-
కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు?!
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే! అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి. మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు. వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం. అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది. మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు. ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన. నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు. నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం? ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్లోని కెటలాన్లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?
జూన్ 1న ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు! ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4న స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్ మార్కెట్కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ జరిగిందా అన్నది ప్రశ్న.మే 31–జూన్ 4 మధ్య నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజి (ఎన్.ఎస్.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్’ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. మొదటిది– మే 31న ఎన్.ఎస్.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. రెండవది– ఎన్.ఎస్.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్ ఇన్వెస్టర్లే (ఎఫ్ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. మే 31కి, జూన్ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం జూన్ 3న స్టాక్ మార్కెట్ రాకెట్లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్ మార్కెట్ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్ మార్కెట్లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్ పోల్స్ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్ పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లీక్ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్ పోల్స్ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్ పోల్స్ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్ టైమ్స్’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు. ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్ మార్కెట్కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్ అయ్యాక ‘ఎకనమిక్ టైమ్స్’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?గుర్తు చేసుకోండి. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
శత్రు దేశాల గూఢచారి మిత్రులు
ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.బహుశా జాన్ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్–పాకిస్తాన్ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్), ఐ.ఎస్.ఐ. (ఇంటర్–సర్వీసెస్ ఇంటిలిజెన్స్)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్జీత్ సింగ్ దులత్, జనరల్ అసద్ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్ క్రిషణ్ అగర్వాల్ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్’ అని సముచితమైన పేరే పెట్టారు. ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్లోని ఛావ్ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్... తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు. ‘కోవర్ట్’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’. ఇక భవిష్యత్తు ఐఎస్ఐ చీఫ్... స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’. ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్ వంటి నగరంలో సైకిల్ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’. వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను. దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్ పోలీస్ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్ సంస్థల వైపు మళ్లారు. ‘‘అనుకోకుండా నేను అక్కడికి చేరాను’’, ‘‘ఆ విషయాన్ని ఒప్పుకుంటాను’’ అంటారు దుర్రానీ నవ్వుతూ. ‘‘ఇంటిలిజెన్స్ అంటే ఏంటో తెలియకుండానే’’ దులత్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో చేరారు. అయినప్పటికీ ఇద్దరూ అత్యున్నత స్థాయికి చేరుకుని, తమ తమ దేశ ప్రజల చేత ఐఎస్ఐ, ‘రా’ సంస్థల అత్యుత్తమ మాజీ అధిపతులుగా గుర్తింపు పొందారు. కనుక వారు విధిని నమ్ముతారని నేను అనుకోవచ్చా? జేమ్స్ బాండే ఇలాంటి మూఢ నమ్మకాలను ఎప్పుడూ ఎకాఎకిన కొట్టిపడేయలేదు. వీళ్లు మాత్రం అలా ఎందుకు చేస్తారు?‘‘కుండబద్దలు కొట్టటం’’ అని దులత్ ఎప్పుడూ అంటుండే దుర్రానీలోని ‘‘నిర్మొహమాటాన్ని’’ దులత్ ఇష్టపడతారు. దుర్రానీ ఉన్నదున్నట్లు బహిరంగంగా మాట్లాడతారు. పాకిస్తాన్ ఆర్మీని విమర్శించటానికి కూడా సంకోచించరు. అలాగే ఆయన భారతీయ సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది మరింత కష్టమైన పని. ఆయన అనిన ఒక మాటను మీకు వదిలేసి, నా ముగింపు సరైనదేనా పరిశీలించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ‘‘భారతదేశంలో ప్రజలు ప్రతిభ ద్వారా పైకి ఎదిగి ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో) ని, ‘రా’ను చేజిక్కించుకుంటారు. కానీ మా దగ్గర దేశాధ్యక్షుడు, లేదా సైన్యాధ్యక్షుడికి నచ్చిన వ్యక్తి అటువంటి పదవులను చేపట్టవచ్చు. కనుక ఒక మంచి ఐఎస్ఐ చీఫ్ ఎవరు అవగలరు అనే దానికి ఎల్లవేళలా మేము అనుసరించే ఒక ప్రమాణం ఉండదు.’’ రహస్యాలను అలా ఉంచండి – ‘కోవర్ట్’ పుస్తకంలో వీరు ‘రా’, ‘ఐఎస్ఐ’ అంతర్గత కార్యకలాపాల పనితీరును బహిర్గతం చేయలేదు. ‘ద స్పై క్రానికల్స్’ లోనూ వాటి గురించి లేదు. బదులుగా ఈ తాజా పుస్తకం, ‘‘గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితులను అన్వేషిస్తుంది’’. రెండు సూత్రాల మీద ఇది దృష్టి సారించింది. వారు ఎలాంటి మనుషులు? వారు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనేవి ఆ రెండూ. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానాన్ని కూడా వివరించింది. వారి అభిప్రాయాలు కూడా తరచూ ఒకేలా ఉన్న విషయం కూడా. చూస్తుంటే, గూఢచారులు చాలా అరుదుగా విభేదిస్తారని అనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా?
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను. ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా! రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు. ఐదవది – ఇంటర్వ్యూయర్కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు. లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం. కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి. లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి. చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హింసకు కళాత్మక ప్రతీకారం!
న్యూయార్క్లోని చౌటక్వా ఇన్స్టిట్యూషన్లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్: మెడిటే షన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు. ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’ బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ. ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్ యెన్తోబ్తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు), బైడెన్ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్ జాన్సన్ (ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ. ఎంత సిగ్గుచేటు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్ ఇవ్వలేకపోయిన హామీ!
మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ‘రాజ్యాంగ పరిరక్షణ’కు మూడు ముఖ్యమైన హామీలను ఇచ్చింది. ఉభయ సభల్ని ఏడాదికి కనీసం వంద రోజులు సమా వేశ పరచటం; ప్రతిపక్షాలు సూచించిన అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించటం; రెండు సభల ప్రిసైడింగ్ అధికారులు తమ పార్టీలతో సంబంధా లను తెంచుకోవాలన్న నిబంధన ద్వారా నిష్పాక్షికతను సాధించటం. అలాగే ఇంకొక హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండవలసింది. బ్రిటన్లో మాదిరిగా పార్లమెంటు సమావేశాలలో ‘ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్ టైమ్’ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధానమంత్రే స్వయంగా సమాధానాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించటం. మన పార్లమెంటు కోసం, మన ప్రజాస్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం ఇవి అవసరం. సాధారణంగా నేను రాజకీయ మ్యానిఫెస్టోల జోలికి వెళ్లను. చాలా సందర్భాలలో పార్టీ గానీ, లేదా ఓటరు గానీ వాటిని అంత సీరియస్గా తీసుకోరు. అయితే కాంగ్రెస్ పార్టీ తాజా మ్యానిఫెస్టోలోని పార్లమెంటు పని తీరుకు సంబంధించిన ఒక క్లాజు నా కంటపడింది. మ్యానిఫెస్టోలోని ‘రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశం కింది 9వ క్లాజు మూడు నిర్దిష్టమైన, ముఖ్యమైన హామీలను ఇస్తోంది. మొదటిది ఇలా చెబుతోంది: ‘పార్లమెంటు ఉభయసభలు దేనికది ఏడాదికి 100 రోజులు సమావేశం అవుతాయి అని మేము హామీ ఇస్తున్నాం.’నిజంగా ఇది మన ప్రజాస్వామ్య విధి నిర్వహణకు కావలసిన సత్తువను ఇస్తుంది. ఇందుకు వివరణగా, కోవిడ్ వల్ల ప్రభావితమైన లోక్సభవి కాకుండా, ఆ ముందరి సమావేశాల నుంచి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 16వ లోక్సభ 1,615 గంటలు మాత్రమే పని చేసింది. ఇది అన్ని పూర్తికాల లోక్సభల సగటు కంటే 40 శాతం తక్కువ. 15వ లోక్ సభలో 26 శాతం వరకు చట్టపరమైన బిల్లులు 30 నిమిషాల లోపే ఆమోదం పొందాయి. ఆ సంఖ్య తర్వాతి కాలంలో పెరిగి ఉండొచ్చు కానీ, 14, 15 లోక్సభలలో నమోదైన 71 శాతం, 60 శాతంతో పోలిస్తే 16వ లోక్సభలో కేవలం 25 శాతం బిల్లులే కమిటీల సూచనల కోసం వెళ్లాయి. దీనిని బట్టి, అమలుకు అవసరమైన అర్హతల పరిశీలనకు చట్టపరమైన బిల్లులు వెళ్లలేదని స్పష్టం అవుతోంది. లోక్సభ ఏడాదికి 100 రోజులు సమావేశం అయితే కనుక ఆ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. రెండవ హామీ: ‘రెండు సభల్లోనూ వారానికి ఒకరోజును ప్రతి పక్షాలు సూచించిన అంశంపై చర్చించటానికి కేటాయిస్తామని మేము హామీ ఇస్తున్నాం’. దీని అర్థం, ప్రభుత్వం నిరాకరించిన జీఎస్టీ, ధరల పెరుగుదల, పెగసస్, రఫేల్, చైనా చొరబాట్లు, ఎలక్టోరల్ బాండ్ల వంటి అంశాలు చర్చకు వస్తాయని! ప్రభుత్వం మొండిగా తిరస్కరించే వాటిని చర్చించేందుకు ఈ నిబంధన అత్యవసరతను కల్పిస్తుంది. పార్లమెంటరీ చర్చలను సంపూర్ణం, అర్థవంతం చేస్తుంది. మూడవ హామీ ఇలా చెబుతోంది: ‘రెండు సభల ప్రిసైడింగ్ అధికారులు (స్పీకర్, ఛైర్మన్) ఏ రాజకీయ పార్టీతో తమకున్న సంబంధాన్నయినా తెంచుకోవాలన్న నిబంధనను చేర్చుతామని మేము హామీ ఇస్తున్నాం.’ ప్రస్తుతం లోక్సభ స్పీకర్ సభకు అధ్యక్షు డిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కూడా తన పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అది ఆమోదయోగ్యం కాదు. అలా ఉండటం పక్షపాతానికి దారి తీస్తుంది. నిర్ణయాలను ప్రశ్నార్థకం చేస్తుంది. రాజ్య సభ ఛైర్మన్ కూడా అంతే. ప్రిసైడింగ్ అధికారి అయ్యాక కూడా వారు తమ పార్టీలో కొనసాగడం అన్నది అంతే సమానంగా (లోక్సభ స్పీకర్తో సమానంగా) ఆమోదయోగ్యం కానిది. దీనికి అదనంగా నేను మరొకటి జోడిస్తాను. సిట్టింగ్ స్పీకర్ కనుక మళ్లీ ఎన్నికకు నిలబడితే అతడికి పోటీ లేకుండా చూడాలి. బ్రిటన్లో అలాగే జరుగుతుంది. దాని వల్ల స్పీకర్ స్థానంలోకి వచ్చే వారి తటస్థతకు హామీ ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్కు ఎందుకు ఆలోచించలేదో మరి? ఏమైనా, కాంగ్రెస్ మ్యానిఫెస్టో మరొక కీలకమైన అడుగును ముందుకు వేసి ఉండవలసింది! బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’ సమా వేశాలలో ఒక నిర్దిష్టమైన రోజున, ఒక అరగంట సేపు ‘ప్రైమ్ మిని స్టర్స్ క్వశ్చన్ టైమ్’ (పీఎంక్యూ) పేరిట – ప్రతిపక్ష నాయకుడు వేసే కనీసం అరడజను ప్రశ్నలతో పాటుగా, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రధాన మంత్రి సమాధానాలు ఇవ్వటం అనే సంప్రదాయాన్ని మన దగ్గర మొదలు పెడతామని హామీ ఇవ్వవలసింది. దీని వల్ల ఉన్నత స్థాయిలో జవాబుదారీతనానికి భరోసా ఏర్పడటం మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిని ప్రశ్నించటానికి ప్రతి పక్షానికి అవకాశం లభిస్తుంది. యూకేలో పీఎంక్యూస్ అని పిలిచే ఈ ప్రశ్నోత్తర సమయం రసవత్తరంగా సాగుతుంది. ఇటు ప్రధానమంత్రి, అటు ప్రతిపక్ష నాయకుడు... ఆ ఇద్దరిలోని అత్యుత్తమమైన ప్రతిభను వెలికి తీస్తుంది. అందుకే అది, దేశ ప్రజలు తమ నాయకుల పనితీరును వీక్షించి, వారేమిటో తెలుసుకోటానికి, వారి బలహీనతలను గుర్తించటానికి, వారి బలాలను ప్రశంసించటానికి ఒక గవాక్షం. ఒక్క మాటలో అది... ప్రజాస్వామ్యం పని చేయటం. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన ప్రజాస్వామ్యానికి అలాంటి ఒక గవాక్షం ఇప్పుడు అత్యవసరం. మరి ఈ హామీని ఇవ్వటానికి కాంగ్రెస్ ఎందుకు వెనకడుగు వేసింది? నరేంద్ర మోదీ దాడిని మల్లికార్జున్ ఖర్గే, లేదా రాహుల్ గాంధీ... తిప్పికొట్టలేరన్నదే కారణమా? వాళ్లు దీని గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండరనీ, లేదా ఇది అసాధ్యం అని వారు కొట్టిపడేసి ఉంటారనీ నేను నమ్మలేను కనుక బహుశా అదే కారణం అయుండా లని నా అనుమానం. మ్యానిఫెస్టోలో ఇప్పుడు హామీ ఇచ్చినవాటినైనా కాంగ్రెస్ నెర వేర్చవలసిన అవసరం ఉంది. మన పార్లమెంటు కోసం, మన ప్రజా స్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం నెరవేర్చాలి. అందుకే ఇది నరేంద్ర మోదీకి, బీజేపీకి కూడా పరీక్ష. వారు నిజంగా భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని విశ్వసిస్తుంటే కనుక కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీల అమలుకు వారెలా ‘కాదు’ అని చెప్పగలరు? నిజానికి ప్రతి ఆలోచనాత్మకమైన, బాధ్యత గల రాజ కీయ పార్టీ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే... విచారకరమైన, అంతుచిక్కని నిజం ఒకటి ఉంది. ప్రశ్నలను ఎదుర్కోవటానికి సిద్ధం అని ఏ పార్టీ అయినా అంటుందని కచ్చితంగా చెప్పగలను. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే, చర్య తీసుకోవలసిన స్థితిలో ఉంటే ప్రశ్నలకు సిద్ధంగా ఉండగలదా? ఇక్కడే సందేహాలు కదలాడుతున్నాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఊహకు అందని ఉక్కిరిబిక్కిరి
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయభ్రాంతులు వ్యాపించాయి. సింగపూర్ను లొంగదీసుకున్న జపాన్కు తర్వాతి లక్ష్యం ఈ ప్రాంతమే అనుకోవ డమే దీనికి కారణం. దాంతో నగరంలోని 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో పారిపోయారు. మద్రాసు జూ లోని సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను కాల్చి చంపారు... బాంబులు పడితే అవి ఆ గందరగోళంలో జనాల మీద పడకుండా! ఆ యుద్ధానికి అవి మూల్యం చెల్లించాయి. ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రభావితం అయిందా? అవునని ఒప్పుకోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్లు అయినప్పటికీ, ఆ యుద్ధం గురించి మనకు తెలియనిది ఏముంటుందని చాలామంది అనుకుంటారు. అది తప్పు అని ముకుంద్ పద్మనాభన్ రుజువు చేశారు. అసలేనాడూ సంభవించకనే, నిజంగానే సంభవించిందన్నంతగా ఒక అసంబద్ధ మైన కలవరానికి గురిచేసిన ఒకానొక ఘటనపై తాజాగా ఆయన పుస్తకం రాశారు. దాని పేరు: ‘ద గ్రేట్ ఫ్లా్యప్ ఆఫ్ 1942: హౌ ద రాజ్ ప్యానిక్డ్ ఓవర్ ఎ జపనీస్ నాన్–ఇన్వేషన్’. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ పతనానంతరం... అప్పటికింకా బ్రిటిష్ ఆధిపత్యంలోనే ఉన్న భారత సామ్రాజ్యానికి–మరీ ముఖ్యంగా మద్రాస్కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయ భ్రాంతులు వ్యాపించాయి. మలయా ద్వీపకల్పానికి మద్రాసు దగ్గరగా ఉండటమన్నది... సింగపూర్ తర్వాత జపాన్ తదుపరి దాడి ఇక మద్రాసు మీదనేనన్న సూచనప్రాయతకు తావిచ్చింది. అసలక్కడేమీ లేకుండానే, ఊరికే ఊహించుకుని భయపడ్డామని ప్రత్యేకించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆ భయాందోళన స్థాయి మరింతదైన గొప్ప దిగ్భ్రమను కలిగిస్తుంది. సింగపూర్ పతనం అయ్యే సమయానికి మద్రాసులోని మూడింట ఒక వంతు జనాభా ప్రాణ భయంతో తట్టాబుట్టా వదిలి పారిపోయింది. ఆరు వారాల తర్వాత నగర జనాభా కేవలం 25 శాతమే మిగిలి ఉందని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ రాసింది. పాల్ జయరాజన్ అనే ఐసీఎస్ అధికారి అంచనా ప్రకారమైతే మద్రాస్ జనాభా 13 శాతానికి తగ్గిపోయింది. దానర్థం 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో నగరాన్ని వదిలి వెళ్లారని! ‘ఈ లెక్క నమ్మశక్యమైనదిగా కనిపించకున్నా, నమ్మశక్యం కానిది గానూ అనిపించడం లేదు’ అని ముకుంద్ పద్మనాభన్ వ్యాఖ్యానించారు. పుస్తకంలో ఆహ్లాదం కలిగించే కథలు చెప్పుకోదగినన్ని ఉన్నప్ప టికీ, వాటిల్లో ఒక్కటి కూడా మద్రాసులో జరిగిన దానిని మించి అద్భు తమైనదేమీ కాదు. ‘‘సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను వెతికి మరీ కాల్చి చంపారు. జపాన్ విసిరే బాంబులు కనుక జంతు ప్రదర్శన శాలలను, వాటì కదలికలను నియంత్రించి ఉంచిన ఆవరణలను (ఎన్క్లోజర్లు) ధ్వంసం చేసినప్పుడు, వాటి నుంచి క్రూర జంతువులు స్వేచ్ఛగా బయటికి ఉరికి, మనుషుల మీద పడకుండా నివారించటానికి ముందస్తుగానే వాటిని చంపేయాలన్న ఆదేశాలు అమలు అయ్యాయి.’’ చూస్తుంటే ఆనాటి జరగని ఘటనకు అత్యధిక మూల్యం చెల్లించుకున్నది జంతువులే అనిపిస్తోంది. నిజంగా ఇటువంటిదే లండన్లో జరిగింది. ‘‘1939 సెప్టెంబర్ ఆరంభంలో, యుద్ధం మొదలైన మొదటి వారం... విస్తుగొల్పేటంతటి స్థాయిలో 4 లక్షల నుంచి 7 లక్షల 50 వేల దాకా పిల్లులు, శునకాలను చంపేశారని అంచనా.’’ అంటే, బ్రిటిష్ ప్రజలు తమ పెంపుడు జీవు లను త్యాగం చేయటానికి కూడా సంకోచించనంతగా ప్రేమిస్తారు! మద్రాసు గవర్నరు పారిపోయి ఉండకపోవచ్చు. కానీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు చేసింది కచ్చితంగా పారిపోవటమే! సర్ సిడ్నీ వాడ్స్వర్త్ ‘‘రెండు కార్లలో తన సతీమణి, డ్రైవరు, బట్లరు, కుక్, మూడు పెంపుడు శునకాలతో అనంతపురం బయలుదేరారు. తమ వాహనాల పైభాగాన పరుపులను కట్టి, వాటిల్లో పింగాణీపాత్రలు, గిన్నెలు, బట్టలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, వెండి దీపాల వంటి అవస రమైన, విలువైన సామగ్రిని కుక్కేశారు’’. తిరిగి రెండు వారాల తర్వాత ఆయన వెనక్కు వచ్చారు. ఒక మంచి ఉల్లాసభరితమైన సెలవు సమయాన్ని గడిపాక! ఐ.సి.ఎస్. అధికారులు మద్రాసును విడిచిపెట్టి పోలేదు. బదు లుగా వారు జపాన్ సేనలకు చుక్కయినా దక్కకుండా ఉండేందుకు ‘గొప్ప’ మార్గాలనే కనిపెట్టారు. చెట్టినాడు రాజా సాహచర్యంలో పాల్ జయరాజన్ మద్రాస్ క్లబ్బుల్లో పీకల దాకా మద్యం సేవించారు. తర్వాత, వారంతా కలిసి ‘‘మిగిలిన మద్యాన్నంతా కాలువలో పారబోశారు’’. ఇక జపాన్ బాంబు దాడుల గురించి చింతించాల్సినంత భయం లేని ఢిల్లీలో కవి డబ్లు్య.హెచ్. ఆడెన్ సోదరుడైన జాన్ బిక్నెల్ ఆడెన్ సౌత్ బ్లాక్ను రక్షించటానికి ఒక హాస్యాస్పదమైన తలతిక్క పథకాన్ని రూపొందించారు. సౌత్బ్లాక్ భవంతిని కనిపించనీయ కుండా చేయటం కోసం దట్టమైన పొగ మేఘాలను సృష్టించే ఒక పరికరాన్ని తయారు చేశారు. అయితే అది కేవలం కాలుష్యాన్ని వెదజల్లడానికి మాత్రమే పనికొచ్చింది. యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)లో ఒక వదంతి అనియంత్రిత ఆందోళన గాడ్పులను వ్యాపింపజేసింది. ‘‘ఒక జపాన్ మనిషి ఆకాశం నుంచి భూమిపైన జరుగుతున్న ఒక వేడుకలోని జనసమూహం మధ్యకు దిగి, వారిని ఉద్దేశించి ప్రసంగించి, తిరిగి అలాగే ఆకాశంలోకి వెళ్లిపోయాడు అనే కథ అది.’’ కళ్లారా చూసినంతగా ఆ వదంతిని అంతా నమ్మేశారు. చివరికొచ్చేసరికి పద్మనాభన్ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దురదృష్టవశాత్తూ వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. ‘‘కేవలం ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే భారతదేశం అంతగా ప్రభావితం అయిందా? పాలన యంత్రాంగం ఆ స్థాయిలో అప్రమత్తం అవాల్సి ఉండిందా? దేశవ్యాప్తంగా అంతగా కీకర బీకరలు అవసరమా?’’ సహజంగానే విమర్శలు వచ్చాయి. ‘‘టిబెట్లోకి ఉపసంహరించుకోవడానికి గానీ భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందా? లేక, చివరికి మనం పామిర్ పర్వతాలను అధిరోహించి, ప్రపంచ పైకప్పును గానీ చేరుకోబోతున్నామా? ఇంకా ఎక్కడైనా ధైర్య సాహ సాలు మిగిలి ఉన్నాయా?’’ అని ‘ద స్టేట్స్మన్’ పత్రిక గొప్ప గద్దింపుతో ఉరిమింది. కానీ ఎవరూ ఆ ఉరుమును విన్నట్లు లేరు. సరే, ఇంత జరిగినా ‘ద గ్రేట్ ఫ్లా్యప్...’ రావలసినంతగా ఎందుకు గమనింపునకు రాలేదు? ఎందుకంటే, ‘‘ఇండియా వైపు నుంచి ఒక్క అధికారిక ప్రకటన, ఒక్క పరిగణన కూడా లేకపోవడం వల్ల!’’ మద్రా సును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన తన తాత గారి నుంచి, తన తల్లి నుంచి పద్మనాభన్ ఆనాటి విషయాలను తెలుసుకున్నారు. వారు చెప్పిన కథల్ని ఈయన మరింతగా తవ్వి పోశారు. తత్ఫలితంగా నాటి భయాలు ఎంత విస్తృతంగా, ఎంత అతిశయోక్తితో ఉండేవో, తరచు వాటి ప్రతిస్పందన ఎంత నవ్వు పుట్టించేలా ఉండేదో ఆయన కనుగొన్నారు. ఇది కనుక మీకు డాడ్స్ ఆర్మీ (ప్రహసనం)ని గుర్తు చేసినట్లయితే, అలా గుర్తుకు రావటం తప్పేమీ కాకపోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పరమ కంగాళీ కథానాయకుడు
ఒక దేశానికి హైకమిషనర్గా, విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నుంచి తన వృత్తిపరమైన అనుభవాల రచనలను ఆశిస్తాం. కానీ కృష్ణన్ శ్రీనివాసన్ ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నంగా డిటెక్టివ్ రచయితగా అవతరించారు. అయితే ఒకటి, ఆ రచనల్లోనూ ఆ యా పాత్రలు ఆ వృత్తి తాలూకు జీవితాన్ని ప్రతిఫలిస్తాయి. ఒక్కోసారి అవి రచయిత వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా కూడా కనిపించవచ్చు. క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటి రచనలను ఊహించనే లేరు. ఒక పుస్తకం ఆ పుస్తక రచయిత వ్యక్తిత్వాన్ని ఎంత వరకు వెల్లడిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆ రచయిత గురించి ముందే మీకు తెలిసి ఉంటే తప్ప మీరెప్పటికీ ఆ వైపుగా ఆలోచించరు. ఒకవేళ అలా ఆలోచిస్తే కనుక ఆ వచ్చే ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయగలిగినదై ఉంటుంది. కృష్ణన్ శ్రీనివాసన్ విషయంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. క్రిస్, అదే... కృష్ణన్ శ్రీనివాసన్... నలభై ఏళ్లుగా నాకు మిత్రుడు. మొదట లాగోస్లో మేము కలుసుకున్నాం. అప్పుడాయన హై కమిషనర్. నేను లండన్ పత్రిక ‘ది టైమ్స్’కు కరస్పాండెంట్. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఎదిగాక మా స్నేహం కూడా వికసించి విప్పారింది. రాయటం అనేది క్రిస్కి సంతోషం కలిగించే సంగతని నాకు తెలుసు కానీ, అపరాధ పరిశోధన రచనల్లో ఆయన ఆరితేరినవారని నాకెన్నడూ అనిపించలేదు. పదవీ విరమణ అనంతరం క్రిస్ ఏడు పుస్తకాలు రాశారు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటివి ఊహించనే లేరు. లేక, నేనేమైనా పొరపడ్డానా?క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు అతడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. అంతేకాదు, క్రిస్ చెబుతున్న దానిని బట్టి... అతడి దుస్తులను అంధుడైన ఒక టైలర్ వాడుకగా కుడుతుంటాడు. మాక్రో... జేమ్స్ బాండేమీ కాదు. అందమైన స్త్రీల కోసం అతడు కానీ, అతడి కోసం ఆ అందమైన స్త్రీలు కానీ పరుగులు పెట్టటం ఉండదు. అతడు అలవాటుగా సేవించే మద్యం టమాటా రసం. ‘మార్టినీ’ని ఏం చేసుకోవాలో అతడికి తెలియదు. అయితే ‘‘అతడి నిశిత దృష్టికి సంబంధించి పైపైన కనిపించేదంతా మనల్ని పక్కదారి పట్టించేదే’’. అతడు ప్రతీదీ చూస్తాడు, అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ముగింపులకు వచ్చేస్తాడు. అతడిని ఊహించుకుంటే నాకు అగాథా క్రిస్టీ అపరాధ పరిశోధక నవలల్లోని మిస్ మాపుల్ అనే కల్పిత పాత్ర స్ఫురించింది. మార్కో వంటి ఒక వ్యక్తిని క్రిస్ ఆరాధిస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. అతడి పట్ల గొప్ప ఇష్టంతో అతడి గురించి రాస్తాడని కూడా అనుకోను. క్రిస్ స్నేహితులుగా నేను ఎరిగిన వారంతా మార్కో తరహాకు పూర్తిగా భిన్నమైనవారు. నిజా నికి క్రిస్ కూడా అలాంటì వ్యక్తిని వ్యతిరే కిస్తాడు. నేను కనుగొన్న మరొక సంగతి... క్రిస్ చూపు మిక్కిలి లోతైనదని. వస్త్రధార ణను బట్టి ఎలాంటి వారో చెప్పగల నైపుణ్యం ఆయనకు ఉంది. ఆయన తాజా పుస్తకం ‘రైట్ యాంగిల్ టు లైఫ్’ లోని ఒక పురుష పాత్ర వర్ణన ఎలా ఉందో చూడండి: ‘‘రెండు రోజులుగా గడ్డం గీయని ఆకర్షణీయమైన ముఖం, పదునైన చెంప ఎముకలు, లేత గోధుమ రంగు కళ్లు, నుదుటిపై పడుతున్న దట్టమైన ముంగురులు, టమాటా రంగు ఓపెన్ నెక్ డ్రెస్ మీదకు తటస్థ వర్ణంలోని పియాహ్ కార్డాన్ లినన్ జాకెట్, చర్మానికి అంటుకుపోయే చినోస్ ప్యాంట్స్, సాక్సు వేయని స్వేడ్ లోఫర్స్ పాదరక్షలు... ఒక్క మాటలో ఒక మేల్ మోడల్ టైప్’’అంటూ... మనిషిని సాక్షాత్కరింపజేసిన ట్లే రాస్తాడు క్రిస్. స్త్రీ పాత్రలను క్రిస్ మరింత మెరుగ్గా వర్ణిస్తాడు. తాజా పుస్తకంలో... తన కథ చెప్పుకుంటూ పోయే వ్యాఖ్యాన పాత్ర కోయెల్ దేవ్... తనను తాను దృశ్యమానం చేసుకుంటూ: ‘‘ఒక చక్కటి సాధారణ వస్త్రధారణలోకి నేను మారిపోయాను. హారీమ్ ప్యాంట్స్ మీదకు పొడవాటి చేతుల వి–నెక్ సిల్కు బ్లవుజ్, దాని పైన డెనిమ్ జాకెట్ తొడుక్కుని, సెయింట్ వాలెంటైన్ లెదర్ షూజ్ ధరించాను. నా ముత్యాల చెవి దుద్దులు తీసి పెట్టుకున్నాను. బెల్లా వీటా స్ప్రేను మెడపైన, చెవుల వెనకాల చిమ్మినట్లుగా చల్లుకున్నాను. క్లినిక్ ప్లమ్ లిప్స్టిక్తో నా పెదవులను అద్దుకున్నాను’’ అని చెప్పుకుంటూ పోతారామె. క్రిస్ తనకు అప్పగించిన రాయబార విధుల్ని ఏ విధంగా పూర్తి చేసిందీ రాసి పంపేటప్పుడు కూడా ఇదే విధమైన వివరణాత్మకతను పాటించేవారా అని నేనిప్పుడు ఆశ్చర్యానికి లోనవుతున్నాను. తను సంభాషించిన వారిని ఇంత సూక్ష్మంగానే వర్ణించి ఉంటారా? ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు ఆయన ఎదురుగా కూర్చొని ఉండగా మిమ్మల్ని కూడా ఇంతే నిశితంగా అంచనా వేయడాన్ని మీరు పసిగట్టారా? ఏమైనా ఇది కేవలం తేరిపార చూడటం మాత్రమే కాదు. సరిగ్గా అంచనా వేయటం కూడా! ఒక మూసలో కాక, వ్యక్తులకు వేర్వేరుగా ఉండే ప్రత్యేక సూక్ష్మాంశాలను కొద్దిమంది రచయితలు మాత్రమే వడకట్టగలరు. చాలామంది లేస్–అప్స్(లేసులు పైకి కనబడేట్టుగా ఉండే షూలు)కు, మాకసిన్స్(లేసులు ఉండని షూలు)కు వ్యత్యాసాన్ని గుర్తించగలరు. కానీ ఎంతమందికి ఆక్స్ఫోర్డ్ షూజ్కి, బ్రోగ్స్ షూజ్కి తేడా తెలిసుంటుంది? నేనేం చెబుతున్నదీ మీకు అర్థం కావడం మొదలైందా? క్రిస్ తాజా రచనలోని కాల్పనికత ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని బహిర్గతం చేసింది. అది – మీరాయన్ని కేవలం రాయబారిగా, లేక సాయంత్రపు పార్టీలను ఇష్టపడే విలాస పురుషుడిగా మాత్రమే చూస్తుంటే కనుక మీరెప్పటికీ తెలుసుకోలేనిది! ఒక కాక్టైల్ పార్టీని ఆయన వర్ణించిన తీరు అలాంటి పార్టీల పట్ల ఆయన ఎంతగా జాగ్రత్తగా ఉంటారో సూచనప్రాయంగా తెలియ జేస్తుంది. ఇది గమనించండి: ‘‘అతిథులు మెల్లగా దగ్గరయ్యారు. తెచ్చి పెట్టుకున్న హృదయపూర్వకతల్లో కలిసిపోయారు. ప్రతి ఒక్కరూ తిరగడమే పనిగా తిరుగుతున్నారు. మళ్లీ మళ్లీ వాళ్లే వాళ్లే నిర్లక్ష్యంగా కలిపిన చేతుల్లోంచి జారి పడుతున్న పేకముక్కల్లా ఉన్నారు. పానీయాలు, నోటితో కొరికి తినగలిగినంత పరిణామంలోని నంజుళ్లు ఉన్న ట్రేలను మౌనంగా అందిస్తున్న వెయిటర్లు, వారి వెనుక – అయో మయ విశదీకరణలు, అస్పష్ట ఉపోద్ఘాతాలు, అర్థరహితంగా చెప్పిందే చెప్పడాలు, నిర్జీవ కరచాలనాలు, జవాబులే లేని వాకబులు, ఉత్సాహ పూరిత వాతావరణ ప్రస్తావనలు, హఠాన్మౌనాలు, చిత్తశుద్ధి లేని కుశల ప్రశ్నలు...’’ నిజంగానే నేను క్రిస్కి పార్టీలంటే ఇష్టం అనుకున్నాను. ఎంత పొరపడ్డాను! కానీ నేను చెప్పినట్లుగా – ఒక మనిషిలో మొదట మీరు అర్థం చేసుకున్న దాని కంటే చాలా ఎక్కువే ఉందని తెలుసుకోడానికి మీరు ఆ మనిషి రాసిన పుస్తకం చదవాలి. సమస్యేమిటంటే ఈసారి క్రిస్ ఎదురైనప్పుడు నేనేమి ధరించాలో నాకు తెలీదు. అలాగే నేనేం చెప్పాలన్నది కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తీక్షణ భావాల మృదుభాషి
‘‘ప్రతిపక్షం అన్నది ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు’’ అని దృఢంగా నమ్మేవారు ఫాలీ శామ్ నారిమన్. ‘‘ప్రస్తుత పరిస్థితులతో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని అనేవారు. ‘‘దారికి ఒప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నది ఆయన అభిప్రాయం. ‘‘భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి’’ అనేవారు. ఆఫీసులో నా డెస్కుకు ఎదురుగా ఉన్న గోడకు ఫాలీ నారిమన్ ఫొటో వేలాడదీసి ఉంటుంది. అది ఆయన స్వాభావిక మృదుహాసాన్ని, మిలమిల మెరిసే కళ్లను పట్టివ్వదు కానీ, ఆయనలోని దృఢచిత్తాన్ని, ఒడుదొడు కులను తట్టుకోగలిగిన స్థితిస్థాపక గుణాన్ని మాత్రం ప్రతిఫలిస్తూ ఉంటుంది. కెమెరాలోకి గుచ్చి చూస్తూ, తన కుడి చేతితో కుర్చీ ఆన్పును దృఢంగా పట్టుకుని ఉన్న ఆయన తీరును గమనిస్తే... ఆయన – తనేమిటో తనకు తెలిసిన మనిషి అనీ, తనను తాను స్వీయ స్పృహ లేకుండా వ్యక్తపరచుకోగలరనీ మీరు పసిగట్టగలరు. ఆ గోడపైన ఉన్నది – ఆయన చివరి పుస్తకం ‘యు మస్ట్ నో యువర్ కాన్స్టిట్యూషన్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయనతో నా చివరి ఇంటర్వ్యూకు ముందరి ఇంటర్వ్యూలో తీసిన ఫొటో. ఆ ఇంట ర్వ్యూలో ఆయన మాట్లాడిన చాలా విషయాలు మన దేశానికి ఒక సందేశం అనే నేను నమ్ముతున్నాను. ప్రసిద్ధ బ్రిటిష్ న్యాయ–విద్యావేత్త ఐవర్ జెన్నింగ్స్ను అంగీకా రంగా ఉటంకిస్తూ, నారిమన్ ఇలా అన్నారు: ‘‘పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ప్రతిపక్షమే అని అనడంలో అవాస్తవ మేమీ లేదు. ప్రతిపక్షం అన్నది ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం. ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రభుత్వం ఎంత ముఖ్య మైనదో, ప్రతిపక్షం పనితీరు కూడా దాదాపుగా అంతే ముఖ్యమైనది. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు.’’ అలా అని ప్రభుత్వాన్ని మనం ఎలా ఒప్పించగలమని ఇంటర్వ్యూ మధ్యలో నేను అడిగినప్పుడు, ఆయన నవ్వి ఊరుకున్నారు. అది నేను చేయగలిగిందైతే కాదు అన్నారు. ఏమైతేనేం, ఆయనే ఆ తర్వాత ‘‘నాకొచ్చిన సందేహాన్నే మీరు వ్యక్తం చేయటం నాకెంతగానో సంతోషంగా ఉంది’’ అన్నారు. నారిమన్ మాట్లాడే ధోరణి సూటిగా, సందర్భశుద్ధితో ఉంటుంది తప్ప... ఎప్పుడూ కూడా బాధించేలా, అభ్యంతరకరంగా ఉండదు. కొన్నిసార్లు ఆయనే మిమ్మల్ని మెల్లగా నడిపిస్తున్నారని కూడా మీరు తెలుసుకోలేరు. ఉదాహరణకు, బహుశా మేము తొలిసారి కలుసు కోవటం రచయిత పత్వంత్ సింగ్ ఇంట్లోననుకుంటా... ఆయన నా భుజం చుట్టూ చేయి వేసి – మిగతావాళ్లంతా డైనింగ్ టైబుల్ దగ్గర్నుంచి డ్రాయింగ్ రూమ్కు కదులుతూ ఉండగా – నన్ను ఒక మూలకు తోడ్కొని వెళ్లారు. ‘‘గుర్తుంచుకో! పత్వంత్ ఎప్పుడూ కూడా చివరి మాట తనదే కావాలని కోరుకుంటాడు. అలా ఉండేందుకు మీరు ఆయన్ని అనుమతిస్తే ఎప్పటికీ మీ స్నేహితుడిగా ఉంటాడు’’ అన్నారు. బాగా గుర్తు... పత్వంత్ని నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. సన్నటి గీతను దాటేస్తున్నానేమోనని నారిమన్ నన్ను నెమ్మదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అతి సమీపంగా ప్రస్తావనకు వచ్చిన అనేక అంశాలపై ఇంటర్వ్యూలో నారిమన్ ఇదే విధమైన సున్నిత శైలిని అవలంబించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని ఆయన అన్నారు. ‘‘దారికి రప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. ‘‘పరిస్థి తులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నారాయన. ఇటీవలి ఆయన మరణం తర్వాత నేను మళ్లీ ఆనాటి ఇంట ర్వ్యూను విన్నాను. నారిమన్ ఎంత బుద్ధిశాలిగా మాట్లాడారో వెంటనే గమనించాను. ‘‘రాజ్యాంగంలో ప్రవేశిక చాలా ముఖ్యమైన భాగం’’ అన్నారు. ప్రవేశికను ఆయన రాజ్యాంగం యొక్క మనస్సాక్షి అన్నారు. ప్రవేశికలోని ‘సౌభ్రాతృత్వం’ అనే భావన గురించే ఆనాడు ఆయన నొక్కి మాట్లాడారా? ప్రవేశికలో మాత్రమే ఉన్న మాట అది. ఆ తర్వాత ‘సహనశీలత’ వైపుగా మా సంభాషణను నడిపించింది నేను కాదు, ఆయనే! ప్రస్తుతం సమస్యేమిటంటే మనకు ‘‘సహనం లేదు’’ అన్నారాయన. మళ్లీ ఆ తర్వాత కూడా ఈ మాట అనడం కోసం ఆయన తన పుస్తకం హద్దులను సైతం దాటేశారు. ఆప్పుడు నేను పట్టుకోలేకపోయాను కానీ, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆలోచిస్తే ఆయన ఎంత జాగ్రత్తగా ఆ సందేశాలు ఇచ్చారో కదా అని ఆశ్చర్యం కలుగుతోంది. మరికొన్ని కూడా ఉన్నాయి. భారత పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నిలబెట్టేందుకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి అన్నారు. అలా ఉండేందుకు వారు ఇష్టపడకపోవటం ఆయన్నెంతో నిరాశకు గురి చేసింది. అయితే వారిని తీవ్రంగా విమర్శించేందుకు సంకోచించి, ‘క్యురేట్స్ ఎగ్’తో పోల్చి సరిపెట్టుకున్నారు... మంచీ ఉందీ, చెడూ ఉందీ... అయితే మంచిని చెడు తినేస్తోంది అనే అర్థంలో! నారిమన్తో నేను పలు ఇంటర్వ్యూలు చేశాను. తొలినాళ్లలో ఆయన స్పోర్టింగ్ బ్రేసెస్ని ధరించి ఉండేవారు. నాకు బౌ టై ఉండేది. మా మధ్య సంభాషణ గొప్ప శక్తితో, ఆసక్తితో సాగేది. మధ్యలో స్నేహ పూర్వకమైన అంతరాయాలను కలిగించుకునేవాళ్లం. ఉల్లాసం, ఉత్సాహం తరచూ మా ఇంటర్వ్యూలను నడిపించేవి. అవును, మా సంభాషణ గురించి ఇలాగే చెప్పాలి. ఆయన భార్య బాప్సి ఓ వైపున కూర్చొని ఉండి మా సంభా షణను ఆలకిస్తూ ఉండేవారు. దాదాపు ప్రతిసారీ ఆమె నన్ను భోజనానికి ఉండమనేవారు. ఆమె అలా అనడమే ఆలస్యం నేను భోజనా నికి తయార్! ఆయన నాతో పాటుగా కారు వరకు బయటికి నడిచి వచ్చేవారు. నేను వారికి వీడ్కోలు చెబుతున్నప్పుడు... ‘‘ఆమెకు నువ్వంటే అభిమానం’’ అని నవ్వుతూ అనేవారు. ఆ గుణం కూడా ఆయన గురించిన సముచితమైన విశేషణమే. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవభావం. ఆయన మేధ నన్ను ముగ్ధుడిని చేసేది. మనసులో ఏదీ దాచుకోలేని ఆయన స్వభావం, ఒక సరైన పని చేయటంలో ఆయనకు ఉండే నిస్సంశయ నిబద్ధత నన్ను ఆశ్చర్యచకితుడిని చేసేవి. నేను కూడా ఆయనపై అభిమానం పెంచు కున్నాను. పెద్దగా పరిచయం లేకుండానే ఏర్పడే ఆప్యాయత వంటిది ఆ అభిమానం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డ్రాగన్కు పావురంతో పనేంటి?
కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక చైనీస్ అక్షరాలున్న ఒక పావురాన్ని గత మే నెలలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘అనుమానాస్పదమైన సమాచారం’ లభించకపోవడంతో విడుదల చేశారు. చివరకు అది తైవాన్ నుంచి తప్పిపోయి వచ్చిన రేసు పావురం అని తేలింది. ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎగరగలవు. భారత అధికారులు ఒక పావురాన్ని బంధించటం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2020లో కూడా ఇలా జరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో పావురాలను నిఘా కోసం ఉపయోగించారు. కానీ గూఢచర్యం కోసం ఇప్పుడు అనేక అత్యాధునిక సాధనాలు ఉన్నప్పుడు, చైనా ఒక రేసు పావురాన్ని వదిలిపెడుతుందా? తరచూ మన దేశంలో చిత్ర విచిత్రాలు, అద్భుతమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. అసలలా ఉండటమే ఇండియాను ఉత్సుకతను రేకెత్తించేలా, ఉత్తేజం కలిగించేలా, అనేకసార్లు ఊహాతీత మైనదిగా చేస్తుంటుంది. అయితే ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ఇవేవీ కానటువంటి పూర్తి భిన్నమైన కొత్త కోణాన్ని ఇండియాకు జోడించింది. నిజం చెప్పాలంటే, ఆ కొత్త కోణాన్ని నేను ఏ విధంగానైనా వివరించగలనేమో నాకు తెలియటం లేదు. మీకే వదిలేస్తాను. ‘ద పోస్ట్’లో వచ్చిన కథనం ఇలా మొదలౌతుంది: ‘‘చైనా తరఫున గూఢచర్యానికి వచ్చి వాలిందన్న అనుమానంపై ఎనిమిది నెలల పాటు బందీగా ఉంచిన ఒక పావురాన్ని చివరికి అది గూఢచారి ఏజెంట్ కాదనీ, దిక్కుతోచక దారి తప్పి వచ్చిన తైవాన్ రేసింగ్ పక్షి అనీ నిర్ధారించుకున్న భారత అధికారులు దానికి విముక్తి కల్పించారు.’’ కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక ఈకల చాటున చైనీస్ అక్షరాలు కలిగి ఉన్న ఈ పావురాన్ని గత మే నెలలో ముంబైలోని ఒక ఓడరేవు సమీపంలో కనిపెట్టిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘‘లోతైన మరియు సరైన దర్యాప్తుతో పాటుగా, అనేక విచా రణలను’’ జరిపిన అనంతరం ‘‘అనుమానాస్పదమైన సమాచారం గానీ, తగిన సాక్ష్యాధారాలు గానీ’’ తమకు లభించలేదని ముంబై పోలీసులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. తదనుగుణంగా – ఇప్పటికి దాదాపు మూడు వారాల క్రితం – విడుదలైన ఆ పక్షి మంచి ఆరోగ్యంతో ఉంది. ‘ద పోస్ట్’ పత్రిక సంప్రదించిన నిపుణులు చెప్పటం ఏమిటంటే– బహుశా ఆ పావురం పరుగు పందేల్లోని పక్షి అయుండి, ‘‘తైవాన్ తీరానికి సమీపంలో జరిగిన రేసింగ్ పోటీల నుంచి దారి తప్పి, అక్కడి నుంచి పడవలో దాదాపు 3,000 మైళ్లు ప్రయాణించి’’ ఉండొచ్చని! అయితే రేసు పావురాల వ్యాపారం చేస్తుండే తైవాన్ కంపెనీ ‘నైస్ పీజన్’ యజమాని యాంగ్ త్సంగ్–టే ‘‘ఒక రేసు పావురం ఒక రోజులో 1,000 కిలోమీటర్ల వరకు ఎగరగలదనీ, అయితే అది ఇండియా వరకు ఎగురుతూ వెళ్లగలిగిందీ అంటే మధ్యలో కొన్ని మజిలీలు చేసి ఉంటుందనీ’’ అన్నారు. ‘‘ఏమైనా, కొన్ని పావురాలు తైవాన్ తీర ప్రాంతం నుంచి యూఎస్, కెనడా వరకు కూడా వచ్చిన ఉదంతాలు ఉన్నాయి’’ అని ఆ పత్రిక రాసింది. తైవాన్, ఉత్తర అమెరికాల మధ్య విస్తారమైన మహా సముద్ర జలం తప్ప వేరే ఏమీ లేనందున, పక్షులు అంతదూరం ఎలా వెళ్లగలిగాయో నాకైతే అంతు పట్టటం లేదు. ఒకవేళ పావురాలకు ఈత కొట్టటం గానీ తెలిసి ఉంటుందా? భారత అధికారులు ఒక పావురాన్ని పట్టి బంధించటం ఇదే మొదటిసారి కాదు. ‘ద పోస్ట్’ చెబుతున్న దానిని బట్టి 2015లో,మళ్లీ 2020లో ఇలా జరిగింది. ఆ సందర్భంలోనే... ‘‘భారీ సైనిక మోహరింపులతో ఉండే సరిహద్దుల మీదుగా ఎగిరొచ్చిన ఒక పాకి స్తానీ మత్స్యకారుడి పావురాన్ని పోలీసులు స్వల్పకాలం పాటు అదుపులోకి తీసుకున్నారు.’’ ఇప్పుడు మీరు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్న ముంబై పోలీసులను చూసి పరిహసించే ముందు, చరిత్రలో పక్షుల గూఢ చర్యం నిజంగానే ఉండేదని ఆ పత్రిక రాసిన విషయాన్ని గమనించాలి. ‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ... పావురాల ఛాతీకి కెమెరాలను కట్టి శత్రు దేశాల గుట్టుమట్లను కనిపెట్టేందుకు వాటిని ప్రయోగించేది. పక్షి కంటే కూడా ఆ పక్షికి కట్టిన కెమెరా పెద్దదిగా ఉండేదని నేను రూఢిగా చెప్పగలను. ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు (జర్మనీని వ్యతిరేకించే బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మొదలైన దేశాలు) తమ మధ్య రహస్య సందేశాల బట్వాడాకు పక్షులను ఉపయోగించాయి.’’ దీని వెనుక ఉండే కారణానికి పెద్ద వివరణేమీ అక్కర్లేదు. ‘‘పావురాలు సాధారణ పక్షి జాతులు. కెమెరా కట్టి ఉన్న పావురాలైనా సరే, గూఢచారి పక్షుల్లా ప్రత్యేకంగా కాక, వేలాది ఇతర పక్షుల కార్యకలాపాల మధ్య దాగిపోయేవి’’ అని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చెప్పడమే కాకుండా, అలాంటి ఒక రహస్య కెమెరాను సైతం వృద్ధి చేసింది. స్వయంగా సీఐఏనే ఈ విషయాన్ని వెల్లడించింది కనుక అది నిజమే అయి వుంటుంది. అయితే ‘ద పోస్ట్’ సంప్రదించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్నేమీ కలిగి లేరని తెలుస్తోంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ‘ద గ్లోబల్ పీజన్’ పుస్తక రచయిత కాలిన్ జరోల్మాక్కు ఇందులో భారతదేశ అసంబద్ధ పరిస్థితే కనిపించింది. ఆ స్థితిని సరిగ్గా చెప్పాలంటే, ‘చాలా హాస్యాస్పదం’ అన్నారు. ‘‘గూఢచర్యం కోసం చైనా అనేక అత్యాధునిక సాధనాలను కలిగి ఉందనీ, వాటిని విజయవంతంగా భారత్పై ప్రయోగిస్తుంది తప్పితే, రేసు పావురాలనైతే వదిలిపెట్టదు కదా’’ అని కాలిన్ జరోల్మాక్ వ్యాఖ్యానించారు. కావొచ్చు! నేను కిటికీ దగ్గర కూర్చొని, పావురాల ‘గూ.. గూ’ లను వింటు న్నప్పుడు, అవి నాపై నిఘా పెట్టేందుకు రాలేదు కదా అని అనుకోకుండా అయితే ఉండలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో మన ప్రియమైన ప్రభుత్వం ఈ విధంగానే తెలుసుకుంటుందా? పావురాలు తరచూ కిటికీ అంచులపైన కనిపించడానికి కారణం అవి తమ రెట్టలను అక్కడ వదిలి వేయడానికే అయుంటుందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే వాటి చిన్నికళ్ల లోతుచూపులను బట్టి, అక్కడ అవి వదిలిన దాని కన్నా ఎక్కువగా తీసుకుని ఉంటాయా అని యోచిస్తాను. కాబట్టి, ఈసారి ఒక పక్షి మీ తలపైన ఎగురుతూ ఉండటాన్ని, లేదా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని కిందికి చూస్తూ ఉండటాన్ని మీరు గమనించినప్పుడు అది ఏదైనా ప్రయోజనం కోసం అక్కడికి వచ్చి వాలిందా అని ఆలోచించండి. బహుశా అంతదూరంలోని బీజింగ్ నుండి కాకపోయినా, దగ్గర్లోని ‘సౌత్ బ్లాక్’ (ప్రధానమంత్రి కార్యా లయం ఉండే చోటు) నుండి అది వచ్చి ఉండొచ్చు. అలాంటి పక్షులకు మేత మాత్రం వేయకండి. మనం వాటికి అందించే ఆహారపు తునకలు అవి తమ యజమానుల నుండి పొందే ప్రతిఫలాల ముందు పెద్ద విషయమేం కాదు. చివరిగా, ఈ వ్యాసం పక్షులకు సంబంధించినదని మీరనుకుంటే కనుక మీరలా అనుకోవటం సరైనదే కావచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్పీ డిమాండ్కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం
ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్ జర్నలిస్టులు రాసిన ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్హుడ్స్’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్ ఛానెల్ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్హుడ్స్’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియమ్ అలావీ; ‘స్క్రోల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్... ‘పింక్ రివల్యూషన్’. ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. లవ్ జిహాద్పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్ జిహాద్పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్ లోనిది. వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్ జిహాద్ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్లోని మీడియా ఆర్కైవ్స్ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని వారు వివరాలు పొందు పరిచారు. ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు! మీలో చాలామంది లవ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు. ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను. ‘‘హిందూ రైట్వింగ్ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్ని తగ్గిస్తే అన్ని నెగ్గినంత!
28 పార్టీల ‘ఇండియా’ కూటమి ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టే అది తన లక్ష్యం సాధించగలదా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నియంత్రించి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఈ రెండు కూడా వేర్వేరు లక్ష్యాలు. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే ‘ఇండియా’ కూటమి లక్ష్యమైతే... చేజేతులా బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! అలా కాకూడదంటే, ఓట్లు చీలకుండా ఆ యా పార్టీలు తాము గెలవలేని రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం సీట్లను త్యాగం చేయవలసి ఉంటుంది. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం సరళమైనది, సూటిగా మాట్లాడు కోబోయేదీ. అదేమిటంటే – వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీని, భార తీయ జనతా పార్టీని ‘ఓడించాలన్న’ 28 పార్టీల ‘ఇండియా’ కూటమి కల నిజం అవుతుందా అన్నది! అయితే ఆ కల నిజం అవటం అన్నది ఒకే ఒక ప్రశ్నకు లభించే సమాధానం పైనే అధారపడి ఉంటుంది. ‘ఇండియా’ కూటమి లక్ష్యం ఏమిటన్నదే ఆ ప్రశ్న. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నెట్టేసి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ఆ పార్టీ తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఇవి రెండూ వేర్వేరు లక్ష్యాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే లక్ష్యంగా అవి కూటమి కలను సాకారం చేయగలిగినవి కావు. రెండు లక్ష్యాలకు వేటికవిగా భిన్న విధానాలు, భిన్న వ్యూహాలు అవసరం. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే తన లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి పెట్టు కున్నట్లయితే... అది చేజేతులా చాలా పెద్ద సంఖ్యలో సీట్ల గెలుపుతో బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! బీజేపీని 272 సీట్లకు దిగువనే ఉంచటానికి కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ తన పరిమితుల్ని అంగీకరించవలసి ఉంటుంది. పైకి అదే మంత పెద్ద విషయంగా అనిపించకపోయినా ప్రధానంగా అదే పెద్ద విషయం. కూటమి లబ్ధి కోసం పార్టీలు తమ ప్రయోజనాలను త్యాగం చేయటం అవసరం. అప్పుడు మాత్రమే ఇండియా కూటమి కనీసం 400 సీట్లలో ప్రత్యర్థితో ముఖాముఖి తలపడగలదు. అప్పుడు మాత్రమే ప్రతిపక్ష కూటమికి పడిన 60 శాతం ఓట్లు... పోటీలో ఉన్న ఎక్కువమంది అభ్యర్థుల మధ్య చీలిపోయే అవకాశం ఉండదని ఆశించవచ్చు. ఈ విషయం మీకు వివరంగా చెప్పడానికి కాంగ్రెస్ను నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో ఇటీవలి చరిత్రలను చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్కు ఉన్న విజయా వకాశాలు పరిమితమేననీ, వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలకు కూడా ఇది సమయం కాదనీ నిర్ధారణగా తెలుస్తుంది. 2014లో ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ రెండంటే రెండే లోక్సభ సీట్లను గెలుచుకుంది. యూపీలోనే 2022 విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన సీట్లు కూడా రెండే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్లు వరుసగా 6.4. శాతం, 2.4 శాతం. బెంగాల్లో మరీ హీనం. అక్కడ 2019లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2021 శాసనసభ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన ఓట్లు వరుసగా 5.7 శాతం, 3.1 శాతం. స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే, కాంగ్రెస్ ఎన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లలో గెలుస్తోంది. బిహార్లో సరిగ్గా ఇదే జరిగింది. 2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తే, గెలిచింది 19 సీట్లు మాత్రమే. అంతకు ముందరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలే ఇక్కడా పునరావృతం అయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సీట్లకు పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. అయితే, ‘ఇండియా’ కూటమిలోని తక్కిన పార్టీలు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా త్యాగాలు చేయవలసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవి: మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో సమాజ్వాది, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు తమ ప్రయోజనాలకు అతీతంగా పని చేయాలి. ఆశల రెక్కల్ని చాపుకోడానికి వాటికిది సమయం కాదు. బీజేపీని ఆ రాష్ట్రా లలో ఓడించగల స్థానంలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఉంది. అలాగే ‘ఇండియా’ కూటమికి సమస్యాత్మకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పంజాబ్, ఢిల్లీ ప్రధానమైనవి. పంజాబ్లో లోక్సభ స్థాయిలో కాంగ్రెస్ 8 సీట్లు, ఆమ్ ఆద్మీ 1 సీటు గెలుచు కున్నాయి. శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. ఆప్ 92 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల విజయం సాధించాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ గానీ, ఆప్ గానీ ఒక్క లోక్సభ సీటును కూడా గెలుచుకోలేక పోయాయి. అయితే ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ఆప్దే పైచేయిగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల విభజన అంత సులభమేమీ కాదు. అయినప్పటికీ అత్యాశతో అవి విభజనకు ప్రయత్నించాయా... బీజేపీ గెలిచినట్లే! నేను చెప్పాలనుకున్న ఈ విషయం ఎందుకింత సరళంగా, సూటిగా... అదే సమయంలో ఎందుకింత ముఖా నికి కొట్టొచ్చినంత స్పష్టంగా కూడా ఉన్నదో మీకు అర్థ మయిందా? నా ఈ విశ్లేషణతో విభేదించడం ‘ఇండియా’ కూటమికి స్వయంకృత పరాజయం మాత్రమే అవుతుం దన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించగలరా? బీజేపీని 272 సీట్లకంటే తక్కువకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు కనీసంలో కనీసంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. త్యాగాలకు సిద్ధపడటం, అత్యాశను వదులుకోవటం. ఇవి కాకుండా వారు తెలుసుకోవలసినవి ఇంకొన్ని కూడా ఉన్నాయి. మొదటిది: ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు పనికిరావు. రెండు: అదానీ, క్రోనీ క్యాపిటలిజం (రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కుమ్మక్కు అవటం), చైనా వైఖరి పట్ల మోదీ బలహీనమైన ప్రతిస్పందన, లేదా మైనారిటీలను తక్కువగా చూడటం అనే అంశా లేవీ ఓట్లు రాల్చేవి కాదు. ఈ రెండు విషయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్న ద్రవ్యో ల్బణం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పేదరికం వంటి వాటిపై కూటమి దృష్టి పెట్టాలి. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళతాను. ‘మోదీకి పోటాపోటీ ఎవరు?’ అనే ప్రశ్న... ‘ఇంకెవరు? రాహుల్గాంధీ’నే అనే సంసిద్ధ సమాధానంతో పూర్తవదని ఇండియా కూటమి స్పష్టతను కలిగి ఉండాలి. రాహుల్ గాంధీ కూడా తను కనీసం సంభావ్య ప్రధాని మంత్రి అభ్యర్థినైనా కానని స్పష్టం చెయ్యాలి. అవసరమైతే, నిస్సందే హంగా అది ఆమోదం పొందేవరకూ రాహుల్ పదే పదే దాన్ని పున రుద్ఘాటించాలి. చివరిగా కాంగ్రెస్కు ఒక మాట. మోదీని, బీజేపీని ఓడించడం తేలిక కాదు. ఆ పార్టీని 272 సీట్ల దిగువకు దింపడమే కాంగ్రెస్ పార్టీ 2024 లక్ష్యం కావాలి. 2029లో మాత్రమే కాంగ్రెస్ తను సొంతంగా మెజారిటీ సాధించేందుకు పని చేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!
బ్రిటన్ భిన్నమైన దేశం. బ్రిటన్ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది. ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్ దేశాన్ని, బ్రిటన్ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను. ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను. కానీ డిసెంబర్ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత. రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్ క్లాస్ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్ ట్రాక్’ను బ్రిటన్ తొలగించి ఉండటమే అందుకు కారణం. విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్రూమ్కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. అదింకా క్రిస్మస్కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్ కౌంటర్లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. అప్పటికి మా బ్యాగులు లగేజ్ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నేను హీత్రోలో ల్యాండ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్. స్మిత్ కౌంటర్ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్ 3లో దిగితే భారతదేశ పాస్పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప? నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ను ఉపయోగించకుండా బ్రిటిష్ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొత్త నిర్ణయాలు తీసుకుందాం!
కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదే విధంగా మనమంతా ఒక దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంటులో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలూ, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లూ తీర్మానించుకోవాలి. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా వాహనాలను ధ్యాసగా, జాగ్రత్తగా నడుపుతామని మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ మూణ్ణాళ్లకే ఈ తీర్మానాలన్నీ వట్టి ముచ్చటగా మారిపోతే? అసలీ తీర్మానాలు తీర్చేవా, మార్చేవా? దీనికి ఒకటే జవాబు. తీర్చడం, మార్చడం కళ్లకు కనిపించపోవచ్చు. కానీ, అసలంటూ కొత్త నిర్ణయం తీసుకోవటం అన్నదే సంకల్ప సాధనలోని నిబద్ధతకు మొదటి మెట్టు అని గుర్తించాలి. పూతకొచ్చే తీర్మానాలకు కొత్త సంవత్సరం ప్రియమైన రుతువు అయినప్పటికీ, వాటిల్లో చాలా వరకు ఎక్కువ కాలం జీవించి ఉండవు. గొప్ప ఉత్సాహపు ధ్వనితో మొగ్గ తొడిగి, చప్పుడే కాని పరిహాసపు గాలివానలతో టప్పున నేల రాలేందుకే అవి చిగురిస్తాయి. అయినప్పటికీ, మనమంతా ఒక దేశంగా కొన్ని తీర్మానాలను స్వీకరించాలని నేనిప్పుడు సూచించబోవడం మీకొక ప్రశ్నార్థకం అవొచ్చు. దీనికి చాలా సులభమైన జవాబే ఉంది. చేయాలని అనుకున్న దానిలో నిబద్ధత కొరవడినా, ఏం చేయవలసిన అవసరం ఉన్నదో దానిని ఒక సంకల్పంలా తీసుకోవడమే అసలొక తీర్మానం. కనుక ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఆ మొదటి అడుగు వేద్దాం. ‘సంకల్పం’ అనే అడుగు. మొదటిది, ఒకటేంటంటే మన రాజకీయ నాయకులు చేయ వలసినది. పార్లమెంటులో ఎంతో విలువైన ప్రజాసమయ దుర్విని యోగానికి పాల్పడే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదని వారు తీర్మానం చేసుకోవాలి. వాళ్లు అక్కడ కూర్చున్నందుకు మీకు, నాకు అవుతున్న ఖర్చు నిమిషానికి 2 లక్షల 50 వేల రూపాయలు. ఈ ఖర్చును మనం సంతోషంగానే భరిస్తున్నాం. ఎందుకంటే, నిజాలను నిగ్గు తేల్చేందుకు, ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపేందుకు, నిశిత పరిశీలనకు; అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేయడానికి... ప్రశ్నలు, చర్చలు తప్పనిసరి అని మనం విశ్వసిస్తాం. అటువంటిది... సభ ‘వెల్’లోకి దూసుకెళ్లే, స్పీకర్పై రంకెలు వేసే, సభకు గైర్హాజరు అయ్యే ఎంపీలకు మన కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చుపెట్టాలి? 16వ లోక్సభ (2014–19) సభా సమయం 1,615 గంటలు కాగా,అందులో 16 శాతం సమయాన్ని అంతరాయాలు, వాయిదాల కారణంగా కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయానికి అయిన ఖర్చు రూ. 39 కోట్లు. మన ప్రజాప్రతినిధులుగా, మనం వారికి నిధులు సమ కూరుస్తున్నాం కనుక, ఆ విలువకు సమానమైన సేవలను మన ఎంపీలు మనకు అందించాలి. అందుకు మనం అడుగుతున్నదల్లా పార్లమెంటు సమర్థంగా, అర్థవంతంగా పనిచేయాలని! వారి నుండి ఈ కొత్త సంవత్సరం మనకు ఇలాంటి హామీ లభిస్తుందా? తర్వాత, ప్రెస్! ఇక్కడ నా ఉద్దేశం ప్రెస్ అంటే ప్రధానంగా టెలివి జన్ న్యూస్ చానెళ్లు. టీవీ వీక్షకులు డబ్బు చెల్లిస్తారు కనుక ముఖ్యమైన వార్తల్ని ఆశించే హక్కు వారికి ఉంటుంది. ఏది ముఖ్యమైన వార్తో నిర్ణయించడానికి అనేకమైన ప్రామాణికాలు ఉంటాయన్న దాంట్లో సందేహమేమీ లేదు కానీ, చివరికొచ్చేటప్పటికి ప్రధానంగా ప్రాముఖ్యం, ఔచిత్యం, సమతౌల్యం అనేవి లెక్కలోకి వస్తాయి. కనుక టీవీ వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, దయచేసి మీరు సినిమా తారలు, క్రికెటర్ల పట్ల మీకున్న మక్కువను వదులుకోండి. ‘బ్రేకింగ్ న్యూస్’ కోసం మీ పరుగులను ముగించండి; బదులుగా కచ్చితత్వం పైన, విశ్లేషణ మీద దృష్టి పెట్టండి; మరీ ముఖ్యంగా... సాగతీతల్ని ఆపేయండి. ఏ వార్తా కథనానికైనా తన సహజమైన నిడివి ఉంటుంది. కేవలం ప్రసార సమయాన్ని భర్తీ చేయడానికి ఆ నిడివిని పొడిగించుకుంటూ పోకండి. గుర్తుంచుకోండి. మేము పెద్దవాళ్లం; మమ్మల్ని పిల్లల్లా చూడకండి; మేము తరచు పిల్లల్లా స్పందిస్తున్నా కూడా అలాగే, మన యాంకర్లకు ఎవరైనా చర్చల లక్ష్యం జనం మధ్య గొడవలు సృష్టించడం కాదని చెప్పగలరా... ఆ జనం ఒకవేళ గొడవలకు సిద్ధంగా ఉన్నప్పటికీ! చర్చ అనేది ప్రజాభిప్రాయాన్ని రాబట్టేందుకు... అది కూడా ఒక వివేచనతో, వీలైతే తక్కినవారికి భిన్నంగా, పూర్తిగా తమదైన ప్రత్యేకతతో ఉండాలనీ... చర్చకు వచ్చిన అతిథులు తమతో ఏకీభవించేలా యాంకర్లు వారిపై మాటల బల ప్రయోగం చేయకూడదనీ వీక్షకులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశపడదాం. చివరిగా, మనమంతా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్న విషయం – సురక్షితంగా వాహనం నడపడం. పద్ధతిగా, తెలివిడిగా నడపాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీని దాటేందుకు వేరే వైపు మళ్లకండి. ఎర్ర రంగు పడటానికి ముందు ఆరెంజి రంగులోకి సిగ్నల్ మారినప్పుడు మీ అదృష్టంపై నమ్మకంతో జంక్షన్లో మీ వాహనాన్ని ముందుకు దూకించకండి. ఇంకొక సంగతి, మీరు మీ కారును పార్క్ చేస్తున్నప్పుడు వేరొకరి గేటుకు కానీ, తోవకు కానీ అడ్డంగా నిలుపుతున్నారేమో గమనించండి. ఇక మన డ్రైవింగ్ ఎలా ఉండాలనే దానికి ఎల్ల వేళలా వర్తించే సాధారణ నియమం – రోడ్డుపై మీరే కాకుండా ఇంకా చాలామంది వాహనం నడు పుతూ ఉంటారు కనక – రోడ్డుపై మీకున్నంత హక్కే వారికీ ఉంటుందని గ్రహించడం! మరీ పాత సంగతి కాదు కానీ, సిగరెట్ తాగడం మొదలుపెట్టాలని నాకొక కొత్త సంవత్సర తీర్మానం ఉండేది. గడియారం సరిగ్గా రాత్రి పన్నెండు కొట్టగానే నా వేళ్ల మధ్య సిగరెట్ వెలుగు తుండేది. మర్నాడు సాయంత్రమంతా ఉమ్మడం, దగ్గడం! ‘సిగరెట్ తాగకపోవడం’ అనే వ్యసనాన్ని దూరం చేసుకోడానికి నేను ఎంచుకున్న మార్గం అది. అయితే జనవరి చివరినాటికి నా తీర్మానం పట్టు సడలిపోయేది. అది వ్యసనంగా మారుతుందేమోనన్న భయం నా చేత సంతోషంగా సిగరెట్ మాన్పించేది. అలా నేను దానికి దూరంగా ఉండటం జరిగేది. ఈ సంవత్సరం నేను మరింత పెద్ద సవాలును స్వీకరిస్తున్నాను. టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చే నా అతిథులకు అంతరాయం కలిగించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాను. బదులుగా, వారిని తమ ఊకదంపుడుకు, అదే పనిగా మాట్లాడేందుకు అనుమ తిస్తాను. వాళ్లేం మాట్లాడినా, మాట్లాడవలసిన దానిని వాళ్లసలే మాట్లాడకపోతున్నా – మీరు, మిగతా వీక్షకులు అరచి నిరసన తెలియజేసే వరకు వాళ్లకు అడ్డుతగలనే తగలను. ‘వద్దు కరణ్, మీరు మీ పాత భౌభౌమనే రాట్వైలర్ జాతి శునకం స్టెయిల్కి వచ్చేయండి’ అంటూ తొలి విజ్ఞాపన పత్రం నాకు అందినప్పుడు మాత్రమే నేను ఎప్పటిలా నా పాత శైలికి వచ్చేస్తాను. మరి అలాంటి విజ్ఞాపన పత్రం ఒకటి ఎప్పటికీ రాకపోతే? మా ప్రియమైన పోస్ట్మ్యాన్ నేను ఎదురు చూసే క్రిస్మస్, న్యూ ఇయర్ కార్డులన్నిటినీ ఎక్కడో తారుమారు చేసి ఉండొచ్చని అనుకోవాలి. ఏ సంగతీ ఏదో ఒక విధంగా త్వరలోనే మీకు తెలుస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిర్మొహమాట గుణ సంపన్నులు!
నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భుతమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అలా మాట్లాడ్డం వల్ల ఎవర్నయినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. అది కొన్నిసార్లు బాధాకరంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు కూడా రాత్రి పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నామని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! రాత్రి బాగా పొద్దుపోయాక ఒక్క ఉదుటున ఉలికిపాటుగా మోగిన ఫోన్ని – అవతల ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో ఊహించలేను కనుక – క్షణమైనా ఆలస్యం చేయకుండా చేతికి అందుకున్నాను. మామూలుగా నైతే ఆ ఫోన్ మోగిన సమయం, ఆ మాట తీరు ఠప్పున నా చేత ఫోన్ పెట్టిపడేసేలా చేసి ఉండేవి. ‘‘నేను మిమ్మల్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను’’ అని అంటూనే... నా మాటకు చోటు ఇవ్వకుండా, ‘‘నేను మీ కాలమ్ని క్రమం తప్పకుండా చదివే పాఠకుడిని. మీరెప్పుడూ కూడా ప్రతిదాన్నీ విమర్శిస్తూనే ఉండటం గమనించాను. మెచ్చుకోవడానికి అసలు మీకేమీ కనిపించదా?’’ అని అవతలి వ్యక్తి! ముక్కు మీద గుద్దినట్లున్న ఆ మొద్దుబారిన ప్రశ్న ఒక్కసారిగా నన్ను తత్తరపాటుకు గురిచేసింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకటి మాత్రం తెలుస్తూనే ఉంది. అతడు నన్ను బోనులో నిలబెట్టాడు. నా తరఫు వాదనను నేను చెప్పాలి. ఫోన్ పెట్టేసి తప్పించు కోవచ్చు. అలా చేయాలని నేను అనుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ అది ప్రశ్నకు సమాధానం అవదు. అంతేకాదు, సంభాషణ నుండి ఉత్పన్నం అవవలసిన తక్కిన సందేహాలు అర్ధంతరంగానే వ్యక్తం కాకుండా పోతాయి. ‘‘విమర్శించడమే వివేకం అన్నట్లుగా రాస్తారు మీరు. విమర్శనాత్మకంగా ఉండటం అన్నది పాఠకులకు నచ్చే, పాఠకులకు మిమ్మల్ని నచ్చేలా చేసే విషయమే కావచ్చు. అందులో సందేహం లేదు. కానీ అందువల్ల మీరెప్పుడూ ప్రతికూలతలకు మాత్రమే ప్రఖ్యాతిగాంచిన వారవుతారు. అసలు మీకు నచ్చే విషయాలే ఉండవా? వాటి మాటేమిటి? మీరు ప్రశంసించాలనుకున్న వాటి సంగతేమిటి? వాటి గురించి రాయడం ద్వారా మీకొక గుర్తింపును మీరెందుకు కోరుకోరు? ఏదో ఒకదానినైనా సమర్థించండి. ప్రతి దానినీ విమర్శిస్తూ పోకండి’’ అంటోంది ఆ గొంతు. వారి పేరేమిటో చెప్పారు కానీ, ప్చ్... గుర్తుకు రావడం లేదు. నన్ను నేను సమర్థించుకోవటానికి దారులు వెతికే పనిలో పడ్డాను. నేను ప్రతికూలమైన వ్యక్తిని కాదని అతడిని సానుకూల పరి చేందుకు ప్రయత్నించాను. కానీ అతడు కొన్ని క్షణాల పాటు మాత్రమే నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వగలిగాడు. ‘‘నేను చెబుతాను ఏం రాయాలో’’ అన్నాడతను. అతడి స్వరంలోని అలజడి కాస్త నెమ్మదించింది. అంతకు ముందున్న అసహనం స్థానంలో ప్రశాంత చిత్తం ప్రతిఫలించింది. ‘‘మీకొక చిన్న సలహా ఇస్తాను. భారతదేశంలో మీకు నచ్చే వాటి గురించి మీరెందుకు రాయ కూడదు? ఆదివారం ఉదయం నేను మీ కాలమ్ చదివి సంతోషంగా, సంతృప్తికరంగా ఉండేందుకు అందులో నాకు మూడు మంచి కార ణాలు చూపించండి. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? పూర్తి భిన్న మైన అనుభూతులను నాకు కలిగిస్తున్నారు’’ అన్నాడు. ఫోన్ పెట్టేశాను. అతడి మాటలు నన్ను అయోమయంలోకి నెట్టేసినా, అతడితో సంభాషణ ఆశ్చర్యకరంగా నాకు సంతోషాన్ని కలుగజేసింది. మొదటిగా చెప్పాలంటే – అతడి వాదనను నేను అంగీ కరించనప్పటికీ, అతడి వైపు నుంచి అది నిజమే కావచ్చు. నాకున్న విమర్శించే హక్కును – అవసరమైతే దుడుకుగా, అదే సమయంలో దాడి చేసినట్లు కాకుండా – నేను వదులుకునే ప్రశ్నే లేనప్పటికీ అప్పు డప్పుడు ప్రశంసించడం, మెచ్చుకోవడం కూడా అవసరమేనని నేను ఒప్పుకుంటాను. మరీ ముఖ్యంగా నేను చెప్పవలసింది, ఇదే విధమైన సంభాషణ మునుపు కూడా అనేకసార్లు నా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ, గతంలో ఎప్పుడూ కూడా నేను ఈ విషయమై గమనింపుతో లేననీ, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయలేదనీ నా కళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడది వచ్చి నేరుగా నా ముఖానికే తగిలిన అభిప్రాయం కాబట్టి బహుశా నేను దాన్నుంచి తప్పించుకునే అవ కాశమే లేదు. నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భు తమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అందులో నమ్మదగనిదేం ఉండదు. అలాగే, ఎవర్న యినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. మన సులో ఏదుంటే అది, చేర్పులేమీ చేయనట్లుగా స్వచ్ఛంగా ఉంటుంది. అది కొన్నిసార్లు బాధాక రంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. ‘ఊరియా హీప్’ (చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్ఫీల్డ్’లో వినయాన్ని నటించే కపటి పాత్ర)కు దీటుగా మనం కలిగి ఉన్న సమాన కపట సామర్థ్యాన్ని అది పోగొడుతుంది. నిజానికి మరే ఇతర దేశంలోనూ ఇంతటి అద్భుతమైన గుణం ఉన్నట్లు కనిపించదు. బ్రిటిష్వాళ్లు మరీ ఉదాసీనంగా ఉంటారు. ఫ్రెంచి వాళ్లు లొడలొడా మాట్లాడుతారు. జర్మనీ దేశస్థులు ఎక్కువ న్యాయ బద్ధంగా పోతారు. ఇటాలియన్లు గడబిడ మనుషులు. అమెరికన్లకు పెద్దగా ఏం తెలియదు. సత్యంలా కనిపించేది ఏదైనా చైనీయుల్ని భయపెడుతుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు మాటల కవాతు చేస్తారు. రాత్రిళ్లు పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అంతేకాదు... వాళ్ల వ్యాఖ్య వాళ్ల వ్యక్తిగతం అనీ, అర్ధరాత్రి కూడా దాటేసిందనీ, లేదా ఎవరైనా వింటూ ఉంటారనే నిజాలను కూడా వారు గ్రహించని స్థితిలో ఉంటారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నా మని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! వారిని అలా చేయించే ఉద్వేగం కనీస మర్యాదల్ని, సౌమ్యగుణాన్ని, చివరికి అవకాశం లేకపోవడాన్ని కూడా పట్టించుకోనివ్వదు. అలా తన్నుకొచ్చేస్తుందంతే! కనుక, ఈ ఉదయం... ఇంతకుముందు నేను సరిగా ఆలోచించని నాలో ఉండవలసిన గుణం గురించి నాలో ఆలోచన రేకెత్తించిన నా నడిరేయి సంభాషణకర్తను అభినందించాలని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్లే సర్, ఒక మనిషిలో విమర్శించనందువల్ల కలిగే స్వీయ ఆమోదాన్ని, ఆత్మసంతృప్తిని కదిలిస్తారు. మీ కాల్ నాకు గొప్ప ప్రయోజనం కలిగించింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇక్కడ ముస్లిమ్ కావడం నేరమా?
భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకికరాజ్యంగా నిర్వచించింది. అందులోని లౌకిక భావానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్న ఘటనలు నేడు దేశంలో అనేకచోట్ల సంభవిస్తున్నాయి. అధిక సంఖ్యాకుల ప్రాధాన్యాలకు కట్టుబడి అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా ముస్లింలు జీవించక తప్పదనే వాస్తవాన్ని పాలనాపరమైన నిర్ణయాలు బలపరుస్తున్నాయి. దీనివల్ల ‘అధిక సంఖ్యాకుల దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉండటం అనేది ఎలాంటిది?’ అనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ ప్రశ్న అడిగే భారతీయుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటం గురించే మనం ఆందోళన చెందాలి. ఆఖరికి, ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ఒక వర్గాన్ని గురి చేయడం సమ్మతం అవుతుందా? వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా, ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మనదేశం ఎదుర్కొంటూ ఉంది. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటమన్నది ఎలాంటిది?’’ అనే ఈ ప్రశ్నకు జవాబు – ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది! అలా ఎందుకు ఉంటున్నదో... జియా ఉస్ సలామ్ తాజా పుస్తకం ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా: ఎ క్రిటికల్ వ్యూ’... కలవర పాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది. కాస్త వెనక్కెళ్లి ముందుకొస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9 శాతం. పారా మిలిటరీ సైనిక దళాల్లో 4.6 శాతం. ఐయ్యేఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్లలో 3.2 శాతం. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1 శాతం. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం... ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డు కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వా న్నమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో సైతం, ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్లుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. అదేమీ విశేషం కాదు కదా! నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతాపార్టీ అంత కరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో గానీ, 2019లో గానీ బీజేపీ ఒక్క ముస్లింను కూడా లోక్సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికీ ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14 శాతం మంది, ఉత్తర ప్రదేశ్లో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రా లలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్లో 1998 నుండి ఏ లోక్సభకు, లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిల బెట్టలేదు. అంతెందుకు, గత ఏప్రిల్లో కర్ణాటక మాజీ ఉప ముఖ్య మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు. పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అంటుంటారు. ‘అబ్బా జాన్’లు అంటూ అవహేళన చేస్తుంటారు. ‘పాకిస్తాన్కు వెళ్లిపొండి’ అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు íపిలుపు అందినప్పుడు – అయితే గియితే, కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్లు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు. 2019 జూన్లో జార్ఖండ్లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలామ్ పుస్తకం నుంచి నేనొక ఉదాహరణ ఇస్తాను. ఏదో ఒక ఉదంతాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ముస్లింలపై కనబరుస్తున్న అసహనాన్ని వేలెత్తి చూపడం కోసమేనని అనిపించవచ్చు కానీ, అటువంటి అనేక ఘటనలకు ఇదొక దృష్టాంతం. ‘‘విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం... అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు... కర్రలు, టైర్లు, బెల్టుల వరకు... చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్లు వాచిపోయాయి. చాలాచోట్ల ఎముకలు విరిగి పోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలి పోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా?’’ ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ‘‘ముస్లింలపై ఇటు వంటి ద్వేషపూరితమైన నేరాలు 2014–2017 మధ్య కాలంలో 30 శాతం పెరిగాయి. అనంతరం, 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మతవిద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి. ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరా కరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆరెస్సెస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్... ‘‘ప్రతి భారతీయుడూ హిందువే’’ అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్లి... ‘‘ఈ రోజున భారత దేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి,హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు. ఇందులో రెండో మాటే లేదు’’ అన్నారు. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకూ, భవిష్యత్తుకూ ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు చాలినంతగా చెప్పాననే నేను భావిస్తున్నాను. ఇది చాలా స్పష్టమైన సమాధానమని నేను చెప్పగలను. కానీ ఈ సమాధానం మన ముస్లిం సోదరులకు, సోదరీ మణులకు ఎలా అనిపిస్తుందో ఒక్కక్షణం ఆలోచించండి. తక్కిన మనందరికీ ఇది మనదికాని సమస్యపై ఒక విశ్లేషణ. వారికి మాత్రం వారి జీవన్మరణ సమస్య. సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచిస్తాం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటుంటారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏం చెప్పినట్లు? ఏం చెప్పనట్లు?
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే, ‘రద్దు రాజ్యంగ బద్ధమే కానీ, అందుకోసం అనుసరించిన విధానం సమర్థనీయం కాదు’ అని అభిప్రాయపడటం చర్చనీయాంశం అయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి వీలుగా కశ్మీర్ ‘రాజ్యాంగ సభ’ను కశ్మీర్ ‘రాష్ట్ర శాసన సభ’ అనే అర్థంలోకి తెచ్చేందుకు వెసులుబాటును కల్పించే ఆర్టికల్ 367ను కేంద్రం వాడుకుంది. మళ్లీ ఈ 367 సవరణ కోసం నియమ విరుద్ధంగా 272వ రాజ్యాంగ ఉత్తర్వును ఆసరా చేసుకుంది. ఇది అధికారాన్ని దాటి వెళ్లడమేనని న్యాయస్థానం అంటూనే, రద్దును సమర్థించడం తీర్పు సంపూర్ణత్వంపై న్యాయపరమైన సందేహాలను రేకెత్తిస్తోంది. మునుపు చెప్పిన దానినే మళ్లీ చెప్పడంతో ప్రారంభిస్తాను. ఒక సంక్లిష్టమైన ముగింపును అర్థం చేసుకోడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే స్పష్టత అవసరమయ్యే అంశాలను లేవనెత్తే ప్రశ్నలకు రూపకల్పన చేసు కోవడం. చీకటి సొరంగంలో చిన్న కాంతిరేఖను కనుగొనడం వంటిది ఇది. అందువలన నన్ను కశ్మీర్పై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల వైపు వెళ్లనివ్వండి. ‘రద్దు’ అని అంతా అంటున్న ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను విషయాన్ని ప్రారంభిస్తాను. రద్దును సమర్థించడాన్ని అలా ఉంచితే – ఆర్టికల్ 370ని రద్దు చేయ డానికి వీలుగా కశ్మీర్ ‘రాజ్యాంగ సభ’ను కశ్మీర్ ‘రాష్ట్ర శాసన సభ’ అనే అర్థంలోకి తెచ్చేందుకు వెసులుబాటును కల్పించే ఆర్టికల్ 367ను కేంద్రం వాడుకుంది. మళ్ళీ ఈ 367 సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమ విరుద్ధంగా 272వ రాజ్యాంగ ఉత్తర్వు (కాన్స్టిట్యూషనల్ ఆర్డర్)ను ఆసరా చేసుకుంది. ఇది అధికార అతిక్రమణేనని బెంచిలోని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ఈ మార్గం చట్ట విరుద్ధమైనది కనుక రద్దు చెల్లుబాటు అవదని నిజానికి కోర్టు తీర్పు ఇవ్వవలసింది. కానీ అలా ఇవ్వలేదు. బదులుగా, క్లాజ్ 3ని ఉపయోగించి ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చని పేర్కొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించింది. దీనర్థం... ప్రభుత్వం తప్పుగా చేసింది కానీ, మరోలా చేసి ఉంటే తప్పేమీ అయివుండేది కాదని కోర్టు తీర్పు ఇవ్వడం. అంటే ప్రభుత్వాన్ని సమర్థించడం. ఇది నాకు ప్రభుత్వం నోటిలో న్యాయస్థానమే వాదనలు పెట్టి నట్లుగా అనిపించింది. అయితే అవి ప్రభుత్వ వాదనలు కావు. దీనిపై కపిల్ సిబాల్, ‘‘ఆర్టికల్ 370పై ప్రభుత్వ స్వీయ అవగాహనకు, కోర్టు తీర్పునకు కొద్దిగానైనా పొంతన లేదు. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం సరైన విధానమేనా?’’ అని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 367లో రాజ్యాంగ ఉత్తర్వు 272 ద్వారా ప్రవేశపెట్టిన క్లాజు 3 ప్రకారం, కశ్మీర్ రాజ్యాంగ సభను రద్దు చేయొచ్చన్న వాదన కూడా... ‘కశ్మీర్ రాజ్యాంగ’ సభ రద్దు అవడం అంటే ‘కశ్మీర్ అసెంబ్లీ’కి ఉండే సిఫారసు అధికారం ఉనికిలో లేకుండా పోవడం మాత్రమే అనే వాదనపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప రద్దుకు భారత రాష్ట్రపతికి ఉన్న అధికారంపై – సిఫారసు చేసేందుకైనా, చేయకుండా ఉండేందుకైనా – అది ఎలాంటి ప్రభావమూ చూపదు. ఈ వాదన ఆమోదయోగ్యమైనదా లేక వివాదాస్పదమైనదా?ఇప్పుడిక ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు...అంటే, జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా కుదించేందుకు...కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదా లేదా అని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయానికి వద్దాం. కోర్టు రెండు వాదన లపై ఆధారపడింది. ఒకటి: ‘‘ఆర్టికల్ 356 అమలులో ఉన్న సమయంలో రాష్ట్రపతి తీసుకున్న ఏ నిర్ణయాలపైన అయినా వచ్చే దావాల విచారణకు కోర్టు కొలువు తీరవలసిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఎందుకంటే రాష్ట్రం తరఫున రాష్ట్రపతి, పార్ల మెంటు తీసుకున్న ప్రతి చర్య కూడా సవాలుకు అనువుగా ఉంటే కష్టం. అప్పుడిక రాష్ట్రపతి పాలనలో తీసుకున్న ప్రతి చర్యతోనూ విభేదించే ప్రతి వ్యక్తినీ ఇది ఎలాంటి అడ్డంకులూ లేకుండా కోర్టు వరకు రానిస్తుంది’’ అని! రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రాజ్యంగబద్ధమేనా, కాదా అని నిర్ధారించేందుకు నిరాకరించిన కోర్టు అందుకు చూపించిన ఈ కారణం న్యాయబద్ధమైనదేనా? కోర్టు చూపించిన రెండవ కారణం – ఆర్టికల్ 3 కింద రాష్ట్ర శాసనసభ సిఫారసులు అమలుకు బద్ధతను కలిగి లేవు. అందులో సందేహం లేదు. అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం అదొక∙ప్రక్రియ. సిఫారసులకు బద్ధమై ఉండే అవసరం లేనంత మాత్రాన కోర్టు తన నిర్ణయం చెప్పడానికి నిరాకరించవచ్చునా? ఇప్పుడు, పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగబద్ధమైనదా, కాదా అని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన పర్య వసానంగా జరిగేది ఒకటేమిటంటే... ఇదే పద్ధతిలో మరికొన్ని పునర్వ్యవస్థీకరణలు జరగవచ్చు. ప్రభుత్వం బెంగాల్, కేరళ, తమిళనాడులలో రాష్ట్రపతి పాలనను ప్రక టించి, అసెంబ్లీ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేసి, ఆ తర్వాత – రాష్ట్రాన్ని రద్దు చేయాలా, లేక కేంద్రపాలిత ప్రాంతంగా రాష్ట్ర స్థాయిని తగ్గించాలా అన్న దానిని పార్లమెంటులో నిర్ణయించవచ్చు. ఈ విధానం, మున్ముందు ఒక ఆనవాయితీగా స్థిరపడిపోతుంది. రెండో పర్యవసానం... బహుశా మరింత ముఖ్యమైనది. సమాఖ్య భావన (ఫెడర లిజం) అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని కదా అలోక్ ప్రసన్న కుమార్ అంటారు. దాని అర్థం దాన్ని పార్లమెంటు సవరించలేదని! అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధికారాన్ని పార్లమెంటరీ అధికారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. దీనివల్ల పార్లమెంటు అధికారానికీ, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ ప్రాముఖ్యతకూ మధ్య ఇప్పుడు మనకు ఘర్షణ తలెత్తడం కనిపించదా? ‘ది హిందూ’ మరింత విస్తృతమైన అంశాన్ని వెల్లడించింది. ‘‘ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ తరఫున ఎటువంటి చర్యనైనా – శాసనపరమైనవి, తిరుగులేని పరిణా మాలకు తావిచ్చేవి – ఏవైనా గానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చుననే ఒక సహేతుకం కాని తీర్మానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సూచిస్తోంది’’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దీని పైనే అర్ఘ్యా సేన్గుప్తా మాట్లాడుతూ, ‘‘ఇది భారతదేశ సమాఖ్యతత్వ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన పరిణామాలతో ముడివడి ఉన్న రాజ్యాంగపరమైన ప్రశ్న’’ అన్నారు. అంటే... కోర్టు తన తాజా తీర్పుతో సమస్యల తుట్టెను కదిలించినట్లయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే కశ్మీర్ తీర్పుల గురించి నేనేమనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. కానీ ఆ సమాధానాలను ఎవరు అందిస్తారు? - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్