మన రాజ్యాంగం ప్రకారం మనకు సిద్ధించిన హక్కుల గురించి వారు తెలుసుకోవడం, ఆ హక్కులను అతిక్రమించినప్పుడు అతిక్రమించామని తెలుసుకోగలిగిన తెలివిడి వారికి ఉండటం! ఇప్పుడీ దుర్భరమైన నైతిక ఉపన్యాసపు వెలుగులో నేను చెప్పబోతున్న కథను మీరు వినాలి. ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజ రాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ నివేదించింది. ఈ పరిశీలన రాజ్యాంగ పరిమితులకు లోబడే జరుగుతుందని ఆయన అన్నప్పటికీ అదే రాజ్యాంగంలోని నిబంధన ఆయన సంకల్పించిన ఆ పనిని కచ్చితంగా అసాధ్యం చేస్తుంది. ఎందుకంటే అలా చేయడం అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం అవదా? రాజ్యాంగం అనే ఆ అమూల్య పత్రంలో రాసివున్న దానిని బట్టి 18 ఏళ్లకు మనం పెద్దవాళ్లం అయినట్లు! అక్కణ్ణుంచి ఒక స్త్రీకి తను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే, చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటే కనుక, ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చన్న స్వేచ్ఛ కూడా! విచిత్రంగా పురుషులకు మాత్రం 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ హక్కును రాజ్యాంగం అందించదు. వారు 18 సంవత్సరాల వయసులో ఓటు వేయవచ్చు కానీ, పెళ్లి మాత్రం చేసుకోవడానికి లేదు. ఈ సమ రాహిత్యం గురించి ఇంకో రోజు చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చితే తప్ప ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయలేమని ముఖ్యమంత్రికి తెలియదా? చూస్తుంటే ఆయనకు మన రాజ్యాంగం గురించి తెలియదని అనిపి స్తోంది. లేదా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చే అధికారం తనకు ఉందని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. లేదంటే, బహుశా...చెప్పింది చేయాలనేం ఉంది అనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుంది. ఉన్నవి ఉన్నట్లుగా ఆయన మాటలు ఇవీ: ‘‘రుషికేశ్భాయ్ పటేల్ (ఆరోగ్య మంత్రి) నాతో ఏం అన్నారంటే – నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి పారిపోతున్న అమ్మాయిల కేసులపై ఒక అధ్యయనం జరగాలనీ, పునరాలోచన జరపాలనీ... అందువల్ల ప్రేమ వివాహాలకు తల్లితండ్రుల సమ్మ తిని తప్పనిసరి చేసేందుకు ఏదో ఒకటి చేయ వచ్చనీ... ఇందుకు రాజ్యాంగం అడ్డుపడకపోతే కనుక మనం ఈ అధ్యయనాన్ని చేపట్టవచ్చు. ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఫలి తాలు రావచ్చు కదా!’’ ఇంకా విచిత్రం ఏంటంటే... పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్ను ఈ విషయంలో సమర్థించడం. ముఖ్యమంత్రికి తన మద్ధతునిస్తూ ఇమ్రాన్ ఖేడావాలా ఒక లేఖను కూడా రాశారు. ‘‘తల్లితండ్రులు తమ పిల్లల్ని పెంచి పోషిస్తారు. కనుక పిల్లల వివాహానికి వారి సమ్మతి తప్పనిసరి’’ అని ఖేడావాలా పేర్కొన్నారు. అంతేకాదు, గుజరాత్ శాసనసభ వర్షాకాల సమావేశాలలో దీనిపై ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ బిల్లును తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లితండ్రుల అదుపులో ఉండటం లేదు. మొద్దుబారి ఉంటున్నారు’’ అని ఖేడావాలా వ్యాఖ్యానించారు. ఈ రకమైన మనస్తత్వంతో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఒక్కరే కాదు. జెనిబెన్ ఠాకూర్ కూడా! ఆమె మహిళా ఎమ్మెల్యే. జెనిబెన్, బీజేపీ ఎమ్మెల్యే ఫతేసిన్హ్ చౌహాన్ కలిసి, ‘‘అమ్మాయి నివసిస్తున్న తాలూకాలోనే, స్థానికుల సమక్షంలో, తల్లితండ్రుల సమ్మతితో వివాహం జరిగేలా గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2009ను మార్చాలి’’ అని డిమాండ్ చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ రాసింది. ఓటు కోసం 18 ఏళ్లు నిండిన బాలికలకు క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తుండే ఈ పద్ధతైన పురుషులు, పద్ధతైన స్త్రీలలో ఎవరైనా తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునేంత పరిణతి ఆ వయసు వారిలో ఉండదన్న వాదనను తీవ్రంగా తోసిపుచ్చకుండా ఉండి ఉంటారా? అయినప్పటికీ వారు 18 ఏళ్ల బాలిక తన తండ్రి సమ్మతి లేకుండా తన ఇష్టానుసారం వివాహం చేసుకోరాదని విశ్వసి స్తున్నారు. ఇలాంటి విషయాల్లో తల్లుల సమ్మతి రెండవ ప్రాధాన్యంగా ఉంటుంది, వాళ్లనొకవేళ లెక్కలోకి తీసుకుంటే కనుక. ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం. నిజమైన ప్రజాస్వామ్యం... తల్లిదండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తుంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. మనం హక్కుల్ని పరిమితం చేస్తున్నాం. స్వేచ్ఛా పరిధులను తగ్గించేస్తున్నాం. వ్యక్తుల నిర్ణయాలపై అధికారంతో పెత్తనం చలాయిస్తున్నాం. తిరోగమనంలోకి వెళ్తున్నాం. భారతదేశానికి ప్రజాస్వామ్యంతో ఉన్నది మాతృమూర్తి సంబంధం అని మన ప్రధాన మంత్రి అనడంలోని ఉద్దేశాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మన దేశాన్ని మారుతల్లిగా ఉంచేందుకు ఆయన సంకల్పించినట్లున్నారు. మార్మికంగా ఒక అద్భుతమైన మాతృమూర్తి అవతరించకుంటే మన యువరాణులు పర దృష్టికి చాటునే ఉండిపోతారు. బుగ్గపై చిన్న ముద్దుతో ఆ సౌందర్య రాశులను నిద్ర లేపే మహదావకాశాన్ని మన అందాల రాకుమారులు కోల్పోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కనీస స్పందన కరవైందా?
మణిపురలో మహిళలను నగ్నంగా ఊరేగించి, తర్వాత వారిపై అత్యాచారం జరిపిన ఘటన తాలూకు వీడియో దేశాన్ని దిగ్భ్రాంతికి లోనుచేసింది. దశాబ్దం క్రితం జరిగిన భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంతరాత్మలోకి చొచ్చుకుపోయింది. మే 4న జరిగినట్టు చెబుతున్న ఈ ఘోరమైన ఘటన తాలూకు వీడియో రెండు నెలల తర్వాత బయటికి రావడం ఒకటైతే, ఆ ఘటన పట్ల ప్రభుత్వం, అధికారులు, పోలీసుల స్పందన ఆందోళన కలిగిస్తోంది. దాన్ని కనీస స్పందన అని కూడా అనలేం. అది మిన్నకుండటమా? పట్టించుకోకపోవడమా? బాధ్యతారాహిత్యమా? వారి వివరణలను బట్టి చూసినా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే! మణిపురలో జరిగిన హింసాత్మక ఘటన లను ఏ విశేషణాలతోనూ వివరించడం సాధ్యం కాదు. అది ఏ వర్ణనకూ లొంగనిది. దశాబ్దం క్రితం జరిగిన మరో భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంత రాత్మలోకి చొచ్చుకుపోయింది. అయితే మే 4వ తేదీన జరిగిన అత్యాచారాలు గర్హనీయమైన ఒక సంఘటన మాత్రమే. రెండు వేర్వేరు వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే, కనీసం ఇంకో ఐదు ఇలాంటివి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మన దృష్టి మొత్తం ఆ ఘటనల తాలూకూ బాధాకరమైన వివరాల వైపు వెళుతుంది. నా భయం ఏమిటంటే... మణిపుర ఘోరాలు ఇంకా ఎన్నో మనం చూడాల్సి వస్తుందన్నది! అయితే ప్రస్తుతానికి మే 4వ తేదీ ఘటనలపై అధికారిక వివరణలు లేవనెత్తుతున్న ప్రశ్నలకే పరిమితమవుదాం. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే! బాధిత మహిళల్లో చిన్న వయసు మహిళ ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక ప్రతినిధితో, ‘‘దుండగుల గుంపు మా ఊరిపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు’’ అని చెప్పింది. దీనర్థం మనల్ని రక్షించాల్సిన వాళ్లే అక్కడ నిలబడి మౌన ప్రేక్షకులయ్యారా? ‘‘పోలీసులే మమ్మల్ని వారికి (దుండగులకు) అప్పగించారు’’ అని కూడా ఆ అమ్మాయి వాపోయింది. అంటే, తక్కువ సంఖ్యలో ఉన్నా సరే, పోలీసులు బలహీనంగా చేతులెత్తేశారు అని అర్థమా? అరాచక శక్తుల దాడి నుంచి పోలీసులు మహిళలను రక్షించలేదు సరికదా, వారు వారి భద్రత, ప్రాణాల సంగతి మాత్రమే చూసుకున్నారు. మనం వారి నుంచి ఆశించేది అది కాదు కదా? మహిళలను దుండగులకు అప్పగించిన తరువాతైనా పోలీసులు అదనపు బలగాలను ఎందుకు రప్పించలేదు? అలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసుల తక్షణ తప్పనిసరి ప్రతిస్పందన ఇలాగే కదా ఉండాలి? ఇది కూడా జరగలేదు. పైగా ఆ బాధిత మహిళలు దగ్గర లోని ఆసుపత్రిని చేరేందుకు దాదాపు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది! కనీసం ఇప్పుడైనా పోలీసులు తిరిగివచ్చి, ఆ మహిళలకు కాస్తంత చేయూతనివ్వాల్సింది కదా? మే నాలుగున జరిగిన ఘటనలకు సంబంధించి తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ నెల 18వ తేదీన. రెండోది జూన్ 21వ తేదీన. కానీ దాడులకు పాల్పడిందెవరో తెలియని కారణంగా తాము ఏ చర్య కూడా తీసుకోలేకపోయామని పోలీసులు అంటున్నారు. నిజంగానా? తాము ఎవరికి ఆ మహిళలను అప్పగించామో కూడా గుర్తు పట్టలేక పోయారా? వారి ముఖాలు మరచిపోయారా? దుండగుల గుంపులో కొందరిని తాను గుర్తుపట్టగలనని బాధిత యువ మహిళ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు తెలిపింది. అందులో తన సోదరుడి స్నేహితుడూ ఉన్నాడని పేర్కొంది. పోలీసులు చర్య తీసుకునేందుకు ఈ సమాచారమూ సరిపోలేదా? నిజమేమిటంటే... పోలీసులు ఆ బాధిత మహిళ వాఙ్మూలాన్ని ఇప్పటివరకూ రికార్డే చేయలేదు. సరే... ఇదంతా జరిగిన తరువాత కనీసం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అయినా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా? వీడియో చూసిన వెంటనే తనకు తానుగా సూమోటో కేసుగా దీన్ని తీసు కున్నానని ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన రెండు నెలలకు ‘సూమోటో’ కేసుగా తీసుకోవడం ఏమిటి? మే నాలుగు నాటి ఘటనల గురించి తాను జూన్ 19న మణిపుర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)లకు సమా చారం ఇచ్చానని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. మరి, ముఖ్యమంత్రికి ఎవరూ చెప్పలేదా? ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు ఏ రకమైన చర్యా తీసుకోలేదు? ఇంకో విషయం. దాడులకు పాల్పడిందెవరో గుర్తించలేని కారణంగా తాము రెండు నెలలుగా ఏ చర్యా తీసుకోలేకపోయామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ (వీడియో బయటికి వచ్చిన) కేవలం 24 గంటల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా సాధ్యం కానిది 24 గంటల్లో మెరుపువేగంతో ఎలా చేయగలిగారు? ఈ ప్రశ్నకూ సమాధానం కావాలి. చివరగా... జాతీయ మహిళా కమిషన్ విషయానికి వద్దాం. జూన్ 12న నార్త్ అమెరికన్ మణిపుర ట్రైబల్ అసోసియేషన్, ఇద్దరు మణిపుర మహిళా కార్యకర్తలు రాసిన లేఖ ఒకటి కమిషన్ కు చేరింది. ‘‘మే నెల నాలుగవ తేదీన కాంగ్పోకీ జిల్లాలోని బి. ఫైనామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. నగ్నంగా ఊరేగించారు. కొట్టడం మాత్రమే కాకుండా చుట్టుముట్టిన మైతేయ్ మూక బహిరంగంగా మానభంగానికి పాల్పడింది. రాష్ట్రానికి చెందిన పోలీ సులు ప్రేక్షకుల్లా ఉండిపోయారు. ఇద్దరు బాధితులు చురాచాంద్పూర్ జిల్లా శరణార్థి శిబిరాల్లో ఉన్నారు’’ అని ఆ ఘటనలకు సంబంధించి నిర్దుష్టంగా, వివరంగా తెలిపారు. అయినాసరే... జాతీయ మహిళ కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ తాను ఎలాంటి చర్య తీసుకోలేక పోయానని చెబుతూ, అందుకు కారణం అది సాధారణ సమాచారం కావడమనీ, నిర్దిష్టంగా ఫలానా ఘటన గురించిన సమాచారం లేదనీ అన్నారు. మణిపురలోని పరిస్థితుల దృష్ట్యా కమిషన్ తన ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపలేకపోయిందని కూడా ఆమె చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపురను సందర్శించగలిగారు. సామాజిక కార్యకర్త అన్నీ రాజా వెళ్లగలిగారు. కానీ శౌర్య గల కమిషన్ మాత్రం వెళ్లలేకపోయింది! అయితే రేఖా శర్మకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇద్దాం. ఆమె మణిపుర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖనైతే రాశారు. వాళ్లేం చేయలేదు. ఈమె కూడా పట్టించుకోలేదు. దీనర్థం తాను చేయాల్సిన పని కనీస మాత్రంగానే చేశారనా? అది కూడా సంశయాస్పదమా? తమ కామెంట్లు తమపైకే తిరగబడే సందర్భం వస్తుందని ఊహించని కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యతో ముగిస్తాను. 2017లో కాంగ్రస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా... ప్రధానమంత్రి ఓ ట్వీట్ చేస్తూ...‘‘రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి మణిపురను పాలించే అర్హత లేదు’’ అన్నారు. ఈ వ్యాఖ్యతో నాకు ఎలాంటి విభేదాలూ లేవు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
మొండి మౌనానికి మోక్షం ఎన్నడు?
రెండు నెలలుగా మణిపూర్ అతలాకుతలం అవుతోంది. అయినప్పటికీ ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందేహించడానికేం లేదు. కానీ మణిపుర్పై మాట్లాడేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఆరంభించని విధంగా ఈ వ్యాసాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఒక ఉద్దేశ ప్రకటనతో. కొలిచినట్లుగా, సమతూకంతో, వేరుగా ఉండి చూస్తూ నాకు వీలైనంతగా ఇందులో న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. విషయం మణిపూర్ అయినప్పుడు ఇలా ఉండటం తప్పనిసరి. నేనిక్కడ మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ మానని గాయాల్ని రేపడం లేదా భావావేశాలను భగ్గుమనిపించడం మాత్రం నా ఆకాంక్ష కాదు. మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను ఎందుకు తొలగించలేదు? 65 రోజుల తర్వాత కూడా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంలోని ఆయన అసమర్థత లేదా అశక్తత కచ్చితంగా రూఢి అయి నదే. సొంత శాసనసభ్యులకు కూడా ఆయనపై నమ్మకం పోయింది. మే నెలలో, ప్రత్యేక పాలన కోసం డిమాండ్ చేసిన ఏడుగురు బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదని బహిరంగంగానే ప్రకటించారు. జూన్లో ఎనిమిది మంది బీజేపీ మెయితీ ఎమ్మెల్యేలు, ‘‘మణిపూర్ ప్రజలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంటే తమ 32 మంది ఎమ్మెల్యేలలో 15 మంది. లెక్కల్ని పక్కన పెడితే, బీరేన్ సింగ్ను తొలగించాలనే డిమాండ్ వెనుక లోతైన నైతిక హేతువే ఉంది. మణిపూర్ జనాభాలో 16 శాతంగా ఉన్న కుకీలు... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఆయనే కారణం అని నిందిస్తున్నారు. మెయితీ దురహంకారిగా, కుకీల వ్యతిరేకిగా వారు ఆయన్ని పరిగణిస్తున్నారు. గతవారం బీరేన్ సింగ్ అధికార ట్విట్టర్ అకౌంట్ ఈ ఆరోపణకు ఒక ధ్రువీకరణగా నిలిచింది. తనను విమర్శిస్తున్నది కుకీలు, మయన్మార్కు చెందిన వారు మాత్రమే నన్న అర్థం వచ్చేలా బీరేన్ సింగ్ ఒక ట్విట్టర్ యూజర్కు బదులి చ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ రాసింది. ‘‘మీరసలు ఎప్పుడో రాజీ నామా చేయవలసింది కదా?’’ అని ఆ యూజర్ చేసిన కామెంట్కు సమాధానంగా, ‘‘నీది భారతదేశమా? లేక మయన్మారా?’ అని బీరేన్ సింగ్ ప్రశ్నించినట్లు ట్విట్టర్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాయి. కుకీలను అన్నిటి కంటే ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే సయోధ్యపై ఏ విధమైన ఆశ ఉంటుంది? నేను లేవనెత్తాలని అనుకుంటున్న రెండవ అంశం, జూన్ నెలా ఖరులో జరిగిన ఒక సంఘటన. దాదాపు 1,500 మంది మెయితీ మహిళలు, బహుశా ‘మీరా పైబిస్’ మహిళా ఉద్యమ కార్యకర్తలు... తూర్పు ఇంఫాల్లోని 3వ ఆర్మీ దళ శిబిరాన్ని చుట్టుముట్టి మెయితీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపునకు చెందిన 12 మంది మెయితీ తీవ్రవాదులను విడిపించుకుని వెళ్లారు. 2015లో చందేల్లో పొంచివుండి జరిపిన మెరుపుదాడితో 18 మంది సైనికులను హతమార్చింది ఈ ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపు సభ్యులే. ఆ పన్నెండు మందిలో తనను తాను లెఫ్ట్నెంట్ కల్నల్ మెయి రంగ్థెమ్ తంబా అని చెప్పుకునే వ్యక్తి ఆనాటి దాడికి వ్యూహం రచించాడు. వీళ్లసలు ఎప్పటికీ విడుదల కావలసినవాళ్లు కాదు. కానీ విడు దలయ్యారు. ఇంకా ఘోరం ఏమిటంటే, విడిపించుకుని వెళ్లిన ఈ మహిళలందరికీ బీజేపీ మెయితీ ఎమ్మెల్యే తౌనోజం శ్యామ్కుమార్ సింగ్ మద్దతు ఉండటం. వారిని విడిపించుకుని వెళ్లేటప్పుడు తను అక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆయన ఖండించడం లేదు కానీ, వాళ్లను విడుదల చేయాలని తను అడగలేదని మాత్రం గట్టిగా చెబు తున్నారు. అయితే భద్రతా అధికారులు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు చెప్పిన కథనం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా మిలిటెంట్ల విడుదలకు బలగాలతో చర్చలు జరిపారని! వైరుద్ధ్యం ఏమిటంటే కుకీలను వెళ్లి కలుసుకోవాలనీ, ద్వైపాక్షికంగా ఉండాలనీ బీరేన్ సింగ్కు హోమ్ మంత్రి చెప్పారని ‘ది హిందూ’లో వార్త వచ్చిన తర్వాతే ఈ ‘విడిపించుకు పోవడం’ జరగడం. ఇంఫాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు... హోమ్ మంత్రి చెప్పారంటున్న దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఇంకొక సంగతి. శ్యామ్ కుమార్ సింగ్ వార్తను మిగతా పత్రికలు ఎందుకు వేయలేదు? ఇంఫాల్లో గానీ, ఢిల్లీలో గానీ ఎవరూ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? నా మూడో ఆందోళన... బాధను కలిగించేది మాత్రమే కాదు, భ్రాంతులను పోగొట్టేది కూడా! రెండు నెలలుగా మణిపూర్ అతలా కుతలం అవుతోంది. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, ఇప్పుడిక భయానకమైన శిరచ్ఛేదనం! అయినప్పటికీ మన ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మెయితీ, ప్రతి కుకీ, ప్రతి నాగా... నిరాశలో ఉన్నారు. మొదట వారు కలత చెందారు. తర్వాత ఆగ్రహించారు. ఆ తర్వాత తమకు నమ్మకద్రోహం జరిగి నట్లుగా భావించారు. ఇప్పుడు తాము ఎవరికీ అక్కర్లేదని నమ్ము తున్నారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందే హించడానికేం లేదు. కానీ మణిపూర్పై మాట్లాడేందుకు మోదీ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. విధులు, రాజ్యాంగ అవసరాలను మించి దేశంలోని ఆందోళన కర పరిస్థితులపైన మాట్లాడవలసిన నైతిక ఒత్తిడి ప్రభుత్వాధినేతపై ఉంటుంది. ఆయన మాట్లాడారూ అంటే మనందరి తరఫున మాట్లాడి నట్లు. మన ప్రధానమంత్రిగా మాట్లాడినట్లు. కానీ ఆయనకు మాట్లా డేందుకు ఏమీ లేదంటే ఆయన మౌనం ఆయన ఒక్కరితోనే ఉంటుంది. ఆ మౌనం మనందరికి ప్రాతినిధ్యం వహించదు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నెహ్రూకు నచ్చింది మోదీ చేతికొచ్చింది!
అమెరికా పర్యటనలో మన ప్రధానమంత్రికి బైడెన్ దంపతులు ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్ పొయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్’ తొలి ముద్రణ ప్రతి ఉంది. ఫ్రాస్ట్ బహుశా నెహ్రూకు నచ్చిన కవి. ఆ సంకలనంలోని ఒక కవిత ‘... బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్’ అనే భావోద్వేగమైన వాక్యాలతో ముగుస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా లేదూ? మనసు వింతైనది. విచిత్రంగా పని చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనల్ని కలుపుకొంటుంది. మరచిపోయిన జ్ఞాపకాలను రేపుకొంటుంది. అందులో తర్కం ఉండదు. అలా జరుగుతుందంతే. ఫలితం హాయినిగొల్పేది అయివుండొచ్చు, కలవర పరచేదీ కావచ్చు. గతవారం నాకు ఇలాగే జరిగింది. మీకెప్పుడైనా ఇలా అయిందా? జో బైడెన్ దంపతులు మన ప్రధాన మంత్రికి ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్ పొయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్’ తొలి ముద్రణ ప్రతి కూడా ఒకటని చదివినప్పుడు నాకు ఇలా అవడం మొదలైంది. ఫ్రాస్ట్ని కానుకగా ఇవ్వడంలో అసాధారణత ఏమీ కనిపించలేదు. ఫ్రాస్ట్ బహుశా అమెరికా దేశపు అత్యంత ప్రసిద్ధుడైన కవి. నాలుగుసార్లు పులిట్జర్ అవార్డు పొందిన వ్యక్తి ఆయన ఒక్కరే. కనుక అమెరికా అధ్యక్షుడు ఒక భారతీయ ప్రధానికి ఫ్రాస్ట్ కవితల తొలి ముద్రణ ప్రతిని ఇవ్వడం సముచితమైన కానుకే అవుతుంది. అయితే ఇక్కడొక చిక్కు ఉంది. లేదా నా ఉద్దేశంలో ఆక్షేపణ. ఫ్రాస్ట్ బహుశా జవహర్లాల్ నెహ్రూకు నచ్చిన కవి. మోదీకి బైడెన్ కానుకగా ఇచ్చిన ఈ కవితా సంకలనంలోని ఒక కవిత ‘స్టాపింగ్ బై ఉడ్స్ ఆన్ ఎ స్నోవీ ఈవెనింగ్’. ఆ కవిత భావోద్వేగభరితమైన ఈ వాక్యాలతో ముగుస్తుంది: ‘ది ఉడ్స్ ఆర్ లౌలీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్,అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్.’ నెహ్రూ ఈ వాక్యాలలో లోతైన అర్థాన్ని చూశారు. వాటిని ఆయన ఉన్నవి ఉన్నట్లుగా చేత్తో తిరగ రాసుకుని ఆ కాగితాన్ని బల్లపైన ఉన్న గాజు పలక కింద... పైకి కనిపించేలా పెట్టుకున్నారని ఎవరి ద్వారానో నేను విన్నాను. మరికొందరు నెహ్రూ ఆ కాగితం ముక్కకు పటం కట్టించి బల్లపై ఉంచుకున్నారని అంటారు. నెహ్రూకు తను సేకరించిన అమూల్యమైన వస్తువులను తన పడక పక్కన అమర్చుకునే అలవాటు ఉందనీ, వాటిల్లో ఈ వాక్యాలు ప్రముఖ స్థానం పొందాయనీ కూడా కొందరు అంటారు. నిజం ఏదైనప్పటికీ అదొక కవిత. నెహ్రూకు ఎంతో అమూల్యమైనది. అయితే ఇదేమీ కొత్త కథ కాదు. 50లు, 60లు, 70లలో పెరిగి పెద్దవాళ్లయిన అనేకమంది భారతీయులకు ఈ సంగతి తెలుసు. నెహ్రూ జీవిత చరిత్రను రాసినవారు ఈ విషయం గురించి కూడా రాశారు. నెహ్రూ చుట్టూ అల్లుకుని ఉన్న నమ్మకాలలో ఇదొక భాగం. అటువంటిదే ఒక వాస్తవం... అందరికీ తెలిసిన విషయం ఏమి టంటే, మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేకానేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా అనిపించడం లేదూ? బైడెన్కు ఈ సంగతి ఆయనకై ఆయనకు తెలియకపోవచ్చు. లేదా ఇదే పుస్తకాన్ని మోదీకి కానుకగా ఇవ్వాలన్న నిర్ణయం ఆయనది కాకపోనూవచ్చు. కానీ ఆయనకు ఎల్లవేళలా సలహాలు ఇచ్చేవారు ఉంటారన్నది మాత్రం నిస్సందేహం. వారు ఇండియా గురించి బాగా తెలిసినవారై, మరీ ముఖ్యంగా... మోదీని సంతోషపరిచే కానుకను జాగ్రత్తగా ఎంపిక చేయగలవారై ఉండొచ్చు. వారైతే నెహ్రూ–ఫ్రాస్ట్ లేదా మోదీ–నెహ్రూల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదో తెలియని వారంటే నమ్మడం కష్టం! కనుక ఇది నిజంగా యాదృచ్ఛికమేనా, లేక ఇవ్వకనే ఇచ్చిన సూక్ష్మమైన సందేశమా అన్న ఆలోచన నా బుర్రను ఒక గమ్మత్తయిన, అనియంత్రిత దిశలోకి నడిపించింది. అదేమిటో తెలిసేలోపు నేను 1976లోకి వెళ్లిపోయాను. ఆ ఏడాది నేను నా 21వ జన్మదినాన్ని కేంబ్రిడ్జిలో... కొంచెం ఎక్కువ చేసి చెప్పుకోవాలంటే... మత్తుపానీ యాల ఆతిథ్యంతో వేడుకగా జరుపుకొన్నాను. ఆ సందర్భంగా... డఫ్నీ, ఆమె ప్రియ స్నేహితుడు హంఫ్రీ నాకు ఆకుపచ్చ, ఎరుపు చారల ‘టై’ని కానుకగా ఇచ్చారు. అది నేను కట్టుకునే రకం టై వంటిది కాదు కాబట్టి సొరుగులో పెట్టి, దానిని నాకు ఎవరిచ్చారో కూడా మర్చిపోయాను. తర్వాత ఎనిమిది నెలలకు హంఫ్రీ పుట్టినరోజు వచ్చింది. అతడి కోసం డఫ్నీ ముందేమీ చెప్పకుండా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా బర్త్డే పార్టీని ఏర్పాటు చేసింది. నేనొక మతిమరుపు గల బుద్ధిహీనుడిని కనుక నా సొరుగులో కనిపించిన టైని హంఫ్రీకి ఇవ్వదగిన బహుమతి అని భావించాను. దానినొక ఖరీదైన కాగితంలో చుట్టి, దానికి సరిపోయే బర్త్డే కార్డును జతపరచి రయ్యిన పార్టీకి లంఘించాను. నేనిచ్చిన కానుకను తెరచి చూడగానే హంఫ్రీ ముఖం ఎలా మారి పోయిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. విషయం అతడికి అర్థమైన క్షణం అది. తను ఇచ్చిన అదే టై తిరిగి తనకు కానుకగా వెళ్లింది! హంఫ్రీ పెద్దగా నవ్వాడు. నా ముఖం ఎర్రబడింది. ‘‘మనం ఏదైతే చేస్తామో తిరిగి అదే మనకు జరుగుతుందని నేను ఊహించగలను’’ అని మాత్రం అన్నాడు హంఫ్రీ గొప్ప దయతో. బైడెన్ పుస్తకానికీ, నా టైకీ మధ్య మీకేదైనా ప్రత్యక్ష, లేదంటే పరోక్ష సంబంధం కనిపిస్తోందా? రెండింటినీ మీరు అనుచితమైన కానుకలుగా పిలవొచ్చు, లేదంటే తగని ఎంపికలు అనవచ్చు. కానీ బైడెన్ అసంకల్ప కానుక... నేను ఇబ్బంది పడ్డంతగా... ఆయన్ని ఏ విధం గానూ ఇబ్బంది పెట్టేదైతే కాదు. హంఫ్రీకి నాపై మనసులో ఏమీ లేదు. డఫ్నీతో అతడు విడిపోయినా, మేమిద్దరం ఇప్పటికీ స్నేహి తులుగానే ఉన్నాం. నన్నెప్పుడైనా అతడు టైతో చూస్తే, ‘ఆ’ టైని గుర్తు చేయడం మాత్రం మర్చిపోడు. బైడెన్ తనకు ఆ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం గురించి నరేంద్ర మోదీ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని నాకు మహా ఆరాటంగా ఉంది. నేను అనుకోవడం... అమెరికా అధ్యక్షుడి అప్రమేయ కానుక మోదీకి ముసిముసి నవ్వులు తెప్పిస్తుందని. మోదీ ఎప్పుడైనా తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే అందులో ఈ చిన్న కథ కోసం ఎదురు చూడవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’
1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్ను ఊపని, ఫుట్బాల్ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం స్పష్టంగా కనిపించేది. ఇందుకు భిన్నంగా 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన ‘గురు’ క్రీడాప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను విద్యార్థులలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడుతుండేవారు. విద్యార్థులు ఆయన వద్ద పాఠ్యాంశంగా చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, వారు నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు ఆయన బోధించినవే. ఇలా చేయమని గురు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ఆయనొక ఉదాహరణగా కనిపించేవారు. మేము ఆయన్ని ‘గురు’ అని పిలుచు కోవడం ఆపేక్షతోనే అయినప్పటికీ నిజానికి ఆయనకు అదే కచ్చితమైన మాట. విశ్వగురు అనడం ఫ్యాషన్ ఈ రోజుల్లో. కానీ ఆయన నిజమైన, అంకితభావం కలిగిన, శ్రద్ధాబద్ధుడైన ఉపాధ్యాయుడు. కావాలంటే మీరు ఆయన్ని భారతీయ ‘మిస్టర్ చిప్స్’ అనుకోవచ్చు. డూన్ స్కూల్ అబ్బాయిలకు ‘గురు’ అనే పేరుతోనే గురుదయాళ్ సింగ్ తెలుసు. గురు అన్నది ఆయన పేరుకు సముచి తమైన నామకరణ. గత నెలలో ఆయన కన్ను మూసినప్పుడు కూడా అదే పేరుతో మాకు స్మరణీయం అయ్యారు. నేను గురును మొదటిసారి కలిసినప్పుడు నా వయసు పదేళ్లు. జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ ఆయన. పొడవాటి మనిషి. నా వయ సుకు ఇంకా పొడవుగా, భారీగా కనిపించారు. అయితే ఆయన చిరు నవ్వుతో నా భయాలు, అందోళనలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఆయన నవ్వినప్పుడు నేనూ పెద్దపెట్టున నవ్వాను. నవ్వును ఆపు కోలేకపోయాను. ఆయన వద్ద పాఠ్యాంశంగా నేను చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, నేను నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు సైతం ఆయన బోధించినవే. ఆ కొన్నింటిలో మొదటిది అతి కష్టమైనది మాత్రమే కాకుండా, అసలు నేనేమిటన్న దాన్ని నాకు బహిర్గతం చేసినది కూడా! 1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. దీనర్థం ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్ను ఊపని, ఫుట్బాల్ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం అన్నది స్పష్టంగా కనిపించేదని! నేను నటనలో, వాదోపవాద చర్చలలో ముందుండే వాడిని. అలాగే, ఆఖరు నిమిషంలో చదివి మార్కుల్ని అదర గొట్టేయడంలో కూడా. కానీ నేను ఆటల్లో లేకపోవడం వల్ల నాలోని ఈ నైపుణ్యాలు చిన్నచూపునకు గురయ్యేవి. అయితే గురు, క్రీడా ప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను నాలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడు తుండేవారు. నేను పాల్గొన్న చర్చల్లోని నా తెలివైన మాటల్ని గుర్తు చేసుకునేవారు. అదొక ప్రశంసలా ఉండేది నాకు. లేదా చర్చావేదిక మీద అలా స్తంభించిపోయిన నా భంగిమ గురించి మాట్లాడుతూ నవ్వేసేవారు. పైకి అది సున్నితమైన ఎగతాళిగా ఉన్నప్పటికీ నిన్ను నేను శ్రద్ధగా గమనిస్తున్నాను సుమా అనే ఒక అంతర్లీనత కూడా ఆయనలో వ్యక్తం అయి, నేనొక ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన నాలో కలిగించేది. జూనియర్స్ క్రికెట్లో నేను అత్యుత్తమంగా ఆడినప్పటికీ ఆయన ఉద్దేశం ప్రకారం నా చివరి ఏడాదిలో నేను ‘హౌస్ కెప్టెన్’ అవడానికి తగిన కారణం మాత్రం నాలోని ఆ కళాత్మక నైపుణ్యాలే! ఎందుకంటే, క్రికెట్ గ్రౌండ్లో నేనొక్కడినే ఉన్న వైపు నేరుగా వచ్చి నా చేతుల్లో పడిన బంతిని కూడా నేను క్యాచ్ పట్టలేకపోయాను. ఆ విధంగా గురు, డూన్ స్కూల్ తానుగా ఎప్పటికీ నాకు అందించని విశ్వాసాన్ని నాలో కలిగించారు. నాలోని ప్రతిభ, నైపుణ్యాలతో సమానంగా, నా పరిమితుల్నీ నేను గుర్తించేలా; నా అపజయాల్ని, వైఫల్యాలను, తప్పుల్ని నేను ఎదుర్కొనేలా నేను ఎదగడానికి గురు తోడ్పడ్డారు. పడిపోతే పైకి లేచి, ముందుకు సాగిపోవడం ఎలాగో నేర్పించారు. అది నాకు ముఖ్యమైన పాఠం. ఎందుకంటే జీవితంలో తరచు నేను పొరపాట్లు చేసి పడిపోతుంటాను. ఏళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయినప్పుడు గురు నాకు చెప్పిన మరొక పాఠాన్ని గుర్తుకు చేసుకున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించడం అన్నదొక్కటి మాత్రమే ఉత్తమ మార్గం కాదు. తప్పును మన్నించడం అన్నది ఉత్తమమైన మార్గం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అంటారు గురు. గురు స్వయంగా ఈ సూత్రాన్ని పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొండితనాన్ని, అబద్ధాలను, ఉద్దేశ పూర్వకమైన తెలివితక్కువ వేషాలను ఆయన భరించారు. నా తప్పు లన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆ తప్పుల్ని పోనిచ్చేవారు. అయితే ఆయన ముఖభావాలను బట్టి, నేను మరికొంత మెరుగ్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించేవాడిని. ఏమీ తెలియని టీనేజ్లో ఉన్నప్పటికీ ఆ గ్రహింపు నాకు బాధను కలిగించేది. గురు దృష్టిలో గొప్పగా ఉండటం కన్నా నాకు వేరేదీ అక్కర్లేకపోయేది. అందుకే ఆయన అనిష్టత నా మనసును పిండేసినట్లుగా ఉండేది. ఆ మాత్రం శిక్ష సరిపోతుందని గురుకు తెలుసు. ఇతరులు తప్పు చేసినప్పుడు నేను ఈ పాఠాన్ని గుర్తు చేసు కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత తేలికగా ఉండదు. అందుకు వివేకం, నిగ్రహం రెండూ కావాలి. గురుకు ఆ రెండూ ఉన్నాయి. నాకు తరచు అవి రెండూ ఉండవు. నేను సరిగా నేర్చుకోని ఒక పాఠం ఇది. మూడవ పాఠం, నేనింకా సాధన చేస్తూనే ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అది సులభమైనది. కొద్దిపాటి మర్యాదల పాటింపుతో స్పష్టమైన వ్యత్యాసాలను మీరు చూపగలుగుతారు. గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అందరినీ పలకరించండి. ‘దయచేసి’, ‘ధన్యవాదాలు’ అని చెప్పడాన్ని ఎప్పుడూ విస్మరించకండి. ఇలా చేయమని గురు స్పష్టంగా నాకెప్పుడైనా చెప్పి ఉంటారని నేను అనుకోను. అయితే ఆయనొక ఉదాహరణగా ఎల్లవేళలా ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఉంటారు. జాగ్రత్తగా గమనించవలసింది ఆయన పెంపొందించిన సత్ప్రవర్తన, ఆయన పట్ల మనలో ఉన్న గౌరవ భావన ఆయన్ని మనం అనుకరించేలా చేస్తాయన్నది. ప్రత్యక్షంగా ఆయన ప్రబోధించని విలువలకు మనమంతా అలవాటు అవుతాం. అనుకరణ ద్వారానే నేను నేర్చుకున్నాను. నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నాపై గురు ముద్ర పొరపాటున పడినట్లుగా అనిపించదు. వాటర్లూ యుద్ధంలో బ్రిటన్ గెలుపు ఈటన్ (పాఠశాలల) ఆట మైదానాల వల్ల సాధ్యమయిందేమో నాకు తెలియదు కానీ నాలోని మనిషిని మలిచింది మాత్రం కచ్చితంగా జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ అనే చెప్పగలను. అందుకే ఎప్పటికీ ఆయన నా ‘గురు’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్లో నొవాక్ జొకోవిచ్ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్లా ఫుట్బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ
తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఒక అంతిమ భావనకు వచ్చేశారు. నిజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలను కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ఏ అంశం మీద ప్రశ్నలు అడగాలన్నదీ, ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి దేశ ప్రధాని సుముఖంగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన సంసిద్ధతను కనబరుస్తున్నారని ఇండియాలో మనం భావిస్తాం. ప్రధానికి నిజంగానే తన పాలనకు బాధ్యత వహించే ఉద్దేశం ఉందా, లేదా అనేదానికి అసలైన పరీక్ష... ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా చేయకపోవడం. పత్రికా సమావేశంలో వందలాది మంది పాత్రికేయులకు ముఖాముఖి బదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డొంక తిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అందుకే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఇప్పటికే ఒక అంతిమ భావనకు వచ్చేశారు. మార్గరెట్ థాచర్ను ఇంటర్వ్యూ చేస్తున్న బ్రియాన్ వాల్డెన్స్ వారి భావనతో ఒక్క క్షణమైనా నాకు నిమిత్తం లేనప్పటికీ, పత్రికా సమావేశాన్ని మోదీ దాటవేస్తూ రావడంపై నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్య దేశాలలో నిజమైన జవాబుదారీతనాన్ని భిన్న పాత్రికేయ ప్రక్రియల ద్వారా సాధిస్తారు. ఆ విషయానికి తర్వాత వస్తాను. మొదట, పత్రికా సమావేశాల మీద మనకుండే విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నదో నన్ను వివరించనివ్వండి. మొదటి విషయం. పత్రికా సమావేశంలో అనేక మీడియాల నుంచి వచ్చిన అనేకమంది ప్రతినిధులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రశ్న ఒకటి అడిగేందుకు ఆతురతతో ఉంటారు. చాలా వరకు అవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రశ్నలే అయి ఉంటాయి. గంటల పాటు పత్రికా సమావేశం జరుగుతున్నా ఈ వేర్వేరు ప్రశ్నల కారణంగా ప్రధానమంత్రి జవాబులు చెప్పడానికి ఎప్పుడో తప్ప ఒత్తిడికి లోనయే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రధాని ఎందుకు ఒత్తిడికి లోనవరో చెప్తాను చూడండి. ప్రధాని పత్రికా సమావేశాలలో ఒక జర్నలిస్టుకు ఒక ప్రశ్న వేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాక, ఆ తర్వాతి జర్నలిస్టు తిరిగి అదే ప్రశ్న అడిగేందుకు ఉండదు. అప్పుడు ఆ జర్నలిస్టు తన ప్రశ్నను, ఒక్కోసారి తన సబ్జెక్టును కూడా మార్చుకోవలసి వస్తుంది. అంటే ఒకటే ప్రశ్నపై పట్టుపట్టడానికి తక్కువ అవకాశం ఉండటంతో ప్రధానిపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆయన పొంతన లేని, లేదా సంపూర్ణం కాని సమాధానాలతో తప్పించుకోవచ్చు. ప్రధాని అజాగ్రత్తతో తొట్రుపడితేనో, లేదంటే ఏవైనా అవాస్తవాలు ఆయన నుంచి దొర్లితేనో తప్ప ఆయన పట్టుబడరు. అది నక్క తోకను తొక్కడమే కానీ, నాణ్యమైన జర్నలిజం కాదు. నిజానికి ప్రధాని పత్రికా సమావేశాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ అది భ్రమ. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతూ, ఆయన ఇచ్చే సమాధానాలను నిశితంగా పరిశీలించి వాటిలోని తప్పుల్ని, దాటవేతల్ని ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. అయితే ప్రధాని పత్రికా సమావేశాలలో ఇలా జరిగే అవకాశం ఉండనే ఉండదు. అందుకే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలకు కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రధాని–జర్నలిస్ట్ ఇద్దరే ఎదురెదురుగా ఆ ఇంటర్వ్యూలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆ ఏక పాత్రికేయుడే... ప్రధాని జవాబులు చెప్పవలసిన ప్రశ్నలను నిర్ణయిస్తారు. ఏ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తాలన్నదీ, అలాగే ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. అలాంటి జర్నలిస్టు విషయాలన్నీ బాగా తెలిసినవాడై, నిర్భీతి, దృఢచిత్తం గలవాడై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా అయితే అతడు ప్రధాని ముందు నీళ్లు నమలనివాడై ఉండాలి. జిహ్వకు చాపల్యాన్ని అంటించే రుచికరమైన బ్రిటిష్ రాజకీయ వర్గ అసంబద్ధ అంతర్గత కథనాలతో రాబ్ బర్లీ అనే బ్రిటిష్ టీవీ ప్రొడ్యూసర్ తాజాగా వండి వార్చిన ‘వై ఈజ్ దిస్ లైయింగ్ బాస్టర్డ్ లైయింగ్ టు మి?’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘‘రాజకీయ ఇంటర్వ్యూలు అనేవి అధికారంలో ఉన్నవారిని ప్రజలకు పూచీ పడేలా చేయడానికే తప్ప, నాయకులకు లబ్ధిని చేకూర్చడానికి కాదు. అవి ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం.’’ దేశ అత్యున్నత పదవికి అభ్యర్థులైన వారి యోగ్యతను రాజకీయ ఇంటర్వ్యూల ద్వారా ఎలా అంచనా వేయవచ్చో బర్లీ ఈ పుస్తకంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటికే అధికారం మాటున దాగి ఉన్నవారికి కూడా ఆయన మాట వర్తిస్తుంది. ‘‘అటువంటి ఇంటర్వ్యూలు మన రాజకీయ సంస్కృతి స్వభావం, సమర్థత, విశ్వసనీయతలను బహిర్గతం చేయడానికి తోడ్పడే ఉత్తమ సాధనాలు. వాటి గురించి మనం గట్టిగా అడగాలి.’’ మోదీ కూడా రాజకీయ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి చాలానే ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఎలాంటివారు? ఎలాంటి అంశాలను వాళ్లు ప్రధాని ముందు లేవనెత్తారు? ఎంత త్వరగా వాళ్ల ప్రశ్నల గేలం ప్రధానిని విడిచిపెట్టింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మునుపటి ఇంటర్వ్యూలను చూడండి. అవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూలు మోదీ తనేం చెప్పదలిచారో అవి చెప్పడానికీ, తరచూ ప్రతిపక్షాలను విమర్శించడానికీ కానుకగా అందివచ్చిన వేదికలు. బ్రిటిష్ బ్రాడ్క్యాస్టర్లు జెరెమి పాక్స్మ్యాన్, బ్రియాన్ వాల్డెన్స్ తమ రాజకీయ ఇంటర్వ్యూల కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయారు. వాల్డెన్ తన సంధింపులతో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ను గుక్క తిప్పుకోకుండా చేశారు. పాక్స్మ్యాన్ అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ హోవర్డ్ను అడిగిన ప్రశ్ననే పన్నెండుసార్లు అడిగి ఆయన్ని గుటకలు వేయించారు. రెండు ఇంటర్వ్యూలలో అవి ముగిసే సమయానికి థాచర్, హోవర్డ్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం! ఆ చెప్పలేకపోవడమే ప్రజలకు వారిని జవాబుదారీగా చేసింది. మన ప్రధానులను కూడా ఇంత కఠినంగా, కనికరం లేకుండా ప్రశ్నించగల రోజు వస్తే, మన రాజకీయాలలో నాటకీయమైన మార్పును చూస్తాం. మన రాజకీయ నాయకులు మారతారు. మనతో అబద్ధాలు చెప్పడం మానేస్తారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్