-
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ను ఓటింగ్కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్ను ఓటింగ్కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్.. పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది. ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్ల్యాండ్తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
మళ్లీ సంకీర్ణ యుగంలోకి కేంద్ర సర్కారు
లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత నిరాశ ఎదురైనా ఎన్డీఏకు మెజారిటీ రావడంతో కమలనాథులు సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజారిటీకి మార్క్ చేరుకోలేకపోయినా, ఎన్డీఏ కూటమిగా 292 సీట్లు సాధించింది. దాంతో సునాయాసంగా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతోంది. అయితే 2014, 2019 ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోడీ తన పాలనలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, షిండే శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిందే. అయితే బీజేపీకి మెజారిటీ మార్క్ దాటకపోవడానికి గల కారణాలపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా యూపీలో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండగా నిలబడలేదని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మారుస్తారనే విపక్షాల ప్రచారం ఠాకూర్లకు ఆగ్రహం తెప్పించడం వల్లే బీజేపీకి సీట్లు తగ్గాయని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, న్సీపీ పార్టీలను చీల్చడ మహారాష్ట్ర ఓటర్లకు ఆగ్రహన్ని తెప్పించాయి. దాని ఫలితంగా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. వీటికి తోడు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి చేసిన ప్రచారం దెబ్బ హిందీ రాష్ట్రాలలో బిజెపి స్ట్రయిక్ రేటును తగ్గించింది.ఇటు ఇండియా కూటమి అనూహ్యాంగా పుంజుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇండియాకు 234 సీట్లు తెచ్చుకుని మెజారిటీ మార్క్కు దూరంగా ఆగిపోయింది. అయితే విపక్షంలో ఉండాలా? అధికారం కోసం ప్రయత్నించాలా అన్న దానిపై ఆ పార్టీలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షంలో కూర్చుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవడంతో, ఆ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. మెజారిటీకి 38 సీట్లు తక్కువగా ఉండడంతో నితీష్, చంద్రబాబు మద్దతు కోసం ఇండియా కూటమి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రింగా ఇప్పటివరకు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపారు. తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించబోతున్న నరేంద్రమోదీ ఆ దిశగా పట్టువిడుపులతో, భాగస్వాముల ఆకాంక్షలను సంతృప్తి పరుస్తూ పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
జోహన్నెస్బర్గ్: వర్ణవివక్షపై పోరు తర్వాత నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో అధికారం చేపట్టి 30 ఏళ్లపాటు పాలించిన ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) పార్టీ తొలిసారిగా తక్కువ ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 99.80 శాతం ఓట్లు లెక్కించారు. శనివారం అనధికారికంగా వెల్లడైన గణాంకాల ప్రకారం ఏఎన్సీకి 40 శాతానికిపైగా మాత్రమే ఓట్లు పడ్డాయి. తీవ్ర పేదరికం, అసమానతలకు నెలవైన దేశంలో గొప్ప మార్పు మొదలైందని విపక్షాలు ఆనందం వ్యక్తంచేశాయి. మిగతా పారీ్టలకు ఇంతకంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఏఎన్సీ ఇప్పటికీ అతిపెద్ద పారీ్టగా ఉన్నప్పటికీ మెజారిటీ మార్కు(50 శాతానికి మించి ఓట్లు) దాటని కారణంగా మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఇతర పారీ్టలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విపక్ష డెమొక్రటిక్ అలయన్స్(డీఏ)కు 21.72 శాతం, మాజీ దేశాధ్యక్షుడు జాకబ్ జూమా నేతృత్వంలోని అమ్కోంటో వీ సిజ్వే(ఎంకే) పారీ్టకి 14 శాతం ఓట్లు పడ్డాయి. -
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్గా సాదిక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్)(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)మరికొన్ని పారీ్టలతో ఏర్పడిన సంకీర్ణ కూటమిలో పదవుల పంపిణీ కొలిక్కి వస్తోంది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవికి శుక్రవారం జరిగిన ఓటింగ్లో పీఎంఎల్–ఎన్ సీనియర్ నేత సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్గా పీపీపీ నేత గులాం ముస్తాఫాషా ఎన్నికయ్యారు. అయాజ్ సాదిక్కు 291 ఓట్లకు గాను 199 ఓట్లు రాగా, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ బలపరిచిన అమిర్ డోగార్కు 91ఓట్లు దక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పారీ్టకి చెందిన ప్రజాప్రతినిధులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్లో చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్–ఎన్ బలపరిచిన అభ్యర్థి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
పాకిస్తాన్లో సంకీర్ణమే
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఎట్టకేలకు తుది ఒప్పందానికి వచ్చాయి. నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్–నేత షహబాజ్ షరీఫ్(72), అధ్యక్షుడిగా పీపీపీ సీనియర్ నాయకుడు అసిఫ్ అలీ జర్దారీ(68) బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు పార్టిల మధ్య మంగళవారం అర్ధరాత్రి కీలక చర్చలు జరిగాయి. అనంతరం పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడి పదవికి తమ ఉమ్మడి అభ్యరి్థగా అసిఫ్ అలీ జర్దారీ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. తమ కూటమికి పార్లమెంట్లో తమకు సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. ఒప్పందం ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పదవికి పీఎంఎల్–ఎన్ పార్టికి, డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి, సెనేట్లో చైర్మెన్ పదవి పీపీపీకి లభించనుంది. చర్చలు సానుకూలంగా ముగించినందుకు పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలకు షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవుల విషయంలో పీపీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి అదే పదవికి చేపట్టబోతున్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడైన షషబాజ్ షరీఫ్ సైతం గతంలో ప్రధానమంత్రిగా సేవలందించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నిలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించారంటూ మాజీ సైనికాధికారి అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేసింది. -
Pakistan Elections 2024: సంకీర్ణం దిశగానే పాక్...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి. 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు. పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం. సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్కుమార్ గుడ్బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్కు విభేదాల నేపథ్యంలో బిహార్లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్బంధన్తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్బంధన్లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్లో ఆప్దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్బై చెప్పారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాఘట్బంధన్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్య మయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
Dutch Crisis: డచ్ సర్కార్ ఎందుకు కుప్పకూలినట్లు?
పద్దెనిమిది నెలల పాలన తర్వాత అనూహ్య పరిణామాలతో.. సంకీర్ణ ప్రభుత్వం చీలిపోయి నెదర్లాండ్స్ ప్రభుత్వం కుప్పకూలింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే(56) తన రాజీనామాను స్వయంగా ప్రకటించారు. కీలకమైన విషయంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తోందని ప్రకటించారాయన. ఇంతకీ ఆ కీలకమైన అంశం ఏంటంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం.. వలసల సమస్య. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా ఒక ఒప్పందానికి కూటమి పార్టీలు ముందుకు రాకపోవడంతో గందరగోళనం నెలకొని.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. నెదర్లాండ్స్లో దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని రుట్టే కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. వార్ జోన్ల నుంచి వచ్చే శరణార్థుల సంఖ్యను 200 మందికి మాత్రమే పరిమితం చేసేందుకు మొగ్గు చూపించారాయన. ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం(రుట్టేIV)లోని D66, క్రిస్టియన్ యూనియన్ పార్టీలు అంగీకరించలేదు. ఇవి చిన్న పార్టీలే అయినా.. ప్రజల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. అయితే రుట్టే సొంత పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమొక్రసీ మాత్రం శరణార్థుల సంఖ్యను పరిమితం చేసేందుకే మొగ్గుచూపించింది. అధిక వలసలతో దేశంపై ఆర్థిక భారం పడుతోందని.. కట్టడి కోసం యత్నించాలని సూచిస్తూ వచ్చింది. మిత్ర పక్షాలు మాత్రం శరణార్థులను కట్టడి చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపబోమని స్పష్టం చేశాయి. ఈ భేదాభిప్రాయాలు కాస్త తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. తక్షణ ఎన్నికలు జరపాల్సిందే! ప్రధాని రుట్టే.. శుక్రవారం తన రాజీనామా ప్రకటించారు. తన రాజీనామాను కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్కు సమర్పించారు. డచ్ ఎన్నికల సంఘం.. నవంబర్ మధ్యలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన చేసింది. దీంతో అప్పటిదాకా రుట్టే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలు మాత్రం తక్షణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కూటమి ప్రభుత్వం ద్వారా తాము అధికారంలో కూర్చుంటామని చెబుతున్నాయి. మార్క్ రుట్టే.. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెదర్లాండ్స్కు సుదీర్ఘంగా ప్రధాన మంత్రిగా కొనసాగిన వ్యక్తాయన. 2010 నుంచి ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. 2012, 2017, 2021.. ఎన్నికల్లోనూ ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. 2021లో 150 సీట్లకుగానూ 34 సీట్లు గెల్చుకుని.. డీ66, సీయూ, సీడీఏ పార్టీల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
ఇజ్రాయెల్.. ‘సంస్కరణం’
నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గల్లాంట్ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఏమిటీ సంస్కరణలు ► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్లో లిఖిత రాజ్యాంగం లేదు. ► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్లో సుప్రీంకోర్టే శక్తివంతం. ► ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నేస్సెట్’పై నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. ► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం. ► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ► ఇజ్రాయెల్ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి. ► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధం లేని గ్రూప్గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు. ► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు. ► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ► ఇజ్రాయెల్లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు. ► పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్కు ఉండాలని(ఓవర్రైడ్ క్లాజ్) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు. ► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన. ► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని ఇంకో ప్రతిపాదన చేశారు. నెతన్యాహూకు ప్రయోజనమేంటి? ► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు. కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఏం జరగొచ్చు? జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరాలు జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు నష్టమే! ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్బ్యాంక్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్
ఖట్మాండు: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామచంద్రను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రను ఎన్నిక కోసం తెరవెనుక ప్రచండ పన్నిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి పార్లమెంటులో రెండో అతి పెద్ద పార్టీ సీపీఎన్–యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్మాంగ్పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండేది. -
నేపాల్ ప్రభుత్వంలో కుదుపు
కాఠ్మాండు: వచ్చే నెలలో జరగబోయే నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన అభ్యర్థినికాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధాని ప్రచండ మద్దతు పలకడం సీపీఎన్–యూఎంఎల్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలైన ఉపప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌద్యాల్, విదేశాంగ మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల క్రితమే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశాలు ఎక్కువయ్యాయి. విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పౌద్యాల్కు గత శనివారం ఎనిమిది రాజకీయ పార్టీలు సమ్మతి తెలపడం, అధికారకూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం, ఉపప్రధాని పదవికి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్టెన్ రాజీనామాచేయడం తెల్సిందే. సీపీఎం–యూఎంఎల్ మద్దతులేకున్నా పార్లమెంట్లో 89 మంది సభ్యులున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీతో విశ్వాసతీర్మానాన్ని ప్రచండ సర్కార్ గట్టెక్కే వీలుంది. గత డిసెంబర్లో 7 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజుల్లోపు పార్లమెంట్లో విశ్వాసపరీక్షలో నెగ్గాలి. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
Bihar Politics: నితీశ్లో ఎందుకీ అసంతృప్తి?
బిహార్లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై తనని కూర్చోబెట్టినప్పటికీ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఉండడంతో కమలదళం తమపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని సీఎం నితీశ్ కుమార్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు.ప్రభుత్వం నడపడానికి ఆయనకి ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోగా, తనకున్న జనాదరణను బీజేపీ బలపడడానికి వినియోగించుకుంటోందని ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. 2025 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సొంత పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని భావిస్తూ దానికి అనుగుణంగా కమలదళం వ్యూహాలు రచిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పదవికి ఎసరు తప్పదన్న అంచనాలు నితీశ్లో అసంతృప్తి రాజేస్తున్నాయి. స్పీకర్తో కయ్యం బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తొలగించాలని చూసి నితీశ్ కుమార్ భంగపడ్డారు. అప్పట్నుంచి ఇరు పార్టీల నడుమ పోరు మొదలైంది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత జేడీ(యూ) నుంచి ఆర్సీపీ సింగ్ ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం నితీశ్కి రుచించలేదు. ఆ పదవి కూడా ఆర్సీపీ సింగ్కు బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వచ్చింది.దీంతో గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్సీపీ సింగ్ను మరోసారి పెద్దల సభకు పంపడానికి నితీశ్ నిరాకరించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. సింగ్కున్న ఆస్తులపైన కూడా జేడీ(యూ) వివరణ కోరింది. దీంతో ఆర్సీపీ సింగ్ పార్టీని వీడుతూ జేడీ(యూ) మునిగిపోతున్న నౌక అని, నితీశ్ అసూయతో రగిలిపోతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్)కి చెందిన చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్ను దుయ్యబట్టడం వంటివన్నీ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. గైర్హాజరు పర్వం..బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్ కుమార్ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్ పాలుపంచుకోలేదు. ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు. చాలారోజులుగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇటలీ ప్రధాని రాజీనామా
రోమ్: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు. -
presidential election 2022: జార్ఖండ్లోనూ మహా సీనే...!
మహారాష్ట్ర తరహాలో జార్ఖండ్లో కూడా ఆపరేషన్ కమలానికి రంగం సిద్ధమవుతోందా? జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లుతున్నాయా? రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ జై కొట్టడంతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది... జార్ఖండ్ గవర్నర్గా 2015–2021 మధ్య పని చేసిన ద్రౌపది ముర్ముకు అదే రాష్ట్రానికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు హేమంత్ సోరెన్ కూడా నిన్నామొన్నటిదాకా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెంటే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 17 విపక్షాల ఉమ్మడి భేటీలో సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది ఆయన తాజాగా ప్లేటు ఫిరాయించారు. ముగ్గురు జేఎంఎం ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేయాలని ఆదేశించారు. దాంతో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయా అన్న చర్చకు తెర లేచింది. సిన్హా జార్ఖండ్కు చెందినవారే అయినా ముర్ము వైపే హేమంత్ మొగ్గు చూపడం వెనుక బీజేపీ వ్యూహం దాగుందంటున్నారు. ముర్ము సంథాల్ తెగకు చెందిన గిరిజన మహిళ. హేమంత్ కూడా అదే తెగకు చెందినవారు. తాను జార్ఖండ్ మట్టి బిడ్డనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే జేఎంఎం ముర్ముకు ఓటేయనుందని పార్టీలో ఓ వర్గం చెబుతున్నా, హేమంత్ నిర్ణయంతో రాష్ట్రంలో పాలక సంకీర్ణం బీటలు వారుతుందనే చర్చ ఊపందుకుంది. వెంటాడుతున్న మైనింగ్ కేసు హేమంత్ను మైనింగ్ లీజ్ కుంభకోణం కేసు వెంటాడుతోంది. ఒక గనిని తనకు తానే కేటాయించుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల ఢిల్లీలో ఈసీ విచారణకు హాజరైన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హేమంత్ కలుసుకున్నారు. కేసు నుంచి బయట పడటానికే షాతో భేటీ అయ్యారని ప్రచారమూ జరిగింది. మనీ ల్యాండరింగ్ కేసుల్లో హేమంత్ సహాయకులపై ఈడీ దాడులు, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన ఐఏఎస్ పూజా సింఘాల్ అరెస్ట్ వంటివి కూడా సీఎం ఇబ్బందుల్లోకి నెట్టాయి. జేఎంఎంకు దూరంగా కాంగ్రెస్ తాజా పరిణామాల్లో మరో రాష్ట్రం తమ చేజారుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్లో నెలకొంది. నిజానికి జేఎంఎం బీజేపీతో చేతులు కలుపుతుందనే సందేహాలు ఆ పార్టీని కొద్ది రోజులుగా వేధిస్తున్నాయి. మేలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ ఒక సీటు డిమాండ్ చేయగా హేమంత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హేమంత్ సంకీర్ణ ధర్మం పాటించడం లేదంటూ అప్పటికే అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్, తమ నాయకులందరినీ సీఎంకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్టు స్థానిక మీడియా కథనాలు రాసింది. బీజేపీకి ఒరిగేదేమిటి? 2019లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులెవరూ బీజేపీకి మద్దతివ్వలేదు. గిరిజన ప్రాబల్యమున్న 28 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ఏకంగా 25 నెగ్గింది. బీజేపీ రెండింటికే పరిమితమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎంకు 30, కాంగ్రెస్కు 16, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎంను చేరదీసి ప్రభుత్వానికి మద్దతిస్తే ‘కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు 2024 ఎన్నికల్లో జేఎంఎంతో కలిసి రాష్ట్రంలో గిరిజన ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాథుల వ్యూహమంటున్నారు. మోదీపై ప్రశంసలు బీజేపీకి దగ్గరవాలని ప్రయత్నిస్తున్న హేమంత్ ఇటీవల ప్రధాని మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జార్ఖండ్లో దేవగఢ్ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి మోదీ జరిపిన రాష్ట్ర పర్యటనకు హేమంత్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూశారు. పైగా ఆ కార్యక్రమంలో మోదీ సమర్థతను బహిరంగంగానే ప్రశంసించారు. ‘‘కేంద్రం నుంచి మాకు సహకారముంటే వచ్చే ఐదేళ్లలో జార్ఖండ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెడతాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారముంటేనే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది’’ అన్నారు. ఆయన కూటమి మార్చేస్తారన్న ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు. -
మళ్లీ ఆపరేషన్ కమలం... ‘మహా’ సంక్షోభం
ముంబై: అదను చూసి బీజేపీ తెర తీసిన ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి వేరు బాట పట్టారు. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్కు తరలించారు. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. షిండే శిబిరంలో చేరిన శివసేన ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 32కు పెరిగిందంటూ కూడా వార్తలొస్తున్నాయి. మరో నలుగురు స్వతంత్రులూ వీరికి తోడయ్యారని చెబుతున్నారు. దాంతో రెండున్నరేళ్ల శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ అధికార మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ) కూటమి మైనారిటీలో పడినట్టే కన్పిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన ఎమ్మెల్యే ఒకరు ఇటీవల మరణించిన నేపథ్యంలో ప్రస్తుత సంఖ్య 287. ఆ లెక్కన మెజారిటీ మార్కు కూడా సరిగ్గా 144. ఎంవీఏకు 168 మంది ఎమ్మెల్యేలుండగా షిండేతో కలిసి 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే దాని బలం కూడా సరిగ్గా 144కు తగ్గుతుంది. షిండే వెంట అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుండటం నిజమైతే సర్కారు మైనారిటీలో పడ్డట్టే. అన్నీ కలిసొస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించి వేడిని మరింత పెంచారు. ఇదంతా బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగానే జరుగుతోందని అధికార సంకీర్ణం ఆరోపిస్తోంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత మందిని బీజేపీ లాగేయకుండా చూసేందుకు సేన తమ ఎమ్మెల్యేలను మంగళవారం రాత్రి ముంబైలో ఓ హోటల్కు తరలించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగబోయే పరిణామాలపైనే అందరి దృష్టీ నెలకొంది. మండలి ఫలితాలతో కాక సోమవారం రాత్రి 10 శాసనమండలి స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. ఆరు సీట్లకు పోటీ చేసిన అధికార కూటమి ఒక స్థానంలో అనూహ్యంగా ఓటమిపాలైంది. నాలుగు సీట్లే గెలవాల్సిన బీజేపీ ఐదో సీటూ చేజిక్కించుకోవడంతో అధికార కూటమి ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్టు తేలిపోయింది. 10 రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో బీజేపీ అదనపు సీటు గెలుచుకుంది. అప్పట్నుంచే సంకీర్ణంలో లుకలుకలు మొదలయ్యాయి. 37కు తగ్గితే అనర్హత వేటు! శివసేనను చీల్చి వేరు కుంపటి పెట్టాలంటే షిండేకు 55 మంది పార్టీ ఎమ్మెల్యల్లో మూడింట రెండొంతుల మంది కావాలి. అంటే 37 మంది అవసరం. అంతకు తగ్గితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారందరిపైనా అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే 36 మంది సేన ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోకి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారిలో శివసేనకు చెందినవారు 32 మందేనని, నలుగురు స్వతంత్రులని కూడా చెబుతున్నారు. ఉద్ధవ్ మాట్లాడినా... షిండేను బుజ్జగించేందుకు సేన ఎమ్మెల్యేలు మిలింద్ నర్వేకర్, రవీంద్ర పాఠక్ సూరత్ వెళ్లి మెరీడియన్ హోటల్లో షిండేతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఉద్ధవ్ కూడా షిండేతో ఫోన్లో పది నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్సీపీ, కాంగ్రెస్లకు గుడ్బై కొట్టి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా షిండే డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. సేన ఎమ్మెల్యేలు వెనుదిరిగిన కాసేపటికే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు అతి సన్నిహితుడైన బీజేపీ నేత సంజయ్ కౌతే కూడా హోటల్కు వెళ్లి షిండేతో చర్చలు జరిపారు! హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వారిని అహ్మదాబాద్ తరలిస్తారని సమాచారం. అధికారం కోసం ఎప్పటికీ మోసానికి దిగబోనంటూ షిండే ట్వీట్ చేసి వేడిని మరింత పెంచారు. ‘‘మేమంతా బాలాసాహెబ్ ఠాక్రేకు విధేయులమైన కరడుగట్టిన శివసైనికులం. ఆయన నుంచి హిందూత్వ పాఠాలు నేర్చుకున్నాం. అధికారం కోసం మోసానికి దిగలేం. బాల్ ఠాక్రే నేర్పిన పాఠాలను ఎన్నటికీ వదులుకోలేం’’ అని పేర్కొన్నారు. ఈ విమర్శలు నేరుగా ఉద్ధవ్పైకేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ విప్ పదవి నుంచి షిండేను పార్టీ తొలగించింది. పవార్తో ఉద్ధవ్ చర్చలు సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో ఉద్ధవ్ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అయితే, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి రాష్ట్ర హోం మంత్రికి తెలియకుండా రాష్ట్రం వీడటం అసాధ్యమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. రాష్ట్ర హోం మంత్రి దిలీప్ పాటిల్ ఎన్సీపీ నాయకుడే! దాంతో, షిండే తిరుగుబాటు గురించి పవార్కు ముందే తెలుసనీ అంటున్నారు. అంతకుముందు పవార్ మాట్లాడుతూ ఈ సంక్షోభాన్ని శివసేన అంరత్గత వ్యవహారంగా అభివర్ణించారు. దీన్నెలా పరిష్కరించాలో ఉద్ధవ్ చూసుకుంటారన్నారు. అధికార కూటమిని కూలదోసేందుకు ఈ రెండున్నరేళ్లలో ఇది మూడో ప్రయత్నమన్నారు. ఆపరేషన్ కమలం మహారాష్ట్రలో తాజా రాజకీయ క్రీడ బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్ద ఆశీస్సులతో రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సంక్షోభానికి పథక రచన చేసినట్టు చెబుతున్నారు. మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో కలిసి పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఫడ్నవీస్ మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతే రాష్ట్రంలో రాజకీయ కాక పరాకాష్టకు చేరింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యులు పోను ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు 29 మంది ఉన్నారు. వీరిప్పుడు కీలకంగా మారారు. వీరిలో ప్రస్తుతం 16 మంది అధికార కూటమికి, 8 మంది బీజేపీ కూటమికి మద్దతిస్తున్నారు. ఎటూ మొగ్గనివారు ఐదుగురున్నారు. -
‘డబుల్ ఇంజిన్’ స్పీడ్ ఎంత?
అభివృద్ధి ఎజెండాతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న అధికార బీజేపీ అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో కాంగ్రెస్ తీవ్రవాద సమస్యనే ప్రధాన బూచీగా చూపిస్తూ ప్రాంతీయ పార్టీలు ఇలా ఎవరి దారిలో వారే నడుస్తూ మణిపూర్ ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు. మణిపూర్ సంకీర్ణ సర్కార్లో భాగస్వామ్య పక్షాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఈసారైనా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టార్గెట్ 40+ సీట్లు లక్ష్యంగా అభివృద్ధి నినాదంతో ముందడుగు వేస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండడం) మణిపూర్కు లాభమని ప్రధాని సహా బీజేపీ నేతలందరూ నొక్కి చెబుతున్నారు. 2017 ఎన్నికల్లో 21 సీట్లతో రెండోస్థానంలో నిలిచినా.. కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల బీజేపీ రాష్ట్రంలో చక్రం తిప్పి మొదటిసారి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల రూ.1,858 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.2,957 కోట్ల రూపాయలతో మరో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లో కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ అయిదేళ్ల కాలంలో 29కి చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వ భాగపక్షాలైన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లతో విభేదాలున్నప్పటికీ వారితో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా కమలదళం ఉంది. ముఖ్యమంత్రి ఎన్.బైరాన్ సింగ్ అభివృద్ధి, మోదీ చరిష్మాపైనే ఆశలతో ఉన్నారు. రాష్ట్ర్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు శారదాదేవి అనే మహిళ సమర్థంగా నిర్వహించడం ఆ పార్టీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రవాద సమస్యే వారి ఎజెండా బీజేపీ ప్రభుత్వానికి ఇన్నాళ్లూ మద్దతునిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగాలాండ్, మణిపూర్లలో పట్టున్న ఈ రెండు పార్టీలు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మొత్తానికే రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. నాగాలాండ్లో ఇటీవల 14 మంది అమాయకులైన పౌరుల్ని కాల్చి చంపడం, గత ఏడాది నవంబర్ 13న చురచంద్పూర్ జిల్లాలోని సింఘాట్ వద్ద అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై తీవ్రవాదులు చేసిన మెరుపు దాడిలో కల్నల్ బిల్లవ్ త్రిపాఠి కుటుంబం ప్రాణాలు కోల్పోవడం, అక్కడక్కడ జరిగిన బాంబుదాడుల్ని చూపిస్తూ భద్రతనే ప్రధానంగా ప్రశ్నిస్తూ బీజేపీకి పక్కలో బల్లంలా మారారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. మణిపూర్ ఓటర్లు సాధారణంగా అటువైపు మొగ్గు చూపుతుంటారు. దానితో పాటు బరిలో ఉన్న అభ్యర్థి సామర్థ్యాన్నీ చూస్తారు. అలాంటి చోట ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలన్న ఎజెండా ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే సందేహాలున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కూడా అయిన ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇక ఎన్పీఎఫ్కి నాగా ప్రజల్లో గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో 4 సీట్లలో విజయం సాధించిన ఈ పార్టీ ఇప్పుడు 8 నుంచి 10 స్థానాల్లో గెలిచి కింగ్మేకర్ కావాలన్న ఆశతో ఉంది. వలసలతో కాంగ్రెస్ కుదేల్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అంతేకాకుండా వలసలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. గత అయిదేళ్ల కాలంలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు తగ్గిపోయారు. ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారిలో అత్యధికులు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 14కి పడిపోయింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు గోవింద్ దాస్తో సహా పలువురు ప్రముఖులు పార్టీని వీడడంతో కాంగ్రెస్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టోంది. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మూడుసార్లు సీఎంగా చేసిన ఇబోబి సింగ్ కాంగ్రెస్ను ముందుండి నడపడంలో విఫలమవుతున్నారు. అయినప్పటికీ నిరుద్యోగ యువత తమవైపు ఉంటారన్న ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ ఉంది. నిరుద్యోగ సమస్య పర్వత ప్రాంతమైన మణిపూర్లో అక్షరాసత్య రేటు అత్యధికంగా 80% వరకు ఉంది. జాతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే ఇది చాలా ఎక్కువ. అయినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగం రేటు 11.6% కాగా, ఎకనామిక్ సర్వే ఆఫ్ మణిపూర్ 2020–21 ప్రకారం 18–24 మధ్య వయసు గల వారిలో నిరుద్యోగులు 44.4 శాతం ఉన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం కూడా అధికార బీజేపీపై వ్యతిరేకతను పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార వ్యతిరేకతనే తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు పార్టీల మధ్య పొత్తులు లేకపోయినా, ఎన్నికల తర్వాత పొత్తులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదిరే పని కాదు. బీజేపీ హిందుత్వ కార్డుతో అసంతృప్తిగా ఉన్న ఎన్పీపీ, ఎన్పీఎఫ్ పార్టీలతోనే కమలనాథులకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి – ప్రదీప్ ఫన్జోబమ్, ఎన్నికల విశ్లేషకుడు