-
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిజాయితీయే నిజమైన విలువ
చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే తాజా పుస్తకం ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినది. పుస్తకంలోని రహస్యోద్ఘాటనలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా! ఇందిరా గాంధీలోని ఎవరికీ తెలియని మరికొన్ని కోణాలను కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా దేశాధినేతల గురించి, వారికి సమీపంగా దీర్ఘకాలం ఉన్నత పదవులను నిర్వహించినవారు తమ డైరీలలో నిజాయితీగా రాసి పెట్టుకున్న విశేషాలతో తెచ్చిన పుస్తకాలు ఎంతో విలువను, ప్రతిష్ఠను కలిగి ఉంటాయి. డైరీలు రాసే సంప్రదాయం మన దగ్గర గట్టిగా లేకపోవడం సిగ్గు చేటు. మళ్లీ బ్రిటిష్ వాళ్లకు ఆ భాగ్యం ఉంది. అక్కడి శామ్యూల్ పెపిస్ నుంచి రిచర్డ్ క్రాస్మన్ వరకు, ఆపై ఉడ్రో వ్యాట్ దాకా... పఠనాన్ని మంత్రముగ్ధం చేస్తూ డైరీలు రాశారు. మరీ ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న స్త్రీ, పురుషుల గురించి వారు తమ డైరీలలో మొత్తం బహిర్గతం చేశారు. లేకుంటే మనం ఆ విశేషాలను ఎప్పటికీ తెలుసుకోగలిగేవాళ్లం కాదు. వారి నిజాయితీనే ఆ డైరీలకుండే నిజమైన విలువ. ఉడ్రో వ్యాట్ రాసిన మూడు సంపుటాల డైరీల గురించి నాటి ‘సండే టైమ్స్’ ఎడిటర్ ఆండ్రూ నీల్, ‘‘ఈ దేశ పాలకులు, సామాజిక విశిష్టులకు సంబంధించి చేర్పులు లేని వాస్తవాలను ఇవి కలిగి ఉన్నాయి’’ అని కితాబునిచ్చారు. మార్గరెట్ థాచర్ జీవిత చరిత్ర కారుడైన ప్రముఖుడు చార్ల్స్ మోర్, ‘‘ఆమె తన సన్నిహితుల సమక్షంలో ప్రజా కార్యక్రమాలపై వ్యక్తం చేసిన వ్యక్తిగత ప్రతిస్పందనలు తరచు ఆ డైరీలలో కనిపించేవి’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, అమూల్యమైన అంతర్నేత్ర దృష్టికి వారి డైరీలు నెలవుగా ఉండేవి. ఇన్నాళ్లకు, మనకూ అలాంటి ఒక పోల్చుకోదగిన డైరీ లభ్యమైంది! చిన్మయ ఘరేఖాన్ రాసిన ‘సెంటర్స్ ఆఫ్ పవర్: మై ఇయర్స్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్’ అనే పుస్తకం ఆనాడు ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా రూపొందినదే. పుస్తకంలోని విశేషాంశాలు ఇందిరా గాంధీని రెండు విధాలుగా చూపుతాయి. మనోహరంగా, ఆకర్షణీయంగా; అలాగే అభద్రత, అహంకారం కలిగి ఉండి, కుటుంబమే సర్వస్వం అయిన వ్యక్తిగా. మరోలా చెప్పా లంటే... ప్రధానమంత్రి వెనుక ఉన్న అసలు స్వరూపాన్నీ (కొన్నిసార్లు ఆ స్వరూపం లోపభూయిష్టంగా ఉంటుంది), అదే సమయంలో... అందరిలాంటి ఒక మామూలు మనిషినీ ఈ పుస్తకం దృగ్గోచరం చేస్తుంది. మొదట చిన్న విషయాలు. సమావేశాలలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ తన చేతి గోళ్ల ఎగుడు దిగుడులను అందంగా సమం చేసుకుంటూ కనిపించేవారు. అయినప్పటికీ, ‘‘సమావేశంలోని ఏ మాటా ఆమె చెవులను దాటి వెళ్లేది కాదు’’. ఆమెకు కొన్ని గాఢమైన నమ్మ కాలు ఉండేవి. ‘‘ఇంటి నుండి ఆఫీసుకు బయల్దేరవలసిన ఘడియ లను కూడా ఆమె జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు’’. ఆమెలో హానికరం కాని ‘పట్టిపీడించే ఆలోచనలు’ (అబ్సెషన్స్) కొన్ని ఉండేవి. ‘‘లేఖలు రాయడాన్ని ఇందిరా గాంధీ ఇష్టపడేవారు. అంతకంటే కూడా లేఖల చిత్తుప్రతుల్ని, ప్రసంగ పాఠాలను, సందేశాలను స్వయంగా సవరించడానికి ఆసక్తి కనబరిచేవారు’’. ఇక ఆ పూట భోజనంలోకి ఏయే వంటకాలు ఉండాలన్నది నిర్ణయించడానికి గంటల సమయం వెచ్చించేవారు. కామన్వెల్త్ సదస్సుకు హాజరైన ప్రభుత్వాధినేతల కోసం ఆమె భారత దౌత్యవేత్త శంకర్ బాజ్పేయితో కలిసి మెనూ తయారీకి 45 నిముషాల సమయం తీసుకున్నారు. బ్రిటన్ రాణిగారికి ఉదయం పూట అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం విందులోకి ఏమేమి తయారు చేస్తున్నారో ఆ జాబితానూ ప్రతిరోజూ తను చూడాలని కోరుకునేవారు. బ్రిటన్ పట్ల ఇందిరా గాంధీ వైఖరి గురించి ఘరేఖాన్ తన పుస్తకంలో రాసిన విషయాలను చదివి నేను పరవశుడినయ్యాను. ‘‘ప్రధాని ఇందిరా గాంధీ బ్రిటన్ను, ప్రధానంగా బ్రిటన్ రాచకుటుంబీకులను ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా లేరు’’. 1983లో రాణిగారికి లండన్లోని ఇండియన్ హై కమిషనర్ నివాస గృహంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు... న్యూయార్క్ నుంచి నేరుగా భారత్కు తిరిగి వస్తున్న ఇందిరా గాంధీ అర్ధంతరంగా లండన్లో దిగి... భారత హై కమిషనర్, ఆయన భార్య ఆ ప్రత్యేక భోజన సందర్భాన్ని చక్క గానే నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. ‘‘రాణి గారి సమక్షంలో ఎలా ప్రవర్తించవలసిందీ హై కమిషనర్కు చెప్పారు’’. (ఎప్పుడూ కూడా రాణిగారి వైపు మీ వీపు భాగం తిరిగి ఉండకూడదని సూచించారు). ఇందిరా గాంధీ తోట పని చేసేవారు. ఇంట్లో ఫర్నిచర్ అమరికల్లో తరచు మార్పులు చేస్తుండేవారు. వాకిళ్లకు, కిటికీలకు వేసే పరదాలలో కొత్త డిజైన్ల ఎంపిక కోసం ఇంటి అలంకరణ నిపుణులకు – ప్రత్యేక అతిథులను తోడుగా ఇచ్చి – విదేశాలకు పంపుతుండేవారు. ఆ ప్రత్యేక అతిథులలో రాజవంశీయుడైన మాధవరావు సింధియా కూడా ఒకరు. 1981లో ప్రిన్స్ చార్ల్స్ వివాహ మహోత్సవానికి హాజరు అయేందుకు అమితమైన అసక్తిని కనబరిచి కూడా చివరికి హాజరు కాలేకపోయినందుకు ఇందిరా గాంధీ ఎంతగానో నిరాశకు లోనయ్యా రని ఘరేఖాన్ రాశారు. ‘‘అప్పుడు ఆమెలో కనిపించిన ఆ స్థాయి నిస్పృహను మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని ఘరేఖాన్ తన డైరీలో పేర్కొన్నారు. చార్ల్స్ పెళ్లి వేడుకకు తను వెళ్లడం లేదని మొదట చెప్పిన రాష్ట్రపతి ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ప్రధాని ఆగిపోవలసి వచ్చింది. ఇందిరా గాంధీ నోబెల్ శాంతి బహుమతిని అమిత ఆపేక్షగా కోరుకున్నారని కూడా పుస్తకంలో ఉంది. బహుమతిని దక్కించే ప్రచారం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీకి ఘరేఖాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి ‘ఘనత’ పట్ల ఆమె భ్రాంతికి ఇదొ క్కటే నిదర్శనం కాదు. ‘‘ఇతర నాయకులను, చివరికి రాష్ట్రపతులను కూడా ఆమె తన దగ్గరికి పిలిపించుకోవడాన్ని గొప్పగా భావించే వారు’’. ఆమె ప్రత్యేక సహాయకుడు ఆర్.కె. ధావన్ ఆమెను కలవ వలసిందిగా రాష్ట్రపతులకు ప్రొటోకాల్కు విరుద్ధంగా సమాచారం పంపేవారు. ఇందిరా గాంధీలో ఉన్న ఒక వింతైన కోణాన్ని కూడా ఘరేఖాన్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. 1983 ఓస్లో పర్యటన సందర్భంగా సోనియా గాంధీ భారత రాయబారికి దిగువన ఉన్న వరుసలో కూర్చో వలసి వచ్చింది. ‘‘అప్పుడు ప్రధాని ఇందిర... సోనియాను పైవరుసకు చేర్చారు’’. అదేమీ నార్వే దేశ ప్రొటోకాల్కు అనుగుణంగా జరిగింది కాదు. సోనియాకు ప్రాముఖ్యం కల్పించడమే ఇందిరా గాంధీకి ప్రధానం అయింది. నిజానికి రాయబారులను తక్కువగా చూడటం అసాధారణ మేమీ కాదన్నట్లుగా కనిపించే అనేక సంఘటనల్ని ఈ పుస్తకం పేర్కొంది. ‘‘ఇందిరా గాంధీ ఎంతో అలవోకగా రాయబారులతో ఉదాసీనంగా, ధిక్కారంగా ప్రవర్తించడాన్ని నేను గ్రహించాను’’ అని రాసుకున్నారు ఘరేఖాన్. ఘరేఖాన్ పేర్కొన్న సందర్భాలు ఎంత ఆసక్తిని రేకెత్తించేవీ,ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేసేవీ అయినప్పటికీ... అవి ఇందిరా గాంధీ మరణించిన నలభై సంవత్సరాల తర్వాత పుస్తకంగా బయటికి వచ్చినవి. అదే మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలోని రాజకీయ ప్రముఖులెవరైనా డైరీలు రాసి ఉంటే అవి ఇప్పుడు ఇంకెంత ఆకట్టుకునేలా ఉంటాయో కదా? రచయితలకు కూడా ఆ డైరీలు ఆకర్షణీయతను తెస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
న్యూ ఇండియాలోకి ‘పరకాల ప్రవేశం’!
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం. యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో! ఇటీవల నేను పరకాల ప్రభాకర్ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’ ‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు. ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు. పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు. మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన. ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను. ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది. ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్కు తెలిసి ఉండటం వల్లనా? ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మహానగరపు మార్మిక గాథ
ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు చాలా ఆసక్తికరం. ఈ ఢిల్లీ ప్రాంతాన్ని మన పూర్వీకులు దైవ నిలయంగా భావించారు. సరిగ్గా అక్కడే స్వర్గాధిపతి ఇంద్రుడి నివాసమైన ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది. ఈ ఇంద్రప్రస్థ అనంతరం, అది న్యూఢిల్లీ అయ్యేంతవరకూ ఇక్కడ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిదవదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. అలాగే విచిత్రంగా ధ్వనించే ఢిల్లీ పేరుకు సంబంధించి కూడా అనేక వివరణలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం. చాలా సంవత్సరాలుగా ఢిల్లీ గాథను తెలుసుకోవాలని నేను అనుకున్నాను. కానీ నిజంగా దాన్ని తెలుసుకోడానికి పెద్దగా ప్రయత్నించలేదు. మనం చరిత్ర మధ్యలో జీవిస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యంఇవ్వం. ఘోరమైన విషయం ఏమిటంటే, నేను ఢిల్లీని కాన్ బెర్రా, ఒట్టావా లేదా వాషింగ్టన్తో పోల్చడం ఉచితమేనని అనుకున్నందుకు చింతిస్తున్నాను. నిస్సందేహంగా నేను అలా పోల్చిన ప్రతిసారీ, తప్పు చేస్తున్నానని నాకు తెలుసు కానీ అలా పోల్చడాన్ని అది ఆప లేదు. నా అజ్ఞానంలో ఉంటూ, నేను విలువైన అంశాన్ని ప్రతిపాది స్తున్నట్లు యోచించాను. బహుశా నేను ఒక సందర్భంలో ఘోరంగా దొరికిపోయేంతవరకూ ఇది అలాగే కొనసాగిందని చెప్పాలి. లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వస్తున్నప్పుడు నా పక్కనే కూర్చున్న ఒక అందమైన యువతి ‘‘ఢిల్లీ గురించి చెప్పండి’’ అని నన్ను అడిగింది. అది 1980ల చివరలో అనుకుంటాను. సెలవుపై ఇంటికి తిరిగొస్తున్నప్పడు అది తటస్థించింది. ఆమె చాలా ఆకర్షణీ యంగా ఉంది. నేను సంభాషణ ఏదైనా మొదలెట్టాలని అనుకు న్నాను. ‘‘ఢిల్లీ అద్భుతమైన చరిత్ర కలిగిన ఒక పురాతన నగరం అని నేను నమ్ముతున్నాను’’ అని ఆమె అన్నది. ‘‘అవును, అవును’’ అంటూ నేను ఉత్సాహంగా సమాధాన మిచ్చాను. కానీ దాని గురించి ఏమీ తెలియకపోవడంతో నేనుసంభాషణను కొనసాగించలేకపోయాను. అందుకే విషయాన్ని పక్క దోవ పట్టించడానికి ప్రయత్నించాను. ‘‘ఢిల్లీ చాలావరకు కాన్ బెర్రా, ఒట్టావా, వాషింగ్టన్ లాంటిదే’’ అన్నాను. ‘‘ఓ దేవుడా! కచ్చితంగా కాదు’’ ఆమె దెబ్బతిన్నట్టుగా అన్నది. ‘‘ఓ ఎస్’’ అని నేను రెట్టించాను. కానీ ఈ విషయంపై ఏం చెప్పాలో నాకు తోచలేదు. ‘‘వెల్, మీ మాట తప్పు కావాలని కోరుకుంటున్నా.’’ అక్కడే ఆ సంభాషణ ముగిసిపోయింది. తర్వాత ఎనిమిది గంటల పాటు ఆ విమాన ప్రయాణ కాలంలో మాట్లాడటానికి నేను వేసిన ప్రారంభ ఎత్తులన్నీ సున్నితమైన తిరస్కరణను ఎదుర్కొ న్నాయి. నా ఉద్దేశపూర్వక ప్రయత్నాలకు ఢిల్లీ గురించి నాకు జ్ఞానం లేకపోవడం అనేది గట్టి అడ్డంకిగా నిలిచింది. నేను ఎంత ఘోరమైన అభిప్రాయాలతో ఉన్నానో ఇటీవలే గుర్తించాను. ‘ద మిలీనియం బుక్ ఆన్ న్యూఢిల్లీ’ పుస్తకం రాసిన పవన్ వర్మ ఆ మధ్య ఆ ప్రతిని నాకు పంపారు. చూసీచూడగానే అది ఒక విలాస వంతమైన కాఫీ టేబుల్ అలంకృత పుస్తకంగా అనిపించింది. అలాగని అలాంటి వాటి పట్ల నాకు వ్యతిరేకత ఏమీలేదు. పేజీలు అలా తిరగేస్తూ, ఫొటోగ్రాఫులను మెచ్చుకుంటూ, నెమ్మదిగా వ్యాసాల్లోకి మునిగిపోతుండగా ఢిల్లీ గురించి అత్యంత పఠనీయ చరిత్రాంశాలను ఈ పుస్తకం కలిగి ఉన్నదని గుర్తించాను. నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు ఇప్పుడు నాకు తెలుసు. దీనంతటికీ నేను ఖుశ్వంత్ సింగ్కు రుణపడి ఉంటాను. నా కళ్లు మొట్టమొదట పడింది ఆయన వ్యాసం మీదే. చెప్పాలంటే దాన్ని ఆబగా చదివాను – కృతజ్ఞతతో, ఆనందంతో. కొంత గర్వ ప్రదర్శన చేసుకోవడానికి అనుమతివ్వండి. ఢిల్లీ మూలం విసుగు తెప్పించే సత్యం కంటే ఎంతో చక్కగా ఉండే ఒక పౌరాణిక గాథపై ఆధారపడి ఉంది. ఒకానొకప్పుడు గంగా నది పొంగి పరవళ్లు తొక్కుతున్నప్పుడు (ఈరోజు అది అలా ప్రవహించలేనంతగా కలుషితమైపోయింది) అది శాస్త్రాలను కక్కింది. (యాదృచ్ఛికంగా ఈ ‘కక్కడం’ అనే మాట ఖుశ్వంత్ సింగ్దే. కానీ ఆయన దాన్నొక శ్లేషగా మాత్రమే వాడివుంటారా అని నా సందేహం.). ఆ ప్రాంతానికి గుర్తుగా అక్కడ నిగమ్బోధ్ అని పిలిచే ఆలయం నిర్మించారు. అవును ఒకరోజు మీరు, నేను ఇదే ఘాట్ దగ్గర బహుశా స్వర్గాభిముఖంగా బట్వాడా అవుతాం. ‘‘ఇది ఢిల్లీని దైవ నిలయంగా ఎంచుకోవడానికి మన పూర్వీకులకు తగిన హేతువు అయివుండవచ్చు’’ అని ఖుశ్వంత్ సింగ్ కొనసాగిస్తారు. ‘‘అలా ఢిల్లీ మొదటి నగరం, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నివాసం ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది.’’ నేడు పురానా ఖిలా బహుశా అదే చోట ఉంది. ఇంద్రప్రస్థ అనంతరం, అది మన ప్రియమైన న్యూఢిల్లీ అయ్యేంతవరకూ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిద వదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. ఖుశ్వంత్ వ్యాసంలో నేను ఇట్టే పద్నాలుగు నగరాలను లెక్కించాను. అవి ఇంద్రప్రస్థ, యోగినిక్పుర, లాల్ కోట్, సిరి, కిలో ఖేరీ, చిరాగ్, జహాపనా, తుగ్లకాబాద్, ఫిరోజాబాద్, ఖిలా ఫిరోజ్ షా, ముబారకాబాద్, దీన్ పనాహ్, షాజహానాబాద్, తర్వాత ఇంకేంటి న్యూఢిల్లీ. కానీ పదిహేనవ నగరం ఏది? నాకు ఇప్పటికీ తెలియనందుకు చిరాగ్గా ఉంది. ఏదేమైనా, నాకు ఖుశ్వంత్ వ్యాసంలో మరీ ఎక్కువ నచ్చింది ఢిల్లీ ఉచ్చారణకు సంబంధించిన ఖండిక. ‘‘చదువుకున్నవాళ్లు డెహ్లీ అనీ, సాధారణ జనం దిలీ అని పిలిచే... విచిత్రంగా ధ్వనించే పేరు’’. దీనికి సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి. పర్షియన్ పదమైన దెహ్లీజ్ నుంచి ఇది పుట్టుకొచ్చి ఉండవచ్చు. దెహ్లీజ్ అంటే ప్రవేశ ద్వారం అని అర్థం. ఎందుకంటే గంగామైదాన ప్రాంతానికి ఇది ఒక ప్రవేశద్వా రంగా ఉంటోంది. మరొక వివరణ ప్రకారం, డైడలస్ అనే పదం నుంచి ఢిల్లీ పేరు పుట్టి ఉండవచ్చు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త టాలెమీ ఈ నామకరణం చేశారు. ఏదేమైనా, ఈ నగరాన్ని ఒకప్పుడు పరిపాలించిన రాజన్ ధీలూ పేరుతో దీని జాడలు దొరుకుతున్నాయని 16వ శతాబ్ది పర్షియన్ చరిత్రకారుడు ఫెరిష్తా పేర్కొన్నాడు. కొంతమంది పండితులు ఈ పేరును కుతుబ్ మినార్ సమీపంలో ఉండే సుప్రసిద్ధ ఇనుప స్తంభంతో ముడిపెడుతున్నారు. అయితే ఈ సంబంధాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పలేను. ఖుశ్వంత్ సింగ్ చెప్పినట్లుగా, ‘‘ఈ స్తంభాన్ని మహా విష్ణువు ప్రతీకగా రూపొందించారు. దీన్ని తన తలపై భూమిని మోస్తున్న త్రాచుపాము (వాసుకి) పడగలోకి లోతుగా పాతడానికి ఉద్దేశించారు.’’ ఈ స్తంభం జోలికి పోయేవారికి శాపం తగులుతుందని చెబుతుంటారు. అయితే ఒక మూర్ఖపు తోమర్ రాజ్పుత్ రాజు దీన్ని నిజంగానే త్రాచుపాము పడగ మీదే జొప్పించినట్టుగా ప్రతిష్ఠించారో లేదో రుజువు కావాలనుకుని, దాన్ని తవ్వించాడు. స్తంభం బయటకు తీయగానే, దాని కిందిభాగం రక్తంతో తడిసివుండటం కనిపించింది. తర్వాత తోమర్ రాజు తన సింహా సనాన్ని కోల్పోయాడు. అతడి వంశం కూడా అతడితోనే అంతరించి పోయింది. ఇది అద్భుతమైన గాథ. కానీ నా వరకూ దీనికీ, ఢిల్లీ పేరుకూ ఉన్న సంబంధాన్ని గ్రహించలేకపోయాను. ఢిల్లీ ఒక నెత్తుటి నగరం అని ఇది సూచిస్తోందా? విషాదకరంగా, కొన్నిసార్లు ఢిల్లీ అలాగే ఉండింది. విషాదమేమిటంటే, ఖుశ్వంత్ సింగ్ను వీటిపై వివరించమని అడిగే అవకాశాన్ని నేను ఎన్నడూ పొందలేదు. ఢిల్లీకి ఆ తప్పిపోయిన 15వ పేరు గురించి కూడా అడిగే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ తర్వాత ఎప్పుడైనా ఎయిర్ ఇండియా విమానంలో ఒక అందమైన యువతి పక్కన కూర్చున్నప్పుడు, సంభాషణను నిలపడంలో నాకు తక్కువ సమస్యలు ఉంటాయి. నాకు ఆ అదృష్టం పట్టా లని కోరుకోండి మరి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బడి నేర్పిన బతుకు పాఠం
జీవితంలోకి వచ్చి పడ్డాక, ఎప్పుడైనా బాల్యం గుర్తొస్తే ఆనాటి కాలమంతా బంగారు వర్ణంతో మెరిసిపోతూ కళ్ల ముందర లీలగా కనిపించి మాయం అవుతుంది. మళ్లీ వచ్చి జీవితంలో పడిపోతాం. బాల్యంలో ముఖ్యమైనవి బడిలో గడిపిన రోజులు. అవి ముఖ్యమైనవే. కానీ పూర్తిగా సంతోషాన్ని చ్చిన రోజులైతే కాకపోవచ్చు. అప్పట్లో భయంకర సమయాలూ ఉండేవి. అయినాసరే వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో పడ్డ కష్టాలను మర్చిపోతుంటాం. పుస్తకాల్లోని సిలబస్తో పాటు బడి అనేక జీవిత పాఠాలు నేర్పిస్తుంది. అన్నిటికన్నా ఉత్తమ జీవితపాఠం... ‘‘తప్పులు చేస్తే చేశావు గానీ, ప్రయత్నం మాత్రం ఆపకు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా...’’ అనే పాఠం. పాఠశాల రోజులు నిజంగానే ఒకరి జీవితంలో అత్యుత్తమమైన రోజులా? ఇది నిజమే. అయితే కొన్నిసార్లు బాధగానూ ఉంటుంది. నా విషయానికి వస్తే 16 ఏళ్ల వయసులో డూన్ స్కూల్ని వదిలిపెట్టిన తర్వాత నా జీవితం కోలుకోలేనంతగా దిగజారిపోయింది. మరోవైపున గులాబీ రంగులోని జ్ఞాపకాల ద్వారా మనం వెనక్కు తిరిగి చూస్తాము. మనం ఎంత పెద్దవారమైతే ఆ జ్ఞాపకాలు అంత పవిత్రంగా ఉంటాయి. పాత పాఠశాల చిత్రాల ఆల్బమ్ని చూస్తున్నప్పుడు నిన్న నా మనస్సులో చోటుచేసుకున్న ప్రశ్న ఇది. ప్రతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, డాస్కోస్ (డూన్ స్కూల్) పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను తిరిగి సందర్శించినప్పుడు వేల మంది ఈ ప్రశ్నకు గట్టిగా అవును అని జవాబు చెబుతారు. అయితే నిజం ఏమిటంటే... మనలో ఎవరికీ పాఠశాల కేవలం సంతో షకరమైన ఉల్లాస క్షణాల సేకరణగా ఉండలేదన్నదే. అప్పట్లో భయంకరమైన సమయాలు కూడా ఉండేవి. అవి కూడా మనం ఎదగడంలో సహాయం చేసి ఉన్నప్పటికీ, వాటిని మననం చేసుకుంటున్నప్పుడు ఇప్పటికీ బాధాకరంగానే ఉంటాయి. అయినా సరే మనం వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు మనం ఆరోజుల్లో పడ్డ కష్టాలు, బాధలను మర్చిపోతుంటాము. ఆటపట్టించడం, ఆనాటి నవ్వులు, విజయాలను మాత్రమే మనం మననం చేసుకుంటుంటాము. ఆనాటి శిక్షలను, జరిమానాలను మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, వాటిని ఎదుర్కొని కూడా మనగలగడం గర్వించదగిన విషయమే. కాబట్టి నలభైలు, యాభైలు, అరవైలలో తమను పెద్దలను చేసిన... అలాగే ఇరవైలలోని కుర్రాళ్లను మృదువుగా మార్చిన డూన్ స్కూల్ మాట ఏమిటి? న్యాయంగా చెప్పాలంటే, సమాధానంలో కొంత భాగం తప్ప కుండా తననూ, ప్రపంచాన్నీ ఒక టీనేజర్ చూస్తున్నంత అమాయకత్వంతో, నమ్మకంతో ఉంటుంది. అతను తన పరిమితులను తెలుసు కోలేనంత చాలా చిన్నవాడు, పైగా తన ఆకాంక్షలను వమ్ము చేయగల అవరోధాల గురించి తనకు ఇప్పటికీ తెలీదు. కలలు ఫలిస్తున్నట్లు, కష్టాలను అధిగమిస్తున్నట్లు, ప్రపంచం ఒక న్యాయమైన చోటుగాను కనిపి స్తుంటుంది. ఈ అర్థంలో... పాఠశాల రోజులు నిజంగానే రమణీయంగానే ఉంటాయి. డూన్ని అంత ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, మాలో ప్రతి ఒక్కరినీ ఒక విశిష్ట వ్యక్తిగా ట్రీట్ చేయడమే! అనేకమందిలో ఒకడిగా నేను ఎన్నడూ భావించలేదు. నా ఉనికి, ప్రాధాన్యం, ఆసక్తుల గురించి నేను జాగరూకతతో ఉండేవాడిని. నేను క్రీడలంటే ద్వేషించేవాడిని. అది చూసి అందరూ నన్ను ఆటపట్టించేవారు కానీ ఎవరూ నన్ను ఆడాలని బలవంత పెట్టలేదు. చర్చలు, నటనను నేను ఆస్వా దించేవాడిని, వాటిలో పాల్గొనాలని నన్ను ప్రోత్సహించే వారు. నేను రాసేవాడిని, చదువుకునేవాడిని. దాన్నీ అందరూ ఆమోదించారు. ఈరోజు డూన్ స్కూల్ స్కాలర్స్ బ్లేజర్ కథను నేను ప్రస్తావిస్తాను. అది నా ఉద్దేశాన్ని నిరూపిస్తుంది. దశాబ్దాలపాటు క్రీడాకారులు మందపాటి నీలి బ్రౌజర్తో గుర్తింపు పొందేవారు. అది వారికి ఎంతో ప్రత్యేకత కలిగించేది. విద్యాపరంగా మొగ్గు చూపేవారికి అలాంటిదేమీ ఉండదు. అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని పాఠశాల చేత అంగీకరింప చేయడానికి నేను చాలా సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అది 1971లో సాధ్యమైంది. ఆ సంవత్సరం వ్యవస్థాపక దినో త్సవం సందర్భంగా హెడ్మాస్టర్ కల్నల్ సిమోన్ మొట్టమొదటి స్కాలర్స్ బ్రేజర్ని నాకు బహూకరించారు. దాన్ని గెలుచుకున్నందుకు నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను కానీ ఆ తర్వాత అది మరింత చిరస్మరణీయంగా రుజువైంది. ‘ఈ బ్లేజర్ ఎలా ఉండాలి;’ అని హెడ్మాస్టర్ ప్రశ్నించారు. నేను చీకాకు పడలేదు. స్పోర్ట్స్ బ్లేజర్ని అనుకరించడం గురించే నేను ఆలోచించగలిగాను. అయినా, నేను కోరుకుంటూ వచ్చింది ఇదే కదా! ‘‘రండి యంగ్ మ్యాన్’’ అంటూ కల్నల్ సిమోన్ పలకరించాడు. ‘‘మీరే మొట్టమొదటి వ్యక్తి. డూన్ స్కూల్ మొత్తం పాటించేటటువంటి డిజైన్ ని మీరు రూపొందించారు. అయితే మీరు కాపీ క్యాట్గా ఉండాలనుకుంటున్నారా?’’ అన్నారు! స్కాలర్స్ బ్లేజర్ని డిజైన్ చేయడానికి ఒక టీనేజర్కి స్కూల్ హెడ్మాస్టర్ అనుమతించడాన్ని 50 సంవత్సరాల తర్వాత... ఈనాటికీ నేను నమ్మలేకున్నాను. నలుపు రంగులో సాంప్రదాయికమైన డబుల్ బ్రెస్టెడ్ స్టయిల్ని నేను ఎంచుకున్నాను. అందుకే ఆనాటి నుంచి అదే కొనసాగుతూ వచ్చింది. డూన్ గర్వించదగిన ఒక కారణం ఏమంటే, కల్నర్ సిమోన్ వంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రత్యేకమైన వారు కారు. నా హౌస్ మాస్టర్ గురుదయాళ్ సింగ్, నా మ్యాథ్స్ మాస్టర్ షీల్ వోహ్రా, నా జాగ్రఫీ ట్యూటర్ చార్లీ కండ్జాట, హిస్టరీ హెడ్ జీక్స్ సిన్హా.. ఇంకా అనేకమంది ఇతరుల ముఖాలు నాకు ఇప్పటికీ గుర్తే. ఇకపోతే నేను ఎన్నటికీ మర్చిపోలేని ఈ గొంతులు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి. నేనేం చేయాలి అని వీరు నాకు చెప్పడమే కాదు, నా పద్ధతిలో నేను చేయడాన్ని వీరు ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను తప్పు చేసినప్పుడు (తరచుగా నేను తప్పులు చేశాను) కూడా తప్పు చేయడం అనేది నేరం కాదని వారు నాకు వివరించారు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా! డూన్ స్కూల్ నాకు నేర్పిన ఉత్తమ పాఠం అదే మరి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మనుషులు కాదోయ్ మాటలోయ్!
దేశమంటే ఏమిటి? సరిహద్దులతో ఉండేదా? మనసులలో అడ్డుగోడలు లేని మనుషులతో నిండి ఉండేదా? లేక... జాతులు, మతాలు, భాషలు,సంప్రదాయాలు వేర్వేరుగా వేటికవిగా ఉండేదా? కలివిడిగా, కలబోతగా కట్టుబడి ఉండేదా? లేక ఒకే గతం, ఒకే వర్తమానం కలిగి ఉండి ఒకే విధమైన భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉండేదా? దేశానికి ఎన్నో నిర్వచనాలు! భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సాంస్కృతికమైనవి. ఇవేవీ కాని ఒక వినూత్నమైన నిర్వచనాన్ని ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ పుస్తక రచయిత రాజీవ్ భార్గవ ఇచ్చారు. ‘‘దేశమంటే, సంభాషణలో ఉన్న మనుషులు’’ అన్నారు భార్గవ ఈ పుస్తకంలో. మరి ఈ నిర్వచనం భారతదేశానికి కూడా వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది. అది మన దేశాన్ని గురించిన కచ్చితమైన అవగాహన! ఇప్పటికే చదివి ఉండనందుకు చింతిస్తూ నేనొక పుస్తకం చదువుతూ ఉన్నాను. ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ అనే పుస్తకం సమకాలీన భారతదేశంపై రాజీవ్ భార్గవ ప్రతిఫలింపజేసిన నైతికతల సమాహారం. వాటిలో కొన్ని నిస్సందేహంగా నిస్తేజమైనవి. అరకొరగా కొన్ని బహుశా అర్థంలేనివి. చాలావరకు మాత్రం లోతైనవీ, ఆలోచన రేకెత్తించేవీ. ముఖ్యంగా ఒకటైతే తన నవ్యత వల్ల నా ధ్యాసను తనపైకి మర ల్చుకున్నది. ఇంకా చెప్పాలంటే, అది మన దేశం గురించి కచ్చితమైన అవగాహన. పుస్తకంలో ‘ఎ నేషన్ ఈజ్ ఎ పీపుల్ ఇన్ కాన్వర్సేషన్’ అనే శీర్షికతో ఉన్న ఒక వ్యాసంలో... ‘‘దేశం అంటే ఏమిటి?’’ అనే ప్రశ్నకు సమాధానంగా, ‘దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు’ అంటారు భార్గవ. మీరసలు ఊహించనే లేని భిన్నమైన జవాబు అది. దేశమంటే ఏమిటి అన్న ప్రశ్నకు స్కూల్లో మనకు నేర్పించిన జవాబు కచ్చితంగా ఇది మాత్రమైతే కాదు. దేశాలను మనం జాతులు, భాషలు, మతాల వారీగా, ఇంకా... చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఏర్పడిన మనుషుల సమూహంగా అవగాహన పరచుకున్నాం. కొన్నిసార్లు ఈ భిన్నత్వాల జోడీకి కూడా దేశం అనే ఏక రూపత స్థిరపడుతుంది. ఇందుకు స్ఫురించే ఉదాహరణలు... ఇజ్రాయిల్, కుర్దిస్తాన్, పాలస్తీనా, లిక్టన్స్టయిన్; జులు, బెర్బెర్ జాతులు, ఎస్కిమోలు, రెడ్ ఇండియన్లు, మావోరీలు. దేశాలన్నీ కూడా వీటిల్లో ఒకటీ లేదా అంతకంటే ఎక్కువగా వైవిధ్యాల కలబోత స్వభావాన్ని కలిగి ఉంటాయి. భార్గవ ఒక దేశాన్ని చాలా భిన్నమైన కోణంలో చూస్తారు. ‘‘అన్నిటì కంటే వారి గతం, వర్తమానం, భవిష్యత్తులను గురించిన సాధారణ, లేదా అతివ్యాప్త ఆందోళనల వల్ల స్వీయ స్పృహతో జట్టు కట్టిన ప్రజాసమూహమే దేశం. ఆ ఏకతలోని చేతన జన్యుపరమైనది కాదు. ఆకాశం నుండి ఊడి పడినదీ కాదు. నోటితో, రాతలతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పింది ఒకరు వినడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల వృద్ధి చెందినది’’ అంటారు. అందుకే భార్గవ, దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు అన్నారు. అయితే భారతదేశాన్ని అర్థం చేసుకోడానికి అది కచ్చితమైన ఉత్తమ నిర్వచనం అవుతుందా? లొడలొడమని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, మాట్లాడేవాళ్లకు అంతరాయం కలిగించడం, కేకలు వేయడం, పెద్దగా అరవడం, విని వదిలేయడం, వినాలని పట్టుపట్టడం... ఇవేగా మనం ఎప్పుడూ చేసేది. ఇవన్నీ చేస్తున్నందుకు ఇంకెవరైనా అయితే మనల్ని ‘టవర్ ఆఫ్ బాబెల్’ అనేవారు. కానీ భార్గవ మన ఎడతెగని ఈ సంభాషణను మన జాతీయతలోని ప్రధానాంశంగా గుర్తించారు. ఈ వినూత్న నిర్వచనాన్ని దాటి చూస్తే, ఆ వెనుక... నేడు మన దేశంలో ఏం జరుగుతోంది అనే విషయమై కలవరం కలిగించే ముఖ్యాంశాలు ఉండటం కనిపిస్తుంది. ‘‘వార్తాపత్రికలు, ఆ తర్వాత టీవీ ఛానళ్లు ప్రేరేపించనిదే ప్రజల మధ్య సంభాషణలు ఉండటం లేదు. సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు వృద్ధి చెందడం అన్నది కనిపించడం లేదు. కనుక దేశం అన్నదే లేదు’’ అంటారు భార్గవ. అంటే, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదు. మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కనుక మన మీడియా ఆరోగ్యం – పారదర్శకత, నిష్పాక్షికత, వాక్స్వేచ్ఛా నిబద్ధత – మన జాతీయతకు ఎంతో కీలకమైనది. భార్గవ అడగని ఒక ప్రశ్న, ఆవేశాన్ని రేకెత్తించే ప్రశ్న... మనం వార్తాపత్రికను చేతిలోకి తీసుకున్న ప్రతి సారీ, లేదంటే వార్తా చానెల్ను పెట్టగానే తలెత్తు తుంది... భారతీయ మీడియా భారతదేశాన్ని అణగదొక్కుతోందా అని! ఈ పుస్తకం మరొక ప్రశ్నను కూడా లేవనెత్తింది, బహుశా అది మరింతగా కలవరపెట్టే ప్రశ్న. మళ్లీ కూడా భార్గవ నేరుగా ప్రశ్నించడం లేదు. ప్రశ్న వైపుగా మనల్ని మళ్లిస్తున్నారు. ‘‘ఒక దేశం అన్నది సంభాషించుకునే ప్రజా సమూహం అయినప్పుడు ఆ సంభాషణను ఎవరైనా అడ్డుకుంటే దేశాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది’’ అంటారు. ఈ వేలు ఎటువైపు చూపిస్తోందో నాకు తెలుసు. మీకూ తెలుసు. ఆ వేలు ఎవరి వైపు అయితే తిరిగి ఉందో వారికీ తెలుసు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన పని లేదని దీని అర్థం. భార్గవ మరింత ముందుకు వెళ్లారు. సంభా షణను ఆపేయడం మాత్రమే మన దేశానికి ప్రమాదకరం కాదు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల సంభాషణను ప్రభుత్వం లాగేసుకోకూడదు. ప్రజా సంభాషణను నిర్దేశించకూడదు. నియంత్రించ కూడదు. సంభాషణలో ప్రభుత్వం కూడా ఒక భాగమే తప్ప తనే శాశ్వతంగా సంభాషణను నడపాలని చూడకూడదు. వాస్తవానికి సంభాషణకు అంతరాయం కలిగించే వారిని, నిరోధించే వారిని నియంత్రించడం ప్రభుత్వ విధి. దానినే దేశం ఆశిస్తోంది’’ అంటారు భార్గవ. ఈ చివరి వాక్యం నాకు నచ్చింది. మన టెలివిజన్ యాంకర్లు చెప్పేది గుర్తొచ్చింది, వాళ్లు వేరే అర్థంలో చెప్పి నప్పటికీ. భార్గవ వాళ్ల మాటల్ని వాళ్ల నెత్తిపైనే కుమ్మరించారు. దేశం అంటే ఏమిటో భార్గవ ఇచ్చిన నిర్వచనంలోని అందం... వేర్వేరు జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఆహార సంప్రదాయాలు, భౌగోళికతలు, చారిత్రక నేపథ్యాలు కలిగివున్న వాళ్లంతా కలిసి ఉండటంలో ఉన్న ప్పటికీ... ఈ వ్యత్యాసాలు కేవలం వివరణా త్మకమైనవి. అసలైనది ఏమంటే... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, రాన్ ఆఫ్ కచ్ నుంచి అగర్తల వరకు మనం ఒకరితో ఒకరం సంభాషించుకుంటున్నాం. తగాదాలు ఉంటే ఉండొచ్చు. అంత రాయం కలిగించుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఒక సుదీర్ఘ ప్రసంగానికి, పాండిత్యానికి, అజ్ఞానానికి, వట్టి సమాచారానికి, నీరసం కలిగించే మాటలకు చెవి ఒగ్గుతూ ఉండొచ్చు. ఇవేవీ కాదు, మనమైతే మాటల్లో ఉన్నాం. అదీ ముఖ్యం. ఈ సంభాషణ ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఆలోచించాల్సిన విషయం. భార్గవ చెప్పడం, దేశం ‘విడివడడానికి’ దారి ఏర్పడుతుందని! మన దేశం గురించే ఆయన చెబుతున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మనమెందుకు ఇలా ఉన్నాం!
బ్రిటన్ మారిపోయింది! నిగ్గర్స్, బ్లాక్స్, బ్రౌన్ స్కిన్డ్ పీపుల్... ఇలాంటి జాత్యహంకార దూషణలేవీ పనిగట్టుకుని ఇప్పుడు అక్కడ లేవు. అక్కడి తెల్లవాళ్లు... తమలా ‘తెల్లగా’ లేని వాళ్లను సైతం తమ తలపై ఇష్టంగా మోస్తున్నారు. ఓట్లేసి మరీ కిరీటధారులను చేస్తున్నారు. దేశ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. అక్కడి నాన్– వైట్స్లో ఒకరు ఇప్పుడు ‘ప్రధాని’! మరొకరు ‘ఫస్ట్ మినిస్టర్’! ఇంకొకరు మేయర్! సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఒకప్పుడు లోకాన్ని ఏలిన ఈ అగ్రరాజ్యం... ‘‘మమ్మేలు గణనాథా... మాలోని చెడులను మాయింపగా...’’ అన్నట్లుగా శ్వేత జాతేతరుల పాలనకు మొగ్గు చూపుతోంది. వలసలన్న వివక్ష చూపక విశ్వమానవ భావనకు తలవొగ్గుతోంది. మరి మనం ఎందుకు భిన్నంగా ఉంటున్నాం? తోటి పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – వారిని ఎందుకు వేరుగా చూస్తున్నాం? బ్రిటిషర్లను జాత్యంహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం. ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి? ఒకవేళ అది గానీ నిజంగా జరిగి ఉండకపోతే, అది జరుగుతుందని నమ్మడానికే కష్టంగా ఉండేది. అదొకవేళ కల్పితం అయివున్నా ఆ కల్పన కూడా అతీంద్రియ భావనలా అనిపించేది. అయినప్పటికీ అది జరిగింది! నన్ను నిరుత్తరుడిగా మిగిల్చింది. నేడు బ్రిటన్లో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉండే మూడు అత్యున్నత స్థానాలలో భారత్ లేదా పాకిస్తాన్ సంతతి వారు ఉన్నారు మరి! ఐదేళ్ల క్రితమైతే ఇలా జరగడం అన్నది ఊహకు సైతం అసాధ్యమైన సంగతే. గత వేసవిలో రిషీ సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం పోటీ పడి లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయి నప్పుడైతే... ఇక తమ జీవితకాలంలో ఎప్పటికైనా గోధుమ రంగు చర్మం కలిగివున్న ఒక వ్యక్తిని బ్రిటన్కు ప్రధాన మంత్రిగా చూస్తామని ఎవరూ అనుకుని ఉండరు. అందరూ ఎన్నికైనవాళ్లే! కానీ అక్టోబర్లో భారతీయ సంతతికి చెందిన హిందూ మతస్థుడు రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. గతవారం స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాని)గా పాకిస్తానీ ముస్లిం హమ్జా యూసఫ్ బాధ్యతలు చేపట్టారు. పాకిస్తానీ మూలాలున్న మరొక ముస్లిం సాదిఖ్ ఖాన్ 2016 నుంచీ లండన్ మేయరుగా కొన సాగుతున్నారు. ఆయన ఇప్పుడు తన రెండవ టర్మ్లో కొనసాగు తున్నారు. ఈ ముగ్గురూ ఎన్నికైన వారే తప్ప నియామకంతో వచ్చి దర్జాగా పీఠంపై కూర్చున్నవారు కాదు. వీళ్లను ఎన్నుకున్న ఓటర్లలో అత్యధికులు శ్వేత జాతీయులే. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభాలో భారతీయ సంతతికి చెందిన వారు కేవలం 2.86 శాతం. పాకిస్తానీ మూలాలు ఉన్న ప్రజలైతే ఇంకా తక్కువగా 1.8 శాతం మాత్రమే. ఇది నాకు 1976 డిసెంబరు నాటి కేంబ్రిడ్జి యూనియన్ చర్చను గుర్తుకు తెస్తోంది. పదవి నుంచి నిష్క్రమిస్తున్న ఆంగ్లో–పోలిష్ సంతతి యూనియన్ ప్రెసిడెంటు పీటర్ ఫుడకోవ్స్కీ నుంచి కొత్త అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భం అది. అధ్యక్ష పదవి చర్చకు సంబంధించిన తీర్మానంలో ఆ వెళ్లిపోతున్న పీటర్ మాట్లాడుతూ... ‘‘ఈ యూనియన్ శ్వేత జాతీయులు కాని వారి చేతుల్లోకి వెళుతోంది’’ అని తమాషాకు అన్నారు. ఆయన తమాషా యాభై ఏళ్ల తర్వాత నిజమైంది. మన ప్రవర్తన విరుద్ధం బ్రిటన్ చిరకాలం వర్ధిల్లాలి. ఎంత అద్భుత మైన దేశం! మరొకటి కూడా జోడించి చెబుతాను. మిగతా ప్రపంచ దేశాలకు బ్రిటన్ ఒక దీపస్తంభం. ముఖ్యంగా మనకు! వలస వచ్చిన హిందువులు, ముస్లింలలో రెండవ తరం, మూడవ తరం వారిని కూడా బ్రిటన్ తన ప్రభు త్వంలో కీలక స్థానాలకు చేర్చి కూర్చోబెట్టింది. గొప్ప సంగతేమంటే దీనికి స్థానికులెవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అరచి గీపెట్టడం లేదు. ప్రజా నిరసనలు లేవు. మన దగ్గర చూడండి. అందుకు పూర్తిగా విరుద్ధం. మనం మన తోటి ముస్లిం పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – ‘పాకిస్తాన్ వెళ్లిపోండి...’ అని వారికి ఎప్పుడూ చెబుతూ ఉంటాం. మన రాజకీయ నాయకులు వారిని బహిరంగంగా దూషిస్తుంటారు. వారి ఇళ్లను పోలీసులు చట్ట బద్ధం కాని పద్ధతుల్లో కూలగొడుతుంటారు. శ్రీరామనవమి సంద ర్భంగా మనం వారి దుకాణాలను బలవంతంగా మూత వేయిస్తాం. వారిపై ‘లవ్ జిహాద్’ నిందను వేస్తాం. కొన్నిసార్లు వారి గుర్తింపును కూడా తిరస్కరిస్తాం. వారిని హైందవ ముస్లింలుగా వ్యవహరిస్తాం. చెదపురుగులు అని కూడా అంటాం. బ్రిటిషర్లను జాత్యహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం... ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి? సమాధానం చెప్పండి అని నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. అలా అడిగితే అది మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు అవుతుంది, లేదంటే జవాబు కోసం మొండిపట్టు పట్టినట్లుగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను నేను కచ్చితంగా లేవ నెత్తుతాను. ఎందుకంటే, మనం మన తోటి పౌరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి ఈ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని నా ఆశ. అంతేకాదు, వారిపై మన ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఆలోచన కూడా రావాలి. కానీ మనలో చాలా మందికి ఈ ప్రభావం అన్నది అసలు ఆలోచించే విషయమే కాదు. కించపరచడం చాలా తేలిక. ఆ పనిని మనం అనా లోచితంగా చేసేస్తుంటాం. అది మనకు ఏ విధంగానూ అసౌకర్యాన్ని కలిగించదు. కానీ ఆ గాయాన్ని భరించడం, గాయంతో జీవించడం అవ తలి వాళ్లకు దుర్భరం అవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే... ఇది తప్ప వేరే ఇల్లు లేదని, ఈ ఇంటి నుంచి తప్పించుకునే వీలు కూడా లేదని నీకు తెలుస్తూ ఉండటం! బ్రిటన్ మారిపోయింది నేను చదువుకున్న బ్రిటన్ కూడా నిస్సందేహంగా ఇందుకు భిన్నమైనదేం కాదు. గోధుమ రంగు చర్మం ఉన్న వారికి అక్కడ నాన్–వైట్స్ అని, నల్ల జాతీయులు అని, నిగ్గర్స్ అని పిలిచేవారు. తెల్లవాళ్లలో కూడా స్థాయిని బట్టి, యాసను బట్టి హెచ్చుతగ్గుల విభజనకు గురయినవాళ్లూ ఉన్నారు. నిన్నెలా చూస్తారన్నది నువ్వెలా మాట్లాడుతున్నావన్న దాన్ని బట్టే అక్కడ ఉంటుంది. కానీ ఈ యాభై ఏళ్లలో బ్రిటన్ మారిపోయింది. పాత దేశం కను మరుగైపోయింది. బాహ్యంగా పూర్వపు అవశేషాలు ఉంటే ఉండొచ్చు. కానీ గుండె లోతుల్లో అయితే బ్రిటన్ పునర్నిర్మాణం జరిగిపోయింది. ఇదే సవాలును మనం ఇప్పుడు భారత్లో ఎదుర్కొంటున్నాం. మన లోపలి అసురులను దాటుకుని మనం పైకి రాగలమా? ఆ అసురులను మనం జయించగలమా? చాలా గణనీయమైన విస్తృతిలో బ్రిటన్ దీనిని సాధించింది. మరి మనం సాధించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే నాటికి నేను ఉండకపోవచ్చు. మార్పునకు ఒకటో, రెండో జీవితకాలాలు పట్టొచ్చు. ఇప్పటికైతే నేను మనుషుల మధ్య వినిపిస్తున్న ప్రేమరాహిత్య మౌన రాగాన్ని మాత్రమే వినగలుగుతున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సారీ చెప్పడం తెలియకపోతే...
విధి విచిత్రమైనది. విరుద్ధంగా తిరుగుతాయని ఎంతమాత్రమూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ ను ‘పూర్తిగా అర్థరహితం’ అని పేర్కొంటూ రాహుల్ చింపేశారు. తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మో హన్ను ఉద్దేశపూర్వకంగా అవమానించారు. ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. కానీ ‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’ అన్న వ్యాఖ్య మన్మోహన్ను ప్రధానిగా బలహీనపర్చింది. అందుకే, మన్మోహన్ కు బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ బకాయి పడ్డారు. కానీ ఆయన మూర్ఖంగా ‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’ అంటూ ప్రగల్భాలకు పోయారు. క్షమాపణ అవసరమైనప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మిగిలిపోతారు. విధికి సంబంధించిన చమత్కారాలు, వక్రోక్తులు నాకు ఎంతో ఆసక్తి గొలుపుతుంటాయి. ఘటనలు మీకు విరుద్ధంగా జరుగుతాయని మీరు అసలు ఎంతమాత్రమూ ఊహించనప్పుడు, అవి వాస్తవంగా అలాగే పైకి తేలుతాయి. అవును, అలాగే జరుగుతాయి. వ్యావహారి కంగా దీన్ని ‘సోడ్ న్యాయం’ అని పిలుస్తారు. (ఒకటి తప్పుగా జరిగే అవకాశం ఉంటే, అది చివరకు తప్పుగానే జరుగుతుందని బ్రిటన్లో నవ్వుతూ చెప్పే మాట.) షేక్స్పియర్ వంటి నాటకకర్త చేతుల్లో అది మితిమీరిన గర్వంగా పరివర్తన చెందుతుంది. ఆయన గొప్ప విషాదాంత నాటకాలు ఈ వ్యవహారం పైనే ఆధారపడి రూపొందాయి. ఏ రకంగా చూసినా, ఇది ‘దేవుడి లీలావిలాసాలు’ మనకు వెల్లడయ్యే క్షణం! రెండు క్షమాపణలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విషయంలో జరిగింది అదే. ఆడంబరంగా, అలా కాదనుకుంటే డాంబికంగా అయన పత్రికా సమా వేశంలో ఇలా ప్రకటించారు: ‘‘నా పేరు గాంధీ; గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’’. దురదృష్టవశాత్తూ ఇద్దరు వ్యక్తులకు ఆయన క్షమాపణలు బాకీ పడ్డారని స్పష్టమైన సమయంలోనే, ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చాలా స్పష్టంగా అది బహిర్గతమైన విషయం. పైగా అది కచ్చితంగా బహిరంగంగా జరిగిన విషయం. రాహుల్ తన తొలి క్షమాపణను మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు బాకీ పడ్డారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ను ‘‘పూర్తిగా అర్థరహితం’’ అని పేర్కొంటూ రాహుల్ దాన్ని చింపేశారు. విచిత్రమైన విషయం ఏమి టంటే, ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఎందుకంటే, ఆ ఆర్డినెన్సు ఇలా ఒక శాసనాన్ని పొందుపర్చింది. ‘‘శిక్ష పడిన నాటి నుంచీ 90 రోజులలోపు, ఆ శిక్షను పునర్విమర్శ చేయమని కోరుతూ ఒక విజ్ఞప్తి లేదా అభ్యర్థనను దరఖాస్తు చేసినట్లయితే’’ కనీసం రెండేళ్ల శిక్ష పడిన పార్లమెంట్ సభ్యుడి తక్షణ అనర్హత అనేది అనిశ్చిత స్థితిలోకి వెళ్తుంది. (ఇంకోరకంగా చెప్పాలంటే, అప్పటికి నిలుపుదల అవు తుంది.) ముందుచూపు లేకపోవడం 2013లో రాహుల్ గాంధీ గుర్తించనిది – బహుశా, ఈరోజు ఆయన మర్చిపోనిది ఏమిటంటే, ఆయనకు పడిన శిక్షపై ఒకవేళ న్యాయస్థానం చివరకు స్టే విధించినప్పటికీ... ప్రస్తుత పార్లమెంటులో ఆయన చాలా వారాలపాటు అడుగుపెట్టే అవకాశం అప్పటికి కోల్పోయివుంటారు. ఇది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యంగా, ఆయన నియోజక వర్గమైన వయనాడ్ (కేరళ)కు ఈ కాలంలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నిజానికి, ఇది భార తీయ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుందని కూడా మీరు వాదించ వచ్చు. ఎందుకంటే మామూలుగా లోక్సభలో వ్యక్తీకరించగలిగిన ఒక అభిప్రాయం వినలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్్సను లాలూ ప్రసాద్ యాదవ్ను కాపాడటానికి తెస్తున్న ముతక, ఇంకా చెప్పాలంటే అనైతిక ప్రయత్నంగానే చూశారు. కానీ ఆ ఆర్డినెన్స్కు అంతకంటే మించిన విలువ ఉందని ఆయన చూడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే చూడ దల్చలేదు కూడా. బహుశా ఆ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉందన్న అంశంపైనే ఆయన దృష్టి మొత్తంగా ఉండేది. అయితే ఆయన ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. ఇంకా ఘోరమైన సంగతి ఏమిటంటే, తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మోహన్ సింగ్ను ఉద్దేశపూర్వకంగా రాహుల్ అవమానించారు. ‘‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’’. ఇది జూలియస్ సీజర్ను బ్రూటస్ పొడిచేయడం లాంటిదే. ఆ వ్యాఖ్య మన్మోహన్కు నష్టం చేయడమే కాదు, ప్రధానిగా ఆయన్ని బలహీన పర్చింది. అందుకే, డాక్టర్ మన్మోహన్ సింగ్కు పూర్తిగా బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ గాంధీ బకాయి పడ్డారు. సముచితం కాని స్పందన రెండో క్షమాపణ – అది చెప్పడం జరిగినట్లయితే– రాహుల్ ఎలాంటి వ్యక్తో వెల్లడవుతుంది. అది ఆయన స్వభావానికి, చివరకు తన నైతిక సమగ్రతకు కూడా పరీక్షే అవుతుంది. అందువల్ల, ఈ రెండు క్షమాపణలు చెప్పడం కష్టమైనవే కానీ అవి మరింతగా అవసర మైనట్టివి. ‘‘ఓబీసీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించారని బీజేపీ చేసిన ఆరోపణపై మీ అభిప్రాయం ఏమి’’టని మార్చి 25న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో అడిగిన ఒక జర్నలిస్టు పట్ల రాహుల్ చాలా గర్వంతోనూ, మొరటుగానూ వ్యవహరించారు. కచ్చితమైన, సముచి తమైన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా రాహుల్ ఆ విలేఖరిపై మాటల దాడికి దిగారు. ‘‘నువ్వు బీజేపీకి ఇంత నేరుగా ఎందుకు పనిచేస్తున్నావ్... నీకు వారి నుంచి ఆదేశాలు అందాయా... నువ్వు బీజేపీ కోసం పనిచేయాల నుకుంటే, బీజేపీ జెండా... లేదా గుర్తు ... తెచ్చుకుని నీ ఛాతీపై పెట్టుకో... అప్పుడు వారికి నేను ఏ రీతిలో సమాధానం చెబుతానో నీకు కూడా అలాగే జవాబు చెబుతాను. అంతేకానీ పత్రికల మనిషిగా నటించవద్దు.’’ ఇబ్బంది కలిగించేలా తన స్థిరత్వాన్ని, స్థిమితాన్ని కోల్పోవడం సరిపోలేనట్టుగా– రాహుల్ గాంధీ ఆ జర్నలిస్టును మరింత వెటకారం చేశారు. ఇంకో ప్రశ్న (మరెవరో) అడుగుతుండగా, అందరికీ వినబడే ట్టుగా రాహుల్ గాంధీ ‘‘హవా నికల్ గయీ’’(గాలి పోయింది) అనే శారు. ఆయన ముఖంలో తెలివితో కూడిన నవ్వు పరిస్థితిని మరింతగా దిగజార్చివేసింది. క్షమాపణ మనిషిని తగ్గించదు రాహుల్ గాంధీ చెప్పింది సమర్థించుకోలేనిది. దీంతో ఎవరైనా అంగీకరించారంటే నాకు సందేహమే. అయినా సరే ఆయన క్షమాపణ చెబుతారా? ఇది యధాలాపంగా సంధించిన ప్రశ్న కాదు. ఇది రాహుల్ వ్యక్తిత్వానికి, నైతిక స్వభావానికి కొలమానం. నిజాయితీగా చెప్పాలంటే, రాహుల్ ఎలాంటి వ్యక్తి అని తెలిపే పరీక్ష ఇది. వివేకం, ఆత్మసాక్షి ఉన్న రాజకీయ నాయకుడు క్షమాపణ చెబుతారు. పైగా క్షమాపణ అనేది రాహుల్ గాంధీ స్థాయిని పెంచు తుంది. ఆయన పట్ల మన గౌరవం పెరిగేట్లు కూడా చేస్తుంది. కానీ ఆయన ఇప్పటికే మూర్ఖంగా ప్రగల్భాలకు పోయారు: ‘‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు.’’ ఒకవేళ అదే ఆయన వైఖరి అయితే, అంటే క్షమాపణ అవసరమైనప్పుడు, దాన్ని బాకీ పడిన ప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం అనేది దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మారిపోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విమర్శ ప్రాధాన్యం మరిచారా?
కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోదీ ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతికఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు’’ అన్నారు. మీడియా విమర్శనాత్మకంగా ఉండకపోతే ప్రభుత్వంలో భయం పోయి దేశానికి తీవ్ర నష్టం జరుగు తుందన్నారు. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. కొంతమంది మంత్రులు మోదీ మాటల్ని మర్చిపోయారు. విమర్శకులను జాతి వ్యతిరేకులు అని నిందిస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. సాక్షాత్తూ తన ప్రభుత్వాన్ని విమర్శించ డానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రధాన మంత్రే చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తున్నాయో నాకు తెలీదు. ఆయన ప్రకటనలోని విషయం మాత్రమే కాదు, ఆయన జాగ్రత్తగా వాడిన పదాలు కూడా. ఆ ప్రసంగ వీడియోలోని క్లిప్ను ప్రదర్శించినట్లయితే, ప్రధాని ప్రసంగంలోని ధాటిని కూడా మీరు గమనిస్తారు. ఆ మూడింటినీ కలిపిచూస్తే, ఆయన చెప్పిన మాటల్ని సరిగ్గా అలాగే ఉద్దేశించారని మనల్ని స్పష్టంగా నమ్మమని అన్నట్లుగా ఉంటాయి. ప్రధాని పదవిని చేపట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2016 సెప్టెంబర్లో ‘నెట్వర్క్ 18’ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు: ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతి కఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు.’’ భయం ఉండాల్సిన అవసరం మొదటగా ఆ పదాల ఎంపికను గమనించండి. ‘కఠినాతి కఠినమైన’ విశ్లేషణ, విమర్శ. మృదువైన, సూక్ష్మ కాదు. పరుషంగా, దాపరికం లేకుండా, శక్తిమంతంగా! రెండవది, ప్రభుత్వ పనిని మాత్రమే కాదు, ప్రభుత్వాన్నే విమర్శించి, విశ్లేషించాలి. మోదీ వీటిని ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వక విభజన. మోదీ మరింత ముందుకెళ్లారు. అంతే సమానమైన, శక్తిమంతమైన పదాలతో ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మీడియా విఫలమైతే రాదగిన నిర్దేశిత ఫలితమేమిటో చెప్పారు. ‘‘ప్రభుత్వంలో తేవాల్సిన మెరుగుదల, ప్రభుత్వంలో ఉండి తీరాల్సిన భయం లేకుండాపోతాయి. ఒకవేళ ఆ భయం ప్రభుత్వంలో అదృశ్యమైతే, దేశం ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్లే మీడియా అత్యంత విమర్శ నాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’. అంటే, ప్రభుత్వాన్ని భయపడుతున్న స్థితిలోనే ఉంచాలని ప్రధాని కోరుకుంటున్నారు. ఆయన ‘భయం’ అనేమాటను అను కోకుండా ఉపయోగించలేదు. చెప్పాలంటే, ఆ పదాన్ని ఆయన మూడుసార్లు వాడారు. ప్రభుత్వం భయపడటం మానేస్తే ఏం జరుగుతుందో గమనించండి– దేశానికి తీవ్ర నష్టం! జాతి వ్యతిరేకులా? ఇతర ప్రజాస్వామిక నేతలు విమర్శ అవసరం గురించి ఈ స్థాయిలో చెప్పి ఉంటారా అని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. పైగా మోదీ ప్రభుత్వాలను అని బహువచనంలో మాట్లాడలేదు. ప్రత్యేకించి తన సొంత ప్రభుత్వం గురించే మాట్లాడారు. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు పునరుల్లేఖించాను? మామూలు కారణం ఏమిటంటే, కొంతమంది మంత్రులు దాన్ని మర్చిపోయారు లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించేశారు. అందుకు నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలను. కానీ రెండింటికి మాత్రమే పరిమిత మవుతాను. కొంతమంది రిటైరైన న్యాయమూర్తులు ‘భారత వ్యతిరేక గ్యాంగ్’లో భాగమయ్యారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఎందుకంటే ఈ న్యాయమూర్తులు పాల్గొన్న ఒక సెమినార్లో– మోదీ ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తుల గురించిన విశ్లేషణను ప్రొఫెసర్ మోహన్ గోపాల్ సమర్పిస్తూ, వారిలో 15 శాతంమంది మతరాజ్య వ్యవస్థకు తప్ప రాజ్యాంగబద్ధ న్యాయ మూర్తులాగా లేరని పేర్కొన్నారు. మోదీ ప్రకటన సరిగ్గా ఇదే మాట్లాడుతోందని న్యాయమంత్రి గుర్తించడం లేదా? అయినప్పటికీ ఆయన దాన్ని ‘భారత వ్యతిరేకం’ అన్నారు. న్యాయమూర్తులు దీనికి ‘తగిన మూల్యం’ చెల్లిస్తారని హెచ్చరించారు కూడా! చతురత లేకపోతే... నా రెండో ఉదాహరణ – ఉప రాష్ట్రపతికి సంబంధించినది. ఆయన మోదీ ప్రభుత్వంలో సభ్యుడు కాదు. ఆయన స్థానం ఆయన్ని మించినది. కానీ ‘మేధావర్గం, మీడియా జనాల’ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించి చూపడానికి భారత వ్యతిరేక శక్తులు హానికరమైన కథనాలను అల్లుతున్నాయి. మన క్రియాత్మక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు కళంకం తెస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఇంటర్వ్యూలోని విష యాలు తనకు కూడా వర్తిస్తాయని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించాలని చూస్తున్నవారు’’ మన స్థూలదేశీయోత్పత్తి యథార్థతను ప్రశ్నిస్తున్నారు. ‘‘మన క్రియాత్మక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను’’ కళంకపరుస్తున్నవారు పార్లమెంటు, ఎన్నికల కమిషన్, మన భద్రతా సంస్థల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విమర్శను కేవలం స్వాగతించడం కాదు, ఇది అవసరమే అని మోదీ చెప్పారు. ప్రభుత్వ విమర్శలకు జవాబు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులూ, బీజేపీ అధికార ప్రతినిధులూ ప్రధానమంత్రి వివేకవంతమైన మాటలను కంఠతా పట్టాల్సి ఉంది. నన్ను మరో అంశాన్ని కూడా చేర్చనివ్వండి. విమర్శను ఎదుర్కొన్నప్పుడు చిరునవ్వుతో వినాలి, హుందాగా స్పందించాలి. అప్పుడు ఆ విమర్శ వెంటనే వీగిపోతుంది. అలా కాకుండా విమర్శతో ఘర్షించడం, ఇంకా ఘోరంగా విమర్శకు లను జాతి వ్యతిరేకులు అని నిందించడం చేస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చతురతతో వ్యవహరించు, రాజకీయం చేయవద్దు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన తీరు ఇలా ఉండాలా?
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు సంకుచితంగా ఉంది. అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటున్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అతడిని అనుమానితుడిని చేసింది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వెంటనే అనుమతి దక్కలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ హక్కుల సూత్రబద్ధ సమర్థకురాలిగా ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. మనం ఈ స్వీయ–ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన పట్ల పాకిస్తాన్ ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. మన సొంత ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి మన పొరుగు వాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? పాకిస్తాన్ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిణించుకుంటున్న దేశం, ఐరాసలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మన దేశాన్ని సందర్శించాలని కోరుకునే పాకిస్తానీయుల పట్ల మనం ఎందుకు చీకాకుగా వ్యవ హరిస్తాం? అయితే మన పట్ల వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. కానీ నా అనుభవం అలా లేదని నేను చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి వాదన సముచితమైనది కాదు. అది మనకు విలువనివ్వదు కూడా! మొదటి విషయం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, మానవ హక్కుల విషయంలో సూత్రబద్ధ సమర్థకురాలిగానూ ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. కానీ మనం దీన్ని గురించి చెప్పినట్లయితే పాకిస్తాన్ అసలు నమ్మదు. అయితే మనం కూడా మన స్వీయ– ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సొంత ప్రమాణాలను నిర్దేశించు కోవడానికి మన పొరుగువాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? అలా కాదంటే– ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా కాకుండా, దానికి భిన్నంగా వ్యవహ రించడం ద్వారా మనం మరింత మెరుగైనవాళ్లమని దృఢ నిరూపణ చేయాల్సి ఉంటుంది. అనుమానపు చూపు అద్భుతమైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు నేను వర్ణించిన రోత ప్రవర్తనకు ప్రతిరూపమే. నిజానికి ఇది అంతకుమించిన ఘోరమైన విషయం. సంకు చితంగా, ద్వేషపూరితంగా, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి వైఖరి భార త్ను పేలవంగా చూపిస్తుంది. దీంట్లోని అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, ఇదంతా మనకు మనం కలిగించుకున్న నష్టమే. పాకిస్తాన్లో పుట్టిన ఖ్వాజా నాలుగేళ్ల వయసులో ఉండగా కుటుంబంతోపాటు ఆస్ట్రేలి యాకు వలస వెళ్లాడు. ఈరోజు అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అతడు అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటు న్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అనుమానితుడిని చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అతడికి వెంటనే అనుమతి దక్కలేదు. అది ఎంత ఆలస్యమైందంటే, ఫిబ్రవరి 1న ఖ్వాజా లేకుండానే ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు వచ్చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ పాలనా యంత్రాంగం నిరసన తెలిపిన తర్వాతే ఖ్వాజా వీసాను పొంద గలిగాడు. ప్రభుత్వాల ప్రామాణిక ధోరణి భారతదేశంలో మనలో ఏ కొద్దిమందికో ఈ విషయం గురించి తెలుసు. అందులో బహుశా చాలా కొద్దిమంది దీని గురించి కలవరపడుతుండవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. బీజేపీ ఖ్వాజాను ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిలా కాకుండా పాకిస్తాన్లో పుట్టిన ముస్లింలా చూస్తోందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో రాసే దేశ అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతల్లో ఒకరైన మాల్కమ్ కోన్ రాశారు. వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉంది. భారతీయ వీసాను పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం ఖ్వాజాకు ఇదే తొలిసారి కాదు. ‘ది గార్డియన్’ పత్రిక ప్రకారం– మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2011 లోనే ఈ అనుభవం అతడికి ఎదురైంది. పాకిస్తానీ యుల పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించడం భారత ప్రభుత్వాలకు ఒక ప్రామాణికమైన ఆచర ణగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. ద్వంద్వ పౌరసత్వం ఉన్న పాకిస్తానీయుడు, భారతీయ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను వివరించనివ్వండి. ఆ వ్యక్తి లండన్, న్యూయార్క్ లేదా దుబాయ్ నివాసి అయినప్పటికీ, వారి పాకిస్తానీ పాస్పోర్ట్పైనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తప్ప మరొక పాస్పోర్ట్ మీద కాదు. దరఖాస్తు సమర్పించగానే భారతీయ రాయబార కార్యా లయం దాన్ని ఢిల్లీకి పంపిస్తుంది. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ కాకుండా, హోమ్ మంత్రిత్వ శాఖ దాన్ని నిర్ణయిస్తుంది. దానికి కొన్ని నెలలు పడుతుంది. మూడు నెలల్లోగా నిర్ణయం వస్తుందని ఆశించవద్దని దరఖాస్తుదారులకు ఆటోమేటిక్గా చెబుతారు. అఖండ భారత్ ఇలాగా? తరచుగా నేను మెజారిటీ కేసులను తడిమి చూశాను. ఎక్కడా స్పందన లేదు. అలాంటి సందర్భాల్లో ఏ వార్తా రాకపోవడం మంచి వార్త కాదు. ఒకవేళ వచ్చిదంటే, ఎవరో మీ కోసం తీగ లాగగలగాలి. అదీ మీరు అదృష్టవంతులైతే! కానీ ఎంతమంది పాకిస్తానీయులకు అలాంటివి చేసి పెట్టేవారు దొరుకుతారు? తుది ఫలితం ఏమిటంటే – భారత్ సందర్శించడానికి చాలా తక్కువ మంది మాత్రమే అనుమతి పొందుతారు. ఒకప్పుడు –అంటే చాలా కాలం క్రితం కాదు– మన తోటి దేశవాసులుగా ఉండిన వారితో మనం నిజంగా వ్యవహరించవలసిన తీరు ఇదేనా? మరీ ముఖ్యంగా, అఖండ భారత్పై మన ప్రకటనలకు (సమర్థన అటుండనీ) మద్దతు గెల్చుకోవడానికి మనం వెళుతున్న మార్గం ఇదేనా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిగణించుకుంటున్న దేశం, ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనేది సమాధానం అయితే అది నేను నమ్మలేని విషయం అవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వంతో మనకు దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ ప్రజల విషయంలో కూడా ఇది నిజమేనా? ఈ సందర్భంలో దేశ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? లేదా మనం అలాంటి సులభమైన సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించలేనంత అసమర్థులమా? ఈ విషయంలో నిజం ఏదంటే, మనం వీసాలను నిరాకరించడం ద్వారా పాకిస్తానీయులు ఇబ్బందిపడి ఉండవచ్చు లేదా పడకపోయి ఉండ వచ్చు. కానీ ఒక దేశంగా మనం (భారత ప్రభుత్వాలు మాత్రమే కాదు, భారత ప్రజలం కూడా) వికారంగా కనిపించడం లేదా? కాబట్టే మన కోసమైనా మనం ఇలాంటి ధోరణిని తప్పక ఆపివేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్ కథ ముగిసినట్టా?
తమ పార్టీ తిరిగి ఎలాగైనా లేస్తుందని ఏ రాజకీయ నాయకుడైనా నమ్ముతాడు. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవదా? కానీ వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ విషయంలో అది ఎంతమాత్రమూ హాస్యాస్పదం కాకపోవచ్చు. పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేకపోయింది. ఓటమికి సంబంధించిన నిరాశా నిస్పృహల నడుమ ఉంటున్నప్పటికీ, తమ పార్టీల పున రుజ్జీవన సంకేతాలను రాజకీయ నాయకులు చూస్తున్నట్లయితే అది అర్థం చేసుకోదగినదే. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవుతుందా? కచ్చితంగా కాదు. ప్రభ కోల్పోయిన పార్టీలు పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్ని కల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేక పోయింది. అయినప్పటికీ, కాంగ్రెస్ కథ ‘ముగిసిందని’ చెప్పడం హాస్యాస్పదమైనదని రాహుల్ గాంధీ అతిశయిస్తున్నారంటే దాన్ని నిజమని రుజువు చేయాల్సి ఉంటుంది. ఊరికే వేచి ఉండడం ద్వారా, మంచి జరుగుతుందని ఆశించడం ద్వారా అది జరగదు. ప్రొఫెసర్ సుహాస్ పల్శీకర్ ఎత్తి చూపి నట్లుగా, ‘బహుళ పార్టీ సమాఖ్య రాజకీయాల్లో పోటీలో ఉండటం’ అనేది దాదాపు కాంగ్రెస్కు 35 ఏళ్లనుంచీ సవాలుగానే ఉంటోంది. 1989లో పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి అది ప్రభుత్వంలో ఉంటూ వచ్చి నప్పటికీ, మెజారిటీని ఎన్నడూ గెలుచుకోలేదు. త్వరలోనే ఈ సవాలు ‘దాటలేనిది’గా మారి పోయింది. అలా జరగకూడదంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థా గతంగా, రాజకీయ సమీకరణల పరంగా రెండు రంగాల్లో తప్పక పనిచేసితీరాలని పల్శీకర్ విశ్వాసం. ఆ పార్టీ ఆయన సలహాను పాటించడానికి సమ్మతించక పోయినప్పటికీ, ఉజ్జ్వల ప్రతిపక్షాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్ పునరుత్థానంపై నమ్మకం పెట్టుకున్న మనలాంటి వారికి అది మంచి ఆశను కలిగిస్తోంది. ఎన్నికలే ప్రాణ వాయువు రాజకీయ సంస్థ గురించి పల్శీకర్ రెండు అంశాలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్టీ పనితీరును ప్రజా స్వామ్యీకరించడమే! వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా, పార్టీ ప్రజాస్వామ్యీ కరణ విషయంలో కాంగ్రెస్ విఫలమైంది. ఎన్నికలు సృష్టించే మథనం పార్టీకి ‘ప్రాణ వాయువు’ను ఇస్తుంది కాబట్టి ఇది ముఖ్యమైనదని పల్శీకర్ అంటారు. నామినేషన్లు అనేవి సుప్తావస్థను కొన సాగేలా చేస్తాయి. రెండో సంస్థాగతమైన అవసరం ఏమిటంటే, ఒక కుటుంబానికి ఒక పదవి అనే నిబద్ధతను పూర్తి చేయడమే! ఇది గాంధీలకు మాత్రమే అన్వయించదు. ‘స్థానిక పార్టీ యూనిట్లను నియంత్రించే అనేక కుటుంబాల స్థిరపడిన ఆసక్తులతో ఇది ఎక్కువగా ముడిపడి ఉంది. ఇది ఎక్కువగా స్థానిక రాజకీయాల నిర్వహణకు సంబంధించినది’. ఈ ఆధిపత్య కుటుంబాలు ‘యువ కార్యకర్తలను స్పర్థాత్మక రాజకీయాల్లోకి అనుమతించడం’ ముఖ్యమని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ సమీకరణపై కూడా పల్శీకర్ రెండు అంశాలను జోడించారు. పెద్ద మాటలు, పవిత్రమైన ఆశలను పక్కనపెడితే... కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యమైన పోటీదారును ఎదుర్కొంటున్న సమయంలో సంకీర్ణం కోసం సరైన ఫార్ములాను ఎంచుకోవలసిన అవసరముంది. ఆయన సలహా సరళమైనదే కానీ పదునైనది. ‘కాంగ్రెస్ పార్టీ మరింత నమ్రతతో ఉండడానికి సిద్ధం కావలసి ఉంటుంది’. మరో మాటలో చెప్పాలంటే, కాంగ్రెసే నాయకత్వం వహిస్తుందని పట్టుబట్టొద్దు. సమర్థంగా వివరించాలి సమీకరణ గురించిన రెండో అంశం మరింత సవాలుతో కూడుకున్నది. ఇది కాంగ్రెస్ సైద్ధాంతిక సందేశానికి సంబంధించింది. ‘ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం, మతతత్వం వంటి అంశాలపై ప్రజారాశులను పార్టీ ఎలా మేల్కొల్పబోతోంది?’ ఎందుకంటే ఇవి సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోని నైరూప్య భావనలు. వారి రోజువారీ జీవి తాలకు అనువుగా వీటిని సమర్థంగా వివరించ కుంటే ఫలితం ఉండదు. ఇప్పటికైతే వీటిని చెబుతున్నప్పుడు వాటి అర్థం నష్టపోతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మతతత్వ ఆరోపణల గురించి మాట్లాడే విషయాలను పల్శీకర్ ప్రత్యేకించి నొక్కి చెప్పారు. ‘మంచి హిందువుగా ఉండటం లేదా మంచి జాతీయవాదిగా ఉండటానికి ముస్లిం వ్యతిరేకిగా ఉండాల్సిన అవసరం లేదని సగటు హిందువుకు అర్థం అయ్యేట్టు చెప్పాలి, ఇది కొంచెం కష్టమైన పనే’. దీనికి సమాధానం ఏమిటంటే తన సొంత హిందూ విశ్వసనీయతపై ఆడంబరంగా చెప్పుకోవలసిన పనిలేదు కానీ హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడాల్సి ఉంది. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం గురించి అది విభిన్నరీతిలో నొక్కి చెప్పాల్సి ఉంది. కానీ ఇది చేయడం కంటే చెప్పడం సులభం! హాస్యాస్పదం కాదు కాంగ్రెస్ పార్టీ తన సందేశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం ఓటర్ల దృష్టిలో ఎంతో విలువైన విషయం. కులం, తెగ,సంస్కృతి, ఆహార ప్రాధాన్యతలు వంటి అంశాల్లో వ్యత్యాసాలను అధిగమించడం చాలా కష్టమైన పని. ఇది నేను ఎక్కడ మొదలెట్టానో అక్కడికే నన్ను తీసుకెళుతోంది. సవాలును కాంగ్రెస్ అధిగమించలేకపోతే, పార్టీ భవిష్యత్తు సందేహంలో పడుతుందని సుహాస్ పల్శీకర్ చెప్పడం నిజంగా హాస్యా స్పదమైన విషయమేనా? కాకపోతే ఈశాన్య భారత్లో ఫలితాలు భిన్నమైన విషయాన్ని సూచి స్తున్నాయి. అయినా కూడా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను నిలుపుకోవడంలో విఫలమైతే, కర్ణాటకలో గెలుపు సాధించలేకపోతే మాత్రం అది స్పష్టమైన సంకేతం. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు ఎటూ ఉండనే ఉన్నాయి. అయితే, అయితే, అయితే... బ్రిటన్లో కేమరాన్ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి రావడానికి ముందు వరుసగా మూడు ఎన్నికల్లో టోరీలు ఓడిపోయారు. లేబర్ పార్టీ అదృష్టాన్ని టోనీ బ్లెయిర్ మార్చివేయడానికి ముందు నాలుగు సార్లు ఆ పార్టీ కూడా అపజయం ఎదుర్కొంది. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అలాంటిది తెచ్చిపెట్టగలరా అనేదే ప్రశ్న! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘కోహినూర్ను బ్రిటన్ దొంగిలించింది’
బ్రిటన్ రాజకుటుంబ కథనాలంటే ఇప్పటికీ ఆసక్తికరమే. పైగా ప్రిన్స్ హ్యారీ దూకుడుగా వెలువరించిన ‘స్పేర్’ చదవడానికి మరింత ఆకర్షణీయం. తల్లి డయానా నాటకీయ మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్నీ, తానొక ‘స్పేర్’గా ఊరికే అలా పక్కనుండాల్సిన స్థితినీ రాశాడు. అలాగే అనేక ఇబ్బందికర విషయాలను పంచుకున్నాడు. అయితే కోహినూర్ వజ్రం గురించిన హ్యారీ ఆలోచనలు మాత్రం భారతీయులకు సంతోషం కలిగిస్తాయి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ రాసిన ‘స్పేర్’ పుస్తకం చదివినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడేది దాన్ని రాసిన విధానమే. శైలి బిగువుగా, ఉద్రిక్తభరితంగా, ఒక్కోసారి అసంగతంగానూ ఉంటుంది. చెప్పాలంటే ఒక థ్రిల్లర్లా ఉంటుంది. కాబట్టే ఇది చదవడానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులోని భాషలో లోతు తక్కువ. విషయం వదులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈటన్ స్కూల్, అఫ్గానిస్తాన్లలో హ్యారీ గడిపిన సమయాల గురించి వివ రిస్తున్నప్పుడు పైపైన సాగుతుంది. అప్పుడు నిస్సారంగా ఉండి, చికాకు కలిగిస్తుంది కూడా. తప్పనిసరిగా కనబడేవి మరో రెండు అంశాలు. తన తల్లి (డయానా) నాటకీయ మరణం కలిగించిన వేదన నుంచి హ్యారీ బయటపడలేదు. ఈ పుస్తకం మొత్తంగా ఇదే మానసిక స్థితి కొన సాగు తుంటుంది. అయితే ఇది అర్థం చేసుకోదగినదే. అర్థం కానిదల్లా ఏమి టంటే, తానొక ‘స్పేర్’(అలా పక్కన అందుబాటులో ఉండటం)గా ఉండాల్సిన వాస్తవం గురించి ఇంకా సమాధాన పడక పోవడమే. 38 సంవత్సరాల వయస్సులో కూడా ఏ హోదా లేదు. తన సోదరుడు విలి యమ్తో బాంధవ్యంపై ఇది స్పష్టమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఈ కారణంగానే స్కూల్లో విల్లీ (విలియమ్ను హ్యారీ ఇలాగే పిలు స్తాడు) తన పట్ల పట్టనట్టుగా ఉన్నాడని హ్యారీ నమ్మకం. పుస్తకంలోని మూడో అంశం ఏమిటంటే – రాజ కుటుంబానికీ, వెంటాడే ఫొటోగ్రాఫర్లకూ (పాపరాజ్జీ) మధ్య సాగిన అంతులేని పోరాటం. ‘‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వ వద్దు’’ అనేది రాజ కుటుంబ నినాదంగా ఉండేది. హ్యారీ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. పబ్లో రాత్రంతా గడిపిన తర్వాత తన కారు డిక్కీలో దాక్కునే వాడినని చెప్పాడు. డయానా కూడా అలాగే చేసివుంటుందని హ్యారీ అంటాడు. ఈ పుస్తకం చాలా విషయాలను వెల్లడిస్తుంది. వాటిలో చాలా వరకు తీవ్రమైనవి, కొన్ని మనోహరమైనవి. బాక్సర్ షార్ట్స్లో శీర్షాస నాలు వేసే అతడి తండ్రి, బ్రిటన్ రాజు చార్లెస్ ‘డార్లింగ్ బాయ్’ అని హ్యారీని పిలుస్తారు. ఇక విలియమ్ అతడిని ‘హెరాల్డ్’ అంటాడు. కానీ అలా ఎందుకంటాడో పుస్తకంలో ఎక్కడా ఉండదు. అయితే, ‘‘నాతో వ్యవహరించినప్పుడల్లా ఏ మార్పూ లేకుండా’’ అదే ‘‘సుపరి చితభ్రుకుటి’’ అని మాత్రం చెబుతాడు. ఇక బాల్మోరల్ రాజమందిరంలో పిల్లలుగా ఉన్నప్పుడు, క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని ఎప్పుడు దాటు కుని వెళ్లినా వారు ప్రతిసారీ వంగి నమస్కరించేవారు. ఈ పుస్తకంలోని చాలా వివరాలు అనవసరం. పైగా అవి ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటన్నింటినీ హ్యారీ ఎందుకు పంచు కున్నాడని మీరు ఆశ్చర్యపడతారు కూడా. ఉదాహరణకు, హ్యారీ తనకు తడి అయిందనీ (స్ఖలనం), దాన్ని దాచిపెట్టడానికి సముద్రంలోకి దూకేశాననీ చెబుతాడు. మేగన్ మెర్కెల్తో తన తొలి డేట్కు కొద్ది గంటల ముందు అలా జరిగింది. రాజకుటుంబీకులు, వారి స్కాటిష్ సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని అనిపించే ఒక కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యారీ తొలిసారి ఒక మగజింకను కాల్చినప్పుడు అతడి గైడ్ అయిన శాండీ ఆ మృతకళేబరపు చర్మాన్ని చీల్చి, యువరాజు హ్యారీని మోకాళ్లపై కూర్చో బెట్టి, అతడి తలను అందులోకి దూర్చాడట. ‘‘దీంతో ఉదయం నేను తిన్న ఫలహారం కడుపులోంచి బయటకు వచ్చేసింది’’ అని హ్యారీ రాస్తాడు. ‘‘నేను దేన్నీ వాసన పీల్చలేకపోయాను. ఎందుకంటే నేను శ్వాస పీల్చలేకపోయాను’’ అని చెబుతాడు. ‘‘నా నోరు, ముక్కు పూర్తిగా రక్తంతో, పేగులతో నిండిపోయాయి. ఒక తీవ్రమైన అసౌక ర్యపు వెచ్చదనం’’ అని చెబుతాడు. ఈ ఆచారం ముగియగానే, హ్యారీ ముఖంపై పడిన జింక రక్తాన్ని తుడవవద్దని శాండీ చెప్పాడట. ‘‘దాన్ని అలాగే ఎండిపోనీ, కుర్రాడా, అలాగే ఎండిపోనీ!’’ అన్నాడట. బ్రిటిష్ రాజకుటుంబంలో ఇద్దరు సభ్యులను హ్యారీ అంగీకరించలేకపోయాడు. ఒకరు మార్గరెట్ (ఎలిజబెత్ రాణి చెల్లెలు). ఆమెను అతడు ఆంట్ మార్గో అని పిలుస్తాడు. ఒకసారి ఆమె క్రిస్మస్కు మామూలు బాల్పాయింట్ పెన్ ఇచ్చిందట. అయినా వాళ్లిద్దరూ కలిసి సాగాల్సి వుంది. ఎందుకంటే, హ్యారీ నొక్కిచెప్పినట్టుగా ఆమె కూడా తనలాగే ఒక స్పేర్. ఇక హ్యారీ అంగీకరించని మరొకరు కెమిల్లా. ఆమెను పెళ్లాడవద్దని హ్యారీ, విలియమ్ ఇద్దరూ తమ తండ్రి చార్లెస్కి చెప్పారు. ఆమెను ‘ప్రమాదకారి’గా హ్యారీ పరిగణిస్తాడు. తన ఇమేజ్ను పెంచుకునే క్రమంలో ఆమె మీడియాకు పలు కథనాలు బహిర్గతం చేశారంటాడు. రెండు విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ పుస్తకంలో దోడీ ఫయీద్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అతడిని హ్యారీ అంతటా ‘మమ్మీ బాయ్ఫ్రెండ్’ అనే రాశాడు. ఇంకా తనకు ‘పాకీ’ అంటే జాతి వివక్షా పదమనీ, అవమానించినట్టనీ తెలియదని పేర్కొన్నాడు. అంతిమంగా, గూర్ఖాల పట్ల హ్యారీకి ఉన్న ఆత్మీయతకు భార తీయ పాఠకులు సంతోషపడతారు. లెఫ్టినెంట్ వేల్స్ అని హ్యారీని సంబోధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎల్లప్పుడూ ‘సాబ్’ అనేవారు. ‘‘రాజరికం పట్ల వాళ్లకు గంభీరమైన పూజ్యభావం ఉంది. వారి దృష్టిలో రాజు అంటే దైవం. కాబట్టి రాజకుమారుడు కూడా దైవా నికి మరీ దూరం కాదు’’. ఇక కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కలిగివుండటంలోని న్యాయ సమ్మతిని హ్యారీ ప్రశ్నించడం మన ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. ‘‘బ్రిటిష్ సామ్రాజ్యం తన ఉచ్చదశలో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకో ఆలోచన, దొంగిలించింది’’ అని అంటూ ఇలా కొన సాగిస్తాడు. ‘‘అది శాపగ్రస్తమైందని నేను విన్నాను.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ పాటను ఇక వినలేమా?
డూన్ స్కూల్లో పిల్లలందరూ సమావేశమయ్యే వేళ తరుచుగా పాడే పాట నా బాల్య జీవితంలోనే అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచింది. మాలో కొద్దిమందిమి మాత్రమే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకునేవాళ్లం. ఎందుకంటే, ఆ పాట ఉర్దూలో ఉండేది. కానీ దాని వెంటాడే శ్రావ్యత మమ్మల్ని కట్టిపడేసేది. యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పాటను ఎవరైనా మర్చిపోయి ఉంటారంటే నాకు సందేహమే. ‘‘లబ్ పే ఆతీ హై దువా బన్కే తమన్నా మేరీ’’మాకెంతో ఇష్టమైనది. దశాబ్దాల తర్వాత మాత్రమే ఆ పాటను రాసింది సుప్రసిద్ధ కవి ఇక్బాల్ అని నేను తెలుసుకున్నాను. ఆయనే రాసిన ‘‘సారే జహా సె అచ్ఛా హిందూస్తాన్ హమారా’’ స్థాయిలో నేను దీన్ని కూడా ఇష్టపడతాను. గత నెలలో, ఈ పాటను బరేలీ(ఉత్తరప్రదేశ్)లోని ఒక పాఠశాలలో పాడినప్పుడు, విశ్వహిందూ పరిషత్కు చెందిన సోంపాల్ సింగ్ రాథోడ్ దానిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘హిందువుల మనోభావాలను గాయపర్చే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పాఠశాల పిల్లల చేత ముస్లిం పద్ధతిలో పఠింపజేస్తున్నారు... ఇస్లాం వైపు పిల్లలను ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారు... ఉపాధ్యాయులు హిందువుల మనో భావాలను గాయపరుస్తూ విద్యార్థులను మతమార్పిడికి సిద్ధం చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. మనోభావాలను గాయపర్చే ఆ పదాలు ఏవంటే... ‘‘మేరే అల్లా బురాయీ సే బచానా ముర్nుకో’’. దీనికి వెంటనే స్పందించిన విద్యాశాఖ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి అది ఒక వెర్రి మాట. ఇది నన్ను విచారపడేలా, కలవరపడేలా చేసింది. ఇది మన దేశంలో మనం ఎలా మారు తున్నామో చూపుతున్న ఒక విచారకరమైన ప్రతిఫలనమా? లేక నేను యుగాల వెనుకటి మర్చిపోదగిన డైనో సార్లా ఉంటున్నానా? నాలో నేను ఈ ప్రశ్నలను వేసుకుంటున్న ప్పుడు, డూన్ స్కూల్లో మాకు మరో ఇష్టమైన గీతం అయిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సుప్రసిద్ధ ప్రార్థనా గీతం గుర్తుకొచ్చింది. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ సంసారపు గోడల భాగాల కింద ప్రపంచం విడిపోలేదో... ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు!’’ కానీ మన దేశంలో ఇలాంటిది ఇప్పుడు జరుగుతోందా? అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ నా భయాలు అతిశయోక్తులని నేను భావించడం లేదు. క్రిస్మస్ పర్వదినానికి కొన్ని రోజుల ముందు న్యూఢిల్లీలో ఒక పాస్టర్ ప్రజలను మతమార్పిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిజానికి, ఆయన అధ్యక్షత వహించిన ఆ సమూహం క్రిస్మస్ గీతాలను పాడింది. నిరసనకారులు ఆ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెలుపల పోగయ్యి ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారని పత్రికలు నివేదించాయి. దీంతో వెంటనే అది హిందూ వర్సెస్ క్రిస్టియన్ ఘర్షణగా మారిపోయింది. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన ‘ఎబైడ్ విత్ మి’ కీర్తనను గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రిట్రీట్లో వినిపించేవారు. ఎంతో మంది ఇష్టంగా ఎదురుచూసే దీన్ని ఏడు దశాబ్దాలపాటు వినిపిస్తూ వచ్చారు. అనేకమంది ప్రజలు ఈ కీర్తనను వింటూ ప్రత్యేకించి ముందుకు సాగేవారు. ఎందుకంటే వెంటాడే ఈ రాగం నార్త్ బ్లాక్ నుండి గంటల గణగణ శబ్దంతో ప్రతిధ్వనించేది. కానీ గత సంవత్సరం ఈ సుప్రసిద్ధమైన బీట్ను తొలగించారు. దశాబ్దాలుగా సైనిక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన దీని స్థానంలో ‘యే మేరే వతన్ కే లోగో’ పాటను చేర్చారు. ఇది వలస సామ్రాజ్య వారసత్వం నుంచి ‘‘విముక్తి పొందుతున్న నవ భారతం’’ అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ‘బీబీసీ’కి వెల్లడించారు. ‘‘బ్రిటిష్ వారు ప్రారంభించిన ట్యూన్లను మన మిలిటరీ బ్యాండులు 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆలపించడంలో ఏ అర్థమూ లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎబైడ్ విత్ మి’ పాటను తీసివేయడం అనేది భారత్ను నిర్వలసీకరించే కొనసాగింపు ప్రక్రియలో భాగమేనని ఆయన అభి ప్రాయపడ్డారు. నిజమే కావచ్చు. కానీ మహాత్మా గాంధీ దీనిగురించి ఏం అనుకునేవారు? ఈరోజు నుంచి 11 రోజులపాటు నేను ఎదురుచూస్తుంటాను... అధికారుల మనస్సు మారుతుందని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ సంవత్సరం బీటింగ్ రిట్రీట్ను నేను తిలకిస్తాను. అయితే నా అభిప్రాయం తప్పవుతుందని నా నిశ్చితాభిప్రాయం. మార్పు అనివార్యమనీ, ప్రపంచం పరిణమించడం తప్పనిసరనీ నాకు తెలుసు. కానీ, మనం నిలబెట్టుకోవలసిన సంప్రదాయాలు అంటూ ఏమీ లేవా? ‘ఎబైడ్ విత్ మి’ అనేది వలసవాద నమూనా అయితే, బీటింగ్ రిట్రీట్ మాటేమిటి? సమాధానం లేదు. అయితే దానికి కూడా ప్రమాదం పొంచి ఉందా? దీపావళికి ఆరతి, పటాసులు; ఈద్కు సేమియాతో చేసే ఖీర్ ఎలాగో క్రిస్మస్కు ప్రార్థనా గీతాలు అలాగా! కానీ మనం ఏం పాడాలో, ఏవి అట్టిపెట్టుకోవాలో, ఏవి వదిలేయాలో ఇప్పుడు మతమే నిర్ణయిస్తుందా? ప్రశ్నకు సమాధానం తెలీనప్పుడు మా నానమ్మ తరచుగా ‘రబ్ జానే’ అని చెప్పేది. దేవుడి కోసం వాడే ఆ ఉర్దూ పదం ఈరోజు ముస్లింలకు ప్రతీకగా గుర్తించబడుతోంది. కాబట్టి అది హిందువులకు నిషిద్ధమైపోయిందా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అయితే చాలా కొద్ది మంది ప్రజలు మాత్రమే దానిగురించి మాట్లాడటం నేను వింటున్నాను. నా భయాలు తప్పు అని నేను కేవలం ఆశించగలను. 2023 సంవత్సరం ఇంకా దాదాపుగా 350 రోజులు సాగుతుంది. నేను ప్రేమిస్తున్న, గుర్తుపెట్టుకుంటున్న భారత దేశం మరింతగా మతి పోగొట్టుకుంటుందా? ఇప్పటినుంచి 12 నెలలు భారంగా సాగుతాయా? లేదా కొత్త ఉషోదయాల వైపు మనం సాగిపోతున్నప్పుడు మన గతంలోని ఉత్తమమైన అంశాలను అదరించి, అక్కున చేర్చుకుంటామా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్స్టీన్ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
నూతన సంవత్సర తీర్మానాలు
జీవన చక్రం కొత్త మలుపు తిరిగినట్టు అనిపించే నూతన సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఏవో కొత్త తీర్మానాలు చేసుకునే సందర్భం ఇది. కొత్త పట్టుదలలు ప్రదర్శించే అవకాశం కూడా! కానీ ఏం తీర్మానం చేసుకోవాలి? ధూమపాన రాయుళ్లకు సిగరెట్లను వదిలిపెట్టాలని అనుకోవడం సులభమైన తీర్మానం. చాకొలేట్లు, పుడ్డింగులు వదిలేసుకునే వాళ్లు నాకు తెలుసు. కొందరయితే మద్యపానం వదులుకోవడాన్ని ఎంచుకుంటారు. అతి కొద్ది మంది మాంసాన్ని కూడా వదిలేసుకుంటారు. మనం దేన్నయినా ప్రతిఘటిస్తున్నప్పుడు దృఢంగా ఉండాలని అనుకుంటాం. దానివల్ల మనది మనకు మెరుగైన భావన కలుగుతుంది. శుద్ధి అయినట్టు కూడా ఉంటుంది. అందుకే దేన్నయినా వదిలేసుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ నిజమేమిటంటే, ఓటమిని అంగీకరించడం మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆస్కార్ వైల్డ్ చెప్పినట్లుగా, ఆశను లేదా ప్రలోభాన్ని అధిగమించడంలో ఉత్తమ మార్గం ఏమిటంటే, దానికి లొంగిపోవడమే! పుట్టినరోజుల్లాగే నూతన సంవత్సరాది కూడా ప్రత్యేకమనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ జీవనచక్రం కొత్త మలుపు తిరుగుతుంది. ఆశ, అంచనాలతో ముందుకు చూసే ఒక లిప్త పాటు అది. తాజా తీర్మానాలు చేసుకునే, కొత్త పట్టుదలలు ప్రదర్శించే అవకాశం అది. మనం మరింత ఉత్తమంగా ఉంటామనీ, లేదా కనీసం విభిన్నంగా ఉంటామనీ విశ్వాసం కలిగే సందర్భం ఇది. నూతన సంవత్సర తీర్మానాలను ప్రజలు ఇందుకే చేసు కుంటారని నేను ఊహిస్తున్నాను. నేను కూడా తప్పనిసరిగా తీర్మా నాలు చేసుకున్న కాలం ఒకప్పుడు ఉండేది. సదాచార కట్టుబాట్లు విధించుకుని ఒక వారం పాటు గట్టిగా కట్టుబడి ఉండేవాడిని. తర్వాత మరో వారం దాన్ని బలహీనంగా కొనసాగించి, అటుపై దానిగురించి సంతోషంగా మర్చిపోయేవాడిని. తొలివారం బాగా అనిపించేది. రెండో వారం మాత్రం అపరాధ భావనను మిగిల్చేది. కానీ నా తీర్మానానికి తిలోదకాలు ఇచ్చి నా పాత చెడు మార్గాలకు తిరిగి వెళ్లిపోయినప్పుడే ఉత్తమంగా ఉందనిపించేది. ఇప్పుడు తీర్మానం లక్ష్యం స్వీయ నిరాకరణే. దీంట్లో తర్కం సరళం. మీరు దేన్నయినా ప్రతిఘటిస్తున్నప్పుడు దృఢంగా ఉండాలని సాధారణంగా భావిస్తుంటారు. కొన్నిసార్లు మీరు శుద్ధి చేయబడినట్లు భావిస్తుంటారు. సాధారణంగా మీరు మెరుగైనట్లు భావిస్తుంటారు. అందుకే దేన్నయినా వదిలేసుకోవడం మంచి అనుభూతిని కలిగి స్తుంది. కానీ నిజమేమిటంటే, ఓటమిని అంగీకరించడం మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆస్కార్ వైల్డ్ చెప్పినట్లుగా, ఆశను లేదా ప్రలోభాన్ని అధిగమించడంలో ఉత్తమ మార్గం ఏమిటంటే, దానికి లొంగిపోవడమే. అయితే ఆయన గుర్తించనిది ఏమిటంటే, కొంత కాలం ప్రతిఘటించిన తర్వాత దానికి లొంగిపోవడం మరింత ఉత్తమంగా ఉంటుందన్న సంగతి. తిరస్కరణకు సంబంధించిన ఒక మచ్చ ఆకలిని మరింత రెచ్చగొట్టి, ప్రలోభానికి పదునైన అంచును కల్పిస్తుంది. ఇక అతిక్రమణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ మొత్తం మరింత తియ్యగా ఉంటుంది. సంక్లిష్టమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఒకరు వదులుకోవాల్సినది ఏమిటి? దీనికి ముందు షరతు ఏమిటంటే, అది అంత సులభ మైనదిగా ఉండకూడదు. లేకుంటే తొలి వారంలో మీరు అమరత్వం పొందిన సన్యాసత్వ ప్రభను ΄పొందలేరు. అలాగే ఆ వదులుకునేది మీకు ఏమంత మంచిది కాకుండా ఉండాలి. లేకపోతే మీరు చేసుకున్న తీర్మానం విఫలమైనప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోలేరు. కానీ అంతిమంగా, అది అంత పాధాన్యత లేని విషయంగా ఉండాలి. లేకుంటే మీరు చేతులు ఎత్తేసినప్పుడు మీకు ఉపశమనం కలగక పోగా, అపరాధ భావన కలుగుతుంది. ఇది ఇక పరిధి లేదా పరిమితిని గణనీయంగా కుదించివేస్తుంది. ధూమపాన రాయుళ్లకు సులభమైన అవకాశం ఏమిటంటే, సిగరెట్లను వదిలిపెట్టడమేనని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో వారు విజయవంతమైనప్పుడు వారు మంచి అనుభూతి చెందుతారు. తాము సద్గుణవంతులుగా కూడా భావిస్తారు. అయితే వారు తొట్రు పడి పొరపాట్లు చేసి, తొలి పఫ్ పీల్చే ఆనందానికి లొంగిపోయి నప్పుడు అది మరింత బాగుంటుంది. చాకొలేట్లు, పుడ్డింగులు (కేకుల్లాంటివి) వదిలేసుకునే వాళ్లు నాకు తెలుసు. కొందరయితే మద్యపానం వదులుకోవడాన్ని కూడా ఎంచు కుంటారు. అతి కొద్దిమంది మాంసాన్ని కూడా వదిలేసుకుంటారు. నిజాయితీగా చెప్పాలంటే, వీరిలో ఎవరూ నన్ను ప్రలోభ పెట్టలేదు. నా డిజెర్టులు (తీపి పదార్థాలు), తాగుళ్లు నాకు ఎంత ఇష్టమంటే వీటిని వదులుకోవాలనే కనీస ఆలోచన కూడా నేను చేయలేను. నేను కచ్చితమైన మాంసాహారిని. అంతకంటే ముఖ్యంగా, నేనేమీ సాధుత్వం కోసం ప్రయత్నించటం లేదు. వారం, పదిరోజుకోసారి స్వయంకృతాపరాధమే అయినా స్వల్పకాలిక ‘చిత్రహింస’ను భరిస్తాను. నేను అబద్ధాలు చెప్పడం ఆపివేయాలనుకున్న సందర్భం కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో సామెత చెప్పినట్టు, నేనేమీ అబద్ధాల కోరును కాదు. కానీ వింత అబద్ధాలను చెబుతుంటాను. కానీ చాలా తక్కువసార్లు మాత్రమే. దాన్ని గురించి మీరు ఆలోచించినట్లయితే, ఈ అబద్ధాలను వదులు కోవడం అనేది నూతన సంవత్సర తీర్మానాల్లోకి బ్రహ్మాండంగా సరిపోతుంది. మీరు దాన్ని అమలు చేస్తున్నప్పుడు అది బాగుంద నిపిస్తుంది. కానీ మీరు పొరపాట్లు చేయడం మొదలైనప్పుడు మళ్లీ అపరాధ భావన కలుగుతుంది. ఇక మీరు తిరుగుబాటు చేసి, బొంకులు చెప్పడం తిరిగి మొదలుపెట్టినప్పుడు ఎంతో ఉపశమనం కలిగినట్లుగా ఉంటుంది. నేను దాన్ని కనీసం రెండోరోజు వరకు కూడా పాటించ లేకపోయాను. నిజానికి, మొదటిరోజుకే సరిపోయింది. ప్రతి చిన్న అతిశయోక్తినీ తనిఖీ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక రకం అబద్ధమే. పర్యవసానంగా, సంభాషణ జరపడం అత్యంత అసా ధ్యంగా మారింది. నేను ఏం చెప్పాల్సి ఉంటుందనే విషయంపై ఆచితూచి, కచ్చితంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఆఖరికి నేను ఏమరుపాటుగా ఏదో చెప్పినదాన్ని కూడా దిద్దుకోవడానికి నన్ను మళ్లీ మళ్లీ ఎంత సవరించుకోవాల్సి వచ్చిందంటే, దాదాపుగా నేనిక మాట్లాడలేక పోయాను. మీకు నన్ను ఒకటి చెప్పనివ్వండి. మీకు గప్పాలు కొట్టడం రాకపోతే గనక, మీరు ఒక కథ చెప్పలేరు. కాబట్టి నా దగ్గర నిజంగానే చెప్పడానికి ఏమీ లేకుండాపోయింది. 2023 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న వేళ ఏ ‘కొత్త సంవత్సరపు’ తీర్మానం చేసుకోవాలో నాకు కచ్చితంగా తెలీదు. నాకు ఇష్టమైనదాన్ని ఉద్దేశపూర్వకంగా నాకు నేనుగా తిరస్కరిస్తున్నప్పుడు ఒక పరమపావన గుణాన్ని నేను అనుభూతి చెందుతాను. కానీ అదేమిటో నేను ఆలోచించలేదు. బహుశా నా మనసును సిద్ధపర్చు కోవడానికి ఈ రోజంతా ఉంది. కానీ అందులో విఫలమవుతానని నాకు ముందే అనిపిస్తోంది. అయితే ఒకటి, కనీసం వచ్చే సంవత్సరం కోసమైనా ఏదైనా ఎంపిక చేసుకోవడానికి నాకు 364 రోజులు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరైనదాన్ని గురించి మీరు ఆలోచిస్తు న్నట్లయితే, అదేమిటో నన్ను కూడా తెలుసుకోనిస్తారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎలా ఉంటే స్వతంత్రత?
జర్నలిజంలో సాహసం అంటే, ఆ పదం ప్రభుత్వానికి విరోధిగా ఉండాలన్న ఒత్తిడి చేస్తుంది. అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాలి. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే మదింపు చేయాలి. ప్రభుత్వాన్ని పొగడటం చాలా సులభం. కానీ విమర్శించడమే కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందుకొస్తాయి. ఎన్డీటీవీ ఛానల్లో గౌతమ్ అదానీ మెజారిటీ వాటాదారుగా మారిన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఛానల్ను స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమికంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. అయితే మీడియా స్వాతంత్య్రం పట్ల ఆయన అభిప్రాయాలను బట్టి దీన్ని చూడాల్సి ఉంటుంది. భారతదేశంలోని 400 వార్తా ఛానల్స్లో నేను ఎక్కువగా చూసేది ఎన్డీటీవీ. అయితే తరచుగా దానిలో వచ్చే అంశాల పట్ల, ఆ ఛానల్ యాంకరింగ్ పట్ల నేను విమర్శనాత్మకంగా ఉంటున్నప్పటికీ, అదే సమయంలో ఆ రెండింటినీ ఆరాధిస్తుంటాను. కాబట్టే ఛానల్ని గణనీయంగా మార్చేసే అధికారంతో అతి త్వరలో గౌతమ్ అదానీ ఎన్డీటీవీ మెజారిటీ వాటాదారుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇది మనకు తెలిసిన రూపంలోని ఎన్డీటీవీకి ముగింపు పలకనుందా? ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అదానీ తన భవిష్యత్ పథకాల గురించి మాట్లాడారు. నాకు తెలిసి నంతవరకూ, ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ఈ విషయం మీద ఇలా మాట్లాడారు. ఎన్డీటీవీని స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు చెప్పారు. ప్రాథమి కంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. కానీ అది నిజమేనా? మిగిలిన ఇంటర్వ్యూ విశ్వసనీయ సందేహాల కోసం మంచి కారణాలనే ప్రతిపాదిస్తుంది. మీడియా స్వతంత్రతపై అదానీ భావన నుంచి అవి పుట్టుకొస్తున్నాయి. ‘‘స్వాతంత్య్రం అంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని నువ్వు చెప్పడం అన్నమాట. ఎవరూ దానిపై తగవులాడరు. కానీ అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిరోజూ సరైన పని చేస్తున్నప్పుడు దాని గురించి చెప్పే సాహసం నీకు ఉండాలి’’ అని అదానీ జోడించారు. ప్రతిరోజూ మంచి పని చేస్తున్న ప్రభుత్వం ఏది? అలాంటి ప్రభుత్వం ఏదీ నాకు తెలీదు. అలాంటి పనిని గుర్తించడానికి మీకు సాహసం ఎందుకు కావాలి? ఆ పదం జర్నలిజపు విస్తృత సముదాయాన్ని బట్టి మిమ్మల్ని కేవలం విరోధిగా మాత్రమే ఉండాలని ఒత్తిడి చేస్తుంది. కానీ అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే వారు మదింపు చేయవలసి ఉంటుంది. ఒక పక్షం వహించకూడదు లేదా తటస్థంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వాన్ని పొగడటం నిజానికి చాలా సులభం. వారు దాన్ని ఇష్టపడతారు కూడా. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే చాలా కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందు కొస్తాయి. మీడియా స్వాతంత్య్రానికి సంబంధించిన అదానీ భావన దీన్ని స్వీకరిస్తుందని నేను చెప్పలేను. ఆయన పదజాలం అలా స్వీకరించదనే సూచిస్తుంది. అయినప్పటికీ అదానీకి ఎన్డీటీవీ కోసం పెద్ద పథకాలే ఉన్నాయి. ఆ ఛానల్కి అంతర్జాతీయ పాదముద్రను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ లేదా ‘అల్ జజీరా’తో సరిపోల్చే స్థాయిలో భారతదేశానికి ఒక్క మీడియా సంస్థ కూడా లేదని కూడా ఆయన అన్నారు. ఇది రెండు విషయాలను సూచి స్తోంది. అదానీ ఎన్డీటీవీలో చాలా పెట్టుబడి పెట్టబోతున్నారు. బహుశా ఆయన ఆ ఛానల్ విశ్వసనీయతను కాపాడవచ్చు. ఎందు కంటే అలా కాపాడకపోతే, ఫైనాన్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయిని అది సాధించలేదు మరి!. ఇక్కడ సమస్య ఏమిటంటే, మీడియా స్వాతంత్య్రంపై ఆయన భావనతో ఈ ప్రశంసించదగిన ఆకాంక్ష ఘర్షణ పడుతోంది. పైగా, ఇది ఆయనను ఒక భయంకరమైన సందిగ్ధంలో ఉంచుతోంది. లేదా రెండు సందిగ్ధాలు అని కూడా చెప్పవచ్చు. ఎన్డీటీవీ ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వ ప్రచార అంగంగా మాత్రమే చూస్తారు. అప్పుడు అది ఫైనా న్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయికి ఎన్నటికీ పెరగలేదు. అదానీకి అర్థం కానిది ఏమిటంటే, విమర్శనాత్మకంగా ఉండే దాని వస్తు గతతత్వం, సాహసమే ఫైనాన్షియల్ టైమ్స్ని గొప్ప పత్రికగా మలిచిందన్నదే! అల్ జజీరా విషయంలో కూడా ఇది నిజమే. కాక పోతే ఖతార్లో తన సొంత ప్రభుత్వ వార్తలను కవర్ చేసే విషయంలో మాత్రం ఇది నిజం కాకపోవడం విషాదం. మరొకటి జరగవచ్చు. ఎన్డీటీవీని గ్లోబల్గా మార్చడానికి తగి నంత డబ్బు అదానీ వద్ద ఉంది. దాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ చేరుకోగలిగే ఉపగ్రహాలపై అదానీ వెచ్చించగలరు. అయితే ఆ టీవీ ఛానల్ విశ్వసనీయతనే నిర్లక్ష్యం చేసినప్పుడు ఎవరైనా దాన్ని చూడగలరా? బహుశా తాము వదిలిపెట్టి వెళ్లిన గడ్డ గురించి ఇప్పటికీ బాధపడుతున్న, పూర్తిగా స్వదేశంలో లేని కొద్దిమంది ప్రవాస భారతీయులు మాత్రమే ఆ ఛానల్ని చూడవచ్చు తప్ప మరెవరూ చూడబోరు. అదానీ చెప్పని మరో విషయం ఉంది. కానీ తన కొత్త ఛానల్ కోసం తన మనస్సులో ఉన్న ఏ విషయానికైనా నిజానికి అది కీలకమైంది. ఎన్డీటీవీకి విశిష్టమైన స్వభావం, విశ్వసనీయమైన వీక్షకులు, అత్యంత అధిక ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ఛానల్ని కొనడానికి వందలాది కోట్లు వెచ్చించిన తర్వాత (దాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి వేల కోట్లు కూడా వెచ్చించవచ్చు) దాని ప్రతిష్ఠను దిగజార్చి నష్టం కలిగించేలా మార్పులు చేపట్టగలరా? అందుచేత ఆ ఛానల్ ఉత్తమ యాంకర్లు, కరెస్పాండెంట్లను ఆయన అట్టిపెట్టు కోవచ్చు. వీరే లేకుంటే ఎన్డీటీవీ ఉత్త హార్డ్వేర్ లాగా మాత్రమే ఉంటుంది. కానీ వారి వస్తుగత పనితత్వాన్ని, వారి వాక్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసినట్లయితే వారు సంస్థలో కొనసాగుతారా? బహుశా, ఇదే ఆయన ఆలోచనలను కాస్త పదును పెట్టవచ్చు. సంస్థ నుంచి వెళ్లిపోయేవారి స్థానంలో కొత్త జర్నలిస్టులను నియమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ మంచి జర్న లిస్టులను వెతకడమే చాలా కష్టమైన పని. అలాంటివారు ఇప్పటికే చక్కటి వేతనాలతో సురక్షిత స్థానాల్లో ఉండవచ్చు. తమకు సుపరిచితం కాని వ్యవహారంలోకి అడుగుపెట్టి వారు తమను తాము ఎందుకు బలిపెట్టుకుంటారు?. - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?
గోవా చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరుకుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రద ర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. అయినా ముతకగా, పరిణతి లేకుండా చిత్రించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వాళ్లు వేరేరకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంతపెడుతున్నట్టు అని జ్యూరీ అధ్యక్షుడు నదావ్ లపీద్ సరిగ్గానే చెప్పారు. కానీ ఈ ఇజ్రాయిల్ దర్శకుడి నిజాయితీతో కూడిన విమర్శను సహించే నైతిక స్ఫూర్తి మనకు లేకపోయింది. ఇప్పుడు కాస్త సమయం గడిచిపోయింది, అలాగే భావో ద్వేగాలు కూడా కాస్త చల్లబడి ఉంటాయి. అందుకే ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇజ్రాయిల్ చిత్ర దర్శకుడు నదావ్ లపీద్ చేసిన విమర్శ చుట్టూ రేగిన ఆగ్రహా వేశాలపై నేను స్పందించాలనుకుంటున్నాను. అది కొంత ఇబ్బంది కలిగించే, చె΄్పాలంటే ఆందోళన కలి గించే మన సమాజ ముఖచిత్రాన్ని బయటపెట్టింది. ఇదే బహుశా మనం పిలుచుకునే జాతీయ స్వభావం. మొదటగా ఇలా ప్రారంభిద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్ర దర్శకుల్లో ఒకరిని, లొకార్నోలో ప్రత్యేక జ్యూరీ ప్రైజ్, బెర్లిన్లో గోల్డెన్ బేర్ను గెలుచుకున్న విజేతను మన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ జ్యూరీకి అధ్యక్షత వహించడానికి ఆహ్వానించాం. కానీ ఒక భారతీయ సినిమాపై ఆయన చేసిన నిజాయితీతో కూడిన విమర్శను మనం అంగీకరించలేక ΄ోయాం. దానిపై లపీద్ ఇలా అన్నారు: ‘‘చెప్పాలంటే ఒకరకంగా అది నా కర్తవ్యం, నా విధి కూడా. నేను వ్యర్థ సంభాషణ చేయడం కాకుండా నిజాయితీగా ఉండటానికే ఇక్కడికి ఆహ్వానించారు.’’ ఆ దాపరికం లేని నిష్కల్మష ప్రవర్తన మనల్ని నివ్వెరపర్చి ఉండ వచ్చు, పైగా గాయపర్చి ఉండవచ్చు కూడా. కానీ ఆయన చేసిన విమ ర్శను సంతోషంగా ఆహ్వానించే శక్తి, నైతిక స్ఫూర్తి మనకు లేవు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే– లపీద్ చెప్పినదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడాన్నే మనం ఉద్దేశపూర్వకంగా ఎంచు కున్నాం. ఆ సినిమా మార్చి నెలలో విడుదలైనప్పుడు నేను కావాలనే చూడకూడదని భావించాను. కానీ ఈ వివాదం చెలరేగిన తర్వాత ఆ సినిమాను చూడాలనుకున్నాను. ఒక విషాద ఘటన పట్ల ఆలోచనా త్మకంగానూ, సున్నితంగానూ తీయవలసిన దానికి బదులుగా ఆ సినిమా ఒక ముతక చిత్రీకరణగా నాకు కనిపించింది. ఈ చిత్రాన్ని నడిపిన తీరులో సూక్ష్మత, గాఢత లోపించాయి. నటన ఏకపక్షంగా ఉంది. ఈ సినిమాలోని ఏ ఒక్క పాత్రపట్ల కూడా మనకు సహాను భూతి కలగదు. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ సరిగ్గా ఆ విషయాన్నే వెల్లడించారు. కానీ ఆయన వ్యాఖ్యలను మనం ఉద్దేశ పూర్వకంగానే తప్పుగా వ్యాఖ్యానించుకున్నాం. వాటిని కశ్మీర్ పండిట్లకు జరిగిన ఘటనల పట్ల తిరస్కరణగానూ, చని΄ోయిన వారి స్మృతిని అవమానించడంగానూ అర్థం చేసుకున్నాం. ఒక్క క్షణకాలం పాటు మనం ఆలోచించడం కోసం ఆగినట్లయితే, ఆయన వ్యాఖ్యలను మనం ఎంత తప్పుగా భావిం చామో మనకు తెలిసేది. కానీ మనం అలా చేయలేక ΄ోయాం. ఒక అధమ స్థాయి సినిమాను సమర్థించుకునే మార్గం అదన్నమాట! ఒకసారి లపీద్ విమర్శ మన ఆత్మాభిమానాన్ని గాయపర్చాక, ఆయన విమర్శను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి పూనుకున్నాం. పైగా అది మన జాతీయవాదంపై దాడిగానూ, ఇంకా చె΄్పాలంటే ఏకంగా మనపైనే చేసిన దాడిగానూ చూడటానికి పూనుకున్నాం. కానీ లపీద్ దీనిపై స్పష్టంగా ఆయన అభిప్రాయం వివరించారు: ‘‘ఒక సినిమాను విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం కాదు లేదా కశ్మీర్లో జరిగినదాన్ని విమర్శించడం అంతకంటే కాదు’’. నన్ను మరికాస్త ముందుకెళ్లి చెప్పనివ్వండి. గోవా చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరు కుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ చిత్రో త్సవంలో ప్రదర్శించడానికి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? విస్మరణకు గురైన ఒక విషాదం వైపు ప్రపంచానికి కిటికీ తెరవడానికి– ముతకగానూ, పరిణతి లేకుండానూ చిత్రించినది; ఇది మన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ సినిమా కాదు అనే వాస్తవాన్ని కూడా విస్మరించారా? నదావ్ లపీద్ దాన్ని ఇలా చూశారు: ‘‘ద కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చిత్రోత్సవాల్లో ΄ోటీ విభా గంలో భాగం కాకూడదు. డజన్లకొద్దీ చిత్రోత్సవాల్లో నేను జ్యూరీలో భాగమయ్యాను. బెర్లిన్, కాన్, లొకార్నో, వెనిస్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా నేను ΄ాలు పంచుకున్నాను. ఏ చిత్రోత్సవంలోనూ కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను నేను చూడలేదు. మీరు ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వేరే రకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంత పెడు తున్నట్టు.’’ ఇదేమీ ఒప్పుకోలేని వాదన కాదు కదా! చివరగా, మీడియా గురించి నన్ను చెప్పనివ్వండి. అది మనకోసం మాట్లాడుతున్నట్లు ప్రకటించు కుంటుంది. తాను ప్రజావాణిని అని మీడియా నమ్ముతుంటుంది. కానీ ఈ సినిమాను సమర్థించడానికి అది చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తెలివిలేనివి, పైగా అసమర్థమైనవి కూడా! ఈ సినిమా గురించి తనకు కలిగిన అభిప్రాయాలనే జ్యూరీ సభ్యులు కూడా పంచుకున్నారని లపీద్ చెప్పినప్పుడు దాన్ని నిరూపించాలని టెలివిజన్ యాంకర్లు సవాలు చేశారు. ఓ రకంగా ఇది ఆయన అబద్ధ మాడుతున్నాడని సూచించే వెర్రి ప్రయత్నం మాత్రమే అవుతుంది. పైగా, లపీద్కు తమ మద్దతును బహిరంగంగా నిర్ధారించేలా అది ఇతర జ్యూరీ సభ్యులను రెచ్చగొట్టింది. మరోవైపున, ఒక వార్తాపత్రిక ఏకంగా అబద్ధమాడింది. లపీద్ తన మనస్సు మార్చుకున్నారనీ, ఆ సినిమా మేధోవంతంగా ఉందనీ చె΄్పారని ఆ పత్రిక నివేదించింది. నిజానికి ఆయన తన మనస్సు మార్చుకోలేదు. ఆయన అలా చేస్తాడ నుకోవడం కూడా బుద్ధిహీనతే అనాలి. సాధారణమైన ఆలోచనతో దీన్ని ముగిస్తాను. ఫిల్మోత్సవ్ అవార్డు కార్యక్రమంలో ఒక నిర్దిష్ట సినిమాను విమర్శించే హక్కు లపీద్కు›ఉందా లేదా అనేది న్యాయమైన ప్రశ్న. ఇది చాలా చిన్న విషయం కూడా. దీనికంటే మన ప్రవర్తనే మరింత పెద్ద సమస్యగా ఉంటోంది. చిత్రోత్సవం కోసం మనం ఎంపిక చేసుకున్న సినిమా, దానికి లభించిన విమర్శకు మనం స్పందించిన తీరు మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. కాబట్టి ఇది ఒక విషాదకరమైన, బాధాకరమైన గాథ! కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?
ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు భావిస్తుండవచ్చు. దీనికి మంచి సాక్ష్యం కశ్మీర్లో తీవ్రవాదుల సంఖ్య గురించిన సమాచారం. కశ్మీర్ లోయలో ఇప్పుడు 81 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులనీ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అంత కచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు? వాళ్లు ఏమైనా వస్తూపోతున్నప్పుడు ఒక రిజిస్టర్లో సంతకాలు ఏమైనా పెడుతున్నారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? వీళ్ల ఆనుపానులు కూడా ఇంత కచ్చితంగా తెలిసినప్పుడు మరి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు? ఉగ్రవాదుల గురించిన వివరాలపై మనం ఇలాంటి మామూలు ప్రశ్నలు కూడా వేయలేమా? పైగా వాటిని నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా భావిస్తుండటం మరీ విషాదం. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు చాలావరకు మనలాంటి సాధారణ ప్రజలు ఏది చెప్పినా సరే మందమతుల్లాగ తలా డించేస్తుంటారని గట్టినమ్మకం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా లేక ఆఫీసులో ఉంటున్న ఏ అధికారి విషయంలోనైనా ఇది నిజమనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడూ వాళ్లు ఇచ్చే సమాచారం ప్రతిదీ నమ్మేసేవాళ్లను కూడా ఆలోచనలో పడేస్తుంది. జమ్మూ కశ్మీర్లోని ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినంత వరకూ ఇది చాలా తరచుగా నిజమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. గత శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) విజయ్ కుమార్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు నివ్వెరపరచే వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కశ్మీర్ లోయలో 81 మంది యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? ఉగ్రవాదులు వచ్చి సంతకాలు పెట్టిపోయేలా మనం ఏమైనా ఒక రిజిస్టర్ నిర్వ హిస్తున్నామా? పైగా వారి మూలం, నేపథ్యం గురించి మనకేమైనా చెప్పారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? అంకెలు సరిపోతున్నాయా? అంతమాత్రమే కాదు. డీజీపీ ఇంకా చాలా నిర్దిష్టంగా ఉన్నారు. ‘‘బందీపుర్, కుప్వారా, గాందర్బల్ జిల్లాల్లో స్థానిక ఉగ్రవాదులు అసలు లేరు. కాగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బడ్గావ్ జిల్లాల్లో ఒక్కో ఉగ్రవాది మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సంఖ్య విషయంలో ఆయన అంత నిర్దిష్టంగా, కచ్చితంగా ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విదేశీ ఉగ్రవాదుల అంశం ముందుకు తెద్దాం. తొలి మూడు జిల్లాల్లోనే విదేశీ తీవ్రవాదులు పనిచేస్తున్నారని డీజీపీ సూచిస్తున్నారా? రెండవది, ఆయన పేర్కొన్న చివరి నాలుగు జిల్లాల్లో ఒకే ఒక స్థానిక ఉగ్రవాది ఉంటున్నాడా? వారి ఉనికిని ఇంత కచ్చితంగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే వారు ఉన్న ప్రదేశం కూడా మనకు తెలిసిపోయినప్పుడు వారిని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాస్తవానికి ఈ ప్రశ్నలు డీజీపీ విజయ్ కుమార్ని ఇబ్బంది పెట్టవు. ఆయన్ని తన మార్గం నుంచి వైదొలిగేలా చేయవు కూడా! పైగా ప్రతి సంవత్సరం ఎంతమంది స్థానిక కశ్మీరీలు తీవ్రవాదుల్లో చేరుతున్నారు అనేది కూడా ఆయనకు తెలిసినట్లే కనబడుతోంది. బహశా వారు తమ వివరాలు ఆయనకు తెలిపి ఉండవచ్చు లేదా వారికి అత్యంత విశ్వసనీయమైనవారు, సన్నిహితమైనవారు డీజీపీ చెవిలో ఊది ఉండవచ్చు. 2018లో 201 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఈ సంవత్సరం వారి సంఖ్య 99కి పడిపోయిందని డీజీపీ ప్రకటించారు. ఇంత కచ్చితమైన వివరాలు ఆయనకు ఎలా తెలిశాయి అని ఎవరూ డీజీపీని అడగలేరు. లేదా ఆయన బహుశా చెప్పరు కూడా! నిజానికి తనను వైరుద్ధ్యాల్లోకి లాగుతున్న ఈ 99 సంఖ్యను తాను బయటపెట్టినప్పటికీ తనను ఎవరూ నిలదీయరని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లున్నారు. ఈ సంవత్సరం కశ్మీర్ లోయలో 99 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 64 మంది హతమై పోయారనీ, 17 మందిని అరెస్టు చేయగా 18 మంది ఉగ్రవాదులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారనీ డీజీపీ వివరించి చెప్పారు. అయితే పైన చెప్పిన వివరాలకేసి చూస్తే, 29 మంది స్థానిక ఉగ్రవాదులు మాత్రమే లోయలో ఉన్నారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మిగతా 11 మంది ఉగ్రవాదులు ఎక్కడ తప్పిపోయారు? ఇవి కేవలం వివరాలు మాత్రమే కాబట్టి వీటికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే డీజీపీ మరింత ముఖ్యమైన విషయం ప్రకటించారు. అదేమిటంటే, చనిపోయిన 64 మంది ఉగ్రవాదుల్లో 57 మంది వారు చనిపోవడానికి సరిగ్గా నెల ముందే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్న సంగతి! ఈ విషయం కూడా ఆయనకు ఎలా తెలుసు? వారు ఎప్పుడు చేరిందీ ఆయనకు తెలిసి ఉంటే, వారిని ఎందుకు ఆపలేకపోయారు లేదా కనీసం వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అయితే ఈ ప్రశ్నలను నేను అడగలేదు. మొత్తం మీద ఉగ్రవాదులకు చెందిన ఇంత సున్నితమైన వివరాలు డీజీపీ చేతివేళ్లపై అంత కచ్చితంగా ఆడుతున్నప్పుడు నాకు ఒకే సందేహం ఉంది. కొంప దీసి డీజీపీ విజయ్ కుమార్ ఈ ఉగ్ర వాదుల జీవిత చరిత్రలు త్వరలో రాసినా నేనేమీ ఆశ్చర్యపోను. ప్రశ్నించరనే ధీమానా? ఇప్పుడు, కశ్మీర్ లోయలో పోలీసుల కచ్చితత్వం గురించి మూగ పోయేవారిలో నేనే మొదటివాణ్ణి కాదు. 2000 సంవత్సరపు ప్రారంభంలోకి వెళ్లి చూద్దాం. పాకిస్తాన్ నుంచి నెలకు ఎంతమంది జిహాదీలు వాస్తవాధీన రేఖను దాటి వస్తున్నారో నాటి పోలీసులు మాకు నిత్యం వివరాలు చెబుతున్నప్పుడు, ఈజిప్ట్ రాయబారి గెహాద్ మాది తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ‘‘ఈ నెలలో 241 మంది వాస్తవాధీన రేఖను దాటి వచ్చారు. గత నెలలో 225 మంది, అంతకు ముందు నెలలో 230 మంది భారత్ భూభూగంలోకి వచ్చారు అని చెబుతున్నారు. ఇంత కచ్చితంగా వారు ఎలా చెప్పగలరు? వాస్తవాధీన రేఖను దాటి భారత్లోకి అడుగుపెట్టే ముందు జిహాదీలు రిజిస్టర్లో సంతకం పెట్టివచ్చే కార్యాలయం ఏమైనా ఉందా?’’ అని ఈజిప్టు రాయబారి వ్యంగ్యంగా ప్రశ్నించారు. గెహాద్ తన దౌత్య పరిధులను దాటి బహిరంగంగా తన సందేహాలను లేవనెత్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన సంధించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు ఉగ్రవాదుల గురించి డీజీపీ విజయ్ కుమార్ చెప్పిన వివరాలపై కొన్ని మామూలు ప్రశ్నలు కూడా మనం వేయలేమా? డీజీపీ ఎవరి వద్దనయితే ఈ వివరాలు చెప్పారో ఆ జర్నలిస్టులు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకపోవడం విషాదకరమైన విషయం. వారు ఏమీ అడగలేరని ఆయనకు తెలియడమూ, పైగా ఆయన చెప్పిన వివరాలు నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా మనం కూడా ఆమోదిం చాలని డీజీపీ భావిస్తుండటమూ మరింత విషాదం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇక్కడ పార్లమెంట్ ఉన్నా అధికారం రాజరికానిదే!
బహ్రెయిన్ నేను సందర్శించడానికి ఎంపిక చేసుకున్న గమ్యస్థానం కాదు. దాన్ని ఎమిరేట్స్, ఖతర్కు చెందిన పేద బంధువులాగా భావించేవాడిని. కానీ నాకు తెలిసిన వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలీదు. నా అభిప్రాయం నా అజ్ఞానానికి ప్రతిబింబంగా ఉండేది. గత వారాంతంలో నాదెంత తప్పుడు అభిప్రాయమో నేను కనిపెట్టాను. బహ్రెయిన్ వెచ్చని, సంతోషకరమైన, ఆకర్షణీయమైన దేశం. నమ్మలేనంత శుభ్రంగానూ, దుబాయ్, అబుదాబీ, ఖతార్ లాగే ఆధునికంగానూ ఉంది. కానీ బహ్రెయిన్ చాలా చిన్నదేశం. కేవలం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న దేశం. వాస్తవానికి ‘బహ్రెయిన్ ద్వీపం’ అనే పేరు కలిగి ఉన్న ద్వీప సమూహం. కొద్ది కాలం క్రితం ఈ ద్వీపం 40 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగంగా మాత్రమే ఉండేది. సముద్రం నుంచి ఏర్పడుతూ వచ్చిన ఈ దేశం (ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది) తన సైజును బహుశా రెట్టింపు చేసుకోగలిగింది. కానీ మాల్దీవులు, సింగపూర్ తర్వాత ఇది ఇప్పటికీ ఆసియాలో మూడో అతి చిన్న దేశంగా ఉంది. బహ్రెయిన్ జనాభా 16 లక్షలు మాత్రమే. భారత దేశం నుంచే 4 లక్షల మంది ప్రవాసులు ఈ దేశానికి వచ్చారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది కేరళకు చెందిన వారే. ఈ దేశ జనాభాలో 43 శాతం మంది అరబ్ యేతర ఆసియన్లే అని వికీపీడియా పేర్కొంటోంది. వీరంతా ప్రవాసం వచ్చిన కార్మికులే అని నా అంచనా. స్థానిక జనాభా 47 శాతం మాత్రమే. ఈ చిన్న ద్వీపం గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1931లో ఇక్కడే బయటపడింది. ఈరోజు బహ్రెయిన్ ప్రముఖ చమురు ఉత్పత్తిదారు కాదు. కానీ ఈ చమురు బావి నిరుపయోగకరంగా ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం గర్వంగా తన్ను తాను ప్రదర్శించుకుంటోంది. బహ్రెయిన్ దీనార్ ప్రపంచంలోనే రెండో అతి శక్తిమంతమైన కరెన్సీ. ఒక దీనార్కి మీరు 2.65 అమెరికన్ డాలర్లు పొందవచ్చు. కాబట్టి బహ్రెయిన్ మరీ అల్లాటప్పా దేశం కాక పోవచ్చు. బహ్రెయిన్లోని కేరళీయ సమాజం ఆహ్వానం మేరకు నేను ఆ దేశాన్ని సందర్శించాను. ఇది ఉజ్జ్వలమైన, అంకిత భావం కలిగిన సామాజిక సంస్థ. అలాగే డీసీ బుక్స్కి కూడా ఇది పేరుపొందింది. ద్వీపంలో జరిగే బుక్ ఫెస్టివల్లో కేరళీయులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శనశాల జాతీయ ఎన్నికలతో ముడిపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. మనదేశంతో పోలిస్తే ఇక్కడి ఎన్నికలు చాలా చాలా చిన్నవే కావచ్చు కానీ వాటిని వీరు నిర్వహించే తీరు మాత్రం నన్ను పరవశింపజేసింది. బహ్రెయిన్లో ఉన్నది రాచరిక వ్యవస్థే. అది స్వభావ రీత్యా రాజ్యాంగబద్ధమైనదే కావచ్చు కానీ అధికారం మాత్రం రాజు హమీద్, అల్ ఖలీఫా రాజకుటుంబం చేతిలో మాత్రమే ఉంటుంది. అయితే 2002 నుంచి ప్రతి అయిదేళ్ల కోసారి పార్లమెంటును ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది 40 సీట్ల సింగిల్ ఛాంబర్ హౌస్. ఎగువ, దిగువ సభల్లాంటివి ఉండవు. బహ్రెయిన్ రాజ్యంలో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంటుకు అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్లాగే, ఇక్కడా ఎన్నికలు రెండు దశలలో ఉంటాయి. తొలివిడత ఎన్నికలు నేను రావడానికి ముందే నవంబర్ 12న జరిగాయి. 40 పోలింగ్ బూత్లలో 344 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి 3,44,713 మంది బహ్రెయిన్ పౌరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ 344 మంది అభ్యర్థుల్లో 40 మందిని ఎన్ను కోవడానికి ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ విస్తరించి ఉన్న సీఫ్ మాల్లో విహారయాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. నేను ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఓటు వేయడానికి తమ వంతు సమయం కోసం ఎదురు చూస్తున్న ఓటర్లు స్టార్బక్స్ కాఫీలు సేవిస్తూ, హాగెన్–దాస్ ఐస్క్రీములను లాగించేస్తూ కనిపించారు. ఇక్కడ అన్నీ ఎయిర్ కండిషన్తో సౌకర్యవంతంగా ఉంటాయి! ప్రవాసం వచ్చినవారు, గల్ఫ్ సహకార దేశాలకు చెందిన పౌరులు దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండి ఇక్కడే జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఓటు వేసేందుకు బహ్రెయిన్ అనుమతిస్తుంది. నేను ఇక్కడ పర్యటించిన ప్పుడు జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది చాలా అధిక శాతమట. ఇక రెండో విడత పోలింగ్ 13వ తేదీన ముగిసింది తొలి రౌండ్ ఓటింగ్ తర్వాత, ‘ది వాయిస్ ఆఫ్ బహ్రెయిన్’ అని తనను తాను పిలుచుకునే గల్ఫ్ డైలీ న్యూస్ పత్రిక, పోలింగ్ను విజయవంతం చేసినందుకు ఓటర్లకు రాజు అభినందనలు తెలిపారని రాసింది. ఇది 16 పేజీల ట్యాబ్లాయిడ్. రాజు తన సంతోషాన్ని రాజరికపు హుందా తనంతో ప్రకటించారు. ‘మన ప్రియతమ రాజరికం కోసం సాధించిన ఈ ఘన విజయం పట్ల మమ్ము మేమూ, మా విశ్వసనీయ ప్రజలనూ అభినందించుకుంటున్నాము’ అని రాజు పేర్కొన్నారు. యువరాజు, ప్రధానమంత్రి రాజును అభినందనలతో ముంచెత్తారని పత్రికలు నివేదించాయి. అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ఈ ద్వీపంలో సామరస్యం పొంగిపొరలుతోందన్న మాట. బహ్రెయిన్లో రెండు అమెరికా స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది ‘నాటో’ కూటమిలో ప్రముఖ మిత్ర దేశం కూడా! అయితే ఎంత గాలించినా ఒక్కరంటే ఒక్క అమెరికన్ సైనికుడు కూడా కనిపించలేదు. సౌదీ అరేబియన్లు తరచుగా కనిపిస్తుంటారు. 1980లలో చిత్తడినేలపై నిర్మించిన దారిలో అరగంట ప్రయాణిస్తే చాలు సౌదీ పౌరులు ఇక్కడికి చేరు కోవచ్చు. వారాంతపు సందర్శకులుగా వారు తరచూ ఇక్క డికి వస్తుంటారు. సౌదీ రాజరికం తమకు నిరాకరించిన ఆల్కహాల్ని బహ్రెయిన్ రాజు అనుమతించారు మరి! చివరగా, ఫోర్ సీజన్స్ షాపులో నేను గత కొన్ని సంవత్సరాలుగా దొరకని చక్కటి బర్గర్ని రుచి చూశాను. గతంలో మీరు ఎమిరేట్స్ని సందర్శించి ఉన్నప్పటికీ షాపింగ్, సముద్ర క్రీడలు, ఎడారి, ఆధునిక నగరం వంటి వాటిని ఇంకా ఇష్టపడుతున్నట్లయితే మీ తదుపరి వారాం తపు సెలవుల్లో బహ్రెయిన్ రావడానికి ఎందుకు ప్రయత్నిం చకూడదు? కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ (బహ్రెయిన్ నుంచి రాసిన వ్యాసం) -
కొన్ని సలహాలూ, సంఘటనలూ!
చాలామంది రాయరు గానీ, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ అనుభవాలను పుస్తకాలుగా తెస్తే, అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. అవి విలువైన పాఠాలు కూడా అవుతాయి. తాజాగా తన పదవీకాలపు జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చిన జాబితాలోకి భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన సి.రంగరాజన్ కూడా చేరారు. 1990లో దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గురించీ, చివరకు బంగారాన్ని తాకట్టుపెట్టి దానిలోంచి బయటపడిన ఘటన గురించీ ఆయన రాశారు. అప్పటి రాజకీయ వైఫల్యాన్ని కూడా బయటపెట్టారు. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా వివరించారు. గవర్నర్గా పనిచేసినప్పుడు రాజకీయ నాయకుల ముహూర్తాల సెంటిమెంట్లను ఆయన గమనించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, గవర్నర్లకు తమ అధికారాలు, పరిమితుల మీద ఉండవలసిన గ్రహింపు గురించి కూడా ఆయన విడమరిచారు. గవర్నర్లు తరచూ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది గమనార్హమైనది. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో ప్రకటించుకునే తరహా సంప్రదాయం మన దగ్గర పెద్దగా లేదు. మాంటెక్సింగ్ అహ్లూ్లవాలియా దీనికి ఒక మినహా యింపు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా తన దశాబ్ద కాలపు అనుభవాలను గురించి ఆయన రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా తన పదేళ్ల కాలం గురించి హమీద్ అన్సారీ సమగ్రమైన ఇంట ర్వ్యూను ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సి. రంగరాజన్... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్వల్పకాలం పాటు గవర్నర్ బాధ్య తలు నిర్వహించిన తన పదవీ కాలాల గురించిన రచనను(ఫోర్క్స్ ఇన్ ద రోడ్: మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్) ప్రచురించారు. అది ఎన్నో చక్కటి వివరాలతో, సంతోషకరమైన ఉపాఖ్యానాలతో కూడి ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్గా ఉన్నప్పుడు, 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఎంతో వివరంగా రాశారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాస్తూ, ‘‘ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సంప్రదించక తప్పని పరిస్థితి గురించి’’ పేర్కొంది. కానీ ‘‘ప్రభుత్వం తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు.’’ ఇది ‘‘రాజకీయ నాయకత్వ వైఫల్యమే’’ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆనాటి ‘‘పరిస్థితిలోని తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించకపోవడం, లేదా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) వద్దకు వెళ్లడానికి సైద్ధాం తికంగా విముఖత ప్రదర్శించడం’’ వల్ల చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిందని రంగరాజన్ రాశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ‘‘వేగంగా దిగజారిపోయింది’’ అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నాలుగు నెలల తర్వాత, ‘‘మన నిల్వలు... కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సమా నంగా ఉన్నాయి,’’ అని చెబుతూ ఆయన ఇలా కొనసాగిస్తారు: ‘‘పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందంటే, విదేశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మివేయాలని కూడా కొంత ఆలోచన సాగింది.’’ అలా అమ్మేయడానికి పరిగణించిన ఆస్తుల్లో జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒకటి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ‘‘డిఫాల్టర్గా ఉండటానికి కూడా సిద్ధమైంది... దీన్ని తప్పించుకోవడానికి చివరికి అదీ, ఇదీ అనకుండా ప్రతి విషయం గురించి కూడా ఆలోచించాం’’ అని రంగరాజన్ నాతో చెప్పారు. ఆ సమయంలో వారు ఎంపిక చేసు కున్న నిర్ణయాల్లో ఒకటి: 405 మిలియన్ డాలర్ల రుణం పొందడానికి గానూ, భారతదేశ బంగారు నిల్వల్లో 15 శాతం (ఇది 46.91 టన్నులకు సమానం) తనఖా పెట్టాలనుకోవడం! ఈ రోజు చూస్తే అది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ సమ యంలో ‘‘ఆ సొమ్ము చాలా కీలక మైంది... ఎగవేతను అడ్డుకోవ డానికి.’’ 1991 జూలై నాటి మరొక అద్భుతమైన కథ ఈ పుస్తకంలో ఉంది. అది – పీవీ నరసింహారావు ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించడం గురిం చినది. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అది రెండు దఫాలుగా జరిగింది. సి.రంగరాజన్ ఈ రెండో దఫా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఇక్కడ ఒక చిన్న నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తొలి విడత రూపాయి విలువను తగ్గించిన తర్వాత, దానిపై వచ్చిన తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందన చూసి ప్రధాని నరసింహారావు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో రెండో దఫా రూపాయి విలువ తగ్గింపును వాయిదా వేయాలని మన్మోహన్ సింగ్ను కోరారు. ఆ సందర్భంలో రంగరాజన్ చెప్పిన విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. రూపాయి విలువను రెండో దఫా తగ్గించిన రోజున (1991 జూలై 3) ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ఉదయం 9.30 గంట లకు రంగరాజన్కు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘పరిస్థితి ఎలా ఉంది?’’ అని మన్మోహన్ అడిగితే, ‘‘నేను జంప్ చేశాను’’అని రంగరాజన్ సింపుల్గా చెప్పేశారు. దాంతో మన్మోహన్ ‘‘అయితే సరే’’ అని చెప్పి సంభాషణను ముగించారు. ఆనాటి తన సమాధానం గురించి రంగరాజన్ నాకు చెబుతూ, రూపాయి విలువను తగ్గించడానికి ఆర్బీఐ కోడ్ భాష వాడిందని వివరించారు. ఆ కోడ్ ఏమిటంటే ‘హాప్, స్కిప్, అండ్ జంప్’. ‘నేను జంప్ చేశాను’ అనే సమాధానానికి ‘‘రెండో దశ రూపాయి విలువ తగ్గింపు ప్రక్రియ పూర్తయిందనీ, దాన్ని ఇక ఆపలేమనీ’’ అర్థం. రంగరాజన్ రాసిన పుస్తకం అయిదేళ్లు ఆయన గవర్నర్ పదవిలో ఉన్న రోజుల్లో చేసిన కొన్ని మంచి విషయాలను కూడా పొందుపర్చింది. ఈనాటి గవర్నర్లకు కొన్ని మంచి సలహాలను కూడా ఇది సూచించింది. ఒరిస్సాలో గవర్నర్గా ఉన్నప్పుడు భారత రాజకీయ నాయకులపై జ్యోతిష్యం ఎంత బలంగా ప్రభావం వేస్తోందో రంగరాజన్ కనుగొన్నారు. ఆనాడు ఒరిస్సా ముఖ్య మంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ కేవలం శుభ ముహూర్తాల్లో మాత్రమే గవర్నర్ని కలిసేవారట. ‘‘ఉదయం 11.13కు నేను మిమ్మల్ని కలుస్తాను’’ అని గమాంగ్ అనేవారని ఈ పుస్తకం చెబుతోంది. ఇక నేటి గవర్నర్లకు ఈ పుస్తకం ఇస్తున్న సలహా నిజంగానే ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గవర్నర్కి నచ్చకపోయిట్లయితే, ఆయన లేదా ఆమె ముఖ్య మంత్రితో నేరుగా చర్చించాలనీ, లేదా రాష్ట్రపతికి ఈ వ్యవహారంపై లేఖ రాయవచ్చనీ రంగరాజన్ తన పుస్తకంలో రాశారు. అంతకు మించి తన అసమ్మతిని, వ్యతిరేకతను గవర్నర్ బయటకు వెల్ల డించకూడదనీ, ప్రజా ప్రదర్శన చేయకూడదనీ సలహా ఇచ్చారు. ఈ మాటలు మమతా బెనర్జీ గానీ విన్నట్లయితే ఎంతో సంతోష పడతారు! గతంలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులను గవ ర్నర్లుగా నియమించినప్పుడు ‘‘కార్యాచరణలోకి దిగాలన్న దురద వారిలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని రంగరాజన్ అంటారు. ఆయన సలహా ఒకటే! అది ఏమిటంటే – ‘‘వారు తమ అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పక నేర్చుకోవలసి ఉంది... గవర్నర్లు తమకు గల అధికారాలను మాత్రమే కాకుండా తమ పరిమితులను కూడా అర్థం చేసుకోవలిసి ఉంటుంది.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..
‘మనము నేర్చు కోవాల్సిన పాఠం’ అంటూ అక్టోబర్ 31వ తేదీన కరణ్ థాపర్ వ్యాసంలోని అంశాలు అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా ఉన్నాయి. బ్రిటన్ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్ ఎన్నిక కావడానికీ, బ్రిటన్ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రిషి సునాక్ను ఎన్ను కోవడానికి ముందు లిజ్ ట్రస్ అనే మహిళను కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకున్నది కదా. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టె క్కించడానికి బ్రిటన్ దేశానికి, ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి రిషి సునాక్ లాంటి ఆర్థిక వ్యవహారాల నిపుణుడి అవసరం వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్ను ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఎన్నికలలో గెలిచి ఉంటే – అప్పుడు భారతీయులు బ్రిటన్ ప్రజల నుంచి ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉండేది. 190 సంవత్సరాలు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది బ్రిటన్. ఇప్పటికీ 14 దేశాలపై తన రాజరికపు ముద్రను కొనసాగిస్తూనే ఉన్నది. తమను దోచుకున్న దేశాన్ని బ్రిటిషర్స్ శత్రువులుగా భావిస్తారు. వ్యాసకర్త చెప్పిన దానికి విరుద్ధంగా ఆ దేశం నుండి చాలా విషయాలను స్వయం ప్రకటిత మేధావులైన కొందరు భారతీయులు నేర్చుకోవాలి. ఇక రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భాన్ని నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి చెందినదనీ, ఆ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడానికీ వ్యాసకర్త సంఖ్యాపరమైన విశ్లేషణలు చక్కగా చేశారు. ఈ దేశంలో సంఖ్యాపరంగా ముస్లింలు 14.3 శాతం ఉన్నది నిజమే. పార్లమెంట్లో వారి స్థానాలు కూడా తక్కువనేది వాస్తవమే. సివిల్ సర్వెంట్లుగా, సైనికులుగా ఆ మతం వారి సంఖ్య దేశంలోని ఇతర మతాల వారితో పోలిస్తే తక్కువే. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదే! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లిం వర్గం నుండి నలుగురు రాష్ట్రపతులుగా ఎన్నిక చేయబడ్డారు. మరి ముస్లింలు మెజా రిటీగా ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? 20 కోట్ల మంది ముస్లింల నుండి ఒక ప్రధాని ఆశించడానికి వీలు లేదా? అని ఒక మంచి ప్రశ్న వేశారు వ్యాసకర్త. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు ఈ దేశంపై సర్వాధికారాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 28 శాతం హిందువులు ఉంటారు. ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క హిందువూ సీఎం కాలేదనే విషయం వ్యాసకర్తకు తెలియదా? ముస్లింలను చెద పురుగులుగా, బాబర్ వారసులుగా అవహేళన చేస్తూ, మానసికంగా వేధిస్తున్నారనే విషయం వాస్తవమేనా? కశ్మీర్ లోయనుండి 3 లక్షల మంది హిందువులను తరిమికొట్టింది ఎవరు? ఇక చివరిగా రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక ఆ దేశ అవసరం ఉంది. ఈ విషయంలో ఆయన భారతీయ మూలాల శ్రేష్ఠత గానీ, రంగు గానీ, జాతి గానీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలకు కనబడ లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం రిషీ సునాక్ ఎంపిక చూసి గర్వపడాల్సింది ఏమీలేదు. బ్రిటిష్వారి ఔదా ర్యమూ అంతకన్నా ఏమీలేదు. - ఉల్లి బాలరంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
మనం నేర్చుకోవలసిన పాఠం
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికవడం, ఆ దేశ నూతన ప్రధాని కావడం గర్వించాల్సిన విషయమే. మరోవైపు, ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. సునాక్ ఎదిగివచ్చిన తీరు అద్భుతమైన పరిణామమే కావచ్చు కానీ, మన దేశం విషయం ఏమిటి? మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్లమెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. గుజరాత్లో అయితే 1988 నుంచి లోక్సభకు గానీ, శాసన సభకు గానీ ఒక్క ముస్లింని కూడా బీజేపీ నిలబెట్టలేదు. దేశంలో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. ఈరోజు సునాక్ సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి గర్వపడుతున్నప్పుడు, భారత్లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించుకోకూడదు? చివరకు పట్టాభిషేకం జరిగిపోయింది. అది కూడా దీపావళి రోజు జరగటం 42 సంవత్సరాల హిందూ భక్తుడికి వ్యక్తిగతంగా ఎంతో విలువైన విషయం అయివుంటుంది. అయితే, నేను భిన్న మైన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునాక్ ఏక గ్రీవంగా ఎన్నికవడం, ఆ విధంగా దేశ నూతన ప్రధాని కావడం, అది కూడా 200 సంవత్సరాల చరిత్రలో అతి పిన్నవయస్కుడిగా ప్రధాని కావడం అనేది నా రెండో ప్రీతిపాత్రమైన దేశం గురించి నేను గర్వపడేలా చేస్తోంది. ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. బ్రిటన్ నుంచి భారత్ స్పష్టమైన పాఠం నేర్చు కుంటుందా? బ్రిటన్ ఏం చేసిందో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ దేశంలోని జనాభాలో 6.8 శాతం మంది వివిధ ఆసియన్ జాతులకు చెందిన ప్రజలు న్నారు. వీరిలో 2.3 శాతం జనాభా భారతీయ మూలాలు కలిగి ఉన్నారు. ఇది చాలా చాలా చిన్న మైనారిటీ. అయినప్పటికీ, 1960లలో మాత్రమే దేశానికి పలసవచ్చిన తొలి తరం భారత సంతతి కుటుంబానికి చెందిన ఒక కుమారుడిని బ్రిటన్ 57వ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మన సొంత దేశంలో ఈ ఘటనపై వచ్చిన స్పందన ఎలా ఉంది అంటే, ఇలా జరి గిందా అనే అపనమ్మకం, అవును ఇలా జరిగిందనే సంతోషం రెండింటికీ అది రుజువుగా నిలుస్తోంది. సునాక్ ఎదిగివచ్చిన తీరు అత్యంత అద్భుత మైన పరిణామమే కావచ్చు కానీ అది మాత్రమే పూర్తి కథ అని చెప్పలేం. బోరిస్ జాన్సన్ తొలి మంత్రివర్గం ఇరవై శాతం వరకు నల్లవారు లేదా ఆసియన్ మూలాలు కలిగివున్న వారితో కూడి ఉండింది. మునుపటి ప్రభుత్వంలోని నలుగురు ఛాన్సలర్లు, గత ప్రభుత్వ మంత్రివర్గాల్లోని ఇద్దరు హోం సెక్రటరీలు, లిజ్ ట్రస్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి – వీరందరూ బ్రిటన్కి వలస వచ్చిన కుటుంబాలకు చెందినవారే. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవులు. బహుశా వీటన్నింటికంటే ముఖ్యమైంది ఏమి టంటే, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో 200 మందికి పైగా ఎంపీలు సునాక్ని బలపర్చడమే. సునాక్తో పోలిస్తే ఆయనతో పోటీ పడిన శ్వేత జాతి అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇప్పుడు మనం భారత్ వైపు చూద్దాం. మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్ సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్ల మెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. భారత్లోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్య మంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాల్లో ఒక్క రంటే ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. మరో 10 రాష్ట్రాల్లో ఒకే ఒకే ముస్లిం మంత్రి ఉన్నారు. అది కూడా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మాత్రమే. 2014లో గానీ, 2019లో గానీ లోక్సభకు ఒక్క ఎంపీని కూడా బీజేపీ ఎన్నుకోలేదు. ఉత్తరప్రదేశ్లో ఇరవై శాతం జనాభా కలిగివున్న ముస్లింలకు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017వ సంవత్స రంలో కూడా ఇదే పరిస్థితి. గుజరాత్లో అయితే 1988 నుంచి లోక్సభకు గానీ, శాసనసభకు గానీ ఒక్క ముస్లింని కూడా ఆ పార్టీ నిలబెట్టలేదు. అంటే 9 శాతం జనాభా ఇస్లామిక్ విశ్వాసం పాటిస్తున్న రాష్ట్రంలో 24 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా వారిని దూరం పెట్టారన్న మాట. నేను చెబుతున్న వాస్తవాలన్నీ ఆకార్ పటేల్ రాసిన ‘అవర్ హిందూ రాష్ట్ర’ పుస్తకం నుంచి ఉల్లే ఖించినవే. ఇది మరింత కలవరపెట్టే విషయాలను వెల్లడిస్తోంది. దేశంలో 15 శాతం ముస్లిం జనాభా ఉంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.9 శాతం మంది మాత్రమే ముస్లింలున్నారు. పారా మిలటరీ బలగాల్లో 4.6 శాతం మంది, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ సర్వీసుల్లో 3.2 శాతం మంది ముస్లింలు మాత్రమే ఉంటున్నారు. ఇక భారత సైన్యంలో అయితే అత్యంత తక్కువగా 1 శాతం ముస్లింలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇది మనలను కలవరపర్చాల్సిన విషయం మరి. దీనికి సంబంధించి బ్రిటన్లో మీడియా ఎంత భిన్నంగా ఉంటోందో నన్ను చెప్పనివ్వండి. ‘బీబీసీ’ ఛానల్కేసి చూడండి. అక్కడ పనిచేసేవారిలో ఆసి యన్ ముఖాలు ఎంత ఎక్కువగా ఉంటాయో చూసి మీరు షాక్ తింటారు. వారిలో కొన్ని పేర్లను మీరు చూడాలి మరి. మాథ్యూ అమ్రోలివాలా, గీతా గురుమూర్తి, జేమ్స్ కుమారస్వామి, జార్జ్ అలిగియా, నోమియా ఇక్బాల్, సమీరా హుస్సేన్, అమోల్ రాజన్, రజనీ వైద్యనాథన్, యోగితా లిమాయే, సికిందర్ కిర్మానీ, కమల్ అహ్మద్, ఫైజల్ ఇస్లామ్, దర్శిని డేవిడ్. కాబట్టి, ఇప్పుడు బ్రిటన్ నుంచి భారత్ స్పష్టమైన పాఠాలు నేర్వవలసి ఉందని నేనెందుకు భావిస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. భారత్లో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. వాళ్లను మనం చెదపురుగులు అని పిలుస్తాం. బాబర్ సంతానం అంటాం. అబ్బా జాన్ అని పేర్కొంటూ వారిని ఎగతాళి చేస్తాం. శ్మశాన్ ఘాట్, కబర్స్తాన్ మధ్య పోలికలు తీసుకొస్తూ వారిని కించపరుస్తాం. పైగా పాకిస్తాన్ వెళ్లిపోవాలని వారికి పదేపదే చెబు తుంటాం. కాబట్టి, ఈరోజు సునాక్ సాధించిన అద్భుతమైన విజయానికి గానూ మనం గర్వపడు తున్నప్పుడు, మనకేసి మనం ఎందుకు చూసు కోకూడదు? భారత్లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించు కోకూడదు? పైగా చాలామంది గుర్తించలేని కొత్త విరోధా భాస కూడా ఇక్కడ ఉంది. బ్రిటన్ గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని మనలోని కొందరు బ్రిటిష్ వారు జాత్యహంకారులు అని ప్రకటించ డంలో మాత్రం ముందుంటారు. సునాక్ ప్రధాని కావడానికి చాలా కాలం క్రితమే వారు ఘోరమైన తప్పుడు అవగాహనతో ఉన్నట్టు. ఎందుకంటే, దేశంలో ముస్లింల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరును విమర్శించడం అటుండనీ, కనీసం దాన్ని గుర్తించడానికి కూడా ఒప్పుకోరు. దానికి బదు లుగా ముస్లింల బుజ్జగింపు అని మాట్లాడటానికి ఇష్టపడతారు. సునాక్ విజయగాథ మనకు స్ఫూర్తిగా ఉండా లని నేను ప్రార్థిస్తాను. కానీ ఈ విషయంలో కూడా నాది తప్పు అని రుజువవుతుందేమో అని భయ పడుతున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
మన మందులు మంచివేనా?
ఒక భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్ల వల్ల గాంబియా దేశంలో 66 మంది పిల్లలు చనిపోయారన్న వార్త దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారతదేశంలో తయారయ్యే ఔషధాలు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తున్నాయా? భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ కాదు. మన తయారీ నాసిరకపు ఔషధాల వల్ల పేద దేశాల్లోని రోగులే కాదు, లక్షలాది మంది భారతీయులు కూడా ప్రభావితం అవుతున్నారు. లేబుల్ మీద ప్రకటించినంత మందు తీరా మాత్రలో ఉండకపోవడం, ఔషధాల్లో కలిసే అవకాశమున్న విష రసాయనాలను గుర్తించే యంత్రసామగ్రి లేకపోవడం, అసలు మొత్తంగానే ఒక కఠినమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు దేశీయుల ఉసురు తీస్తున్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతూ దినేష్ ఎస్. ఠాకూర్, టి.ప్రశాంత్ రెడ్డి రాసిన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్లు గాంబియా దేశంలో 66 మంది పిల్లల మరణాలకు దారితీశాయని వచ్చిన వార్తలు ఇండియాను ఇబ్బందికి గురిచేశాయి. భారతదేశంలో ఔషధాలను ఎలా తయారుచేస్తున్నారో, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారో తెలిపే దుర్భరమైన వాస్తవానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ నెలలోనే ప్రచురితమైన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని వెల్లడించింది. ఈ పుస్తక రచయితలు దినేష్ ఎస్. ఠాకూర్, టి. ప్రశాంత్ రెడ్డి రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఒకటి, భారతీయ మందులు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తు న్నాయా? రెండు, భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? సమాధానం ‘లేదు’ అనే చెప్పాల్సి ఉంటుంది. తొలి ప్రశ్నకు ఈ పుస్తక రచయితలు చెప్పిన సమాధానం ఏమిటంటే... ‘‘మార్కెట్లో పంపిణీ అవుతున్న నాసిరకపు మందుల సునామీని భారతదేశం విప్పారిన నేత్రాలతో చూస్తోంది... దీనివల్ల ప్రభావితులైన రోగుల మొత్తం సంఖ్య... వందలు, వేలు మాత్రమే కాదు బహుశా లక్షల్లో ఉంటుందని మేం అనుమానిస్తున్నాం.’’ ఇక రెండో ప్రశ్నకు జవాబుగా వారు సింపుల్గా చెప్పిందేమిటంటే: ‘‘మేము అలా భావించడం లేదు’’ అనే. ఈ పుస్తకంలోని వివరణాత్మకమైన, చక్కటి పరిశోధనతో కూడిన 500 పేజీల అధ్యయనం విస్తృతమైన అంశాలను తడిమింది. దేశంలో ఔషధాలు తయారు చేస్తున్న విధానం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో ఈ పుస్తకం వివరించింది. కొన్ని కంపెనీలు తప్పుడు ప్రక టనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి లైసెన్సు లేకుండానే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు చేయడానికి సమర్థమైన యంత్ర సామగ్రి కూడా వీటివద్ద లేకపోవడం గమనార్హం. అనేక తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కొన్ని కంపెనీల బండారం బయటపడుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. భారతీయ మందుల దుర్భరమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ గురించిన సమగ్ర వివరాలను కూడా ఈ పుస్తకం పొందుపర్చింది. మన రెగ్యులేటర్లు అరుదుగా, ఎప్పుడో తప్ప ఔషధ తయారీ కర్మా గారాలను భౌతికంగా తనిఖీ చేయరు. దీనికి బదులుగా వాళ్లు ప్రశ్నించదలచిన మందుల తయారీ బ్యాచ్ రికార్డుల కాపీని మాత్రమే అడుగుతుంటారు. వారు అనుసరించే మార్గదర్శకాలు న్యాయ విచారణను సైతం నిరుత్సాహపరుస్తుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వ్యవ హారం కోర్టు వరకూ వెళ్లిన ప్పుడు, చాలా మామూలు శిక్షలు మాత్రమే పడుతుం టాయి. ‘కోర్టు ముగిసే వరకూ విధించే సాధారణ శిక్ష’ లాంటిది. అది అసలు శిక్షే కాదని చెప్పవచ్చు కూడా! ఈ పుస్తక రచయితలు తమ ముందుమాటలో ఇచ్చిన ఉదాహరణతో ఒక భయానక స్థితి గురించి నన్ను వర్ణించనివ్వండి. 2019 సంవత్సరంలో డైయాథిలిన్ గ్లైకాల్ (డీఈజీ)ను కలిగివున్న దగ్గు సిరప్ తీసుకున్న 21 మంది చిన్నపిల్లల చనిపోయారు. దీన్ని తయారుచేసింది డిజిటల్ విజన్ కంపెనీ. డైయాథిలిన్ గ్లైకాల్ అనేది పారిశ్రామిక ద్రావణి(సాల్వెంట్). దీన్ని ‘ఆంటీఫ్రీజ్’గానూ, ‘బ్రేక్– ఫ్లూయిడ్’గానూ ఉపయోగిస్తుంటారు. 1972 నుంచి డీఈజీ అనేది పిల్లలకు విషంగా మారిన ఘటనలు అయిదుసార్లు సంభవించాయి. అయినప్పటికీ ఔషధాల్లో దీని జాడను ఎవరూ కనుగొనలేక పోతున్నారు. కారణం... భారతీయ ఔషధ కంపెనీలు ఔషధ తయా రీకి ముందు తమ ముడి సరుకును గానీ, తయారయ్యాక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడానికి ముందుగానీ పరీక్షించడంలో తరచుగా విఫలమవుతుండటమే! ఇది డిజిటల్ విజన్ కంపెనీ తొలిసారి చేసిన క్షమించరాని తప్పేమీ కాదు. 2012–19 మధ్యకాలంలో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాణ్యతా పరీక్షల్లో మొత్తంమీద 19 సందర్భాల్లో విఫల మయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలోకి వచ్చే డిజిటల్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఆ డ్రగ్ కంట్రోలర్ డీఈజీ మిశ్రమాలను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు కంపెనీ చేయనేలేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఆ డ్రగ్ కంట్రోలర్ ఈ విషయాన్ని కనుగొనడానికి అంతకుముందు 19 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ అలా పరీక్షించడంలో విఫలమయ్యారు. డ్రగ్ కంట్రో లర్ తనిఖీ సమయంలోనే ఈ లోపాలను కనిపెట్టి ఉండాలనీ, అలా చేసివుంటే కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్సును తక్షణమే రద్దు చేసి ఉండేవారనీ ఈ పుస్తక రచయితలు పేర్కొన్నారు. ఇంకోసంగతి. మరి, ఒక ఔషధం దాని లేబుల్ మీద ప్రకటించిన మేరకు లేకపోతే దాని పరిణామాలేమిటి? ఈ పుస్తకం అజిత్రో మైసిన్కు సంబంధించి ఒక విషయం పేర్కొంటోంది. ఆల్కేర్ లేబొ రేటరీస్ తయారుచేసే అజిత్రోమైసిన్లో లేబుల్ ప్రకారం నిజానికి 200 మిల్లీగ్రాముల అజిత్రోమైసిన్ ఉండాలి. కానీ అందులో ఉన్నది 25.69 గ్రాములే. అంటే కేవలం 12.85 శాతమే. ఇలాంటి మందులు వాడినప్పుడు ఉండదగిన పరిణామం గురించి రచయితలు ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘రోగి చనిపోవడానికి అత్యధిక అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ మాత్రలో ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి అవసరమైన ‘చాలినన్ని’ యాక్టివ్ ఇన్గ్రేడియెంట్లు లేవన్న మామూలు కారణంతో.’’ భారతదేశంలో చౌక ధరలకు లభ్యమవుతూ జనాదరణ పొందిన జనరిక్ మందులు నిజానికి అసలు మందులతో సమానం కాకపోతే జరిగేదేమిటో కూడా ఈ పుస్తకం వివరించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే జనరిక్ మందులపై జీవ సమానత్వ (బయో ఈక్వలెన్స్) పరీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్ష అరుదుగానే జరుగు తుంది. ‘‘తప్పనిసరిగా చేయవలసిన జీవసమానత్వ పరీక్ష లేమి కారణంగా దేశంలో వందలాది కాదు, వేలాది జనరిక్ మందుల బ్రాండ్లను ఆమోదించవలసి వచ్చింది. ఇలా ఆమోదం పొందిన చాలా బ్రాండ్లు ఎందరో రోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది’’ అని ఈ పుస్తక రచయితలు చెబుతున్నారు. అనేక భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు నాణ్యతతో పాటు, విధానపరమైన నియంత్రణ, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా యన్నదే ఈ పుస్తకానికి ముగింపు అని నేను చెబుతాను. అయిన ప్పటికీ, ప్రజలను దెబ్బతీస్తున్న లేదా చంపుతున్న నేరాలకు పాల్పడిన ఈ కంపెనీలు అరుదుగా కూడా భౌతిక శిక్షలు ఎదుర్కోవడం లేదు. ఇదే నిజానికి అత్యధికంగా భయపెడుతోంది. కానీ ప్రభుత్వం ఏ చర్యలకూ ఉపక్రమించకపోతే, మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
భరత జాతికి ఒక ఆంగ్ల నాడి
‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. బ్యారీ ఒబ్రయన్ పుస్తకం దీనికి జవాబు చెబుతుంది. ‘‘ఇండియాకు మొదట వచ్చిన పోర్చుగీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలకమైన పాత్రను పోషించారు. ఇక అందరికీ కచ్చితంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ప్రచురణకర్తలు నాకు కొత్త పుస్తకాలు పంపిన ప్రతిసారీ వాటిలో ఒకటి అమూల్య మైన రత్నం అయి ఉంటుంది. నా వృత్తిపరమైన సంతోషాలలో అదొకటి. తాజాగా నా చేతికి వచ్చిన ‘ది ఆంగ్లో–ఇండియన్స్ : ఏ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ’ అనే బ్యారీ ఒబ్రయన్ పుస్తకం అటువంటి రత్నమే. పుస్తకం గొప్పగా ఉంది. అయితే కొన్ని చోట్ల సాహితీ శైలి కానటువంటి వివరణాత్మమైన దీర్ఘ సంభాషణలతో సాగుతుంది. అదొక అభిభాషణ... రచయితే నేరుగా మీతో మాట్లాడు తున్నట్లు, మీకు చెప్పడానికి ఇంకా ఎంతో ఉన్నట్లు! ‘‘మొదటొక మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలే కదా మొదట వేయాలి! తర్వాత మిగతా విషయాలు. సరే, ఏంటంటే... మీరెప్పుడూ కూడా తమిళియన్ అంటే ఎవరు? బిహారీ అంటే ఎవరు? మలయాళీ అంటే ఎవరు? సిక్కులు అంటే ఎవరు? అనే ప్రశ్నల్ని దాదాపుగా విని ఉండరు. అయితే ఆంగ్లో–ఇండియన్ల విషయం పూర్తిగా వేరైనది. ‘ఆంగ్లో–ఇండియన్లు ఎవరు?’ అనే సందేహాన్ని ఒక ప్రశ్నగా మీరే కొన్నిసార్లు వేసుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, ‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్న... ‘ఎవరు బెంగాలీ?’ అనే ప్రశ్న కంటే సమాధానం చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న’’ అంటారు బ్యారీ ఒబ్రయన్ ఉపోద్ఘాతంగా. గ్రీకు, రోమన్ పురాణాలలో సిరులు పొంగి పొర్లుతుండే ‘కార్నుకోపియా’ కొమ్ము వంటి (మన అక్షయ పాత్ర లాంటిది) ఈ పుస్తకంలో... ఆంగ్లో–ఇండియన్ల గురించిన సమస్త సమాచారమూ గ్రంథస్థమై ఉందా అనిపిస్తుంది కూడా... మనకు తెలిసింది బాగా తక్కువ కనుక! బ్యారీ ఒబ్రయన్ స్వయంగా ఆంగ్లో – ఇండియన్. తన సమూ హపు నాడిపై వేలు ఉంచి ప్రత్యక్షంగా పరిశీలించి చూసినవారు. వారసత్వం, సంస్కృతి, జీవన విధానం, సామాజిక అంశాలలో తన వారి సంపూర్ణ చైతన్యాన్ని లోతుగా పరిశోధించినవారు. ఆయన రాసిన ఈ పుస్తకంలో ఐరోపా సముద్ర శక్తుల ఆగమనం, ఆంగ్లో– ఇండియన్ల అవతరణ, స్వతంత్ర భారత నిర్మాణంలో వారి భాగ స్వామ్యం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఒబ్రయన్ ఆంగ్లో ఇండియన్ అయి ఉండటం ఒక్కటే ఈ పుస్తకానికి ప్రామాణికతను చేకూర్చలేదు. ముప్పై ఏళ్లకు పైగా ఒక సామాజిక కార్యకర్తగా తన సమూహం వ్యవహారాలలో పాల్పంచుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆంగ్లో–ఇండియన్లకు నామినేటెడ్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. తన సమూహానికి సంబంధించిన ప్రతి వివరం, ప్రతి విశేషం, గణాంకాలతో సహా ఆయనకు అందుబాటులో ఉంచే విద్యా వంతులైన పరిశోధక విద్యార్థులు ఆయనతో ఉన్నారు. పైగా రచయిత. ఇంకేం కావాలి ఒక అమూల్యమైన పుస్తకం రావడానికి! ఆంగ్లో–ఇండియన్లు అనుకోకుండా, యాదృచ్ఛికమైన కలయిక లతో అవతరించిన ప్రత్యేక సంతతి కానే కాదని ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలియదు. వలసవాదులు ఉద్దేశ పూర్వకమైన ప్రయత్నా లతో శ్రద్ధగా అంటుకట్టి వీళ్లను సృష్టించారు. ‘‘ఆంగ్లో – ఇండియన్ల పుట్టుక అప్రమేయమైనది కాదు. ఇండియాకు మొదట వచ్చిన పోర్చు గీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. నాకు తెలియని మరొక విషయం – స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలక మైన పాత్రను పోషించారని! ముఖ్యంగా వాళ్లు భారత వైమానిక దళంలో పైలట్లుగా ఉన్నారు. ‘‘1947–48 ఇండో–పాక్ యుద్ధంలో తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించిన పైలట్లలో సగంమంది ఆంగ్లో– ఇండియన్లే. 1965, 1971 యుద్ధాలలో గగనతలంలో మెరుపులా ఉరిమిన వారిలోనూ ఆంగ్లో–ఇండియన్లు ఉన్నారు. శత్రువుపై వీరోచితంగా వైమానిక దాడులు జరిపిన ఆనాటి గ్రూప్ కెప్టెన్లలో 20 శాతం మంది, వింగ్ కమాండర్లలో 30 శాతం మంది ఆంగ్లో– ఇండియన్లే’’ అంటారు ఒబ్రయన్. ఇంకా అనేక ఆసక్తికరమైన వివ రాలు పుస్తకంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 0.01 శాతంగా ఉన్న ఆంగ్లో–ఇండియన్లు ఎన్ని యుద్ధ పతకాలు సాధించారో చూడండి. 4 మహావీర చక్ర, 25 వీర చక్ర, 2 కీర్తి చక్ర, 2 శౌర్యచక్ర అవార్డులతో పాటు, 22 వాయుసేన, 13 పరమ విశిష్ట సేవ, 17 అతి విశిష్ట సేవా పతకాలను వీరు సాధించారు! ఆంగ్లో– ఇండియన్లు ఎక్కువగా కోల్కతాలో, చెన్నైలలో నివాసం ఏర్పరచుకుని ఉండేవారు. స్వాతంత్య్రానంతరం అరవైలు, డెబ్బైలు, ఎనభైలలో అధిక సంఖ్యలో కలకత్తా నుంచి బ్రిటన్కు వెళ్లి స్థిరపడ్డారు. మెరుగైన జీవితం కోసం వారు అటువైపు మళ్లారని అంటారు. ఇప్పుడిక నాకు తెలిసిన విషయం – నేననుకోవడం మీకూ కచ్చి తంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ఆ పాఠశాలల నుంచి ఏ స్థాయిలోని వారు వచ్చారో చూడండి. ఒబ్రయన్ చెబుతున్న దానిని బట్టి... జె.ఆర్.డి. టాటా, సల్మాన్ రష్దీ, ఫరీద్ జకారియా (వీళ్లంతా ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ క్యానన్లో విద్యను అభ్యసిం చినవారు), సయీద్ జాఫ్రీ (విన్బెర్గ్ అలెన్, ముస్సోరీ); అమితాబ్ బచ్చన్, కబీర్ బేడీ (షేర్వుడ్ కాలేజ్, నైనితాల్), అరుంధతీ రాయ్ (లారెన్స్, లోవ్డేల్), డాక్టర్ రాజా రామన్న, నందన్ నీలేకని, కిరణ్ మజుందార్ షా (బిషప్ కాటన్, బెంగళూరు), విశ్వనాథన్ ఆనంద్ (సెయింట్ బీడ్స్, చెన్నై) ఆంగ్లో – ఇండియన్లైన టీచర్లు, లెక్చ రర్లు, ప్రొఫెసర్ల దగ్గరే పాఠాలను, అనర్గళమైన ఆంగ్లభాషను నేర్చు కున్నారు. ఇప్పుడు మన దేశంలోని పెద్ద వాళ్లంతా మాట్లాడుతున్నది ఆంగ్లో–ఇండియన్ ఆంగ్లమేనని మనం మర్చిపోకూడదు. ఈ విష యాన్ని రూఢి పరచడానికి ఒబ్రయన్ ప్రముఖ భారతీయ రచయిత ఆలెన్ సీలే మాటల్ని మద్దతుగా తీసుకున్నారు. ‘‘భారతదేశంలో ఆంగ్లభాషను బ్రిటిష్ పాలకులు అధికారికంగా ఏమీ నిర్వీర్యం చేయ లేదు. నిజానికి ఆంగ్లో – ఇండియన్లే ఆ పనిని అనధికారికంగా చేశారు. మెకాలే ఇక్కడ ఆంగ్ల విద్యాబోధనకు పునాదులు వేసినా కూడా బ్రిటిష్ ఇంగ్లిష్ వ్యాప్తి జరగకపోవడానికి కారణం ఆంగ్లో – ఇండియన్లు తమదైన శైలిలో ఆంగ్ల భాషను బోధించడమే.’’ ‘ఆంగ్లో – ఇండియనిజమ్స్’పై ఉన్న అధ్యాయాన్ని చదివి ఉల్లాస భరితుడినయ్యాను. జిగ్గెరీ పోక్ (మోసపూరితమైన లేదా నిజాయితీ లేని ప్రవర్తన), గోయింగ్ ఫర్ ఎ లోఫ్ (సోమరిగా పచార్లు కొట్టడం), గ్యాసింగ్ టూ మచ్ (పొగడ్తలతో ఉబ్బేయడం) అనే పదబంధా లన్నిటినీ ఆంగ్లో–ఇండియన్లే సృష్టించారని ఒబ్రయన్ అంటారు. అది నిజమైనా, కాకున్నా అవి నన్నెంతో ఆకట్టుకున్నాయి. మాట తీరును బట్టి ఆంగ్లో ఇండియన్లను ఇట్టే కనిపెట్టవచ్చని అని కూడా ఆయన చెప్తారు. ‘గివ్–ఎవే’ పదంతో వారు మాటను పూర్తి చేస్తారు. కొందరు ‘నో’ లేదా ‘నా’ అనే పదాన్ని మాటకు కలుపుతారు. మరికొంతమంది అంత్య ప్రత్యయం (సఫిక్స్)గా ‘అప్’ అని గానీ, ‘అండ్ ఆల్’ అని గానీ అంటారు. అత్యంత సాధారణ పదం వచ్చేసి ‘మెన్’. ‘కమ్ ఆన్ మెన్’, ‘నో, మెన్’, ‘ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దిస్ మెన్’ (విసిగిపోయానబ్బా)... ఇటువంటివి. ఒక ఫ్రేజ్ మాత్రం నన్ను నా బాల్యంలోకి లాక్కెళ్లింది. ‘లెటజ్ గో నిన్నీ బైస్’(టు స్లీప్). మా అమ్మపాడిన ఈ లాలిపాట మూలం ఆంగ్లో–ఇండియన్ అని నాకు తెలీదు. ‘నిన్నీ బాబా నిన్నీ / మఖాన్, రోటీ, చిన్నీ / మేరా బాబా సోగయా / మఖాన్, రోటీ హో గయా / నిన్నీ బాబా నిన్నీ’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?
రచయితలు ఏమి రాయాలో, ప్రచురణ కర్తలు ఏం ప్రచురించాలో కూడా ప్రభుత్వాలే ఆదేశించే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఇదే జరిగితే అర్థవంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికినే కోల్పోతుంది. మణిపూర్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు మణిపూర్ విద్యామంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా! అయితే, నిర్దిష్టమైన పుస్తకాలను నిషేధించడానికి కూడా రాజ్యాంగం ప్రభుత్వానికి అనుమతినిస్తోంది. కానీ అది అచ్చయిన పుస్తకాలకే వర్తిస్తుంది. అంతేగానీ ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వానికి సమర్పించాలని దానర్థం కాదు. అయినా మన ప్రచురణకర్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో చాలా భయంకరమైన ఘటనలు జరుగుతుంటాయనీ, ప్రతి ఒక్క ఘటనపై మనం దృష్టి పెట్టలేమనీ నాకు తెలుసు. కానీ కొన్ని సార్లు మనం చూడలేకపోయిన లేక విస్మరించిన విష యాలు రెండూ మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఒక్కోసారి స్వీయ ఓటమిలోకి కూడా మనల్ని నెడతాయి. ఈరోజు అలాంటి ఒక ఘట నపై నేను దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్ 15వ తేదీన మణిపూర్ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు వాటిని మణిపూర్ విద్యామంత్రి నేతృ త్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమ ర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజం చెప్పా లంటే, ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా అవుతుందని ఆందోళన కలుగుతోంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగో ళిక అంశాలపై ప్రచురించిన కొన్ని పుస్తకాలు వాస్త వాలను వ్యక్తీకరించేలా ఉంటున్నాయి లేదా వివిధ సామాజిక బృందాల్లో శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించేవిగా ఉంటున్నాయని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. ఇకనుంచి ఈ అంశాలపై రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని వైస్చాన్సలర్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకులు, మణి పూర్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులతో కూడిన 15 మంది సభ్యుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆమోదం లేకుండా ఏ పుస్తకాన్నయినా ప్రచురించినట్లయితే సంబంధిత చట్టప్రకారం శిక్షకు గురవుతారని ప్రభుత్వ ఆదేశం తెలిపింది. అయితే ఏ చట్టం కింద ఏ శిక్ష విధిస్తారనే విషయాన్ని అది నిర్దిష్టంగా పేర్కొనలేదు. అలాగే శిక్షకు గురయ్యేది రచయితా, లేక ప్రచురణకర్తా లేదా ఇద్దరూనా అనే విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదు. ఇప్పుడు రాజ్యాంగం వైపు చూద్దాం. భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రత ప్రయోజనా లను, శాంతిభద్రతలను దెబ్బతీసే రకం వాక్ స్వేచ్ఛపై హేతుపూర్వకమైన ఆంక్షలను విధించడా నికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. ఇది నిర్దిష్టమైన పుస్తకాలను నిషే ధించేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తోంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే మహాత్మాగాంధీ హత్యపై కాల్పనిక చిత్రణకు సంబంధించి స్టేన్లీ వూల్పర్ట్ రాసిన ‘‘నైన్ అవర్స్ టు రామా’’ అనే పుస్తకాన్ని గతంలోనే నిషేధించారు. అంతమాత్రాన ప్రభు త్వంపైన పేర్కొన్న నాలుగు అంశాలపై రాసే ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వ కమి టీకి సమర్పించడాన్ని కూడా ఆర్టికల్ 19 (2) అనుమతిస్తుందా? దీనికి సమాధానం నిస్సందేహంగా లేదు అనే చెప్పాలి. దీనికి సమాధానం అవును అయితే అర్థ వంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టే మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అసంబద్ధమైనదే కాదు... ఆమోదించతగినది కూడా కాదు. అందుకనే ఈ అంశాన్ని చేపట్టడంలో, తీవ్రంగా నిరసన తెలపడంలో మన వైఫల్యం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతకు మించి భయ పెడుతోంది కూడా! అయితే పూర్తిగా వాస్తవ విరుద్ధంగా రూపొంది, సమాజాన్ని చిక్కుల్లో పడేసి, విచ్ఛిన్న పరిచే పుస్తకాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యా తీసుకోకూడదని దీనర్థం కాదు. ప్రభుత్వం ఇలాంటి పుస్తకాలను సవరించుకోవాలని డిమాండ్ చేయవచ్చు. నిషేధించకూడదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే దానిమీద నిషే«ధం కూడా విధించ వచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏ పుస్తకానికి ఆ పుస్తకానికి మాత్రమే విడిగా వర్తించే అంశాలు. అదికూడా వాటిల్లో తప్పుందని తేలినప్పుడు! అంతేగానీ ప్రచురణకు ముందుగానే వ్యక్తులు రాసిన పుస్తకాలను కైవసం చేసుకుని, శోధించి, తర్వాత ఏది ప్రచురించవచ్చు, దేన్ని తిరస్కరించ వచ్చు అని నిర్ణయించే పనిని ప్రభుత్వం చేయ కూడదు. కానీ మణిపూర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం సరిగ్గా దీన్నే ప్రతిపాదిస్తోంది. కానీ ఒక్క సానుభూతి చూపడం మినహా, మన ప్రచురణకర్తలు ఎందుకు దీనిపట్ల మౌనంగా ఉన్నారు? వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతారనీ, ప్రభుత్వ ఆదేశాలపై లీగల్ చర్యకు సిద్ధమవుతారనీ భావించాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే మణిపూర్లో కొద్దిమంది ప్రచురణ కర్తలు మినహా యిస్తే బడా ప్రచురణ సంస్థల్లో ఏ ఒక్కటీ మణి పూర్ ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేసిన పాపాన పోలేదు. బహుశా చిన్న స్థాయి ప్రచురణకర్తలకు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావొచ్చు. దీని కయ్యే ఖర్చులను వారి పుస్తకాల ద్వారా రాబట్ట లేకపోవచ్చు. అయితే ప్రచురణ కర్తలు సామూహి కంగానే ఈ ఉక్కుపాదం మీద పోరాడవచ్చు. ఎందుకంటే వీరి హక్కులు, ప్రయోజనాలు మొత్తంగా ప్రమాదంలో పడుతున్నాయి మరి. ఆక్షేపణే లేకుండా వారు ప్రభుత్వ ఆదేశాన్ని ఆమోదించినట్లయితే (ప్రస్తుతానికి వారు ఆమో దిస్తున్నట్లే కనబడుతోంది) వారూ, వారి రచయి తలు కూడా నష్టపోతారు. వారితోపాటు మనం కూడా నష్టపోతాం. పాఠకులుగా మనం చదవాలనుకునే, నేర్చుకోవాల నుకునే పుస్తకాలను ప్రభుత్వాలు నిరాకరిస్తాయి. మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అందరిలాగే మనల్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మన మీడియా ఎందుకు మౌనంగా ఉంటోంది అనేది ప్రశ్న. టీవీల్లో దీనికి వ్యతిరేకంగా ఆగ్రహపూరితమైన చర్చలు ఎందుకు జరగడం లేదు? మన వార్తా పత్రికలు మండిపడుతూ సంపాదకీయాలు ఎందుకు రాయడం లేదు? వాళ్లకు పరిస్థితి అర్థం కాలేదా? లేక ఏం జరుగుతోందో వారికి నిజంగానే తెలియడం లేదా? వీటికి సమాధానాలు నాకు తెలీవు కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రాసంగికత కలిగి నట్టివే! అందుకే నేటి పరిస్థితి చాలా నిస్పృహను కలిగిస్తోంది. చివరకు అది నా మిత్రుడు లేవనెత్తిన ప్రశ్న దగ్గర వచ్చి ఆగింది. చివరకు మనం ఇక్కడికి చేరామా అని ప్రశ్నించాడతను. నిజం చెప్పాలంటే, సమాధానం అవును అనే! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు