-
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
వెనక్కి తగ్గిన చైనా బలగాలు
-
గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!
న్యూఢిల్లీ/బీజింగ్: ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు సరిహద్దులో బలగాలను మెహరిస్తూ చైనా కుయుక్తులు ప్రదర్శిస్తోంది. భారత భూభాగాన్ని తమ ప్రాంతంగా ప్రకటించుకుంటూ భారత్ను రెచ్చగొట్టింది. గల్వాన్లో సైనికులను దొంగదెబ్బ తీసి దారుణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో చైనాపై ఎంత విముఖత ఏర్పడిందో, పర్యవసానంగా భారత్.. చైనాపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమర వీరులయ్యారు. ఇనుప చువ్వలు బిగించి ఉన్న రాడ్లతో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి కొట్టి చంపారు. అయితే వారితో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు ఆయుధాలు వాడలేదన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) ఐదుగురు జవాన్ల మృతదేహాలపై గాయాల గుర్తులు నిరాయుధులైన సైనికులను చైనా ఆర్మీ చుట్టుముట్టి దాడికి తెగబడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరుల కుటుంబాలకు జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లలో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. ముగ్గురు సైనికుల మెడ దగ్గర లోతైన గాయాలు కావడంతో రక్తనాళాలు పూర్తిగా చిట్లిపోయి మరణించారని తేలింది. మరో ఇద్దరు పదునైన, మొనదేలి ఉన్న వస్తువులతో దాడి చేయడం వల్ల మరణించినట్లు తెలిసింది. వీరందరీ తల, మెడపై గాయాల గుర్తులు ఉన్నట్లు మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక చీకట్లో సైనికులు రక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయారని ఇదే అదనుగా భావించిన డ్రాగన్ ఆర్మీ వారిపై కర్కశంగా దాడికి దిగిందని కొందరు ఆర్మీ సైనికులు తెలిపారు. ఈ క్రమంలో కొందరిని గల్వాన్ నదిలోకి తోసేయగా గడ్డకట్టిన మృతదేహాలను తరువాతి రోజు ఉదయం బయటకు తీసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. (చైనా ముప్పును ఎదుర్కొందాం) సైనికులను లోయలోకి తోసేసి.. చైనా ఇచ్చిన మాట ప్రకారం తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిందా, నిర్మాణాలను కూల్చివేసిందా లేదా అనేది ధ్రువీకరించడానికి జూన్ 15న అర్ధరాత్రి గల్వాన్లో బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ కుమార్ పెట్రోల్ పాయింట్ 14 దగ్గరకు వెళ్లి చూడగా వివాదం మొదలైంది. చైనా సైనికులు మాటకు బదులుగా చేతికి దొరికిన ఆయుధాలతో (ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను) భారత సైనికులపై మెరుపువేగంతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ వెన్నుపోటు పొడిచిన చైనా ఆర్మీపై విజృంభించింది. ఈ ఘర్షణలో 40 మంది చైనా సైనికులు మరణించినట్టు వార్తలు వచ్చినా డ్రాగన్ ధ్రువీకరించలేదు. (లద్దాఖ్కు క్షిపణి వ్యవస్థ) -
గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్ లోయ అత్యంత కీలకం. సబ్ సెక్టార్ నార్త్ (ఎస్ఎస్ఎన్)లో గల్వాన్ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్ నుంచి భారత్లోని లద్దాఖ్ దాకా గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్కు చెందిన అన్వేషకుడు గులామ్ రసూల్ గల్వాన్ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరుకోవాలంటే గల్వాన్ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్జియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో గల్వాన్ లోయ కలిసి ఉంది. గల్వాన్ నది టిబెట్ నుంచి ప్రవహిస్తూ షివోక్ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్ ప్రాంతం భారత్కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్ బేగ్ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది. దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ఐటీబీపీ)డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు. పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ ! ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్ కానే కాదు. అది భారత్’’అని చైనాలో మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ హాంగ్ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్లో వందలాది శిబిరాలను భారత్ ఏర్పాటు చేసిందని హాంగ్ తన వ్యాసంలో వివరించారు. నాటి యుద్ధంలోనూ... 1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్కు చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది. పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్డీ ముని వ్యాఖ్యానించారు. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
‘చైనా వైపు రెండింతలు చనిపోయారు’
న్యూఢిల్లీ : భారత్కు చెడు చేయాలని చూసేవారికి దీటైన సమాధానం చెబుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణ త్యాగం చేశారని.. కానీ చైనా వైపు ఆ సంఖ్య రెండింతలుగా ఉంటుందని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్లోని వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ ల గురించి వింటున్నామని.. అందులో ఒకటి కరోనా వైరస్ అని, మరోకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని వెల్లడించారు. (చదవండి : ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో) గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్ల నిషేధంపై స్పందిస్తూ.. భారతీయులు డేటా రక్షించేందుకు డిజిటిల్ స్ట్రైక్ ప్రారంభించామని చెప్పారు. కాగా, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ తమవైపు 20 మంది జవాన్లు మృతిచెందినట్టుగా ప్రకటించగా.. చైనా మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సంగతి తెలిసిందే. -
డ్రాగన్ కుతంత్రం
-
భారత్ వ్యతిరేకత.. చైనా ఆశ్చర్యం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం డోక్లాంలో భారత సైన్యం.. ఇండియా-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. అయితే భారత్ చర్యలకు చైనా ఆశ్చర్యపోయిందని.. ఇండియా తమను సవాలు చేయడం ఏంటని చైనా షాక్కు గురయ్యిందని ఆ దేశ నిపుణురాలు, అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్లో ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం సహ డైరెక్టర్ యున్ సన్ తెలిపారు. మన దేశానికి చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాక అప్పటి నుంచి చైనా వ్యూహాల్లో మార్పు వచ్చిందని.. భారత్తో పరస్పరం చర్చలు జరపడానికి ముందుకు రావడం దానిలో భాగమే అన్నారు యున్ సన్. భారత్, చైనా మధ్య 2017లో డోక్లాం ప్రతిష్టంభన గురించి యున్ సన్ మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం వివాదం చైనాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే భారతదేశం తనను వ్యతిరేకిస్తుందని.. దాదాపు 72-73 రోజుల పాటు వివాదం నడుస్తుందని చైనా ఊహించలేదు. అది కూడా భూటాన్ సమీపంలోని బంజరు భూమి కోసం భారత్ తనను వ్యతిరేకిస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది చైనాకు షాక్ లాంటిదే’ అన్నారు యున్ సన్. (నిషేధంతో చైనా గుబులు) వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట తూర్పు లడాఖ్లో కొనసాగుతున్న చైనా తాజా దురాక్రమణ గురించి యున్ సన్ను ప్రశ్నించగా.. ‘సరిహద్దు సమీపంలో భారతదేశం కార్యకలాపాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చైనా అధికారులు భావించారు. దీని గురించి మీరు ఒక చైనా ప్రభుత్వ అధికారిని అడిగితే .. వారి సమాధానం ఎలా ఉంటుందంటే.. ‘వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం చర్యలు మాకు అంగీకారం కావు. వాటిపై చైనా స్పందిస్తోంది’ అని సమాధానమిస్తారు’ అన్నారు యున్ సన్. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఎల్ఏసీ వెంబడి ఉన్న ప్రదేశాల గురించి ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతుందని తెలిపారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!) అంతేకాక ‘భారతదేశం తమ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని చైనీయులు గుర్తించినప్పుడు ఎలా స్పందించాలి అనేది వారి ఇష్టం. భారతదేశం తమను వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావించారు. ప్రస్తుతం భారతదేశం చైనాను ఒక అసాధారణస్థితిలో పెడుతోంది. అలాంటప్పుడు చైనా దూకుడుగా స్పందించి భారతదేశంపై దాడి చేయాలి.. లేదా ఏమి చేయకుండా భూభాగాన్ని వదులుకోవాలి’ అని యున్ సన్ అన్నారు. -
రాహుల్పై ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు. అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు. -
చైనా ముప్పును ఎదుర్కొందాం
వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు. మనమంతా కలిసికట్టుగా పని చేయాలి శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన తూర్పు లద్దాఖ్లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు. అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయవద్దు చైనాకు భారత్ హెచ్చరిక బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు. రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు. సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. -
గల్వాన్పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్మీడియా నెట్వర్క్లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
చైనా మైండ్ గేమ్
న్యూఢిల్లీ: భారత్, చైనా ఘర్షణల్లో డ్రాగన్ దేశం చేసిన అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 15 రాత్రి హింసాత్మక ఘటనల తర్వాత గాయపడిన మన దేశ జవాన్లను అప్పగించడంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. మొత్తం 10 మంది సైనికుల్ని తమ నిర్బంధంలో ఉంచుకున్న చైనా భారత్కు అప్పగించడానికి మీన మేషాలు లెక్కించింది. చివరికి మూడు రోజుల తర్వాత వారిని అప్పగించింది. ఈ వివరాలను ఆర్మీ అధికారి ఒకరు జాతీయ చానెల్తో పంచుకున్నారు. జూన్ 15 రాత్రి ఇరు దేశాల మధ్య భీకరమైన పోరాటం జరిగాక అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. ఒకవైపు గల్వాన్ నదిలో నిర్జీవంగా మారిన అమరవీరులు, మరోవైపు తీవ్రంగా గాయపడి నేలకొరిగిన జవాన్లతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ చీకట్లోనే ఇరువైపులా సైనికులు తమ తోటివారి కోసం వెతుకుతున్నారు. కల్నల్ స్థాయి అధికారి సహా ఇతర చైనా సైనికుల్ని మరుక్షణంలోనే భారత్ ఆ దేశానికి అప్పగించింది. కానీ చైనా వారి భూభాగంలో గాయపడిన 50 మంది భారత్ సైనికుల్ని 24 గంటల తర్వాతే అప్పగించింది. మరో నలుగురు అధికారులు సహా 10 మంది సైనికుల్ని తమ దగ్గర నిర్బంధించింది. మూడు రోజులపాటు చర్చలు మన ఆర్మీ సిబ్బంది పదుగురిని క్షేమంగా వెనక్కి తెచ్చుకోవడానికి భారత్ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. మూడు రోజులు చైనా అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఆ పది మంది సైనికులు తమ వద్దే ఉన్నారని చెప్పిన చైనా వారిని అప్పగించడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. చర్చల సందర్భంగా సైనికుల్ని అప్పగించడానికి ఏదో వంక చెప్పేది. చివరికి ఎలాగో జూన్ 18న విడుదల చేసింది. చైనా ఎందుకిలా చేసింది? మూడు రోజుల పాటు తమ దగ్గరే చైనా ఎందుకు వారిని ఉంచింది ? విడుదల చేయడంలో ఎందుకీ జాప్యం ? అన్న ప్రశ్నలకు మన ఆర్మీ సైనికులు అదంతా చైనా మైండ్ గేమ్లో భాగం అని అంటున్నారు. భారత్ అలా నిరీక్షిస్తే మానసికంగా బలహీనంగా మారుతుందని తద్వారా చర్చల్లో పైచేయి సాధించవచ్చునని చైనా కుయుక్తులు పన్నిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులాగే పరిస్థితులు ఉన్నాయి. పాంగాంగ్ లేక్ ద్వారా చైనా ఏ క్షణమైనా మనపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. చైనా ఏ రకమైన కుట్ర పన్నినా ఎదుర్కోవడానికి భారత్ బలగాలు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆర్మీ వర్గాలు వివరించాయి. -
మే నుంచే మోహరింపు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ ప్రెస్మీట్లో తేల్చిచెప్పారు. ‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. భారత్ పైనే బాధ్యత గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. -
డ్రాగన్తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్ఫోన్... ఓపెన్ చేస్తే టిక్టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్ప్రెస్లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్లోని సంస్థల ద్వారా భారత్లోని స్టార్టప్లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్లో ఆధిపత్యం.. భారత్లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్ఫోన్స్లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్లో చైనా మొబైల్ యాప్ టిక్టాక్కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్లో అందుబాటులోకి వచ్చిన టిక్టాక్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
‘చాలా కోపంగా ఉన్నాం.. చైనా వాళ్లకు ఇవ్వం’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా దేశస్థులకు వసతి కల్పించబోమని తాజాగా ఢిల్లీ హోటల్ అండ్ రెస్టరెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ (డీహెచ్ఆర్ఓఏ) ప్రకటించింది. తమ హోటళ్లు, అతిథి గృహాల్లో చైనీయులకు చోటు కల్పించబోమని గురువారం స్పష్టం చేసింది. డీహెచ్ఆర్ఓఏలో సభ్యత్వం కలిగిన దాదాపు 3 వేల బడ్జెట్ హోటళ్లలో మొత్తం 75 వేల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, చైనా వస్తువులు, సరుకులు విక్రయించబోమని భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) ఇప్పటికే ప్రకటించింది. ఈనెల 15న సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు అమరులు కావడంతో చైనా వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. చైనా ఉత్పత్తులు ఉపయోగించం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు హోటళ్ల వ్యాపారంపైనా పడింది. దేశ రాజధానిలో హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. చైనా పౌరులకు గదులు అద్దెకు ఇవ్వకూడదన్న తమ నిర్ణయాన్ని అన్ని హోటళ్లు పాటిస్తాయన్న విశ్వాసాన్ని డీహెచ్ఆర్ఓఏ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వ్యక్తం చేశారు. ‘భారత్ పట్ల చైనా వ్యవహరించిన తీరు పట్ల ఢిల్లీ హోటల్ వ్యాపారవేత్తలలో చాలా కోపం ఉంది. దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ సాగిస్తున్న ప్రచారంలో ఢిల్లీ హోటళ్లు, గెస్ట్హౌస్ల యజమానులు భాగస్వాములు అయ్యారు. నగరంలోని బడ్జెట్ హోటళ్లు, గెస్ట్హౌస్లలో చైనా జాతీయులకు వసతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నామ’ని గుప్తా తెలిపారు. తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. (చైనా మైండ్ గేమ్కు ఇదే నిదర్శనం) డీహెచ్ఆర్ఓఏ తీసుకున్న నిర్ణయాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన వారంతా మద్దతు పలుకుతున్నారని దీని ద్వారా స్పష్టమైందన్నారు. రవాణాదారులు, రైతులు, హాకర్లు, చిన్న తరహా పరిశ్రమలు, వినియోగదారులకు చెందిన జాతీయ సంఘాలను కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. (చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!) -
కాంగ్రెస్పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్ ట్రస్ట్కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కాంగ్రెస్కు ధీటుగా బదులిస్తున్నారు. (చదవండి : ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) మరోవైపు ఎమర్జెన్సీకి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై రవిశంకర్ ప్రసాద్ పలు విమర్శలు చేశారు. ‘1975 జూన్ 25 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని సీటును కాపాడుకోవడానికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, అటల్బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, చంద్రశేఖర్ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారు. కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే రోజు ఇది. వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో బిహార్ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం నా అదృష్టం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. On 25th June 1975 draconian Emergency was imposed by the Congress Govt led by PM Indira Gandhi. Major opposition leaders including Lok Nayak Jai Prakash Narayan, Bharat Ratna Atal Behari Vajpayee, L. K. Advani, Chandrashekhar and lakhs of people of India were arrested. — Ravi Shankar Prasad (@rsprasad) June 25, 2020 -
చైనా మైండ్ గేమ్కు ఇదే నిదర్శనం
న్యూఢిల్లీ: జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనా సైన్యం 10మంది భారతీయ సైనికులను అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో 4గురు అధికారులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘర్షణలు జరిగిన తరువాత రోజు ఉదయమే భారత్ మన అధీనంలో ఉన్న డజనుకు పైగా చైనా సైనికులను వారికి అప్పగించింది. కానీ డ్రాగన్ మాత్రం మన సైనికులను తిరిగి పంపించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల్లో గాయపడి ఎల్ఏసీకి అవతలి వైపు ఉన్న 50 మంది భారతీయ సైనికులను తిరిగి పంపించడానికి చైనాకు 24 గంటలు పట్టింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ క్రమంలో వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా... మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా, భారత సైనికులందరిని తిరిగి అప్పగించలేదని.. నలుగురు అధికారులతో సహా పది మంది భారత సైనికులను విడిచిపెట్టలేదని తర్వాత తెలిసింది. వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తరువాత మూడు రోజుల పాటు భారత్-చైనా మధ్య తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మన సైనికులు వారి వద్ద ఉన్నారనే విషయాన్ని చైనా ఖండించలేదు. పైగా వారంతా సురక్షితంగా ఉన్నారని చైనా హామీ ఇచ్చింది. అయితే వారిని వెంటనే విడుదల చేయకుండా.. భారతీయుల సహానానికి పరీక్ష పెట్టింది. ఇది చైనా మైండ్ గేమ్కు నిదర్శనం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 16, 17,18 తేదీలలో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జనరల్-స్థాయి చర్చలు జరిగాయి. వీటిలో ప్రధానంగా భారతీయ సైనికుల విడుదల గురించి చర్చించారు. చివరకు జూన్ 18న చైనా.. 10 మంది భారత సైనికులను విడుదల చేసింది. అయితే ఈ 10 మందిని పీఎల్ఏ కస్టడీలోనే ఉంచారా లేదా అనే దాని గురించి రెండు దేశాలు స్పష్టత ఇవ్వలేదు. (వారు పోరాడటానికి జన్మించారు..) లడఖ్లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. కాని దురదృష్టవశాత్తు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబు ఈ దాడిలో మరణించారు. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించలేదు. -
‘గల్వాన్ లోయ మాదే.. చైనా అద్భుత డిమాండ్’
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం పొరుగు దేశం చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. బుధవారం లడఖ్లోని గల్వాన్ లోయ తమదేనని చైనా మరోసారి వ్యాఖ్యలు చేసింది. కాగా దీనిపై గురువారం కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు.(అమెరికా: వారి నుంచి అధిక రుసుం వసూలు) ఏప్రిల్- జూన్ నెలలో చైనా బలగాలు భారత స్థితిని మార్చాయనే విషయం కాదనలేనిదన్నారు. భారత్ను యథాతథా స్థితిని పునరుద్ధరించడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పీఎల్ఏఎ గల్వాన్ లోయ తమదేనని నొక్కి చెప్పాయి. భారత్ గల్వాన్ లోయను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అద్భుత డిమాండ్ అంటూ ట్వీట్ చేశారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్) -
మళ్లీ చైనా కయ్యం?
న్యూఢిల్లీ: చైనా ఇంకో చోట మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోందంటున్నారు మిలటరీ విశ్లేషకులు. తూర్పు లద్దాఖ్లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్ బేగ్ ఓల్డీ, డెప్సాంగ్ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దౌలత్ బేగ్ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా కదలికలకు అనుగుణంగా భారత్ మే నెల చివరిలోనే డెప్సాంగ్ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్సాంగ్ ప్రాంతంలో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గల్వాన్లో బల ప్రదర్శన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చైనా సైనికులు గల్వాన్ ప్రాంతంలోనే తిష్టవేయగా.. భారత్ తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. జూన్ 15న ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం మేకులతో కూడిన గదలు, కర్రలతో చైనా సైనికులు జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడం తెలిసిన విషయమే. ఈ ఘటన తరువాత ఇరు పక్షాలు అక్కడికి మరిన్ని బలగాలను తరలించి బలప్రదర్శనకు దిగాయి. (వేగంగా బలగాలు వెనక్కి) తాజాగా బుధవారం లేహ్లోని ఓ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన భారత యుద్ధ విమానాలు 240 కి.మీ.ల దూరంలోని సరిహద్దుల వరకూ ప్రయాణించాయి. రోడ్డుమార్గంలో చెక్పాయింట్లు ఏర్పాటు కావడమే కాకుండా లేహ్లో మిలటరీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు సమాచారం. లేహ్ రహదారులపై మిలటరీ వాహనాలు క్యూలు కట్టాయని స్థానికులు తెలపగా.. భారత సైనికులు ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నారని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్, చైనాలు రెండింటికీ సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు మనుపెన్నడూ లేనంత స్థాయిలో చోటు చసుకోవడంలో స్థానికుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గల్వాన్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని, అదే సమయంలో చైనా ఆక్రమించినట్టుగా చెబుతున్న భూభాగాన్ని భారత్ మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన హర్‡్ష పంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 22 నాటి ఉపగ్రహచిత్రం -
వేగంగా బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భారత్ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్ జనరల్ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ల్లోని ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం. చైనా నోట మళ్లీ అదే మాట.. గల్వాన్లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్ పేర్కొన్నారు. జూన్ 15 నాటి గల్వాన్ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్ను అందించారు. లద్దాఖ్లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్ పోస్ట్ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. -
అందుకే చైనాతో పదేపదే ఘర్షణలు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కారం అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా మిలటరీకి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో మురళీధర్ రావు ’సాక్షి’ తో మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ హయాంలో చైనా బలగాలు దేశంలో భూభాగాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. గతానికి భిన్నంగా మన మిలటరీ చైనా సైన్యాన్ని గట్టిగా ఎదిరిస్తుంది. దాని కారణంగా చైనాతో పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి. (జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం) దేశరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు చైనా విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాలకు ఒక గట్టి సంకేతాన్ని పంపింది. వాస్తవాధీన రేఖ సరిహద్దు ( (ఎల్ఏసీ) అంశం నిర్థారణ అసాధ్యమైన పనేమీ కాదు. చైనా వస్తువులను బహిష్కరించడం ప్రజల అభిమతం. దేశ స్వావలంబనకు ఇది శుభ పరిణామం. చైనా వస్తువుల బహిష్కరణ అసాధ్యమేమీ కాదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ జరగదు’ అని స్పష్టం చేశారు. కాగా గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. (ఆ వార్త అవాస్తవం: చైనా) -
చైనా దూకుడుకు కళ్లెం: వ్యూహాలకు పదును
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువుతున్న చైనాను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. భారత భూభాగాల దురాక్రమణకు దూకుడుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ ఎత్తుగడలను తిప్పికొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా చైనాతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న 73 రోడ్డు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రం సోమవారం సమీక్ష జరిపింది. వాటిలో 32 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా లద్దాక్ రీజియన్లో పొరుగుదేశంతో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పెడింగ్లో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ముగించాలని పేర్కొంది. రోడ్డు నిర్మాణల ద్వారా చైనా దూకుడును అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బలగాలను సరిహద్దుకు చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సైనిక వర్గాలు కేంద్రానికి నివేదించాయి. (నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్లతో కేంద్ర హోం శాఖ ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో సరిహద్దు నిర్వహణ కార్యదర్శి సంజీవ్ కుమార్తో పాటు పలువురు ముఖ్య సైనికాధికారులు పాల్గొన్నారు. గల్వాన్ లోయలో చైనా ఆర్మీ అనుసరిస్తున్న దుందుడుకు చర్యకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గస్తీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలన్న ఆర్మీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇకపై సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు అత్యవసర పరిస్థితుల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ఆయుధానుల వాడుకునేలా స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. (గల్వాన్లో బయటపడ్డ చైనా కుట్రలు) కాగా ఇరు దేశాల నడుమ ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనపై కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఓవైపు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే సిక్కిం సరిహద్దుల్లో నుంచి భారత్లోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. -
‘చైనా.. మోదీని ఎందుకు ప్రశంసిస్తుంది’
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. కేంద్రంపై విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ‘సరెండర్ మోదీ’ అంటూ విమర్శించిన రాహుల్ గాంధీ తాజాగా.. మరిన్ని విమర్శలు చేశారు. లడాఖ్ వివాదంపై చైనా.. ప్రధానిని ఎందుకు ప్రశంసిస్తుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ క్రమంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్లో ‘లడాఖ్ అంశంలో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించింది’ అంటూ చెన్నై డేట్లైన్తో భారత్కు చెందిన ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని వెలువరించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సదరు పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్ చేస్తూ.. ‘చైనా మన సైనిలకులను చంపేసింది. మన భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఈ వివాదంలో చైనా మన ప్రధానిని ప్రశంసిస్తుంది ఎందుకు’ అని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీ జరిగిన నాటి నుంచి రాహుల్ గాంధీ, ప్రధాని పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. (ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్) China killed our soldiers. China took our land. Then, why is China praising Mr Modi during this conflict? pic.twitter.com/iNV8c1cmal — Rahul Gandhi (@RahulGandhi) June 22, 2020 సోమవారం చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్లో ‘చైనాతో యుద్ధం చేయలేమని భారత్కు తెలుసు. అందుకే నరేంద్ర మోదీ పరిస్థితి తీవ్రతరం కాకుండా మాటలతో మభ్యపెడుతున్నారు. సైనిక పరంగానే కాకుండా.. మొత్తం అంతర్జాతీయ సమాజంలో చైనా సామర్థ్యం భారత్ కన్నా అధికం’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాక ‘చైనాతో సరిహద్దు వివాదం అంశంలో.. మోదీ భారత సైన్యం అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలదని తెలపడం కేవలం ఆ దేశ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి, భారత దళాల ధైర్యాన్ని పెంచడానికి మాత్రమే’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. -
చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..
సాక్షి, కర్ణాటక: ప్రస్తుతం భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధమని పేర్కొంటూ హోంగార్డ్ లక్ష్మణ్ మడివాళ రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయచూరు జిల్లా మస్కి ప్రాంతంలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ మడివాళ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్ వంటి విషయాలను బోధించడంతో పాటు గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి వివరించే లక్ష్యం ఏర్పరచుకున్నాడు. శనివారం వైద్యుల సలహాతో భారత్–చైనాల మధ్య యుద్ధం వస్తే దేశ రక్షణే కర్తవ్యంగా భావించానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మూడు పేజీలతో లేఖను రాశారు. చదవండి: వంట మాస్టర్కు కరోనా.. క్వారంటైన్కు పెళ్లి బృందం