-
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
సీబీఐ కస్టడీలో కవిత.. డే-1 ఇంటరాగేషన్
Updates ► సీబీఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. రూమ్ నంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ► సీబీఐ కస్టడీలో ఉన్న కవిత ఇంటరాగేషన్ సీబీఐ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. ► మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, సభ్యులకు అనుమతి ఉంది. కవిత భర్త అనిల్, కేటీఆర్, పీఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఉంది. ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అనూహ్యరీతిలో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ(శనివారం) తొలిరోజు కవిత ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. సాక్ష్యాలను ముందు పెట్టి సీబీఐ అధికారులు కవితను విచారణ చేయనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు-కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జగరనున్నట్లు తెలుస్తోంది. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక.. నిన్న( శుక్రవారం) కవితను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈనెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్లో కవిత విచారణ జరగనుంది. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటిభోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది. కవిత రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ విషయాలు కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80లక్షల ముడుపులు చెల్లించారు. డబ్బులకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు సీబీఐ పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80లక్షలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారన్న సిబిఐ. మహబూబ్నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనన్న శరత్ చంద్రారెడ్డి. రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్ కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారన్నసీబీఐ. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే రూ.100కోట్లు చెల్లించారు. ఇండో స్పిరిట్లో 65శాతం వాటా పొందారు. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు. ఈ విషయాలన్నింటి పైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సీబీఐ పేర్కొంది. అందుకే ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. కవిత అరెస్టు అక్రమం.. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ‘కవిత అరెస్టు అక్రమం. కవితను కస్టడీలో ఉంచాలనేది సీబీఐ ధ్యేయంగా కనబడుతోంది. కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. జాతీయ రాజకీయ పార్టీలో కవిత మాస్ లీడర్. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అరెస్ట్ చేయడమనేది కీలకం. కవిత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారు’అని అన్నారు. -
Liquor Case : కవిత బెయిల్పై ఏప్రిల్ 8న తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్పై తీర్పు వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలను ఏప్రిల్ 20కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ మను వాదనలు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కవిత కొడుకు పరీక్షల భయం ఉంది అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత హక్కు పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను ప్రస్తావించారు. తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుంది ఒక మహిళగా కవితకు ఉన్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలి కవితకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలను ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ న్యాయమూర్తికి చూపించారు. అనంతరం వాదనలు వినిపించారు కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్షాలను ధ్వంసం చేస్తారు కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇప్పటికే కవిత తనయుడికి 11 పరీక్షలకు గాను 7 పరీక్షలు పూర్తి అయ్యాయి కొడుకు పరీక్షల ఒత్తిడికి గురవుతున్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవు ఇండో స్పిరిట్లో అరుణ్పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉంది కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఫార్మాట్ చేశారు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫోన్లలో డేటా ఫార్మాట్ జరిగింది డిజిటల్ ఆధారాలు లేకుండా ఉండేందుకే కవిత ఈ పని చేశారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా కవిత తరపు వారు ఒత్తిడి తెస్తున్నారు కవితకు నోటీసు ఇవ్వగానే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు చెప్పాడు బుచ్చిబాబు ఫోన్లోని చాట్స్తో ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నాం ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు ఆమె. చదవండి: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట.. -
Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4న చేపడతామని తెలిపింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు. ఈ సందర్భంగా అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్మెంట్ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
లిక్కర్ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
కవిత ఇంటి దగ్గర హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కావడంతో ఆమె ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత ఇంటి ముందు బీఆర్ఎస్ శ్రేణుల నిరసనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. కవిత ఇంటికి కేటీఆర్, హరీష్రావు చేరుకున్నారు. రాత్రి 8.45 నిమిషాలకు కవితను ఢిల్లీకి తరలించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత నివాసం వద్ద నిరసనకు దిగిన ఆమె అనుచరులు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కుమార్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్లో ఉంది. కేసు పెండింగ్లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు?. ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉందని తెలిపారు. -
కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్ ఆకస్మిక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్లతో భేటీ అయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. -
లిక్కర్ కేసు.. కవిత పిటిషన్పై విచారణ 19కి వాయిదా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్తో భేటీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
ఆ దందాలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? : సునీతారావు
కరీంనగర్: లిక్కర్ దందాలో ఆధారాలతోసహా చిక్కిన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జిల్లా, మండల, బ్లాక్, పట్ట ణ, నగర మహిళా విభాగం అధ్యక్షులతో ఆమె వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత ఎప్పుడూ నోరుమెదపలేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తన తండ్రి, అప్పటి సీఎం కేసీఆర్ను ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత, కేటీఆర్ పాల్గొనలేదని చెప్పారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకువస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఏ అకౌంట్లోనూ రూ.15 లక్షలు వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరో పించారు. ఇన్ని రోజులు బీజేపీ, బీఆర్ఎస్ దోచుకొన్న డబ్బును వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేస్తారని అన్నారు. వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధి ష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కమిటీల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంద న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు కనీసం 15 స్థానాలు సాధించేలా పనిచేయాలని ఆమె కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చర్ల పద్మ, తాటిపర్తి శోభారాణి, పద్మ, ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్ -
బాలికల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
సాక్షి, యాదగిరిగుట్ట/భువనగిరి: ఇటీవల భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఇద్దరి విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న గదిని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యార్థినులు ఇద్దరూ ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారని, ఆ భవనం పరిసరాలు, గదిలో లభించిన సూసైడ్నోట్ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్లోకి బయట నుంచి అదనంగా వ్యక్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయంలో పోలీసు విచారణ పారదర్శకంగా ఉండాలని కోరారు. ‘మా డిమాండ్కు స్పందించి...ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఇటీవలి సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినినిపై పోలీసుల దాడి అమానుషమని మండిపడ్డారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న నిరసన చేస్తున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్య ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police. This… pic.twitter.com/p3DH812ZBS — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024 ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రవర్తన ఒక కట్టుబాటు కాదు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ -
పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విధానాలను ఎండగడతామన్నారు. తెలంగాణభవన్లో సోమవారం జరిగిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎంపికైన దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న దళితులు, బీసీలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. శ్వేతపత్రాల పేరిట డ్రామా ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం అప్పులు, శ్వేత పత్రాల పేరిట డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశామంటూ కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలన లోపాలను ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులుచేర్పులు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సరళి మేరకు బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యకర్తలను కలవకుండా అడ్డుపడ్డారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధిష్టానంతో కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ పనితీరు, ఓటమికి కారణాలపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కాదు.. బీఆర్ఎస్ ఓటమి : వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడదామని కార్యకర్తలు తమకు భరోసా ఇచ్చారని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ది గెలుపు కాదని, బీఆర్ఎస్ ఓటమి మాత్రమేనన్నారు. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశ అనంతరం తెలంగాణభవన్లో ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాదర్బార్ ప్రహసనంగా మారిందని, సీఎం రేవంత్ నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారన్నారు. ప్రజాదర్బార్ ద్వారా నెల రోజుల్లో పరిష్కరించిన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట ప్రజలను బలిపశువులను చేస్తూ దరఖాస్తుల స్వీకరణ పేరిట రోడ్లపైకి తెచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చొప్పున ఇవ్వాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో జిల్లాల సంఖ్య తగ్గించాలని రేవంత్ అనుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు. -
Video: ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్నదారిలో రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశులను చూసిన కవిత.. తన ఫోన్లో చిత్రీకరించి, ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్నికల ప్రచారారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో.. ఆర్మూర్లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టారు. వీటిని చూసి మురిసిపోయిన కవిత.. ఈ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుండే తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అంటూ రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశుల వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ !!! అప్పుడు ఎట్లుండే తెలంగాణ !! ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ !! enroute to Jagityal ... This scene is at siddula gutta, Armur. Same scene across Telangana !! Jai Telangan !! Jai KCR !! Vote For CAR to continue the growth story of Telangana !!!… pic.twitter.com/BSK7hxG4tA — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023 -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్ తో సఫలం అయ్యిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానం అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు. చదవండి: Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై 2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)118.2 శాతం పెరగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)155.7 శాతం పెరిగిందని తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందని తెలిపారు.అందరికి సమాన సందప విధానాన్ని సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని వివరించారు. సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్ ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని ప్రస్తావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72815కోట్లు అందించామని చెప్పారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నమనా వివరించారు. పండగలా వ్యవసాయం తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండాలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు. మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం పూర్తి రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్కు దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. 2004-2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ. 7994 కోట్లు ఖర్చు చేస్తే గత తొమ్మిదిన్నరేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. తాగునీటిపై రూ.36 వేల కోట్లు ఖర్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు. 2014లో రూ. 62లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందని గుర్తు చేశారు. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామని చెప్పారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని, 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని, ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. హరితహారం కోసం రూ.10 వేల కోట్లు పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం 2126 యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని ప్రస్తావించారు. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని, అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పామని, ప్రపంచంలో ఈ విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కోట్లలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు. వైద్య రంగంలో ఎంతో పురోగతి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 104కేంద్రాలకు పెంచారన్నారు. మహిళా సాధికారతకు కృషి రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని అన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పలు తీసుకొచ్చామని, 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు అని పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదని తప్పుబట్టారు. -
రాజకీయ కుట్రలో పావును కాను
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో తన పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో బీజేపీ, కాంగ్రెస్ తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశాయని పేర్కొన్నారు. ‘రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉంది’అని తేల్చిచెప్పారు. శని వారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ కవిత’కార్యక్రమంలో నెటిజన్లు రాజకీయ, వ్యక్తిగత అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. తమకు రా జకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తమది ‘టీమ్ తెలంగాణ’అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ జట్టు లేదు... తమకు ఏ పార్టీతో జట్టు లేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లలో గెలుస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో గెలుస్తామన్నారు. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారని, వాళ్లు బీసీ సీఎం అంటే ఎవరూ నమ్మరని కవిత చెప్పారు. బీసీల కులగణన చేయకుండా అడ్డుకుంటున్నది బీజేపీయేనని ఆమె ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవడం లేదని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని, మహిళా రిజర్వేషన్లను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణకు రాహుల్ కుటుంబం ద్రోహం తెలంగాణతో తమకున్నది రాజకీయ బంధం కాదని.. కుటుంబ బంధమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలపడం వల్ల 60 ఏళ్లు మోసపోయినట్లు చెప్పారు. అలాగే రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో 1969లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న యువకులపై కాల్పులు జరపడంతో 369 మంది మరణించారని గుర్తుచేశారు. అలాగే రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను అవమానించి ఆ పదవి నుంచి తప్పించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ 2009లో రాహుల్ తల్లి సోనియా గాంధీ ఆమె జన్మదినం సందర్భంగా ప్రకటించి మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబానికి తెలంగాణతో ఉన్న అనుబంధం పదేపదే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్స్కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్రెడ్డి మాత్రం జీవన్రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్రెడ్డి సర్పంచ్లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. గురువారం పీటీఐ వార్త సంస్థ ఇంటర్వ్యూలో కవిత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇ చ్చిందని, ఆ పార్టీ మాటలు నమ్మశక్యం కావన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ప్రధాని మోదీకి తెలంగాణ అంటే ఎందుకు కక్షనో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో మోదీ అంత పెద్ద మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై స్పందిస్తూ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు. ఇలాంటి చర్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నది గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. కేంద్రం తలుచుకుంటే అమలు చేయవచ్చని కానీ బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోదని మహిళలకు అర్థమైందని, మహిళా బిల్లు సాధనకు ఉద్యమించిన తరహాలో త్వరగా అమలు చేయాలని కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో కోటా కోసం కూడా మా పోరాటం సాగుతుందని కవిత తెలిపారు. ‘ప్రజల మేలు కోరి సమర్థించి తీరుతాం’ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సమాజంలో అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి. ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలి అని కోరుకుంటున్నట్టు అభిప్రాయం వినబడుతున్నది’అని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తాము జరుపుతున్న భేటీలపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ గురువారంరాత్రి ఈ ట్వీట్ చేశారు. ఈ నిజమైన ప్రజాభావాలను దశాబ్దాల తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల మేలు కోరుతూ సమర్థించి తీరుతానని పేర్కొన్నారు. ‘గత కొన్నిరోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలందరం.. ప్రజాకంటక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తొలగించగలదనే విశ్వాసంతోనే బీజేపీలో చేరినం. అందుకు మేం సాధ్యమైనంతవరకు అన్నివిధాలుగా ప్రయత్నించడం సహజం. పార్టీకి కూడా అదే తెలియజేసినం. నిజానిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుందని నా విశ్వాసం. ఇదే సత్యం’అని విజయశాంతి ట్వీట్ చేశారు. -
బీసీల హక్కుల కోసం ఎందాకైనా..
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్లో కవితతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఎంపీలు మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. అరుణ్పిళ్లై ఏం చెప్పారు? ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్గా మారినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్.. ఇదిలా ఉండగా.. తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్ టాపిక్గా మారింది. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ -
మహిళా బిల్లు కోసం ఒత్తిడి తేవాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం కలిగిన 47 రాజకీయ పార్టీల అ«ధ్యక్షులతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలకు కవిత మంగళవారం లేఖ రాశారు. రాజకీయాలకతీతంగా మహిళా బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కోరారు. దేశ జనాభాలో మహిళలు 50% ఉన్నా చట్టసభల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే దాదాపు 14 లక్షల మంది మహిళలు క్రియాశీలక ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. లింగ సమానత్వం కోసం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు లేఖలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎంలు వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్కుమార్, నవీన్ పట్నాయక్, హేమంత్ సోరెన్, ఏక్నాథ్ షిండేతో పాటు మాయావతి, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, చంద్రబాబు, వైఎస్ షర్మిల, చంద్రశేఖర్ ఆజాద్, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, అర్వింద్ దేవే గౌడ, ప్రకాశ్ అంబేడ్కర్కు కవిత లేఖలు రాశారు.