-
7 గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
కోపెన్హాగెన్(డెన్మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు!
కాబూల్: అఫ్గాన్లోని అన్ని జాతులు, తెగల నాయకులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తాలిబన్ వర్గాలు అల్జజీరా న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఇందుకోసం అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నామని, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములుగా దాదాపు డజను మంది పేర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ఈ సమ్మిళిత ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో వెల్లడించలేదు. అఫ్గాన్లో పలు తెగలు ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. దేశం మొత్తం ఆధిపత్యం వహించగలిగే తెగలు మాత్రం లేవు. ఉన్నవాటిలో ఫష్తూన్ తెగ జనాభా పరంగా పెద్దది. మతపరంగా సున్నీ ముస్లింలు అధికంగా ఉన్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వ అధినేత ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్కు ‘అమీర్ ఉల్ మోమినీ’(విశ్వాసుల నాయకుడు)గా వ్యవహరిస్తారని తాలిబన్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలకు ఒక సుప్రీం కౌన్సిల్ ఏర్పాటైందని తెలిపారు. కీలక మంత్రిత్వ శాఖలకు ఈ కౌన్సిల్ మంత్రులను నామినేట్ చేయవచ్చు. ప్రస్తుతం తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ కాబూల్లోనే ఉండగా, ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ ఇక్కడికి చేరుకొని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలిసింది. పాత ప్రభుత్వ పెద్దల్లో కర్జాయ్ లాంటి కొందరిని కొత్త ప్రభుత్వంలో చేర్చుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తాలిబన్లతో మసూద్ అజర్ భేటీ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ తాలిబన్లను కలుసుకొని కశ్మీర్లో ఉగ్ర దాడులకు సాయం చేయాలని కోరినట్టు తెలిసింది. తాలిబన్లు అఫ్గాన్ను ఆక్రమించుకున్న సమయంలో మసూద్ అజర్ కాందహార్లో ఉన్నట్టు సమాచారం. ముల్లా అబ్దున్ ఘనీ బరాదర్ సహా పలువురు తాలిబన్ నాయకుల్ని కలుసుకొని కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా వారిని కోరినట్టు తెలుస్తోంది. -
‘మహా’ సంకీర్ణం సాఫీగా సాగుతోంది
పుణే: శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతోందని, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఉమ్మడి ప్రణాళికతో ముందుకుసాగాలని నిర్ణయించామన్నారు. పవార్ తన స్వస్థలం బారామతిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నపుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారాలను కనుగొనేందకు ఒక వ్యవస్థ ఉండాలని నిర్ణయించాం. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్లను ఎంపిక చేసి ఈ బృందానికి సమస్యల పరిష్కార బాధ్యతను అప్పగించాం. విధానపరమైన నిర్ణయాలైనా, ఇబ్బందులు వచ్చినా పై ఆరుగురు నాయకులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు’ అని పవార్ పేర్కొన్నారు. అందరి అభిలాష అదే... ‘మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సాఫీగా నడుస్తోంది. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకుసాగాలనేదే అందరి అభిలాష. కాబట్టి ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుందనడంలో నాకెలాంటి సందేహం లేదు’ అని 2019లో ఎంవీఏ ఏర్పాటు కీలకపాత్ర పోషించిన సీనియర్ నేత శరద్పవార్ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు పార్టీలుగా ప్రజల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని దేనికదే ప్రయత్నిస్తాయని... అందులో తప్పులేదని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల పేర్కొని వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పవార్ తాజాగా వివరణ ఇచ్చారు. -
ఎన్సీపీకే పెద్ద పీట
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్ దేశ్ముఖ్కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరాత్కు రెవెన్యూ, అశోక్ చవాన్కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్లో అసంతృప్తి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరాత్ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు. -
విశ్వాసం పొందిన ఉద్ధవ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గింది. శనివారం జరిగిన ప్రత్యేక భేటీలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసం పొందింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాషాయ తలపాగాతో ఉద్ధవ్ రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సీఎం ఉద్ధవ్తోపాటు సేన ఎమ్మెల్యేలంతా కాషాయ రంగు తలపాగా ధరించి సభకు వచ్చారు. ఉద్ధవ్ వెనుక ఆయన కొడుకు, ఆదిత్య ఠాక్రే మిగతా సేన ఎమ్మెల్యేలతోపాటు కూర్చున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ కొలాంబ్కర్ను తొలగించి ఎన్సీపీకి చెందిన వల్సే పటిల్ను అధికార పక్షం ఎన్నుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభలో విశ్వాస పరీక్ష కార్యక్రమం మొదలైంది. పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించగానే ఉద్ధవ్ లేచి సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వాకౌట్ ఠాక్రే ప్రభుత్వంపై కాంగ్రెస్కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ ఆఘాడి 3, సమాజ్వాదీ పార్టీ 2, స్వాభిమాని శేట్కారి పార్టీ 1, శేత్కరి కామ్గార్ పార్టీ 1, క్రాంతికారి శేత్కరీ పార్టీ 1, ఇతరులు, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు, రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. అలాగైతే పార్లమెంట్ సగం ఖాళీ: ఎన్సీపీ నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అధికార పక్షం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదన్న శివసేన ఆరోపణలపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘పార్లమెంట్లో బీజేపీ సభ్యులు కూడా ఫార్మాట్ను పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రకాంత్ పాటిల్ చెబుతున్న నియమాన్ని వారికి కూడా వర్తింపజేస్తే లోక్సభ సగం ఖాళీ అవుతుంది’అని పేర్కొన్నారు. అధికార కూటమి తరఫున నానా పటోలే, బీజేపీ నుంచి కిసాన్ కతోరే స్పీకర్ పదవికి పోటీ చేయనున్నారు. అసెంబ్లీలో బలాబలాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ను కొత్త ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది. రాజకీయ, రాజ్యాంగ నైతికతలు వేరువేరు: సుప్రీంకోర్టు ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది. మహారాష్ట్ర తరువాత గోవానే! మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) నేతలతో శుక్రవారం రౌత్ చర్చలు జరిపారు. పైన పేర్కొన్న రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్పీ చీఫ్ విజయ్ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్ మాట్లాడుతూ.. ‘త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర తరువాత గోవానే. ఆ తరువాత వేరే రాష్ట్రాలపై దృష్టి పెడతాం’ అని రౌత్ తెలిపారు. -
కొలువుతీరిన ఠాక్రే సర్కార్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి మహా వికాస్ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్ గ్రౌండ్లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్లతో మంత్రులుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్∙ముకేశ్ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్ వచ్చారు. బంతిపూల రహదారి ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు. మోదీ, సోనియా అభినందనలు మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ చీఫ్ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉద్ధవ్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్.. ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయకుడికి విశేష పూజలు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ విషయంలో ఉత్కంఠ ఉద్ధవ్తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. తొలి కేబినెట్ భేటీ ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్హౌజ్లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్హౌజ్కు అజిత్ పవార్ కూడా రావడం విశేషం. ఉద్ధవ్ నంబర్ 8 మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ఏఆర్ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్ పాటిల్, శంకర్రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన శరద్పవార్ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్ పవార్ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్ను తొలగించి శరద్ పవార్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అజిత్ అసమ్మతికి ‘పవార్’ కారణమా? వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్పవార్లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్ పవార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్ చవాన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కి 82, ఎన్సీపీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్ పవార్కి వచ్చింది. అయితే అనూహ్యంగా, అజిత్ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్ భుజ్బల్కి శరద్ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్ పవార్ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ధనుంజయ్ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్ పవార్ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్ 2 కావడంపై అజిత్ పవార్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు. కాషాయం మసకబారుతోంది! న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది. -
ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్కు స్పీకర్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్కు స్పీకర్ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఉద్ధవ్తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖర్గే కలిశారు. శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్కు స్పీకర్ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్ భగత్ కోశ్యారీని ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్ చీఫ్ సోనియాను ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అజిత్కు డిప్యూటీ సీఎం? అజిత్ పవార్కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ వెంటే.. బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్తో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అజిత్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు. అజిత్కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కొలంబ్కర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్ పవార్కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్ పవార్కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు. రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిటీలోనే అతిపెద్ద పార్కు ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్వాల్ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్ కేశవ్ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు. మహిమా పార్కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు. మున్సిపల్ కౌన్సిలర్ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి. సైలెన్స్ జోన్గా ప్రకటించిన కోర్టు నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్ జోన్గా ప్రకటించింది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే. -
ఎన్సీపీలోనే ఉన్నా.. శరద్ మా నేత!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, తన నేత శరద్పవారేనని స్పష్టం చేశారు. బీజేపీ–ఎన్సీపీ సంకీర్ణం మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఐదేళ్లు కొనసాగుతుందని ట్వీట్ చేశారు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘శివసేన, కాంగ్రెస్లతో కూటమి ఏర్పాటు చేయాలనేది ఎన్సీపీ ఏకగ్రీవ నిర్ణయం’ అని శరద్ పవార్ ట్వీట్ చేశారు. ‘అజిత్ పవార్ ప్రకటన అబద్ధం. గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఇచ్చినట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ను తొలగించి, ఆ స్థానంలో సీనియర్ నేత జయంత్ పాటిల్ను నియమించామని గవర్నర్కు ఎన్సీపీ సమాచారమిచ్చింది. సంబంధిత లేఖతో ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ గవర్నర్ నివాసం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి ఆ సమాచారం అందజేశారు. ఆ తరువాత ఆయన నేరుగా అజిత్ పవార్ నివాసానికి వెళ్లడం విశేషం. తప్పు దిద్దుకుని, బీజేపీ నుంచి తిరిగి వెనక్కు రావాల్సిందిగా పవార్ను కోరేందుకే తాను వెళ్లానని ఆ తరువాతమీడియాకు చెప్పారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి అజిత్ పవార్ కృతజ్ఙతలు తెలిపారు. ఇంటికి తిరిగొచ్చిన అజిత్ పవార్ శనివారం తన సోదరుడి ఇంట్లో గడిపిన అజిత్ పవార్ ఆదివారం చర్చ్గేట్ దగ్గర్లోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నేతలను కలుసుకున్నారు. మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు 170కి పైగా ఎమ్మెల్యేల మద్దతుందని, సునాయాసంగా విశ్వాస పరీక్షను నెగ్గుతామని బీజేపీ తెలిపింది. విశ్వాస పరీక్షకు గవర్నర్ నవంబర్ 30 వరకు సమయమిచ్చారని బీజేపీ నేత ఆశిశ్ షెలర్ తెలిపారు. బీజేపీకి మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలతో త్వరలో భేటీ అవుతామన్నారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత కాబట్టి.. అజిత్ పవార్ విప్ జారీ చేస్తే.. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ఆ విప్కు బద్ధులై ఉండాల్సిందేనన్నారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భేటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న రినాయిజన్స్ హోటల్లో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ కుమారుడు, పార్టీ నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలున్న హోటల్లోకి సివిల్ దుస్తుల్లో పోలీసులు రావడంపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బస మారింది బీజేపీ నుంచి బేరసారాలకు వీలు లేకుండా, తమ ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ఆదివారం రాత్రి వారిని మొదట బస చేసిన హోటల్ నుంచి మార్చి వేరే హోటల్కు మార్చాయి. మొదట, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రినాయిజెన్స్ రిసార్ట్లో ఉంచగా, ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి వారిని మరో హోటల్కు మార్చారు. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు మొదట అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లోని లలిత్ హోటల్లో బస చేశారు. ఆదివారం రాత్రి వారిని కూడా వేరే రహస్య ప్రాంతానికి తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం జుహూలోని జేడబ్ల్యూ మేరియట్ హోటల్లోనే ఉన్నారు. ఫడ్నవీస్ను అభినందిస్తున్న చంద్రకాంత్ పాటిల్ ముంబైలోని తన నివాసానికి వస్తున్న అజిత్పవార్ -
‘మహా’ సీఎం ఉద్ధవ్!
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ వీడింది. శివసేన నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందన్న స్పష్టత వచ్చినప్పటికీ.. శివసేన తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనా? లేక ఆయన కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారా? అనే విషయంలో శుక్రవారం వరకు సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య ముంబైలో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఆ సందిగ్ధతకు ఎన్సీపీ అధినేత శరద్పవార్ తెర దించారు. సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు. ‘సంకీర్ణ ప్రభుత్వ నేత ఎవరనే విషయం పెండింగ్లో లేదు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం ఉంది’ అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య చర్చలు నేడు(శనివారం) కూడా కొనసాగనున్నాయి. చర్చల ప్రక్రియ శుక్రవారం ముగుస్తుందని, ఆ తరువాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేస్తాయని తొలుత అంతా భావించారు. కానీ చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నందున, మూడు పార్టీల నేతల భేటీ శనివారం కూడా కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తెలిపారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చామని చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. ముంబైలోని నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ చర్చల్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ పాల్గొన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, త్వరలో వివరాలు మీడియాకు వివరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం అవుతారని శరద్ పవార్ చెప్పారని శివసేన నేత ఏక్నాథ్ షిండేతో విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ విషయం ఈ రోజు చర్చల్లో ప్రస్తావనకు రాలేదు’ అని తెలిపారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నికయిన విషయం తెలిసిందే. కాగా, ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం కావాలని పవార్ పట్టుబడుతున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఉద్ధవ్ ఠాక్రేనే అన్నారు. చర్చల అనంతరం సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, ఆదిత్య ఠాక్రేలతో శివాజీ పార్క్లోని మేయర్స్ బంగళాలో ఉద్ధవ్ సమావేశమయ్యారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్– ఎన్సీపీ భేటీ శివసేనతో చర్చలకు ముందు.. మిత్రపక్షాల నేతలతో కాంగ్రెస్– ఎన్సీపీ నాయకులు చర్చలు జరిపారు. సమాజ్వాదీ పార్టీ, సీపీఎం, స్వాభిమాన్ ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీ, జనతాదళ్ తదితర పార్టీల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ‘శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి’ అని ఆ తరువాత ఎన్సీపీ నేత జయంత్పాటిల్ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ) ముసాయిదాను రూపొందించా యని, దీనిపై పార్టీల అగ్ర నేతలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వెల్లడించారు. ‘మా మద్దతు కావాలంటే శివసేన కొన్ని విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మతవాదాన్ని నిర్మూలించేందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దళితులు, మైనారిటీలు, రైతులకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి’ అని ఎస్పీ నేత అబూ అజ్మీ స్పష్టం చేశారు. ఇంద్ర పదవి ఇస్తామన్నా.. బీజేపీతో మళ్లీ పొత్తుకు అవకాశాలు లేవని శివసేన నేత సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. ‘ఇంద్రుడి సింహాసనం ఇస్తామన్నా బీజేపీకి మద్దతివ్వం’ అని స్పష్టం చేశారు. శివసేనతో పొత్తుకు బీజేపీ మళ్లీ ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. అవకాశవాద పొత్తు: బీజేపీ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల పొత్తు అవకాశవాద రాజకీయమని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ విమర్శించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకే సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. వారి ప్రభుత్వం ఆర్నెల్లు మించి సాగదన్నారు. -
నేడు శివసేనతో భేటీ
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ భగత్సింగ్ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్నా? ఆదిత్యనా? శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్నేతలు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ ఆమోదం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, ఉద్ధవ్ భేటీ ఉండదు సోనియాగాంధీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు. పవార్, ఠాక్రే భేటీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్లకు ‘డిప్యూటీ’ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున బాలాసాహెబ్ తోరట్ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి. -
శివసేన నేతృత్వంలో సంకీర్ణం
నాగ్పూర్/ముంబై: మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఉంటారని ఎన్సీపీ నేత మాలిక్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం నాగ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారంలోకి రానున్న సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది. అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు’అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఫడ్నవీస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ, ఆయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్న సంగతి తెలియదు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆయన పదేపదే అంటున్నారు. అది తప్ప మరేదైనా కొత్త విషయం చెప్పమనండి. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు’అని స్పష్టం చేశారు. 25 ఏళ్లు అధికారంలో ఉంటాం: సంజయ్ రౌత్ శివసేన నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. ‘మా పార్టీ రానున్న ఐదేళ్లే కాదు..మరో 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు సీఎంపీ రూపొందించాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పార్టీల సిద్ధాంతాల ప్రస్తావన లేదు. గతంలో కూడా సీఎంపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’అని పేర్కొన్నారు. వీర్ సావర్కర్కు భారతరత్న, ముస్లిం రిజర్వేషన్ వంటి డిమాండ్లను శివసేన వదులుకుంటుందా అన్న ప్రశ్నకు రౌత్ స్పందించలేదు. కాగా, శరద్ పవార్ 17వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమై సీఎంపీ, ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ తెలిపారు. -
అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ
సాక్షి, బెంగళూరు: గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్– జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి అనర్హత వేటుకు గురయ్యారన్నారు. అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారు ఏర్పడడానికి కృషి చేశారని, ఉప ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
హరియాణా సీఎంగా ఖట్టర్ ప్రమాణం
చండీగఢ్: హరియాణాలో బీజేపీ–జేజేపీల సంకీర్ణప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలాలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఖట్టర్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా, దుష్యంత్ మొదటిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ఇటీవలే జైలు నుంచి సెలవు మీద బయటకు వచ్చిన దుష్యంత్ చౌతాల తండ్రి అజయ్ చౌతాలా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దుష్యంత్ తల్లి నైనా చౌతాలాలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారాల అనంతరం సీఎం ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్లు మీడియాతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
కర్ణాటకం : సంకీర్ణ సర్కార్కు మరో షాక్
బెంగళూర్ : రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో విశ్వాస గండం ఎదుర్కొంటున్న కర్ణాటకలోని పాలక జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కుమారస్వామి సర్కార్కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారు. సోమవారం జరిగే విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉండాలని తనను బీఎస్పీ చీఫ్ మాయావతి కోరారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్ మహేష్ వెల్లడించారు. తాను బీఎస్పీ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని, తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక విశ్వాస తీర్మానంపై సోమ, మంగళవారాల్లో ఓటింగ్ జరగనుండటంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సంకీర్ణ నేతలు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అధికార మార్పిడి ఖాయమని ఆశల్లో ఉన్న బీజేపీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలకు పదునుపెడుతోంది. -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్వాలా స్పీకర్ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
‘కోట్ల’ కర్నాటకం
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, అటు బీజేపీ అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఓవైపు సొంత కూటమి నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు అన్నిప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలను చీల్చడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాజకీయ వ్యవహారాలను సునిశితంగా పరిశీలిస్తున్నవారి అంచనా ప్రకారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున నగదును ముట్టజెప్పినట్లు సమాచారం. కేవలం నగదు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా హోటళ్లు, రిసార్టుల్లో గదులు బుక్చేయడంతో పాటు వారి డిమాండ్లన్నింటిని తీరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోటల్/ రిసార్టుల్లో ఒక్కో గదికి రోజుకు రూ.4000 నుంచి రూ.11,000 వరకూ ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని ఆయా రాజకీయ పార్టీలే భరిస్తున్నాయి. ఒక్కో ట్రిప్కు రూ.4 లక్షల ఖర్చు.. ఇక ముంబైలో క్యాంప్ ఏర్పాటుచేసిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో ముంబై–బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఒక్కో ట్రిప్కు రూ.4 లక్షల వరకూ ఖర్చవుతోంది. కర్ణాటక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పలుమార్లు ఇలా రాకపోకలు సాగించారు. మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. కొద్ది రోజులుగా ఇలా ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, హోటళ్లలో బస కోసం రాజకీయ పార్టీలు రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే సొంత డబ్బుతోనే తాము హోటళ్లలో ఉంటున్నామని రెబెల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాత్రం బీజేపీవైపు వేలెత్తి చూపిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక బీజేపీ లేకుంటే, రాజీనామాలు చేసినవెంటనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక విమానాలు, హోటళ్లలో గదులు ఎలా సమకూరాయని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో రిసార్టుల రాజకీయం మొదలైంది. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు 14 నెలల్లో శాసనసభ్యులను మూడుసార్లు రిసార్టులకు తరలించాయి. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
పరిష్కారం అంచుల్లో కర్ణాటకం
నెలరోజుల నుంచి కర్ణాటకలో ఎడతెగకుండా సాగుతున్న రాజకీయ సంక్షోభం ముగింపునకు చేరువవుతున్న సూచనలు కనబడటం హర్షించదగ్గది. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్– జేడీ(ఎస్) సర్కారుకు గురువారం విశ్వాసపరీక్ష ఉంటుందని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ చేసిన ప్రకటన వైరి పక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో... స్థిరత్వం లేని ఎమ్మెల్యేల విచిత్ర రాజకీయ విన్యాసా లతో అస్తవ్యస్థంగా తయారైన ఆ రాష్ట్ర పరిస్థితుల్ని కాస్తయినా చక్కదిద్దగలదని భావించాలి. ఏం చేసైనా అధికార పగ్గాలు అందుకుని తీరాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, ఏదోవిధంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కూటమి తాపత్రయపడుతోంది. కట్టుదాటినవారిపై ఒత్తిళ్లున్నాయని, వారందరికీ స్వేచ్ఛనిస్తే తిరిగి తమ గూటికి చేరతారని ఆ కూటమి చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్య మేనని జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారికి స్పష్టంగానే అర్ధమవుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్వయంగా ముంబై వెళ్లి అక్కడి హోటల్లో బస చేసి ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడాలని చూడటం, పోలీసులు అనుమతించకుండాఅరెస్టు చేయడం... చివరకు ఆయన ఉత్త చేతులతో వెనుదిరగడం అందరూ చూశారు. చివరకు ఒక ఎమ్మెల్యేను ఒప్పించా మనుకుంటే... ఆయన కాస్తా ముంబై పోయాక స్వరం మార్చారు. విశ్వాస పరీక్ష గురువారం ఉంటుందని స్పీకర్ ప్రకటించగానే ప్రధాన పక్షాలన్నీ విలాస వంతమైన రిసార్ట్స్లో శిబిరాలు ప్రారంభించడం, ఎమ్మెల్యేలను వాటికి తరలించడం సాధారణ ప్రజానీకంలో కంపరం కలిగిస్తుంది. తమను ఎన్నుకున్నవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొం టున్నారో, తాము చేయాల్సిందేమిటో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఆలోచిస్తున్న దాఖలా లేదు. ఈ శిబిరాలకూ, తరచుగా ప్రత్యేక విమానాల్లో రాకపోకలకూ అయ్యే కోట్లాది రూపాయల వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారో, ఎందుకు భరిస్తున్నారో అంతుచిక్కదు. తగిన సంఖ్యాబలం ఉన్నవారు అధికారంలో ఉండటం, అది కోల్పోయినప్పుడు రాజీనామా చేసి నిష్క్రమించడం ప్రజా స్వామ్యంలో సహజంగా జరగాల్సిన ప్రక్రియ. కర్ణాటకలో ఆ ప్రక్రియ వెర్రితలలు వేసింది. ప్రమా దకరంగా మారిన రహదారిని చక్కదిద్దమంటే... పాఠశాలకు భవనం లేక విద్యార్థులు ఆరుబయట చదువుకోవాల్సి వస్తున్నదని మొత్తుకుంటే ప్రభుత్వాలకు నిధుల లేమి అడ్డొస్తుంది. ప్రభుత్వం చేయకపోతే మేం చేస్తామన్న మాట విపక్షం నుంచి కూడా వినబడదు. కానీ రాజకీయ సంక్షోభాలు సృష్టించడానికి, వాటినుంచి బయటపడటానికి అన్ని పక్షాలూ డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తాయి. కూటమిలో ఉండే అసంతృప్తి వగైరాలతోపాటు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి చెల్లుచీటి ఇచ్చిన వైనం కూడా కర్ణాటక పరిణామాలను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఒకపక్క కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి శివకుమార్ ముంబై వెళ్లి పాట్లు పడుతుంటే ఆ విషయంలో రాహుల్ నుంచి పెద్దగా స్పందన లేదు. తనను ఓడించిన అమేఠీ నియోజకవర్గానికి అదే సమయంలో వెళ్లి స్థానికులను కలిసే కార్యక్రమంలో ఆయన తలమునక లయ్యారు. నిజానికి ఆయన కూడా ముంబై వెళ్లి శివకుమార్ తదితరులతో కలిసి హడావుడి చేసి ఉంటే బీజేపీతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇరకాటంలో పడేది. ఇందువల్ల ఏం ఒరుగుతుందన్న ప్రశ్న అర్ధరహితమైనది. అది కాంగ్రెస్కు తక్షణ ప్రయోజనం చేకూర్చకపోయినా, రాజకీయంగా ఎంతోకొంత మేలు చేస్తుంది. దివంగత ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎమ్మెల్యేలను పోగేసి వైస్రాయ్ హోటల్లో శిబిరం నడిపి నప్పుడు సీఎం స్థానంలో ఉన్నా ఎన్టీఆర్ అక్కడికెళ్లారు. ఆ సమయంలో ఆయనపై చెప్పులేయించిన ఘటన విషయంలో ఇప్పటికీ చంద్రబాబు జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడం లేదు. అధ్యక్ష పదవి ఉందా లేదా అన్న అంశంతో సంబంధం లేకుండా రాహుల్గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ను నడిపిస్తున్న కుటుంబానికి ప్రతినిధి. కనీసం అందుకోసమైనా ఆయన బెంగ ళూరులో మకాం వేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారన్న అభి ప్రాయం కలిగించి ఉన్నా ఈ గోడ దూకుళ్లు కాస్తయినా అదుపులో ఉండేవి. ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిసి అడుగు వేసేవారు. ఇప్పుడు అందరి దృష్టీ సహజంగానే విశ్వాస పరీక్ష ఉంటుంది. 2010లో యడ్యూరప్ప నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వానికి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు వారందరినీ అప్పటి స్పీకర్ బోపయ్య అనర్హులను చేశారు. దీన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టింది. స్పీకర్ చర్య సహజ న్యాయానికి విరుద్ధమైనదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు బీజేపీ పక్షానికి ఫిరాయించిన 16మంది ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం మొదట తప్పుపట్టినా, ఇందులో ప్రధానమైన సమస్యలు ఇమిడి ఉన్నాయని అంగీకరించి 16న మరోసారి విచారిస్తామని తేల్చింది. ఈలోగా ఎమ్మెల్యేలపై ఏ చర్యా తీసు కోవద్దని కూడా స్పీకర్కు ఆదేశాలిచ్చింది. గురువారం జరిగే విశ్వాసపరీక్షపై ఈ ఆదేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడమే సరైందని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడితే సర్కారు మైనారిటీలో పడినట్టే. అది గురువారం వరకూ కూడా వేచిచూడనవసరం లేదు. ఫలానావిధంగా నిర్ణయించాలని స్పీకర్ను తాము ఆదేశిం చలేమని చెబితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఏదేమైనా కర్ణాటకను తరచు రాజకీయ సంక్షోభాల్లోకి నెడుతున్న ఈ తరహా కార్యకలాపాలకు రాజకీయ పక్షాలు ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్కుమార్తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్హౌస్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్బేగ్లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్వివాంటా హోటల్కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ