![Youth Died In America Just 17 Days After He Went To Study Ms - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/01/14/YouthAmerica.jpg.webp?itok=isCV8bdF)
సాక్షి, వనపర్తి: ఎన్నో కలలతో కుమారుడిని అమెరికాలో చదివించడానికి పంపిన ఆ తల్లిదండ్రులకు పండగ పూట విషాదమే మిగిలింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంతో తిరిగి రావాలని అయ్యప్ప స్వామి వద్ద పూజ చేయించి మరీ కొడుకును పంపారు. వెళ్లిన 17 రోజులకే కొడుకు మృతిచెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచింది.
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్నకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుమారుని పేరు దినేష్. ఇతను ఎమ్మెస్ చదవడానికిగాను డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్ ష్ట్రంలో కనెక్టికట్లోని కాలేజీలో చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం రాత్రి తన రూమ్లో దినేష్తో పాటు శ్రీకాకుళానికి చెందిన మరో విద్యార్థి కూడా అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉన్నాడు. నిద్రలోనే కొడుకు మృతి చెందడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దినేష్ తండ్రి వెంకన్న ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. తన కొడుకుపై చదువుల కోసం అమెరికా వెళుతున్నందున అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేయించి మరీ పంపారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో ప్రస్తుతం తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment