-
సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్ ఖండిస్తోందని, డ్రాగన్ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారత్ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో చర్చలకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ -
మార్కెట్ అక్కడక్కడే...
కొనుగోళ్లకు పురికొల్పే తాజా ట్రిగ్గర్లు ఏమీ లేనందున శుక్రవారం స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్టాక్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు ఐదు సూత్రాల ఒప్పందం కుదరడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 73.53కు చేరింది. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్లో 497 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆరు గంటలు పరిమిత శ్రేణిలోనే... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు సూచీలు చాలా పరిమిత శ్రేణిలో లాభ,నష్టాల మధ్య కదలాడాయి. చివరి అరగంటలోనే నిలకడగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 128 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 139 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 267 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాలను హెచ్డీఎఫ్సీ జోడీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ హరించి వేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ► ఎస్బీఐ 2.3% లాభంతో రూ.203 వద్ద ముగి సింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎస్బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్, ఇమామి, జుబిలంట్ ఫుడ్వర్క్స్, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, యస్బ్యాంక్, డిష్ టీవీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. -
చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి
భారత–చైనా సంబంధాల్లో అయిదు అంకె ప్రాధాన్యం బాగానే వున్నట్టుంది. ఇరుదేశాల మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద దాదాపు అయిదు నెలలుగా అలుముకున్న ఉద్రిక్తతలను ఉపశ మింపజేయడానికి గురువారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా చర్చలు జరిగాక ఇరు దేశాల మధ్యా అయిదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రులు ప్రకటించారు. రెండు దేశాల మధ్యా 1954లో ఈ మాదిరే అయిదు అంశాలతో కూడిన పంచశీల ఒప్పందం కుదిరింది. అనంతరకాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎనిమిదేళ్ల తర్వాత ఇరు దేశాలమధ్యా యుద్ధం సంభవించింది. ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కారాదని అందరూ కోరుకుంటున్న వేళ గత శుక్రవారం మాస్కోలో రెండు దేశాల రక్షణ మంత్రులు భేటీ కావడం, అది జరిగిన అయిదురోజుల తర్వాత ఇప్పుడు విదేశాంగ మంత్రులమధ్య చర్చలు చోటుచేసుకోవడం హర్షించదగ్గది. మరోపక్క రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు సాగుతూనేవున్నాయి. మధ్యలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులూ సంభాషించుకున్నారు. అయితే ప్రస్తుతం కుదిరిందంటున్న ఏకాభిప్రాయం సమస్యల్ని స్థూలంగా స్పృశించిందే తప్ప నిర్దిష్టమైన అంశాల జోలికి పోలేదు. రెండు దేశాలూ చర్చల్ని కొనసాగించాలని, సరిహద్దుల్లో ఇరుపక్షాలూ వెనక్కి తగ్గాలని, గతంలో ఇరు దేశాలూ కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని, విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలని, విశ్వాస పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జూన్లో చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేయడం, దాన్ని అడ్డుకోవాలని చూసిన మన సైనికులపై వారు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేసి 21మంది జవాన్ల ప్రాణాలు తీయడం అత్యంత విషాదకరమైన ఘటన. ఆ తర్వాత రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు అడపా దడపా జరుగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ ఉద్రిక్తతలు అలాగేవున్నాయి. మూడు రోజులక్రితం తొలిసారి అక్కడ కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. 45 ఏళ్లలో ఎల్ఏసీ వద్ద కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పరిస్థితి ఇంత విషమించాక చైనా తీరుపై మన దేశం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయాలి. చర్చల సందర్భంగా జైశంకర్ ఆ పనే చేశారని అంటున్నారు. తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యం దురాక్రమణ పోకడలను వాంగ్ యి దృష్టికి తీసు కొచ్చి, దానిపై నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఎల్ఏసీ వద్ద శాంతి సామరస్యాలను పునరుద్ధ రించడానికి కృషి చేయడం తక్షణ కర్తవ్యమని చెప్పారు. మన జవాన్లు గత నెలాఖరున సరిహద్దులు అతిక్రమించారన్న చైనా వాదనను ఆయన తిరస్కరించారని చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అసాధారణ రీతిలో వున్నాయి. రెండు వైపులా సైన్యం మోహరింపు ఎక్కువైంది. పోటాపోటీగా యుద్ధ సామగ్రి అక్కడికి తరలుతోంది. కనుక ఎల్ఏసీ వద్ద యధాపూర్వ స్థితి నెలకొల్పడం తక్షణావసరం. ఏ వైపున ఎవరు ఆవేశపడినా అది చివరకు యుద్ధానికే దారితీస్తుంది. ఇప్పుడు ప్యాంగాంగ్ సో వద్ద మన సైనికుల అధీనంలోకొచ్చిన శిఖరాగ్రాల్లో కొన్నిటినైనా చేజిక్కించు కునేందుకు చైనా సైనికులు వ్యూహరచన చేస్తున్నారని అక్కడి నుంచి వెలువడుతున్న కథనాలు చెబుతున్నాయి. యుద్ధంలో ఎప్పుడూ ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అనుకూలమైన పరిస్థితులుంటాయని యుద్ధ రంగ నిపుణులు అంటారు. కనుకనే ఆ శిఖరాగ్రాలపై చైనా సైన్యం కన్నేసింది. ఇరు దేశాలమధ్యా చాన్నాళ్ల తర్వాత తొలిసారి జనతాపార్టీ హయాంలో సామరస్యత ఏర్పడింది. మైత్రికి బీజాలు పడ్డాయి. అప్పటి విదేశాంగ మంత్రి వాజపేయి చైనాను సందర్శించారు. వివా దాస్పద అంశాలపై పరస్పరం చర్చించుకుందామని, వాణిజ్య రంగంలో సహకరించుకుంటూ ఎదుగుదామని చైనా చేసిన ప్రతిపాదనకు మన దేశం అంగీకరించింది. మన దేశంతో వాణిజ్యం మొదలయ్యాక ఆ రంగంలో అత్యధికంగా లాభపడింది చైనాయే. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు అయ్యే ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతం కాగా, మనకొచ్చే దిగుమతుల్లో వారి వాటా 14 శాతం. ఇలా మనవల్ల అనేకవిధాల లాభపడుతూ పాకిస్తాన్తో మనకు పేచీ వచ్చిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై చైనా ఆ దేశాన్నే సమర్థిస్తూ వచ్చింది. ఎల్ఏసీ పొడవునా తరచుగా ఉల్లం ఘనలు సరేసరి. ఒకపక్క ఇరు దేశాల అధినేతలూ పరస్పరం పర్యటనలు జరుపుకోవడం, చర్చలు సాగించడం వంటివి కొనసాగిస్తున్నా ఇది రివాజే. నిరుడు జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని మన దేశం మార్చాక చైనాలో మరింత గుబులు బయలుదేరింది. పర్యవసానంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలున్నాయి. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కనుక మన దేశం యధాపూర్వ స్థితిపై గట్టిగా పట్టుబట్టాలి. వాణిజ్యం, సరిహద్దు వివాదం దేని దారి దానిదే అనే పాత విధానం చెల్లదని, ఎవరి హద్దుల్లో వారు వున్నప్పుడే సామరస్య సంబంధాలు ఏర్పడతాయని చెప్పాలి. దేశాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు అధికారిక, అనధికారిక స్థాయిల్లో పరస్పరం చర్చలు జరుగుతాయి. అయితే రెండు పక్షాలూ చిత్తశుద్ధితో వున్నప్పుడే మంచి ఫలితాలనిస్తాయి. ఇప్పుడు ఉద్రిక్తతల ఉపశమననానికి మంత్రుల స్థాయి భేటీలు జరగడం మంచి పరిణామమే. వచ్చే నెల్లో ఎస్సీఓ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య చర్చలు జరిగే అవకాశం వుందంటున్నారు. అందులో సరిహద్దు వివాదంపై ఒక అవగాహన కుదరడం ఉభయ దేశాలకూ మంచిది. అందుకు అనువైన వాతావరణం ఏర్పర్చవలసింది చైనాయే. -
త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు. భారత్-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్లో డ్రాగన్ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్లో శుక్రవారం కొనసాగాయి. చదవండి : భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’ -
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్కు రాజ్నాథ్ అందించారు. రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో నాలుగేళ్ల క్రితమే భారత్ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి. సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్నాథ్ రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్నాథ్ మాట్లాడారు. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్నాథ్ అన్నారు. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ బంధాల్లో కొత్త అధ్యాయం రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గోల్డెన్ ఏరోస్కే ఎందుకు ? మొదటి బ్యాచ్లో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్లో శిక్షణ తీసుకున్నారు. -
ముదురుతున్న వివాదం
సరిహద్దు వివాదాన్ని నెలల తరబడి నానిస్తే ఏమవుతుందో భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని గమనిస్తే అర్ధమవుతుంది. 45 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ ప్రాంతంలో తుపాకులు గర్జించాయని వార్తాసంస్థల కథనం. సోమవారం ఈ ఉదంతం చోటుచేసుకుందని మన సైన్యం వివరించింది. చైనా సైనికులు మన సేనల్ని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపాయని అంటున్నారు. కానీ ఈ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి తక్షణం ప్రయత్నాలు చేయక పోతే చివరికిది యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్పాలి. అక్కడ మొన్న ఏప్రిల్ నుంచి ఉద్రిక్తతలు రాజుకోవడం మొదలైంది. గాల్వాన్లోయలో భారత్ సైన్యం గస్తీ కాసే ప్రాంతంలోకి వందలాదిమంది సైనికుల్ని తరలించి చైనా భారీ సంఖ్యలో శిబిరాలు ఏర్పాటుచేసుకుంటున్నదని, బంకర్లు నిర్మిస్తున్నదని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్యా సైన్యం స్థాయిలో సంప్రదింపులు జరుగుతూనే వున్నాయి. కానీ అవి పెద్దగా ఫలితాన్నిచ్చిన దాఖలా లేదు. ఆ క్రమంలో జూన్లో రెండు దేశాల సైనికుల మధ్యా ఘర్షణలు జరిగాయి. చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21మంది మరణించారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనాకూడా తీవ్రంగా నష్టపోయిందన్న వార్తలొచ్చాయి. గత నెలాఖరున ప్యాంగాంగ్ సో దక్షిణ ప్రాంతంవైపు చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన వేయి మంది చైనా సైనికుల్ని మన సేనలు విజయవంతంగా అడ్డుకోగలిగాయి. పర్వతప్రాంత యుద్ధంలో ప్రత్యేక నైపుణ్యం వున్న దళాలు చుశాల్ సెక్టార్లోని కైలాస్ సెక్టార్తోసహా వివిధ చోట్ల అప్రమత్తంగా వుండటం వల్ల ఇది సాధ్యమైందంటున్నారు. ఈ దళాలు ఆ సెక్టార్లోని దాదాపు అన్ని పర్వత ప్రాంతాలనూ ప్రస్తుతం పహారా కాస్తున్నాయి. బహుశా ఈ పరిణామాలతో ఆగ్రహించే చైనా సైన్యం కాల్పులు జరిపివుండొచ్చునని నిపుణులు చెబుతున్న మాట. సరిగ్గా 45 ఏళ్లక్రితం 1975లో చైనా సైనికులు అరుణాచల్ప్రదేశ్లోని వాయువ్య ప్రాంతంలో తులంగ్ పాస్ వద్ద హఠాత్తుగా దాడి చేసి అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు జవాన్లను కాల్చిచంపారు. మరో ఇద్దరిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. ఎల్ఏసీ వద్ద చైనా తాజాగా అనుసరిస్తున్న ధోరణి ఆంతర్యమేమిటో అందరికీ తెలుసు. ఆక్సాయ్చిన్, లద్దాఖ్ ప్రాంతాల్లో చైనా దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిందని మన దేశం చెబుతోంది. కానీ తమ భూభాగమే 90,000 చదరపు కిలోమీటర్లు భారత్ అధీనంలో వుందన్నది చైనా వాదన. జమ్మూ–కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టినప్పటినుంచీ ప్రస్తుతం తమ అధీనంలోని ఆక్సాయ్చిన్ను భారత్ స్వాధీనం చేసుకోవ డానికి ప్రయత్నిస్తుందన్న బెంగ చైనాకు పట్టుకుంది. గాల్వాన్ సెక్టార్లో ప్యాంగాంగ్ సో, గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్, దస్పాంగ్ల వద్ద పైచేయి సాధిస్తే ఆక్సాయ్చిన్వైపు భారత సైన్యం కదలికలను అడ్డుకోవడానికి వీలుంటుందన్న ఆశతోనే గత కొన్ని నెలలుగా ఎల్ఏసీ వద్ద అది చికాకులు సృష్టి స్తోంది. ఇప్పుడు లద్దాఖ్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆమధ్య డోక్లామ్ వద్ద వేసిన ఎత్తుగడలనే చైనా ఇక్కడ కూడా ప్రయోగిస్తోందని అర్ధమవుతుంది. డోక్లామ్ వద్ద భూటాన్ భూభా గాన్ని ఆక్రమించుకుని చైనా రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తిచేసింది. అక్కడ శాశ్వత కట్టడాలు నిర్మిం చింది. మరింత భూభాగాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఆ ఎత్తుగడే ఎల్ఏసీలోనూ కొనసాగించవచ్చని అనుకుంటున్న వేళ మన సైన్యం దూకుడు దానికి సహజంగానే చికాకు తెప్పి స్తుంది. కానీ ఒకసారంటూ తుపాకులు పేలడం మొదలయ్యాక అది ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిల్లో ఇరు దేశాల మధ్యా చర్చలు జరు గుతున్నప్పుడు ఇది చోటుచేసుకోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. మాస్కోలో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశం సందర్భంగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కూ, చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే కూ మధ్య మొన్న శుక్రవారం జరిగిన దౌత్య స్థాయి సంభాషణలు పరిస్థితిని చక్కదిద్దగలదని అందరూ ఆశించారు. కానీ ఇరు దేశాల మంత్రులూ ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలు అందుకు అనువుగా లేవు. రాజ్నాథ్ సింగ్ ప్రకటనలో సామరస్య ధోరణి కనబడింది. ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే భారత్ ఉద్దేశమని ఆయన చెప్పారు. కానీ వీ ఫెంఘే ప్రకటనలో ఈ మాదిరి భాష లేదు. మే నెలలో జరిగిన ఘర్షణలకు పూర్తిగా భారత్దే బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. తమ సేనలు ఎంతో సహనంతో వున్నాయని సమర్థించుకున్నారు. భారత్ సైనికులు వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్యా రాజుకున్న ఉద్రిక్తతలు ఉప శమించడానికి దౌత్యం ఒక్కటే మార్గమని మన విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెబుతున్న మాటల్లో నిజముంది. రెండు దేశాల వద్దా అణ్వస్త్రాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ ఘర్షణలు ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ఉద్దేశంతోనే ఎస్సీఓ విదేశాంగమంత్రుల సమావేశంలో పాల్గొంటున్న సందర్భంగా జైశంకర్ గురువారం చైనా విదేశాంగ మంత్రితో భేటీ కాబోతున్నారు. చూడటానికి రెండు దేశాల సైన్యాల మధ్య తలెత్తిన ఘర్షణలుగా ఇవి కనబడినా వాటి వెనక ప్రధానంగా రాజకీయ కారణాలే వుంటాయి. పరస్పర అపనమ్మకం, భవిష్యత్తు గురించిన శంకలు సైనిక ఉద్రిక్తతలకు దారితీస్తాయి. కనుక చైనా ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలను సడలించడానికి అరమరికలు లేకుండా మాట్లాడాలి. తన ఉద్దేశాలేమిటో తేటతెల్లం చేయాలి. దబాయింపులకు దిగితే, ఇష్టానుసారం వ్యవహరిస్తే అంతర్జాతీయంగా ఏకాకి అవుతానని గ్రహించాలి. -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్ప్రదేశ్లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్లో లద్దాఖ్లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్లో గల్వాన్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్కు చెందిన ప్యాంగ్యాంగ్ త్సో, ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొగ్రుంగ్ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. -
చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..
న్యూఢిల్లీ: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. వీరందరికి మన ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. దేశం యావత్తు మన జవాన్ల త్యాగాన్ని కొనియాడింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. (చదవండి: మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!) ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్రాంగ్కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉంది. అంతేకాక ‘చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది’ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. -
45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. గత 45 ఏళ్లలో ఇంత తీవ్రమైన పరిస్థితిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదని తెలిపారు. 1962 ఇండో-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల వెబ్సైట్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘1962 యుద్ధం తర్వాత ఎల్ఏసీ వెంబడి ఇంతటి ఉద్రిక్తతను గతంలో ఎన్నడూ చూడలేదు. 45 సంవత్సాల తర్వాత ఈ ఏడాది సరిహద్దులో సైనిక ప్రాణనష్టం జరిగింది. ఎల్ఏసీ వెంట ఇంత భారీ ఎత్తున దళాలు మోహరించడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం’ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతితో పాటు పొరుగు దేశాలతో మంచి సంబంధాలే భారత్కు ముఖ్యమని ఇప్పటికే చైనాకు స్పష్టంగా తెలిజశామన్నారు. గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలను దౌత్యంపరంగానే పరిష్కరించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా భారత్ శాంతియుతంగానే వ్యవహరిస్తుందని.. సరిహద్దులో యథాతథ స్థితి పునరుద్దరణ కోసం కృషి చేస్తోందన్నారు జైశంకర్. (చదవండి: సాయుధులుగానే ఉన్నారు) అయితే ఇది ఏకపక్షంగా సాధ్యం కాదని.. చైనా కూడా సహకరించాలన్నారు జైశంకర్. ఇరు దేశాల చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని కోరారు. ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుత పరిష్కారం కోరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంకొనసాగుతుంది. ఇక జూన్ 15న చైనా- భారత్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. -
భారత్తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
బీజింగ్: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాల ను సామరస్యంగా పరిష్కరించుకోవ డానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు మా దేశంపై సవాల్ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్ ప్రపంచానికే మేలు చేస్తుందని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు. -
గల్వాన్ వీరులకు మరింత గౌరవం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం) జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు కూడా వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. -
అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంట బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ అంశంపై చైనా మాటమారుస్తోంది. ఈ క్రమంలో ఎంతో ముఖ్యమైన పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కీలకమైన పాయింట్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉపసంహరణ జరగలేదని విశ్వసనీయ సమాచారం. పాంగాంగ్త్సో ప్రాంతంలో పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడగా.. గోగ్రా పోస్ట్ ప్రాంతంలో ఉపసంహరణ తాజాగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా చైనా కీలకంగా భావించిన హాట్స్ర్పింగ్ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ ఈ రోజు మొదలైనట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో చైనా అదనంగా 40 వేల మంది సైనికులను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. (వెనక్కి తగ్గిన చైనా) భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. (చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’) -
చైనా వక్ర బుద్ధి.. సరిహద్దుల్లో 40 వేల సైన్యం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణ గురించి చర్చలు జరిగాయి. కానీ చైనా వీటిని ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. తాజాగా చైనా ఎల్ఏసీ వెంబడి 40 వేల మంది సైనికులను మోహరించింది. డ్రాగన్ దేశం చర్యలను చూస్తే.. ఉద్రిక్తతలను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేనట్లు అర్థమవుతుంది అంటున్నారు అధికారులు. వాయు రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది, సుదూర ఫిరంగిదళాలు వంటి భారీ ఆయుధాల మద్దతు ఉన్న దాదాపు 40,000 మంది సైనికులను మోహరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.(బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?) గత వారం జరిగిన రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఏసీ వెంబడి పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలానే చైనా ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్దంగా లేదు. అంతేకాక ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అందువల్ల చైనా తన శాశ్వత స్థానం సిర్జాప్కు వెళ్లడానికి సిద్ధంగా లేదు. అంతేకాక తూర్పు లద్దాఖ్లోని రెండు ప్రధాన ఉద్రిక్త ప్రాంతాలైన హాట్ స్ప్రింగర్స్, గోర్జా పోస్ట్ ప్రాంతాల్లో చైనా భారీ మొత్తంలో నిర్మాణాలు చేస్తోంది. ఈ రెండు ప్రాంతాల నుంచి తాము వెనక్కి వెళ్తే భారత్ సరిహద్దు వెంబడి తమ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందనే సాకును ముందు పెడుతుంది చైనా. -
సంతోష్ బాబు కుటుంబంతో కేసీఆర్ భోజనం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు బుధవారం ప్రగతి భవన్లో సంతోషికి అందించారు. ఆమెకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్ను కోరుకోవాలని కేసీఆర్ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్లో స్థలం కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మోదీ చైనా ఒత్తిడికి లొంగిపోయారు.. అందుకే ఇలా’
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు మోదీ జనంలో తాను చాలా బలమైన నేతననే అభిప్రయాన్ని ఏర్పర్చరని అన్నారు. కానీ ఆ ఇమెజ్ నేడు భారత్కు అతి పెద్ద బలహీతగా మారిందని రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో ఈ రోజు ఓ వీడయోను పోస్ట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్ మోదీని విమర్శించడమే కాక.. చైనా వక్ర బుద్ధిని దుయ్యబట్టారు. వీడియోలో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేందుకు మోదీ తానో బలవంతుడినన్న బూటకపు ఇమేజ్ను క్రియేట్ చేశారని విమర్శించారు. కానీ ఇప్పుడు అది భారత్కు బలహీనంగా మారిందన్నారు. మోదీ ప్రతిష్టకు, చైనా ప్రణాళికలకు ఏ రకంగా సంబంధం ఉంటుందో రాహుల్ తన వీడియోలో వివరించారు. ('ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది') యావత్ భూమండలాన్ని చేజిక్కించుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తున్నట్లు రాహుల్ తన వీడియోలో ఆరోపించారు. ప్రణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయరని, వారు తమ మధిలో ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారన్నారు. దానికి తగినట్లుగా వాళ్లు ఆ ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారన్నారు రాహుల్. గదార్, బెల్ట్ రోడ్ దానిలో భాగమే అన్నారు. వాళ్లు పూర్తిగా భూగ్రహాన్ని మార్చేస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. అయితే ఇలాంటి వ్యూహాత్మక సమయంలో.. కీలకమైన గల్వాన్, డెమ్చోక్, పాన్గాంగ్ సరస్సుల వద్ద చైనా తన ప్రాభవాన్ని పెంచుకున్నట్లు రాహుల్ తెలిపారు. మన హైవేల వల్ల చైనీయులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. చైనా.. పాకిస్తాన్తో కలిసి కశ్మీర్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్ ఆరోపించారు. (మేడిన్ చైనా రామాయణం) PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength. It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తలు కేవలం సరిహద్దు సమస్యగా చూడరాదన్నారు రాహుల్. బోర్డర్ సమస్యతో ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నారని, మోదీ ప్రతిష్టపై చైనీయులు దాడి చేస్తున్నారన్నారు రాహుల్. తాము చెప్పినట్లు చెప్పకుంటే, మోదీ బలమైన నేత అన్న భావాన్ని రూపుమాపే విధంగా వ్యవహరిస్తామని చైనా మోదీని బెదిరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మోదీ తన ప్రతిష్ట పట్ల ఆందోళన చెందుతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనీయులు మన భూభాగంలోకి ప్రవేశించారన్నారు రాహుల్. కానీ మోదీ మాత్రం మన దేశంలోకి ఎవరు రాలేదని అంటున్నారు. దీన్నిబట్టే మోదీ, చైనా ఒత్తిడికి తలొగ్గతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనా చెప్పినట్లు మోదీ వింటే, ఆయన ఈ దేశానికి ప్రధాని కాదు అని రాహుల్ వీడియోలో విమర్శలు చేశారు.(మేక్ ఇన్ ఇండియా అంటూ చైనావే కొంటోంది) -
22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్–2000, సుఖోయ్–30, మిగ్–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్ జెట్లను లద్ధాఖ్ సెక్టార్లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. -
లద్దాఖ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన
-
‘ఏ శక్తి అంగుళం భూమిని కూడా తీసుకోలేదు’
లద్దాఖ్: సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్నాథ్ వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు రాజ్నాథ్ సింగ్. ‘భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని వల్ల సమస్య ఎంత వరకు పరిష్కారమవుతుంది అనే దానికి మాత్రం నేను హామీ ఇవ్వలేను. కానీ ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిని అంగుళమైనా తీసుకోలేదు’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు. (నిబంధనలు పాటించాల్సిందే!) రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. మేము ఎప్పుడూ ఒక దేశంపై దాడి చేయలేదు. ఏ దేశ భూములను ఆక్రమించుకోలేదు. ‘వసుదైక కుటుంబం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సందేశాన్ని మేము నమ్ముతాం. మాకు హింస కాదు శాంతి కావాలి. ఇతర దేశాల గౌరవాన్ని దెబ్బతీయడం మా స్వభావం కాదు. అలా అని మా దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించం. తగిన సమాధానం చెప్తాం’ అన్నారు. అంతేకాక ‘మా సైన్యం గురించి గర్వపడుతున్నాము. నేడు మా జవాన్ల మధ్య నిలబడటం గర్వంగా ఉంది. మా జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మీకు కలిగిన నష్టానికి బాధపడుతున్నారు’ అని ఆయన అన్నారు. అనంతరం వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో పాల్గొన్న సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. (ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!) -
లద్దాఖ్లో పర్యటించనున్న రాజ్నాథ్ సింగ్
సాక్షి, న్యూడిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్లో పర్యటించనున్నారు. ఆయతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా లద్దాఖ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాస్తవధీనరేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితిని రాజ్నాథ్ సమీక్షించనున్నారు. అలాగే సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలవనున్నారు. అలాగే ఆ మరుసటి రోజు రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. (‘నైపుణ్యాలే స్వావలంబన భారతావనికి శక్తి’) కొద్ది రోజులే కిందటే రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటను వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అది కాస్త వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈలోపే ప్రధాని మోదీ లద్దాఖ్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడారు. వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేశారు.(కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్) మరోవైపు తూర్పు లద్దాఖ్లోని వివాదస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్-చైనా మిలటరీ కమాండర్లు మంగళవారం సమావేశమై 10 గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్ జనరల్ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.(సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!) -
‘ట్రంప్ భారత్కు మద్దతిస్తాడని గ్యారెంటీ లేదు’
వాషింగ్టన్: భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఒక టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ విషయం చెప్పారు.(గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని ఈ కారణంగా.. జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని అన్నారు బోల్టన్. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్, భారత్ వైపు నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి కొనసాగించినా ఆశ్చర్యపోవద్దని సూచించారు. రాబోయే కొద్ది నెలల్లో ట్రంప్ ఇలాంటి అన్ని విషయాల నుంచి పక్కకు తప్పింకుంటారన్నారు. ఈ సారి తనను ఎన్నుకోవడం కష్టమని తెలిసినందున ట్రంప్ సరిహద్దులో శాంతినే కోరుకుంటారని బోల్టన్ పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలనలో 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ సేవలందించారు. -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
చైనాపై మోదీ ట్వీట్; ‘సమాధానం చెప్పాల్సిందే’
న్యూఢిల్లీ : గతంలో చైనాపై మోదీ చేసిన ట్వీట్ను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పటి కేంద్రాన్ని ఉద్ధేశిస్తూ మోదీ స్వయంగా చేసిన తన ట్వీట్పై ప్రస్తుతం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2013లో చైనా-భారత్ బలగాలను ఉద్ధేశించి గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘లడఖ్ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ తమ సొంత భూభాగం నుంచి భారత బలగాలు ఎందుకు వైదొలుగుతున్నాయి. మనం ఎందుకు వెనక్కి తగ్గాము’. అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. (సీఎం నివాసాన్ని తాకిన కరోనా) ఈ ట్వీట్ ప్రస్తుతం సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు దగ్గరగా ఉంది. గల్వన్ లోయ వద్ద పెట్రోలింగ్ పాయింట్స్ ప్రాంతంలో ఇరు దేశ సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు అధికార వర్గాలు ఆధివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల ముఖ్య నేతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు తమ బలగాలను వెనక్కి పిలిపించాయి. ఈ క్రమంలో ఒకప్పటి మోదీ ట్వీట్ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు చర్చకు దారీతీశారు. (‘ప్రభుత్వ అసమర్థతకు పోలీసులు బలి’) కాంగ్రెస్ నేత శశి థరూర్.. నరేంద్ర మోదీ2013 ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ప్రధాని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలి’. అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో రణదీప్ సుర్జేవాలా కూడా స్పందించారు. ‘ప్రధాని.. మీ మాటలు మీకు గుర్తుందా? ఈ పదాలకు ఏమైనా విలువ ఉందా? భారత బలగాలు తమ భూభాగంలో ఎందుకు ఉపసంహరించుకుంటున్నాయో మీరు చెబుతారా? దేశం సమాధానం కోరుకుంటుంది’. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లడఖ్లో 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రహదారుల ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా కీలక ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత్-చైనా ప్రతిష్టంభనకు కారణమైన దర్బక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్ నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని రెండు నెలల కిందటే భారత్ చేపట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాస్తవాధీన రేఖతో అనుసంధానించేలా 30 వంతెనల నిర్మాణాన్నీ వేగవంతం చేయనున్నారు. 30 శాశ్వత వంతెనలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిలో పలు హైవేలు, సొరంగ మార్గాలు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. చైనా సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లేహ్, తోస్, కార్గిల్ ఎయిర్ఫీల్డ్ల్లో వైమానిక దళ కార్యకలాపాలూ ఊపందుకున్నాయి. ఫార్వర్డ్ స్ధావరాలకు దళాలను, సామాగ్రిని తరలించేందుకు మెరుగైన కనెక్టివిటీ అవసరమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో నివసించే సైనికులతో పాటు పౌరులకూ సౌకర్యంగా ఉండేలా రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి : రష్యాకు రాజ్నాథ్.. కీలక చర్చలు -
భారత్ సవాళ్ళేంటి?